2, జూన్ 2016, గురువారం

కర్ణాటక శాస్త్రీయ సంగీత ముని - శ్రీపాద పినాకపాణి


గురు పరంపర ఎంత ముఖ్యమో భారతీయ కర్మభూమిలో పుట్టిన అనేక యోగుల, సిద్ధుల, ఋషుల జీవిత చరిత్ర తెలుసుకుంటే అర్థమవుతుంది. దానికి ఉత్తమ ఉదాహరణలు ఆదిశంకరులు, రామకృష్ణ పరమహంస, చిన్మయానంద, దయానంద వంటి అవతార పురుషులు. వారు ధర్మస్థాపనకై చేసిన ప్రయత్నంలో ఉన్న పవిత్రత దానిని గంగాప్రవాహంలో శాశ్వతం చేస్తుంది. అలాగే సంగీతం ద్వారా సేవ చేసిన యోగులు ఎందరో. ఆ కోవకు చెందిన వారే శ్రీపాద పినాకపాణి గారు. సంగీతంలో యోగం సిద్ధించిన వారు శ్రీపాద పినాకపాణి గారు. ఆయన పరంపర ఎంత వైభవంగా ఉందో ఆయన శిష్యులైన మహామహులు వోలేటి వేంకటేశ్వర్లు, నేదునూరి కృష్ణమూర్తి, నూకల చినసత్యనారాయణ, దోమాడ చిట్టబ్బాయి, శ్రీరంగం గోపాలరత్నం, మల్లాది సూరిబాబు గారు, ఆయన తనయులు మల్లాది సోదరులు మొదలైన వారి ప్రతిభ, కీర్తి ప్రతిష్ఠలు తెలుసుకుంటే అర్థమవుతుంది. ఆ మహామహోపాధ్యాయులు శ్రీపాద పినాకపాణి గారి వివరాలు ఈ బ్లాగు పోస్టులో.

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా ప్రియ అగ్రహారంలో ఆగష్టు 3, 1913వ సంవత్సరంలో శ్రీపాద కామేశ్వరరావు, జోగమ్మ దంపతులకు ఆఖరి సంతానంగా పినాకపాణి జన్మించారు. కామేశ్వరావు గారు రాజమండ్రి ప్రభుత్వ శిక్షణ కళాశాలలో ప్రొఫెసరుగా పనిచేస్తూ ఉండటంతో పినాకపాణిగారి ప్రాథమిక విద్యభ్యాసం రాజమండ్రి మరియు కాకినాడలలో జరిగింది. కామేశ్వరరావు గారికి నాటకరంగంతో అనుబంధం ఉండటంతో పినాకపాణిగారికి సంగీతంపై మక్కువ కలిగింది. అప్పట్లో నాటకాలలో పద్యాలు, గీతాలు ఉండేవి. అవి సంగీత ప్రాధాన్యత కలిగి ఉండేవి. బాల్యంలో తన సోదరి బీ.ఎస్ లక్ష్మణ రావు గారి వద్ద సంగీతం నేర్చుకుంటున్నప్పుడు విని తాను కూడా నేర్చుకున్నారు. అక్క పాడుతుంటే తప్పులు సరిదిద్దే వారు కూడా. అతనిలోని సంగీత ప్రతిభను గుర్తించి ఆ గురువు గారు సంగీతం నేర్చుకోవలసిందిగా సలహా ఇచ్చారు. అలా రాజమండ్రిలో లక్ష్మణరావు గారి వద్ద 1924లో పినాకపాణి గారి సంగీత అభ్యాసం మొదలైంది. 1929లో హైస్కూలు పాసయ్యే సరికి ఆ శిక్షణ కూడా పూర్తైంది.

అప్పట్లో కాకినాడలో ఓ జమీందారు గారు రసికుల ఆర్థిక సాయంతో సరస్వతీ గాన సభ అనే సంస్థను నడిపే వారు. ఆ సంస్థ గొప్ప గొప్ప కళాకారులను రప్పించి కచేరీలు ఏర్పాటు చేయిస్తూ ఉండేది. ఆ సంస్థ కార్యక్రమాలకు హాజరైన పినాకపాణిగారు అరైకూడి రామానుజం అయ్యంగారు, కాంచీపురం నైనా  పిళ్లై, పాపా వెంకట్రామయ్య, కుంభకోణం రాజమాణిక్యం పిళ్లై, తిరుచ్చి గోవిందస్వామి పిళ్లై మొదలైన వారి కచేరీల ద్వారా తంజావూరు సాంప్రదాయ కర్ణాటక సంగీతం వైపు ప్రభావితులైనారు. ఆయన అరైకూడి మరియు గోవిందస్వామి పిళ్లైల పద్ధతిని అనుకరించి తంజావూరు గాత్ర శైలిని ఆంధ్రులకు పరిచయం చేశారు. తాను ఇదివరకు నేర్చుకున్న కృతులు వీరు వేరుగా పాడుతూ ఉండటంతో ఆ పద్ధతిలో తాను మరల నేర్చుకుని తన సంగీత ప్రావీణ్యాన్ని మరింత పెంపొందించుకున్నారు. అప్పటికి ఆయన ఇంకా యుక్తవయసులోనే ఉన్నారు. ఒకసారి పినాకపాణి గారి గాత్రం విని అరైకుడి రామానుజం అయ్యంగారిని సంగీత రసికులైన ఎస్వై కృష్ణస్వామి గారు "వీరు మీ శిష్యులా" అని అడిగారుట. అంతగా పినాకపాణి గారు ఆయన పద్ధతిని నేర్చుకున్నారు.  "అరైకూడి నేను విన్న అత్యుత్తమ గాత్ర సంగీత విద్వాంసులు" అని పాణిగారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. పాణి గారి శిష్యులైన నేదునూరి కృష్ణమూర్తి గారు ఒకసారి ఆయనను "ఏమిటి అరైకూడి గొప్పతనం" అని అడిగారుట. "గమకాలలో స్పష్టత ఆయన ప్రత్యేకత. అనుస్వరాలతో కూడిన గమకాలు పలికించటంలో ఆయన దిట్ట" అని చెప్పారుట పాణి గారు. తంజావూరు సాంప్రదాయంలో అరైకూడి వంటి కళాకారులు పాడుతున్నప్పుడు, వారి రికార్డులను విని ఆ స్వరాలను, సంగతులను పినాకపాణి రాసుకొని వెంటనే పలికే వారు.

అప్పట్లో గ్రామఫోన్ రికార్డుల్లో ఎక్కువగా పదాలు మరియు జావళీలు ఉండేవి. వాటిని విని ఇట్టే నేర్చుకునే వారు పినాకపాణి గారు. అలాగే తండ్రిగారితో కలిసి వెళ్లి నాటకరంగానికి సంబంధించిన సంగీతంలో కూడ ప్రావీణ్యం సంపాదించారు. అప్పటి మేటి హిందూస్థానీ కళాకారుల రికార్డులు విని ఆ సాంప్రదాయంలో మెళకువలు కూడా నేర్చుకున్నారు. తల్లిదండ్రులు రామేశ్వరం వెళుతుంటే తనను డిసెంబర్ చెన్నై సంగీతోత్సవాలు వీక్షించేందుకు అక్కడ వదిలి వెళ్లమని కోరారు. చెన్నైలో ఉండి అరైకూడి, ముసిరి సుబ్రహ్మణ్య అయ్యరు, స్వామినాథ పిళ్లై, కారైకూడి సోదరులు మొదలైన మహామహుల సంగీత కచేరీలు హాజరయ్యారు.  గురువులు లక్ష్మణ రావు గారి ప్రోత్సాహంతో ఆయన ద్వారం వేంకటస్వామి నాయుడు గారి వద్ద శిష్యరికానికి చేరారు. 1932లో ఇంటర్మీడియేట్ తరువాత విజయనగరంలో ద్వారం వారి ఇంట్లోనే ఒక గదిలో ఉంటూ ఆయన దగ్గర రాగాలాపన నేర్చుకొని తన సంగీత ప్రావీణ్యాన్ని వృద్ధి చేసుకున్నారు.

ముసిరి సుబ్రహ్మణ్య అయ్యరు గారి గాత్ర ధర్మంలో సాహితీ విన్యాసం పినాకపాణి గారిని ఎంతో ఆకట్టుకుంది. దానిని వెంటనే ఆకళింపు చేసుకొని తన స్నేహితుడైన డొక్కా శ్రీరామమూర్తితో కలసి వెంటనే గానం చేశారు. అలాగే మొదటి రెండవ కాలాలలో ఎలా పాడాలో కూడా ముసిరి గారి గాత్రం విని నేర్చుకున్నారు. చెంబై వైద్యనాథ భాగవతార్ గారిని గమనించి నాలుగు కాలాలున్న పల్లవిని ఆరంభించటంలోని మెళకువలను నేర్చుకున్నారు. చెన్నైలోని ఎగ్మోర్‌లో వీణ ధనమ్మాళ్ గరి కచేరీ ఆయనపై ఎంతో ప్రభావం చూపింది. అరైకూడి గారి వద్ద గమనించిన రాగ భావాన్ని ఆయన ద్వారం వారి వద్ద పాడినప్పుడు "నువ్వు చాల వృద్ధిలోకి వస్తావు" అని ఆశీర్వదించారట.

విశాఖపట్టణంలో ఎంబీబీఎస్‌లో చేరిన తరువాత అక్కడ తన రూంమేట్‌తో కలసి ఉదయం నాలుగు గంటలకు లేచి అక్కడ వరండాలలో, బీచిలో పినాకపాణి తీవ్ర సాధన చేశారు. 1939లో ఆయన ఎంబీబీఎస్ డిగ్రీ పూర్తి చేశారు. తొలి పూర్తి స్థాయి కచేరీని ఒక లెక్చరర్ గారి ప్రోత్సాహంతో విశాఖపట్టణంలో ఏర్పాటు చేయగా ఆ కచేరీకి ప్రఖ్యాత వయోలిన్ విద్వాంసులు మైసూరు చౌడయ్య గారు హాజరై ఎంతో అభినందించారు. ఆయన ఆహ్వానంతో పినాకపాణి గారు మైసూర్ వెళ్లారు. చౌడయ్య గారింట్లోనే పేయింగ్ గెస్టుగా ఉంటూ సంగీత సాధన చేశారు. అంతటి విద్వాంసులైన చౌడయ్య గారు పినాకపాణి గారికి సాధనలో వయోలిన్ సహకారం అందించేవారు. ఆయనకు పినాకపాణి గారి గాత్రశైలి ఎంతో నచ్చేది. చెన్నైలో స్థిరపడిన ఒక తెలుగు కుటుంబానికి చెందిన ఇద్దరు అమ్మాయిలు ఒకసారి చౌడయ్య గారింటికి స్థానిక సభలలో పాడే అవకాశాల కోసం వచ్చారు. వారిలో ఒకరైన బాలాంబను పినాకపాణి గారు 1940లో వివాహం చేసుకున్నారు. 1945వ సంవత్సరంలో ఆయన ఎం.డి డిగ్రీలో పట్టభద్రులై డాక్టర్ పినాకపాణిగా పిలువబడ్డారు. విశాఖపట్టణంలో తనను అసిస్టెంటు సర్జన్‌గా ధృవీకరించకపోవటంతో రాజీనామా  చేసి రాజమండ్రి వెళ్లారు. నూకల చినసత్యనారాయణ గారు ఆయన మొదటి శిష్యులు. తరువాత రాజమండ్రిలో నేదునూరి కృష్ణమూర్తి గారు ఆయన శిష్యునిగా చేరారు. తిరిగి 1951లో వైజాగ్ మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ సర్జంగా నియమించబడ్డారు. 1954లో సివిల్ సర్జన్‌గా పదోన్నతి పొందారు. 1957లో కర్నూలుకు బదిలీ చేయబడ్డారు. ఆయన అక్కడే 1968లో పదవీ విరమణ చేశారు. తన మెడికల్ కెరీర్ మొత్తంలో ఆయన కచేరీలు చేస్తునే ఉన్నారు. 1938 నుండి 2001 వరకు ఆకాశవాణిలో ఏ -గ్రేడ్  కళాకారుడిగా కచేరీలు ఇచ్చారు. చెన్నైలో ఉన్నప్పుడు శ్రీపాద వారికి ప్రముఖ వయోలిన్ విద్వాంసులు రంగరామానుజ అయ్యరు గారితో సాన్నిహిత్యం ఏర్పడింది. వారి ప్రభావం పినాకపాణి గారి సంగీతంపై ఎంతో కనబడింది. చెన్నైలోని ఇతర ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసులు పినాకపాణి గారి ప్రతిభను ఎంతో ప్రశంసించారు.

ఆయన సంగీతం స్వచ్ఛతకు, శాస్త్రీయతకు, గమకాలలో సౌందర్యానికి నిలువుటద్దం. సంగీతం త్రయం యొక్క కీర్తనలను ఆయన అత్యంత భక్తి భావంతో ఆలపించేవారు. ఆయన ఆలాపనలలో ఎన్నో అలకారాలు, కొసమెరుగులు ఉండేవి. సాహిత్యంలో ఆయన కనబరచిన విన్యాసం అనుపమానం. రీతిగౌళ, సురటి వంటి కఠినమైన రాగాలలో కూడా ఆయన కనబరచిన మనోధర్మం అమోఘం. ఆయనకు శాస్త్రముపై ఉన్న పట్టు హిమాలయ శిఖరాలంత ఉన్నతమైనది. సంగీతం, వైద్యశాస్త్రంలో నైపుణ్యంతో పాటు అయన మంచి శరీర దారుఢ్యంపై దృష్టి కలిగి ఉందేవారు.

పినాకపాణి గారు ఎన్నో పుస్తకాలను రచించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో తన ఐదేళ్ల పరిశ్రమతో నాలుగు భాగాలలో "సంగీత సౌరభం" అనే పుస్తకాన్ని రచించి ప్రచురించారు. దీనిలో వేయికి పైగా కృతులకు స్వరాలు ఉన్నాయి. ఇది తరువాతి కళాకారులకు కర్ణాటక సంగీత శిక్షణలో నిఘంటువైంది.  మనోధర్మ సంగీతం అనే పుస్తకాన్ని రచించి ఆయన భావి కళాకారులకు స్వంత మనోధర్మాన్ని ఎలా అరచుకోవాలో తెలిపారు. ఈ పుస్తకం తెలుగు విశ్వవిద్యాలయంలో పాఠ్యాంశమయ్యింది. 160కి పైగా పల్లవులకు స్వరస్థానాలు మొదలగు వివరాలతో పల్లవి గాన సుధ అనే పుస్తకాన్ని రచించారు. మేళ రాగమాలిక అనే పుస్తకంలో 72 మేళకర్త రాగాల గురించి అద్భుతమైన వివరాలు పొందుపరచారు. ఆరు వర్ణాలను, 108 అన్నమాచార్య కీర్తనలను స్వరపరచారు. ఆయన సంగీత సేవలకు గుర్తింపుగా సంగీత కళానిధి, కలైశిఖామణి బిరుదులు, 1966లో ఆంద్రప్రదేశ్ సంగీత నాటక అకాడెమీ అవార్డు, 1973లో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆస్థాన విద్వాన్ గుర్తింపు, 1974లో తి.తి.దే వారి సప్తగిరి సంగీత విద్వన్మణి బిరుదు,ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం వారి కళాప్రపూర్ణ బిరుదు, 1977లో జాతీయ సంగీత నాటక అకాడెమీ అవార్డు,  1982లో ఆంధ్ర ప్రదేశ్ సంగీత అకాడెమీ ఫెలోషిప్, 1984లో పద్మభూషణ్ అవార్డు, 2008లో కళాసాగరం అవార్డు, 2012లో చెన్నై త్యాగబ్రహ్మ గాన సభనుండి జీవితసాఫల్య పురస్కారాలు వచ్చాయి. 80 ఏళ్ల వయసుపైబడిన తరువాత కూడా ఆయన రోజుకు నాలుగైదు గంటలు శిష్యులకు నేర్పే వారు. వోలేటి వేంకటేశ్వర్లు గారు "గురువు గారు సంగీతంలో ఆయన దైవం" అన్నారు. ఇంతమంది పేరుపొందిన శిష్యులున్నా ఆయనలో ఉన్న వినయం ఆయన వ్యక్తిత్వానికి ప్రతిబింబం.

దాదాపు వంద ఏళ్ల వయసు వృద్ధాప్యం వలన మంచం పాలైనా కూడా ఆయన పాడి శిష్యుల చేత సాధన చేయించే వారు. 2004లో ఐసీయూలో ఉన్నా కూడా శిష్యులచేత సాధన చేయించారు. అటువంటిది ఆయనకు సంగీతంపై గల ధ్యానం. ఏనాడూ మంచంపై పడుకొని ఉన్నా ఆయన గళంలో శుద్ధి, సంగీతంపై పట్టు ఏమాత్రం తగ్గలేదు. ఇరవై నాలుగు గంటలూ సంగీతమే ఆయనకు ధ్యాస. సుదీర్ఘమైన సంగీత జీవితం తరువాత, తన నూరవ యేట పరిపూర్ణమైన జీవితం గడిపి 11 మార్చి 2013 నాడు ఆయన కర్నూలులో పరమపదించారు. ఆయన శిష్య పరంపర దినదిన ప్రవర్ధమానమై వారు కూడా పద్మభూషణ్, సంగీత కళానిధి వంటి పురస్కారాలు అందుకున్నారు. వారిలో అనుభవజ్ఞులు  తితిదే వారి ఆస్థాన విద్వాన్ వంటి పదవులను అలంకరిస్తున్నారు. ఆ శిష్య పరంపరలో పినాకపాణి గారి సంగీత ఝరి సురగంగలా ప్రవహిస్తూనే ఉంది. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు.  

1, జూన్ 2016, బుధవారం

స్వర రాగ గంగాలహరి - ఎం ఎల్ వసంతకుమారి



కర్ణాటక సంగీత త్రయమైన త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి 18వ శతాబ్దంలో ఈ శాస్త్రీయ సంగీతానికి పునాదులు వేస్తే దాన్ని 20వ శతాబ్దంలో ముందుకు తీసుకువెళ్ళిన త్రయం డీకే పట్టమ్మాళ్, ఎమ్మెస్ సుబ్బులక్ష్మి మరియు ఎంఎల్ వసంతకుమారి. వైవిధ్య భరితమైన గాత్రశైలులలో ఈ ముగ్గురు మహిళామణులు నవీన కర్ణాటక పరంపరకు మూలస్థంభాలైనారు. వీరిలో పిన్నవారైన వసంతకుమారి గారు రాగాలాపనలో వైవిధ్యంతో దశాబ్దాలపాటు కర్ణాటక సంగీత సామ్రాజ్యంలో ధృవతారగా ప్రకాశించారు. మద్రాస్ లలితాంగి వసంతకుమారి, అదే, ఎం.ఎల్. వసంతకుమారి గారి పేరు వినగానే మధురమైన స్వరం, శృతిపక్వమైన గానం, పెద్ద బొట్టు, పట్టు చీర, నిండైన రూపం స్ఫురణకు వస్తాయి.  కర్ణాటక మరియు సినీ సంగీత సామ్రాజ్యంలో ఉన్నత స్థానాన్ని సంపాదించి ఎంతో కీర్తిప్రతిష్ఠలు పొందిన ఈ తల్లి వివరాలు తెలుసుకుందాం.

1928 జులై 3వ తేదీన కూతనూర్ అయ్యసామి అయ్యరు, లలితాంగి దంపతులకు చెన్నైలో వసంతకుమారి జన్మించారు. తల్లిదండ్రులిద్దరూ సంగీత కళాకారులే. చిన్ననాడే రాగాలు పలికించినా తల్లిదండ్రులు ఆమె బాగా చదివి డాక్టర్ కావాలని కోరుకున్నారు. కోయంబత్తూర్ తాయి, ఫ్లూట్ సుబ్బారావు, వీణ ధనమ్మాళ్ వద్ద వసంతకుమారి సంగీతం నేర్చుకున్నారు. తల్లితో కచేరీలకు వెళ్లే వసంతకుమారి అమ్మ రాగాలను ఏ విధంగా ఆలపించేదో బాగా నిశితంగా పరిశీలించి నేర్చుకునేవారు. వసంతకుమారి 1940లో సిమ్లాలో తల్లితో కలిసి తొలి కచేరీ ఇచ్చారు. 1941లో తల్లి అనారోగ్యంతో పాడలేకపోవటంతో తాను ఆమె బదులు బెంగుళూరులోని కచేరీలో పాడవలసి వచ్చింది. ఒకసారి కర్ణాటక సంగీతంలో మహావిద్వాంసుడైన జీఎన్ బాలసుబ్రహ్మణ్యం ఆమె గాత్రం విన్నారు. ఆమె గొంతులోని స్వచ్ఛతను గమనించి జీఎన్‌బీ ఆమె తల్లిదండ్రులను అభ్యర్థించి వసంతకుమారిని తన శిష్యురాలిగా చేర్చుకున్నారు. వసంతకుమారి జీఎన్‌బీ తొలి శిష్యురాలు. జీఎన్‌బీ వద్ద మనోధర్మాన్ని చక్కగా నేర్చుకున్న ఎమ్మెల్వీ తరువాతి కాలంలో తన గురువుల వైశిష్ట్యాన్ని ఎంతో పవిత్రంగా పరంపరలో కొనసాగించారు. గురువులాగే తాను కూడా ఉద్వేగాలకు అతీతంగా ప్రశాంతంగా, నిదానంగా రాగాలాపన సశాస్త్రీయంగా చేసేవారు. అందుకే ఎమ్మెల్వీ తదుపరి కాలంలో చాలా ప్రాచుర్యం పొందారు. ఎమ్మెల్వీ కర్ణాటక శాస్త్రీయ సంగీతమే కాకుండా హిందూస్థానీలో కూడా ప్రావీణ్యం సంపాదించుకున్నారు.

గురువుల జీఎన్‌బీ శిక్షణలో ఆమె రాగాలాపన సశాస్త్రీయంగా మనోధర్మం ప్రకారం నేర్చుకున్నారు. మనోధర్మంపై పట్టు మరియు హిందూస్థానీ సంగీతం పరిజ్ఞానంతో ఆమె క్లిష్టమైన రాగాల ఆలాపన మరియు స్వరకల్పనను విభిన్నమైన శృతిభేదంతో రంగరించేవారు. మహనీయుల కృతులను ఆలపించేటప్పుడు ఒక రాగం నుండి ఇంకో రాగంలోకి వెళ్లేటప్పుడు తన గాత్రంలో తారమంద్రాతి భేదాలను అద్భుతంగా పండించేవారు. తన సృజనాత్మకతను షణ్ముఖప్రియ-శంకరాభరణం, భైరవి-ఖమాస్, అభోగి-వలజి రాగాల మధ్య మార్పులో సునాయాసంగా, అద్భుతంగా కనబరచే వారు. ఆమె హంసధ్వని రాగాలాపన ఎందరో హిందూస్థానీ సంగీత విద్వాంసులకు ప్రమాణమైంది.

1951వ సంవత్సరంలో ఎం.ఎల్.వసంతకుమారి వివాహం ఆర్. కృష్ణమూర్తితో జరిగింది. వారికి శ్రీవిద్య మరియు శంకరరామన్ అని ఇద్దరు పిల్లలు పుట్టారు. ఈ అమ్మాయే ప్రఖ్యాత చలనచిత్ర నటి శ్రీవిద్య. ఎంఎల్‌వీ చిన్న వయసునుండే శ్రీవిద్యకు సంగీతం, నాట్యం నేర్పించారు. భర్త వ్యాపారంలో దెబ్బతినటంతో కుటుంబం నడవటానికి రాత్రి కచేరీలు చేశారు. ఆమెకు సంగీతంలో ఉన్న బహుముఖ ప్రజ్ఞ వలన ఆమెకు చలన చిత్రాల్లో పాడే అవకాశం వచ్చింది. సినీరంగంలో అన్ని దక్షిణాది భాషల్లో ఆమె అద్భుతమైన గీతాలు ఆలపించారు. ఆమె సంగీతానికి ముగ్ధులైన ప్రముఖ హిందీ కథానాయకుడు రాజ్ కపూర్ 1956లో విడుదలైన చోరీ చోరీ చిత్రంలో ఆమె పాడిన ఒక తిల్లానాను పొందుపరచారు. తెలుగు చిత్రాల్లో ఆవిడ పాటిన హిట్ పాటలు - నాగుల చవితి చిత్రంలో "ఓం నమో నమో నటరాజ నమో","నటరాజు తలదాల్చు నాగదేవా", మాయాబజార్ చిత్రంలో "శ్రీకరులు దేవతలు", భూకైలాస్ చిత్రంలో "మున్నీట పవళించు నాగశయనా", భలే అమ్మాయిలు చిత్రంలో "గోపాల జాగేలరా", జయభేరి చిత్రంలో "నీవెంత నెరజాణవౌరా", బీదలపాట్లు చిత్రంలో "సరసకు రాడేలనే", కాళహస్తి మహాత్మ్యం చిత్రంలో "చాలు చాలు నవమోహనా", "చూచి చూచి" మొదలైన పాటలను అద్భుతంగా అలపించారు. ఈ చలనచిత్ర గీతాలు చాలామటుకు శాస్త్రీయ సంగీత నేపథ్యం కలవి లేదా శాస్త్రీయ నృత్యాంశాలపైనే. 1946లో ప్రారంభమైన ఆమె సినీ నేపథ్య గాత్ర ప్రస్థానం 1965 వరకు కొనసాగింది. ఈ సమయంలో ఆమె దాదాపుగా 100 చిత్రాల్లో పాడాఅరు. అత్యధికంగా తమిళ్, మలయాళం, తెలుగు భాషలలో దాదాపు ఇరవై ఏళ్లు శాస్త్రీయ సంగీత ప్రధానమైన పాటలను ఎందరో గొప్ప గొప్ప సంగీత దర్శకులు కూర్చగా అద్భుతంగా పాడారు.1948లో విడుదలైన కృష్ణభక్తి అనే తమిళ చలనచిత్రంలో త్యాగరాజ స్వామి వారి "ఎంత వేడుకొందు ఓ రాఘవా" అనే కృతిని పాడే కళాకరిణిగా నటించి నేపథ్య గానం అందించారు.

1965 తరువాత ఎం.ఎల్.వీ పూర్తిగా శాస్త్రీయ సంగీతంపైనే దృష్టి సారించారు. కుమార్తె యుక్తవయసులో ఉన్నప్పుడు ఆమె నృత్య కార్యక్రమాలలో గాత్రసహకారం ఎం.ఎల్ అందించేవారు. అదే పంథాలో ముందుకు వెళ్లి ఎం.ఎల్ భరతనాట్యానికి సంబంధించిన కృతుల ఆల్బం కూడా విడుదల చేశారు. తల్లి లలితాంగి వారసత్వంగా ఎం.ఎల్ పురందరదాసు కృతులపై పరిశోధన చేశారు. ఎన్నో దేవర్‌నామాలను ప్రాచుర్యంలోకి తెచ్చారు. ప్రఖ్యాత హిందూస్థానీ సంగీత విద్వాంసులు బడే గులాం అలీ ఖాన్ గారి వద్ద మెళకువలు నేర్చుకొని హిందూస్థానీ బాణీలో సింధుభైరవి రాగాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు. తమ కులదైవమైన కుతనూర్ సరస్వతిని ఆమె కొలిచేవారు. వీలైనప్పుడల్లా తంజావూరులోని ఆ తల్లి దేవాలయాన్ని సందర్శించేవారు.కర్ణాటక సంగీత ప్రస్థానంలో ఎం.ఎల్. వసంతకుమారి నారాయణ తీర్థులవారి కృతులను కూడా ప్రాచుర్యంలోకి తీసుకు వచ్చారు. ఆమె పాడిన "కళ్యాణ గోపాలం" అనే తీర్థుల వారి రచన సింధుభైరవి రాగంలో ఎంతో పేరుపొందింది. అలాగే ఆమె సింధుభైరవిలో "వేంకటాచల నిలయం" అనే పురందరదాసు కృతి కూడా ఎంతో ప్రచారంలోకి వచ్చింది.

రాగం-తానం-పల్లవి ప్రక్రియ ఎం.ఎల్. వసంతకుమారి గారి మరో ప్రత్యేకత. డీకే పట్టమ్మాళ్ గారు ప్రాచుర్యంలోకి తెచ్చిన ఈ సాంప్రదాయంపై ఎం.ఎల్.వి చేసిన పరిశోధన వలన తరువాతి తరాల కచేరీలలో ఒక ప్రమాణమైంది. వసంతకుమారి గారు అమృతవర్షిణి రాగంలో రాగం తానం పల్లవి పాడి తన ప్రజ్ఞను చాటారు. ఎం.ఎల్.వీ మరో ప్రత్యేకత ఆమె ఏ కచేరీకు ముందు కూడా సాధన చేసే వారు కాదు. ఈ విషయం ఆమె శిష్యురాలైన ప్రఖ్యాత సంగీత విదంవాసురాలు సుధా రఘునాథన్ గారు మరియు ఆమె గాత్రానికి వయోలిన్ సహకారం అందించిన ఏ కన్యాకుమారి గారు చెప్పారు. ఎం.ఎల్.వీ గానంలో విడుదలైన ఆల్బంలలో ప్రణమామ్యహం, పురందరదాస కృతులు, దేవీ కదంబమాల, భరతనాట్యం పాటలు, గోల్డెన్ గ్రేట్స్, గురు శిష్య పరంపర, స్వర సంగమం మరియు వసుధ (సుధా రఘునాథన్‌తో కలిసి పాడినవి), సునాద బృందావనం, వందిసువె గురురాఘవేంద్ర,వాతాపి గణపతిం భజేహం మొదలైనవి బాగా ప్రచారంలోకి వచ్చాయి. తిరుప్పావై పాశురాలను ఆమె పాడిన రీతి అద్భుతం. అందుకే ఆ సంపుటి బహుళ ప్రాచుర్యం పొందింది.

దూరదర్శన్, ఆకాశవాణిలలో ఎం.ఎల్.వీ దాదాపు మూడు దశాబ్దాలకు పైగా ఎమ్మెస్ సుబ్బులక్ష్మికి సాటిగా కచేరీలు చేశారు. సొగసు మరియు శాస్త్రీయత కలబోసి ప్రేక్షకులను, శ్రోతలను మంత్రముగ్ధులను చేసిన అసమాన ప్రతిభామూర్తి ఎం.ఎల్. వసంతకుమారి. సంగీతం శ్రోతల హృదయాలను తాకాలన్నది ఆమె సిద్ధాంతం. ఆమె శిష్య పరంపరలో సరస్వతీ శ్రీనివాసన్, సుధా రఘునాథన్, త్రిసూర్ రామచంద్రన్, ఆయన సతీమణి చారుమతీ రామచంద్రన్, ఏ కన్యాకుమారి, యోగం సంతానం, వనజా నారాయణన్, మీనా సుబ్రహ్మణ్యం, టీ.ఎం.ప్రభావతి, జయంతి శ్రీధరన్, జయంతి మోహన్ మొదలైన ప్రఖ్యాత సంగీత కళాకారులు ఉన్నారు. ప్రేమ, వాత్సల్యం, క్రమశిక్షణ కలబోసి తన శిష్యులకు శిక్షణ ఇచ్చారు. వారి వారి సామర్థ్యాలను బట్టి శిష్యులకు సముచితమైన శిక్షణ ఇచ్చారు. అత్యున్నమైన విలువలతో ఆమె తన జీవనాన్ని, శిష్య సంబంధాలాను సాగించారు.

1967వ సంవత్సరంలో ఆమె ప్రతిభకు గుర్తింపుగా భారత ప్రభుత్వం వారు దేశంలో మూడవ అత్యున్నత పురస్కారం పద్మ భూషణ్ ఇచ్చి గౌరవించారు. 1970వ సంవత్సరంలో ఆమెకు కేంద్ర ప్రభుత్వం వారి సంగీత నాటక అకాడెమీ అవార్డు వచ్చింది. పురందరదాసు కృతుల ప్రచారానికి ఆమె చేసిన పరిశోధనకు, సేవకు గుర్తింపుగా 1976వ సంవత్సరంలో మైసూర్ విశ్వవిద్యాలయం వారు ఆమెకు డాక్టరేట్ పట్టా ఇచ్చి గౌరవించారు. 1977లో 49 ఏళ్ల వయసులోనే సంగీత కళానిధి బిరుదు పొందిన ఘనత ఆమెకు దక్కింది.

దాదాపు నలభై ఐదేళ్ల సుదీర్ఘ సినీ కర్ణాటక సంగీత ప్రస్థానంలో శిఖర స్థాయికి చేరుకొని ఎంతో గౌరవాన్ని, మన్ననలను పొందిన ఎం.ఎల్ వసంతకుమారి గారు 1991లో 63 ఏళ్ల వయసులో కామెర్ల వ్యాధికి గురై మరణించారు. ఆమె శిష్యులు కూడా పద్మభూషణ్, పద్మశ్రీ, సంగీత కళానిధి వంటి పురస్కారాలు, బిరుదులు పొందే స్థాయికి ఎదిగి ఆమె మహోన్నత సంగీత వారసత్వ వైభవాన్ని కొనసాగిస్తున్నారు. ఎందరొ మహానుభావులు అందరికీ వందనాలు.

ఆమె ఆలపించిన కృతులలో సింధుభైరవి రాగంలో పురందరదాసుల వారి వేంకటాచల నిలయం వినండి. చలన చిత్ర గీతాలలో భూకైలాస్ చిత్రంలోని దశావతార గీతం "మున్నీట పవళించు నాగశయనా" కమలా కుమారి నాట్యం చేయగా చూడండి

29, మే 2016, ఆదివారం

దొరకునా ఇటువంటి సేవ - కథ


కల్పనలో ఊహించిన హొయలు
శిల్ప మనోహర రూపమునొంది
పదకరణముల మృదుభంగిమల
ముదమార లయమీరు నటనాల సాగే

అనే పాటకు రంజని అద్భుతమైన కూచిపూడి లయవిన్యాసము సభికులకు సురలోక నర్తకీమణుల నాట్యవిన్యాసలను తలపింప జేస్తోంది. ఎదురుగా కూర్చున్న భర్త వంశీమోహన్ మనసు పులకించి మౌనంగా అందమైన ప్రేమగీతం పలికింది. ఇంటికి వచ్చాక "రంజనీ! ఎల్.విజయలక్ష్మి గారిని గుర్తు చేశావు. హ్యట్సాఫ్ టు యువర్ డ్యాన్సింగ్ మేజిక్..." అన్నాడు. "ఏవండోయ్! ఎంత మీ భార్య అయితే మాత్రం మరీ ఎల్. విజయలక్ష్మి గారితో పోల్చటం భావ్యం కాదు. ఆవిడ లేడి పిల్లకు లయగతులు నేర్పిస్తే ఎలా ఉంటుందో అన్న దానికి ప్రతిబింబం..." అని సవరించింది. "సర్లేవోయ్! అవధుల్లేని ఆనందంలో అలా అనేశాను..పిల్లలు ఏం చేస్తున్నారో చూడు.." అన్నాడు. నృత్య ప్రదర్శనకు వెళ్లేముందు పిల్లలతో రెండు గంటల గడిపిన మధుర క్షణాలను ఆస్వాదిస్తూ ఆలోచిస్తున్నాడు వంశీ.

"అమ్మా లాస్య! ఏదీ నిన్న నేర్చుకున్న స్టెప్స్ ప్రాక్టీస్ చేద్దాం రా.." అంది రంజని. "అమ్మా! ఇంత రాత్రి పూట ప్రాక్టీసా! అలసిపోయాను..ఈ ఒక్కరోజుకు బ్రేక్ ప్లీజ్!" అంది లాస్య. "లేదు తల్లీ. ఒక్క రోజు ఇలా బద్ధకంగా వదిలేస్తే పక్క రోజు కూడా అలానే అనిపిస్తుంది. మనకు టైం చాలా ప్రెషియస్. ప్లీజ్ కం ఫర్ ప్రాక్టీస్." అని ఖచ్చితంగా అంది రంజని. క్రమశిక్షణకు ప్రతిరూపం ఆ కళాకారిణి. లాస్య అయిష్టంగానే గజ్జెలు కట్టుకు వచ్చింది. ఇద్దరూ క్రింద హాలులోకి వెళ్లి ఎదురుగా ఉన్న నటరాజు విగ్రహానికి వందనం చేసి ప్రాక్టీసు ప్రారంభించారు.

"శిరుత నవ్వుల వాడు సిన్నెకా వీడు వెరపెరుగడు సూడవే సిన్నెకా" అని డాక్టర్ శోభారాజు గారు ఆలపించిన గీతానికి తల్లి స్టెప్సు నేర్పిస్తోంది. దశావతారాలను వర్ణించే ఈ సంకీర్తనలో రంజని తన్మయురాలై హావభావాలను జానపద రీతిలో నేర్పుతుంటే లాస్యలో ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. తల్లి సాహిత్యాన్ని వివరించి నేర్పిస్తుంటే మరింత ఆసక్తి పెరిగింది. మొత్తం అంశాన్ని గంటన్నర పాటు అభ్యాసం చేశారు తల్లీ కూతుళ్లు. పిల్ల తల్లి ఒళ్లో తలపెట్టి నిద్రపోయింది. లాస్య భవిష్యత్తుపై రంజనికి ఎన్నో ఆశలు. మంచి కళాకారిణిగా తీర్చిదిద్దాలని తాపత్రయం. పక్కనే హాయిగా నిద్రపోతున్న పదేళ్ల చిన్న కూతురు స్వరాళిని ముద్దు పెట్టుకుంది. అచ్చం వాళ్ల నాన్న పోలికే అని మరో మారు మురిసిపోయింది.


వంశీ భార్య కోసం ఎదురు చూస్తున్నాడు. "ఏవండీ! ఇంకా పడుకోలేదా? ప్రాక్టీసుకు విఘ్నం ఎందుకని రాత్రి అయినా లాస్య చేత డ్యాన్స్ చేయించాను. అందుకని ఆలస్యం అయ్యింది. దానికి నాట్యంపై మంచి అవగాహన ఉంది. క్రమశిక్షణ కావాలి" అంది.  "చిన్న పిల్ల కదా రంజనీ! నువ్వు ఇలాగే నేర్పిస్తూ ఉంటే డిసిప్లిన్ అదే వస్తుంది" అని నవ్వి వంశీ భార్యను దగ్గరకు తీసుకున్నాడు. "స్వరాళికి పెయింటింగ్ అంటే ఇష్టమండీ. దాన్ని మంచి టీచర్ దగ్గర చేర్పించాలి" అంది రంజని. "రంజనీ! ముందు పిల్లలకు ప్రకృతిని, ఈ విశ్వంలోని అద్భుతాలను ఆస్వాదించే వ్యక్తిత్వాలను ఇద్దాము. తరువాత కళలు, సృజనాత్మకత అవే వస్తాయి. ఈ సెలవుల్లో పిల్లలను తమిళనాడు టూర్ తీసుకువెళ్లి అక్కడి అద్భుతమైన దేవాలయాలను, వాటిలోని శిల్ప సంపదలను చూబిద్దామని ఉంది" అన్నాడు. "తప్పకుండా! " అంది రంజని. అలాగే అని పిల్లల భవిష్యత్తు ప్రణాలిక చేస్తూ నిద్రపోయాడు వంశీ.

"నాన్నా! గుళ్లకు ట్రిప్ ఏంటి? మేము రాము" అంది ఉదయాన్నే లేచి వంశీ ప్లాన్ విన్న లాస్య. పన్నెండేళ్ల లాస్య ముఖంలోకి చిరునవ్వుతో చూసి వంశీ పిల్లలిద్దరినీ తమ ఇంట్లో ఉన్న లైబ్రరీలాంటి పుస్తకాల అర వద్దకు తీసుకు వెళ్లి అందులోని భారతీయ దేవాలయాలు మరియు నాట్య కళలు అనే పుస్తకాన్ని తీసి వారిద్దరి ముందుంచాడు. ఒక్కొక్క పేజీ ముందుకు తిప్పుతూ అందులోని శిల్పకళా సంపదను, నాట్య భంగిమలను, వివిధ నాట్య పద్ధతులను వారికి వివరించాడు. నాట్యం పరమాత్మకు ఒక పవిత్రమైన సేవ అనే భావాన్ని వారిలో చిగురింప జేశాడు. "నాన్నా! ఇంత పెద్ద పెద్ద శిల్పాలను, వాటితో గుళ్లను ఎప్పుడు నిర్మించారు, ఎలా నిర్మించారు? ఐ యాం ఎక్సైటెడ్" అని కళ్లు పెద్దవి చేస్తూ చెప్పింది లాస్య. తనలో ఆసక్తి చిగురించింది అని గమనించి "లాస్యా! మరి ట్రిప్ కి రెడీ?" అని అడిగాడు. "అవును నాన్నా!" అంది లాస్య. ఇంతలో స్వరాళి "నాన్నా! ఎవరో రాజా రవి వర్మ అని గ్రేట్ పెయింటరట. మా ఆర్ట్ టీచర్ చెప్పింది. ఆయన పెయింటింగ్స్ ఎక్కడ ఉన్నాయి? నాకు చూపిస్తావా?" అని అడిగింది. "అవునా! రాజా రవివర్మ చాలా గొప్ప చిత్రకారుడు. కేరళకు చెందిన వాడు. ఆయన పెయింటింగ్స్ ఎక్కడ ఉన్నాయో కనుక్కొని తప్పకుండా చూద్దాం" అన్నాడు వంశీ. ఎగిరి గంతులు వేసింది స్వరాళి.

"రంజనీ! పిల్లలను నేను మదురై, చిదంబరం, చెన్నై తీసుకువెళ్లాలి. నువ్వు కూడా వస్తే ఒక కళాకారిణిగా వాళ్లకు అన్నీ వివరించే అవకాశం..." భర్త అంతరంగం అర్థం చేసుకున్న రంజని ఒక్క నిమిషం ఆలోచించి "అయితే దసరా సెలవుల్లో వెళదాం. ప్లాన్ చేయండి" అంది. వెంటనే వంశీ ట్రిప్ అంతా కూలంకషంగా ప్రణాళిక చేశాడు. పిల్లలనిద్దరినీ పిలిచి - "మనం మీకు ఇష్టమైన అంశాల గురించి తెలుసుకోవటానికి వెళుతున్నాము కాబట్టి మీకో హోంవర్క్. ఇద్దరూ మీ సొంత పదాలలో ట్రిప్ గురించి ఏరోజుది ఆరోజు ఒక 2 పేజీలు రాయాలి. లాస్యా! నువ్వు గమనించిన విషయాలు అమ్మతో డిస్కస్ చేసి నీ నాట్యంలో అమలు పరచాలి. స్వరాళీ! నీకు నచ్చిన దృశ్యాలను నీకు వచ్చిన పద్ధతిలో పెయింట్ చేయాలి. వీటికి కావలసిన సామాను నేను పట్టుకు వస్తాను" అన్నాడు. పిల్లలిద్దరూ సంతోషంతో కేరింతలు కొట్టారు. "బానే ఉంది మీ ఉత్సాహం. నాన్న చెప్పినట్లు మీరు చూసిన వాటి గురించి ఆలోచించి అక్షరాలలో పెట్టంది నాకు కూడా చాలా సంతోషం" అంది రవళి.

విమానంలో చెన్నై చేరుకుంది ఈ అందమైన కుటుంబం. మొట్టమొదట స్వరాళి కోసం చెన్నైలోని ఎగ్మోర్ ప్రభుత్వ మ్యూజియంకు వెళ్లారు. అక్కడ రాజ రవి వర్మ చిత్ర కళాకృతుల ప్రదర్శన చూస్తుంటే స్వరాళికి నోట మాట రాలేదు. ఆ చిన్నారి మనసులో ఎన్నో భావనలు. "నాన్నా! 110 ఏళ్ల క్రింద ఇలాంటి కలర్స్ ఉండేవా? అచ్చం మనుషుల్లానే ఉన్నాయి ఇందులో కేరేక్టర్స్!! ఆ దీపం పట్టుకున్న లేడీ చూశారా? వాట్ అ లైవ్లీ పెయింటింగ్!! అయాం సో ఇన్స్పైర్డ్ అండ్ ఎక్సైటెడ్!" అని తన్మయురాలైంది. "స్వరాళీ! టెక్నాలజీ ఏమీ లేని రోజుల్లో ఇంతటి సజీవమైన చిత్రాలను గీసిన రాజా రవి వర్మ చిత్రాల వివరాలు, ఆయన చరిత్ర చదవాలని ఉందా? ఇదిగో పుస్తకం. ఇది నీకు నా దసరా బహుమానం. నేను నువ్వు రాయబోయే వ్యాసం కోసం ఎదురు చూస్తుంటాను" అని చక్కటి పుస్తకాన్ని స్వరాళికి అందించాడు. ఆ అమ్మాయి ఆనందానికి అవధులు లేవు. నాన్నను హత్తుకొని, వెంటనే పుస్తకాన్ని చదవటం మొదలు పెట్టింది.

చెన్నై నుండి చిదంబరం చేరుకుంది ఆ కుటుంబం. కారు దిగి తూరుపు గోపురం దగ్గరకు చేరుకున్నారు. "లాస్యా! ఇక్కడ ప్రాకారాన్ని జాగ్రత్తగా పరిశీలించు. భరతనాట్య శాస్త్రంలోని 108 కరణాలను ఈ ప్రాకారంపై శిల్పాకృతిలో చెక్కి ప్రతిష్ఠించారు" అంది రంజని. "అమ్మా! కూచిపూడికి భరతనాట్యానికి చాలా ముద్రలు ఒకేలా ఉన్నాయే! అసలు అన్ని వందల ఏళ్ల క్రితం ఇలాంటి శిల్పాలు ఎలా చెక్కి అంతపైకి ఎలా నిలుపగలిగారు?" అని ప్రశ్నల వర్షం కురిపించింది లాస్య.  "అవునమ్మా! భారతీయ నృత్య రీతులలో కూచిపూడికి, భరతనాట్యానికి కొన్ని ముద్రలు ఒకటే. భరతముని రచించిన నాట్యశాస్త్రం నుండి కూర్చబడింది భరతనాట్యం. కొన్ని వేల సంవత్సరాల చరిత్ర గలదీ నాట్యం. ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజుల పోషణతో, ఇటువంటి దేవాలయాలలో నిత్యసేవలో, ఉత్సవాలలో భరతనాట్యం పరిఢవిల్లింది.." అని వివరంగా భరతనాట్యం విశిష్టతను తెలిపింది రంజని.

లాస్య మనసులో ఈ నాట్యశాస్త్రం గురించి, తాను నేర్చుకునే కూచిపూడి గురించి మరిన్ని వివరాలు తెలుసుకొని రెండిటా ప్రావీణ్యం సంపాదించాలని పట్టుదల కలిగింది. అంతటి మహోన్నత చరిత్ర గల దక్షిణ భారత నృత్య రీతులపై మనసులో ఆరాధనా భావం ఏరపడింది. ఆ గోపురంపై శిల్ప భంగిమలను, రంగులను, వాటిలోని జీవ కళను చూసి అబ్బురపడింది లాస్య. దాదాపు ఒక అరగంట సేపు అక్కడ గడిపిన తరువాత లోపలికి వెళ్లారు. నడిచే మార్గంలో ఓ పక్క అద్భుతమైన బొమ్మల కొలువు. దేవీ నవరాత్రుల ఆ బొమ్మల సందర్భంగా పేర్చిన ఆ కొలువులోని ప్రతిమల సౌందర్యం చూసి ఆనందపడ్డారు. "పిల్లలూ, చూశారా? మనకు తమిళులకు బొమ్మల కొలువు సాంప్రదాయం ఉంది. భాషలు వేరైనా మన సంస్కృతులు, సాంప్రదాయాలలో చాలా రిసెంబ్లెన్సెస్ ఉన్నాయి. అదే మన దేశం గొప్పతనం. అన్నిటినీ గౌరవించాలి. అన్నిటి గురించి తెలుసుకోవాలి" అని రంజని. పిల్లలకు అర్థమైంది.

"లాస్యా! ఈ గుడికి ఓ ప్రత్యేకత ఉంది. అది ఇక్కడ ఉన్న మంటపాలు. అవి చిత్ సభ, కనక సభ, నృత్య సభ, రాజ సభ మరియు దేవ సభ.చిత్ సభ జ్ఞానానికి ప్రతీక. ఈ సభలో ఇక్కడి దైవమైన నటరాజస్వామి తన అర్థాంగి అయిన శివకామసుందరితో ఉంటాడు. ఇదే గర్భ గుడి. చిత్ సభకు ఎదురుగా ఉన్న కనక సభ నుండి నిత్య పూజలు, సేవలు చేస్తారు. నృత్య సభలో నటరాజు మహాకాళితో కలిసి నాట్యం చేశాడని నానుడి. యోగంలో సహస్రార చక్రానికి ప్రతీకగా వేయి స్థంభాలతో రాజ సభను నిర్మించారు. దేవసభలో శివపార్వతులు, గణపతి, స్కందుడు, చండీశ్వరుడు ఉంటారు" అని చిత్ సభ వైభవాన్ని వివరించింది రంజని. మధ్యాహ్నం పన్నేండు గంటల సమయం. ఆ సమయంలో అక్కడ జరిగిన సేవ చూసి లాస్య ఆనందంలో తేలిపోయింది. "ఏవండీ! కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు నాట్యం చేసినట్లు లేదూ" అని రంజని. అందరిదీ అదే అనుభూతి. "అమ్మా! ఐ యాం సో హ్యాపీ టు బి హియర్. మై రెస్పెక్ట్ ఫర్ డ్యాన్స్ హస్ మల్టిప్లైడ్" అంది లాస్య. అందరూ తృప్తిగా దర్శనం చేసుకొని బయలుదేరారు.

"స్వరాళీ! ఈరోజు మనం మన దేశంలోనే అత్యంత వైభవమైన దేవాలయాన్ని దర్శించబోతున్నాము" మదురైలో హోటెల్ చేరుకున్న తరువాత ఉత్సాహంగా అన్నాడు వంశీ. వెంటనే తన వద్ద తన చిన్ననాటి మదురై దేవాలయం మ్యాప్ తీసి పిల్లల ముందు పరచాడు. పిల్లలిద్దరూ మదురై నాయక రాజులకున్న తెలుగు మూలాలు తండ్రి ద్వారా తెలుసుకొని తెలుగు-తమిళ ప్రజలకున్న అవినాభావ సంబంధాన్ని గ్రహించారు. "నాన్నా! ఈ దేవాలయమేనా అర్జున్ సినిమాలో చూపించింది. దీని రెప్లికా చేశారా హైదరాబాదులో!! వావ్ ఈ యాం ఈగర్ టు విసిట్ దిస్ టెంపుల్" అంది లాస్య. స్నానం చేసి అందరూ మదురై మీనాక్షి దేవాలయం వద్దకు చేరుకున్నారు. గైడును మాట్లాడుకుని మొత్తం ప్రాంగణం దాదాపు 2-3 గంటలు చూశారు. పుష్కరిణి చుట్టూ ఉన్న నడకదారి పైకప్పు మీద అద్భుతమైన బొమ్మలు గీసి రంగులు అద్ది ఉన్నాయి. మహాభారతం, శివపార్వతుల వైభవం, గణపతి మొదలైన గాథలను తెలిపే ఈ చిత్రాలు చూసి స్వరాళి గెంతులు వేసింది. దేవాలయంలోని ధ్వజ స్థంభం వద్ద ఉన్న వివిధ దేవతా మూర్తుల శిల్పసౌందర్యం చూసి లాస్య నివ్వేర పోయింది. తల్లిదండ్రులు ఓపికగా మొత్తం దేవాలయ వివరాలు తెలుపుతుంటే పిల్లల కళ్లలో ఆసక్తి, ఆరాధన, ఆశ్చర్యం వెల్లువెత్తాయి. ఎంతో తృప్తితో ఆ కుటుంబం మదురైనుండి హైదరాబాదు విమానంలో చేరుకుంది.

తిరిగి వచ్చిన పిల్లలు తమ మనసులోని భావనలను నాన్న చెప్పినట్లుగా రాయటం మొదలు పెట్టారు. కలాలు కదులుతున్నాయి, భావనలు అక్షర రూపం దాల్చి తమకు ఆసక్తి గల కళలకు ప్రతిబింబంగా వెలువడుతున్నాయి. విషయాలు తెలుసుకోవటానికి యాత్రలు ఎంత గొప్ప సాధనాలో ఆ పిల్లలకు అర్థమైంది. అదే వారి అక్ష్రమాలికలలో ప్రతిధ్వనించింది. పిల్లలలో భారతీయ కళల పట్ల మంచి భావనలు కలిగినందుకు రంజని-వంశీ దంపతులు ఎంతో సంతోషించారు. రాష్ట్ర స్థాయి వ్యాస రచన పోటీలలో ఆ వ్యాసాలకు ప్రథమ బహుమతి వచ్చింది.

"రంజనీ! త్వరగా బయలుదేరు, ప్రోగ్రాం కి టైం అవుతోంది" అన్నాడు వంశీ ఓ ఆదివారం సాయంత్రం. హైదరాబాద్ రవీంద్రభారతిలో రాష్ట్ర సాంస్కృతిక కళల శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉగాది ఉత్సవాలలో ఆరోజు రంజని ప్రదర్శన. పిల్లలను ఇంట్లో వదిలి భార్య భర్తలు కారులో బయలుదేరారు. రోడ్లు ఖాళీగా ఉండటంతో కాస్త వేగంగానే వెళుతున్నారు. కారు అదుపు తప్పి డివైడర్‌ను గుద్దుకుంది. రంజని పాదం బాగా దెబ్బతింది. వంశీ చిన్న చిన్న గాయలతో రోడ్డు మీద పడ్డాడు. ఆస్పత్రిలో వేరే దారిలేక రంజని పాదం తొలగించాల్సి వచ్చింది. జీవితంలో ఊహించని ఈ కఠిన పరీక్షకు ఆ కుటుంబం తలక్రిందులైంది. నాట్యమే జీవితంగా, ఆ కళే శ్వాసగా జీవించిన రంజని కాలులేక నెలలపాటు మంచం మీద ఉండే పరిస్థితి.

"నాన్నా! అమ్మ ఇలా ఉండకూడదు. అమ్మ మళ్లీ నడవాలి, నాట్యం చేయాలి. ఆర్టిఫిషియల్ లింబ్ గురించి కనుక్కోండి" అంది లాస్య. "అవును లాస్యా! జీవితంలో ఎప్పుడూ స్థైర్యం కోల్పోకూడదు. అమ్మ మళ్లీ నాట్యం చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేద్దాం" అన్నాడు వంశీ. జైపూర్, ఢిల్లీ, బెంగుళూరు, చెన్నై నగరాలు తిరిగి అత్యుత్తమమైన కృత్రిమ పాదం గురించి వివరాలు తెలుసుకున్నాడు. దాదాపు ఆరునెలల పరిశోధన తరువాత చెన్నైలో అత్యుత్తమమైన పాదం రంజని కాలికి శస్త్రచికిత్స ద్వారా అతికించారు. ఆ తరువాత ఏడాది రంజని జీవితంలో మరువలేని సమయం.

"రంజనీ! త్వరగా లేచి రా! కాలికి ఎక్సర్సైజ్ కావాలి" అని పదే పదే గుర్తు చేసి, స్ఫూర్తినిచ్చి రంజనిని చేత అడుగులు వేయించాడు. "ఏవండీ! నా వల్ల కావట్లేదు. చాలా నొప్పిగా ఉంది" అని కన్నీళ్లతో భర్తను కౌగిలించుకుంది రంజని. "చూడు! చాలా మందికి జీవితంలో పరీక్షలు వస్తుంటాయి. ఇటువంటప్పుడే ధైర్యంగా మనం నొప్పిని, కష్టాన్ని, దౌర్బల్యాన్ని ఓర్చుకొని ముందడుగు వేయాలి..." అలా చెప్పుకుంటూ తన భుజంపై ఒక చేయి వేయించుకుని రంజనిని దాదాపు పావు గంట నడిపించాడు. "ఏవండీ! మీ మాటలు వింటుంటే నొప్పి మర్చిపోయి నడువగలుగుతున్నాను.." అని కన్నీటిని తుడిచివేసుకుని గల గలా నవ్వింది. "అమ్మా! యూ క్యాన్ డూ ఇట్. యూ హ్యావ్ టు డ్యాన్స్ ఎగైన్..." అని చప్పట్లు చరుస్తూ లాస్య ఉత్సాహంగా తల్లికి స్ఫూర్తినిచ్చింది. దాదాపు 3 నూలెల కఠోర శ్రమ తరువాత రంజని అడుగులు వేయగలిగింది. ఈ మూడు నెలలూ, వంశీ లాస్యను రంజని శిష్యులలలో ఒకరి వద్ద డ్యాన్స్ ప్రాక్టీస్ చేయిస్తునే ఉన్నాడు. ప్రతి రోజూ లాస్యను తీసుకువెళ్లటం, ప్రోత్సహించటం, తనకి కావలసినవి అన్నీ సమకూర్చటం వంశీ ప్రతిదీ జాగ్రత్తగా తానే స్వయంగా చూసుకున్నాడు.

"ఏవండీ! మీ పట్టుదలతో, ప్రోత్సాహంతో నడవగలుగుతున్నాను. అవిటిదాన్ని అయిపోయానన్న భయం నుండి మళ్లీ ధైర్యంగా నడువగలను అన్న స్థాయికి తీసుకు వహ్చారు. అంతా మీ వల్లే" అంది భర్తతో ఆరాధనా పూర్వకంగా. "రంజనీ! అదే యాక్సిడెంటులో నీ బదులు నాకు కాలు పోతే? నువ్వు కూడా ఇంతే చేసే దానివి కదా" అన్నాడు. తలదించుకుంది రంజని. "రంజనీ! నీ ప్రస్థానం ఇంతటితో ఆగడానికి వీల్లేదు. నువ్వు ఎలాగైనా నాట్యం చేయాలి" అన్నాడు. "ఏవండీ! నేనేమన్నా సుధాచంద్రన్ అనుకున్నారా? పిల్లలంటే తెలియక అంటున్నారు..మీరు కూడా..."  "రంజనీ! నువ్వు సుధాచంద్రన్ ఎందుకు కాకూడదు? డాక్టర్ గారిని సంప్రదించి వివరాలు కనుక్కుంటాను" అన్నాడు. "వై నాట్! ఆ కాలిపై బాగా ఒత్తిడి పడనంత వరకూ ఏదైనా చేయవచ్చు" అన్నాడు ఆర్థోపెడిక్ సర్జన్. వంశీకి ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది.

"రంజనీ! ఈరోజే నీ డ్యాన్స్ ప్రాక్టీస్ ఆరంభం" అని డాక్టర్ చెప్పింది వివరించాడు. సందేహంగా ఆలోచిస్తూ కూర్చుండిపోయింది రంజని. "ఏదీ పాదాలు ఎత్తి ఈ స్టూల్ మీద పెట్టు" అన్నాడు. ఎందుకు అంటూ పాదాలు స్టూలు మీద పెట్టింది. వంశీ ఆమె కృత్రిమ పాదానికి గజ్జెలు తొడిగాడు. ఆనందబాష్పాలు రాల్చింది రంజని. వంశీ రంజని పాత డ్యాన్స్ ప్రాక్టీస్ వీడియో టీవీలో ప్లే చేశాడు. తడబడుతూ నాలుగు అడుగులు వేసే సరికి నొప్పి, భయం, ఆందోళన. రంజని కుప్పకూలిపోయింది. "ఏవండీ! ఈ జీవం లేని పాదం ఆ పాదం ఎప్పటికీ కాదండీ! నేను నాట్యం చేయలేను" అంది. "రంజనీ! సరే. ఈరోజుకు వదిలేయ్. కానీ, నేను చేయలేను అన్న ఆలోచన ఎక్కువ సేపు నీ మనసులోకి రానీయకు" అని చెప్పి రంజనిని దగ్గరకు తీసుకున్నాడు. "ఏవండీ! నాకు కొంత సైకలాజికల్ సపోర్ట్ కావాలి. మనం సైకాలజిస్టు అభిరాం గారిని కలుద్దాం"  అంది రంజని కాస్త ఓదార్పు పొందిన తరువాత. "అలాగే" అన్నాడు వంశీ.

"రంజని గారు! నేను సైకాలజిస్టుగా ఎందరో రోగులను, మానసిక రుగ్మతలను చూశాను, నయం చేశాను. కానీ చాలా అరుదుగా ఇలా ఒక వ్యక్తి ముందడుగు కోసం ముందు చూపుతో సైకాలజిస్టు సలహా కోసం వచ్చిన వాళ్లను చూశాను. ఐ ఎడ్మైర్ యూ టూ ఫర్ హ్యావింగ్ ఫెయిత్ ఇన్ మై ప్రొఫెషన్" అని ఆమెకు స్ఫూర్తిదాయకమైన ఒక ప్రణాళికను రూపొందించాడు ప్రఖ్యాత మనస్తత్త్వ శాస్త్ర నిపుణులు డాక్టర్ అభిరాం గారు. దైవంపై విశ్వాసంతో, భక్తితో గట్టి సంకల్పం చేసుకొని యోగ మరియు ప్రాణాయం చేస్తూ, డాక్టర్ అభిరాం గారి ప్రణాళికతో, భర్త ప్రోత్సాహంతో మానసిక దారుఢ్యాన్ని పొందిన రంజనిలో ఆరు నెలల సమయంలో చాలా మార్పు వచ్చింది.

"ఏవండీ! ఈరోజు నాట్యం మళ్లీ మొదలు పెడతాను" అని వంశీతో చెప్పి లాస్యను కూడా పిలిచింది. "లాస్యా! గురు వందనం, మొదటి అడుగులకు తాళం వేయి తల్లీ" అని అడిగింది. నటరాజు ముందర మళ్లీ దాదాపు ఏడాది తరువాత రంజని మళ్లీ అడుగులు మొదలు పెట్టింది. కూతురు లయ గతులను పలుకుతుంటే రంజని నిదానంగా నాట్య విన్యాసాన్ని మొదలు పెట్టింది. దాదాపు మూడు నెలలు తీవ్ర ప్రయత్నం చేసింది. మనసు తడబడినా, అడుగులు భారం అనిపించినా వంశీ ఆమెను వెనుకడుగు వేయనీయలేదు. రంజని తిరిగి పూర్వంలా నాట్యం చేయగలుగుతోంది. మరో మూడేళ్ల పాటు సాధనతో మళ్లీ ప్రదర్శనిలిచ్చింది. ఆ సాధనా ప్రయాణంలో లాస్య తన నాట్య శిక్షణను పూర్తి చేసుకుంది. ప్రతి ఒక్క అడుగులోనూ వంశీ వాళ్లిద్దరికీ తోడుగా ఉన్నాడు. స్వరాళి చిత్రలేఖనంలో మంచి శిక్షణ పొంది అద్భుతమైన ప్రగతిని సాధించింది. తల్లిదండ్రుల క్రమశిక్షణ, ప్రోత్సాహంతో, ప్రేమానురాగాలతో స్వరాళి పదిహేనేళ్లకే అద్భుతమైన కళాకారిణిగా రూపుదిద్దుకొని జాతీయ స్థాయిలో పురస్కారాలు అందుకుంది.

డిసెంబరులో కోణార్క్ నాట్యోత్సవాలు..."వి నౌ ప్రెసెంట్ టు యు ఎ యునీక్ డ్యాన్స్ మెడ్లే ఇన్ కూచిపూడి వేర్ ద ఆర్టిస్ట్స్ షాల్ డ్యాన్స్ టు ఎ పెయింటింగ్, డెపిక్టింగ్ దశావతార ఫాలోడ్ బై ఎన్ ఐటం ఎక్ప్రెసింగ్ గ్రాటిట్యూడ్. దశావతార ఈజ్ ఎ రాగమాలిక అండ్ ద పేయింటర్ షాల్ కంప్లీట్ ఇట్ ఎట్ ద సేం టైం ద డ్యాన్స్ ఎండ్స్..." నాట్యబృందంలో ప్రధాన కళాకారులు రంజని-లాస్య. పెయింటర్‌గా స్వరాళి..తమను తాము మరచిపోయి ఆ దశావతార నృత్యాంశంలో ఒదిగిపోయి, కళ ద్వారా పరమాత్మతో అనుసంధానమైనారు ఆ తల్లీ కూతుళ్లు. కరతాళధ్వనుల మధ్య ఆ అంశం ముగిసింది. నాట్యాంశం ముగిసే సరికి స్వరాళి చేతుల్లో ఒక అద్భుతమైన దశావతార చిత్రం సంపూర్ణమైంది. ఆమె ప్రతిభకు సభికులు అబ్బురపడ్డారు. తరువాతి అంశం ముందు రంజని మైకులో ఇలా చెప్పింది.

"ఇఫ్ ఐ యాం ఏబుల్ టు డ్యాన్స్ ఎగైన్ టుడే ఆఫ్టర్ ద హారిబుల్ యాక్సిడెంట్ ఫ్యూ ఇయర్స్ ఎగో, ఇట్ ఈజ్ డ్యూ టు ద మోటివేషన్ అండ్ సపోర్ట్ ఫ్రం మై హస్బెండ్ వంశీ. ఐ డెడికేట్ దిస్ డ్యాన్స్ టు ద డివినిటీ అండ్ ద స్ట్రాంగ్ విల్ పవర్ ఇన్ హిం"...అని కన్నీళ్లతో భర్తను వేదిక మీదిక ఆహ్వానించింది. అతని పాదాలకు నమస్కరించి స్వరాళి వేసిన చిత్రాన్ని సమర్పించింది. ఇప్పుడు ఆమెకు పిల్లలకు వంశీ కుటుంబసభ్యుడే కాకుండా గురువు, దైవం మరియు స్ఫూర్తి ప్రదాత. ఎదురుగా ఉన్న నటరాజుకు నమస్కరించి "దొరకునా ఇటువంటి సేవ నీ పద రాజీవముల చేరు నిహ్వాణ సోపానమధిరోహణము సేయు త్రోవ" అన్న గీతానికి లాస్యతో కలిసి నృత్యం చేసింది. తమ తనువు, మనసు, సంకల్పం, భక్తి, కృతజ్ఞత అన్నీ రంగరించి తాదాత్మ్యతతో నర్తించారు. సభికులు వారిలోని కళావైభవాన్ని దాని వెనుక ఉన్న పరిశ్రమను గుర్తించి రెండు నిమిషాల పాటు నిలబడి చప్పట్లు కొట్టారు. వంశీ-రంజనిల జీవితంలో ఆరోజు మధురమైనది.

"రంజనీ! పిల్లలూ! ఈరోజు నాకు ఎవరెస్ట్ ఎక్కినంత సంతోషంగా ఉంది. మీరు ముగ్గురూ సాఫల్యాన్ని పొందారు. అది నా జీవితానికి సాఫల్యాన్నిచ్చింది." అన్నాడు. ముగూరూ వంశీ పాదాలకు ఆనందబాష్పాలతో అభిషేకం చేసి ఆయన విశాలమైన హృదయంలో ఒదిగిపోయారు. "దొరకున్నా ఇటువంటి సేవ" అన్న గీతం ఆ ఇల్లంతా మారుమ్రోగుతునే ఉంది. దివ్యత్వం నిండి ఆ ఇల్లొక దేవాలయంగా కనిపించింది. కళామతల్లి తన ముగ్గురు బిడ్డలతో పాటు వారి వెనుక ఉన్న ఆ మహాపురుషుని సేవానిరతికి, పట్టుదలకు పొంగిపోయింది. 

15, మే 2016, ఆదివారం

ఆది అనాదియు నీవే దేవా - దాశరథి గారి గీతం (భక్త ప్రహ్లాద 1967)


ఒక భక్తి గీతానికి శరణాగతి అతి ముఖ్యమైనది. విష్ణు భక్తులలో నారదుడు ప్రముఖుడు. అలాగే ప్రహ్లాదుడు కూడా. మరి వీరిరువురి నేపథ్యంలో భక్తి గీతాన్ని రాయాలంటే అందులో శ్రీహరి వైభవాన్ని ఎంత అద్భుతంగా రాయాలి? దానికి భక్త ప్రహ్లాద చిత్ర దర్శకులు దాశరథి గారిని ఎన్నుకున్నారు. నారద భక్తి అనగానే ఈ ఆది అనాదియు నీవే దేవా అన్న గీతం గుర్తుకు వస్తుంది .  ఈ గీతంలో దాశరథిగారి భావ సౌందర్యం, భక్తి  మిళితమై నారదుని నోటి వెంట జాలువారినంత అందంగా మనకు ఆవిష్కరించబడింది.

ఆది అనాదియు నీవే దేవా నింగియు నేలయు నీవే కావా
అంతటి నీవే ఉండెదవు శాంతివై కాంతివై నిండెదవు
నారద సన్నుత నారాయణా నరుడవో సురుడవో శివుడవో లేక శ్రీసతి పతివో
దానవ శోషణ మానవ పోషణ శ్రీచరణా భవహరణా
కనక చేల! భయ దమన శీల! నిజ సుజన పాల! హరి సనాతనా!
క్షీరజలధి శయనా! అరుణ కమల నయనా! గాన మోహనా! నారాయణా!

దాశరథి గారు తెలుగుజాతి కన్న ఒక మాణిక్యం.  భాషా పాండిత్యంతో పాటు భక్తి సుగంధాన్నిఈ గీతానికి అణువణువున అలదిన గొప్ప కవి ఆయన. ఈ గీతంలో పోతన గారి భావజాలానికి దగ్గరగా వెళ్లారు దాశరథిగారు.  నరుడవో సురుడవో అన్నచోట, దానవ శోషణ  మానవ పోషణ శ్రీచరణ భవహరణ అనే పద ప్రయోగాలు భక్తి సామ్రాజ్యంలోని పారిజాత పుష్పాలు. ఇక చివరి రెండు పంక్తులలో త్యాగరాజస్వామి వారి పదజాలాన్ని కూడా స్ఫురింపజేశారు.  భక్తిని పతాక స్థాయికి తీసుకువెళ్ళారు. ఒక గీతానికి సాహిత్యం సాద్గుణ్యత అయితే సంగీతం, గానము సాఫల్యాన్ని ఇస్తాయి.  రసాలూరించే సాలూరి వారు భక్త ప్రహ్లాద చిత్రంలో ఈ గీతానికి సంగీతం సమకూర్చగా గానగంధర్వులు మంగళంపల్లి బాలమురళి గారు  నటించి, గళమాధుర్యంతో అమృతాన్ని కురిపించారు. నారదుని మించిన భాగవతోత్తముడెవరు? బాలమురళి గారు తమ నటనతో, గానంతో పరమ భాగవతతోత్తమునిగా ప్రకాశించారు.

దాశరథిగారు శ్రీవైష్ణవుడైనా అద్వైత భావాన్ని ఈ గీతంలో కురిపించి తమ ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని నలుదెసల వెదజల్లారు.  రాగమాలికలో ఒక పాటను కూర్చాలంటే ఏయే రాగాలు కూడితే బాగుంటుందో తెలియాలి. దానికి సంగీతం మూర్తీభవించిన సరస్వతీపుత్రులు సాలూరి వారి కన్నా ఎవరు మిన్న?  రాగాలను గంగా ప్రవాహంలా పలికిచే బాలమురళి గారి గొంతులో ఈ గీతం నారాయణ మంత్రంలా ప్రకాశించింది.    త్రిమూర్త్యాత్మకమైన ఈ గీతం భక్తి భావ సంగీత సుధలను కురిపించింది.  అందుకే ఇన్నేళ్ల తరువాత కూడ ఇంకా శ్రోతలకు శ్రీమన్నారాయణుని స్తుతులలో తలమానికంగా నిలిచింది. ఈ గీతాన్ని లీలావతిని ఇంద్రుడు చెరపట్టి కొనిపోవు సన్నివేశంలో చిత్రీకరించారు. ఎందరో మహానుభావులు వారందరికీ శతసహస్ర వందనాలు!

7, మే 2016, శనివారం

కలికి చిలకలకొలికి మాకు మేనత్త - సీతారామయ్య గారి మనవరాలు


కని పెంచి పెళ్లి చేసి అత్తారింటికి వెళ్లిన ఆడపిల్ల పట్టింపుల వల్ల పుట్టింటికి రాలేకపోతే ఆ తల్లిదండ్రులకు, బిడ్డకు ఎంత బాధో సీతారామయ్య గారి మనవరాలు చిత్రంలో హృదయానికి హత్తుకునేలా చిత్రీకరించారు. ఇంకో యింటి పిల్లైనంత మాత్రాన పుట్టింటిని మరచిపోవాలా? ఆ ఆడబిడ్డ ఇంటికి ఆవిడ మేనకోడలు వెళ్లి అభిప్రాయ భేదాల వలన పుట్టింటికి రాలేకపోయిన మేనత్తను తాతగారింటికి ఎలా తీసుకు వస్తుందో చూస్తేనే కళ్లు చెమరుస్తాయి. చిన్న చిన్న పట్టింపులకు పోయి బంధాలు తెంచుకునే పెద్దవాళ్ల మనసులను కరిగించి రెండు కుటుంబాలను ఒక్కటి చేస్తుంది ఆ సీత. కన్న కూతురు ఇంట్లో మళ్లీ అడుగు పెడితే ఆ తల్లిదండ్రుల మనోభావాలు ఎలా ఉంటాయో అద్భుతంగా పండించారు అక్కినేని, రోహిణి  హట్టంగడి గార్లు.

పెళ్లిళ్లు రెండు కుటుంబాలను కలపాలి, విడదీయకూడదు. అందులో కంటికి రెప్పలా కాపాడుకుంటూ పెంచే తల్లిదండ్రుల మనోభావాలను దెబ్బతీసి అత్త మామలు కోడలిని పుట్టింటికి దూరం చేయకూడదు. ఆ కోడలు రెండు కుటుంబాల మధ్య వారధి. కొత్త తరానికి నాంది. పుట్టినింట మెట్టినింట సౌభాగ్యాన్ని కలిగించే మహాలక్ష్మి. గౌరవం, విశ్వాసం, నమ్మకం, ప్రేమానురాగాలు ఇవ్వలి తప్ప ఉన్నవాటిని పోగొట్టకూడదు. ఎంత ఉన్నా లేకున్నా ఆ తల్లిదండ్రులు కూడా కనిపెంచటం వల్లే కదా తమకూ ఒక కోడలు వచ్చింది? అడుగడుగునా కుటుంబ బంధాలు మరియు ఆప్యాయతలకు నిలువుటద్దంలా నిలిచిన చిత్రం సీతారామయ్య గారి మనవరాలు. అక్కినేని చిత్ర జీవితంలో ఇదో కలికితురాయి. మీనా నటనా జీవితంలో ఒక మైలురాయి. మరకతమణి కీరవాణి గారి సంగీతంలో వేటూరి గారు సాహిత్యం అందించిన ఈ చిత్రంలోని పాట కలికి చిలకలకొలికి మాకు మేనత్త అనే పాట వివరాలు క్రింద. ఈ గీతానికి చిత్రగారికి ఉత్తమ గాయనిగా నంది అవార్డు వచ్చింది. అంతే కాదు అక్కినేని గారికి, మీనాకు ఉత్తమ నటుడు, నటి ఫిలింఫేర్ అవార్డులు వచ్చాయి.

పాట ద్వారా ముందు మేనత్త మామగారిని, తరువాత అత్తగారిని, చివరకు మామల మనసును కరిగించి మేనత్తను పుట్టింటికి తీసుకువెళుతుంది ఆ సీత. ప్రేమతో ఎంతటి కర్కశమైన మనసునైనా జయించవచ్చు అన్న సందేశాన్ని సీత పాత్ర మనకు చెబుతుంది. ఈ సమస్యలన్నీ మనజీవితాల్లో నిత్యం ఉండేవే. చిత్రాన్ని మన జీవితానికి అన్వయించుకుంటే మనింటికి వచ్చే కోడలిని, మన ఇంటి పిల్లలను ఎలా పెంచుకోవాలో, ఏ వయసులో ఏ త్యాగాలు చేయాలో అర్థమవుతుంది. ఈ చిత్రం భారతీయ ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు ఒక చక్కటి ఉదాహరణ, మనస్తత్త్వ శాస్త్రానికి నిఘంటువు.

మీ జీవితంలో కూడా  ఏదైనా రక్తసంబంధం ఇలా చిన్న చిన్న మనస్పర్థల వలన  దూరం అయ్యిందా? బాగా ఆలోచించి మీరే ఒక్క అడుగు ముందుకు వేయండి. ప్రేమతో కొత్త ఆరంభం చేయండి. తప్పకుండా ఫలితం ఉంటుంది. బంధాలు మళ్లీ చేరువవుతాయి. ప్రయత్నించండి. సీతలాగే,  పెద్దలైతే గౌరవంతో కూడిన ప్రశంసలతో, పిన్నలైతే వాత్సల్యంతో మనసులను కరిగించండి. మానవుడికి బంధాలే  నిజమైన సంపదలండీ.


కలికి చిలకలకొలికి మాకు మేనత్త
కలవారి కోడలు కనకమాలక్ష్మి
అత్తమామల కొలుచు అందాల అతివ
పుట్టిల్లు ఎరుగని పసి పంకజాక్షి

మేన అలుపే లేని మేనకోడల్ని
అడగవచ్చా మిమ్ము ఆడకూతుర్ని
వాల్మీకినే మించు వరస తాతయ్యా
మా ఇంటికంపించవయ్య మావయ్యా

ఆ చేయి ఈ చేయి అద్ద గోడలికి
ఆ మాట ఈ మాట పెద్ద కోడలికి
నేటి అత్తమ్మ నాటి కోడలివి
తెచ్చుకో మాయమ్మ నీవు ఆ తెలివి
తలలోని నాలికై తల్లిగా చూసే
పూలల్లో దారమై పూజలే చేసే
నీ కంటిపాపలా కాపురంచేసే
మా చంటి పాపను మన్నించి పంపు

మసక బడితే నీకు మల్లెపూదండ
తెలవారితే నీకు తేనెనీరెండ
ఏడు మల్లెలు తూగు నీకు ఇల్లాలు
ఏడు జన్మల పంట మా అత్త చాలు
పుట్టగానే పూవు పరిమళిస్తుంది
పుట్టింటికే మనసు పరుగు తీస్తుంది
తెలుసుకో తెలుసుకో తెలుసుకో
తెలుసుకో తెలుసుకో మనసున్న మామ
సయోధ్య నేలేటి సాకేతరామా

వెడలెను కోదండపాణి - త్యాగరాజస్వామి కృతి

వెడలెను కోదండపాణి అనుజ సౌమిత్రితో గూడి పుడమిలో జనులెల్ల పొగడ పూజితుడౌ మునితో గూడి శిరమన కొండెయు జార  వురమున హారములు మెరయ కరమున శరచాపములును ఘ...