9, మే 2015, శనివారం

రంగనాథుడే అంతరంగనాథుడే అంతా రంగనాథుడే


రంగనాథుడే అంతరంగనాథుడే అంతా రంగనాథుడే

మంగళప్రదంబులిచ్చు మహనీయ గుణాఢ్యుడే

సతతము వాని నామమే సంకీర్తనములు జేసిన జనుల హృదయకమలమందు జెలగుచునున్నాడే
పతితపావనుడను బిరుదు బట్టి యున్నాడే సద్గతి ఇచ్చు వాడు ఇతడే గరుడగమన దొరయితడే

పదియారు వేల స్త్రీలకు ప్రాణనాథుడితడే పరశురామ గర్వమెల్ల భంగపరచినాడే
ముదము మీర పాండవులకు మోక్షమిచ్చినాడే పరమదయాకరుడే శ్రీప్రహ్లాదవరదుడే


పొన్నయ్య పిళ్లై రచించిన ఈ కృతి సౌరాష్ట్ర రాగంలో కూర్చబడింది.

శ్రీరంగనాథుని నుతిస్తూ కృతి కర్త ఇలా అంటున్నారు:

అంతా ఆ రంగనాథుడే! అంతరంగానికి కూడా నాథుడే!  శుభాలు కలిగించే గొప్ప గుణాలు కలవాడే!

ఎల్లప్పుడూ ఆతని నామమును సంకీర్తనమును చేసే జనుల హృదయాలలో నివసించియున్నాడే! పతితపావనుడనే బిరుదు కలవాడే! మంచి గతిని ఇచ్చేవాడి ఇతడే! గరుత్మంతునిపై అధిరోహించే దొర ఇతడే! ఈ రంగనాథుడే!

పదహారువేల మంది స్త్రీలకు విభుడు ఇతడే! పరశురాముని గర్వమంతా అణచినవాడితడే! సంతోషముతో పాండవులకు మోక్షాన్ని ప్రసాదించిన వాడితడే! అపారమైన దయస్వరూపుడే! ప్రహ్లాదుని కాపాడిన వాడే! ఈ రంగనాథుడే!

పొన్నయ్య పిళ్లై మంచి సంగీత విద్వాంసుల కుటుంబంలో 19వ శతాబ్దం చివరలో జన్మించారు. కర్ణాటక సంగీత త్రయంలో ఒక్కరైన ముత్తుస్వామి దీక్షితుల వద్ద సంగీత విద్యనభ్యసించారు. 15 ఏళ్ల పాటు సంగీతము, నృత్యము, మృదంగము మీనాక్షీ సుందరం పిళ్లై అనే గురువు వద్ద నేర్చుకున్నారు. తంజావూర్ మహారాజా శరభోజి వారి ఆస్థానంలో విద్వాంసులుగా పేరు పొందారు. ఎన్నో అద్భుతమైన కృతులను రచించారు. కర్ణాటక సంగీతంతో భరతనాట్యశాస్త్ర ధర్మాలను నిర్వచించారు. ఎన్నో జతిస్వరాలు, పదవర్ణాలు, శబ్దాలు, జావళులు, తిల్లానలు మరియు కృతులను రచించారు. రాజా అన్నామలై చెట్టియార్ సంగీత కళాశాలలో ఉపన్యాసకులుగా పని చేశారు. తన శిష్య బృదంతో కలిసి తంజావూర్ ప్రాంతంలో ప్రదర్శనలను ఇప్పించారు. ప్రాచుర్యం పొందిన ఆయన రచనలు - మాయాతీత స్వరూపిణీ (మాయామాళవ గౌళ), అంబా నీలాంబరీ (నీలాంబరి), మహాదేవ మనోహరి (దేవమనోహరి) మొదలైనవి. 1932లో వీరికి సంగీత కళానిధి బిరుదునిచ్చి సత్కరించారు.

హైదరబాద్ సోదరులుగా ప్రసిద్ధి పొందిన కర్ణాటక సంగీత విద్వాంసులు శ్రీ రాఘవాచార్యులు, శేషాచార్యుల గళంలో ఈ రంగనాథుడే కృతిని వినండి

మరి వేరే గతి యెవరమ్మా మహిలోన బ్రోచుటకు




మరి వేరే గతి యెవరమ్మా మహిలోన బ్రోచుటకు

శరణాగత రక్షకి నీవే యని
సదా నమ్మితి నమ్మితి మీనాక్షి

మధురాపురి నిలయ వాణి రమా సేవిత పద కమల
మధుకైటభ భంజని కాత్యాయిని మరాళ గమన నిగమాంత వాసిని

వరమిచ్చి శీఘ్రమె బ్రోవు శివాంబా! ఇది నీకు బరువా!
నెర దాటవు నీవు గదా! శంకరి!సరోజభవాది సురేంద్ర పూజితే

శుకశ్యామల ఘనశ్యామకృష్ణుని సోదరి కౌమారి
అకళంక కళాధరి బింబాధరి అపార కృపానిధి నీవే రక్షింప

పాదయుగము మదిలో దలచి కోరితి వినుము మదగజగమని
పరుల నుతింపగనే వరమొసగు నిను సతతము మది మరవకనే
మదనరిపుసతి నిను హృదయములో గతియని దలచి స్తుతి సలిపితే
ముదముతో ఫలమొసగుటకు ధరలో నతావన కుతూహల నీవేగా


కర్ణాటక సంగీత త్రిమూర్తులుగా ప్రసిద్ధి పొందిన సమకాలీకులు కాకర్ల త్యాగరాజు, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితులు. శ్యామ శాస్త్రులు వీరి మువ్వురిలో పెద్దవారు. ఈయన సంగీతానికి పుట్టిల్లైన తంజావూరు దగ్గరి తిరువారూరులో విశ్వనాథ అయ్యరు, వేంగలక్ష్మి దంపతులకు 1762 (కొన్ని మూలాల్లో 1763గా ఉంది) జన్మించాడు. వేంకటసుబ్రహ్మణ్య అయ్యరుగా నామకరణం చేయబడినా, శ్యామకృష్ణ అన్న ముద్దు పేరుతో పిలువబడ్డాడు.వీరి కులదైవము తంజావూరులో ఉన్న బంగారు కామాక్షీ దేవి. శ్యామకృష్ణులు పసిప్రాయంలోనే తెలుగు, సంస్కృతము, తమిళ భాషలలో ప్రావీణ్యం సంపాదించారు. చిన్నతనంలోనే నారదులు ఈయనపై అనుగ్రహించి సంగీతస్వామి అనే సన్యాసి రూపంలో వీరి ఇంటికి వచ్చి, ఈ బాలునిలో ఉన్న దైవత్వాన్ని గుర్తించి, శ్యామకృష్ణునికి సంగీత జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. తంజావూరు శరభోజీ మహారాజు మన్ననలు పొందినా శ్యామశాస్త్రులు పెద్దగా శిష్యవారసత్వాన్ని సమకూర్చుకునే ఆసక్తి చూపలేదు. మదురై మీనాక్షి, తంజావూరు బంగారు కామాక్షిలపై శ్యామశాస్త్రులు ఎన్నో కీర్తనలు రచించారు. త్యాగయ్య కూడా తంజావూరు ప్రాంతంలోనే ఉండటం చేత శ్యామయ్యకు,త్యాగయ్యకు సాన్నిహిత్యం ఏర్పడింది. సంగీత శాస్త్రమే కాకుండా, శ్యామశాస్త్రులు జ్యోతిష్య శాస్త్రంలో కూడా ప్రావీణ్యం సంపాదించి తంజావూర్ సంస్థానంలో పేరుగాంచారు. శ్యామశాస్త్రులు చాలా మటుకు కృతులు తెలుగు, సంస్కృత భాషలో రచించారు.

చిన్నతనంలోనే బంగారు కామాక్షిని కొలుస్తూ మంత్రాలను వేర్వేరు రాగాలలో ఆలపించి అమ్మకు హారంగా వేశారు శ్యామశాస్త్రి. ఆ కామాక్షి తల్లి అతని హృదయంలో నిలచి పాడించుకునేదట. ఆతని ప్రజ్ఞను మరింత పెంపొందించటానికి ఆ తల్లి స్వయంగా కాశీనుండి ఒక సంగీత ప్రావీణ్యమున్న యోగిని శ్యామశాస్త్రుల తండ్రి విశ్వనాథ అయ్యరు ఇంటికి పంపిస్తుంది. ఇంటికి వచ్చిన ఆ యోగిని తండ్రి భక్తి ప్రపత్తులతో సేవిస్తాడు. అప్పుడు ఆ యోగి శ్యమశాత్రికి సంగీతంలో మంచి భవిష్యత్తు ఉంది, అతనికి శిక్షణ మంచి గురువు వద్ద ఇప్పించమని ఆదేశిస్తాడు. ఆ యోగి వద్దే శ్యామశాస్త్రికి సాధన మొదలవుతుంది. గురువుల అనుగ్రహంతో, తల్లి కృపతో శ్యామశాస్త్రి కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే సంగీత ప్రావీణ్యం పొందుతాడు. యోగి అతన్ని సంగీత సామ్రాజ్యంలో ధృవతారగా నిలుస్తావని మనసారా ఆశీర్వదించి కాశీకి వెళ్లిపోతాడు. పచ్చిమిరియం అడియప్పయ్యర్ అనే విద్వాంసుడు శ్యామకృష్ణుని ఆ కామాక్షి అవతారంగా గ్రహించి ఆప్యాయంగా కామాక్షీ అని పిలిచేవాడట. ఒకసారి తంజావూరు రాజా శరభోజీ ఆస్థానంలో కేశవయ్య అనే పండితుడు శ్యామశాస్త్రిని సంగీత పోటీకి ఆహ్వానిస్తాడు. మొదట కేశవయ్య అద్భుతంగా పాడతాడు. తరువాత శ్యామశాస్త్రి కామాక్షి అమ్మను తలచుకొని 'దేవీ బ్రోవ సమయమిదే' అని చింతామణి రాగంలో అత్యుత్తమమైన స్వర సంచారంతో గానం చేస్తాడు. ఆ సంగీతం విని కేశవయ్య తన అజ్ఞానాన్ని తెలుసుకుంటాడు. రాజా శరభోజీ శ్యామశాస్త్రి ప్రతిభకు ముగ్ధులై 'మహావిద్వాన్' అనే బిరుదుతో సత్కరించి అనేక కానుకలిస్తాడు. శ్యామశాస్త్రులు ఆ కానుకలన్నీ కామాక్షీ తల్లికి సమర్పిస్తాడు. ఎప్పుడూ ధనము, పదవుల ప్రలోభానికి లొంగకుండా శ్యామశాస్త్రులు జీవితమంతా కామాక్షీ ఉపాసనలో తరించారు.


శ్యామశాస్త్రులు మదురై మీనాక్షి అమ్మవారిపై రచించిన తొమ్మిది కృతులు నవరత్న మాలికగా  పేరు పొందాయి. వీటిలో ఆనందభైరవిలో 'మరివేరేగతి యెవ్వరమ్మా', శంకరాభరణంలో 'సరోజదళనేత్రి హిమగిరిపుత్రి' ఆ ఆదిపరాశక్తి వర్ణనలో ప్రత్యేకతను చాటుకున్నాయి. అలాగే, తిరుచిరాపల్లి సమీపంలోని జంబుకేశ్వరంలో పంచభూత లింగాలలో ఒకటైన జలలింగ స్వరూపుడైన శివుని నాయికగా ఉన్న అమ్మ అఖిలాండేశ్వరిని స్తుతిస్తూ ద్విజావంతి రాగంలో 'అఖిలాండేశ్వరి రక్షమాం' అని అద్భుతమైన రచన చేశారు. కులదైవమైన కామాక్షిపై మధ్యమావతిలో 'పాలించు కామాక్షి పావని పాపశమని', చింతామణి రాగంలో 'దేవి బ్రోవ సమయ మిదే', పున్నాగవరాళిలో 'కనకశైలవిహారిణి', తంజావూరు బృహదీశ్వరుని నాయికయైన బృహన్నాయకీ దేవిపై ఆనందభైరవిలో 'హిమాచల తనయ బ్రోచుటకిది మంచి సమయము', మధ్యమావతిలో 'బృహన్నాయకి నన్ను బ్రోవు వేగమే', నాట రాగంలో 'పాహిమాం శ్రీ రాజరాజేశ్వరి' మొదలైన ఎన్నో కీర్తనలను రచించారు. తంజావూరు పరిసర ప్రాంతాలైన వైదీశ్వరన్ కోయిల్, పుదుక్కోటై మొదలైన క్షేత్రాలలోని ఆరాధ్య దైవాలను తన కీర్తనలలో నుతించారు శ్యామశాస్త్రులు. దాదాపు 300కు కృతులను రచించిన శ్యామ శాస్త్రి 1867 సంవత్సరములో పరమపదించారు. ఈయన కుమారుడైన సుబ్బరాయ శాస్త్రి కూడా ప్రముఖ కృతి కర్త. రీతిగౌళలో 'జననీ నినువినా' అనే కీర్తన సుబ్బరాయ శాస్త్రి రచించినదే.  కృతులలో శ్యామయ్య వారి ముద్ర 'శ్యామకృష్ణ సోదరి'.

శ్యామశాస్త్రుల వారి 'మరివేరే గతి యెవరమ్మా' అనే కృతిలో మదురై మీనాక్షి అమ్మవారిని అనుగ్రహించమని వేడుకుంటున్నారు.

తల్లీ మీనాక్షీ! నన్ను బ్రోచుటకు నీవు తప్ప ఈ భూమిపై వేరే దిక్కెవ్వరు? శరణన్న వారిని కాపాడే తల్లివని నేను ఎల్లప్పుడూ నమ్ముతున్నాను! మదురైలో నివసించే తల్లీ! నీ పదకమలములను సరస్వతి మరియు లక్ష్మి సేవిస్తారు. మధుకైటభులను సంహరించినావు, కాత్యాయనివి. హంసవలే నడచే నీవు సర్వ వేదముల సారము. శీఘ్రముగా వరమిచ్చి నన్ను బ్రోవుము. ఇది నీకొక బరువా? నీ మాట ఎప్పుడు నిష్ఫలము కాదు శంకరీ! బ్రహ్మేంద్రాదులచే పూజించ బడిన తల్లీ! చేతిలో చిలుకను కలిగిన శ్యామలదేవీ! నీవు నల్లని కృష్ణుని సోదరివి! కుమారివి! మచ్చలేని చంద్రుడుని శిరసుపై ధరించినావు, దొండపండువంటి ఎర్రని పెదవుల కలదానవు! అపారమైన కృపకు నిధి నీవు! నీవే నన్ను రక్షించాలి! ఏనుగు వలె మెల్లగా నడిచే తల్లీ! నీ పాదములను మదిలో తలచి కోరుతున్నాను వినుము! ప్రార్థించగానే వరాలిచ్చే నిను ఎల్లప్పుడూ మదిలో మరవకనే యున్నాను. కాముని దహించిన శివుని పత్నివి నీవు! హృదయములో నీవె గతియని స్తుతించితే నీ భక్తులకు ఆనందంతో ఫలములొసగుటకు కుతుహలముగా ఉండే తల్లివి నీవేగా? నాకు వేరే గతి ఎవరమ్మా ఈ భువిలో బ్రోచుటకు?

శ్యామశాస్త్రులవారికి ఆనందభైరవి రాగం అంటే ప్రీతి అని వారి వారసులు వ్రాశారు. భక్తి, శరణాగతితో వేడుకునే భావాన్ని ఈ రాగం అద్భుతంగా పండిస్తుంది. రాగ లక్షణాలకు అనుగుణంగా శ్యామశాస్త్రుల వారు సాహిత్యంలో భావాన్ని గుప్పించారు. కృతి ప్రతి అడుగులోనూ ఈ భావం ప్రస్ఫుటిస్తుంది. శ్యామశాత్రుల వారు మహా శ్రీవిద్యా ఉపాసకులు. తంజావూరులోని బంగారు కామాక్షిని, అటుతరువాత మదురై మీనాక్షిని ఉపాసన చేసి ఆధ్యాత్మికోన్నతిని పొందారు. వారి మాట అక్షరాల నిజమయ్యేదట. అమ్మ వారి నాలికపై నిలిచి పలికేదని అప్పటి వారి అనుభవాలు తెలుపుతున్నాయి. ఈ మరివేరే గతి అనే కృతిలో సంపూర్ణ శరణాగతి, భక్తి, తల్లిపై గల అవ్యాజమైన విశ్వాసము మనకు తేటతెల్లమవుతాయి.

మరివేరే గతి యెవరమ్మా రాధ-జయలక్ష్మి గార్ల గాత్రంలో వినండి

8, మే 2015, శుక్రవారం

నన్ను విడచి కదలకురా రామయ్య


నన్ను విడచి కదలకురా! రామయ్య రామా! కోదండ రామా! కళ్యాణ రామా! పట్టాభిరామా! రామయ్య వదలకురా! కదలకురా! వదలకురా!

నిన్ను బాసి అరనిమిష మోర్వనురా ||నన్ను విడచి||

అబ్దిలో మునిగి శ్వాసమును బట్టి ఆణిముత్యము గన్నట్లాయె శ్రీరమణ ||నన్ను విడచి||

తరముగాని యెండవేళ కల్పతరు నీడ దొరికినట్లాయెనీ వేళ ||నన్ను విడచి||

వసుధను ఖననము చేయ ధన భాండనమబ్బిన రీతి కనుగొంటి డాసి ||నన్ను విడచి||

బాగుగ నన్నేలుకోరా వర త్యాగరాజనుత తనువు నీదేరా ||నన్ను విడచి||

సందర్భము:

త్యాగరాజస్వామి రచించిన ప్రహ్లాద భక్తి విజయమనే యక్షగానంలో (సంగీత నాటకం) ఈ సంకీర్తన పొందుపరచబడినది. ప్రహ్లాదుడు ఎంతో కాలానికి శ్రీహరి దర్శనము లభించటంతో భగవంతునితో నన్ను విడచి కదలకురా అని ప్రార్థించాడు.

అర్థము:

ఓ శ్రీహరీ! సముద్రములో మునిగి శ్వాస బిగబట్టినప్పుడు ఆణిముత్యము కనిపించనట్లాయె. సహించలేని ఎండ ఉన్న వేళలో కోరిన కోర్కెలను తీర్చే వృక్షపు నీడ దొరికినట్లు దొరికినావు. భూమిని తవ్వుచుండగా లంకె బిందెలు దొరికినట్లు నిన్ను కనుగొన్నాను. నా శరీరము నీకే సమర్పిస్తున్నాను. నన్ను బాగా ఏలుకో!

వివరణ:

సర్వస్య శరణాగతితో ప్రహ్లాదుడు ప్రార్థించిన రీతిని త్యాగరాజస్వామి ప్రహ్లాద భక్తి విజయంలో వివరించారు. ఆర్తితో కూడిన ఈ సంకీర్తనను త్యాగయ్య అదే రాగ లక్షణాలు కలిగిన రీతిగౌళ రాగంలో కూర్చారు. భావానికి రాగానికి అద్భుతమైన కలయిక సద్గురువులు అందించారు. హరి భక్తిలో ప్రహ్లాదుని ప్రత్యేక లక్షణం అచంచలమైన విశ్వాసం, నిరంతర నామస్మరణ అనే సుధావృష్టిలో ఓలలాడటం. ఆ హరి భక్తి వల్లనే నరహరి రూపంలో వెలసిన ఆ శ్రీహరిని తనను వదలి వెళ్లవద్దు అని పాడినట్లుగా త్యాగరాజస్వామి అద్భుతంగా పలికారు. తానే ప్రహ్లాదుడైనట్లు సుందరమైన భావనలను ఒలికించారు.

దానవ వంశంలో జన్మించిన ప్రహ్లాదుడు పుట్టుకతోనే హరిభక్తుడు. శాపవశాత్తు హరిద్వేషియైన అతని తండ్రి హిరణ్యకశిపుడు హరి నామ స్మరణ మానమని ఎంత చెప్పినా వినలేదు ప్రహ్లాదుడు. ఫలితంగా ఆ దానవేంద్రుడు పెట్టిన బాధలన్నీ శ్రీహరి భక్తితో దాటగలుగుతాడు. క్రోధాగ్నిలో రగిలిన హిరణ్యకశిపుడు స్థంభంలో హరిని చూపించమని ప్రహ్లాదుని అడుగగా, ప్రహ్లాదుని ప్రార్థన విని హరి నరహరియై అవతరిస్తాడు. ఆ దానవరాజును సంహరించి ప్రహ్లాదునికి అభయమిస్తాడు.

శ్రీహరి భక్తులలో ప్రహ్లాదుడు అగ్రగణ్యుడు. ఆతని చరిత్రను సంగీత నాటక రూపంలో త్యాగరాజు శ్రీగణపతిని సేవింపరారే అనే సంకీర్తనతో మొదలుపెట్టి నీ నామ రూపములకు అనే సంకీర్తనతో ముగిస్తాడు. ఈ యక్షగానంలో 45 కృతులు ఉన్నాయి. వాసు దేవయని వెడలిన, వందనము రఘునందన, ఎన్నగ మనసుకు రాని, రారా మాయింటి దాక, జయమంగళం నిత్య శుభమంగళం వంటి ఎన్నో అద్భుతమైన భక్తి ప్రధానమైన సంకీర్తనలను రచించారు త్యాగరాజ స్వామి. ఇది వారి రచనలలో ఒక తలమానికంగా నిలిచింది.

నిత్యశ్రీ మహదేవన్ గారి గాత్రంలో ఈ కీర్తన వినండి.

4, మే 2015, సోమవారం

అన్నమయ్య జయంతి - అన్నమాచార్య భావనా వాహిని




తెలిసీ తెలియని వయసులో ఓ ఆడపిల్ల హరిని శరణు అన్నది. హరియే సర్వస్వం అని విశ్వసించింది. దానికి ఫలితం ఒక బృహత్తరమైన కార్యము, మహత్తరమైన లక్ష్యం. ఆ స్త్రీలోని శక్తి సామర్థ్యాలను, మనసులోని నైర్మల్యాన్ని చూసే స్వామి ఆమెను కార్యోన్ముఖురాలను చేశాడు. అప్పటినుండి ఇప్పటివరకు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, అర్థ బలం, అంగబలం లేకపోయినా, ఎన్నో త్యాగాలు చేసి, మహాద్బుతమైన సద్గురు తత్త్వాన్ని ఆయన సంకీర్తనల వైశిష్ట్యాన్ని మనకు అందిస్తున్నారు అన్నమాచార్య భావనా వాహిని వ్యవస్థాపకులు, ప్రముఖ భక్తి సంగీత కళాకారిణి, అన్నమయ్య పదకోకిల, పద్మశ్రీ డాక్టర్ శోభారాజు గారు. 

యుగాన్ని బట్టి పరమాత్మను కనుగొనే సాధనం మారుతుంది. ఎందుకంటే, యుగలక్షణాలు మానవుని ఆలోచనలను, కర్మలను ప్రభావితం చేస్తాయి. సృష్టినుండి ప్రళయం వరకు జరిగే యుగక్రమంలో మానవునిలో నిర్మలత్వం తగ్గుతుంది. తదనుగుణంగా మోక్షమార్గాలు కూడా మారుతూ ఉంటాయి. కలిలో సంకీర్తనమే మోక్షమునకు అత్యుత్తమమైన సాధనం అని ఆర్యోక్తి. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని శ్రీకృష్ణుడు గీతలో అర్జునునికి చెప్పాడు. దానికి నిరూపణగా, అటు తరువాత ఎందరో మహానుభావులు ఈ కర్మభూమిని అధర్మం నుండి రక్షించటానికి అవతరించారు. అటువంటి వారిలో తాళ్లపాక అన్నమాచార్యుల వారు మన తెలుగుజాతిలో 15వ శతాబ్దంలో జన్మించారు. దాదాపు శతసంవత్సమురల జీవితంలో ఆయన 32 వేలకు పైగా అద్భుతమైన ఆధ్యాత్మిక సందేశం మరియు మధుర భక్తితో కూడిన సంకీర్తనలను రచన చేశారు. 

ఒక్కొక్క వ్యక్తికి మహాపురుషులపై ప్రత్యేకమైన అభిప్రాయం ఉంటుంది. నా దృష్టిలో అన్నమాచార్యుల వారు సద్గురువులు, గొప్ప సంఘ సంస్కర్త. సమాజానికి ఎప్పుడైనా కావలసినది సంస్కర్తలు. ఎందుకంటే, ధర్మం ఎప్పటికీ ఒకేలా ఉండదు, ఉండకూడదు. కాలానుగుణంగా ధర్మానికి మార్పులు చేర్పులు చేసే గురుతర బాధ్యత సద్గురువులు, పీఠాధిపతులపైనే ఉంది. ఈ భరత భూమిలో గుణము మరియు కర్మలను ఆధారంగా మనుషులకు కులము అనే ఒక లక్షణాన్ని ఇచ్చినా, అది జన్మతః అన్న దుష్ప్రచారంతో మనుషులలో హెచ్చు తగ్గులు అనే భావన మొదలయ్యింది. ఈ విష బీజం మహా వృక్షమైంది. సనాతన ధర్మ సాధకులను విడదీసింది. పరధర్మాలు దీనిని ఆసరగా తీసుకొని భారత దేశాన్ని దండెత్తాయి. మన ఆధ్యాత్మిక సంపదలను నాశనం చేసి, సిరిసంపదలను దోచుకొని మనలను నిర్వీర్యులను చేయటం మొదలు పెట్టారు. 

ఇటువంటి సమయంలో అన్నమాచార్యుల వారు భ్రష్టు పట్టిన కుల వ్యవస్థను సంస్కరించాలనే ఉద్దేశంతో బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే అని తన సంకీర్తనల ద్వారా ఎలుగెత్తి చాటారు. తిండి, నిద్ర, పంచ భూతములు అన్నీ రాజైనా, పేదైనా అందరికీ ఒకటే అన్న సందేశంతో కొన్ని వందల ఏళ్ల తరువాత భరతభూమిని పట్టి పీడించబొయే మహమ్మారి లక్షణాలను నిందించారు, నిజాన్ని పలికారు. 

ఇటువంటి సంఘ సంస్కర్త, అంతకన్నా మించి తన సంకీర్తనల ద్వారా మానవ జన్మ లక్ష్యాన్ని, సత్యాన్ని అద్భుతంగా పలికించిన సద్గురువులు తాళ్లపాక అన్నమాచార్యుల వారి జయంతి నేడు. అన్నమయ్య తత్త్వాన్ని దశాబ్దాల క్రితం మొట్ట మొదటి సారి తీవ్రమైన శ్రమతో, అకుంఠిత దీక్షతో ప్రచారం మొదలు పెట్టారు శ్రీమతి శోభారాజు గారు. దాని ఫలితమే నేటి అన్నమయ్య సంకీర్తనలకు గల ప్రాచుర్యం. ఏ గాయనీ గాయకుడు కూడా అన్నమయ్య కీర్తనలు పాడనిదే నేడు ఈ సమాజంలో గుర్తింపు పూర్తిగా పొందలేడు అన్నది నిజం. దీనికి బీజం అన్నమాచార్య భావనా వాహిని వేసినదే. ఇది అన్నమయ్య తత్త్వ ప్రచారంలో అద్భుతమైన పురోగతి. నేను మనస్ఫూర్తిగా దీనిని శోభారాజు గారికే ఆపాదిస్తున్నాను, అభినందిస్తున్నాను. 

ఎన్నో ఏళ్లుగా, అన్నమాచార్య భావనా వాహిని శోభారాజు గారి సారథ్యంలో అన్నమయ్య జయంతి, వర్ధంతి తిథులకు మహానగర సంకీర్తన నిర్వహిస్తోంది. చిక్కడపల్లి వేంకతేశ్వర స్వామి గుడి మొదలు ట్యాంక్ బండ్ పై అన్నమాచార్యుల వారి విగ్రహం వరకు సంకీర్తన చేస్తూ సాగే ఈ కళాకారుల, భక్తుల సమూహం మనలోని భావ కాలుష్యాన్ని తొలగించటానికి ఎంతో గొప్ప ప్రయత్నం చేస్తోంది. ఈ సందర్భంగా అందరికీ ఒక విజ్ఞప్తి - అన్నమాచార్యుల తత్త్వాన్ని నిజంగా అర్థం చేసుకొని, ఆచరించ గలిగితే ఆ కళాకారులతో పాటు మనలోని ప్రతి ఒక్కరమూ నిత్యము ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కొని అధిగమించి, ఆధ్యాత్మికోన్నతికి, తద్వారా సమాజాభ్యుదయానికి పాటు పడతామో డాక్టర్ శోభారాజు గారు ప్రతి శనివారం జరిగే స్వరార్చనలో, అన్నమయ్యపురంలో జరిగే ఇతర కార్యక్రమాలలో ఎంతో ప్రభావవంతంగా, అందరికీ అర్థమయ్యేలా వివరిస్తారు. ఈ అవకాశాన్ని అందరు ఉపయోగించుకోవలసినది. 

అన్నమాచార్యుల వారి 607వ జయంతి సందర్భంగా డాక్టర్ శోభారాజు గారి లక్ష్యం నెరవేరి, మనమందరం భావ కాలుష్యాన్ని దూరం చేసుకోవాలని నా ప్రార్థన, సంకల్పం. ఇటువంటి ఉత్తమమైన, పవిత్రమైన లక్ష్య సాధనకు పరమాత్మ, సద్గురువులు తమ అపారమైన అనుగ్రహాన్ని శోభారాజు గారికి, అన్నమాచార్య భావనా వాహినికి ప్రసాదించాలని ప్రార్థన.

కడు పుణ్యులను పాప కర్ములను సరి గావ జడియు శ్రీ వేంకటేశ్వరు నామమొకటే!
బ్రహ్మమొక్కటే! పరబ్రహ్మమొక్కటే!



అన్నమాచార్య భావనా వాహిని కార్యక్రమాల వివరాలు తెలుసుకోదలచిన వారు ఈ క్రింది చిరునామాలోని ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు. 

http://www.annamayya.org

ANNAMACHARYA BHAVANA VAHINI

ANNAMACHARYA SADANAM, (HiTex Road, Kondapur),
ANNAMAYYAPURAM, HYDERABD - 500084.


TEL : 91-40-23112299. 9848024042 FAX : 91- 40 - 2311242
Email - info2@annamayya.org

3, మే 2015, ఆదివారం

బాలమురళీరవం - ఓంకార ప్రణవ నాదోద్భవ



మంగళంపల్లి బాలమురళీకృష్ణ - పేరు వినగానే చిద్విలాసమైన మోము, అలవోకగా స్వరరసామృతాన్ని పలికించే నిత్యయవ్వన గళం, ఆయన తిల్లానాలు, ప్రయోగాలు, సుస్ఫష్టమైన తెలుగు ఉచ్ఛారణ - గుర్తుకు వస్తాయి. ఆయన 1930 జులై 6వ తేదీన ఇప్పటి తూర్పు గోదావరి జిల్లా రాజోలు తాలూకా శంకరగుప్తం గ్రామంలో పట్టాభిరామయ్య, సూర్యకాంతమ్మ దంపతులకు జన్మించారు. తల్లిదండ్రులు ఆయనకు మురళీకృష్ణ అని నామకరణం చేశారు. తండ్రి పట్టాభిరామయ్య  వేణువు, వీణ, వయోలిన్ వాయించేవారు. తల్లి కూడా వీణా ప్రావీణ్యం కలిగిన వారు. ఆ పిల్లవాడు జన్మించిన 15రోజులకే తల్లి మరణించటంతో తండ్రి పట్టాభిరామయ్య గారు పిల్లవాడితో విజయవాడ వెళ్లారు. బాలుడిలో ఉన్న సంగీత జిజ్ఞాస చూసి తండ్రి అతనిని ప్రఖ్యాత సంగీత విద్వాంసులు పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారి వద్ద శిక్షణకు చేర్పించారు. 

ముక్కుపచ్చలారని ఎనిమిదేళ్ల వయసులోనే బాలుడు మురళి విజయవాడ త్యాగరాజ ఆరాధనోత్సవాలలో కచేరీ చేశాడు. అతనిలోని ప్రతిభను గుర్తించిన ప్రఖ్యాత హరికథా కళాకారులు శ్రీ ముసునూరి సూర్యనారాయణమూర్తి భాగవతార్ గారు ఆయన పేరు ముందు బాల చేర్చారు. అప్పటినుండి బాలమురళీకృష్ణ ఆయన పేరుగా చెప్పుకోబడింది. ఆరవ తరగతితో విద్యాభ్యాసం ఆపివేసి పూర్తిగా సంగీతాభ్యాసంపై దృష్టిపెట్టిన బాలమురళీకృష్ణ గారు 15 ఏళ్ల వయసుకే 72 మేళకర్త రాగాలనూ నేర్చుకుని వాటిలో కృతులను స్వరపరచారు. గాత్ర సంగీతంతో పాటు వయోలిన్, మృదంగం, కంజీరలో కూడా ఆయన ప్రావీణ్యం పొందారు. లబ్ధప్రతిష్ఠులైన భీంసేన్ జోషీ, హరిప్రసాద్ చౌరాసియా వంటి హిందూస్థానీ విద్వాంసులతో జుగల్‌బందీ కచేరీలు చేశారు. ఇప్పటి వరకు ఆయన ప్రపంచం నలుమూలలా దాదాపుగా 25000 కచేరీలు చేశారు. 400కు పైగా అద్భుతమైన కృతులను రచించారు. ఎన్నో కొత్త రాగాలను కనిపెట్టారు. 

కర్ణాటక సంగీత ప్రస్థానంతో పాటు బాలమురళి గారు సినీ నటునిగా, నేపథ్య గాయకునిగా కూడా పేరొందారు. సంస్కృతం, తెలుగు, తమిళం, కన్నడ సినిమా రంగాలలో 400కు పైగా పాటలను పాడారు. ఎన్నో అవార్డులను పొందారు. 1960 దశకంలో విజయవాడ, హైదరాబాదు ఆకాశవాణి కేంద్రాలలో సంగీత దర్శకునిగా పనిచేస్తూ భక్తిరంజని కార్యక్రమం ద్వారా ఎన్నో అద్భుతమైన గీతాలను మనకు అందించారు. విజయవాడ సంగీత కళాశాలలో, తదుపరి చెన్నై సంగీత కళాశాలలో పని చేసి చెన్నైలో స్థిరపడ్డారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల ఆస్థాన విద్వాంసునిగా, తిరుమల తిరుపతి దేవస్థానం, బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం  మరియు  శృంగేరి శారదా పీఠంలో ఆస్థాన విద్వాంసునిగా పని చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయము, చెన్నై విశ్వవిద్యాలయము నుండి గౌరవ డాక్టరేట్ పట్టా పొందారు. ఎన్నో ప్రఖ్యాత విద్యాసంస్థలనుండి డి. లిట్  పట్టా పొందారు. 

నర్తకి, సునాదవినోదిని వంటి మరుగున పడ్డ ఎన్నో రాగాలను పునరుద్ధరించారు. మహతి, లవంగి, మనోరమ, మురళి, ఓంకారి, ప్రతిమధ్యమావతి, రోహిణి, సర్వశ్రీ, సుముఖం, సుష్మ, గణపతి, సిద్ధి, పుష్కర గోదావరి వంటి ఎన్నో కొత్త రాగాలను కనిపెట్టి స్వరపరచారు. మిలే సుర్ మేరా తుమ్హారా అనే అద్భుతమైన గీతం ద్వారా భారతీయ సమైక్యతను చాటారు. దూరదర్శన్‌లో స్వరరాగసుధ అనే కార్యక్రమం ద్వారా సినీ సంగీతంలో శాస్త్రీయ సంగీత పాత్రను వివరించి ప్రజలను అలరించారు. 

భారత ప్రభుత్వం వారి పద్మశ్రీ అవార్డును 1971లో, సంగీత కళానిధి బిరుదును 1978లో, పద్మవిభూషణ్ అవార్డును 1991లో పొందారు. అంతే కాకుండా, రోటరీ కాంటినెంటల్ సెంటినరీ అవార్డు 2004లో, భారత ప్రభుత్వం వారి నేషనల్ ఆర్టిస్ట్ ఆఫ్ ఇండియా అవార్డును 2004లో, కంచి కామకోటి పీఠం వారి జీవిత సాఫల్య పురస్కారాన్ని 2004లో, మాధవపెద్ది సత్యం అవార్డును 2003లో, మహారాష్ట్ర ప్రభుత్వం వారి ఉత్తమ వాగ్గేయకార అవార్డు 2003లో,నాదలయ శిరోమణి అవార్డు 2003లో, ఒడిషా ప్రభుత్వం వరి దేశ్ రత్న అవార్డును 2002లో,మధ్య ప్రదేశ్ ప్రభుత్వం వారి కాళిదాస్ సమ్మాన్ అవార్డును 2001లో, 2001లో తెలుగు విశ్వవిద్యాలయం వారి విశిష్ట పురస్కారాన్ని, గానయోగి పంచాక్షరేశ్వర అవార్డు 1999లో, బెజవాడ గోపాలరెడ్డి అవార్డు 1999లో, ఇందిరా ప్రియదర్శిని అవార్డు 1998లో, గాన కళాప్రపూర్ణ బిరుదును 1991లో, భారత రాష్ట్రపతి స్వర్ణ పతకాన్ని 1953లో పొందారు.  

సంగీత నాటక అకాడెమీ ఫెలోషిప్, కేంద్ర సంగీత నాటక అకాడెమీ, ఆంధ్రప్రదేశ్ మరియు కేరళ  ప్రభుత్వాల సంగీత నాటక అకాడెమీ అవార్డులు, రాజాలక్ష్మి ఫౌండేషన్ అవార్డు, హృదయనాథ్ మంగేష్కర్  అవార్డు, మహారాష్ట్ర గవర్నర్‌చే నేషనల్ ఇంటిగ్రేషన్ అవార్డు, యునెస్కో వారి గాంధీ మెమోరియల్ అవార్డు, కర్నాటక ప్రభుత్వం వారి పురందర ప్రశస్తి అవార్డు, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిచే ఆత్మ గౌరవం అవార్డు, జాతీయ స్థాయిలో ఉత్తమ నేపథ్య గాయకుడు (కన్నడ చిత్రం హంసగీతె), ఉత్తమ సంగీత దర్శకుని అవార్డు (సంస్కృత  చలన చిత్రం మధ్వాచార్య), ఆంధ్రప్రదేశ్ మరియు కేరళ ప్రభుత్వం వారి ఉత్తమ నేపథ్య గాయకుని అవార్డు తమ సుధీర్ఘమైన సంగీత ప్రస్థానంలో పొందారు. సంగీత యోగి శిరోమణి, సంగీత కళా శిఖామణి, భారత కళారత్న, ఇసై పెరరిఙ్గార్, గాన సార్వభౌమ, సంగీత కళా విశారద, భారత జ్యోతి, సంగీత  విద్యానిధి, మొట్టమొదటి సమకాలీన వాగ్గేయకారుడు, సంగీత కళారత్న,కళారత్న, సంగీత సాగర, నాదబ్రహ్మాం, గాయకరత్న, ఇసైసెల్వం, గంధర్వ గాన విశారద, గాన సుధాకర, సంగీత కళానిధి, సంగీత భూపతి, మధుర గాన రవళీకృష్ణ, సంగీత సార్వభౌమ, సంగీత మహోపాధ్యాయ, అన్నమాచార్య విద్వన్మణి, నాదయోగి, నాద సుధార్ణవ, అద్వితీయ శతాబ్ది గాయక, గంధర్వ గాన కళానిధి, వాగ్గేయకార వాచస్పతి, గాయక శిఖామణి,పుంభావ శారద, సంగీత సామ్రాజ్య సార్వభౌమ, సంగీత రత్నాకర, సంగీత విద్యా భాస్కర, సంగీత కళాసాగర, స్వరవిలాస,  సప్తస్వర సామ్రాట్, సంగీత కళా నిపుణ, కళా సేవా నిరత, సంగీత శారద వంటి 
ఎన్నో ప్రతిస్ఠాత్మకమైన బిరుదులను పొందారు, ఉన్నతమైన పదవులను అలంకరించారు. 

బాలమురళీకృష్ణగారి సంగీత ప్రస్థానంలో కొన్ని విశేషమైన సేవలు:

1. ఆయన రచించి స్వరపరచిన 10 తిల్లానాలు. ఒక్కొక్కటి ఒక్కో ఆణిముత్యం. అద్భుతమైన లయగతులతో, రాగలక్షణాలతో రచించబడిన ఈ తిల్లానాలు కర్ణాటక సంగీత సాంప్రదాయంలో తిల్లానాకు నిఘంటువులైనాయి.

2. త్యాగరాజస్వామి వారి పంచరత్న మరియు ఉత్సవ సాంప్రదాయ కీర్తనలు - ఘనరాగ పంచరత్న కీర్తనలను ఆయన ఆలపించిన పద్ధతి ప్రత్యేకమైనది. అలాగే, స్వామికి వివిధసేవలను వివరించే కీర్తనలు  బాలమురళి గారి అమృతగళంలో బహుళప్రాచుర్యం పొందాయి. 

3. భద్రాచల రామదాసు కీర్తనలను ప్రాచుర్యంలోకి తీసుకురావటంలో ఆయన పాత్ర విశేషమైనది. ఆయన ఆలపించిన రామదాసు కీర్తనలు దక్షిణాదిన ప్రతి యింటా వినబడతాయి. ఏ తీరుగ నను, పలుకే బంగారమాయెనా, తారకమంత్రము కోరిన దొరికెను, ఇదిగో భద్రాద్రి, పాభిరామప్రభో మొదలైనవి ఇంటిటా మారుమ్రోగుతూనే  ఉన్నాయి. 

4. సదాశివ బ్రహ్మేంద్రుల కీర్తనలు వీరి గాత్రంలో అమృతరస గుళికలలా జాలువారాయి. పిబరే రామరసం, స్థిరతా నహి నహిరే, గాయతి వనమాలి, చేతః శ్రీరామం, తుంగతరంగే మొదలైనవి ఎంతో పేరుపొందాయి. 

5. అద్భుతమైన ఆధ్యాత్మిక సందేశంతో సామాన్యులకు కూడా అర్థమయ్యే పదాలతో రచించబడిన తత్త్వాలు ఆయన గానంలో శాశ్వతత్వం పొందాయి. ఏమి సేతురా లింగా, వస్తా వట్టిదే పోతా వట్టిదే, నిని విడిసి యుండలేనయా మొదలైన తత్త్వాలు ఆయన పాడినవే. 

6. పురందరదాసుల వారి ఎన్నో కీర్తనలను ఆయన ప్రచారంలోకి తెచ్చారు. అలాగే, కొన్ని అన్నమాచార్యుల వారి కృతులను కూడా అద్భుతంగా గానం చేశారు. నారాయణ తీర్థుల తరంగాలను కూడా ఆయన పాడి జనబాహుళ్యంలోకి తెచ్చారు. 

7. అలాగే, కోలారు సమీపంలో గల కైవార అమరనారేయనుని కీర్తనలను, తమ మాతామహులైన ప్రయాగ రంగదాసు గారి కీర్తనలను ప్రచారంలోకి తీసుకు వచ్చారు. అమరనారేయనుని శ్రీకృష్ణాయను నామమంత్ర రుచి, చూడు చూడు అదిగో చుక్క, ప్రయాగ రంగదాసు గారి రాముడుద్భవించినాడు, రామరామ యనరాదా, కృష్ణమ్మా గోపాల బాల కృష్ణమ్మా మొదలైన ఎన్నో అద్భుతమైన సంకీర్తనలను ప్రచారం చేశారు. 

వీరు పాడిన కొన్ని ప్రముఖ సినీ గేయాలు: భక్త ప్రహ్లాద చిత్రంలో ఆది అనాదియు నీవే దేవా, సిరిసిరిలాలి చిన్నరి లాలి, నర్తనశాలలో సలలిత రాగసుధారస సారం, గుప్పెడు మనసు చిత్రంలో మౌనమే నీ భాష ఓ మూగ మనసా, మేఘసందేశం చిత్రంలో పాడనా వాణి కళ్యాణిగా, శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు కథలో వసంతగాలికి వలపులు, అందాలరాముడులో పలుకే బంగారమాయెనా, శ్రీరామాంజనేయ యుద్ధంలో మేలుకో శ్రీరామ, ముత్యాల ముగ్గులో శ్రీరామ జయరామ సీతారామ. 

86 ఏళ్ల వయసులో కూడా అద్భుతమైన గాత్రసంపదల కలిగిన బాలమురళీకృష్ణ గారి సంగీత ప్రతిభ అనన్య సామాన్యం, అనుపమానం. ఇప్పటికీ పసిపిల్లాడిలా నవ్వుతూ పాడే శైలి ఆయనది. ప్రిన్స్ రామవర్మ, డీవీ మోహనకృష్ణ గారు, కృష్ణకుమార్-బిన్నీ కృష్ణకుమార్ మొదలైన ఎందరో ప్రముఖ కళాకారులు వీరి శిష్యులు. వారికి భగవంతుడు శతాధిక వర్షముల ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగించి భారతీయ సంగీతానికి మరింత మార్గదర్శకులుగా ఉండే అవకాశం కలిగించాలని ప్రార్థన. బాలమురళీకృష్ణ  గారు రచించిన వర్ణాలలో ఒకటి ఓంకార ప్రణవ. దీని వివరాలు వారి వాగ్గేయకార ప్రతిభకు ఉదాహరణగా మీకోసం. 


ఓంకార ప్రణవ నాదోద్భవ శృతి లయ స్వర 
సాంకేతిక త్రిభువన శక్తి మురళీ గాన స్వరూపి

ప్రళయ జల వలయ పుటలలలో తేలెనదే వటపత్రం
శయనించు వరదుని నాభిని వదలిన కమల సంజనిత విధి ముఖ జనిత

పద నీరజములే నమ్మితి శాశ్వతమై సుఖమైనది 

గౌరీశ శ్రీశ విధీంద్ర త్యాగరాజాదివర్య సపర్యలందు

ప్రభవము విభవము లీనములు దశ దిశలు భూమి గగన పవనము 
సలిలమగ్ని నగ ఖగ తరు మృగాది సకలము కలుగు నీ దయవలన 

నీ నా యనెడు తారతమ్యములు మానగా సుగుణమిచ్చి
సహనము విరళ వితరణము నిజమును పల్కుటలు సదా తెలియగ
భరత భువిని జనులు కలిసి మెలసి సుఖముగా మరలుటే
మా ధ్యేయముగ సత్కర్మాచరణము భక్త్యానంద వరమిడు 

ఓంకారమనే ప్రణవ నాదం నుండి ఉద్భవించినవి సంగీత లక్షణాలు శృతి, లయ, స్వరము. ఈ సాంకేతిక అద్భుతంతో మూడు లోకాలకు శక్తిగా నిలిచి గాన రూపం యొక్క పద కమలాలనే నమ్మినాను. ప్రళయ సమయంలో  వటపత్రం ఆ సాగరాల కెరటాలలో నిలిచింది. దానిపై శ్రీమహావిష్ణువు వటపత్రశాయి రూపంలో శయనించి ఉన్నాడు. ఆతని నాభినుండి జనించిన కమలంలోనుండి బ్రహ్మ ఉద్భవించాడు. ఆతని ముఖమునుండి జనించినది నాద స్వరూపిణి సరస్వతి. శాశ్వతమైనది, సుఖమైనది అయిన ఆ నాద స్వరూపి పద చరణములను నేను నమ్మినాను. 

శివుడు, విష్ణువు, బ్రహ్మ, ఇంద్రుడు, త్యాగరాజు మొదలైన వారి సేవలందుకున్న ఆ నాదస్వరూపిణి పద కమలాలనే నేను నమ్మినాను. 

ప్రభవాది అరవై సంవత్సరములు, లీనములు, పది దిక్కులు, భూమి, ఆకాశము, వాయువు, నీరు, అగ్ని, భూమి, వృక్షజాతి, జీవరాశి అన్నీ నీ వలనే కలుగును. నీ నా అనే తారతమ్యము లేకుండా ఉండే సుగుణాన్ని ఇచ్చి, సహనము, విరాళంగా దానం చేసే బుద్ధి, ఎల్లప్పుడూ నిజమును పలుకుట తెలిపేది నీవు. ఈ భరత భూమిలో జనులు కలిసి మెలిసి మెలగుటే ధ్యేయంగా సత్కర్మను ఆచరించే బుద్ధిని, భక్తిని ఆనందాన్ని ప్రసాదించు నీ పదకమలములనే నమ్మితిని. 

డాక్టర్ బాలమురళీకృష్ణ గారి స్వీయ రచన ఇది. వర్ణ రూపంలో మనకు అందించారు ఆయన. అద్భుతమైన సాహిత్యం, సృష్టిలో నాదోద్భవం, మానవ జన్మ ధ్యేయము, శ్రేయము చాల సూక్ష్మంగా తెలిపారు ఆయన. శాశ్వతమైనది, సుఖమైనది ఏమిటో వివరించారు. వాగ్గేయకారుల లక్షణం ఆధ్యాత్మికతతో పాటు కర్తవ్య బోధ, సత్యప్రచారం కూడా. ఈ లక్షణాలన్నీ ఈ కృతిలో గుప్పించారు ఈ మహానుభావుడు. భరతభూమి గర్వించ దగ్గ మహోన్నత కళాకారులు బాలమురళి గారు. ఆయన రచనలను మరింత ప్రచారంలోకి తీసుకు రావలసిన ఆవశ్యకత ఎంతో ఉంది. సంగీత ప్రపంచంలో గానంతోనే కాదు సాహిత్యంతో కూడా సరస్వతీ సేవలో ముందున్నారు ఆయన. వారిలోని బహుముఖ ప్రజ్ఞకు శతసహస్ర వందనాలు. 

స్వీయరచన, వారి గాత్రంలో వినండి

బాలమురళి గారి గురించి నేను ఇదివరలో ప్రస్తావించిన వ్యాసాలు:

  1. తిల్లానాలు - బాలమురళీరవం
  2. నర్తనశాల  - సలలితరాగసుధారససారం 
  3. బాలమురళీరవం - శ్రీ సకల గణాధిప పాలయ మాం అనిశం
  4. కలినరులకు మహిమలు దెలిపిమి ఫలమనలేదా
  5. నిరవధి సుఖద నిర్మల రూప నిర్జిత ముని శాప
  6. తత్త్వము - ఏమి సేతురా లింగా
  7. ఎనభై ఏళ్ల బాలుడు బాలమురళి
  8. శ్రీకృష్ణాయను నామ మంత్ర రుచి 
  9. రామరామ యనరాదా 
  10. క్షీరసాగర విహారా  - ఉత్సవ సాంప్రదాయ కీర్తన 
  11. శ్రీనీలోత్పల నాయికే 

2, మే 2015, శనివారం

నిరవధి సుఖద నిర్మల రూప నిర్జిత ముని శాప



నిరవధి సుఖద నిర్మల రూప నిర్జిత ముని శాప 

శరధి బంధన నత సంక్రందన
శంకరాది గేయమాన సాధు మానస సుసదన

మామవ మరకతమణినిభ దేహ
శ్రీమణి లోల శ్రితజన పాల
భీమ పరాక్రమ భీమ కరార్చిత
తామస రాజస మానవ దూర త్యాగరాజ వినుత చరణ

అవధిలేని సుఖాన్ని ఇచ్చే వాడు, నిర్మలమైన రూపము కలవాడు, అహల్యకు శాపవిముక్తి కలిగించిన వాడు రాముడు. వారధిని నిర్మించిన వాడు, ఇంద్రునిచే నుతించబడిన వాడు, శంకరాదులచే స్తుతించబడిన వాడు, సాధు జనులు మనసులలో నివసించేవాడు రాముడు. మరకతమణి వలె ప్రకాశించే దేహము కలవాడు, లక్ష్మీదేవికి బద్ధుడైన వాడు, ఆశ్రితులను పాలించే వాడు, అత్యంత పరాక్రమవంతుడు, భీమునిచే పూజించ బడిన వాడు, మానవులను తామస రాజస గుణములనుండి దూరం చేసే వాడు, శివునిచే అర్చించ బడిన చరణములు కలవాడు రాముడు!

త్యాగరాజ స్వామి వారు రాముని ఎన్ని విధాల నుతించాడో? ఒక్కొక్క కీర్తనలో ఒక్కొక్క భావం, గుణ వర్ణనతో పాటు నిగూఢమైన ఆధ్యాత్మిక సందేశం కూడా అయన సంకీర్తనలలో ఉన్నాయి. అనంతమైన ఆనందాన్ని ఇచ్చే వాడు రాముడు అన్నది సారాంశం. దానికి నిర్మలమైన రూపం, అహల్య శాపవిముక్తి ఉపోద్ఘాతాలు. నిర్మలమైన రూపం ఎలా వచ్చింది? ధర్మానికి కట్టుబడటం వలన. ఎన్ని కష్టాలు వచ్చినా, తనకు నేర్పబడిన ధర్మాన్ని వీడలేదు. గౌతమముని సామాన్యమైన ఋషి కాదు. సకల విద్యా పారంగతుడు, అమిత తపోబల సంపన్నుడు. ఆయన శాపానికి గురైన అహల్య కొన్ని వందల ఏళ్లపాటు పాషాణమై నిలిచింది. రాముని ధర్మ బద్ధత, నిర్మల రూపం ఆ పాషాణానికి ప్రాణం పోసింది. అదీ రాముని గొప్పతనం. మనమందరమూ కూడా అటువంటి రాతిబండల బ్రతుకే గడుపుతాము చాలా మటుకు. మనకు నిజమైన జీవాన్ని ఇచ్చేది రాముని వంటి ధర్మ బద్ధతే. ఆయన జీవితాన్ని అర్థం చేసుకొని వీలైనంత నిర్మలంగా ఉండి ధర్మాన్ని పాటిస్తే, ఈ పాషాణపు హృదయాలు కరిగి జీవి ఉన్నతిని పొందుతాడు. రాముని జీవితాన్ని గమనించి ధర్మాన్ని పాటిస్తే మనలోని రాజస తామస గుణాలు నశిస్తాయి.

త్యాగరాజస్వామి అనుభవంతో, అనుభూతులతో రాసిన ఇటువంటి సంకీర్తనలు మనలను సరైన మార్గంలో పెట్టాలి..మనం కూడా అవధిలేని సుఖాన్ని అనుభవించాలి. ఈ దుర్లభమైన మానవ జన్మకు సార్థకత కలిగించాలి.

సద్గురువులు కాకర్ల త్యాగబ్రహ్మ స్వామి వారికి శతసహస్ర వందనాలు. డాక్టర్ బాలమురళీకృష్ణ గారి గళంలో ఈ కృతి వినండి

1, మే 2015, శుక్రవారం

శివపాదములుంచ నేను శిలనైనను కారాదా




శివపాదములుంచ నేను శిలనైనను కారాదా
కైలాసపు స్వామి మరల కలనైనను రారాదా

పూవునైన కాబోనా పూజకైన నేలేనా
కలత కనులు కరిగి ప్రభువుకభిషేకము కారాదా

కంటి పాప గంట విలును వింటి దారి నందిదేమో
ఎద నీ చిరు గజ్జె మ్రోత చెవులేమో ఢమరుకలౌ

వెలుగు దారిని వినువీధిని కనులేగును నీ కొరకై
మబ్బు వెంట మలుపు వెంట మనసులోని పిలుపు వెంట
నీవె నీవె మృత్యుంజయా నిలిచిపోగ రారాదా

పరమాత్మ కోసం తపిస్తున్న భక్తుని వేదన ఈ లలిత భక్తి గీతంలో అద్భుతంగా వ్యక్త పరచారు దేవులపల్లి వారు. అంతే అద్భుతంగా పాడారు వేదవతీ ప్రభాకర్ గారు. ఇంతటి సున్నితమైన భావం కలిగిన లలిత గీతాలను మరచిపోయాము, లలిత సంగీతాన్ని అణగదొక్కి రాళ్లవానలా ఉండే సినీసంగీతానికి పట్టం కట్టాము. మనలను మనం రాతిబండలను చేసుకున్నాము. సున్నితమైన భావమంటే ఒక బలహీనత అన్న అధః పాతాళపు ఆలోచనా సరళికి చేరుకున్నాము.

ఇలాంటి గీతాలు విన్నప్పుడల్లా ఈ రాతి హృదయాలు కొంత స్పందించి కరగుతాయేమో అన్న ఆశ. మనిషి మనిషిగా అవుతాడేమో అన్న ఆశ.

వెడలెను కోదండపాణి - త్యాగరాజస్వామి కృతి

వెడలెను కోదండపాణి అనుజ సౌమిత్రితో గూడి పుడమిలో జనులెల్ల పొగడ పూజితుడౌ మునితో గూడి శిరమన కొండెయు జార  వురమున హారములు మెరయ కరమున శరచాపములును ఘ...