12, డిసెంబర్ 2010, ఆదివారం

గోవిందాష్టకం - తాత్పర్యము

గోవిందం పరమానందం అంటూ ఆదిశంకరులు ఆ లీలామానుష రూపమైన శ్రీ కృష్ణుని పరి పరి వర్ణించే స్తోత్రము గోవిందాష్టకం. ఆ మన మోహనుని సుందర రూపము చూడ వేయి కన్నులు చాలవు. ముఖ్యంగా ఇస్కాన్ మరియు ఉత్తర భారత దేశంలోని మందిరాలలో రాధాకృష్ణుల మూర్తులు వర్ణనకు అందని సౌందర్యము, లావణ్యము, ప్రశాంతతతో శోభిల్లుతుంటాయి. ఆ విగ్రహాలను చూస్తే మనసులో ప్రేమ, భక్తి పొంగిపొరలుతుంది. అదే ఆ రాధాకృష్ణుల తత్త్వములో ఉన్న  సమ్మోహనా శక్తి.

ఈ గోవిందాష్టకంలో శంకరులు కృష్ణావతార  లీలలను, వాటిలోని ఆధ్యాత్మికతను మనోహరంగా నుతించారు. కృష్ణ భక్తిలో ఉన్న ప్రేమ తత్త్వము, కొంటెతనము చాటున దాగి ఉన్న ఆధ్యాత్మిక సంపద,  సామాన్య మానవులకు పరమార్థాన్ని, కర్తవ్యాన్ని బోధించే స్పష్టత, విపులత మరే అవతారము లోను కనిపించదు. మీలో ఒకడిని అంటూ జీవన రథ సారథిగా నిలిచిన ఆ పరమాత్మ అందుకే జగద్గురువుగా  కొలవబడ్డాడు.

శంకర  భగవత్పాద విరచిత గోవిందాష్టకం సాహిత్యం, తాత్పర్యము, ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారి మధుర స్వరంలో శ్రవణం.


సత్యం జ్ఞానమనంతం నిత్యమనాకాశం పరమాకాశం
గోష్ఠప్రాంగణరింఖణలోలమనాయాసం పరమాయాసం
మాయాకల్పితనానాకారమనాకారం భువనాకారం
క్ష్మాయా నాథమనాథం ప్రణమత గోవిందం పరమానందం

మృత్స్నామత్సీహేతి యశోదాతాడనశైశవ సంత్రాసం
వ్యదితవక్త్రాలోకితలోకాలోకచతుర్దశలోకాలిం
లోకత్రయపురమూలస్తంభం లోకాలోకమనాలోకం
లోకేశం పరమేశం ప్రణమత గోవిందం పరమానందం

త్రైవిష్టపరిపువీరఘ్నం క్షితిభారఘ్నం భవరోగఘ్నం
కైవల్యం నవనీతాహారమనాహారం భువనాహారం
వైమల్యస్ఫుటచేతోవృత్తివిశేషాభాసమనాభాసం
శైవం కేవలశాంతం ప్రణమత గోవిందం పరమానందం

గోపాలం ప్రభులీలావిగ్రహగోపాలం కులగోపాలం
గోపీఖేలనగోవర్ధనధృతిలీలాలాలితగోపాలం
గోభిర్నిగదిత గోవిందస్ఫుతనామానం బహునామానం
గోపీగోచరపథికం ప్రణమత గోవిందం పరమానందం

గోపీమండలగోష్ఠిభేదం భేదావస్థమభేదాభం
శశ్వద్గోఖురనిర్ఘూతోద్ధతధూలీధూసరసౌభాగ్యం
శ్రద్ధాభక్తిగృహీతానందమచింత్యం చింతితసద్భావం
చింతామణిమహిమానం ప్రణమత గోవిందం పరమానందం

స్నానవ్యాకులయోశిద్వస్త్రముపాదాయాగముపారూఢం
వ్యదిత్సంతిరథ దిగ్వస్త్రా హ్యుపుదాతుముపాకర్షంతం
నిర్ధూతద్వయశోకవిమోహం బుద్ధం బుద్ధేరంతస్థం
సత్తామాత్రశరీరం ప్రణమత గోవిందం పరమానందం

కాంతం కారణకారణమాదిమనాదిం కాలమనాభాసం
కాలిందీగతకాలియశిరసి ముహుర్నృత్యంతం నృత్యంతం
కాలం కాలకలాతీతం కలితాశేషం కలిదోషఘ్నం
కాలత్రయగతిహేతుం ప్రణమత గోవిందం పరమానందం

బృందావనభువి బృందారకగణబృందారాధ్యం వందేఽహం
కుందాభామలమందస్మేరసుధానందం సుహృదానందం
వంద్యాశేషమహామునిమానసవంద్యానందపదద్వంద్వం
వంద్యాశేషగుణాబ్ధిం ప్రణమత గోవిందం పరమానందం

గోవిందాష్టకమేతదధీతే గోవిందార్పితచేతా యో
గోవిందాచ్యుత మాధవ విష్ణో గోకులనాయక కృష్ణేతి
గోవిందాంఘ్రిసరోజధ్యానసుధాజలధౌతసమస్తాఘో
గోవిందం పరమానందామృతమంతఃస్థం స తమభ్యేతి

ఇతి శ్రీమచ్ఛంకరాచార్యవిరచితం శ్రీగోవిందాష్టకం సంపూర్ణం

తాత్పర్యము:

 సత్యము, జ్ఞానము, అనంతము, నిత్యము, ఆకాశాన్ని మించిన వాడు,  అన్నిటినీ మించిన వాడు, గోకులములో సంచరించే వాడు, ఎటువంటి ప్రయత్నమూ అవసరము లేని వాడు, అన్నిటికన్నా ఎక్కువ శ్రమ ఐన వాడు, మాయా రూపములో వివిధ రూపములలో ఉండేవాడు, ఆకారము లేని వాడు,  విశ్వాకారుడు, భూమి మీద అవతరించిన వాడు, నాథుడు లేని వాడు, పరమానందము అయిన గోవిందుని నుతించుము.

యశోద దెబ్బలకు భయపడి పారిపోబోయి, దొరికినంత, మన్ను తిన్నావా అని తల్లి అడిగినంత, నోటంతా పదునాలుగు భువనాలను చూపించిన, ముల్లోకాలకు మూల స్తంభమైన వాడు, లోకప్రకాశకుడు, లోకానికి అధిపతి, పరమేశ్వరుడు,  పరమానందము అయిన గోవిందుని నుతించుము.

రాక్షసులను సంహరించే వాడు, భూ భారాన్ని తగ్గించే వాడు, భవ రోగములను తగ్గించే వాడు, ముక్తిని ప్రసాదించే వాడు, వెన్నను తినే వాడు, ఆహారము అక్కర లేని వాడు, లోకానికి ఆహారమైన వాడు (ఆహార రూపుడు), విమలమైన మనస్సులలోని విశేషమైన స్థితిలో కనిపించే వాడు, పూర్తిగా దృశ్యము కాని వాడు,  శివుని ప్రస్తుతించే వాడు, ఎల్లప్పుడూ శాంతముగా, పవళించి ఉండే వాడు,   పరమానందము అయిన గోవిందుని నుతించుము.

గోపాలుడు, లీలామానుష విగ్రహుడు, యదువంశములో జన్మించిన వాడు, గోపికలతో ఆడి , గోవర్ధన గిరిని ఎత్తి గోకులాన్ని తన లీలలలో ముంచెత్తిన వాడు,  కామధేనువుచే మచ్చలేని 'గోవింద' అనే నామము పొందిన వాడు, అనేక నామములు కలవాడు, గోపికల గోచరానికి అందని వాడు,   పరమానందము అయిన గోవిందుని నుతించుము.

గోపికల సమూహంలోకి వెళ్లే వాడు, సచ్చిదానందమై వారికందని స్థితిలో వారిమధ్య ఉండే వాడు, గోధూళి వలన ద్విగుణీకృతమైన సౌందర్యము కలవాడు, భక్తిని ఆనందముగా స్వీకరించే వాడు, కారణానికి అందని వాడు, సద్బుద్ధికి కారణమైన వాడు, మహిమలలో చింతామణి వంటి వాడు, పరమానందము అయిన గోవిందుని నుతించుము.

చెట్టుపై కూర్చుని స్నానమాడుతున్న గోపికల వస్త్రములు దోచిన వాడు, వస్త్రముల కొరకు తన దగ్గరకు రమ్మనిన వాడు, శోకము, వ్యామోహం లేని వాడు, జ్ఞాని, జ్ఞానుల హృదయములో నివసించువాడు, సత్తమాత్రమైన వాడు, పరమానందము అయిన గోవిందుని నుతించుము.

కాంతియైన వాడు, కారణానికే కారణుడు, విశ్వానికి కారకుడు, మొదలు లేని వాడు, కాలానికి గతి అయిన వాడు, అప్రకాశుడు, కాళింది మడుగున కాళీయుని పై నర్తించిన వాడు, కాలుడు, మరణానికి అతీతుడు (కాలాతీతుడు), నిరాకారుడు, కలియుగ దోషాలను పోగొట్టే వాడు, భూత, భవిష్యద్వర్తమానములకు   కారణమైన వాడు, పరమానందము అయిన గోవిందుని నుతించుము.

బృందావనములో వ్రజ భూమి యొక్క గణముల సమూహములో విలసిల్లే వాడు, దేవతలు, బృందచే ప్రార్ధించ బడిన వాడు, మల్లె పూవు వంటి చిరునవ్వుతో అమృతమును చిందించే వాడు, స్నేహితులకు ఆనందము కలిగించే వాడు, అందరికీ వంద్యమైన పాదపద్మములు కలవాడు, సర్వ లక్షణ సంపన్నుడు, పరమానందము అయిన గోవిందుని నుతించుము.

ఎవరైతే గోవిందునికి మనసు సమర్పించి,  గోవింద, అచ్యుత, మాధవ, విష్ణు, గోకులనాయక, కృష్ణ అనే నామములతో నుతించి, ఆయన పాదపద్మములను పూజించుట వలన పాప ప్రక్షాళనము పొంది, గోవిందాష్టకం నుతిస్తారో, వారు గోవిందునితో ఏకమై పరమానందమును పొందుదురు.

9, డిసెంబర్ 2010, గురువారం

శ్రీమన్నారాయణీయం - ద్వితీయ స్కంధము, తాత్పర్యము

శ్రీమన్నారాయణీయం ద్వితీయ స్కంధము


నాలుగవ దశకము: అష్టాంగయోగ, యోగ సిద్ధి వర్ణనము

కల్యతామ్ మమ కురుష్వ తావతీం కల్యతే భవదుపాసనం యయా|
స్పష్టమష్టవిధయోగచర్యయా పుష్టయాఽఽశు తవ తుష్టిమాప్నుయామ్ || ౪-౧


ఓ కృష్ణా! నిన్ను భక్తితో ఉపాసన చేయుటకు కావలసిన ఆరోగ్యమును నాకు ప్రసాదించుము. ఆష్టాంగ యోగమును సరియైన విధములో అనుష్ఠించుట చే నీ కృప త్వరగా పొందగలను అని విశ్వసిస్తున్నాను.

బ్రహ్మచర్యదృఢతాదిభిర్యమైరాప్లవాదినియమైశ్చ పావితాః|
కుర్మహే దృఢమమీ సుఖాసనం పంకజాద్యమపి వా భవత్పరాః || ౪-౨


ప్రభూ!  నీ భక్తులమైన మేము దృఢమైన బ్రహ్మచర్యము, స్నానము మొదలైన నియమములతో పవిత్రులమై, సుఖాసనము లేదా పద్మాసనము లో స్థిరముగా కూర్చొని యోగమును అభ్యసిస్తాము.

తారమంతరనుచింత్య సంతతం ప్రాణవాయుమభియమ్య నిర్మలాః|
ఇంద్రియాణి విషయాదథాపహృత్యాఽఽస్మహే భవదుపాసనోన్ముఖాః || ౪-౩


ఓ కృష్ణా! మనసులో ఓంకారము ధ్యానించుచు ప్రాణాయామము చేయుచు ప్రాణవాయువును బంధించి నిర్మలమైన మనసుతో ఇంద్రియములను విషయములనుండి మరల్చి నీ ఉపాసన చేయుదుము.

అస్ఫుటే వపుషి తే ప్రయత్నతో ధారయేమ ధిషణాం ముహుర్ముహుః|
తేనభక్తిరసమంతరార్ద్రతాముద్వహేమ భవదంఘ్రిచింతకాః || ౪-౪


ఓ కృష్ణా! నీ స్వరూపమును మేము ధ్యానిస్తున్నాము. ఆ రూపము మాకు స్పష్టముగా కనుపించుట లేదు. కావున, బుద్ధి, ప్రయత్న పూర్వకముగా ధారణ చేసెదము. ఈ సాధన వలన, నీ పాదములను ఎల్లప్పుడూ స్మరించుట వలన భక్తి రసములో మునిగి తేలుతూ ఉంటాము.

విస్ఫుటావయవభేదసుందరం త్వద్వపుస్సుచిరశీలనావశాత్|
అశ్రమం మనసి చింతయామహే ధ్యానయోగనిరతాస్త్వదాశ్రయాః || ౪-౫||


నీ పదములను ఆశ్రయించి, ఎంతో కాలము ధారణము చేయుచు, ధ్యానయోగములో ఉందుము. దాని వలన, ఎంతో మనోహరమైన నీ రూపము మా హృదయములలో స్థిరముగా నిలిచి యుండును. అప్పుడు ఎట్టి శ్రమ లేకుండానే నీ స్వరూపమును మనసులో ధ్యానించెదము.

ధ్యాయతాం సకలమూర్తిమీదృశీమున్మిషన్మధురతాహృతాత్మనామ్|
సాంద్రమోదరసరూపమాంతరం బ్రహ్మరూపమయి తేఽవభాసతే || ౪-౬||


ఓ పరబ్రహ్మా! అన్ని కళలతో శోభిల్లుతున్న నీ మూర్తిని ధ్యానించు వారి హృదయములలో అది కనిపించుటచే వారు పరవశులగుదురు. అప్పుడు సచ్చిదానందమైన నీ పరబ్రహ్మ స్వరూపము వారి హృదయములలో ప్రకాశించును.

తత్సమాస్వదనరూపిణీం స్థితిం త్వత్సమాధిమయి విశ్వనాయక|
ఆశ్రితాః పునరతః పరిచ్యుతావారభేమహి చ ధారణాధికమ్ || ౪-౭||


ఓ విశ్వనాయకా! సర్వాంగ శోభితమైన నీ స్వరూపమునందే మా మనస్సులు ఎల్లప్పుడూ లగ్నమై యుండుటచే సమాధి స్థితిని పొందెదము. ఏ కారణం వల్లనైన ఆ స్థితి నుండి జారినచో మరల నీ పాదములను ఆశ్రయించు, ధారణ ధ్యానము మొదలగు వాటిని ఆరంభించెదము.

ఇత్థమభ్యసననిర్భరోల్లసత్వత్పరాత్మసుఖకల్పితోత్సవాః|
ముక్తభక్తకులమౌలితాం గతాః సంచరేమ శుకనారదాదివత్ || ౪-౮||


ఓ కృష్ణా! అనన్యమైన భక్తితో సాధన చేయటం వలన అమితమైన సుఖమనే అనుభూతిలో ఓలలాడుతాము. అప్పుడు జీవించే ముక్తిని పొంది శుకుడు, నారదుని వలె సంచరిస్తాము.

త్వత్సమాధివిజయే తు యః పునర్మంక్షు మోక్షరసికః క్రమేణ వా|
యోగవశ్యమనిలం షడాశ్రయైరున్నయత్యజ సుషుమ్నయా శనైః || ౪-౯


ఓ పరమాత్మా! ఈ విధముగా సమాధి స్థితిని పొందటంలో పూర్తిగా సఫలమైన తర్వాత లేక కాలక్రమములో మోక్షగాముల మగుదుము. అప్పుడు ఆష్టాంగ యోగము ద్వారా ప్రాణ వాయువును స్వాధీనమునకు తెచ్చుకొని మూలాధారము మొదలగు చక్రములను, సుషుమ్న అను నాడి ద్వారా మెలమెల్లగా శిరస్సులో ఉన్న బ్రహ్మరంద్రము వరకు తీసుకొని వచ్చెదము.

లింగదేహమపి సంత్యజన్నథో లీయతే త్వయి పరే నిరాగ్రహః|
ఊర్ధ్వలోకకుతుకీ తు మూర్ధతస్సార్ధమేవ కరణైర్నిరీయతే || ౪-౧౦||


ఓ కృష్ణా! ఇట్టి సమాధి స్థితిలో ముక్తిని కోరుకునే వారు సూక్ష్మ శరీరమును కూడ విడిచి, పరమాత్మవైన నీలో లీనమగుదురు. అదే సాయుజ్యము. ఈ విధముగా కాకుండా మరికొందరు బ్రహ్మలోకము మొదలగు పైలోకాల వైభవమును చూడ కుతూహల పడు వారు ప్రాణములను బ్రహ్మరంధ్రము ద్వారా వదిలి, ఇంద్రియములతో కూడిన సూక్ష్మ శరీరముతో ఆయా లోకములలో విహరించు చున్నారు.

అగ్నివాసరవలర్క్షపక్షగైరుత్తరాయణజుషా చ దైవతైః|
ప్రాపితో రవిపదం భవత్పరో మోదవాన్ ధ్రువపదాంతమీయతే || ౪-౧౧||


స్వామీ! సాయుజ్యమును కోరేవారు అగ్ని, వాసర, శుక్ల పక్ష, ఉత్తరాయణ అధిష్టాన దేవతల ద్వారా సూర్యలోకమును పొందుదురు. అక్కడ ఎల్లప్పుడూ నీ పరాయణులై ధ్రువ పదమును చేరుతారు.

ఆస్థితోఽథ మహరాలయే యదా శేషవక్త్రదహనోష్మణాఽఽర్ద్యతే|
ఈయతే భవదుపాశ్రయస్తదా వేధసః పదమతః పురైవ వా || ౪-౧౨||


ఓ ప్రభూ! ధ్రువ మండలము చేరిన తర్వాత నిన్ను ఆశ్రయించి యున్న భక్తుడు మహర్లోకము చేరుకొనును. అక్కడినుంచి పోవునప్పుడు ఆదిశేషుని వేయి ముఖముల నుండి వెలువడే అగ్నిజ్వాలలు అతనిని దహించును. అలా మగ్గుతూ క్రమముగా బ్రహ్మదేవుడు నివశించే సత్యలోకమును చేరుకొనును. నీ అనుగ్రహము వలన ఆ భక్తుడు ఆదిశేషుని అగ్నిజ్వాలలో పడి బాధలు చెందకుండా ముందుగానే బ్రహ్మలోకమును కూడ చేరుకొనవచ్చు.

తత్ర వా తవ పదేఽథవా వసన్ ప్రాకృతప్రళయ ఏతి ముక్తతాం |
స్వేచ్ఛయా ఖలు పురాఽపి ముచ్యతే సంవిభిద్య జగదండమోజసా || ౪-౧౩


ఓ పరమాత్మా! బ్రహ్మలోకమగు సత్యలోకమున లేక నీవున్న విష్ణులోకములో ఉండి బ్రహ్మ ప్రళయము ఏర్పడినప్పుడు బ్రహ్మదేవునితో కలసి నీ భక్తుడు ముక్తిని పొందును. లేక బ్రహ్మాది లోకములందు అతడు విరక్తుడైనచో మహా ప్రళయమునకు ముందే యోగబలముచేత బ్రహ్మాండ భాండమును భేదించుకొని మోక్షమును పొందును.

తస్య చ క్షితిపయోమహోనిలద్యోమహత్ప్రకృతిసప్తకావృతీః |
తత్తదాత్మకతయా విశన్ సుఖీ యాతి తే పదమనావృతమ్ విభో || ౪-౧౪


ప్రభూ! యోగి భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశమనే పంచభూతములు, మహాత్తత్వము మూల ప్రకృతి అను బ్రహ్మాన్డమునకు సంబంధించిన ఏడు ఆవరణములందు ఆయా ఆవరణ రూపమున ప్రవేశించును. అచ్చట పరమానందము అనుభవించి చివరకు ఎట్టి ఆవరణము లేని నీవు ఉండు ప్రదేశమును చేరుకొనును.

అర్చిరాదిగతిమీదృశీం వ్రజన్ విచ్యుతిం న భజతే జగత్పతే |
సచ్చిదాత్మక భవద్గుణోదయానుచ్చరంతమనిలేశ పాహి మామ్ || ౪-౧౫||


జగన్నాయకా! సచ్చిదానంద స్వరూపా! గురువాయురప్పా! శ్రీ కృష్ణా! ఈ విధముగా తేజో మార్గమున పోయిన యోగీశ్వరుడు అక్కడ చ్యుతి లేనివాడై పునర్జన్మను ఏ మాత్రము పొందడు. ఈ విధముగా నీ కళ్యాణ గుణగణములను గానము చేయుచున్న నన్ను రోగాది బాధలనుండి కరుణతో రక్షింపుము.

ఐదవ దశకము - విరాట్పురుషోత్పత్తి

వ్యక్తావ్యక్తమిదం న కించిదభవత్ప్రాక్ప్రాకృతప్రక్షయే
మాయాయామ్ గుణసామ్యరుద్ధవికృతౌ త్వయ్యాగతాయాం లయమ్|
నో మృత్యుశ్చ తదామృతం చ సమభూన్నాహ్నో న రాత్రేః స్థితి-
స్తత్రైకస్త్వమశిష్యథాః కిల పరానందప్రకాశాత్మనా || ౫-౧||


ప్రాకృత ప్రళయ సమయమందు త్రిగుణములు సమానమైన స్థితిలో ఉండును. ఆ సమయములో ప్రకృతి (మాయ) నీలో విలీనమగును. అప్పుడు కారణ రూపమైన అవ్యక్తము (సూక్ష్మ ప్రకృతి) కార్య రూపమైన వ్యక్తము (స్థూల ప్రపంచము) రెండు ఉండవు. అట్టి మహా ప్రళయ సమయమున మృత్యువు గానీ, అమృతం గానీ, పగలు రాత్రి గానీ ఏమి ఉండవు. కానీ, ఆ సమయమున నీవొక్కడవే పరబ్రహ్మ రూపమున ఉందువని వేదములు తెలుపుచున్నవి.

కాలః కర్మగుణాశ్చ జీవనివహా విశ్వం చ కార్యం విభోః
చిల్లీలారతిమేయుషి త్వయి తదా నిర్లీనతామాయయుః|
తేషాం నైవ వదంత్యసత్త్వమయి భో శక్త్యాత్మనా తిష్ఠతాం
నో చేత్ కిం గగనప్రసూనసదృశాం భూయో భవేత్సంభవః || ౫-౨||


ఓ స్వామీ! మహా ప్రళయ సమయమున కాలము, కర్మ, త్రిగుణములు, జీవులు, ప్రపంచము మొదలైనవన్నీ ఆత్మానుసంధానమున మునిగి యున్న నీలో విలీనమగుచున్నవి. అంత మాత్రమున అవి అసలు లేనే లేవు యన రాదు. అవి అన్నియు అమూర్తశక్తి రూపమున నీ లో అణగి యున్నవి. ఆకాశ పుష్పములవలె అవి ఏ మాత్రము లేవని అనినచో తరువాత అవి తిరిగి పుట్టుట అనునది ఏ విధముగానూ సంభవం కాదు కదా!

ఏవం చ ద్విపరార్ధకాలవిగతావీక్షాం సిసృక్షాత్మికాం
విభ్రాణే త్వయి చుక్షుభే త్రిభువనీభావాయ మాయా స్వయమ్|
మాయాతః ఖలు కాలశక్తిరఖిలాదృష్టం స్వభావోఽపి చ
ప్రాదుర్భూయ గుణాన్వికాస్య విదధుస్తస్యాస్యాస్సహాయక్రియామ్ || ౫-౩||


ఈ విధముగా మహాప్రళయము బ్రహ్మయొక్క ఆయుర్దాయమనదగిన ద్విపరార్ధ కాలముండును. ఆ ప్రళయ కాలము గడిచిన తర్వాత నీవు ఈ చరాచర సృష్టి చేయదలచి ఒక్కసారి చూచెదవు. ఆ సమయమున నీ మాయ విశ్వసృష్టికి తనంతట తాను క్షోభము చెందును. అనగా త్రిగుణముల సామ్యావస్థ (equilibrium) నశించును. అప్పుడు మాయవలన కాలము, శక్తి, పాపపుణ్య రూపమైన అదృష్టము, స్వభావమనునవి ఏర్పడి త్రిగుణములు వికసించి సృష్టి క్రియ యందు మాయకు తోడ్పడుచున్నవి.

మాయాసన్నిహితోఽప్రవిష్టవపుషా సాక్షీతి గీతో భవాన్
భేదైస్తాం ప్రతిబింబితో వివిశివాన్ జీవోఽపి నైవాపరః|
కాలాదిప్రతిబోధితాఽథ భవతా సంచోదితా చ స్వయం
మాయా సా ఖలు బుద్ధితత్వమసృజద్యోఽసౌ మహానుచ్యతే || ౫-౪||


ఓ భగవాన్! నీ మాయ సృష్ట్యాది కార్యక్రమములను నెరవేర్చును. కానీ నీవు మాత్రము ఆ మాయతో ఎట్టి సంబంధము లేక సర్వ సాక్షిగా ఉందువు. నీవే మాయ యందు  ప్రతిబింబించి జీవుడనే పేరుతో ప్రసిద్దుడవైనావు. జీవుడు నీ ప్రతిబింబమే తప్ప వేరే కాదు. కళాశక్తి, అదృష్టము మొదలగు వానిచే ప్రతిబోధింప బడిన మాయ, విశ్వసృష్టి చేయవలెనను నీ చూపు చేత ప్రేరేపించ బడి, మొట్ట మొదట బుద్ధి తత్త్వమును సృష్టించినది. దీనినే మహత్తత్త్వ మందురు. 

తత్రాసౌ త్రిగుణాత్మకోఽపి చ మహాన్ సత్వప్రధానః స్వయం
జీవేఽస్మిన్ ఖలు నిర్వికల్పమహమిత్యుద్బోధనిష్పాదకః|
చక్రేఽస్మిన్ సవికల్పబోధకమహంతత్వం మహాన్ ఖల్వసౌ
సమ్పుష్టం త్రిగుణైస్తమోఽతిబహులం విష్ణో భవత్ప్రేరణాత్ || ౫-౫||


ఓ విష్ణో! ఈ మహత్తత్త్వమున త్రిగుణములు ఉన్నప్పటికీ, అది సత్వగుణ ప్రధానమై జీవుని యందు నిర్వికల్పమైన "అహం" తత్త్వమును కలిగించినది. తరువాత మహత్తత్త్వము నీ ప్రేరణ వలన జీవునియందు సవికల్పమైన, తమోగుణ ప్రధానమైన "అహం" తత్త్వమును పుట్టించు చున్నది. ఈ తమోగుణ ప్రధానమైన అహం తత్త్వములో నేను నీవు అను భేద బుద్ధి కనిపించును.

సోఽహం చ త్రిగుణక్రమాత్ త్రివిధతామాసాద్య వైకారికో
భూయస్తైజసతామసావితి భవన్నాద్యేన సత్వాత్మనా|
దేవానింద్రియమానినోఽకృత దిశావాతార్కపాశ్యశ్వినో
వహ్నీంద్రాచ్యుతమిత్రకాన్ విధువిధిశ్రీరుద్రశారీరకాన్ || ౫-౬||


ఈ సవికల్పమైన అహంతత్త్వము సత్త్వ, రజస్, తమము అను త్రిగుణములను అనుసరించి, మూడు విధములగుచున్నది. వీటిలో మొదటిదైన సాత్త్విక అంశ వలన జ్ఞానేన్ద్రియములకు అధిదేవతలైన దిక్కు, వాయువు, సూర్యుడు, వరుణుడు, అశ్వినీ దేవతలు అనువారును, అట్లే కర్మేన్ద్రియములకు అధిదేవతలైన అగ్ని, ఇంద్రుడు, ఉపేంద్రుడు, మిత్రుడు, ప్రజాపతి అనువారును, మరియు మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము అంతఃకరణ చతుష్టయమునకు అధిదేవతలైన చంద్రుడు, బ్రహ్మ, రుద్రుడు, క్షేత్రజ్ఞుడు అనువారు పుట్టిరి.

భూమన్మానసభుద్ధ్యహంకృతిమిళచ్చిత్తాఖ్యవృత్యన్వితం
తచ్చాంతఃకరణం విభో తవ బలాత్ సత్వాంశ ఏవాసృజత్|
జాతస్తైజసతో దశేంద్రియగణస్తత్తామసాంశాత్పున-
స్తన్మాత్రం నభసో మరుత్పురపతే శబ్దోఽజని త్వద్బలాత్ || ౫-౭||


ప్రభూ! గురువాయుపుర పతి! శ్రీ కృష్ణా! నీ ప్రేరణ వలన సత్త్వాంశ మైన సాత్త్వికాహంకారము వలన మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము అను అంతఃకరణ చతుష్టయము పుట్టినది. అట్లే రాజసాంశము వలన జ్ఞానేంద్రియములైన త్వక్, శ్రోత్ర, జిహ్వ, ఘ్రాణ, చక్షుస్సులు, కర్మేన్ద్రియములైన వాక్కు, పాణి, పాద, పాయు, ఉపస్థలు కలిగినవి. తామసాంశము వలన ఆకాశము యొక్క తన్మాత్రమైన శబ్దము కలిగినది.

శబ్దాద్వ్యోమ తతః ససర్జిథ విభో స్పర్శం తతో మారుతం
తస్మాద్రూపమతో మహోఽథ చ రసం తోయం చ గంధం మహీమ్|
ఏవమ్ మాధవ పూర్వపూర్వకలనాదాద్యాద్యధర్మాన్వితం
భూతగ్రామమిమం త్వమేవ భగవన్ ప్రాకాశయస్తామసాత్ || ౫-౮||


ఓ మాధవా! శబ్దము వలన శబ్ద గుణకమైన ఆకాశము పుట్టినది. ఆకాశము వలన స్పర్శ పుట్టినది. ఆ స్పర్శము నుండి శబ్ద స్పర్శ గుణకమైన వాయువు, వాయువు వలన రూపము, రూపము వలన శబ్ద స్పర్శ రూప గుణకమైన తేజస్సు, తేజస్సు వలన రసము, రసము వలన శబ్ద స్పర్శ రూప రస గుణకమైన నీరు, నీటి నుండి గంధము, గంధము వలన శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ గుణకమైన భూమి, ఇట్లు పంచభూతములను తత్తద్ధర్మ సమన్వితముగా నీవు సృష్టించితివి.

ఏతే భూతగణాస్తథేంద్రియగణా దేవాశ్చ జాతా పృథక్-
నో శేకుర్భువనాండనిర్మితివిధౌ దేవైరమీభిస్తదా|
త్వం నానావిధసూక్తిభిర్నుతగుణస్తత్వాన్యమూన్యావిశం-
శ్చేష్టాశక్తిముదీర్య తాని ఘటయన్ హైరణ్యమండం వ్యధాః || ౫-౯||


ప్రభూ! ఈ పృథివి మొదలైన పంచ భూతములు, జ్ఞాన కర్మేంద్రియములు, తదభిమాన దేవతలు ఒక్కొక్కరు ప్రత్యేకముగా పుట్టినప్పటికీ, వీరిలో ఎవ్వరు కూడా బ్రహ్మాండమును నిర్మించ లేకపోయినారు. అప్పుడు వారందరూ పరమాత్మవగు నిన్ను అనేక విధములగు స్తోత్రములచే స్తుతించిరి. అప్పుడు నీవు పృథివి మొదలైన సమస్త తత్త్వములందు ప్రవేశించి వాటి యందు క్రియాశాక్తిని జాగృతం చేసి వాటినన్నిటిని ఒక్క త్రాటి మీదికి తెచ్చితివి. ఆ విధముగా నీవు బ్రహ్మాండమును సృష్టించితివి.

అండం తత్ఖలు పూర్వసృష్టసలిలేఽతిష్ఠత్ సహస్రం సమాః
నిర్భిందన్నకృథాశ్చతుర్దశజగద్రూపం విరాడాహ్వయమ్|
సాహస్రైః కరపాదమూర్ధనివహైర్నిశ్శేషజీవాత్మకో
నిర్భాతోఽసి మరుత్పురాధిప స మాం త్రాయస్వ సర్వామయాత్ || ౫-౧౦||


గురువాయుపురాధీశా! శ్రీమన్నారాయణ! సృష్టికి పూర్వము ఆవరించిన కారణ జలమందు ఆ బ్రహ్మాండము అనేక వేల సంవత్సరములు ఉండినది. తరువాత ఆ బ్రహ్మాండమున నీవు ప్రవేశించి దానిని అనేక విధముల విభజించి విరాట్ సంజ్ఞకమైన పదునాలుగు భువనములను సృష్టించితివి. పిమ్మట నీవు అనేక వేల కరములతో, పాదములతో, సమస్త జీవుల రూపమున ప్రకాశించిటివి. గురువాయురప్పా! అట్టి నీవు నా సమస్త రోగములను కరుణతో తొలగించుము.

ఆరవ దశకము - విరాట్పురుషుని జగదాత్మ తత్త్వము

ఏవం చతుర్దశజగన్మయతాం గతస్య
పాతాళమీశ తవ పాదతలం వదంతి|
పాదోర్ధ్వదేశమపి దేవ రసాతలం తే
గుల్ఫద్వయం ఖలు మహాతలమద్భుతాత్మన్ || ౬-౧||


పరమాత్మా! ఈ విధముగా చతుర్దశ భువన రూపుడవై యున్న నీ పాదముల యొక్క అథో భాగమే పాతాళము. అట్లే రసాతలము నీ పాదముల యొక్క పై భాగము. అదే విధముగా నీ యొక్క చీల మండలు మహాతలముగా పేర్కొనబడినది.

జంఘే తలాతలమథో సుతలం చ జానూ
కించోరుభాగయుగళం వితలాతలే ద్వే|
క్షోణీతలం జఘనమంబరమంగ నాభి-
ర్వక్షశ్చ శక్రనిలయస్తవ చక్రపాణే || ౬-౨||


చక్రపాణీ! శ్రీ కృష్ణా! నీ పిక్కలు తలాతలము, మోకాళ్ళు సుతలము, రెండు తొడలు వితలము మరియు అతలము, నీ పిరుదులు భూమి, నాభి భాగము ఆకాశము. అట్లే నీ వక్షస్థలము ఇంద్రనివాసమైన స్వర్గలోకముగా ఉన్నవి.

గ్రీవా మహస్తవ ముఖం చ జనస్తపస్తు
ఫాలం శిరస్తవ సమస్తమయస్య సత్యమ్|
ఏవం జగన్మయతనో జగదాశ్రితైర-
ప్యన్యైర్నిబద్ధవపుషే భగవన్నమస్తే || ౬-౩||


ఓ జగత్స్వరూపా! శ్రీ కృష్ణా! నీవు సమస్త విశ్వరూపుడవు. అట్టి నీ యొక్క కంఠం మహర్లోకము. నీ ముఖము జనోలోకము. నీ నుదురు తపోలోకము. నీ శిరస్సు సత్యలోకము. ఈ విశ్వమందున్న ఇతర ప్రాంతములు నీ శరీరములోని ఇతర భాగములు. ఈ విధముగా జగన్మయరూపుడైన నీకు భక్తితో నమస్కరించెదను.

త్వద్బ్రహ్మరంధ్రపదమీశ్వర విశ్వకంద
ఛందాంసి కేశవ ఘనాస్తవ కేశపాశాః|
ఉల్లాసిచిల్లియుగళం దృహిణస్య గేహం
పక్ష్మాణి రాత్రిదివసౌ సవితా చ నేత్రే || ౬-౪||


ప్రపంచ సృష్టికి కారణమైన ఓ పరమేశ్వరా! కేశవా! నీ యొక్క బ్రహ్మ రంద్ర స్థానమే వేదములు. నీ కేశములు మేఘములు. నీ కనుబొమ్మలు బ్రహ్మదేవుడు ఉండు స్థానము. అట్లే రాత్రి, పగలు నీ కనురెప్పలు, సూర్యుడు నీ యొక్క నేత్రద్వాయము.

నిశ్శేషవిశ్వరచనా చ కటాక్షమోక్షః
కర్ణౌ దిశోఽశ్వియుగళం తవ నాసికే ద్వే|
లోభత్రపే చ భగవన్నధరోత్తరోష్ఠౌ
తారాగణశ్చ రదనాః శమనశ్చ దంష్ట్రా || ౬-౫||


ఓ శ్రీ కృష్ణా! నీ చూపు వలన ఈ సమస్త ప్రపంచము ఏర్పడినది. నీ యొక్క చెవులే దిక్కులు. నీ యొక్క నాసికారంధ్రములు అశ్వినీ దేవతలు. నీ పెదవులు లోభము మరియు సిగ్గు.  అట్లే నీ దంతములే నక్షత్ర రాసులు. అదే విధముగా యముడు నీ కోరలు.

మాయా విలాసహసితం శ్వసితం సమీరో
జిహ్వా జలం వచనమీశ శకున్తపంక్తిః|
సిద్ధాదయస్స్వరగణా ముఖరంధ్రమగ్ని-
ర్దేవా భుజాః స్తనయుగం తవ ధర్మదేవః || ౬-౬||


పరమాత్మా! మనోహరమైన నీ చిరునవ్వే మాయ. నీ నిట్టూర్పే గాలి. నీరు నీ నాలుక. పక్షుల యొక్క కలకలమే నీ వాక్కు. సిద్ధులు మొదలైన ఆకాశ సంచారులు సప్తస్వరములు. అగ్నియె నీ ముఖము. ఇంద్రాది దేవతలు నీ భుజములు. ధర్మ దేవత నీ స్తన ద్వయము.

పృష్ఠం త్వధర్మ ఇహ దేవ మనస్సుధాంశు-
రవ్యక్తమేవ హృదయాంబుజమంబుజాక్ష|
కుక్షిస్సముద్రనివహా వసనం తు సంధ్యే
శేఫః ప్రజాపతిరసౌ వృషణౌ చ మిత్రః || ౬-౭||


తామరల వంటి నేత్రములు గల శ్రీ కృష్ణ పరమాత్మా! అధర్మము నీ వీపు. చంద్రుడు నీ మనస్సు. అవ్యక్తమే నీ హృదయ పద్మము. సప్త సముద్రములు నీ యొక్క ఉదరము. ఉభయ సంధ్యలు నీ వస్త్రము. అట్లే నీ శ్నిశ్నము (foreskin of penis) ప్రజాపతి, మరియు మిత్రదేవత నీ వృషణములు. 

శ్రోణిస్థలం మృగగణాః పదయోర్నఖాస్తే
హస్త్యుష్ట్రసైంధవముఖా గమనం తు కాలః|
విప్రాదివర్ణభవనం వదనాబ్జబాహు-
చారూరుయుగ్మచరణం కరుణాంబుధే తే || ౬-౮||


ఓ కరుణా సాగరా! మృగములు నీ యొక్క కటి భాగము. ఏనుగు, ఒంటె, గుఱ్ఱము వంటి వాహనములు నీ యొక్క కాలిగోళ్ళు. కాలము నీ గమనము. బ్రాహ్మణుడు మొదలైన నాలుగు వర్ణములవారి జన్మస్థానములు వరుసగా నీ ముఖ కమలము, బాహువులు, తొడలు మరియు నీ పాదములు.

సంసారచక్రమయి చక్రధర క్రియాస్తే
వీర్యం మహాసురగణోఽస్థికులాని శైలాః|
నాడ్యస్సరిత్సముదయస్తరవశ్చ రోమ
జీయాదిదం వపురనిర్వచనీయమీశ || ౬-౯||


చక్రధారీ! శ్రీ కృష్ణా! ఈ సంసార చక్రము యొక్క సృష్టి స్థితి లయములే నీ క్రియా కలాపములు, అసుర గణమే నీ పరాక్రమము. పర్వత పంక్తులే నీ ఆస్థి సమూహము, నదీ నదములే నీ నాడులు, వృక్షములే నీ రోమములు. ప్రభూ! అనిర్వచనీయమైన నీ విరాట్రూపమునకు జయము కలుగు గాక.

ఈదృగ్జగన్మయవపుస్తవ కర్మభాజాం
కర్మావసానసమయే స్మరణీయమాహుః|
తస్యాంతరాత్మవపుషే విమలాత్మనే తే
వాతాలయాధిప నమోఽస్తు నిరుంధి రోగాన్ || ౬-౧౦||


వాయుపురాధీశా! ఈ విధముగా ఈ సమస్త జగత్తు నీ రూపమే. శ్రవణ, మనన, కీర్తనాదులను చేసెడి భక్తులు నిత్య నైమిత్తిక కర్మలను, షోడశోపచారములను ఆచరించినపుడు, నీ దివ్య మంగళ విగ్రహమును విరాడ్రూపముగా భావించి స్మరించు చుండవలెను. స్వామీ! శుద్ధ సత్త్వ స్వరూపుడవైన నీవే ఈ సకల జగత్తునకు అంతరాత్మవు. అట్టి నీకు భక్తితో ప్రణమిల్లుదును . దయతో నా రోగ బాధలను నివారింపుము.

ఏడవ దశకము - హిరణ్య గర్భోత్పత్తి

ఏవం దేవ చతుర్దశాత్మకజగద్రూపేణ జాతః పున-
స్తస్యోర్ధ్వం ఖలు సత్యలోకనిలయే జాతోఽసి ధాతా స్వయమ్|
యం శంసంతి హిరణ్యగర్భమఖిలత్రైలోక్యజీవాత్మకం
యోఽభూత్ స్ఫీతరజోవికారవికసన్నానాసిసృక్షారసః || ౭-౧||


శ్రీ హరీ! నీవు ఈ విధముగా పదునాలుగు భువనముల రూపమున ఏర్పడితివి వీటిలో అన్నిటికంటే, పైన ఉన్న సత్యలోకమున నీవు బ్రహ్మదేవుడుగా వెలసితివి. నీ అంశయైన ఆ బ్రహ్మదేవుని హిరణ్యగర్భుడని కూడా అందురు. అతడు ముల్లోకములందున్న సమస్త జీవ రూపుడు. అతని యందు రజోగుణ ప్రేరణచే సుర,నర, తిర్యగాది ప్రాణులన్నిటికి శ్రేయస్సు గూర్చవలెనను సంకల్పము కలిగెను. అందువలన అనేక విధములైన సృష్టిరచన చేయవలెనను కోరిక అతనికి కలిగినది.

సోఽయం విశ్వవిసర్గదత్తహృదయస్సంపశ్యమానస్స్వయం
బోధం ఖల్వనవాష్య విశ్వవిషయం చింతాకులస్తస్థివాన్|
తావత్ త్వం జగతాంపతే తపతపేత్యేవం హి వైహాయసీం
వాణీమేనమశిశ్రవః శ్రుతిసుఖాం కుర్వంస్తపఃప్రేరణామ్ || ౭-౨||


ఆ బ్రహ్మదేవునకు విశ్వసృష్టి చేయవలెనను కోరిక కలిగి అందులకై బాగుగా ఆలోచించినాడు. కాని విశ్వసృష్టి ఏ విధముగా చేయవలెనో తెలియక అతడు చాలా కాలము చింతించెను. ఆ సమయమున జగన్నాథుడైన నీవు బ్రహ్మ దేవుని తపస్సు చేయుమని ప్రేరేపించుచు 'తప' 'తప' అను శ్రోత్ర మధురమైన ఆకాశవాణిని అతనికి వినిపించితివి.

కోఽసౌ మామవదత్పుమానితి జలాపూర్ణే జగన్మండలే
దిక్షూద్వీక్ష్య కిమప్యనీక్షితవతా వాక్యార్థముత్పశ్యతా|
దివ్యం వర్షసహస్రమాత్తపసా తేన త్వమారాధిత-
స్తస్మై దర్శితవానసి స్వనిలయం వైకుణ్ఠమేకాద్భుతమ్ || ౭-౩||


అప్పుడా బ్రహ్మ నీటిచే నిండిపోయిన జగన్మండలమున 'తప తప' అని అన్న వ్యక్తి ఎవ్వరని దిక్కులు చూచెను. ఎవ్వరు కానరాలేదు. అప్పుడు బ్రహ్మ తనకు వినిపించిన వాక్యార్థమును అనుసరించి అనే దివ్య సంవత్సరములు తప్పసు చేయుచు పరమాత్మవగు నిన్ను ఆరాధించెను. అందువలన నీవు సంతుష్టుడవై అతనికి నీవు నివసించే వైకుంఠమును చూపితివి. ఆ వైకుంఠమును  చూచుటకు అత్యద్భుతముగా ఉండెను.

మాయా యత్ర కదాపి నో వికురుతే భాతే జగద్భ్యో బహి-
శ్శోకక్రోధవిమోహసాధ్వసముఖా భావాస్తు దూరం గతాః|
సాంద్రానందఝరీ చ యత్ర పరమజ్యోతిఃప్రకాశాత్మకే
తత్ తే ధామ విభావితం విజయతే వైకుణ్ఠరూపం విభో || ౭-౪||


ప్రభూ! నీ ధామమైన వైకుంఠము చతుర్దశ భువనముల కంటే పైన ఉన్నది. అచ్చట మాయ యొక్క ప్రభావము కనిపించదు. అచ్చట దుఃఖము, కోపము, మోహము, భయము మొదలైన నీచ భావములేవియు ఉండనే ఉండవు. అది పరంజ్యోతి ప్రకాశించు స్థలము. అచ్చట బ్రహ్మానందము పొంగిపొరలు చుండును. అట్లు విరాజిల్లుతున్న నీ వైకుంఠ ధామమునకు జయము జయము. 

యస్మిన్నామ చతుర్భుజా హరిమణిశ్యామావదాతత్విషో
నానాభూషణరత్నదీపితదిశో రాజద్విమానాలయాః|
భక్తిప్రాప్తతథావిధోన్నతపదా దీవ్యంతి దివ్యా జనా-
స్తత్తే ధామ నిరస్తసర్వశమలం వైకుంఠరూపం జయేత్ || ౭-౫||


ఆ వైకుంఠమున యున్నవారు నాలుగు భుజములతో, ఇంద్ర నీలమణి వలె నల్లని కాంతి కలిగి నీ యందలి పరమభక్తి వలన అత్యున్నతమైన స్థానమును పొందియుందురు. వారి శరీరములు దివ్యమైనవి. వారుందు భవనములు గొప్ప గొప్ప విమానములతో ప్రకాశించు చుండును. అచ్చట మలినమైన భావములకే మాత్రము తావు లేదు. అట్టి విశిష్ట స్థానమైన వైకుంఠమునకు జయము జయము. 

నానాదివ్యవధూజనైరభివృతా విద్యుల్లతాతుల్యయా
విశ్వోన్మాదనహృద్యగాత్రలతయా విద్యోతితాశాంతరా|
త్వత్పాదాంబుజసౌరభైకకుతుకాల్లక్ష్మీః స్వయం లక్ష్యతే
యస్మిన్ విస్మయనీయదివ్యవిభవం తత్తే పదం దేహి మే || ౭-౬||


ఆ పరమ పదమున లక్ష్మీదేవి నీ పాదపద్మముల పరిమళములందు మిక్కిలి ఆసక్తి కలిగి స్వయముగా అచట వెలసి యుండును. అనేక మంది దివ్యాంగనలు ఆమె చుట్టూ చేరి సేవించు చుందురు. మెరుపు తీగ వలె సుందరమైన ఆమె మనోహర శరీరము విశ్వమంతటా కాంతులను విరజిమ్ముచుండును. ఆ శోభాలకు అందరును పరవశించు చుందురు. నీ వైకుంఠము దివ్య వైభవ శోభితము, ఆశ్చర్య జనకము, అట్టి దివ్యదామమును నాకు ప్రసాదించుము.

తత్రైవం ప్రతిదర్శితే నిజపదే రత్నాసనాధ్యాసితం
భాస్వత్కోటిలసత్కిరీటకటకాద్యాకల్పదీపాకృతి|
శ్రీవత్సాంకితమాత్తకౌస్తుభమణిచ్ఛాయారుణం కారణం
విశ్వేషాం తవ రూపమైక్షత విధిస్తత్తే విభో భాతు మే || ౭-౭||


ఓ నారాయణా! బ్రహ్మ దేవుడు అనే సంవత్సరములు తపస్సు చేసి నీ అనుగ్రహుమును పొందెను. అందువలన ఆయనకు వైకుంఠమున నున్న నీ దివ్యరూప దర్శన భాగ్యము కలిగెను. అక్కడ నీవు రత్నమయమైన సింహాసనమున ఆసీనుడవై కోటి సూర్యుల కాంతులు కల కిరీటము, కంకణములు మొదలైన దివ్యమైన ఆభరణములతో ప్రకాశించుచుందువు. నీ వక్ష స్థలముపై శ్రీ వత్స చిహ్నముండును. కౌస్తుభ మణి చాయలచే నీ మేఘ శ్యామల రూపము అరుణ కాంతులిడు చుండును. నీవు సమస్త లోకములకు కారణ భూతుడవు. అట్టి నీ దివ్యరూపమును దర్శించు అదృష్టమును భక్తుడనైన నాకు అనుగ్రహించుము.

కాళాంభోదకలాయకోమలరుచాం చక్రేణ చక్రం దిశా-
మావృణ్వానముదారమందహసితస్యందప్రసన్నాననమ్|
రాజత్కంబుగదారిపంకజధరశ్రీమద్భుజామండలం
స్రష్టుస్తుష్టికరం వపుస్తవ విభో మద్రోగముద్వాసయేత్ || ౭-౮||


ప్రభూ! నీ స్వరూపము నీల మేఘచ్చాయలతో, కలువల సౌకుమార్యములతో ఒప్పుచు అన్ని దిక్కుల యందును దివ్య శోభలను వెదజల్లు చున్నది. ప్రసన్నమైన నీ ముఖము కారుణ్యముతో నిండి చిరునవ్వు అందించు చున్నది. మనోజ్ఞములైన నీ చతుర్భుజములు శంఖ చక్ర గదా పద్మములతో విరాజిల్లు చున్నవి. నీ అద్భుత మూర్తి సృష్టి కర్త యైన బ్రహ్మకు ఆనందము కూర్చు చున్నది. అట్టి నీ దివ్య రూప దర్శన ప్రభావము నా వ్యాదులన్నిటినీ అంతరించ చేయు గాక.

దృష్ట్వా సంభృతసంభ్రమః కమలభూస్త్వత్పాదపాథోరుహే
హర్షావేశవశంవదో నిపతితః ప్రీత్యా కృతార్థీభవన్|
జానాస్యేవ మనీషితం మమ విభో జ్ఞానం తదాపాదయ
ద్వైతాద్వైతభవత్స్వరూపపరమిత్యాచష్ట తం త్వాం భజే || ౭-౯||


స్వామీ! బ్రహ్మదేవుడు నీ పాదపద్మముల వైభవమును చూసి ముగ్ధుడై తన్ను తాను మరచిపోయెను. పిదప అంతులేని ఆనందములో మునిగెను. అంతట, తాను కృతార్థుడైనట్లు భావించి, నీ పాదములపై వ్రాలెను. పిమ్మట అతడు "ఓ ప్రభూ! సృష్టి చేయుటకై నేను పడుచున్నవేదనను నీవు ఎరుగుదువు. ద్వైతాద్వైత పరమైన నీ స్వరూప జ్ఞానమును నాకు అనుగ్రహించుము" అని నిన్ను వేడుకొనెను. అట్టి పరమాత్మవైన నిన్ను నేను భజించుచున్నాను.  

ఆతామ్రే చరణే వినమ్రమథ తం హస్తేన హస్తే స్పృశన్
బోధస్తే భవితా న సర్గవిధిబిర్బంధోఽపి సంజాయతే|
ఇత్యాభాష్య గిరం ప్రతోష్యనితరాం తచ్చిత్తగూఢః స్వయం
సృష్టౌ తం సముదైరయస్స భగవన్నుల్లాసయోల్లాఘతామ్ || ౭-౧౦||


ప్రభూ! ఈ విధముగా బ్రహ్మదేవుడు ఎర్రని నీ పాదపద్మములకు నమస్కరించినప్పుడు నీ మృదువైన హస్తముతో ఆయనను స్ప్రుశించుచు ఇట్లంటివి - "విధాతా! నీవు కోరుకున్నట్లు సృష్టి సంబంధమైన జ్ఞానము నీకు లభించును. కానే నీవు కర్మ బంధములలో చిక్కుబడవు. " ఇట్లు పలికి ఆయనను సంతోషపరిచితివి. అంతేగాక, ఆయన హృదయమున చేరి, ఆ బ్రహ్మదేవుడు చేయు సృష్టి కార్యమునకు నీవు ప్రేరణ కూర్చితివి. శ్రీ కృష్ణ పరమాత్మా! నీవు నాపై దయదలచి నాకు ఆరోగ్యమును చేకూర్చుము.

మధురాష్టకం - తాత్పర్యము

అఖిలం మధురం - ఎందుకయ్యా ఇంత మధురం

రాధా మోహనుడు, శ్యామ సుందరుడు, సురుచిర గాత్రుడు, తరుణారుణ కిరణాధర సరసుడు, వనమాలి, శిఖి పింఛ మౌళి, శ్రీ కౌస్తుభ ధరుడు, కిసలయ పాణి, వేణు నాద లాస్యాన్వితుడు, షోడశ సహస్ర గోపికా జన హృదయ వల్లభుడు, రుక్మిణీ మనోహరుడు, భక్త జన హృదయ నివాసుడు, యశోదా లాలితుడు, నంద గోకుల బృంద నాయకుడు, గోప కుటీర పయోఘృత చోరుడు, యదువంశ సుధాంబుధి చంద్రుడు, రాజీవ లోచనుడు, సరసీరుహ పాద పంకజుడు, తులసీ మాలా విభూషితుడు, శ్రీ గంధ సుగంధ లేపితుడు, నారీ జన మానస చోరుడు, కస్తూరి తిలక భూషితుడు, నవ రత్న విభూషిత కేయూర ధారుడు - ఇలా ఎన్ని శుభ లక్షణ గుణ గణ సమన్వితుడు ఆ శ్రీ కృష్ణుడు?. ఆ నీల  మేఘ శరీరుని స్తుతించటానికి, ఆయన మధుర లక్షణ వర్ణనకు మధురాష్టకమే సాటి. వల్లభాచార్యులు రచించిన ఈ అష్టకం లో ఆ శ్రీకృష్ణుని ఆణువణువూ మధురమే అని ఎంతో విలక్షణమైన వర్ణన జరిగింది.

ఇదివరకు కృష్ణాష్టమి సందర్భంగా మధురాష్టకం ఒక వ్యాసంలో ప్రస్తావించాను. ఈసారి తాత్పర్యముతో పూర్తిగా మధురాష్టకం మీదే ఈ ప్రచురణ. సుస్వరలక్ష్మి ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారి ఆపాత రసామృతం,  విజయ్ ఏసుదాస్ గారి ఇటీవలి గానం

ఇంత అద్భుతమైన రచన చేసిన శ్రీమద్వల్లభాచార్యులకు నా నమస్సుమాంజలి. 

బాల గోపాల కృష్ణ పాహి పాహి

అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం
హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం

వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం
చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం

వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ
నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతేరఖిలం మధురం

గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం
రూపం మధురం తిలకం మధురం మధురాధిపతేరఖిలం మధురం

కరణం మధురం తరణం మధురం హరణం మధురం రమణం మధురం
వమితం మధురం శమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం

గుంజా మధురా మాలా మధురా యమునా మధురా వీచీ మధురా
సలిలం మధురం కమలం మధురం మధురాధిపతేరఖిలం మధురం

గోపీ మధురా లీలా మధురా యుక్తం మధురం ముక్తం మధురం
దృష్టం మధురం శిష్టం మధురం మధురాధిపతేరఖిలం మధురం

గోపా మధురా గావో మధురా యష్టిర్మధురా సృష్టిర్మధురా
దలితం మధురం ఫలితం మధురం మధురాధిపతేరఖిలం మధురం

ఇతి శ్రీమద్వల్లభాచార్యవిరచితం మధురాష్టకం సంపూర్ణం


శ్రీ వత్సాంకిత   శ్రీ కౌస్తుభ ధర 
 
తాత్పర్యము: 

(ఇక్కడ మధురాధిపతి అనే పదానికి రెండు అర్థాలు అనుకోవచ్చు. మధుర పట్టణానికి అధిపతి (కంసుని జయించాడు కాబట్టి మధుర ఆయన ఆధీనంలోనే ఉన్నట్టు లెక్క) లేదా మాధుర్యానికి అధిపతి. రెండు బానే నప్పుతాయి. అష్టకంలో మధురం గురించి కాబట్టి మాధుర్యానికి అధిపతి అనేదే నేను ఇక్కడ ఉపయోగిస్తాను)

ఆ శ్రీకృష్ణుని పెదవులు, ముఖము, కళ్ళు, నవ్వు, హృదయము, నడక - ఎంతో మధురం. మాధుర్యానికి అధిపతి అయిన శ్రీ కృష్ణునిలో అన్నీ మధురమే. 

ఆ శ్రీకృష్ణుని మాటలు, చేష్టలు, వ్యక్తిత్వము, వస్త్రములు, నడక, ప్రవర్తన, తిరుగుట - ఎంతో మధురం. మాధుర్యానికి అధిపతి అయిన శ్రీ కృష్ణునిలో అన్నీ మధురమే. 

ఆ శ్రీకృష్ణుని వేణువు, పాద ధూళి, హస్తములు, పాదములు, నృత్యము, స్నేహితము (సాహచర్యము) - ఎంతో మధురం. మాధుర్యానికి అధిపతి అయిన శ్రీ కృష్ణునిలో అన్నీ మధురమే. 

ఆ శ్రీకృష్ణుడు గానం చేయుట , పానము చేయుట, (పీతం అంటే పచ్చని వస్త్రము అని కూడ అనుకోవచ్చు కానీ ఇక్కడ మిగిలినవన్నీ క్రియలె కాబట్టి ఇది కూడ క్రియగా పానము చేయుట అనుకుంటున్నాను), తినుట, నిద్రించుట, రూపము, తిలకము - ఎంతో మధురం. మాధుర్యానికి అధిపతి అయిన శ్రీ కృష్ణునిలో అన్నీ మధురమే. 

ఆ శ్రీకృష్ణుని నటన లేదా పనులు చేయుట, ఈదుట/దాటుట, దొంగిలించటం, ఆడుట, గొణుగుట, శాంతముగా పనులు చేయుట - - ఎంతో మధురం. మాధుర్యానికి అధిపతి అయిన శ్రీ కృష్ణునిలో అన్నీ మధురమే. 

ఆ శ్రీకృష్ణుని పిల్లన గ్రోవి ఆలాపన, మెడలో హారము, యమునా నది, అందులోని అలలు, నీరు, కలువలు - ఎంతో మధురం. మాధుర్యానికి అధిపతి అయిన శ్రీ కృష్ణునిలో అన్నీ మధురమే. 

ఆ శ్రీకృష్ణుని గోపికలు, వారితో రాసలీలలు, వారిని కృష్ణుడు పట్టుకొనుట, విడువుట, కృష్ణుని దృష్టి పడినది, సత్ప్రవర్తన - ఎంతో మధురం. మాధుర్యానికి అధిపతి అయిన శ్రీ కృష్ణునిలో అన్నీ మధురమే. 

8, డిసెంబర్ 2010, బుధవారం

శ్రీమన్నారాయణీయం - ప్రథమ స్కంధము, తాత్పర్యము

శ్రీమన్నారాయణీయం  ప్రథమ స్కంధము



మొదటి దశకము - భగవన్మహిమ


సాంద్రానందావబోధాత్మకమనుపమితం కాలదేశావధిభ్యాం
నిర్ముక్తం నిత్యముక్తం నిగమశతసహస్రేణ నిర్భాస్యమానమ్ |
అస్పష్టం దృష్టమాత్రే పునరురుపురుషార్థాత్మకం బ్రహ్మ తత్వమ్
తత్తావద్భాతి సాక్షాద్గురుపవనపురే హంత భాగ్యం జనానామ్ || ౧-౧||

ఆ భగవంతుడు సచ్చిదానందుడు, జ్ఞాన స్వరూపుడు, సాటి లేని వాడు, కాలము, దేశము మొదలగు వాటికి అతీతమైన వాడు, ఎల్లప్పుడూ ముక్త స్వరూపుడు, లక్షలకొలది అనువాకముల ద్వారా వేదములు ఆ పరమ పురుషుని వర్ణించినా, ఇది కాడు ఇది కాడు అని చెప్పాయే కాని, ఇది అని చెప్పలేకపోయాయి. యోగులు కూడ వేల సంవత్సరాల కఠోర శ్రమ, సాధన తర్వాతే పర తత్త్వమును అనుభవించి మోక్షమును పొందగలరు. ఆ బ్రహ్మమే గురువాయు పురము నందు సగుణ సాకార రూపమున నారాయణుడై వెలసి యున్నాడు. వారిది ఎంతటిభాగ్యము?

ఏవం దుర్లభ్యవస్తున్యపి సులభతయా హస్తలబ్ధే యదన్యత్
తన్వా వాచా ధియా వా భజతి బత జనః క్షుద్రతైవ స్ఫుటేయమ్
ఏతే తావద్వయం తు స్థిరతరమనసా విశ్వపీడాపహత్యై
నిశ్శేషాత్మానమేనం గురుపవనపురాధీశమేవాశ్రయామః || ౧-౨||

దుర్లభుడే అయినా, జీవులపై కరుణతో చేతికి అందినంత సులభంగా గురువాయుపురంలో వెలశాడు. ఇంత సులభ లభ్యుడైనప్పటికీ, భక్తులు మనోవాక్కాయ కర్మలచే ఇతరులను సేవిస్తూ వ్యర్థ కాలక్షేపము చేస్తున్నారు.  ఇది ఎంతో శోచనీయము. కానీ, ఆత్మ స్వరూపుడైన ఈ గురువాయుపుర పట్టణపు శ్రీ కృష్ణుని మాత్రమే మన తాపత్రయముల తొలగించుటకు ఆశ్రయింతుము.
 
సత్త్వం యత్తత్పరాభ్యామపరికలనతో నిర్మలం తేన తావత్
భూతైర్భూతేంద్రియైస్తే వపురితి బహుశః శ్రూయతే వ్యాసవాక్యమ్ |
తత్స్వచ్ఛత్వాద్యదచ్ఛాదితపరసుఖచిద్గర్భనిర్భాసరూపం
తస్మిన్ ధన్యా రమంతే శ్రుతిమతిమధురే సుగ్రహే విగ్రహే తే || ౧-౩||

ఓ పరమాత్మా! నీ దివ్య శరీరము రజస్తమో గుణములు లేక మిక్కిలి నిర్మలమైనది, శుద్ధ సత్త్వ గుణములు కల  పంచ భూతాత్మకమైనది అని వేద వ్యాసులు అనేక మార్లు తెలిపాడు. అట్టి నీ రూపము యొక్క సౌందర్యమును గురించి విన్నాను, స్మరించినను, మిక్కిలి ఆనందము కలుగును. ఆ రూపమును అతి సులభముగా భక్తుడు దర్శించుకొనును. కావున అదృష్టవంతులు నీ రూపమును దర్శించుచు, స్మరించుచు ఆత్మానుభూతిని పొందుదురు

నిష్కంపే నిత్యపూర్ణే నిరవధి పరమానందపీయూషరూపే
నిర్లీనానేకముక్తావలిసుభగతమే నిర్మలబ్రహ్మసింధౌ |
కల్లోలోల్లాసతుల్యం ఖలు విమలతరం సత్త్వమాహుస్తదాత్మా
కస్మాన్నో నిష్కలస్త్వం సకల ఇతి వచస్త్వత్కలాస్వేవ భూమన్ ౧-౪

పరబ్రహ్మము అపారమైన సముద్రము వంటిది. నిశ్చలముగా, నిత్య పూర్ణమై, అంతులేని పరమానందమనే అమృతముతో నిండియున్నది. ముక్తులైన అనేక జీవములు ఆ సాగరములో ముత్యాలు, మణుల వంటి వారు. వారితో ఆ సాగరము అందముగా కనిపించును. అట్టి సాగరమున పరిశుద్ధమైన సత్త్వ గుణము అలలవలె ఉండును. ఓ పరమాత్మ! శుద్ధసత్త్వ స్వరూపుడైన నీవు వస్తుతః నిష్కలుడవుగా ప్రకాశింతువు. అయినను నీవు సకల కలాసహితుడవుగా, సాకారుడవుగా కనిపించుచున్నావు. అదే నీ గొప్పతనము.

నిర్వ్యాపారోఽపి నిష్కారణమజ భజసే యత్క్రియామీక్షణాఖ్యాం
తేనైవోదేతి లీనా ప్రకృతిరసతికల్పాఽపి కల్పాదికాలే |
తస్యాః సంశుద్ధమంశం కమపి తమతిరోధాయకం సత్త్వరూపం
స త్వం ధృత్వా దధాసి స్వమహిమవిభవాకుంఠ వైకుంఠ రూపమ్ || ౧-౫

ఓ పరమాత్మా! నీవు ఎట్టి కర్మలను ఆచరించ పని లేదు. ఆయస్కాంతము వద్ద ఇనుము ఆకర్షింప బడినట్లు, నీ కృపాకటాక్ష వీక్షణ ప్రభావమున నీ యందు విలీనమై అసత్ స్వరూపమైన ప్రకృతి సృష్టి కల్పాది యందు కనపడుతున్నది. నీవు ప్రకృతికి అతీతుడవు. సత్త్వ రూపుడవు. నీ మహిమా ప్రభావముచే వైకుంఠ రూపములో వెలసిల్లుచున్నావు. భక్తులను అనుగ్రహించుటకు ప్రకృతి రూపములో ప్రకటించు కొనుచున్నావు.

తత్తే ప్రత్యగ్రధారాధరలలితకళాయావలీకేలికారం
లావణ్యస్యైకసారం సుకృతిజనదృశాం పూర్ణపుణ్యావతారమ్ |
లక్ష్మీనిశ్శంకలీలానిలయనమమృతస్యందసందోహమంతః
సించత్సంచింతకానాం వపురనుకలయే  మారుతాగారనాథ     ||౧-౬||   

ఓ గురువాయుపుర శ్రీ కృష్ణా! నీ రూపము క్రొత్త మేఘములా సుందరమైనది. కలువపూలవలె ఆనందాన్ని కలుగుచేస్తుంది. సౌందర్యము మూర్తీభవించిన నీ రూపము పుణ్యాత్ములకు పుణ్యఫలము వంటిది. లక్ష్మికి నివాస స్థానము. అతి మధురమైన నీ దివ్య రూపమును ఎల్లప్పుడూ ధ్యానించు వారి మనసులందు అది అమృతాన్ని కురిపిస్తుంది. నీ జగన్మోహన రూపమును నేను నిరంతరమూ ధ్యానిన్చుచున్నాను.

కష్టా తే సృష్టిచేష్టా బహుతరభవఖేదావహా జీవభాజా
మిత్యేవం పూర్వమాలోచితమజిత మయా నైవమద్యాభిజానే |
నో చేజ్జీవాః కథం వా మధురతరమిదం త్వద్వపుశ్చిద్రసార్ద్రం
నేత్రైః శ్రోత్రైశ్చ పీత్వా పరమరససుధాంభోధిపూరే రమేరన్ || ౧-౭

ఓ దేవా! మొదట నేను నీ సృష్టి వలన సంసార బంధనములు, కష్టములు కలుగుచున్నవని భావించాను. కానీ అది నిజము కాదు. నీకు జీవులపై అనంతమైన కరుణ కలదు. నీ రూపము చాలా సుందరమైనది, మనోహరమైనది. లేకున్న, భక్తులందరూ నీ దివ్య మంగళ రూపమును భౌతికమైన కళ్ళతో చూసి, నీ లీలా వర్ణనమును వినుచు పరమానందమును ఎలా పొందుదురు?

నమ్రాణాం సన్నిధత్తే సతతమపి పురస్తైరనభ్యార్థితాన-
ప్యర్థాన్ కామానజస్రం వితరతి పరమానందసాంద్రాం గతిం చ |
ఇత్థం నిశ్శేషలభ్యో నిరవధికఫలః పారిజాతో హరే త్వం
క్షుద్రం తం శక్రవాటీద్రుమమభిలషతి వ్యర్థమర్త్ హివ్రజోఽయమ్ || ౧-౮

ఓ హరీ! నీవు అందరికీ సులభముగా అందుబాటులో ఉన్నవాడవు. నీకు నమస్కరించే వారికి ఎల్లప్పుడు సాక్షాత్కారము నిచ్చెదవు. కోరిన కోర్కెలు తీర్చే కల్పతరువువు. పరమానందమైన మోక్షాన్ని కూడ అనుగ్రహిస్తున్నావు. కొందరు నీ మహిమ తెలియకు ఆ ఇంద్రుని కల్పతరువును ఆశ్రయింతురు. అది వ్యర్థము. అనంతమైన ఫలములను ఇచ్చేది నీ ముందు పారిజాత వృక్షమెంతటిది, కల్పవృక్షమెంతటిది?

కారుణ్యాత్కామమన్యం దదతి ఖలు పరే స్వాత్మదస్త్వం విశేషా-
దైశ్వర్యాదీశతేఽన్యే జగతి పరజనే స్వాత్మనోఽపీశ్వరస్త్వమ్ |
త్వయ్యుచ్చైరారమంతి ప్రతిపదమధురే చేతనాః స్ఫీతభాగ్యాః-
త్వం చాఽఽత్మారామ్ ఏవేత్యతులగుణగణాధార శౌరే నమస్తే || ౧-౯||

ప్రభూ! ఇతర దేవతలు మోక్షము తప్ప ఇతర ఫలములను ఇయ్యగలరు. నీవు మోక్షాన్ని కూడ ప్రసాదిస్తావు. నీవే ప్రభుడవు, సర్వేశ్వరుడవు. నిన్ను శాసించేవారు లేరు. నీ పరబ్రహ్మ రూపము ఎంతో మధురమైనది. అటువంటి నీయందు ధన్యులు సదా ఆనందించు చుందురు. నీవు ఆత్మా రాముడవు, అనంత కళ్యాణ గుణములకు ఆధారమైన వాడవు. శౌరీ! నీకు నా నమస్కారములు.

ఐశ్వర్యం శంకరాదీశ్వరవినియమనం విశ్వతేజోహరాణాం
తేజస్సంహారి వీర్యం విమలమపి యశో నిస్పృహైశ్చోపగీతమ్ |
అంగాసంగా సదా శ్రీరఖిలవిదసి న క్వాపి తే సంగవార్తా
తద్వాతాగారవాసిన్ మురహర భగవచ్ఛబ్దముఖ్యాశ్రయోఽసి ౧-౧౦

గురువాయుపుర నివాస! మురారి! ఐశ్వర్యము, సాటి లేని పరాక్రమము, నిర్మలమైన యశస్సు, సిరి సంపదలు, సర్వజ్ఞత, వైరాగ్యము - అనే ఆరు లక్షణములు కలవాడే భగవంతుడు. నీవు బ్రహ్మాది దేవతలను కూడ నియమించగల ప్రభుడవు. బ్రహ్మ, శివుడు మొదలగు దేవతలను మించిన తేజస్సు నీది. నీ యశస్సును సనకాది మునులు ఎల్లప్పుడూ కొనియాడు చుందురు. లక్ష్మీ దేవి ఎప్పుడు నిన్నే ఆశ్రయించు యుండును. నీవు అన్ని తెలిసిన వాడవు, దేనియందు ఆసక్తి లేని వాడవు. అందుకనే భగవంతుడు అనే పేరు నీకే తగును.

రెండవ దశకము - భగవద్రూప భక్తి మహత్వము


సూర్యస్పర్ధికిరీటమూర్ధ్వతిలకప్రోద్భాసిఫాలాంతరం
కారుణ్యాకులనేత్రమార్ద్రహసితోల్లాసం సునాసాపుటమ్ |
గండోద్యన్మకరాభకుండలయుగం కంఠోజ్వలత్కౌస్తుభం
త్వద్రూపం వనమాల్యహారపటలశ్రీవత్సదీప్రం భజే || ౨-౧||

శ్రీ కృష్ణా! నీ కిరీటము నందలి మణుల కాంతులు సూర్యుని తేజస్సును మించినవి. నీ నుదుట కస్తూరి తిలకము ఎంతో అందమైనది. నీ చల్లని చూపులు జీవ కోటి పై కృపను ప్రసరింప చేయును. ప్రేమతో కూడిన నీ చిరునవ్వు ఎంతో ఆహ్లాద కరమైనది. నీ నాసిక ఎంతో ముచ్చటగ ఉంది. అద్దముల వంటి నీ చెక్కిళ్ళ పై ప్రతిఫలించు మకర కుండలముల కాంతులు ఎంతో మనోహరముగా ఉన్నవి. నీ మెడలో వెలుగుతున్న కౌస్తుభమణి కాంతులు దేదీప్య మానము. నీ వక్షస్థలమున ఉన్న వనమాలలు, దివ్యమైన హారములు, శ్రీ వత్స చిహ్నము అనుపమానములు. అటువంటి నీ దివ్య రూపమును నేను ధ్యానించు చున్నాను.


కేయూరాంగదకంకణోత్తమమహారత్నాంగులీయాంకిత-
శ్రీమద్బాహుచతుష్కసంగతగదాశంఖారిపంకేరుహామ్ |
కాంచిత్కాంచినకాంచిలాంచ్ఛితలసత్పీతాంబరాలంబినీమ్
ఆలంబే విమలాంబుజద్యుతిపదాం మూర్తిం తవార్తిచ్ఛిదమ్ || ౨-౨||

ఓ శ్రీ కృష్ణా! నీ నాలుగు బాహువులలో యున్న శంఖము, చక్రము, గద, పద్మము ఎంతో దివ్యముగా యున్నవి. నీవు ధరించిన భుజ కీర్తులు, దండము, కడియము, కంకణములు, ఉంగరములు చక్కని కాంతులను వెల్లివిరియ చేయుచున్నవి. నీ బంగారు కాంతి ఆభరణము యొక్క మిల మిలలు, పట్టు పీతాంబరముల యొక్క నిగనిగలు ఎంతో ఆహ్లాదకరములు. నీ పవిత్ర పాదములు నిర్మలమైన కమలముల కాంతులను విరజిమ్ముతున్నవి. దివ్యమైన నీ మూర్తి భక్తుల ఆర్తులను రూపు మాపును. అట్టి నీ రూపమును నేను ఆశ్రయింతును.

యత్త్రైలోక్యమహీయసోఽపి మహితం సమ్మోహనం మోహనాత్
కాంతం కాంతినిధానతోఽపి మధురం మాధుర్యధుర్యాదపి |
సౌందర్యోత్తరతోఽపి సుందరతరం త్వద్రూపమాశ్చర్యతోఽ-
ప్యాశ్చర్యం భువనే న కస్య కుతుకం పుష్ణాతి విష్ణో విభో || ౨-౩||

విశ్వవ్యాప్తమైన ఓ విష్ణో! విభో! నీ రూపము మూడు లోకములందున్న గొప్ప వస్తువుల కన్నా మహత్తు కలది. మోహము కలిగించు వాటికంటే మోహనమైనది. కాంతి కలవాని కంటే గొప్ప కాంతి కలది. మధురమైన వాటికంటే మిక్కిలి మధురమైనది. సుందరమైన వస్తువలన్నిటి కంటే ఎంతో సుందరమైనది. ఆశ్చర్యము కలిగించే వస్తువుల కంటే ఆశ్చర్యమైనది. అట్టి నీ దివ్య స్వరూపమును దర్శించుటకు ఎవరు కుతుహూలపడరు?.

తత్తాదృఙ్మధురాత్మకం తవ వపుః సంప్రాప్య సంపన్మయీ
సా దేవీ పరమోత్సుకా చిరతరం నాఽస్తే స్వభక్తేష్వపి |
తేనాస్యా బత కష్టమచ్యుత విభో త్వద్రూపమానోజ్ఞక-
ప్రేమస్థైర్యమయాదచాపలబలాచ్చాపల్యవార్తోదభూత్ || ౨-౪||

ప్రభూ! సకల సంపదలకు నిలయయైన లక్ష్మీ దేవి నీ అందచందములకు, నీ శుభ గుణ గణములకు ఆకర్షితురాలై నీ యందే స్థిరముగా నిలిచియున్నది. అందువలన ఆ దేవి తన భక్తుల దగ్గర ఎక్కువ కాలము నిలిచి యుండుట లేదు. కావున నీ మనోజ్ఞ రూప వైభవముపై గల అచంచలమైన ప్రేమానురాగాముల కారణముగా ఆమె తమ వద్ద నిలుకడగా యుండక పోవుటచే వారు ఆ దేవిని 'చపల' అని పెర్కొనుచున్నారు. ఇది ఎంత శోచనీయము స్వామీ!

లక్ష్మీస్తావకరామణీయకహృతైవేయం పరేష్వస్థిరే-
త్యస్మిన్నన్యదపి ప్రమాణమధునా వక్ష్యామి లక్ష్మీపతే |
యే త్వద్ధ్యానగుణానుకీర్తనరసాసక్తా హి భక్తా జనా-
స్తేష్వేషా వసతి స్థిరైవ దయితప్రస్తావదత్తాదరా || ౨-౫||

లక్ష్మీపతీ! నీ అందమైన రూపగుణ సంపదలకు ముగ్ధురాలైన లక్ష్మీదేవి నీ యందు స్థిరముగా ఉండుట సరే! అంతేకాదు ఆ దేవికి నీ పై కల అనురాగము వలన ఆమె తన స్వామి వైన నిన్ను నీ భక్తులు ధ్యానించుచు, నీ గుణ కీర్తనలో పరవశించి పోవుట చూసి వారి దగ్గర కూడ స్థిరముగా ఉండును. నీ భక్తులు కాని వారి వద్ద ఆ దేవి నిలిచి యున్దనుటకు ఇది మరియొక ఉదాహరణ.

ఏవంభూతమనోజ్ఞతానవసుధానిష్యందసందోహనం
త్వద్రూపం పరచిద్రసాయనమయం చేతోహరం శృణ్వతామ్ |
సద్యః ప్రేరయతే మతిం మదయతే రోమాంచయత్యంగకం
వ్యాసించత్యపి శీతబాష్పవిసరైరానందమూర్చ్ఛోద్భవైః || ౨-౬||

ప్రభూ! నీ రూపము, లావణ్య వైభవము పరమానంద దాయకమైన అమృతమును వర్షింప జేయును. అది పరమ చిదానంద రసమునకు నిలయము. వినువారి చిత్తములను దోచుకొని, బుద్ధికి స్ఫూర్తిదాయకమై వెంటనే మత్తు కలిగించును. శరీరములకు గగుర్పాటు కలిగించును. ఆనంద పారవశ్యము వలన కలిగిన చల్లని కన్నీటిచే వరి శరీరములను తడిపి వేయును.


ఏవంభూతతయా హి భక్త్యభిహితో యోగః స యోగద్వయత్
కర్మజ్ఞానమయాద్ భృశోత్తమతరో యోగీశ్వరైర్గీయతే |
సౌందర్యైకరసాత్మకే త్వయి ఖలు ప్రేమప్రకర్షాత్మికా
భక్తిర్నిశ్రమమేవ విశ్వపురుషైర్లభ్యా రమావల్లభ || ౨-౭||

ఓ రమాపతీ! నీవు సౌన్దర్యానంద స్వారూపుడవు. నీ యందు అమితమైన ప్రేమతో నిండిన భక్తి, సామాన్యులకు కూడ ఈలోకములో ఎటువంటి శ్రమ లేకుండా లభించును. అందుకే, కర్మ, జ్ఞాన యోగముల కంటే భక్తి యోగం ఉత్తమమైనది అని యోగీశ్వరులు చెపుతున్నారు.

నిష్కామం నియతస్వధర్మచరణం యత్కర్మయోగాభిధం
తద్దూరేత్యఫలం యదౌపనిషదజ్ఞానోపలభ్యం పునః |
తత్త్వవ్యక్తతయా సుదుర్గమతరం చిత్తస్య తస్మాద్విభో
త్వత్ప్రేమాత్మకభక్తిరేవ సతతం స్వాదీయసీ శ్రేయసీ || ౨-౮||

ధర్మయ శాస్త్రములందు ఆయా వర్ణముల వారికి చెప్పబడిన కర్మలను విధిగా ఆచరించుచు వాటి వల్ల కలుగు ఫలితమును ఆశించక యుండుట కర్మ యోగమనబడును. ఇట్టి కర్మ యోగము వలన ఫలితము చాలా ఆలస్యముగా లభించును. అట్లే, ఉపనిషత్తులలో చెప్పబడిన బ్రహ్మ జ్ఞానము సామాన్యులకు తేలికగా లభించదు. అట్టి జ్ఞానమును పొందుటకై మనస్సు చాలా కష్ట పడ వలెను. స్వామీ! పై రెండిటి కంటే నిన్నే లోతుగా ప్రేమించుట అనే భక్తి మిక్కిలి సులభమైనది, రుచికరమైనది, శ్రేయస్కరమైనది.

అత్యాయాసకరాణి కర్మపటలాన్యాచర్య నిర్యన్మలాః
బోధే భక్తిపథేఽథవాప్యుచితతామాయాంతి కిం తావతా |
క్లిష్ట్వా తర్కపథే పరం తవ వపుర్బ్రహ్మాఖ్యమన్యే పున-
శ్చిత్తార్ద్రత్వమృతే విచింత్య బహుభిః సిధ్యంతి జన్మాంతరైః || ౨-౯

స్వామీ! నిత్య నైమిత్తిక కర్మలు నియమ బద్ధంగా చేయవలెననిచో  చాలా కష్టము కలుగును. అట్టి కష్టముతో కర్మలు చేసి పాపములకు దూరమైన వారు తమ తమ యోగ్యతలను అనుసరించి జ్ఞాన మార్గమున లేక భక్తి మార్గమున ప్రవేశించు చున్నారు. మరి కొందరు జ్ఞాన మార్గమున అనేక కష్టములను అనుభవించుచు అనేక జన్మల తర్వాత మాత్రమే పరబ్రహ్మ రూపుడవైన నిన్ను పొందుచున్నారు.

త్వద్భక్తిస్తు కథారసామృతఝరీనిర్మజ్జనేన స్వయం
సిద్ధ్యంతీ విమలప్రబోధపదవీమక్లేశతస్తన్వతీ |
సద్యః సిద్ధికరీ జయత్యయి విభో సైవాస్తు మే త్వత్పద-
ప్రేమప్రౌఢిరసార్ద్రతా ద్రుతతరం వాతాలయాధీశ్వర || ౨-౧౦||

గురువాయురప్ప! శ్రీ కృష్ణా! నీ సుమధురమైన కథారస ప్రవాహములో మునిగినచో నీ భక్తి అతి సులభముగా లభించును. సుందరమైన నీ కథలను వినుట చేత నిర్మలమైన జ్ఞానము కూడ సులభముగా లభించును. దాని వలన భక్తుడు తాను కోరుకున్న కోరికల ఫలములను కూడ వెంటనే పొందగలుగుచున్నాడు. ఓ పరమాత్మా! అందువలన నీ పాద భక్తి వలన నా మనస్సు మిక్కిలి శీఘ్రముగా ఆనందమున మునిగి పరవశించునట్లు చేయుము.

మూడవ దశకము - భక్తి స్వరూప వర్ణనము - భక్తికై ప్రార్థన

పఠంతో నామాని ప్రమదభరసింధౌ నిపతితాః
స్మరంతో రూపం తే వరద కథయంతో గుణకథాః |
చరంతో యే భక్తాస్త్వయి ఖలు రమంతే పరమమూ-
నహం ధన్యాన్మన్యే సమధిగతసర్వాభిలషితాన్ || ౩-౧||

భక్తుల కోరికలను తీర్చే కృష్ణా!  భక్తులు నీ దివ్య నాములను పఠించుచు, నీ పరమ సుందర రూపమును స్మరించు చున్నారు. అట్లే కళ్యాణ గుణములు కల నీ దివ్య కథలను గానము చేయుచు ఆనంద సముద్రమున ఓలలాడుచు ఈ భూమిపై తిరుగుచుందురు. నిన్ను ఎల్లప్పుడూ ధ్యానించే భక్తుల కోర్కెలను నీవు కరుణతో తీర్చెదవు. కావున కోరికలన్నీ తీరి పరమానందములో ఓలలాడే భక్తులు ధన్యులని భావింతును.

గదక్లిష్టం కష్టం తవ చరణసేవారసభరేఽ-
ప్యనాసక్తం చిత్తం భవతి బత విష్ణో కురు దయామ్ |
భవత్పాదాంభోజస్మరణరసికో నామనివహా-
నహం గాయంగాయం కుహచన వివత్స్యామి విజనే || ౩-౨||

శ్రీమన్నారాయణ! నీ పాద పద్మములను భక్తితో సేవించ దలచితిని. కాని అనారోగ్యముతో బాధపడుతున్న నా మనస్సు అందుకు విముఖముగా ఉన్నది. ఏమి చేయుదును?. అందువలన నా పై దయ చూపించినచో నీ పాద పద్మములను అనన్య భక్తితో సేవిస్తూ ఏకాంతమున నీ దివ్య నామములను అనుక్షణము ఆనందముతో గానము చేయుచు ఉందును.

కృపా తే జాతా చేత్కిమివ న హి లభ్యం తనుభృతాం
మదీయక్లేశౌఘప్రశమనదశా నామ కియతీ |
న కే కే లోకేఽస్మిన్ననిశమయి శోకాభిరహితా
భవద్భక్తా ముక్తాః సుఖగతిమసక్తా విదధతే || ౩-౩||

స్వామీ! నీ అనుగ్రహము కలిగినచో ప్రాణులకు సిద్ధించనిది ఏముండును? అందువలన నా రోగ బాదానివారణం అనేది నీకు అత్యంత స్వల్పమైన విషయము. నీ అనుగ్రహము వలననే ఎట్టి కోరికలు లేని నీ భక్తులు ఎల్లప్పుడూ దుఃఖము ఏ మాత్రము లేక ముక్తిని పొంది శాశ్వత సుఖమును అనుభవించు చున్నారు.

మునిప్రౌఢా రూఢా జగతి ఖలు గూఢాత్మగతయో
భవత్పాదాంభోజస్మరణవిరుజో నారదముఖాః |
చరంతీశ స్వైరం సతతపరినిర్భాతపరచిత్-
సదానందాద్వైతప్రసరపరిమగ్నాః కిమపరమ్ || ౩-౪||

ప్రభూ! ఆత్మ జ్ఞాన సంపన్నులైన నారదాది మునీశ్వరులు నీ పాద పద్మములను సదా స్మరించుచున్నందు వలన ఎట్టి బాధలు లేక సచ్చిదానందములో సదా నిమగ్నులై స్వేచ్ఛగా సంచరించు చున్నారు. వారికి ఇంత కన్నా కావలసినది ఏమున్నది?.

భవద్భక్తిః స్ఫీతా భవతు మమ సైవ ప్రశమయేత్-
అశేషక్లేశౌఘం న ఖలు హృది సందేహకణికా |
న చేద్వ్యాసస్యోక్తిస్తవ చ వచనం నైగమవచో
భవేన్మిథ్యా రథ్యాపురుషవచనప్రాయమఖిలమ్ || ౩-౫||

స్వామీ! నాకు నీ చరణారవిన్దములపై భక్తి మిక్కిలి కలుగునట్లు దయతో అనుగ్రహించుము. ఆ భక్తి నా సమస్త బాధలను తప్పక దూరము చేయును. అందులో నాకు ఎట్టి సందేహము లేదు. కానిచో భగవద్గీత మొదలగు గ్రంథములందు వేదవ్యాసుడు ప్రవచించిన మాటలు, వేదములందు చెప్పబడిన వాక్కులు అన్ని చిల్లర జనము యొక్క మాటల వలె వ్యర్థమగును.

భవద్భక్తిస్తావత్ప్రముఖమధురా త్వాద్గుణరసాత్
కిమప్యారూఢా చేదఖిలపరితాపప్రశమనీ |
పునశ్చాంతే స్వాంతే విమలపరి బోధోదయమిళన్
మహానందాద్వైతం దిశతి కిమతః ప్రార్థ్యమపరమ్ || ౩-౬||

ప్రభూ! నీ చరణారవిందముల యందలి భక్తి నీ గుణ రసానందానుభావము వలన మధురాతి మధురమైనది. అట్టి భక్తి క్రమ క్రమముగా పెరిగినచో ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధిదైవికములైన అన్ని తాపములు నశించును. అట్లే, చివరకు నిర్మలమైన జ్ఞానోదయము కలిగి బ్రహ్మానందమున ఓలలాడుట కూడ జరుగును. మానవునకు ఇంత కంటే కోరుకోన వలసినది ఏమి కలదు?.

విధూయ క్లేశాన్ మే కురు చరణయుగ్మం ధృతరసం
భవత్క్షేత్రప్రాప్తౌ కరమపి చ తే పూజనవిధౌ |
భవన్మూర్త్యాలోకే నయనమథ తే పాదతులసీ-
పరిఘ్రాణే ఘ్రాణం శ్రవణమపి తే చారుచరితే || ౩-౭||

స్వామీ! నా బాధలనన్నిటినీ దూరము చేసి, నా పాదములు నీ దివ్యక్షేత్రము చేరునటులు, నా చేతులు నిన్ను పూజించునట్లు, నా నేత్రములు నీ దివ్యమైన స్వరూపమును సందర్శించునట్లు, నా ఘ్రాణేంద్రియములు నీ పాదములన్దున్న తులసిని అఘ్రాణించునట్లు, నా చెవులు మధురమైన నీ గాథలను మిక్కిలి భక్తితో వినునట్లు అనుగ్రహించుము. ఆ విధముగా నేను ఆనందానుభూతిని పొందెదను.

ప్రభూతాధివ్యాధిప్రసభచలితే మామకహృది
త్వదీయం తద్రూపం పరమసుఖచిద్రూపముదియాత్ |
ఉదంచద్రోమాంచో గలితబహుహర్షాశ్రునివహో
యథా విస్మర్యాసం దురుపశమపీడాపరిభవాన్ || ౩-౮||

స్వామీ! మిక్కుటమైన శరీరవ్యాధులతో, మానసిక బాధలచే మిక్కిలి చంచలమైన నా హృదయమునందు పరమానంద దాయకమైన నీ మనోహర రూపము ఉదయించునట్లు చేయుము. అందువలన ఆనందమున మగ్నుడనై శరీరమంతయు గగుర్పాటు చెందగా ఆనంద బాష్పములు జాలువారగా ఏ మాత్రము తగ్గని సమస్త బాధలను సైతము మరచి పోవుదును.

మరుద్గేహాధీశ త్వయి ఖలు పరాంచోఽపి సుఖినో
భవత్స్నేహీ సోఽహం సుబహు పరితప్యే చ కిమిదమ్ |
అకీర్తిస్తే మా భూద్వరద గదభారం ప్రశమయన్
భవత్భక్తోత్తంసం ఝటితి కురు మాం కంసదమన || ౩-౯||

గురువాయూరప్పా! కంస హరణా! నీ పట్ల ఏ మాత్రము భక్తి లేని వారు సుఖములను అనుభవించు చున్నారు. కానే నీ యందు సంపూర్ణానురాగము కల నేను మాత్రము ఈ విధముగా రోగముతో బాధ పడుతున్నాను. ఇదేమి విచిత్రము? భక్తులు కోరిన వరము లొసగు స్వామీ! దీని వలన నీకు చాలా అపకీర్తి కలుగునయ్య! అది సముచితము కాదు కదా! దయతో నా రోగ బాధను తగ్గించి వెంటనే నీ భక్తులలో శ్రేష్ఠునిగా చేయుము.

కిముక్తైర్భూయోభిస్తవ హి కరుణా యావదుదియాత్
అహం తావద్దేవ ప్రహితవివిధార్తప్రలపితః |
పురః క్లృప్తే పాదే వరద తవ నేష్యామి దివసాన్
యథాశక్తి వ్యక్తం నతినుతినిషేవా విరచయన్ || ౩-౧౦||

భక్తులు కోరిన వరము లొసగు ఓ స్వామీ! ఇంక అతిగా నా బాధలు చెప్పుకొనుట అనవసరము. నాకు కలిగిన రోగ బాధల వలన వ్యర్థమైన ప్రలాపనలు చేయుచుంటిని. వాటిని మానుకొని నీకు దయ కలుగునంత వరకు నా శక్తి మేరకు నీ దగ్గర నమస్కారములు, స్తుతులు, సేవలు చేయుచు దినములను గడుపుటకు నిశ్చయించు కొంటిని. ఇది తథ్యము.

పాండురంగాష్టకం - తాత్పర్యము

పండరీపుర దైవమైన  పాండురంగని మహిమలు మనకు పుండరీకుని గాథ ద్వారా తెలుస్తుంది. 


పండరీపురంలో పుండరీకుడనే  వర్తకుడుండే వాడు. ముసలి వారైన అతని తల్లిదండ్రులు తన అభివృద్ధికి ఆటంకమని తలచి వారిని ఇంట్లోనుంచి గెంటి వేస్తాడు. వారు  ఒక పేద యాత్రికుల బృందములో చేరి కాలి నడకన  కాశీ ప్రయాణం బయలు దేరుతారు. పుండరీకుడు మాత్రం అశ్వాలు, రథాలతో బయలుదేరుతాడు. దారిలో తల్లిదండ్రులను దాటినా, వారిని పట్టించుకోకుండా ముందుకు సాగుతాడు.

దారిలో అతను రోహిత దాసుడనే చర్మకారుడి కుటీరం చూస్తాడు. రోహిత దాసుడు తన సుఖాలను పక్కకు పెట్టి తన తల్లిదండ్రులకు భక్తి తో సేవ చేస్తుంటాడు. అక్కడ ఆ రోజు రాత్రి పుండరీకుడు కొలనులో ముగ్గురు అందవిహీనమైన స్త్రీలు మునిగి అందమైన దేవతా స్త్రీలగా మారటం చూస్తాడు. వారిని గంగ యమునా గోదావరి నదులుగా తెలుసుకుంటాడు. ఆ నదులు తమలో మునిగిన వారి పాపముల వలన అందవిహీనంగా మారి, ఇక్కడ రోహితుని కుటీరంలో ఉన్న పవిత్రమైన నీటిలో స్నానం చేసి వాటిని ప్రక్షాళనం చేసుకుంటున్నామని చెపుతారు. అది కేవలం రోహితుడు తన తల్లిదండ్రులను సేవించటం వలన జరిగిందని తెలుసుకుంటాడు.

అప్పుడు పుండరీకుని జ్ఞానోదయం కలిగి తల్లీ దండ్రులను కలుసుకొని వారిని, క్షమించమని అడిగి,  తన వద్దకు తీసుకువెళ్ళి మిగిలిన జీవితమంతా వారి సేవ చేస్తాడు. ఒకనాడు శ్రీ మహావిష్ణువు ఒక గొల్లకాపరి రూపంలో పుండరీకుని నివాసానికి వెళ్తాడు. పుండరీకుడు తాను తల్లిదండ్రుల సేవలో నిమగ్నుడనై ఉన్నానని, వేచి ఉండమని చెప్తాడు. విష్ణుమూర్తి తాను ఎవరు అన్నది తెలుపుతాడు. అయినా, పుండరీకుడు తాను తల్లిదండ్రుల సేవలో ఉన్నానని, తాను వచ్చేంత వరకు ఇటుకపై కుఉర్చోని ఉండమని చెప్తాడు. అతని మాతృ, పితృ భక్తికి మెచ్చి విష్ణువు ఆ ఇటుకపైనే కూర్చుని అక్కడ శిలారూపంలో వెలుస్తాడు. అదే పండరిపురంలోని దివ్యక్షేత్రము. అటు తర్వాత, పుండరీకుడు ఆ  విఠలుని  (కదలని ఇటుకపై ఉన్నవాడు) సేవలో తరించి ఐక్యమవుతాడు.

ఆ పండరీ పుర వాసుని స్తుతిస్తూ జగద్గురువులు రచించిన పాండురంగాష్టకము, తాత్పర్యము మీకోసం.   శ్రవణం ప్రతివాద భయంకర శ్రీనివాస్ (పీ.బీ. శ్రీనివాస్ గారు) గారి గళంలో



మహాయోగపీఠే తటే భీమరథ్యా
వరం పుండరీకాయ దాతుం మునీంద్రైః
సమాగత్య తిష్ఠంతమానందకందం
పరబ్రహ్మలింగం భజే పాండురంగం

తటిద్వాససం నీలమేఘావభాసం
రమామందిరం సుందరం చిత్ప్రకాశం
వరం త్విష్టకాయాం సమన్యస్తపాదం
పరబ్రహ్మలింగం భజే పాండురంగం

ప్రమాణం భవాబ్ధేరిదం మామకానాం
నితంబః కరాభ్యాం ధృతో యేన తస్మాత్
విధాతుర్వసత్యై ధృతో నాభికోశః
పరబ్రహ్మలింగం భజే పాండురంగం

స్ఫురత్కౌస్తుభాలంకృతం కంఠదేశే
శ్రియా జుష్టకేయూరకం శ్రీనివాసం
శివం శాంతమీడ్యం వరం లోకపాలం
పరబ్రహ్మలింగం భజే పాండురంగం

శరచ్చంద్రబింబాననం చారుహాసం
లసత్కుండలాక్రాంతగండస్థలాంతం
జపారాగబింబాధరం కంజనేత్రం
పరబ్రహ్మలింగం భజే పాండురంగం

కిరీటోజ్వలత్సర్వదిక్ప్రాంతభాగం
సురైరర్చితం దివ్యరత్నైరనర్ఘైః
త్రిభంగాకృతిం బర్హమాల్యావతంసం
పరబ్రహ్మలింగం భజే పాండురంగం

విభుం వేణునాదం చరంతం దురంతం
స్వయం లీలయా గోపవేషం దధానం
గవాం బృందకానందదం చారుహాసం
పరబ్రహ్మలింగం భజే పాండురంగం

అజం రుక్మిణీప్రాణసంజీవనం తం
పరంధామ కైవల్యమేకం తురీయం
ప్రసన్నం ప్రపన్నార్తిహం దేవదేవం
పరబ్రహ్మలింగం భజే పాండురంగం

స్తవం పాండురంగస్య వై పుణ్యదం యే
పఠంత్యేకచిత్తేన భక్త్యా చ నిత్యం
భవాంభోనిధిం తే వితీర్త్వాంతకాలే
హరేరాలయం శాశ్వతం ప్రాప్నువంతి

ఇతి శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ పాండురంగాష్టకం సంపూర్ణం

తాత్పర్యము: 

మహాయోగ పీఠం అయిన పండరీపురంలో, భీమ రథీ తీరంలో, మునీన్ద్రులతో కూడి పుండరీకునికి వరములిచ్చిన, అనంతమైన ఆనందమునకు మూలమైన, పరబ్రహ్మమైన పాండురంగని నేను పూజిస్తున్నాను. 

తన పాదపద్మములను ఇటుకలో స్థిరముగా ఉంచిన వాడు (విఠలుడు), మెరుపు తీగవలె అలంకరించబడిన వాడు, నీల మేఘ శ్యాముడు, లక్ష్మీ దేవికి నివాసమైన వాడు, సుందరమైన వాడు, ప్రకాశించే అంతరంగము కలవాడు,  పరబ్రహ్మమైన పాండురంగని నేను పూజిస్తున్నాను. 

చేతులను వంచి నడుముపై ఉంచుకొని ఈ మిథ్యా ప్రపంచమంతా నడుములోతు వరకే అని సందేశాన్ని ఇచ్చే, తన నాభి నుండి కమలమును సృష్టించి అందులో బ్రహ్మకు నివాసము ఏర్పరచిన వాడు, పరబ్రహ్మమైన పాండురంగని నేను పూజిస్తున్నాను. 

కౌస్తుభ మణిని మెడలో ధరించిన వాడు, అందమైన భుజకీర్తులు కలవాడు, అందంగా అలంకరించబడిన కురులు కలవాడు, లక్ష్మీ దేవికి నివాసమైన వాడు, శాంతమైన వాడు, శుభకరుడు, జగత్తును కాపాడే వాడు, పరబ్రహ్మమైన పాండురంగని నేను పూజిస్తున్నాను. 

శరత్కాలములోని చంద్రుని వంటి ముఖము కలవాడు, సమ్మోహనము కలిగించే చిరునవ్వు కలవాడు, మెరిసే కర్ణ కుండలములు  చెంపలపై వరకు కలవాడు, ఎర్రని మందారము రంగులో, దొండపండు వంటి పెదవి కలవాడు, కలువ పూల వంటి కళ్ళు కలవాడు, పరబ్రహ్మమైన పాండురంగని నేను పూజిస్తున్నాను. 

నలుదిక్కుల ప్రసరించే ప్రకాశము గల కిరీటమును ధరించిన వాడు, దేవతలచే అమూల్యమైన రత్నములతో పూజించబడే వాడు, మూడు వంపుల ఆహర్యములో నిలబడిన వాడు, వన మాలలు, శిఖి పించము ధరించిన వాడు, పరబ్రహ్మమైన పాండురంగని నేను పూజిస్తున్నాను. 

సర్వ వ్యాప్తమైన వాడు, వేణువును వాయించే వాడు, దుష్టుల పాలిటి చరమ గీతమైన వాడు, ఆటగా గోపాలుని వేషములో ఉండేవాడు, గోవులకు ఆనందము కలిగించే వాడు, వికసించిన కలువ వంటి చిరు నవ్వు కలవాడు, పరబ్రహ్మమైన పాండురంగని నేను పూజిస్తున్నాను. 

జననము లేని వాడు, రుక్మిణీ వల్లభుడు, అనంతమైన ప్రకాశకుడు, ఏకైక మోక్ష కారకుడు, నాలుగవ స్థితి (తురీయం) అయిన వాడు,  ప్రసన్నుడు, దేవ దేవుడు, శరణాగతుల ఆర్తిని పోగొట్టే వాడు, పరబ్రహ్మమైన పాండురంగని నేను పూజిస్తున్నాను. 

పాండురంగని నుతించే ఈ స్తోత్రాన్ని భక్తి మరియు శ్రద్ధతో పఠించే వారు సులభముగా సంసార సాగరాన్ని దాటి, విష్ణు లోక నివాసము పొందుతారు.

శ్రీమన్నారాయణీయం - ఉపోద్ఘాతము


భక్తాగ్రేసరుడు అయిన నారాయణ భట్టతిరి ముఖమునుండి సంస్కృతమున వెలువడిన మధురమైన రచన శ్రీమన్నారాయణీయం. ఇది వ్యాస భాగవతమునకు సంగ్రహ రూపము. దైవ స్తుతి రూపములో కొనసాగే ఈ గ్రంథము కేరళలోని గురువాయూరు క్షేత్రమున వెలసిన శ్రీ మహావిష్ణువును సంబోధిస్తూ రచించబడినది.

కేరళలోని నంబూద్రి వంశమున జన్మించిన నారాయణ భట్టతిరి మంచి పండితుడు. వేద వేదాంగములను అభ్యసించి, వ్యాకరణాది శాస్త్రములలో ఆరితేరి సంస్కృతములో ఎన్నో గ్రంథాలు రచించాడు. వీటిలో శ్రీ పాద స్తుతి, గురువాయుపుర స్తోత్రము, నారాయణీయము ఆయనకు ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టాయి.

భట్టతిరి రోగగ్రస్తుడై ఎన్ని ఔషధములు సేవించినా కూడ స్వస్థత చేకూరక, గురువాయుపురం వచ్చి అక్కడ ఆరాధ్యదైవమైన శ్రీ మహావిష్ణువును స్తుతించాడు. ఆ స్వామి సమక్షంలో మహాకవి యొక్క ముఖము నుండి వెలువడిన స్తుతి పరంపరయే నారాయణీయం. ఇందులో వంద దశకములుగా వేయికి పైగా శ్లోకములున్నవి. భక్తి జ్ఞాన వైరాగ్యములు పెన వేసికొని సాగిన అద్భుత రచన ఇది. ఈ నారాయణీయము నందలి శ్లోక రూపమున ఉన్న స్తుతులతో ప్రసన్నుడైన శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో భట్ట తిరి సంపూర్ణమైన ఆరోగ్యమును తిరిగి పొందాడు. 

గురువాయూర్ క్షేత్ర పురాణం: 


ఇక్కడ అర్చనా మూర్తి అయిన శ్రీ మహావిష్ణువు తన విగ్రహాన్ని బ్రహ్మకు ఇచ్చాడని ప్రతీతి. ఆ బ్రహ్మ దానిని సుతపుడనే మహర్షికి ప్రసాదించాడు. ఆ ముని దానిని కశ్యప ప్రజాపతికి సమర్పించగా ఆయన నుండి అది శ్రీ కృష్ణుని జనకుడైన వసుదేవుని వద్దకు చేరింది. శ్రీ కృష్ణుడు దానిని ద్వారకలో స్థాపించి పూజించాడు. ద్వాపర యుగాంతమున ద్వారక సముద్రములో మునిగి పోవునప్పుడు ఆ దివ్యమూర్తి కొట్టుకొని పోకుండుటకై "దేవతల గురువైన బృహస్పతి ద్వారా దానిని ఒక పవిత్రమైన క్షేత్రములో ప్రతిష్ఠింప చేయుము" అని శ్రీ కృష్ణుడు తన భక్తుడైన ఉద్దవుని ఆదేశిస్తాడు. శ్రీ కృష్ణుని ఆజ్ఞ మేరకు బృహస్పతి వాయుదేవునితో కూడి పవిత్రమైన క్షేత్రము కొరకు వెతుకుతాడు. చివరకు పరమేశ్వరుని సూచన మేరకు గురువు, వాయువు ఆ దివ్య తేజోమూర్తిని పశ్చిమ సముద్ర ప్రాంతమున అంబాపురం అను గ్రామములో ప్రతిష్ఠింప చేస్తారు. గురువు మరియు వాయువు కలిసి ప్రతిష్ఠించుటచే ఆ క్షేత్రానికి గురువాయూరు అని పేరు వచ్చిందిట.

కలియుగ ప్రారంభంలో నిర్మించబడిన ఈ మందిరాన్ని ఒక పాండ్య రాజు పునర్నిర్మించాడు.  ఆ మహారాజు సభలో ఒకరోజు జ్యోతిష్యవేత్తలు "ఓ రాజ! నీవు పది  మాసములలో పాముకాటు వలన మరణిస్తావు" అని తెలుపుతారు. రాజు పవిత్రమైన జీవితము గడుపుతూ ఆ పది మాసములలో దివ్యక్షేత్రాలను దర్శిస్తూ గురువాయూరునకు వచ్చి స్వామిని సేవిస్తాడు. పది మాసముల తర్వాత రాజు క్షేమముగా రాజ్యమునకు తిరిగి వచ్చి జ్యోతిష్కుల మాటలు వమ్ము అయినవని ప్రకటిస్తాడు. దానికి సమాధానముగా వారు రాజు పాము కాటుకు గురియైన విషయము నిజమేనని, కాని ఆ సమయమున రాజు గురువాయూరు క్షేత్రమున ఆదిశేషునితో కూడియున్న శ్రీ మహావిష్ణువును సేవించు చుండటం వలన ఆయనకు మృత్యు ప్రమాదము తప్పినదని తెలిపుతారు. ఆయన శరీరముపై పాముకాటు గుర్తులు ఉండుట చూసి జ్యోతిష్కుల మాట సత్యమే అని అందరు నమ్ముతారు. అప్పుడు రాజు గురువాయూరు మందిరాన్ని పునరుద్ధరించినట్లు ప్రతీతి. నేటికి మహా వ్యాధులకు గురైన వారు ఆ స్వామిని దర్శించి సేవించటం వలన సంపూర్ణారోగ్యముతో వర్ధిల్లుతున్నారు. క్షేత్రాన్ని దర్శించటానికి ఆశక్తులైన వారు ఈ నారాయణీయమును పారాయణము చేసినచో వారికి అట్టి సత్ఫలితాలే ప్రాప్తించునని నమ్మకం.

కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో ఈ నారాయణీయమును భక్తిప్రపత్తులతో పారాయణము చేస్తారు. నేను ప్రచురించ బోయే ఈ పది స్కందాల ధారావాహికానికి మూలం sanskritdocuments.org.

ఈ మార్గశిర మాసం శ్రీకృష్ణునికి అత్యంత ప్రియమైనది (మాసాణాం మార్గశీర్షోహం - మాసములలో నేను మార్గశిరాన్ని అని ఆయన అన్నాడు). అలాగే, సూర్యుడు ధను రాశిలో ప్రవేశించే మాసము ధనుర్మాసంగా పిలవబడుతుంది. గోదా, రంగ నాథుల వైభవాన్ని చాటే తిరుప్పావై ప్రవచనం, అలంకార ప్రియుడైన శ్రీ మహావిష్ణువునకు సేవలు, రక రకాల నివేదనలు - వీటితో సాగిపోతుంది మార్గశిరము మరియు పుష్య మాసం లోని సగ భాగం. ఈ సందర్భంగా మీకోసం నారాయణీయంతో వస్తున్నాను.  

ఓం నమో నారాయణాయ.

2, డిసెంబర్ 2010, గురువారం

ప్రేమ - సాఫల్యము - ప్రేయసి భావన

ప్రేయసి ప్రియుని సేద తీరుస్తూ ఒక భావ యుక్తమైన ఆరాధనా భావమున్న గీతం ఆలపిస్తే ఏమవుతుంది?. ప్రియుని ఒంట్లో, మనసులో ఉన్న అలసట, అలజడి మాటు మాయమై గాఢమైన నిద్ర, ప్రశాంతమైన మనోభావము కలుగుతుంది. అది ప్రేమలో ఉన్న శక్తి. అద్భుతమే మరి ఈ ప్రేమ అనే రెండక్షరాల మంత్ర ఫలము.
 
మరి ఆ ప్రేమలో సాఫల్యానికి కావలసింది ఏమిటి? - ధైర్యము, స్థైర్యము, త్యాగము, నిరాడంబరముతో కూడిన పరిపూర్ణ వ్యక్తిత్వము. తనను తాను పూర్తిగా సమర్పించుకోవటం.  ప్రేమలో సమర్పించుకోవటం అంటే దాసోహం అని కాదు. తన వ్యక్తిత్వాన్ని నిలుపుకొంటూ, భాగస్వామి ఆనందం కోసం ఎంత కష్టమైనా చిరునవ్వుతో ఎదుర్కోవటం. ఇది చెప్పినంత సులువు కాదు. తన అహాన్ని, ఇష్టాయిష్టాలను పక్కకు బెట్టగలిగితేనే ఇది సాధ్యమవుతుంది.

నిజమైన ప్రేమ భాగస్వామిలోని మంచి లక్షణాలను గుర్తించి వాటిని ఆరాధించటంతో మొదలు పెడితే అది మంచి పునాది అవుతుంది. దేహ సౌందర్యానికి, అంతస్తుకు ప్రాధాన్యత ఇస్తే అది నిలవదు. ఎందుకంటే, ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించినప్పుడు జరిగేది నిజ వ్యక్తిత్వ వ్యక్తీకరణ, నిజ స్పందన. ఈ నిజాలు బయట పడుతున్నప్పుడు అవతలి వ్యక్తి సౌందర్యము, అంతస్తు తెరపైన, మనసులో కూడ ఉండవు. అందుకని, నిజ వ్యక్తిత్వాన్ని దాచుకోకుండా ప్రేమ మొదలు పెడితే, అది దాంపత్యముగా, ప్రణయ వైవాహిక జీవితంగా మారుతుంది. మరి భాగస్వామిలో సుగుణాలను గుర్తించటం అంటే?. మొదలు అతని/ఆమె వ్యక్తిత్వాన్ని యథాతథంగా గౌరవించ గలగటం. నీలో నాకు ఇది నచ్చ లేదు అని చెప్పే ముందు మనలో అవతలి వ్యక్తికి ఏమి నచ్చవో ఆలోచించ గలిగితే, గౌరవం మొలకెత్తుతుంది. ఎప్పుడు మన వైపు నుంచే ఆలోచిస్తే, పూర్తిగా అది స్వార్థంతో కూడిన సంబంధంగా నలిగి నశిస్తుంది.

జీవితంలో ఎక్కువ శాతం మన అహాన్ని నిలుపుకోవటం లోనే సరిపోతుంది. నేనే ఎందుకు చేయాలి, నేనే ఎందుకు మరలి, నాకోసం ఇది చేయాలి, నాకు ఎప్పుడు జేజేలు కొట్టాలి - ఈ భావాలన్నీ అహం యొక్క పిలకలే. ప్రేమలో అహం ఉంటే, అది నిత్య రామాయణానికి దారి తీస్తుంది. ఈ భావాన్ని వీడ గలిగితే, ప్రణయం ఎంతో మధురంగా ఉంటుంది. అందుకనే, ప్రేమలో వ్యక్తిత్వ వికాసము, త్యాగము, దృఢ సంకల్పము, మానసిక పరిణతి ఎంతో ముఖ్యం. ఇది 16 - 19 ఏళ్ల వయసులో చాలా తక్కువ మందికి ఉంటుంది. అందుకనే ఆ వయసులోని ప్రేమ సఫలమవ్వటం చాలా కష్టం. 22 -25 ఏళ్ల వయసులో మొదలయ్యే ప్రేమ చిన్న పిల్లల చేష్టలకు, అహానికి, కోపతాపాలకు కొంత దూరంగా ఉండే అవకాశం ఎక్కువ. కాబట్టి, వ్యక్తిత్వాని అభివృద్ధి పరచుకొని, అప్పుడు జీవిత భాగ స్వామిని ఎన్నుకునే పనిలో పడితే, అది స్వర్ణ జయంతి వివాహంగా నిలిచే అవకాశం ఎక్కువ.

గుడ్డివాడైన ప్రియుని కోసం ఒక ప్రేయసి ఎంత మధురంగా ఉండగలిగిందో ఊహించ గలరా?.

వెన్నెల లోని అభివృద్ధి అంతా నీ కళ్లలో వెలిగిస్తాను, బాధ మరచి పోయి హాయిగా నిద్రపో అనే పల్లవిలో సాగేది ఈ గీతం.

మొదటి చరణంలో - అందమైన ప్రపంచం వర్ణన చేయాలి అంటే వసంతకాలంలోని ప్రకృతి అందాలు మంచి ఉపమానం. చిగురించి నిండుగా పచ్చగా ఉండే కాలం ఉత్సాహకరమైన భావనను, మంచి ఆలోచనలను రేకెత్తిస్తుంది. అందుకనే కవి, వాడని పూవులతో ఉన్న చెట్లను ఈ గీతంలో ఉపమానంగా ఉపయోగించారు. అటువంటి వసంతకాలంలో చెలి వినోద రాగాలను జోలగా పాడుతుంటే, కలల సుఖాలలో తేలుతూ హాయిత నిదురించు అని ప్రేయసి ఆలపిస్తుంది. ప్రకృతి, వసంతకాలము, మంచి రాగము, జోల పాట పాడే చెలి ఉంటే నిద్దుర రాకుండా  ఎలా ఉంటుంది? అందమైన కల కలిగి తీరాల్సిందే.

రెండవ చరణంలో - సూర్యుని వీడని నీడలా (ఆయన పత్ని ఛాయ) నీ భావములో నీ తరిస్తాను అని చెలి తన పరి పూర్ణ వ్యక్తిత్వాన్ని, గాఢ మైన ప్రేమను వ్యక్త పరుస్తుంది. అంటే, అతని భావములో తాను జీవించి, ఆస్వాదించి, అతనితో కలసి తరిస్తుంది అని అర్థం. మరి దానికి దేన్ని ఎదుర్కోటానికైన ఆమె సిద్ధమే. నీ సేవలోనే తరిస్తాను, నీ హృదయములో నివశిస్తాను అని ప్రేయసి అతనికి ధైర్యాన్ని, విశ్వాసాన్ని కలిగిస్తుంది. సేవ అంటే కేవలం శారీరకంగా కాదు, దానికి మానసిక భావన, నిజాయితీ మెట్టుగా వేసుకొని ముందడగు వేయటం. అటువంటి సేవ చేస్తే మరి హృదయంలో స్థానం ఏర్పడి తీరాల్సిందే. 


మనసు కవి, మన సుకవి, ఆచార్య ఆత్రేయ రచించిన ఇంత అందమైన ప్రేమ భావానికి నాయిక నాయకులు గా మహానటి సావిత్రి, అక్కినేని కూడితే? దానికి రసరాజు సాలూరి రాజేశ్వర రావు గారు మంచి మాధుర్య భరితమైన సంగీతాని కూరిస్తే? అదే ఆరాధన చిత్రంలోని వెన్నెల లోని వికాసమే వెలిగించెద నీ కనులా అనీ ఈ రమణీయ గీతం. వింటే ప్రేమ పుష్పాలు వికసించి మనసు పులకించాల్సిందే. విని ప్రేమ రసాస్వాదన పొందుతారని ఆశిస్తూ, మీ కోసం ఈ గీతం సాహిత్యం, యూట్యూబ్ దృశ్య శ్రవణం.

వెన్నెలలోని వికాసమే వెలిగించెద నీ కనులా వెన్నెలలోని వికాసమే వెలిగించెద నీ కనులా
వేదన మరచి ప్రశాంతిగా నిదురించుము ఈ రేయీ నిదురించుము ఈ రేయీ |వెన్నెల|


వాడని పూవుల తావితో కదలాడే సుందర వసంతమీ కాలము కదలాడే సుందర వసంతమీ కాలము
చెలి జోలగ పాడే వినోద రాగాలలో చెలి జోలగ పాడే వినోద రాగాలలో తేలెడి కలల సుఖాలలో నిదురించుము ఈ రేయి |వెన్నెల|


భానుని వీడని ఛాయగా నీ భావములో నే తరింతునోయి సఖా నీ భావములో నే తరింతునోయి సఖా
నీ సేవలలోనే తరింతునోయీ సదా నీ సేవలలోనే తరింతునోయీ సదా 
నీ ఎదలోనే వసింతులే నిదురించుము ఈ రేయీ నిదురించుము ఈ రేయీ |వెన్నెల|

వెడలెను కోదండపాణి - త్యాగరాజస్వామి కృతి

వెడలెను కోదండపాణి అనుజ సౌమిత్రితో గూడి పుడమిలో జనులెల్ల పొగడ పూజితుడౌ మునితో గూడి శిరమన కొండెయు జార  వురమున హారములు మెరయ కరమున శరచాపములును ఘ...