5, జులై 2020, ఆదివారం

లక్షణములు గల రామునికి - త్యాగరాజస్వామి కృతి



లక్షణములు గల రామునికి ప్రదక్షిణమొనరింతాము రారే

కుక్షిని బ్రహ్మాండములున్నవట విచక్షణుడట దీక్షాగురుడట శుభ

లక్షణ లక్ష్యము గల శ్రుతులకు ప్రత్యక్షంబౌనట
శిక్షబడి సభను మెప్పించు భక్తరక్షకుండౌనట
అక్షరస్థులైన భజనపరులకే అంతరంగుడౌనట
సాక్షియై వెలయు త్యాగరాజపక్షుండౌనట ముప్పది రెండు

ముప్ఫై రెండు శుభలక్షణములు గల శ్రీరామునికి ప్రదక్షిణము చేసేదము రండి! కడుపులో బ్రహ్మాండములు కలవాడు, సమస్త జీవుల కార్యాకార్యములను పరిపూర్ణంగా ఎఱిగిన వాడు, తనను ఆశ్రయించిన వారి అంతరంగములోని చైతన్యమును పరమాత్మతో అనుసంధానం చేసే దీక్షను అనుగ్రహించువాడు, వస్తు స్వరూపము, స్వభావము చెప్పునట్టి వేదవచనములచే తెలియబడువాడు, అనేక పరీక్షలు లోనై భగవంతుని యందు నమ్మకము వీడకుండా మెప్పించే భక్తజనులను రక్షించువాడు, ఓంకారరూపమైన పరమాత్మ తత్త్వమునెఱిగి వివిధనామ రూప క్రియలతో భజించువారికి అంతరంగమయ్యేవాడు, సాక్షీభూతుడైనవాడు, పరమశివుని పక్షముననుండు వాడు, అనేక శుభలక్షణములు కలిగిన శ్రీరామునికి ప్రదక్షిణము చేసేదము రండి.

-సద్గురువులు త్యాగరాజస్వామి

శుద్ధ సావేరి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని మల్లాది సోదరులు ఆలపించారు

4, జులై 2020, శనివారం

తుంగాతీరం విరాజం - కమలేశదాస రాఘవేంద్ర గీతరాజం


మధ్వ సాంప్రదాయంలోని గురు పరంపర అత్యంత వైభవమైనది. 13వ శతాబ్దంలో మధ్వాచార్యులతో ఆరంభమైన ఆరంభమైన ఈ పరంపర ఆయన చాటిన ద్వైత సిద్ధాంతాన్ని పరిరక్షిస్తూ సనాతన ధర్మ వృక్షంలో పవిత్రమైన కొమ్మగా నిలిచింది. ఆయన స్థాపించిన ఉడిపి శ్రీకృష్ణ మఠం భవ్యమైన ఆధ్యాత్మిక క్షేత్రంగా భాసిల్లుతోంది. ఈ మధ్వ సాంప్రదాయంలో 

తుంగాతీరం విరాజం భజ మన రాఘవేంద్ర యతిరాజం

మంగళకర మంత్రాలయ వాసం
శృంగారానన రాజిత హాసం
రాఘవేంద్ర గురురాజం భజ మన తుంగా తీర విరాజం

కరధృత దండ కమండల మాలం
సురుచిర చేలం ధృత మణిమాలం
రాఘవేంద్ర యతిరాజం భజ మన తుంగా తీర విరాజం

నిరుపమ సుందర కాయ సుశీలం
వర కమలేశార్పిత నిజ సకలం
రాఘవేంద్ర యతిరాజం భజ మన తుంగా తీర విరాజం



రామా నిను నమ్మిన వారముగామా - త్యాగరాజస్వామి



రామా నిను నమ్మిన వారముగామా సకల లోకాభి

పామర జన దూర వర గుణ ఘృణాపాంగ శుభాంగ ముని హృదయాబ్జ భృంగ

వాలాయముగాను రాను జాగేల సుగుణ దశరథ నృపాల హృదయానందకార శ్రి లోల పాల వెలయుమిక
ఫాల లోచన హృదయాలయాప్త జన పాల కనకమయ చేల ఇక పరాకేల ఇపుడు మమ్మేల నీదు మనసేల రాదు

నీవే గతి యంటిని గాని నే వేరేమి ఎరుగను ముందర రావే నీ పద పంకజ భక్తి నీవే భావజారి నుత
దేవ నీదు పద సేవా ఫలము మము గావునే పతిత పావన త్రిదశ నాధనీయ ముని జీవనానిశము బ్రోవనేల శ్రీరామ

ధారాధర నిభ దేహ జనాధార దురితాఘ జలద సమీర త్యాగరాజ హృదయాగార సార హీన సం
సారమందు వేసారి నిన్ను మనసార నమ్ము కొన నేరలేని నే నూరక ఇక విచారమందుటకు మేర గాదు శ్రీరామ

సమస్త లోకములకు ఆనందంకు కలిగించే శ్రీరామా! మేము నిన్ను నమ్మినవారము గామా? పామరులకు దూరుడవు, శ్రేష్ఠమైన గుణములు కలవాడవు, దయాకటాక్షములు గలవాడవు, శుభమైన అంగములు కలవాడవు, మునుల హృదయకమలములకు తుమ్మెద వంటి వాడవు నీవు. దశరథ మహారాజు హృదయమునకు ఆననందము కలిగించిన వాడవు మమ్ములను కాపాడుటకు వేగముగా రావేల? వచ్చి రక్షించుము. శివుని హృదయములో నివసించే వాడవు, ఆప్తజనులను పాలించే వాడవు, బంగారు వస్త్రములు ధరించే వాడవు, ఇంక పరాకెందుకు? ఇప్పుడు మమ్ములను కాపాడుటకు నీకు మనసేల కలుగుటలేదు? నీవే శరణన్నాను, నీ పాదపద్మముల భక్తి తప్ప వేరేమీ ఎరుగను, వేగముగా వచ్చి కాపాడుము. మన్మథుని శత్రువైన శివునిచే నుతించబడిన వాడవు, నీ పాదములను సేవించే ఫలము మమ్ములను కాపాడును కదా! పతితులను పావనము చేసే వాడవు, మూడులోకములకు అధిపతివి, మునుల జీవనమైన వాడవు, ఎల్లప్పుడూ మమ్ములను బ్రోచుటకేల ఆలస్యము? మేఘముల వంటి కాంతితో శరీరము గల శ్రీరామా! జనులకు ఆధారము నీవే. పాపములనెడి మేఘములను వాయువు వలె తరిమి కొట్టేవాడవు, శివుని హృదయములో నివసించే వాడవు, ఈ సారములేని సంసార సాగరమందు వేసారి నిన్ను మనసారా నమ్ముకొన్నాను, నిస్సహాయుడైయున్న నన్ను బాధ పెట్టుట ఇంక మర్యాద కాదు శ్రీరామా! మేము నిన్ను నమ్మినవారము, వేగమే వచ్చి మమ్ము రక్షించుము.

- సద్గురువు త్యాగరాజస్వామి

https://www.youtube.com/watch?v=kYiuLbRHxRk

గం గణపతే నమో నమ - ముత్తయ్య భాగవతార్ కృతి

గం గణపతే నమో నమ! శంకరి తనయా నమో నమో!

అంకుశధర! మంగళకర! పంకజ చరణా! వారణ!

పంకజాసనాది వందిత! భక్తార్తి హరణ!ముదిత!
కుంకుమాప! గుణ నిధే! హరికేశ కుమార! మందార!

సమస్త విఘ్నములను అణచే శక్తికి కలిగిన బీజాక్షరం గం. ఆ గం బీజాక్షరముగా కలిగిన పార్వతీదేవి తనయుడైన గణపతికి వందనములు. అంకుశము ఆయుధముగా ధరించి, కమలముల వంటి చరణములు కలిగి,  సమస్త శుభములు కలిగించే గజముఖునికి వందనములు. బ్రహ్మాది దేవతలచే పూజించబడే, భక్తుల ఆర్తిని హరించి ఆనందాన్ని కలిగించే, కుంకుమ చేత పూజించబడిన, సుగుణములకు నిధియైన, శివుని కుమారుడు, భక్తుల పాలిట కల్పవృక్షమైన గణపతికి వందనములు.

- హరికేశనల్లూర్ ముత్తయ్య భాగవతార్ 

కమలాప్త కుల కలశాబ్ది చంద్ర - త్యాగరాజ స్వామి కృతి

కమలాప్త కుల కలశాబ్ది చంద్ర!
కావవయ్య నన్ను కరుణా సముద్ర!!

కమలా కళత్ర! కౌసల్యా సుపుత్ర!!
కమనీయ గాత్ర! కామారి మిత్ర!!

మును దాసులనెల్ల బ్రోచినదెల్ల చాల
విని నీ శరణాశ్రితుడైతినయ్య!
కనికరంబున నాకభయమివ్వుమయ్య
వనజ లోచన శ్రీ త్యాగరాజ వినుత!!

కమలములకు ఆప్తుడైన సూర్యుని వంశమనే పాలకడలికి చంద్రుని వంటి వాడవైన రామా! నీవు కరుణా సముద్రుడవు! నన్ను కాపాడుము! లక్ష్మీదేవికి పతివి, కౌసల్య పుత్రుడవు! మనోహరమైన రూపము కలవాడవు! మన్మథుని శత్రువైన శివుని మిత్రుడవు! ఇంతకు మునుపు నీ దాసులను నీవు కాపాడినది చాలా విని నీ శరణాగతుడనైతిని! దయతో నాకు అభయమీయవయ్యా! కమలముల వంటి కన్నులు కలిగి శివునిచే నుతించబడిన రామా! నన్ను కాపాడుము.

- సద్గురువు త్యాగరాజ స్వామి

https://www.youtube.com/watch?v=HSG0uFo1XKI


17, ఫిబ్రవరి 2018, శనివారం

దక్షిణ భారత శాస్త్రీయ నృత్యాంశం - జావళి


నాయికల శృంగార మనోభావనలను ఆవిష్కరించే జావళులు 19వ శతాబ్దంలో దేవదాసీ వ్యవస్థ ద్వారా బాగా ప్రాచుర్యం పొందాయి. జావళిలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. సాహిత్యం ప్రాంతీయ మాండలికాల పదాలతో కూడి అక్కడి సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. సాధారణంగా ఇవి నృత్య ప్రదర్శనల చివరలో ప్రదర్శించబడతాయి. మంచి సంగీతంతో పాటు సాహిత్యంలో నాయిక మనోభావనలను విశదీకరించడానికి ఈ జావళులు ప్రసిద్ధి. పదాలు జావళులకు మూలం అని చరిత్రకారుల అభిప్రాయం. పదాలలో సంగీతానికి మరింత ప్రాధాన్యత ఉంటుంది. ఒకప్పుడు తంజావూరు వంటి సంస్థానాలలో ఈ పదాలు జావళులు నర్తకీమణులు మహారాజులపై రచించ బడిన అనేక జావళులను ప్రదర్శించే వారు. తరువాత దేవదాసీ వ్యవస్థ రద్దు కావడంతో ఈ అంశం సంగీత ప్రపంచంలో నుండి కాస్త కనమురుగైంది. క్షేత్రయ్య, ఘనం శీనయ్య, ఘనం కృష్ణయ్య, ధర్మవరం రామకృష్ణమాచార్యులు, దాసు శ్రీరాములు వంటి తెలుగు రచయితలు ఈ జావళులు రచించారు. ఇవి తెలుగు, తమిళ, కన్నడ భాషలలో వ్రాయబడ్డాయి. కన్నడ దేశాన దాస సాంప్రదాయంలో ఒక విభాగానికి చెందిన వారు అనేక జావళులు రచించారు. అలాగే తమిళనాట పట్నం సుబ్రహ్మణ్య అయ్యరు తిరుపనండల్ పట్టాభిరామయ్యర్, ధర్మపురి సుబ్బరాయరు, రామనాథపురం శ్రీనివాస అయ్యంగారు మొదలైన వారు జావళులు రచించారు. అయితే, అందరి కన్నా మహారాజా స్వాతి తిరునాళ్ గారి రచనలు బాగా ప్రసిద్ధి. ప్రముఖ వాగ్గేయకారులు మైసూరు వాసుదేవాచార్యుల వారు కూడా జావళులు రచించారు.

రసోత్పత్తిని అద్భుతంగా చేసే జావళులు ప్రధానంగా నాయికా-నాయకుల శృంగారా భావనలపైనే రచించబడ్డాయి. అభినయంలో హావభావాలను వేగంగా మార్చి చూపేందుకు జావళులు ప్రసిద్ధి. భరతనాట్య సాంప్రదాయంలో జావళి ఓ ముఖ్యమైన అంశం. ట్రావెన్‌కోర్, మైసూరు మరియు విజయనగర మహారాజులు పోషించిన నృత్యాంశం జావళి. మనం గమనించవలసిన ఓ ముఖ్యమైన విషయం - రచయిత ఏ ప్రాంతానికి చెందిన వారైనా, 90 శాతం జావళులు తెలుగులోనే రచించబడ్డాయి. జావళి అనే పదం కన్నడ/మరాఠీ భాషల నుండి వచ్చి ఉండవచ్చని సంగీత చరిత్రకారుల అభిప్రాయం. శివరామయ్య అనే రచయిత తెలుగు-తమిళ భాషల మణిప్రవాళంలో జావళులు రచించారు. అలాగే పట్టాభిరామయ్యరు గారు ఆంగ్ల భాషలో జావళులు రచించారు. కన్నడ దేశంలో మాత్రం శృంగారం కాకుండా వైరాగ్య జావళులను కప్పన రచించారు. ప్రజల మనసులను ఆకట్టుకునే విధంగా జావళులను కూర్చారు సంగీతకారులు. ఇవి ఎక్కువ భాగం మధ్యమ లేదా విలంబ కాలంలోనే స్వరపరచబడ్డాయి. పల్లవి, అనుపల్లవి, చరణాల రూపంతోనే ఖమాస్, జంఝూటి, కాపి, హమీర్ కళ్యాణి, బేహాగ్ మొదలైన రాగాలలో ఎక్కువ జావళులు ప్రచారంలోకి వచ్చాయి. రాగ మాలికలలో కూడా జావళులు స్వరపరచబడ్డాయి. సంచార భావాన్ని సంగతులతో, ఆహార్యంతో అద్భుతంగా ప్రదర్శించటానికి జావళులు ప్రసిద్ధి.

మన తెలుగునాట ప్రముఖ సంగీత శాస్త్రజ్ఞులు, రచయిత, సంగీత పరిశోధకులు డాక్టర్ పప్పు వేణుగోపాలరావు గారు జావళులపై విశేషమైన పరిశోధన చేశారు. వారి ప్రకారం దక్షిణ భారత దేశంలో వెయ్యికి పైగా జావళులు అందుబాటులో ఉండగా, వాటిలో 50 మాత్రమే నాట్యప్రదర్శనలలో ప్రచారంలో ఉన్నాయి. ఎమ్మెస్ సుబ్బులక్ష్మి ఎమ్మెల్ వసంతకుమారి, రాధ జయలక్ష్మి, శూలమంగళం సోదరీమణులు మొదలైన సంగీత విద్వాంసులందరూ జావళులు తమ కచేరీలలో పాడారు. పద్మా సుబ్రహ్మణ్యం, బాలసరస్వతి, కమలా లక్ష్మణ్, టీ బృంద, వెంపటి చినసత్యం వంటి నృత్య సంగీత మహామహులు ఈ జావళులపై పరిశోధన చేసి తమ శిష్య పరంపర ద్వారా కళాప్రపంచంలో నిలిచేలా చేశారు. తెలుగు తమిళ సినీ జగత్తులో కూడా 1960వ దశకం వరకు జావళులు బాగా ఉండేవి. పూజాఫలం చిత్రంలో ఘనం శీనయ్య గారి శివదీక్షాపరురాలనురా అనే జావళిని ప్రముఖ నర్తకి ఎల్. విజయలక్ష్మి గారు అద్భుతంగా ప్రదర్శించారు. ఈ గీతాన్ని జానకి గారు ఆలపించారు. ఆ గీతం యొక్క సాహిత్యం, సంగీత శైలి, నృత్యాభినయం చూస్తే జావళుల గురించి పూర్తిగా అర్థమవుతుంది. అలాగే, బొబ్బిలియుద్ధం చిత్రంలో సుశీలమ్మ గారు పాడిన నిను చేర మనసాయెరా అన్న జావళిని శ్రీశ్రీ గారు రచించారు. ఇది కూడా చాలా వేగంగా శృంగరా రసోత్పత్తితో సాగే జావళి.

ప్రముఖ సంగీతజ్ఞులు బాలమురళీకృష్ణ గారు కూడా జావళులను రచించారు. అందులో ఒకటి మరులు మించేరా అనే జంఝూటి రాగంలోని ఈ జావళి.

మరులు మించేరా! సఖా నిన్ను విడనాడలేరా! రా! రా రా!

పరమ సుందరాకారా! నా వలపంతా నీవేరా!
మరల వచ్చెదనని తరలి పోబోకురా! రా! రా రా!

కన్నుల కరవు తీర లో కనినంత నీ రూపు
మిన్నుల విహరించేరా మదనా నా ఆశలు రా రా!

నాయిక నాయకుడైన ఆ కృష్ణుని ప్రేమలో ఆనందపరవశయై ఆలపించే ఈ జావళి నృత్యాభినయానికి అద్భుతమైన అంశం. ఈ నృత్యాంశాన్ని భరతనాట్య సాంప్రదాయంలో రాజశ్రీ వారియర్ గారు ప్రదర్శించారు. శివ దీక్షాపరురాలనురా వేగంగా సాగే జావళి అయితే, బాలమురళి గారి ఈ జావళి నిదానంగా సాగుతుంది. రెండిటిని చూసి ఆనందించండి.

4, అక్టోబర్ 2017, బుధవారం

చేర రావదేమిరా? రామయ్యా! - త్యాగరాజస్వామి కృతి



చేర రావదేమిరా? రామయ్యా! 

మేరగాదురా ఇక మహామేరుధీర! శ్రీకర! రామయ్య!

తల్లి తండ్రి లేని బాల తన నాథు గోరు రీతి పలుమారు వేడుకొంటే పాలించ రాదా?
వలచుచు నేను నీదు వదనారవిందమును తలచి కరుగ జూచి త్యాగరాజ సన్నుత!

ఓ రామయ్యా! నన్ను చేర రావేమిరా! మేరు పర్వతమంతటి మహా ధీరుడవు, శుభకరుడవు, ఇక నా వల్ల గాదురా రామయ్యా! తల్లి తండ్రి లేని బాలిక తన రక్షణను కోరే రీతి నేను అనేకమార్లు నిన్ను వేడుకొన్నాను.నన్ను పాలించ రాదా!  శివునిచే నుతించబడిన ఓ రామా! నీ మనసు కరుగుటకై,  నిన్నే కోరుచు,  నీ ముఖారవిందమును తలచుచున్నాను. నన్ను చేర రావేమిరా!

- సద్గురువులు త్యాగరాజస్వామి

మల్లాది సోదరులు గానం చేసిన ఈ కృతి రీతిగౌళ రాగంలో స్వరపరచబడినది.


వెడలెను కోదండపాణి - త్యాగరాజస్వామి కృతి

వెడలెను కోదండపాణి అనుజ సౌమిత్రితో గూడి పుడమిలో జనులెల్ల పొగడ పూజితుడౌ మునితో గూడి శిరమన కొండెయు జార  వురమున హారములు మెరయ కరమున శరచాపములును ఘ...