17, ఫిబ్రవరి 2018, శనివారం

దక్షిణ భారత శాస్త్రీయ నృత్యాంశం - జావళి


నాయికల శృంగార మనోభావనలను ఆవిష్కరించే జావళులు 19వ శతాబ్దంలో దేవదాసీ వ్యవస్థ ద్వారా బాగా ప్రాచుర్యం పొందాయి. జావళిలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. సాహిత్యం ప్రాంతీయ మాండలికాల పదాలతో కూడి అక్కడి సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. సాధారణంగా ఇవి నృత్య ప్రదర్శనల చివరలో ప్రదర్శించబడతాయి. మంచి సంగీతంతో పాటు సాహిత్యంలో నాయిక మనోభావనలను విశదీకరించడానికి ఈ జావళులు ప్రసిద్ధి. పదాలు జావళులకు మూలం అని చరిత్రకారుల అభిప్రాయం. పదాలలో సంగీతానికి మరింత ప్రాధాన్యత ఉంటుంది. ఒకప్పుడు తంజావూరు వంటి సంస్థానాలలో ఈ పదాలు జావళులు నర్తకీమణులు మహారాజులపై రచించ బడిన అనేక జావళులను ప్రదర్శించే వారు. తరువాత దేవదాసీ వ్యవస్థ రద్దు కావడంతో ఈ అంశం సంగీత ప్రపంచంలో నుండి కాస్త కనమురుగైంది. క్షేత్రయ్య, ఘనం శీనయ్య, ఘనం కృష్ణయ్య, ధర్మవరం రామకృష్ణమాచార్యులు, దాసు శ్రీరాములు వంటి తెలుగు రచయితలు ఈ జావళులు రచించారు. ఇవి తెలుగు, తమిళ, కన్నడ భాషలలో వ్రాయబడ్డాయి. కన్నడ దేశాన దాస సాంప్రదాయంలో ఒక విభాగానికి చెందిన వారు అనేక జావళులు రచించారు. అలాగే తమిళనాట పట్నం సుబ్రహ్మణ్య అయ్యరు తిరుపనండల్ పట్టాభిరామయ్యర్, ధర్మపురి సుబ్బరాయరు, రామనాథపురం శ్రీనివాస అయ్యంగారు మొదలైన వారు జావళులు రచించారు. అయితే, అందరి కన్నా మహారాజా స్వాతి తిరునాళ్ గారి రచనలు బాగా ప్రసిద్ధి. ప్రముఖ వాగ్గేయకారులు మైసూరు వాసుదేవాచార్యుల వారు కూడా జావళులు రచించారు.

రసోత్పత్తిని అద్భుతంగా చేసే జావళులు ప్రధానంగా నాయికా-నాయకుల శృంగారా భావనలపైనే రచించబడ్డాయి. అభినయంలో హావభావాలను వేగంగా మార్చి చూపేందుకు జావళులు ప్రసిద్ధి. భరతనాట్య సాంప్రదాయంలో జావళి ఓ ముఖ్యమైన అంశం. ట్రావెన్‌కోర్, మైసూరు మరియు విజయనగర మహారాజులు పోషించిన నృత్యాంశం జావళి. మనం గమనించవలసిన ఓ ముఖ్యమైన విషయం - రచయిత ఏ ప్రాంతానికి చెందిన వారైనా, 90 శాతం జావళులు తెలుగులోనే రచించబడ్డాయి. జావళి అనే పదం కన్నడ/మరాఠీ భాషల నుండి వచ్చి ఉండవచ్చని సంగీత చరిత్రకారుల అభిప్రాయం. శివరామయ్య అనే రచయిత తెలుగు-తమిళ భాషల మణిప్రవాళంలో జావళులు రచించారు. అలాగే పట్టాభిరామయ్యరు గారు ఆంగ్ల భాషలో జావళులు రచించారు. కన్నడ దేశంలో మాత్రం శృంగారం కాకుండా వైరాగ్య జావళులను కప్పన రచించారు. ప్రజల మనసులను ఆకట్టుకునే విధంగా జావళులను కూర్చారు సంగీతకారులు. ఇవి ఎక్కువ భాగం మధ్యమ లేదా విలంబ కాలంలోనే స్వరపరచబడ్డాయి. పల్లవి, అనుపల్లవి, చరణాల రూపంతోనే ఖమాస్, జంఝూటి, కాపి, హమీర్ కళ్యాణి, బేహాగ్ మొదలైన రాగాలలో ఎక్కువ జావళులు ప్రచారంలోకి వచ్చాయి. రాగ మాలికలలో కూడా జావళులు స్వరపరచబడ్డాయి. సంచార భావాన్ని సంగతులతో, ఆహార్యంతో అద్భుతంగా ప్రదర్శించటానికి జావళులు ప్రసిద్ధి.

మన తెలుగునాట ప్రముఖ సంగీత శాస్త్రజ్ఞులు, రచయిత, సంగీత పరిశోధకులు డాక్టర్ పప్పు వేణుగోపాలరావు గారు జావళులపై విశేషమైన పరిశోధన చేశారు. వారి ప్రకారం దక్షిణ భారత దేశంలో వెయ్యికి పైగా జావళులు అందుబాటులో ఉండగా, వాటిలో 50 మాత్రమే నాట్యప్రదర్శనలలో ప్రచారంలో ఉన్నాయి. ఎమ్మెస్ సుబ్బులక్ష్మి ఎమ్మెల్ వసంతకుమారి, రాధ జయలక్ష్మి, శూలమంగళం సోదరీమణులు మొదలైన సంగీత విద్వాంసులందరూ జావళులు తమ కచేరీలలో పాడారు. పద్మా సుబ్రహ్మణ్యం, బాలసరస్వతి, కమలా లక్ష్మణ్, టీ బృంద, వెంపటి చినసత్యం వంటి నృత్య సంగీత మహామహులు ఈ జావళులపై పరిశోధన చేసి తమ శిష్య పరంపర ద్వారా కళాప్రపంచంలో నిలిచేలా చేశారు. తెలుగు తమిళ సినీ జగత్తులో కూడా 1960వ దశకం వరకు జావళులు బాగా ఉండేవి. పూజాఫలం చిత్రంలో ఘనం శీనయ్య గారి శివదీక్షాపరురాలనురా అనే జావళిని ప్రముఖ నర్తకి ఎల్. విజయలక్ష్మి గారు అద్భుతంగా ప్రదర్శించారు. ఈ గీతాన్ని జానకి గారు ఆలపించారు. ఆ గీతం యొక్క సాహిత్యం, సంగీత శైలి, నృత్యాభినయం చూస్తే జావళుల గురించి పూర్తిగా అర్థమవుతుంది. అలాగే, బొబ్బిలియుద్ధం చిత్రంలో సుశీలమ్మ గారు పాడిన నిను చేర మనసాయెరా అన్న జావళిని శ్రీశ్రీ గారు రచించారు. ఇది కూడా చాలా వేగంగా శృంగరా రసోత్పత్తితో సాగే జావళి.

ప్రముఖ సంగీతజ్ఞులు బాలమురళీకృష్ణ గారు కూడా జావళులను రచించారు. అందులో ఒకటి మరులు మించేరా అనే జంఝూటి రాగంలోని ఈ జావళి.

మరులు మించేరా! సఖా నిన్ను విడనాడలేరా! రా! రా రా!

పరమ సుందరాకారా! నా వలపంతా నీవేరా!
మరల వచ్చెదనని తరలి పోబోకురా! రా! రా రా!

కన్నుల కరవు తీర లో కనినంత నీ రూపు
మిన్నుల విహరించేరా మదనా నా ఆశలు రా రా!

నాయిక నాయకుడైన ఆ కృష్ణుని ప్రేమలో ఆనందపరవశయై ఆలపించే ఈ జావళి నృత్యాభినయానికి అద్భుతమైన అంశం. ఈ నృత్యాంశాన్ని భరతనాట్య సాంప్రదాయంలో రాజశ్రీ వారియర్ గారు ప్రదర్శించారు. శివ దీక్షాపరురాలనురా వేగంగా సాగే జావళి అయితే, బాలమురళి గారి ఈ జావళి నిదానంగా సాగుతుంది. రెండిటిని చూసి ఆనందించండి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి