14, ఆగస్టు 2017, సోమవారం

నాదయోగి నేదునూరి కృష్ణమూర్తి

(నేదునూరి  వారి  వెబ్  సైట్ మరియు ఇతర మూలాల ఆధారంగా)

శాస్త్రీయ సంగీతం మూర్తీభవిస్తే అది నేదునూరి కృష్ణమూర్తి గారవుతుందా అన్నట్లు ఆయన వ్యక్తిత్వం ప్రకాశించింది. దాదాపు ఏడు దశాబ్దాల సుదీర్ఘమైన కర్ణాటక శాస్త్రీయ సంగీత ప్రస్థానం నేదునూరి వారిది. తన వ్యక్తిత్వాన్ని మాటల ద్వారా కాకుండా సంగీతం ద్వారా తెలియజేసిన మహా సంగీత గురువులు నేదునూరి కృష్ణమూర్తి గారు. వారి జీవిత విశేషాలు ఈ వ్యాసంలో.

1927వ సంవత్సరం అక్టోబరు 10న రామమూర్తి పంతులు, విజయలక్ష్మి దంపతులకు పిఠాపురం సమీపంలోని కొత్తపల్లి గ్రామంలో కృష్ణమూర్తి గారు జన్మించారు. రామమూర్తి పంతులు గారు పిఠాపురం మహారాజావారి కొలువులో పని చేసే వారు. తల్లి విజయలక్ష్మి గారు అష్టపదులు, తరంగాలు, ఆధ్యాత్మ రామాయణ సంకీర్తనలు పాడుతూ ఉంటే విని బాలుడైన కృష్ణమూర్తిలో సంగీతం పట్ల అభిలాష పెరిగింది. వయోలిన్ విద్వాంసులు వేమన దొర గారు, అప్పారావు గారు, కల్లూరి వేణుగోపాలరావు గారు వీరి చిన్ననాటి గురువులు.  విజయనగరం రిటైర్డు తహిసిల్దార్ గారు అయిన అప్పలనరసింహం గారు తరచూ కల్లూరి వారింటికి వచ్చే వారు. వారి సహాయంతో కృష్ణమూర్తి గారు 1940వ సంవత్సరంలో విజయనగరంలోని మహారాజ కళాశాలలో సంగీతాభ్యాసం ఆరంభించారు. తొలుత ద్వారం నరసింగరావు నాయుడు గారి వద్ద వయోలిన్ మరియు గాత్ర సంగీత శిక్షణను పొందారు. ద్వారం వేంకటస్వామి నాయుడు గారు మరియు నరసింగరావు నాయుడు గార్ల సలహాతో గాత్రసంగీతం మీదే దృష్టిపెట్టాలని నిర్ణయించుకున్నారు. నరసింగరావు నాయుడు గారి సలహతో లయజ్ఞానం కోసం మృదంగం విద్వాంసులు కోలంక వేంకటరాజు గారి వద్ద శిక్షణను పొందారు. 1945లో కచేరీలు ఇవ్వటం ప్రారంభించారు. తొలి కచేరీ జన్మస్థలమైన కొత్తపల్లిలోనే.

కాకినాడలోని సరస్వతీ గానసభలో ఒకసారి ప్రఖ్యాత వేణువాద్య కళాకారులు టీఆర్ మహాలింగం గారు కచేరీ చేయవలసి ఉండగా ఆయన అనుకోని కారణాల వల్ల సమయానికి రాలేకపోయారు. వారు వచ్చేంత వరకూ  నేదునూరి వారు ఆ సభలో కచేరీ చేశారు. కొద్దికాలంలోనే మంచి కళాకారుడిగా పేరు తెచ్చుకున్నారు. సరస్వతీ గాన సభ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడిన పోటీలలో ప్రథమ బహుమతి కూడా కృష్ణమూర్తి గారు గెలుచుకున్నారు. తరువాత కొన్నాళ్లు రేడియోలో కచేరీలు విని నేర్చుకున్నారు. ప్రముఖుల కచేరీలకు వెళ్లి స్వరాలు రాసుకొని సాధన చేసి తన విద్యను పదునుపెట్టుకున్నారు. ఈ విధంగా స్వయంకృషితో ఆయన సాధన చేశారు. గురువులైన నరసింగరావు నాయుడు గారు, వేంకటరాజు గారు శిష్యునికి ప్రక్క వాయిద్య కాళాకారులుగా పని చేయటం తనకు వారి ఆశీర్వాదంగా భావించారు కృష్ణమూర్తి గారు. తన గాత్రశైలిని అప్పటికే పేరుపొందిన మహామహోపాధ్యాయులు డాక్టర్ శ్రీపాద పినాకపాణి గారి శిష్యుల శైలితో పోల్చి చూసుకొని పినాకపాణి గారి శైలి చాలా బాగుందని గ్రహించారు. ఆయన వద్ద శిష్యరికం చేయాలని నిర్ణయించుకున్నారు.  1949వ సంవత్సరంలో పినాకపాణి గారి అనుమతితో వారి వద్ద శిష్యరికం మొదలు పెట్టారు. పినాకపాణి గారిది అద్భుతమైన గమక సంపద మరియు సంగతులు కలిగిన శైలి. వారి శిక్షణలో కృష్ణమూర్తిగారు పూర్తి కళాకారునిగా ఎదిగారు. తనదైన బాణీని ఏర్పరచుకున్నారు. పినాకపాణి శిష్యులలో ప్రముఖ త్రయం వోలేటి వేంకటేశ్వర్లు గారు, నూకల చినసత్యనారాయణ గారు, నేదునూరి కృష్ణమూర్తి గారు. కానీ, ఈ ముగ్గురి గాత్రం ధర్మము మరియు శైలి చాలా భిన్నమైనవి. జీఎన్ బాలసుబ్రహ్మణ్యం, అరైకూడి, శెమ్మంగూడి మొదలైన తమిళ సంగీత మహామహుల ప్రభావం నేదునూరిపై చాలా ఉండేది. పినాకపాణి గారికి అరైకూడి వారంటే ఎంతో గౌరవం. అందుకే ఆయన కృష్ణమూర్తి గారికి ఆ శైలిలోనే నేర్పించారు. గురువు గారికి తనమీద ఎంతో అభిమానమని, తన గాత్రధర్మానికి తగినట్లుగా శిక్షణనిచ్చారని, ఆ శిక్షణే తన సంగీతం శ్రేష్టం కావటానికి కారణమని కృతజ్ఞతా భావంతో కృష్ణమూర్తి గారు తెలిపారు. పినాకపాణి గారి వద్ద కృష్ణమూర్తి గారు ఎన్నో అరుదైన కృతులను, రాగాలను నేర్చుకున్నారు. కృష్ణమూర్తి గారు పినాకపాణి గారిని సద్గురువులుగా, గొప్ప మనిషిగా, అపారమైన వాత్సల్యమున్న పెద్దగా, మేధావిగా అత్యంత గౌరవ భావం కలిగి ఉండేవారు. కర్నూలు మెడికల్ కాలేజీలో పని చేస్తున్న పినాకపాణి గారి వద్ద తన అభ్యాసాన్ని మరపురాని జ్ఞాపకంగా ఆయన గుర్తు చేసుకునే వారు. తనను పినాకపాణి గారు స్నేహితునిగా, సోదరునిలా చూసుకునే వారని కృష్ణమూర్తిగారు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. వీరిద్దరూ ఒక్కొక్కసారి అర్థరాత్రి వరకు సాధన చేసే వారట.

నేదునూరి గారి విద్వత్తు అనతికాలంలోనే వారిని చెన్నై తీసుకు వెళ్లింది. 1951వ సంవత్సరంలో మద్రాసు సంగీత అకాడెమీ అధ్యక్షులైన చెంబై వైద్యనాథ భాగవతార్ గారు నేదునూరి వారిని అక్కడ పాడవల్సిందిగా కోరారు. ఆ సభకు హాజరైన చెంబై, జీఎన్‌బీ నేదునూరి వారి విద్వత్తుకు ముగ్ధులైనారు. తరువాత పాల్ఘాట్ మణి, పళని సుబ్రహ్మణ్య పిళ్ళై వంటి కళాకారులు కృష్ణమూర్తి గారితో కచేరీలలో పాల్గొన్నారు. తరువాత నేదునూరి వారి ఖ్యాతి దేశ విదేశాల్లో వ్యాపించింది. ఆయన అనేక దేశాలలో కచేరీలు చేశారు. మద్రాసు సంగీత సభలలో పేరు పొందారు. తమిళ కళాకారులు మరియు ఆ రాష్ట్రంలోని శాస్త్రీయ సంగీతాభిమానుల మన్ననలు పొందిన అరుదైన తెలుగు గాయకుల్లో ఒకరిగా ప్రఖ్యాతి పొందారు. నేదునూరి కృష్ణమూర్తి గారు అనేక సంగీత కళాశాలలో అధ్యాపకునిగా, ప్రిన్సిపాల్‌గా పని చేశారు. తొలుత 1963లో విజయవాడలో, తరువాత హైదరాబాదులో, తరువాత విజయనగరంలో, చివరగా మళ్లీ విజయవాడలో పని చేసి 1985లో పదవీ విరమణ చేశారు. రెండు దశాబ్దాల సమయంలో ఆయన ఓ నాలుగేళ్లు డెప్యుటేషన్ మీద తిరుపతి శ్రీవేంకటేశ్వర సంగీత కళాశలలో పని చేశారు. అక్కడ ఉన్నప్పుడే తితిదే వారి అన్నమాచార్య ప్రాజెక్టు కింద 60కి పైగా అన్నమాచార్య కృతులను స్వరపరచారు. ఆయన స్వరపరచిన కొన్ని అన్నమయ్య కీర్తనలు - ఏమొకో చిగురుటధరమున (తిలంగ్), ఒకపరికొకపరి వయ్యారమై (ఖరహరప్రియ), భావములోన (శుద్ధ ధన్యాసి), చేరి యశోదకు (మోహన), నానాటి బతుకు నాటకము (రేవతి), ముద్దుగారే యశోద (కురంజి) మొదలైనవి. భారతరత్న ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు నేదునూరి వారి వద్ద ఈ కృతులను నేర్చుకుని, వాటిని పాడి ఆయన బాణీలను శాశ్వతం చేశారు. నేదునూరి వారు ఎన్నో రామదాసు కీర్తనలను కూడా ప్రాచుర్యంలోకి తీసుకు వచ్చారు. పండు వయసులో 108వ అన్నమాచార్య కీర్తనను స్వరపరచి తన సంగీత విద్వత్తును ప్రపంచమంతా చాటారు. ఆకాశవాణి భక్తిరంజని కార్యక్రమాలకు నేదునూరి వారు ఎంతో సేవను అందించారు. భద్రాచల రామదాసు కీర్తన్లను, తరంగాలను ప్రచారం చేశారు. ఎందరో కళాకారులకు ఆకాశవాణి కార్యక్రమాల ద్వారా పేరు వచ్చేందుకు తోడ్పడ్డారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సంగీత విభాగంలో విసిటింగ్ ప్రొఫెసర్‌గా అయిదేళ్లు పని చేశరు. కర్ణాటక సంగీతంలో శాస్త్రీయతను కాపడేందుకు ఆయన నాద సుధా తరంగిణి అని ఒక ట్రస్టును స్థాపించారు. అన్నమయ్య పదసౌరభాలు అనే 108 కీర్తనల సాహిత్యం, భావం, స్వరాలు కలిగిన మూడు భాగాల పుస్తక సంపుటిని ఈ సంస్థ ద్వారా ప్రచురించారు. శ్రీవేంకటేశ్వర మరియు నాగార్జున విశ్వవిద్యాలయాలలో లలితకళల విభాగానికి అధిపతిగా సేవలను అందించారు.

నేదునూరి వారి సంగీత ప్రస్థానంలో ఎన్నో బిరుదులు, ఎన్నో గౌరవాలు. 1976లో చెన్నై కృష్ణ గాన సభ వారి సంగీత చూడామణి, 1980లో విశాఖ సంగీత అకాడెమీ వారి సంగీత కళాసాగర, 1981లో నాద సుధానిధి, 1982లో గాన కళానిధి మరియు గాయక చూడామణి, 1986లో కేంద్ర సంగీత నాటక అకాడెమీ వారి ఉత్తమ శాస్త్రీయ సంగీత విద్వాంసుని అవార్డు,  1989లో సంగీత విద్వన్మణి, సంగీత విద్యాభాస్కర, నాదయోగి, 1991లో శ్రీకళాపూర్ణ, కంచి కామకోటి పీఠం వారి ఆస్థాన విద్వాన్, 1992లో ప్రతిష్ఠాత్మకమైన సంగీత కళానిధి, 2002లో రాజాలక్ష్మి అవార్డు, 2010లో తితిదే మరియు విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానాల ఆస్థాన విద్వాన్, మొదలైనవి కొన్ని. రాజకీయ ప్రేరితమైన పద్మ అవార్డులు ఇటువంటి మహానుభావునికి ఒక్కటి కూడా రాకపొవటం ఆ అవార్డులకే అవమానం. అయితేనేమి, నేదునూరి నాదయోగిగా ఈ దేశానికి చేసిన సేవలు ఎనలేనివి. వారి శిష్యపరంపర గంగాప్రవాహంలో ప్రతిభతో, శాస్త్రీయతతో కొనసాగుతూనే ఉంది. కళాప్రపూర్ణ దోమాడ చిట్టబ్బాయి గారు, పద్మశ్రీ డాక్టర్ శోభారాజు గారు, మల్లాది సోదరులు, గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు, సరస్వతీ విద్యార్థి గారు, డాక్టర్ శేషులత గారు నేదునూరి వారి శిష్య ప్రముఖులలో కొందరు. శాస్త్రీయత, శృతి శుద్ధతకు, గమకాలకు, స్వర ప్రస్తారాలకు నేదునూరు వారు పెట్టింది పేరు. అంచున్న తెల్లని పంచె, లాల్చీ, కండువా, నుదుటన విభూతి రేఖలు, ముఖంలో గాంభీర్యము, పవిత్రమైన జీవనంతో నాదసాధన చేసిన ఈ సంగీతయోగి 2014 డిసెంబర్ 8న ఆ నాదబ్రహ్మలో ఐక్యమైనారు. పరిపూర్ణమైన సంగీత జీవనంతో వారి ఆత్మ ఆ శంకరుని పాదాల వద్దకు చేరి దేవలోకాలను ఎప్పటికీ అలరిస్తూనే ఉంటుంది. నేదునూరి కృష్ణమూర్తి గారి సాధనకు, సంగీత ప్రజ్ఞకు, వారి వ్యక్తిత్వానికి శతసహస్ర వందనాలు.

నేదునూరి వారు స్వరపరచి, గానం చేసిన పలుకుతేనెల తల్లి పవళించెను అనే అన్నమాచార్యుల వారి కృతి విని ఆనందించండి. 

11, ఆగస్టు 2017, శుక్రవారం

"పలుకు తేనెల తల్లి" వేదవతీ ప్రభాకర్ గారి విశేషాలు


నా చిన్నతనంలో ఆవిడ పాట కోసం ఆకాశవాణి, దూరదర్శన్ కార్యక్రమాలలో మా కుటుంబమంతా ఎదురు చూసే వాళ్లము. వారి వ్యక్తిత్వం ఎంత నిండైనదో వారు పాడే పద్ధతిలో, వారి నడవడికలో అర్థమవుతుంది. హుందాతనానికి వారు ప్రతిబింబం. పరిచయం లేకపోయినా వారిని చూడగానే గౌరవభావం కలుగుతుంది. లలిత సంగీతానికి, లాలిపాటలకు మారు పేరు వారు. ప్రఖ్యాత లలిత భక్తి సంగీత గాయని శ్రీమతి వేదవతీ ప్రభాకర్ గారి విశేషాలు ఈరోజు.

కన్నడ దేశంలో పుట్టి పెరిగి, తెలుగు భాష నేర్చుకొని లలితసంగీతంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న గాయనీమణి వేదవతి ప్రభాకర్ గారు. మైసూరు-బెంగుళూరు మధ్య గల రామనగరిలో రుక్మిణి-శ్రీకంఠయ్య దంపతులకు వేదవతి గారు జన్మించారు. బెంగుళూరులో పెరిగిన వీరు అక్కడే పదేళ్ల వయసునుండి చెన్నమ్మ గారి వద్ద కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు. వీరి తరువాతి గురువు ముద్దులపల్లి లక్ష్మీనరసింహ శాస్త్రి గారు. శ్రీకంఠయ్య గారు బెంగుళూరు గాయన సమాజంలో సభ్యునిగా ఉండటంతో పిల్లలను ప్రతి వారమూ గొప్ప గొప్ప సంగీత విద్వాంసుల కచేరీలకు తీసుకు వెళ్లేవారు. కానీ, అప్పటి కుటుంబపు కట్టుబాట్ల వల్ల వేదికలెక్కి పాడలేకపోయారు. వివాహం ఐపీఎస్ ఆఫీసర్ అయిన రొద్దం ప్రభాకరరావు గారితో జరగటంతో తెలుగునాట ప్రవేశం జరిగింది. మారుమూల ప్రాంతాలలో ఉండవలసి రావటంతో తెలుగు నేర్చుకోవలసి వచ్చింది. అత్తమామలు కళలపట్ల ఆసక్తి కలవారు కావటంతో వారు వేదవతి గారిలోని సంగీత ప్రతిభను బాగా ప్రోత్సహించారు. అనంతపురంలో అత్తమామల దగ్గరకు వెళ్లినప్పుడల్లా వారు వేదవతి గారి కోసం సంగీత గురువును రప్పించే వారు, వారికి కొన్ని కృతులు నేర్చుకునే అవకాశం కల్పించేవారు. భర్తకు నిరంతరం బదిలీలు వచ్చే ఉద్యోగం కావటంతో వారి ఈ సంగీత సాధనకు అంతరాయాలు వచ్చాయి.

ఒకసారి అప్పటి భారత రాష్ట్రపతి, వారి సతీమణి విజయవాడ వచ్చిన సందర్భంలో రోటరీ వారి సభలో అప్పటి ప్రఖ్యాత గాయని శ్రీరంగం గోపాలరత్నం గారు  పాడవలసి ఉండగా ఆవిడ జ్వరంతో రాలేకపోవటంతో వేదవతి గారు అప్పటికప్పుడు ముత్తుస్వామి దీక్షితుల వారి కీర్తనను పాడవలసి వచ్చింది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న ఆకాశవాణి విజయవాడ కేంద్రం డైరెక్టర్ వారిని ఆకాశవాణిలో పాడవలసిందిగా ఆహ్వానించారు. తెలుగుభాష పూర్తిగా రాకపోవటంతో ఆవిడ శ్రీరంగం గోపాలరత్నం గారి సోదరులు శ్రీరంగం గోవిందాచార్యుల వారి వద్ద తెలుగు భాషతో పాటు 15 పాటలు నేర్చుకుని పాడారు. అతి తక్కువ సమయంలోనే ఆకాశవాణి బీ గ్రేడ్ కళాకారిణిగా గుర్తించబడ్డారు. నేదునూరి వారు స్వరపరచిన అన్నమాచార్య కీర్తనలు, బాలమురళి గారు స్వరపరచిన ఇతర గీతాలను ఆవిడ పాడారు. గొప్ప గొప్ప కళకారుల సహచర్యంలో ఆకాశవాణి ద్వారా సేవలందించారు. తరువాత వారు తెలుగు మరియు కన్నడ చిత్రాలలో సాంప్రదాయ గీతాలు పాడారు. జాతీయ స్థాయిలో వారికి అవకాశం జీవీ అయ్యరు గారి ఆదిశంకరాచార్య చిత్రంలో వచ్చింది. ఆ చిత్రంలో కనకధారా స్తోత్రం శ్లోకాలతో పాటు మరెన్నో శ్లోకాలను వేదవతి గారు ఆలపించారు. రామకృష్ణ మఠం వారి ప్రైవేట్ ఆల్బం, తితిదే వారి నవరాత్రి బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు, పురందరదాసుల కృతుల క్యాసెట్లు పాడారు. ఆకాశవాణిలో ఏ గ్రేడ్ కళాకారిణిగా ఎంతో పేరొందారు. భర్త ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డీజీపీ అయినా వేదవతి గారిని ఎంతో ప్రోత్సహించారు. వీరు మంత్రాలయంలో గురు శుక్రవారాలలో నాద నమన అనే కార్యక్రమాన్ని ఆరంభించి ఔత్సాహికులైన కళాకారులకు ప్రోత్సాహం కలిగించారు. వేదవతి గారు పాలగుమ్మి విశ్వనాథం గారి వద్ద కూడా శిక్షణను పొందారు.

ఇక వేదవతి గారి గాత్ర వైశిష్ట్యానికొస్తే - శ్రావ్యమైన శాస్త్రీయ సంగీతంతో పాటు మనసును హత్తుకునే లలిత భావ గీతాలకు వారి గాత్రం పెట్టింది పేరు. భావాన్ని అద్భుతంగా ఒలికించే వారి గానం శ్రోతలను ఆనందంలో ఓలలాడిస్తుంది. పాలగుమ్మి వారి రచన, సంగీతంలో వచ్చిన "అమ్మ దొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగ" అన్న పాటను వేదవతి గారు పాడిన రీతి దశాబ్దాలైనా ఇప్పటికీ తెలుగువారి హృదయాలను తాకుతూనే ఉంది. ఓ ఆడబిడ్డ యొక్క తల్లి మనసును ఆవిష్కరించే ఈ గీతం ఆ తల్లీ-కూతుళ్ల మధ్య గల బంధంలోని భావనలను అద్భుతంగా ఆవిష్కరిస్తుంది. పాలగుమ్మి వారి సాహిత్య సంగీతాలతో కలసి వేదవతి గారి గానం తెలుగువారి మనసులను హత్తుకొని హృదయాలను కరిగిస్తుంది. దేవులపల్లి వారి పూవులేరి తేవే చెలి పోవలె కొవలెకు, మధూదయంలో మంచి ముహూర్తం వంటి అద్భుతమైన లలిత గీతాలు, శివపాదమునుంచ నేను శిలనైనా కారాదా అన్న అరిపిరాల విశ్వం గారి భక్తి లలిత గీతం, జో అచ్యుతానంద జో జో ముకుందా అనే అన్నమాచార్యుల వారి కృతి మొదలైనవి వేదవతి గారి గళంలో ఎంతో ప్రాచుర్యం పొందాయి. జో జో ముకుందా అన్న ఆల్బంలో ఉన్న ప్రతి గీతమూ వారి గాత్ర సౌందర్యానికి ఉదాహరణలు. తప్పకుండా బిడ్డలు అన్నీమరచి నిద్రపోయేలా ఉంటాయి. వింజమూరి శివరామారావు గారి మధురానగరి సమీపంలో అనే గీతం కూడా వీరి గాత్ర సౌరభాన్ని ఆవిష్కరిస్తుంది. వేదవతి గారి మంగళహారతులు కూడా ఎంతో పేరు పొందాయి. శీతాద్రి శిఖరాన అన్న బేతవోలు రామబ్రహ్మం గారి హారతిని బాలమురళి గారి తరువాత వేదవతి గారు పాడిన రీతి తెలుగు నాట దేవాలయాలలో మారు మ్రోగింది. నేదునూరి వారి వద్ద నేర్చుకున్న అన్నమాచార్యుల వారి "పలుకు తేనెల తల్లి" అనే సంకీర్తన వేదవతి గారి గాత్రంలో ఎంతో ప్రాచుర్యం పొందింది.

ఆకాశవాణిలో భక్తిరంజనితో పాటు అనేక లలిత సంగీత కార్యక్రమాలలో వేదవతి గారు పాడారు. మీరాబాయి భజనలను సి. నారాయణ రెడ్డి గారు అనువదించగా పాలగుమ్మి విశ్వనాథం గారి సంగీతంలో వేదవతి గారు పాడారు. ఈ గీతాలు ఎంతో పేరుపొందాయి. ఇవి విన్న హెచ్.ఎం.వీ కంపెనీలో పని చేసే మంగపతి గారు వేదవతి గారి చేత ఈ సినారె గారి మీరా గీతాలను పెండ్యాల నాగేశ్వరరావు గారి సంగీత దర్శకత్వంలో పాడించారు. తిరుప్పావై, దేవీ స్తోత్రాలు, భజనలు వీరికి ఎంతో పేరు ప్రతిష్ఠలు తెచ్చిపెట్టాయి. అమెరికా, కెనడా, ఇంగ్లండు దేశాలతో పాటు అనేక ప్రాంతాలలో 1000కి పైగా కచేరీలలో వేదవతి గారు పాడారు. 2012లో ఉగాది పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం, అపురూప అవార్డు, తెలుగు కళాసమితి వారి కేవీరావు-జ్యోతి రావు అవార్డు మొదలైన పురస్కారాలను వేదవతి గారు పొందారు. సుదీర్ఘమైన సంగీత ప్రస్థానంలో వేదవతి గారు లబ్దప్రతిష్ఠులు, ఎన్నేళ్లైనా వారి గాత్రంలో మాధుర్యం అలానే నిలిచి ఉండటం వారి సాధనను, జీవనశైలిని ప్రతిబింబిస్తుంది. వేదవతి-ప్రభాకరరావు దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. వేదవతి గారికి ఆ భగవంతుడు మరింత సేవా భాగ్యాన్ని, గాత్ర సౌలభ్యాన్ని ప్రసాదించాలని శుభాకాంక్షలు. 

8, ఆగస్టు 2017, మంగళవారం

కనుగొంటి కనుగొంటి- రావు బాలసరస్వతీదేవి గారు ఆలపించిన భక్తి గీతం



కనుగొంటి కనుగొంటి ఈ కంట నేడు 
సంకటహరుడైన శ్రీ వేంకటేశుని 

భక్తుల బ్రోవంగా ఏడుకొండలమీద
అవతారమొందిన అలుమేలుమంగేశుని 

విశ్వరూప దర్శనపు వేళ శ్రిత జనావళి గన
ముదమార వేచిన వేంకటాచలపతిని 

తోమాల సేవలో నానా పరిమళ సుమమాలికావృత 
నీలిదేహుని దివ్యరూపంబు గంటి
ధర్మ సంస్థాపనాసక్త నిత్యాభిషక్తుని 
శంఖ చక్రధరుని మంగళాకరుని

రావు బాలసరస్వతీదేవి గారి గాత్రంలో ఎంత మాధుర్యమున్నదో ఈ గీతం వింటే తెలుస్తుంది. భక్తి భావనతో పాటు లాలిత్యాన్ని పండించిన వారి అమృత గానం ఆ శ్రీనివాసుని పాదాల వద్దకు తప్పక చేరే ఉంటూంది. గీత రచయిత, సంగీతకారులు ఎవరో తెలియదు. సరళమైన సాహిత్యంతోనే అద్భుతమైన భావనలను పండించవచ్చు అని ఈ గీతం మరో మారు నిరూపిస్తుంది. బాలసరస్వతి గారి గీతం కళ్లు మూసుకుని వింటే ఆ వేంకటరమణుని వైభవం కళ్లెదుట నిలుస్తుంది. అన్నమాచార్యుల వారి కలగంటి కలగంటి అనే సంకీర్తన స్ఫురణకు వస్తుంది. అనుపల్లవిలో బాలసరస్వతి గారి ఆలాపనలు అద్భుతం. స్వామికి జరిగే సేవల ప్రస్తావన ఉన్న ఈ గీతంలో ఆ నీలమేఘ శరీరుని దివ్యరూపమును గాంచిన భక్తుని హృదయ కమలములోని భావనలను మనోజ్ఞంగా ఆవిష్కరించిన ఈ గీతం బాలసరస్వతి గారి గాత్రంలో మరింత ప్రకాశించింది. నిత్యాభిషిక్తుడైన ఆ స్వామి దివ్య మంగళ స్వరూపమును గాంచిన భక్తుని ఆనందాతిశయాన్ని లలితంగా కవి తమ పదాలలో ఒలికించారు. బాలసరస్వతి గారి గాత్రాన్ని గమనిస్తే సహజంగా లలితమైన గాత్ర ధర్మం వారిది. స్వరాలను పలికిస్తూనే భావ సౌందర్యాన్ని ఇనుమడింపజేసే అద్భుతమైన గాత్ర లక్షణం వారిది. ఆనంద నిలయుడైన శ్రీనివాసుని దర్శన భాగ్యమున భక్తుని పారవశ్యాన్ని వారి గాత్రం వంద శాతం ప్రతిబింబించింది. లలిత గీతాలకు భావము అత్యంత ప్రముఖమైనది. ఆ ప్రాధాన్యతను ప్రతి ఒక్క గీతంలోనూ పలికించిన వారు బాలసరస్వతి గారు. వారికి మరో మారు వందనాలు. 

6, ఆగస్టు 2017, ఆదివారం

వేంకటాచల నిలయం వైకుంఠపురవాసం - పురందరదాసు దేవర్నామా


వేంకటాచల నిలయం వైకుంఠపురవాసం 
పంకజ నేత్రం పరమ పవిత్రం
శంఖ చక్రధర చిన్మయ రుపం

అంబుజోద్భవ వినుతం అగణితగుణ ధామం 
తుంబురు నారదగాన విలోలం

మకర కుండలధర మదన గోపాలం
భక్త పోషక శ్రీ పురందర విఠలం

శ్రీవేంకటాద్రి నివాసంగా కలిగిన, వైకుంఠ వాసుడు కలువల వంటి కన్నులు గలవాడు, పరమ పవిత్రమైన వాడు, శంఖ చక్రములు ధరించిన వాడు చిదానంద రూపుడు శ్రీవేంకటేశ్వరుడు. పంకజము నుండి జన్మించిన బ్రహ్మచే నుతించిబడిన వాడు, ఎన్నలేని గుణములకు నిలయమైన వాడు, తుంబుర నారదాదుల గానములో తేలియాడే వాడు ఆ స్వామి. మకర కుండలములు ధరించిన ఆ మదన గోపాలుడు భక్తులను పోషించే పురందర విఠలుడు.

- పురందరదాసు

శ్రీనివాస నాయకునిగా నామకరణం చేయబడిన బాలుడు మహా వాగ్గేయకారుడై కర్ణాటక శాస్త్రీ సంగీతానికి ఆద్యుడైనారు. ఆయన గురువులైన వ్యాసతీర్థుల వారు ఆయనకు పురందరదాసు అని పేరు మార్చారు. పురందర విఠల అనే ముద్రతో అద్భుతమైన దాస సాంప్రదాయ కృతులను రచించారు. ఈనాడు మనకున్న కర్ణాటక సంగీతం ఆయన చలవే. వేంకటేశ్వరుడు, శ్రీకృష్ణుడు, గణపతి, మహాలక్ష్మి మొదలైన దేవతా స్వరూపాలపై ఆయన వేల కీర్తనలను రచించి పాడారు. కనడ భాషలో వీటిని దేవర్నామా అంటారు. కన్నడ దేశంలో దాస సాంప్రదాయం ఎంతో ప్రబలం కావటానికి పురందరులు కృషి చేశారు. ఈ సాంప్రదాయం ఇప్పటికీ పటిష్టంగా దక్షిణ భారతమంతా విస్తరించి సనాతన ధర్మ ప్రచారానికి తోడ్పడుతోంది. పురందరుల వారు ఎక్కువ మటుకు కన్నడ భాషలో, కొన్ని సంస్కృతంలో రచనలు చేశారు. వాటిలో ఒకటి వేంకటాచల నిలయం అనే దేవర్నామా సింధుభైరవి రాగంలో కూర్చబడింది. పురందరుల వారి కృతులను ఎమ్మెల్ వసంతకుమారి గారు చాలా ప్రచారం చేశారు. వారి గాత్రంలో ఈ దేవర్నామాను వినండి

నిండు పున్నమి పండు వెన్నెలలో - దాశరథి లలిత గీతం


నిండు పున్నమి పండు వెన్నెలలో
నిను చేరగ నేనెటుల రాగలనో

నీలి నీలి ఆకసము నీడ నే కాలి సవ్వడి లేక రాబోతే
దొంగ తారలు తొంగిచూచెను చందమామ దారికాచెను

తెల్లతెల్లని బొండు మల్లెలతో తనువెల్లా చల్లగా దాచుకుంటేను
నల్ల నల్లని గండు తుమ్మెదలు నా వెంట పడి గల్లంతు చేసెనో
మనసు నీకై పరుగు తీసెనో నా తనువు నీకై వేచెను

- దాశరథి కృష్ణమాచార్యులు

రాధ మనసును ఎంత అందంగా ఆవిష్కరించారో కవి! పున్నమి రేతిరి స్వామికై వేచి యున్న రాధ తన మనోగతాన్ని స్వామికి ఈ గీతం ద్వారా విన్నవించుకుంది. నీలి ఆకాశపు నీడలో చప్పుడు లేకుండా స్వామి వద్దకు రాధ రాబోగా తారలు దొంగతనంగా తొంగి చూచాయట, చందమామ దారి కాచాడట. తెల్లని మల్లెలు ధరించి తన తనువును దాచుకోగా నల్లని గండు తుమ్మెదలు ఆ మల్లెలకోసం వచ్చి ఆమె వెంటపడ్డాయట. తన మానసము ఆ స్వామికై పరుగు తీసిందట, తనువు స్వామికి వేచి ఉన్నదట. మధురభక్తికి రాధ దర్పణమైతే తెలుగుదనంతో దాశరథి గారు ఆ రాధ ఆరాధనను హృద్యంగా ఈ లలిత గీతం ద్వారా ఆవిష్కరించారు. ఇక రావు బాలసరస్వతి గారంటేనే లలిత సంగీతం గుర్తుకు వస్తుంది. వారు తమ అమృత గానంతో ఈ రాధ గీతికకు శాశ్వతత్వాన్ని ఆపాదించారు.

తెలుగుదనానికి లలితగీతాలు అసలైన నీరాజనాలు. అటువంటి గీతమే ఈ నిండు పున్నమి పండు వెన్నెలలో అనే గీతం. లలిత గీతాలకు ప్రాణప్రతిష్ఠ చేసి తారాస్థాయికి తీసుకువెళ్లింది ఆకాశవాణి మరియు ఆ సంస్థలో పని చేసిన కళాకారులు. ఆకాశవాణిలో ప్రసారమైన వందలాది గీతాలు ప్రజల మనసులు దోచుకొని లలిత భావనలను సామాజంలో పెంపొందించేలా చేశాయి. పౌర్ణమి వచ్చేసింది, నిండు పున్నమిలో రాధ మానస మాలికను రావు బాలసరస్వతీదేవి గారి గళంలో జాలువారగా విని ఆస్వాదించండి. ఇది  ఆకాశవాణి ప్రసారం.


2, ఆగస్టు 2017, బుధవారం

పిలువరే కృష్ణుని పేరుకొని యింతటాను - అన్నమయ్య సంకీర్తన


పిలువరే కృష్ణుని పేరుకొని యింతటాను
పొలసి యారగించే పొద్దాయెనిపుడు

వెన్నలారగించబోయి వీధులలో దిరిగేనో
యెన్నరాని యమునలో యీదులాడీనో
సన్నల సాందీపనితో చదువగబోయినాడో
చిన్నవాడాకలి గొని చెలులాల యిపుడు

మగువల కాగిళ్ళ మరచి నిద్దిరించీనో
సొగిసి ఆవుల గాచే చోట నున్నాడో
ఎగువనునుట్లకెక్కి యింతులకు జిక్కినాడో
సగము వేడికూరలు చల్లనాయెనిపుడు

చెంది నెమలి చుంగుల సింగారించుకొనీనో
ఇందునే దేవరవలె యింటనున్నాడో
అందపు శ్రీవేంకటేశుడాడివచ్చెనిదె వీడే
విందుల మా పొత్తుకు రా వేళాయెనిపుడు

ఓ గోపికలారా! కృష్ణుని పేరు పెట్టి పిలవండి! భోజనము చేసే సమయమైంది. గోపకులంలోని యిళ్లలో వెన్న ఆరగించటానికి వెళ్లాడో లేక ఘనమైన యమునలో ఈత కొడుతున్నాడో, సంజ్ఞలు చేసే సాందీపనితో చదువుకోవటానికి వెళ్లాడో, ఇపుడా చిన్నవాడు ఆకలి గొని ఉంటాడు, వాడిని పిలవండి. గోపికల కౌగిళ్లలో ఆదమరచి నిద్రించియున్నాడో, చక్కగా ఆవులను కాచే చోట ఉన్నాడో, పైనున్న ఉట్లెక్కబోయి స్త్రీలకు చిక్కాడో, సగము వేడిగా ఉన్న కూరలు చల్లబడిపోతున్నాయి, వాడిని పిలవండి చెలులారా! నెమలి పింఛాలను సిగలో సింగారించుకుంటున్నాడో, ఇంతలోనే దేవుడిలా ఇంట్లోనే ఉన్నాడో, అందమైన శ్రీవేంకటేశ్వరుడు ఇదిగో ఆడుకొని వచ్చినాడు, విందు చేయటానికి మా దగ్గరకు వచ్చే వేళైంది. వాడిని పిలవండి చెలులారా!

తాళ్లపాక అన్నమాచార్యుల వారు

అన్నమయ్య మధురభక్తిలో కాసేపు తల్లిగా, కాసేపు గోపికగా, కాసేపు భక్తునిగా వేర్వేరు పాత్రలలో లీనమై స్వామిని ఆరాధించాడు. ఇక్కడ తల్లి యశోదగా స్వామిపై ఆ అమ్మ ప్రేమను, ఆతని ఆకలి దప్పులు తీర్చే ఆతృతను మనకు అన్నమయ్య తెలియజేశారు. యశోద ఆ బాలుడు శ్రీహరి అని తెలిసినా మాయలో పడి ఆతనిని తన శిశువుగా లాలించింది, అతనికి మాతృప్రేమను పరిపూర్ణంగా అందించింది. తన బిడ్డ ఎక్కడున్నాడో, భోజనం చేసే సమయమైందని ప్రతి తల్లీ ఆతృతతో వేచియుంటుంది. ఇక్కడ ఆ బాలుడు లీలామానుష రూపుడై ఉన్నప్పటికీ ఆతనిపై అవ్యాజమైన ప్రేమతో అందరి తల్లులలాగానే ఆమె వానిని పిలువమని చెలులకు చెబుతుంది. వెన్నను దొంగిలించటం, సాందీపని మొదలైన వారితొ చదువుకోవటంలో, యమునలో జలక్రీడలలో, గోపికల కౌగిళ్లలో, గోవులను కాయటంలో, స్త్రీల బందీలో ఎక్కడ ఉన్నాడో వాడు, ఆహార పదార్థాలు చల్లబడిపోతున్నాయి అని తల్లి మనసును అద్భుతంగా ఆవిష్కరించారు అన్నమయ్య. అనేక రకములైన భావనలను స్వామికి సమర్పించి మధురభక్తిలో అన్నమయ్య తరించారు. ఈ సంకీర్తనను గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు అద్భుతంగా గానం చేశారు. 

31, జులై 2017, సోమవారం

మాదీ స్వతంత్ర దేశం - రజనీ దేశభక్తి గీతం



రజనీ - ఆ పేరే తెలుగునాట లలితసంగీతానికి మారుపేరు. దేశభక్తి, లలిత గీతాలకు రజనీ హృదయం పుట్టినిల్లు. స్వాతంత్య్ర పూర్వము నుండి తొంభయ్యవ దశకం వరకు తెలుగునాట ఆకాశవాణి ద్వారా మారుమ్రోగిన పేరు బాలాంత్రపు రజనీకాంతరావు గారిది. ఆయన భారతావని స్వతంత్ర జాతిగా ఆవిర్భవించినప్పుడు రచించిన దేశభక్తి గీతం మాదీ స్వతంత్ర దేశం మాదీ స్వతంత్ర జాతి. సంగీతం కూడా ఆయనే కూర్చారు. ఈ గీతాన్ని టంగుటూరి సూర్యకుమారి గారు ఆలపించారు. రజనీ గారి బహుముఖ ప్రజ్ఞ ఆయన గీతాల సాహిత్యంలో, సంగీతంలో మనకు సుస్పష్టంగా తెలుస్తుంది. భరతమాతకు ఈ గీతంలోని అద్భుతమైన పదాల ద్వారా రచయిత తన నివాళులను సమర్పించారు. ఈనాటి తరాల వారికి ఇటువంటి గీతాలు, వాటి అర్థాలు తెలియజేస్తే మన ముందు తరాల వారు ఈ భారతావనికి ఎటువంటి సేవ చేశారో తెలుస్తుంది. కొంతైనా దేశభక్తి అలవడుతుంది. టంగుటూరి సూర్యకుమారి గారు ఆనాడు నటనలో, గానంలో, నృత్యంలో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. వారు పాడిన దేశభక్తి గీతాలు ఈనాటికీ ప్రజల హృదయాలలో నిలిచిపోయాయి. రజనీ, శంకరంబాడి సుందరాచారి, బసవరాజు అప్పారావు, గురజాడ అప్పారావు, నిడదవోలు వెంకటరావు, అడవి బాపిరాజు, రాయప్రోలు సుబ్బారావు వంటి మహనీయుల సాహిత్యం సూర్యకుమారి గారి గళంలో అద్భుతంగా జాలువారింది. రజనీ గారు చాంద్రమానం ప్రకారం శతసంవత్సరాలు పూర్తి చేసుకుని హైదరాబాదులో నివసిస్తున్నారు. ఆయన ప్రముఖ తెలుగు కవి ద్వయమైన వేంకట పార్వతీశ కవులలో ఒకరైన బాలాంత్రపు వేంకటరావు గారి కుమారుడు. రజనీ కళాప్రపూర్ణ బిరుదాంకితులు. వారికి ఒక్క పద్మ అవార్డు రాకపోవటం ఎంతో శొచనీయం. సూర్యకుమారి గారంటే శంకరంబాడి సుందరాచారి గారు రచించిన మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీతం యొక్క అద్భుతమైన గానం గుర్తుకొస్తుంది. వీరు ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారి సోదరుని కుమార్తె. సూర్యకుమారి గారు 1960వ దశకం నుండి లండన్‌లో స్థిరపడి 2005లో మరణించారు. రజనీ-సూర్యకుమారి గార్ల సమన్వయంలో వెలువడిన మాదీ స్వతంత్ర దేశం గీత సాహిత్యం, ఆడియో.

మాదీ స్వతంత్ర దేశం మాదీ స్వతంత్ర జాతి 
భారతదేశమే మా దేశం భారతీయులం మా ప్రజలం 

వింధ్య హిమవత్ శ్రీనీలాద్రుల
సంధ్యారుణిత నవాశలు మావి 
గంగా గోదావరీ సహ్యజా
తుంగ తరంగిత హృదయాల్ మావి

ఆలయమ్ముల  శిల్పవిలాసం
ఆరామమ్ముల కళాప్రకాశం
మొగల్ సమాధుల రస దరహాసం  
మాకు నిత్య నూతనేతిహాసం

అహింసా పరమో ధర్మః 
సత్యంవద ధర్మంచర 
ఆదిఋషుల వేదవాక్కులు 
మా గాంధి గౌతముల సువాక్కులు

స్వతంత్రతా భ్రాత్రుత్వాలు 
సమత మా సదాశయాలు 
జననీ ఓ స్వతంత్ర దేవి   
గొనుమా నివ్వాళులు మావి 

మాది స్వతంత్ర దేశం, స్వేచ్ఛ కలిగిన జాతి. భారతదేశమే మా దేశం, భారతీయులమే మా ప్రజలం. వింధ్య, హిమాలయ, నీలగిరి పర్వతాలు మా ఆశలకు ఉదయించే కొత్త వెలుగులు. గంగా, గోదావరి, సహ్యాద్రి, తుంగ నదుల ఉప్పొంగే ప్రవాహాలతో మా హృదయాలు పరవశిస్తాయి. మా ఆలయాల అద్భుతమైన శిల్పకళ, మా ఉద్యానవనాల కళాత్మక సౌందర్యం, మొగల్ సమాధులలోని కళా వైభవం మా దేశ చరిత్రను ఎప్పటికీ కొత్తగా అనుభవింపజేస్తాయి. అహింసే అత్యున్నత ధర్మం. సత్యం మాట్లాడు, ధర్మాన్ని ఆచరించు అని ప్రాచీన ఋషులు అందించిన వేదబోధనలు, గౌతమ బుద్ధుడు, మహాత్మా గాంధీ వంటి మహనీయుల ఉత్తమ సందేశాలు మా మార్గదర్శకాలు. స్వాతంత్య్రం, సోదరభావం, సమానత్వం మా ఉన్నతమైన ఆదర్శాలు. ఓ స్వతంత్ర భారతమాతా, తల్లీ, నీకు మా హృదయపూర్వక నివాళులు స్వీకరించు.

వెడలెను కోదండపాణి - త్యాగరాజస్వామి కృతి

వెడలెను కోదండపాణి అనుజ సౌమిత్రితో గూడి పుడమిలో జనులెల్ల పొగడ పూజితుడౌ మునితో గూడి శిరమన కొండెయు జార  వురమున హారములు మెరయ కరమున శరచాపములును ఘ...