రజనీ - ఆ పేరే తెలుగునాట లలితసంగీతానికి మారుపేరు. దేశభక్తి, లలిత గీతాలకు రజనీ హృదయం పుట్టినిల్లు. స్వాతంత్య్ర పూర్వము నుండి తొంభయ్యవ దశకం వరకు తెలుగునాట ఆకాశవాణి ద్వారా మారుమ్రోగిన పేరు బాలాంత్రపు రజనీకాంతరావు గారిది. ఆయన భారతావని స్వతంత్ర జాతిగా ఆవిర్భవించినప్పుడు రచించిన దేశభక్తి గీతం మాదీ స్వతంత్ర దేశం మాదీ స్వతంత్ర జాతి. సంగీతం కూడా ఆయనే కూర్చారు. ఈ గీతాన్ని టంగుటూరి సూర్యకుమారి గారు ఆలపించారు. రజనీ గారి బహుముఖ ప్రజ్ఞ ఆయన గీతాల సాహిత్యంలో, సంగీతంలో మనకు సుస్పష్టంగా తెలుస్తుంది. భరతమాతకు ఈ గీతంలోని అద్భుతమైన పదాల ద్వారా రచయిత తన నివాళులను సమర్పించారు. ఈనాటి తరాల వారికి ఇటువంటి గీతాలు, వాటి అర్థాలు తెలియజేస్తే మన ముందు తరాల వారు ఈ భారతావనికి ఎటువంటి సేవ చేశారో తెలుస్తుంది. కొంతైనా దేశభక్తి అలవడుతుంది. టంగుటూరి సూర్యకుమారి గారు ఆనాడు నటనలో, గానంలో, నృత్యంలో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. వారు పాడిన దేశభక్తి గీతాలు ఈనాటికీ ప్రజల హృదయాలలో నిలిచిపోయాయి. రజనీ, శంకరంబాడి సుందరాచారి, బసవరాజు అప్పారావు, గురజాడ అప్పారావు, నిడదవోలు వెంకటరావు, అడవి బాపిరాజు, రాయప్రోలు సుబ్బారావు వంటి మహనీయుల సాహిత్యం సూర్యకుమారి గారి గళంలో అద్భుతంగా జాలువారింది. రజనీ గారు చాంద్రమానం ప్రకారం శతసంవత్సరాలు పూర్తి చేసుకుని హైదరాబాదులో నివసిస్తున్నారు. ఆయన ప్రముఖ తెలుగు కవి ద్వయమైన వేంకట పార్వతీశ కవులలో ఒకరైన బాలాంత్రపు వేంకటరావు గారి కుమారుడు. రజనీ కళాప్రపూర్ణ బిరుదాంకితులు. వారికి ఒక్క పద్మ అవార్డు రాకపోవటం ఎంతో శొచనీయం. సూర్యకుమారి గారంటే శంకరంబాడి సుందరాచారి గారు రచించిన మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీతం యొక్క అద్భుతమైన గానం గుర్తుకొస్తుంది. వీరు ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారి సోదరుని కుమార్తె. సూర్యకుమారి గారు 1960వ దశకం నుండి లండన్లో స్థిరపడి 2005లో మరణించారు. రజనీ-సూర్యకుమారి గార్ల సమన్వయంలో వెలువడిన మాదీ స్వతంత్ర దేశం గీత సాహిత్యం, ఆడియో.
మాది స్వతంత్ర దేశం, స్వేచ్ఛ కలిగిన జాతి. భారతదేశమే మా దేశం, భారతీయులమే మా ప్రజలం. వింధ్య, హిమాలయ, నీలగిరి పర్వతాలు మా ఆశలకు ఉదయించే కొత్త వెలుగులు. గంగా, గోదావరి, సహ్యాద్రి, తుంగ నదుల ఉప్పొంగే ప్రవాహాలతో మా హృదయాలు పరవశిస్తాయి. మా ఆలయాల అద్భుతమైన శిల్పకళ, మా ఉద్యానవనాల కళాత్మక సౌందర్యం, మొగల్ సమాధులలోని కళా వైభవం మా దేశ చరిత్రను ఎప్పటికీ కొత్తగా అనుభవింపజేస్తాయి. అహింసే అత్యున్నత ధర్మం. సత్యం మాట్లాడు, ధర్మాన్ని ఆచరించు అని ప్రాచీన ఋషులు అందించిన వేదబోధనలు, గౌతమ బుద్ధుడు, మహాత్మా గాంధీ వంటి మహనీయుల ఉత్తమ సందేశాలు మా మార్గదర్శకాలు. స్వాతంత్య్రం, సోదరభావం, సమానత్వం మా ఉన్నతమైన ఆదర్శాలు. ఓ స్వతంత్ర భారతమాతా, తల్లీ, నీకు మా హృదయపూర్వక నివాళులు స్వీకరించు.


కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి