31, జులై 2017, సోమవారం

నల్లని వాడా! నే గొల్ల కన్నెనోయ్! - వింజమూరి శివరామారావు గారి గీతం



నల్లని వాడా! నే గొల్ల కన్నెనోయ్! పిల్లన గ్రోవూదుమోయ్! నా యుల్లము రంజిల్లగా!

నీ తీయని పాటలకై రేతిరి ఒంటిగ వచ్చితినే!
నా మనసు తనువు నా మనికే నీది కదా పిల్లన గ్రోవూదుమోయ్!! నల్లనివాడా!!

ఆకసాల మబ్బులనీ చీకటులే మూగెననీ!
నేనెరుంగనైతిని నీ తలపే వెలుంగాయె పిల్లన గ్రోవూదుమోయ్! నల్లనివాడా!!

మెరుపే నీ గోపికయై వలపే నా నెచ్చెలియై!
తోడి తెచ్చె నీ దరికీనాడు పండె నా నోములు పిల్లన గ్రోవూదుమోయ్!! నల్లనివాడా!!

- వింజమూరి శివరామారావు గారు

ఎంత అద్భుతమైన లలిత గీతమో! వింజమూరి శివరామారావు గారు సీత-అనసూయ సోదరీమణులతో పాటు వింజమూరి వంశంలో జన్మించిన మరో ప్రతిభామూర్తి. ఈయన ఆకాశవాణిలో ఎన్నో సంవత్సరాలు పని చేశారు. అద్భుతమైన లలితగీతాలు రచించారు. వీరు రచించిన రామాయణం గేయం అప్పట్లో ఆకాశవాణిలో మారుమ్రోగింది. సీత-అనసూయ గార్ల లాగానే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు వీరికి మేనమామలు. కళాప్రపూర్ణ బిరుదాంకితులు శివరామారావు గారు. గౌతమి అనే కలం పేరుతో ఆయన రచనలు చేశారు. 600కు పైగా రేడియో నాటకాలను అందించారు.

గోపిక మనో భావనలను తెలిపే ఎన్నో లలిత గీతాలు వచ్చాయి. వాటిలో శివరామారావు గారి ఈ గీతం ప్రత్యేకమైనది. కృష్ణ భక్తిలో స్వామిపై ఉండే అధికారము, స్వామికి ఆత్మ నివేదన, ప్రేమానురాగాలు అనన్యమైనవి. అవే భావనలను కవి ఈ గీతంలో అద్భుతంగా ఆవిష్కరించారు. స్వామి తీయని పాటల కోసం అర్థరాత్రి ఒంటరిగా వచ్చిన గోపిక స్వామిని తన మనసు రంజిల్ల జేసేలా పిల్లనగ్రోవి ఊది పాడమని వేడుకుంటుంది. తన మనసు, తనువు, జీవితము అన్నీ స్వామివే అని తెలుపుతుంది. చీకటి వేళలో, ఆకాశంలో మబ్బులు మూగినా వాటిని లెక్క చేయక స్వామి తలపులే వెలుగుగా చూస్తూ ఆయన కోసమై వచ్చాను అని తెలియజేస్తుంది. మేఘముల మెరుపే గోపికగా, స్వామిపై ప్రేమయే సఖిగా తోడ్కొని తనను స్వామి దరికి తెచ్చెనని, తన నోములు పండాయని, పిల్లనిగ్రోవి ఊది పాడమని ఆ నల్లనయ్యను ప్రార్థిస్తుంది.   ఆత్మ నివేదన మధురభక్తికి సూచిక. నేను అన్న భావన మరచి, ధైర్యంగా స్వామి దరికి చేరుకునే గోపికల మనోభావనలను సూచించే గీతం ఇది. ఇక రావు బాలసరస్వతి గారి గానం ఈ భావానికి సాధనమైతే? అదో రసరమ్య గీతమే. కృష్ణభక్తిని అక్షర లక్షలుగా ప్రకటితం చేసిన బాలసరస్వతి గారి గానం లలిత సంగీత ప్రపంచంలో మకుటాయమానం. పట్టులాంటి మృదువైన గాత్రం వారిది. ముఖ్యంగా సాలూరి వారి గీతాలకు వారి గళం ఎంత నప్పుతుందో. ఈ గీతం ఎవరు స్వరపరచారో తెలియదు కానీ కళ్యాణి రాగంలో ఉంది కాబట్టి సాలూరి వారే అనుకుంటున్నాను. వారికి కళ్యాణి రాగమంటే ప్రాణం. గీతం వింటుంటే సాలూరి వారి ఛాయలు స్పష్టంగా తెలుసుతున్నాయి. లలిత సంగీతపు స్వర్ణయుగంలో బాలసరస్వతి గారి ఆణిముత్యపు గీతాలలో ఒకటైన నల్లని వాడా విని ఆస్వాదించండి. కృష్ణభక్తిలో తరించండి. 

29, జులై 2017, శనివారం

ఓం నమశ్శివాయ! చంద్రకళాధర! సహృదయ! - వేటూరి గీతం


ఓం నమశ్శివాయ! చంద్రకళాధర! సహృదయ! సాంద్రకళాపూర్ణోదయ! లయ నిలయ!

పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై
ప్రకృతి పార్వతి నీతో నడచిన ఏడు అడుగులే స్వరసప్తకమై
నీ దృక్కులే అటు అష్ట దిక్కులై నీ వాక్కులే నవరసమ్ములై
తాపస మందారా! నీ మౌనమే దశోపనిషత్తులై ఇల వెలయ!

త్రికాలములు నీ నేత్ర త్రయమై చతుర్వేదములు ప్రాకారములై
గజముఖ షణ్ముఖ ప్రమథాదులు నీ సంకల్పానికి ఋత్విజవరులై 
అద్వైతమే నీ ఆదియోగమై నీ లయలే ఈ కాలగమనమై
కైలాస గిరివాస! నీ గానమే జంత్రగాత్రముల శృతి కలయ!

- వేటూరి సుందరరామ్మూర్తి గారు

కవుల ఆధ్యాత్మిక దార్శనికత వారి రచనలలో తేటతెల్లమవుతుంది అన్నదానికి వేటూరి వారి ఓం నమశ్శివాయ అనే గీతం ప్రత్యక్ష నిదర్శనం. కళాతపస్వి ఆలోచనలను, శైలిని ప్రేక్షకుల హృదయాలలో నిలిపేలా చేసేవి వారి చిత్రాలలోని గీతాలు. అటువంటిదే ఓం నమశ్శివాయ అనే గీతం. వేటూరి వారికి సాగరసంగమంలో ఆ సందర్భానికి ఇటువంటి గీతాన్ని రాయమని చెప్పటం విశ్వనాథ్ గారి కళాత్మక దృష్టిని,ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని సూచిస్తుంది.

నెలవంక చంద్రుని శిరసుపై గల సహృదయుడవు, పరిపూర్ణమైన కళలకు నిలయమైన వాడవు, లయ యందు నివసించే వాడవు అయిన శివా! నమస్కారములు. పృథివ్యాపస్తేజోవాయురాకాశములు ఐదు ముఖములుగా (సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన ముఖములు), ఆరు ఋతువులు ఆభరణములైన ఆహార్యముగా, ప్రకృతి రూపిణియైన పార్వతి నీతో నడిచే అడుగులే సప్తస్వరాలు. నీ చూపులే అష్ట దిక్కులు, నీ పలుకులు నవరసాలు. నీవు తాపసులలో శ్రేష్ఠుడవు. నీ మౌనం నుండే ఉపనిషత్తులు ఈ భువిలో వెలసాయి. ఓ పరమశివా! నీకు నమస్కారములు. మూడు కాలములు నీ మూడు కళ్లుగా, నాలుగు వేదాలు నీ నివాసమైన కైలాసానికి ప్రాకారాలుగా, గణపతి, కుమారస్వామి మొదలైన ప్రమథ గణాలు నీ సంకల్పాన్ని అమలు చేసే ఋత్విజ శ్రేష్ఠులై, అద్వైత భావనతో నీ యోగము సనాతనమై, నీ  లయలు కాలానికి ముందడుగులై నీ గానం వాయిద్యములతో జంత్రగాత్రమై శృతిలో పలికినావు. ఓ కైలాసవాసా! నీకు నమస్కారములు.

సృష్టి స్థితి లయములలో లయకారకుడు శివుడు. ఆ లయానికి నాదం మూలం. నిరంతర నాద పరివేష్టితుడైన పరమ శివుడు ఆనంద తాండవంతో పాటు విలయతాండవం కూడా చేస్తూ నిరంతరం ధ్యానంలో ఉంటాడని మన వేద వాఙ్మయం ఘోషిస్తోంది. ఆ పరమశివుని కైలాస ప్రస్తారాన్ని ఒక్కసారి కళ్ల ముందుంచే ప్రయత్నం వేటూరి వారు ఈ గీతం ద్వారా చేశారు. సాహిత్యంలోని భావాన్ని పరిశీలిస్తే శివతత్త్వం ప్రస్ఫుటమవుతుంది. నీ మౌనమే దశొపనిషత్తులై ఇల వెలయ అని గీతాన్ని ముగించారు వేటూరి వారు. మౌనమేమిటి ఉపనిషత్తులేమిటి అని ప్రశ్న రావచ్చు. దక్షిణామూర్తి ఎవరు? శివుడే కదా? మౌనంతో ఋషులకు జ్ఞానబోధ చేసిన ఆ పరమశివుని సంకల్పం అద్భుతం. ఇటువంటి తత్త్వం వింటేనే మనసు పులకరిస్తుంది.

ఇళయరాజా గారి సంగీతం, వేటూరి వారి సాహిత్యం, జానకి గారి గాత్రంలో ఈ గీతం అజరామరమైంది. సాగర సంగమం చిత్రానికి ఇళయరాజా గారికి జాతీయ స్థాయిలో ఉత్తమ సంగీత దర్శకుని పురస్కారం లభించింది. వేటూరి గారికి, విశ్వనాథ్ గారికి, ఇళయరాజా గారికి ఇటువంటి గీతాన్ని అందించినందుకు మనం ఎంతో ఋణపడి ఉన్నాము. 

పరమపురుషమనుయామవయం సఖి - నారాయణ తీర్థుల తరంగం


పరమపురుషమనుయామవయం సఖి పరమ పురుషమనుయామ

సురుచిర హాసం సుందర నాసం తరుణరుణ కిరణాధర సరసం 

నంద కుమారం నగవర ధీరం బృందావన భువి వివిధ విహారం 
బృందారక గణ వందిత చరణారవింద మిళిత మణి మధుకర నికరం 

యువతీ గీత యోగి సులలితం కవి జన మానస కమల విలసితం 
శివ నారాయణ తీర్థ విరచితం శ్రీ గోపాల దయా రస మిళితం

- నారాయణ తీర్థుల వారు (శ్రీకృష్ణ లీలా తరంగిణి)

ఓ సఖులరా! పరమ పురుషుడైన ఆ శ్రీకృష్ణుని అనుసరిద్దాం రండి!  మోహనమైన చిరునవ్వుతో, అందమైన ముక్కుతో, సూర్యకాంతివలె ఎర్రగా ప్రకాశించే పెదవులు కలిగి రసపురుషుడైన ఆ కృష్ణుని అనుసరిద్దాం! నందుని కుమారుడు, అసమాన ధీరుడు, బృందావనంలో సంచరించే వాడు, దేవతలచే పూజించబడిన వాడు, వారి శిరసున ఉన్న కిరీటములలోని మణులచే ప్రకాశించిన చరణములు కలవాడు అయిన శ్రీకృష్ణుని అనుసరిద్దాం. శ్రీకృష్ణుని దయారసం మిళితమై నారాయణ తీర్థులు వారు రచించిన ఈ గీతం గోకులంలోని స్త్రీల గానం చేయగా యోగుల మనసులు ఆనందించాయి, కవుల హృదయ కమలములు వికసించాయి.

నారాయణ తీర్థుల వారు శ్రీకృష్ణుని లీలలను, ఆయన రూపాన్ని వర్ణించినంత మనోహరంగా ఇంక ఏ వాగ్గేయకారుడూ వర్ణించలేదంటే అతిశయోక్తి కాదు. శ్రీకృష్ణ లీలా తరంగిణిలో ఎన్నో కీర్తనల ద్వారా ఆయన బృందావన కృష్ణుని నుతించారు. అందులో ఒకటి ఈ పరమ పురుషమనుయామ అనే కీర్తన. శరదృతువులో బృందావనంలో వేణుగానం చేస్తున్నాడు శ్రీకృష్ణుడు. అతని కోసం వేచి యున్న గోపికలు ఆ గానానికి ముగ్ధులై ఈ గీతాన్ని ఆలపించినట్లు, అక్కడి యోగులు, కవులు దానిని ఆస్వాదించినట్లు ఈ గీతం వివరిస్తుంది. బేహగ్ రాగంలో మల్లాది సోదరులు ఈ గీతాన్ని హృద్యంగా పాడి కృష్ణ తత్వాన్ని ఆవిష్కరించారు. విని తరించండి.


స్వామినాథ పరిపాలయాశు మాం - దీక్షితుల కృతి


స్వామినాథ పరిపాలయాశు మాం  స్వప్రకాశ వల్లీశ గురు గుహ దేవసేనేశ

కామజనక భారతీశ సేవిత
కార్తికేయ నారదాది భావిత
వామదేవ పార్వతీ సుకుమార
వారిజాస్త్ర సమ్మోహితాకార
కామితార్ధ వితరణ నిపుణ చరణ
కావ్య నాటకాలంకారాభరణ
భూమి జలాగ్ని వాయు గగన కిరణ
బోధ రూప నిత్యానంద కరణ

స్వప్రకాశుడవు, వల్లీ దేవసేనల పతివి, గురుగుహుడవు అయిన ఓ స్వామినాథా! నన్ను రక్షింపుము. ఓ కార్తికేయా! బ్రహ్మ విష్ణువు మరియు దేవతలచే పూజించబడిన వాడవు, నారదాది మునులచే భావించబడిన వాడవు. శివ పార్వతుల సుపుత్రుడవు. మన్మథునికి కూడా సమ్మోహనమైన ఆకారము కలవాడవు. నీ పదములను ఆశ్రయించిన వారి కామ్యములను తీర్చే నిపుణుడవు. కావ్యములు, నాటకము, అలంకారములు మొదలైన కళలను పెంపొందించే వాడవు, భూమి, నీరు, అగ్ని, వాయు మరియు ఆకాశములకు ప్రకాశమైనవాడవు, జ్ఞానస్వరూపుడవు, సచ్చిదానందమునకు కారకుడవు. నన్ను రక్షింపుము.

- ముత్తుస్వామి దీక్షితుల వారి  కృతి రంజని-గాయత్రిల యుగళ గాత్రంలో వినండి.


నీ నామ రూపములకు నిత్య జయ మంగళం - త్యాగరాజస్వామి మంగళ హారతి



నీ నామ రూపములకు నిత్య జయ మంగళం 
పవమాన సుతుడు పట్టు పాదారవిందములకు ||నీ నామ||
పంకజాక్షి నెలకొన్న అంక యుగమునకు ||నీ నామ||
నళినారి గేరు చిరునవ్వు గల మోమునకు ||నీ నామ||
నవ ముక్త హారములు నటియించు యురమునకు ||నీ నామ||
ప్రహ్లాద నారదాది భక్తులు పొగడుచుండు ||నీ నామ||
రాజీవ నయన త్యాగరాజ వినుతమైన ||నీ నామ||

మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే
చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం

"నీ నామునకు, రూపమునకు నిత్యము జయము, మంగళము కలుగు గాక! వాయుపుత్రుడైన హనుమంతుడు సేవించే నీ పాదములకు, కలువలవంటి కన్నులు గల సీత కూర్చునే నీ అంకములకు (తొడలకు), చిరునవ్వుతో చంద్రునివలె ఉండే నీ మోమునకు, మంచి ముత్యముల హారములు నర్తించే నీ వక్షస్థలమునకు, ప్రహ్లాదుడు, నారదాదులు పొగడే అందమైన కన్నులు కలిగి పరమశివునిచే నుతించబడిన నీకు మంగళము"

- సద్గురువు త్యాగరాజస్వామి శ్రీరామునికి పాడిన మంగళ హారతి


రారా కృష్ణయ్య - దాశరథి గీతం



దీనుల కాపాడుటకు దేవుడే ఉన్నాడు 
దేవుని నమ్మిన వాడు ఎన్నడూ చెడిపోడు
ఆకలికి అన్నము వేదనకు ఔషధం
పరమాత్ముని సన్నిధికి రావే ఓ మనసా

రారా కృష్ణయ్య రారా కృష్ణయ్యా
దీనులను కాపాడ రారా కృష్ణయ్యా
రారా కృష్ణయ్యా రారా

మా పాలిటి ఇలవేలుపు నీవేనయ్యా
ఎదురు చూచు కన్నులలో కదిలేవయ్యా
పేదల మొరలాలించే విభుడవు నీవే
కోరిన వరములనొసగే వరదుడవీవే
అజ్ఞానపు చీకటికి దీపము నీవే
అన్యాయమునెదిరించే ధర్మము నీవే
నీవే కృష్ణా నీవే కృష్ణా నీవే కృష్ణా

కుంటివాని నడిపించే బృందావనం
గ్రుడ్డివాడు చూడగలుగు బృందావనం
మూఢునికి జ్ఞానమొసుగు బృందావనం
మూగవాని పలికించే బృందావనం
అందరినీ ఆదరించు సన్నిధానం
అభయమిచ్చి దీవించే సన్నిధానం
సన్నిధానం దేవుని సన్నిధానం సన్నిధానం

కరుణించే చూపులతో కాంచవయ్యా
శరణొసగే కరములతో కావవయ్యా
మూగవాని పలికించి బ్రోవవయ్యా
కన్నతల్లి స్వర్గములో మురిసేనయ్యా
నిన్ను చూచి బాధలన్నీ మరిచేనయ్యా
ఆధారము నీవేరా రారా కృష్ణా
కృష్ణా కృష్ణా రారా కృష్ణా 

శరణాగతితో ఆర్తితో వేడుకుంటే బ్రోచే కరుణామయుడు పరమాత్మ. ఈ సత్యాన్ని ఎన్నో ఉదాహరణలుగా మనకు సనాతన ధర్మ ప్రవాహంలోని వేద వాఙ్మయం, పురాణాలు, ఇతిహాసాలు, గాథలు ఘోషించాయి. కలియుగంలో కూడా సద్గురువుల కృపతో పరమాత్ముని అనుగ్రహం మనకు అంది అద్భుతాలు జరుగుతున్నాయి. బిడ్డలు లేని వాళ్లకు బిడ్డలు, బ్రతకడు అనుకున్న బిడ్డ పూర్ణాయుష్మంతుడు కావడం, మూగవానికి మాటలు రావటం వంటివెన్నో జరుగుతూనే ఉన్నాయి. ఇటీవలే తిరుమల స్వామి దర్శనం తరువాత మాట వచ్చిన మూగవాడే ఈ పరమాత్మ అనుగ్రహానికి సాక్షి. ఇసద్గురువుల అనుగ్రహంతో వైద్యులు పిల్లలు పుట్టరు అన్నవారికి పిల్లలు పుట్టిన సంఘటనలు ఎన్నో నాకు తెలుసు. అటువంటి వాటిని చలన చిత్రాలు కూడా ప్రస్తావించాయి. వాటిలో 1968లో విడుదలైన రాము చిత్రంలోని బాలుడి పాత్ర, రారా కృష్ణయ్యా అనే గీతం.

దేవాలయాలు సందర్శన కోసమే కాదు సత్పురుషుల, యోగుల సాంగత్యానికి కూడా అని మనకు కొన్ని చలనచిత్రాలు అద్భుతంగా తెలిపాయి. అప్పటి చిత్రాలలో దేవాలయ సన్నివేశాలు తప్పకుండా ఉండేవి. దీక్షతో, మంత్ర జప సాధనతో, అధివాసములతో, యంత్ర మహిమతో ప్రతిష్ఠించబడిన దేవాలయ మూర్తులు పరమాత్మ ప్రతిబింబాలు. అటువంటి దేవాలయాలు యోగులకు, సాధువులకు, భక్తులకు ఆలవాలమై పవిత్రమైన క్షేత్రాలుగా ప్రసిద్ధి పొందాయి. అక్కడ దివ్యత్వం నిండి ఉంటుంది.  మన పాపాలను, మనసులలోని మలినాలను ప్రక్షాళన చేసుకునే అవకాశాన్ని దేవాలయాలు కలిగిస్తాయి. అటువంటి సన్నివేశమే రాము చిత్రంలోని ఈ గీత నేపథ్యం. తల్లి మంటలలో చిక్కుకొని మరణించటం చూస్తూ ఆ బాలుడు మాట కోల్పోతాడు. ఆ తండ్రి ఆవేదనతో డాక్టర్లకు చూపించగా అతనికి మాట వచ్చే అవకాశం లేదని చెబుతారు. అప్పుడు ఆ బాలుడు ఆత్మహత్య చేసుకోబోతాడు. తండ్రి కూడా నిరాశతో కొడుకుతో కలిసి సముద్రంలో మునిగిపోయే ప్రయత్నం చేయబోగా ఓ మందిరంలో కృష్ణుని రారా అని పిలుస్తున్న ఓ సాధువు పాట విని తండ్రీ కొడుకులు అక్కడికి వెళ్లి ఆ కృష్ణుని ప్రార్థిస్తారు. ఆ పరమాత్మ అనుగ్రహంతో మళ్లీ మరో అగ్నిప్రమాద సన్నివేశంలో బాలుడికి మాటలు వస్తాయి. అమ్మలా ప్రేమించే టీచరమ్మ మంటల్లో చిక్కుకోగా బాలుడు మాట్లాడే ప్రయత్నం చేసి అమ్మా అని పిలిచి సఫలమవుతాడు.

దాశరథి గారి గీతానికి ఆర్.గోవర్ధనం గారు సంగీతం అందించగా ఘంటసాల మాష్టారు ఈ భక్తి గీతాన్ని అద్భుతంగా పాడారు. పరమాత్మ సన్నిధే మనకు శరణు అన్న భావన ఈ గీతం కలిగిస్తుంది. ఇహపరాలు రెండిటిలోనూ మనలను తరించేది పరమాత్మే అన్నది ఈ గీతం ద్వారా దాశరథిగా చక్కగా తెలియజేశారు. ఘంటసాల మాష్టారు గళంలో భక్తివిశ్వాసాలు, శరణాగాతి సుస్ఫష్టంగా, భావరాగ యుక్తంగా మన హృదయాలను హత్తుకుంటాయి.


శ్రీ రామ జయ రామ శృంగార రామ యని - త్యాగరాజస్వామి కృతి


శ్రీ రామ జయ రామ శృంగార రామ యని చింతింప రాదె ఓ మనసా

తళుకు చెక్కుల ముద్దుబెట్ట కౌసల్య మును తపమేమి చేసెనో తెలియ

దశరథుడు శ్రీ రామ రారాయనుచు బిల్వ తపమేమి చేసెనో తెలియ

తమి మీర పరిచర్య సేయ సౌమిత్రి మును తపమేమి చేసెనో తెలియ 

తన వెంట చన జూచి యుప్పొంగ కౌశికుడు తపమేమి చేసెనో తెలియ 

శాపంబణగి రూపవతియౌటకహల్య మును తపమేమి చేసెనో తెలియ

ధర్మాత్ము చరణంబు సోక శివ చాపంబు తపమేమి చేసెనో తెలియ

తన తనయ నొసగి కనులార గన జనకుండు తపమేమి చేసెనో తెలియ

దహరంబు కరగ కరమును బట్ట జానకి తపమేమి చేసెనో తెలియ

త్యాగరాజాప్తయని పొగడ నారద మౌని తపమేమి చేసెనో తెలియ

రాముని వైభవాన్ని రామావతారంలోని వేర్వేరు పాత్రలు సన్నివేశాలతో కూర్చి అద్భుతంగా వర్ణించారు త్యాగరాజస్వామి. మెరిసే బుగ్గలపైన ఆ బాలరాముని ముద్దాడటానికి కౌసల్య ఎటువంటి తపస్సు చేసిందో? నిజమే, రాముని వంటి ధర్మమూర్తికి, అవతారపురుషునకు తల్లిగా లాలించే అదృష్టం కౌసల్యకు కలగటం తపఃఫలమే. ఆడుతూ పాడుతూ బుడి బుడి అడుగులు వేస్తున్న రాముని చూచి దశరథుడు రామా రారా అని పిలవటానికి ఏమి తపస్సు చేశాడో? లేక లేక బిడ్డలు కలుగగా ఆ నలుగురూ కారణ జన్ములు కావటం, వారికి తండ్రి దశరథుడు కావటం ఆయన చేసుకున్న తపఃఫలమే. అన్న అలసట తీర సేవ చేసే భాగ్యాన్ని లక్ష్మణుడికి దక్కటం అతని తపఃఫలమే. ఆదిశేషుని అవతారంగా చెప్పబడే లక్ష్మణుడు స్వామిని వీడి ఉండలేడని తెలిసి సోదరునిగా పుట్టించి అతనికి నిరంతర సేవాభాగ్యాన్ని ప్రసాదించాడు స్వామి. ఆ సౌమిత్రి ఏమి తపస్సు చేశాడో? యాగరక్షణకై తన వెంట వచ్చిన రాముని చూసి ఉప్పొంగిన విశ్వామిత్రుడు ఏమి తపస్సు చేశాడో? రామావతారంలో వశిష్ఠ విశ్వామిత్రాది ఋషులెందరో శ్రీరామునికి బోధ చేశారు, మార్గదర్శకులైనారు. వారిలో విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు బల అతిబల విద్యలతో పాటు అస్త్ర శస్త్రాలను ప్రసాదిస్తాడు. యాగరక్షణతో పాటు వారి వివాహానికి తోడ్పడతాడు. శాపవశాత్తు వేలయేండ్లు స్థాణువై నిలిచిన అహల్య రాముని పాదము సోకి తిరిగి చేతన కావటానికి ఏమి తపస్సు చేసిందో? ఆ ధర్మమూర్తియైన రాముని స్పర్శను పొందటానికి ఆ శివధనుస్సేమి తపము చేసిందో? పరమశివుని చాపము జనకునికి పూర్వీకులనుండి పరంపరగా వచ్చింది. రాముని కోసమే వేచియున్నట్లు జానకి స్వయంవరానికి కారకమై సాద్గుణ్యతను పొందింది. సకల సద్గుణ సంపన్నుడైన రామునకు తన బిడ్డను కన్యాదానం చేసే భాగ్యం పొందటానికి జనకుడు ఏమి తపస్సు చేశాడో? లోకపావని సీత జనకుని ఇంట పెరగటం, ఇక్ష్వాకు వంశ తిలకుడైన రాముని వివాహమాడటం జనకుని తపఃఫలమే.  శివధనుసు విరచిన రాముని చూచి హృదయము కరగి వరించిన జానకి ఏమి తపస్సు చేసిందో? నారదాదులు ఆ పరమశివునికి రాముడు ఆప్తుడని నుతించటానికి ఏమి తపస్సు చేశారో? ఇవన్నీ తెలియటానికి శ్రీరామ జయరామ అని నిరంతరం స్మరించమని చెబుతున్నారు త్యాగరాజస్వామి. రాముని వైభవం, ఆయన అనుగ్రహం పొందటానికి ఆయన నామమే ఉత్తమమైన సాధనం అని సద్గురువులు తెలియజేస్తున్నారు.

నేదునూరి కృష్ణమూర్తి గారు ఈ కృతిని అద్భుతంగా గానం చేశారు.  

వెడలెను కోదండపాణి - త్యాగరాజస్వామి కృతి

వెడలెను కోదండపాణి అనుజ సౌమిత్రితో గూడి పుడమిలో జనులెల్ల పొగడ పూజితుడౌ మునితో గూడి శిరమన కొండెయు జార  వురమున హారములు మెరయ కరమున శరచాపములును ఘ...