28, మే 2015, గురువారం

జటాయువు,సంపాతి - స్వామి కార్యం

జటాయువు,సంపాతి - స్వామి కార్యం



గృధ్రాధిప గతి దాయక రాం!!

స్వామి కార్యం అనేసరికి ప్రతి ప్రాణి తన శక్తి మేర కృషి సల్పిన గాథలను అద్భుతంగా వర్ణించిన మహా కావ్యము శ్రీమద్రామాయణము. ఉడుత వారధి కోసం, సంపాతి లంకకు మార్గం కోసం, అతని సోదరుడు జటాయువు సీతమ్మ ఆనవాల కోసం, వానరసైన్యం రావణుని వధించి ధర్మస్థాపన కోసం....ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో జీవరాశులు ప్రభువుకు తోడ్పాటుగా నిలిచారు. అందులో ఒక ఉదాత్తమైన ప్రాణి జటాయువు. దశరథుని మిత్రుడైన జటాయువు ఒక గ్రద్ద. వృద్ధాప్యంతో శరీరం సహకరించక పోయినా సీతను అపహరించుకుపోతున్న రావణుని ఎదిరించి కొనప్రాణమున్నంత వరకు పోరాడిన వీరుడు. సీతమ్మను వెదుకుతూ వచ్చిన రామలక్ష్మణులకు అమ్మ జాడ తెలిపి రామకార్య సాఫల్యానికి తోడ్పడిన గొప్ప జీవి. జటాయువు, సంపాతి ఇద్దరు అన్నదమ్ములు.

సీతా రామలక్ష్మణులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు మొట్టమొదటి సారి పంచవటి సమీపంలో జటాయువు రాముని కలుస్తాడు. తాను దశరథుని మిత్రుడని తెలిపి సృష్టిలో జంతు జాతి ఏ విధంగా ఆవిర్భవించిందో విపులంగా తెలుపుతాడు. కర్దమ ప్రజాపతినుండి గరుత్మంతుడు (శ్రీమహావిష్ణువు యొక్క వాహనము), అరుణుడు (సూర్యుని రథసారథి) గ్రద్ద సంతతిగా ఎలా జన్మించారో వివరిస్తాడు. అదే వారసత్వానికి తాను, సంపాతి చెందినట్లు తెలుపుతాడు. అరుణుని సంతతే జటాయువు, సంపాతి. దశరథుని స్నేహానికి గౌరవంగా ఈ భీకరమైన దండకారణ్యములో సీత రక్షణకు తాను రామునికి తోడుగా ఉండగలనని పలుకుతాడు.

సీతాపహరణం తరువాత రావణుని చేతిలో రెక్కలు తెగి, రక్తసిక్తమై అసువులు బాయటానికి సిద్ధంగా ఉన్న జటాయువును చూసి రాముడు జటాయువే సీతను చంపి ఉంటాడని అనుమానించి అతనిని చంపబోతాడు. అప్పుడు జటాయువు తనకు రావణునికి మధ్య జరిగిన యుద్ధాన్ని వివరించి సీత జాడ తెలుపుతాడు. రావణుని చరిత్రను, అతని శక్తి పరాక్రమాలను, ఏ విధంగా సీతను అపహరించింది వివరించి రాముని చేతిలో ప్రాణాలు వదులుతాడు. తన కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన ఆ వీరుని కొరకు రాముడు దుఃఖించి, అతనికి స్వయంగా ఉత్తరక్రియలు జరుపుతాడు. ఈ విధంగా జటాయువు ఉత్తమలోకాలను పొందుతాడు.



గృధ్రాధిప సంసేవిత రాం!!!
దక్షిణభాగాన చివరకు చేరుకున్న వానరమూకకు రావణుని మరియు లంక జాడను తెలిపిన వాడు ఈ సంపాతి.

సీతమ్మకోసం వెదకి వెదకి అలసిన వానరులు ప్రాయోపవేశానికి సిద్ధులై తమ మాటల మధ్యలో జటాయువు ప్రస్తావన తీసుకువస్తారు. అప్పుడు వారి మాటలను విన్న సంపాతి వింధ్యమహాపర్వతపు గుహనుండి బయటకు వచ్చి "ఓ వానరులారా! నేను రెక్కలు విరిగిన పక్షిని, శక్తి హీనుడను. నాకు చేతనైనంత  శ్రీరాముని కార్యానికై మాట సాయం చేయగలను. ప్రాణశక్తి క్షీణించినను శ్రీరాముని కార్యమునకు తోడ్పడుటయే నా ప్రథమ కర్తవ్యము.

చక్కని రూప సంపద కలిగి, వివిధ ఆభరణములు ధరించియున్న ఒక స్త్రీని దుర్మార్గుడైన రాక్షసుడు అపహరించుకొని పోవుచుండగా నేను చూసాను. ఆ స్త్రీ రామా! రామా! లక్ష్మణా! అని విలపిస్తుండెను. ఆమె తన ఆభరణములన్నీ తీసువేయుచుండెను. పదే పదే శ్రీరాముని నామము స్మరించుచున్నందున ఆమె సీతయే అని నేను అనుకొనుచున్నాను,

ఆ రాక్షసుడు లంకాధిపతియైన రావణుడు. ఇక్కడికి వంద యోజనముల దూరములో సముద్రము నడుమ ద్వీపములో విశ్వకర్మ లంకానగరమును నిర్మించెను. ఆ నగరము చాలా రమ్యమైనది. సీతాదేవి ఆ లంకానగరమున రావణుని అంతఃపురమున బంధింపబడియున్నది.  దీనురాలైన ఆ సీతామాతను రాక్షస స్త్రీలు కాపలాకాస్తున్నారు. సముద్రము మీద నూరు యోజనముల దూరము ప్రయాణించిన పిమ్మట దాని దక్షిణ తీరమున గల లంకలో రావణుని చూడగలరు. కావున వానర వీరులారా! వెంటనే మీ పరాక్రమము చూపి సముద్రమును లంఘించుటకు త్వరపడండి. మీరు అక్కడ అవశ్యము సీతాదేవిని దర్శించి క్షేమముగా తిరిగి రాగలరు. నా దివ్యదృష్టితో చూసి పలుకుతున్న మాటలివి.

నేను, జటాయువు గరుత్మంతుని వంశము వారమే. కనుక ఇక్కడినుండే రావణుని, సీతను స్పష్టముగా చూచుచున్నాను. ఓ వానరులారా! మేము మా ఆహారబలము చేతను, సహజమైన దివ్య శక్తివలనను శతయోజనములే గాక అంతకన్నా దూరము కూడా అనుక్షణము చూడగలము. నా తమ్ముని చంపిన రావణుని పగ తీర్చుకోవాలి. మీరే ఆ కార్యానికి సమర్థులు" అని పలికి సీతమ్మ జాడ తెలుపుతాడు సంపాతి. ఈ విధంగా పక్షి సోదరులైన జటాయువు-సంపాతి రామకార్యానికి ఎంతో ఉపకరిస్తారు.

రామకార్యానికి వానరులు, పక్షి సోదరులు...ఇలా ఎన్నో రకాల జంతు సమూహం తోడ్పడి తమ జన్మకు సార్థకతను తెచ్చుకొని రాముని అనుగ్రహంతో మోక్షాన్ని పొందాయి. అంతటి మహత్తరమైనది రామకార్యము. మానవునిగా జన్మించి, తనతో పాటు జన్మించి తనతో నడచిన ప్రతి ప్రాణినీ అనుగ్రహించిన ధర్మమూర్తి రామచంద్రుడు.

శ్రీరామ జయరామ జయ జయ రామ!

27, మే 2015, బుధవారం

ఎవ్వరని నిర్ణయించిరిరా


ఎవ్వరని నిర్ణయించిరిరా నిన్నెట్లారాధించిరిరా నరవరు

శివుడనో మాధవుడనో కమలభవుడనో పరబ్రహ్మమనో

శివ మంత్రమునకు 'మ' జీవము మా
ధవ మంత్రమునకు 'రా' జీవము ఈ
వివరము తెలిసిన ఘనులకు మ్రొక్కెద
వితరణ గుణ త్యాగరాజ వినుత

"మునులు, మానవ శ్రేష్ఠులు నిన్ను ఎవరని నిర్ణయించారు? ఏ విధంగా కొలిచారు? శివుడనా? విష్ణువుగానా? బ్రహ్మగానా? లేక పరబ్రహ్మగానా?  శివమంత్రము 'నమశ్శివాయ' లో "మ"కారము, విష్ణు మంత్రమగు 'నారాయణాయ'లో 'రా" అక్షరము కలిసి రామనామమేర్పడినది. ఈ వివరాన్ని తెలిపిన గొప్పవారికి మ్రొక్కెదను ఓ ఔదార్యగుణము గల రామా!"
- సద్గురువులు త్యాగరాజస్వామి వారు

శివకేశవుల మూలమంత్రములనుండి అక్షరాలను కలిపి ఏర్పడిన మహత్తరమైన మంత్రము రామ నామము. కాబట్టీ రామ తత్త్వము హరిహరాద్వైతము ప్రతిపాధిస్తూ పరబ్రహ్మాన్ని బోధిస్తున్నదని ఈ కీర్తన సారాంశం. 

పరమాత్మ ఏ రూపంలో అవతరించినా, ఏ రూపంలో కొలువబడినా, ఆయన ఒక్కడే. ఒకే చైతన్యం విశ్వమంతా వ్యాపించియుంది. కాబట్టి ఏ రూపంలో కొలిచినా ఒక్కటే. కావలసింది మనలో నిర్మలత్వం ఆ రూపం/భావం పట్ల అచంచలమైన విశ్వాసం మరియు శరణాగతి.  ఒక రూపం గొప్ప ఇంకో రూపం తక్కువ అన్నది కేవలం మానవుల అభిప్రాయం మాత్రమే. ఎద్దును, సింహాన్ని కొలిచి దివ్యత్వాన్ని పొందిన మహనీయులకు ఈ కర్మభూమి జన్మనిచ్చింది. రామావతారాన్ని ఈ విధంగా పరబ్రహ్మతత్త్వముగా భావించి, కొలిచి, తరించిన మహనీయులు సద్గురువులు త్యాగరాజస్వామి వారు. రామాయణం చూస్తే రాముడు శివుని కొలిచినట్లుగా స్పష్టంగా తెలియజేయటమైనది. 

శివపార్వతుల సంభాషణలో పార్వతి శివునితో ఈ విధంగా అడుగుతుంది:

కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం
పఠ్యతే పండితైర్నిత్యం శ్రోతుమిచ్ఛామ్యహం ప్రభో

"ఓ ప్రభో! ఏ విధముతో  పండితులు నిత్యము విష్ణు సహస్రనామములు చదివిన ఫలము సులభముగా కలుగునో చెప్పవల్సినది. నాకు వినాలను కోరికగా ఉన్నది"

దీనికి సమాధానంగా శంకరుడు పార్వతితో:

శ్రీరామరామరామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే!

"ఓ సుందరమైన ముఖము కల పార్వతీ! శ్రీరామ రామ రామ అని మూడు మార్లు రామ నామాన్ని పఠిస్తే సహస్రనామములు పఠించినంత ఫలము. ఈ చెవులకు ఇంపుగా ఉండే రామ నామమును నేను మనసులో రమించి చిదానందంగా ఉంటాను! "

ఈ విధంగా శివుడు నిరంతరము రమించే మహాద్భుత మంత్రము రామ నామము. భవతారకమని ఎందరో మహానుభావులు మనకు ఎంతో వివరంగా సంకీర్తనలలో తెలిపారు. వారి జీవితాలే దీనికి తార్కాణాలు. శివుడు తలచే రామనామము కన్నా మించినది ఏముంటుంది? అందుకే రామనామమే పరబ్రహ్మ తత్త్వమని తెలియజేసిన వారికి నా నమస్కారాలు అని త్యాగరాజుల వారు ఈ అద్భుతమైన కృతిలో మనకు వివరిస్తున్నారు. మనకు నిరంతరం వచ్చే ప్రశ్నకు సమాధానం ఉంది ఈ కీర్తనలో. 

శ్రీకరమౌ శ్రీరామ నామం శ్రితజన మందారం
పావనమే రఘురామ నామం భవతారక మంత్రం

సుధా రఘునాథన్ గారి గళంలో ఎవరని నిర్ణయించిరిరా వినండి.

26, మే 2015, మంగళవారం

అన్నమయ్య ఒక దిశానిర్దేశకుడు ఎలా అయ్యాడు?


అన్నమయ్య ఒక దిశానిర్దేశకుడు ఎలా అయ్యాడు?



"వదలక వేదవ్యాసులు నుడివిన విదిత పావనము విష్ణుకథ
సదనంబైనది సంకీర్తనయై వెదకిన చోటనే విష్ణుకథ"

కృష్ణద్వైపాయన వ్యాస భగవానుడు మనకు అందించిన అమృతము శ్రీమద్భాగవతము. ఆ విశ్వాత్మకుని లీలలను, మహిమలను, అద్భుత గాథలను మనకు పవిత్రంగా భాగవతం ద్వారా తెలియజేశాడు వ్యాసుడు. ఒక్కొక్క అవతారాన్ని కనులకు కట్టినట్లుగా విశదీకరించి భక్తి భావాన్ని మనలో ఇనుమడింపజేసే రసామృతము ఈ భాగవతము. ధర్మ రక్షణకై ఆయా కాలములో తదనుగుణంగా అవతారాన్ని ఎత్తి కర్తవ్యపాలన చేసి ధర్మ స్థాపన చేశాడు శ్రీహరి. భక్తి జీవితానికి మూలం. భక్తి-ముక్తి పథములను సోదాహరణముగా మానవ జీవిత సారూప్యములతో వివరించారు వ్యాసుల వారు. భగవద్భక్తుల గాథలను, భగవంతుని లీలలను మనకు గంగాప్రవాహంలా అందించిన విష్ణురూపుడు వ్యాసమహర్షి. అందుకే దీనిని విదిత పావనము అన్నారు అన్నమాచార్యుల వారు. రెండే రెండు పదాలతో వ్యాస భగవానుని భాగవత వైశిష్ట్యాన్ని తెలిపిన మహనీయుడు అన్నమయ్య.


ఇక సంకీర్తనలంటే ఏమిటి? అవి విష్ణు నివాసము. వర్ణించిన నుతులే విష్ణు నివాసములు అనటానికి అవి ఎటువంటి భవరోగములనైనా జయించగలవు అన్ని నిరూపిత భావనే ఆధారం. సంకీర్తనల ద్వారా ఎంతో మందికి మానసిక సాంత్వనతో శారీరిక స్వాస్థత కలిగించిన ఉదంతాలు ఉన్నాయి. సంకీర్తనామృతముతో మరణ శయ్యపై నుండి కూడా బతికి బయటపడి మృత్యుంజయులైన వారెందరో ఉన్నారు. చెప్పరాని ఆవేదనను చిటికెలో తొలగించే సంజీవని సంకీర్తన. ఏ మందు ద్వారా నయం కాని మానసిక దౌర్బల్యాన్ని తొలగించే అమృతము సంకీర్తన. పరమపురుషుని నామమును, మహిమను ఛందోబద్ధంగా తెలుపబడిన వేద సమానమైనది సంకీర్తన.

"ఇది ఒకటి హరినామమింతైన చాలదా చెదరకీ జన్మముల చెరలు విడిపించ మదినొకటి హరినామ మంత్రమది చాలదా పదివేలు నరక కూపముల వెడలించ" - శ్రీహరి తత్త్వమును తెలిపే ప్రతి సంకీర్తన జన్మమృత్యు వలయమునుండి తప్పించే వజ్రాయుధమే. ప్రతి శ్రీహరి నామము కూడా మనకు నరక బాధలనుండి తొలగించే అద్భుత సాధనములు. ఎలా? భగవత్తత్త్వమును తెలిపే నామ మహిమను, వైశిష్ట్యాన్ని తెలుసుకోవాలంటే మనలోని దివ్యత్వమును ఆ పరమాత్మతో అనుసంధానము చేసుకోవాలి. దీనికి మనసులోని మాలిన్యాలను తొలగించుకొని పరిపూర్ణమైన ప్రేమ భావనను అలవరచుకోవాలి. దానిని జీవనశైలిలో పాటించాలి. నిత్యమూ ఆనందాన్ని అనుభూతి చెందాలి. అప్పుడే నామ మహిమ మనకు త్రికరణ శుద్ధిగా అందుతుంది. అటు పిమ్మట దుఃఖానికి స్థానమే లేదు. ఏ బాధ కూడా బాధించదు. ఏ విషయ వాంఛ కూడా మనలను చలించదు. తామరాకుపై నీటిబొట్టులా మనిషి అలా అలా హంసలా నడచి దైవత్వముతో సంపూర్ణంగా అనుసంధానమై పోతాడు. ఇక వాని ఆత్మకు జన్మమృత్యు జరావ్యాధి బాధలే ఉండవు. ఇంతటి మహత్తు కలది నామ సంకీర్తన.

బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అని పాడి కులమత భేదాలలో కొట్టుమిట్టాడుతున్న ప్రజలను మేల్కొల్పి ఏకం చేసే అద్భుతమైన ప్రయత్నం చేశారు. ఈ సందేశాన్ని జానపద ఒరవడిలో రచించి అందరికీ అందేలా చేశాడు. నిద్ర రాజుదైతే నేమి, బంటుదైతే నేమి, బ్రాహ్మణునిదైతే నేమి, చండాలునిదైతే నేమి ఒకటే కదా, ఏనుగు మీద, కుక్క మీద ప్రసరించే ఎండ ఒకటే అయినట్లు పుణ్యులను పాపులను ముక్తిమార్గము వైపు నడిపించేది శ్రీహరినామమొక్కటే అని తెలిపాడు. అలాగే మనం ఎలా భావిస్తే అలాంటివాడు పరమాత్మ అని ఎంతమాత్రమున సంకీర్తనలో తెలిపి శైవం, వైష్ణవం, శాక్తేయం అన్నిటికీ లక్ష్యం ఒక్కటే - ఆ పరమాత్మను తెలుసుకోవటం. మేము గొప్ప అంటే మేము గొప్ప అని ఆధ్యాత్మిక పురోగతిలోఆగిపోయిన వేర్వేరు మార్గాలు అనుసరించేవారికి కనువిప్పు కలిగించాడు.

శ్రీకృష్ణుడు  సాంఖ్యయోగంలో తెలిపిన సందేశాన్ని వాడల వాడల వెంట వాడెవోవాడేవో అనే సంకీర్తన ద్వారా మనకు అందజేశారు. ఆ లక్ష్మీ దేవి మాయగా తానూ సాక్షీభూతునిగా ఆ పరమాత్మ మనచేత ఎలా కర్మలను చేయిస్తాడో వివరించాడు. మధురభక్తిలో తానే నాయికయై స్వామిని అలరించాడు. తన భావనలన్నీ స్వామికి అర్పించి పునీతుడయ్యాడు.  దాహమిచ్చి దప్పితీర్చే కాలమేఘమా అని నుతించి పరమాత్మ వైభవాన్ని చాటాడు .

ఇటువంటి 32 వేల సంకీర్తనలను మనకు అందించాడంటే అన్నమయ్య ఏ దైవసంకల్పముతో ఏ దైవాంశతో జన్మించాడో ఊహించండి. ఒక్కొక్క సంకీర్తన ఒక్కొక్క సందేశ సుగుణ దీపిక. ఒక్కొక్క సంకీర్తన ఒక్కొక్క అమృత గుళిక. ప్రతి సంకీర్తన దేవ దేవుని నామ మహిమా నిధి. ప్రతి సంకీర్తన మానవునికి భవసాగర తారణ వారధి.

అందుకే అన్నమయ్య ఒక అవతారమూర్తి. ఒక సద్గురువు.  ఒక పరిపూర్ణ చైతన్యమూర్తి.


25, మే 2015, సోమవారం

అంతర్యామి అలసితి సొలసితి



అన్నమయ్య రచించిన ఒక అద్భుతమైన, భాగగర్భితమైన సంకీర్తనను ఈ వ్యాసంలో పొందుపరస్తున్నాను. చలన చిత్రం ద్వారా బాగా ప్రాచుర్యం పొందిన ఈ సంకీర్తన మానవ జన్మకు ఒక దిశానిర్దేశం చేస్తుంది. అంతర్యామి అలసితి సొలసితి అనే కీర్తన యొక్క పరిశీలన.

అంతర్యామి అలసితి సొలసితి
ఇంతట నీ శరణిదె జొచ్చితిని

కోరిన కోర్కెలు కోయని కట్లు
తీరవు నీవవి తెంచక
భారపు పగ్గాలు పాప పుణ్యములు
నేరుపుల పోనీవు నీవు వద్దనక

జనుల సంగముల జక్క రోగములు
నిను విడువవు నీవు విడిపించక
వినయపు దైన్యము విడువని కర్మము
చనదది నీవిటు శాంతపరచక

మదిలో చింతలు మైలలు మణుగులు
వదలవు నీవవి వద్దనక
యెదుటనే శ్రీ వేంకటేశ్వర నీవదె
అదన గాచితివి అట్టిట్టనక

కర్మలు, పాప పుణ్యాలు, మోక్షము వీటి గురించి ఈ సంకీర్తనలో పొందుపరచారు అన్నమాచార్యుల వారు. మానవ జన్మ ఎత్తినందుకు మనం చేయవలసినది ఏమిటి?

కోరికలు అనే అనంతమైన కోయని కట్లను మనం తెంచితే తప్ప అవి తెగవు. పాప పుణ్యాలు రెండూ భారములే. ఎందుకంటే అవి పునర్జన్మకు దారితీస్తాయి. పుణ్యం చేసుకుంటే  సుఖములతో కూడిన దేవ జన్మ కానీ,  మరింత ఉత్కృష్టమైన, సుఖ దుఃఖములతో కూడిన మానవ జన్మ కానీ, పాపము చేసుకుంటే మరిన్ని దుఃఖములతో కూడిన తిర్యక్ జన్మ గానీ తప్పవు. ఈ విధంగా ఎన్నాళ్లు జీవునకు శాశ్వతానందమైన, శాంతికారకమైన పరబ్రహ్మైక్యమునుండి దూరము? అందుకే పాపపుణ్యముల రెండింటినీ ఛేదించవలసినదే.

మన సాగంత్యాలే మన వాసనలు. మన వాసనలే మన దేహానికి రోగములు. చెడు సాంగత్యాలను వద్దనుకుంటే తప్ప మన వాసన ప్రేరిత రోగములు తొలగవు. దైన్యము, కర్మ ఫలములు మన ప్రయత్న పూర్వకముగా శాంతపరిస్తే తప్ప దూరం కావు. దీనికి సత్సాంగత్యము వజ్రాయుధం.

మనసులోని ఆలోచనలు, మాలిన్యాలు ఎంతో బరువైనవి. మనం ప్రయత్నం చేస్తే తప్ప అవి వదలవు. కలియుగంలో మన పాప సంచయాన్ని ముడుపు రూపంలో, అహంకారాన్ని శిరోముండనం రూపంలో, భావ కాలుష్యాన్ని నామ సంకీర్తన ద్వారా తొలగించుకోవటానికి పరమాత్మ వడ్డీ కాసులవాడుగా అవతరించి మన ఎదుట నిలిచాడు. తన అశేష గుణ విభవముల చాటే సంకీర్తనలను జనావళికి అందజేయమని తన నందకాన్ని అన్నమయ్య రూపంలో పంపించాడు.

వేల సంకీర్తనల ద్వారా వేవేల అవకాశాలు మానవుడికి తనను తాను ఉద్ధరించుకోవటానికి...ఒక్క దానిని గట్టిగా పట్టుకొని సద్వినియోగం చేసుకుంటే చాలు ఈ జన్మకు సార్థకత. ఇది ఒకటి హరినామమింతైన చాలదా చెదరకీ జన్మముల చెరలు విడిపించ! మదినొకటి హరినామ మంత్రమది చాలదా పదివేల నరకకూపముల వెడలించ! అన్నీ ఆయనకే వదిలేసి ఒక్కసారి హరీ అని పలికి చూడండి! మీలో మీకు వేయి ఏనుగుల బలం వస్తుంది! కానీ, అలా అనగలగాలంటే చిత్తశుద్ధి అవసరం. చిత్తశుద్ధికి కర్తవ్యపాలన, భగవంతుని పట్ల శరణాగతి తప్పనిసరి.

అన్నమయ్య కీర్తనలు ఎన్నో జీవిత లక్ష్యాన్ని, గమ్యాన్ని, పరమావధిని సుస్పష్టంగా, మన భాషలో తెలిపాయి. అందులో ఈ అంతర్యామి అలసితి ఒకటి. భావము అర్థం చేసుకొని మన అభ్యున్నతికి సద్వినియోగం చెసుకుంటే ఒక్కొక్క కీర్తన పరమ పదము వైపు ఒక సోపానము. ఈ సంకీర్తన అన్నమయ్య చలనచిత్రం నుండి.

ఓం నమో వేంకటేశాయ!


24, మే 2015, ఆదివారం

జిల్లెళ్లమూడి. మాతృశ్రీ అనసూయమాత

జయహో మాత శ్రీఅనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి!!


ఒక్కొక్క యోగికి, అవతారమూర్తికి ఒక్కొక్క ప్రత్యేకమైన లక్షణముంటుంది. నాలుగేళ్లనాడు మేము గుంటూరు జిల్లా పొన్నూరు ఆంజనేయస్వామిని, భావనారాయణస్వామిని, బాపట్ల భావనారాయణస్వామిని, స్వామి బ్రహ్మానందతీర్థుల వారి శంకర విద్యాలయమనే వేదపాఠశాలను, అక్కడి రామకృష్ణ సమాజ వ్యవస్థాపకులు స్వామి అనుభవానంద ఆశ్రమాన్ని సందర్శించి, అక్కడినుండి గుంటూరు తిరుగు ప్రయాణం మొదలు పెట్టాము. మధ్యాహ్న సమయము, ఆకలి. ఎక్కడ భోజనము చెయ్యాలా అని ఆలోచిస్తూంటే పచ్చని వరి పొలాలు వేల ఎకరాలలో, అద్భుతమైన మబ్బులు పట్టిన వాతావరణంలో జిల్లెళ్లమూడి అనే గ్రామం పేరు కనిపించింది. అప్పటికే చిన్ననాటి విషయ సాంగత్యం వలన ఆ వూరి పేరు స్మృతిలో ఉంది కాబట్టి 'జిల్లెళ్లమూడి అమ్మ' ఆశ్రమానికి వెళదాం అని నిర్ణయించుకొని ఆ దారి పట్టాము.



కారు ఆశ్రమం వైపు వెళుతూ ఉంటే మన అమ్మ భోజనానికి రండి అని ఎంత ప్రేమగా అన్నపూర్ణలా పిలుస్తుందో అలా ఆ జిల్లెళ్లమూడి అమ్మ పిలిచినట్లు అనిపించింది. ఆశ్రమంలోకి అడుగు పెట్టగానే సువాసినులతో కళకళలాడుతూ కోటి లలిత పారాయణ జరుగుతున్నది. ధర్మకర్తలు 'ముందు దర్శనం చేసుకొని భోజనం చేయండి' అని అప్యాయంగా పరి పరి విధాల చెప్పారు. అనసూయేశ్వరి మందిరాన్ని, హైమ మందిరాన్ని, అక్కడి విశాలమైన సభా ప్రాంగణాన్ని చూసి అలౌకికమైన అనుభూతిని పొందాము. తరువాత అక్కడ అన్నపూర్ణాలయంలో వారి అన్నదాన కార్యక్రమంలో భోజనం చేశాము. ఆ ఏర్పాట్లు అద్భుతం ఆ అనుభూతి చెప్పలేనిది. ప్రేమగా అమ్మ చేతితో అన్నం పెడితే ఎలా అనిపిస్తుందో అలాంటిదే చవిచూసాము. అక్కడి భోజనం తయారు చేసే వసతులు, అమ్మ భక్తుల భక్తి తత్పరత, సేవా నిరతి అమోఘం. అనుక్షణం దివ్యత్వాన్ని, అనురాగాన్ని అనుభూతి చెందాము.



తరువాత ఇంటికి వచ్చి అమ్మ గురించి కొంత పరిశోధన చేశాను. ఆధ్యాత్మికంగా అమ్మ ఎంతటి మహిమాన్విత ప్రకాశినో, ఎంతటి తేజోవిలాసినో, ఎంతటి కరుణామయో, ఎంతటి ప్రేమమూర్తో, యోగినో అర్థమయ్యింది. ఏ వసతులూ లేని రోజుల్లో లక్షలాది మందికి ఒకే మారు అన్నదానం చేసిన అన్నపూర్ణ ఈ అనసూయమాత. మహామహులైన యోగులు పూర్ణానంద స్వామి, కుర్తాళం పీఠాధిపతులు సిద్ధేశ్వరానంద భారతీ స్వాములు మొదలైన వారికి గురుతుల్యులు అమ్మ.

అమ్మ మాతృశ్రీ విద్యా పరిషత్ అనే అద్బుతమైన విద్యా సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా సంస్కృత భాషకు ఎనలేని సేవను అందిచే ఏర్పాట్లు చేశారు. విశ్వజననీ పరిషత్తు ద్వారా పేదలకు చుట్టుపక్క గ్రామ వాసులకు, వైద్య, విద్య మరియు ఇతర సామాజిక సేవలను అందిస్తున్నారు.

అమ్మ మహిమలు అనంతం. అమ్మ ప్రేమ అనిర్వచనీయం. అమ్మ కరుణ అసమానం. అమ్మ వాత్సల్యం అమృతతుల్యం. అమ్మ భక్తులకు ఆమె సర్వస్వం. ఎందరో మహానుభావులకు ఆమె ఆధ్యాత్మిక దర్శని. ఇప్పటికీ యోగులతో దివ్యదేహంతో అమ్మ మాట్లాడుతునే ఉంది.

అమ్మ ఎక్కడ ఉందో అక్కడ పాడిపంటలు సస్యశ్యామలము. ఆ ప్రాంతం శాంతికి నిలయం. అమ్మ వాక్కులు మార్గనిర్దేశకాలు. నిత్యం అశాంతి, స్పర్థలలో మునిగి తేలేవారికి ఈ అనసూయామాత మందిరం మరియు ఆ ఆశ్రమ పరిసరాలు సాంత్వననిచ్చే దివ్యౌషధము. అమ్మ 20వ శతాబ్దంలో ఆంధ్రప్రదేశ్ లో అవతరించిన అమ్మలగన్న అమ్మ. ఆ రాజరాజేశ్వరి రూపమే అమ్మ. ఆమె కరుణారసమే అమ్మ చూపులు.



నిత్యానందకరీ వరాభయకరీ అని మనం కొలిచే అన్నపూర్ణ స్వరూపిణి అయిన ఆ ఆదిపరాశక్తే ఈ అనసూయమాతగా జిల్లెళ్లమూడిలో వెలసింది. మహావైభవంగా సాగిన ఆమె భౌతిక అవతారం 1985 సంవత్సరంలో ముగిసినా, ఇప్పటికీ అమ్మ భక్తుల ద్వారా అమ్మ ఆధ్యాత్మిక సౌరభాలను, అదే ప్రేమ, వాత్సల్యం, కరుణలను అందిస్తూనే ఉంది. అమ్మ గురించి తెలుసుకోదలచిన వారు విశ్వజనని ట్రస్టు ముద్రించిన 'అమ్మ జీవిత మహోదధి' అనే గ్రంథాన్ని చదువవచ్చు. అంతర్జాలంలో కూడా చాలా వివరంగా అమ్మ గురించిన విషయాలను భక్తులు పొందుపరచారు.

ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న ప్రతి సాధకుడు తప్పక చూడవలసిన క్షేత్రం జిల్లెళ్లమూడి. రైలులో వెళితే బాపట్ల స్టేషనులో దిగి వెళ్లవచ్చు. బాపట్ల నుండి జిల్లెళ్లమూడి 15 కిలోమీట్లర్ల దూరం. గుంటూరు నుండి 52 కి.మీ, విజయవాడ నుండి 87 కి.మీ.  మాతృశ్రీ అనసూయమాత అనుగ్రహ ప్రాప్తిరస్తు!!

http://www.jillellamudiamma.org/svjp/
http://www.jillellamudiamma.org/svjp/images/mdc_book_annapurnalayam.pdf
www.viswajanani.org
www.motherofall.org


జయహో మాత శ్రీఅనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి!

23, మే 2015, శనివారం

రామ-వాలి సంవాదం.

రామ-వాలి సంవాదం




తదేతత్ కారణమ్ పశ్య యదర్థం త్వం మయా హతః
భ్రాతుర్ వర్తసి భార్యాయామ్ న్యక్త్వా ధర్మమ్ సనాతనమ్

అస్య త్వం ధరమాణస్య సుగ్రీవస్య మహాత్మనః
రుమాయామ్ వర్తసే కామాత్ స్నుషాయాం పాప కర్మకృత్

న హి ధర్మ విరుద్ధస్య లోక వృత్తాత్ అపేయుషః
దండాత్ అన్యత్ర పశ్యామి నిగ్రహమ్ హరి యూథప

ఔరసీం భగినీం వాపి భార్యాం వాప్యనుజస్య యః
ప్రచరేర నరః కామాత్ తస్య ధండో వధః స్మృతః

యాంతి రాజర్షయశ్చాత్ర మృగయాం ధర్మకోవిదాః
తస్మాత్ త్వం నిహతో యుద్ధే మయా బాణేన వానరా
ఆయుధ్యన్ ప్రతియుధ్యన్ వా యస్మాచ్ఛాఖామృగో హ్యసి


"నిన్ను నేను హతము చేయుటకు కారణము గ్రహించు - నీవు సోదరుని పత్నితో అధర్మంగా వ్యవహరించావు.

సుగ్రీవుడు బ్రతికి యుండగా, నీ నీచమైన ఆలోచనలతో, కామంతో నువ్వు నీకు కోడలి సమానమైన సుగ్రీవ పత్నియైన రుమ పట్ల అనుచితంగా వ్యవహరించావు.

సమాజ విరుద్ధంగా, ఆచారాలను కాలరాసి ప్రవర్తించే వ్యక్తులపట్ల నేను ఎటువంటి నిగ్రహమూ చూపను. వారికి శిక్ష తప్పదు.

కూతురు, సోదరి, సోదరుని భార్య - వీరియెడ కామాతురుడై ప్రవర్తించిన వానిని వధించుటయే తగిన శిక్ష అని ధర్మ శాస్త్రము పేర్కొనుచున్నది.

వానరా! బాగుగా ధర్మము తెలిసిన మహరాజులు కూడా వేటాడుచుందురు. కనుక నిన్ను యుద్ధమున బాణము వేసి వధించితిని. నీవు నాకు ఎదురుగా నిలిచి యుద్ధము చేసినను, చేయకున్నను చాటున వధించుటలో తప్పు లేదు. ఏలననగా నీవు శాఖామృగానివి (కొమ్మలపై, చాటున ఉండే జంతువు). "

- వాల్మీకి విరచిత శ్రీమద్రామాయణాంతర్గత కిష్కింధ కాండలో రామ-వాలి సంవాదం.

వాలి అతి బలసంపన్నుడు. రావణబ్రహ్మనే ఓడించిన మహాబలశాలి. అన్నివిద్యలు నేర్చిన పండితుడు. వానరమూకకు రాజు. కానీ, కామాంధుడై సోదరుని పత్ని పట్ల అనుచితంగా వ్యవహరించటం, దానిని సరిదిద్దుకొనక తామసంతో వ్యవహరించటం వలన ధర్మమూర్తియైన రామచంద్రుని చేత చెట్టుచాటు నుండి చంపబడ్డాడు. ఇక్కడ రాముడు ఒక ముఖ్యమైన విషయాన్ని వాలికి చెబుతాడు.

మానవునికి ముగ్గురు పితృసమానులు - తండ్రి, అన్న మరియు గురువు. ఈ విధంగా పుత్రసమానుడైన సుగ్రీవునికి అన్యాయం చేసిన వాలి శిక్షార్హుడు అన్న విషయాన్ని కుండలు బద్దలు కొట్టి చెప్పాడు రాముడు. అధర్మాన్ని సహించేది లేదని తేల్చి చెప్పాడు. అన్నీ చెప్పి, నీవంటే నాకు ద్వేషము లేదు అని మరల హితవాక్యములు పలుకుతాడు. అతను చేసిన పాపములు ఈ విధముగా శిక్షను అనుభవించుట ద్వారా పాపరహితుడైనాడని తెలుపుతాడు, తార, అంగదుల గురించి దిగులు పడిన వాలికి వారి భవిష్యత్తును గురించి సాంత్వన కలిగిస్తాడు, వాలి తన అజ్ఞానాన్ని తెలుసుకొని పశ్చాత్తాప పడి రాముని మన్నింపమని వేడుకుంటాడు. రాముడు అతనిని అనుగ్రహించి, అతనికి ఉత్తమ గతులు కలిగేలా చేస్తాడు.

రామో విగ్రహవాన్ ధర్మః. అధర్మాన్ని ఎట్టి పరిస్థితులలోనూ ఆచరించడు. వాలిని అన్యాయంగా చెట్టు చాటునుండి రాముడు చంపాడు అనే అజ్ఞానులకు ఈ పై శ్లోకాలను, అర్థాన్ని వివరించండి. రామాయణాన్ని చదువకుండా అందులోని ధర్మమూర్తులను నిందించి, మన సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టించే వారి అహంకారపు మాటలను ఎదుర్కోండి.

సోదరుల పట్ల, వారి కుటుంబ సభ్యుల పట్ల అనుచితంగా వ్యవహరించే దుష్టులందరికీ ఇదే గతి తప్పదు.

22, మే 2015, శుక్రవారం

రామ నీల మేఘ శ్యామ కోదండరామ


రామ నీల మేఘ శ్యామ కోదండరామ


జయతు జయతు మంత్రం జన్మ సాఫల్య మంత్రం
జనన మరణ భేద క్లేశ విచ్ఛేద మంత్రం
సకల నిగమ మంత్రం సర్వ శాస్త్రైక మంత్రం
రఘుపతి నిజమంత్రం రామ రామేతి మంత్రం
-  శ్రీరామకర్ణామృతం

రామ నీల మేఘ శ్యామ కోదండరామ
రఘుకులాబ్ధి సోమ పరంధామ సార్వభౌమ నీలమేఘ శ్యామ
రఘురాం రాం రాం రఘురాం జయరాం రాం రాం జయరాం

తల్లితండ్రి గురువు నీవే తోడు నీడ నీవే
ధరణినెల్ల పాలన చేసే పరంజ్యోతివే
జాగు ఇక చాలును రామయ్య దాసులను బ్రోవగ రావయ్య
తెలియ తరమా పలుక వశమా నీదు మహిమ రాఘవా

రామ నీల మేఘ శ్యామ కోదండరామ
రఘుకులాబ్ధి సోమ పరంధామ సార్వభౌమ నీలమేఘ శ్యామ
రఘురాం రాం రాం రఘురాం జయరాం రాం రాం జయరాం

రాతినైన నాతిని జేసే నీ దివ్య పాదము
కోతినైన జ్ఞానిని చేసే నీ నామము
నీదు సరి దైవము లేరయ్యా నిన్ను నే నమ్మితి రామయ్యా
నీదు చరణం పాప హరణం మాకు శరణం రాఘవా

రామ నీల మేఘ శ్యామ కోదండరామ
రఘుకులాబ్ధి సోమ పరంధామ సార్వభౌమ నీలమేఘ శ్యామ
రఘురాం రాం రాం రఘురాం జయరాం రాం రాం జయరాం

- శ్రీ గబ్బి వేంకటరావు గారు (రామాంజనేయ యుద్ధం చలన చిత్రానికి రాసిన పాట)


రాముని నుతి హనుమ నోట వస్తే అది భక్తి పూరితమై, శరణాగతిని పరిపూర్ణంగా కలిగిన అర్చనగా నిలుస్తుంది. రామభక్తికి సామ్రాజ్యానికి దొర హనుమంతుడు అని పాలగుమ్మి విశ్వనాథం గారు హనుమంతుని వైశిష్ట్యాన్ని మనకు నాలుగు పదాలలో చెప్పారు. ఆ హనుమంతుని నోట రామస్తుతి ఈ రామాంజనేయ చిత్రంలోని పాట. గబ్బిట వేంకటరావు గారు రచించిన ఈ గీతాన్ని కొత్త రఘురామయ్య గారు ఎంతో భక్తితో పాడారు.

పాట ముందు రామ మంత్ర మహిమను శ్లోకం ద్వారా మనకు తెలియ జేశారు. ఈ శ్లోకం  శ్రీరామకర్ణామృతం  లోనిది.

అర్థం:

జన్మకు సాఫల్యాన్ని ఇచ్చే మంత్రము, జనన మరణాల వలన కలిగే దుఃఖము, కష్టములను నాశనం చేసే మంత్రం, సమస్త వేద వాజ్ఞమయము మరియు శాస్త్రముల సారమైన ఏకైక మంత్రం రఘుపతి నిజమంత్రమైన రామ రామ అనే మంత్రం.దానికి జయము జయము.

గీతం యొక్క భావం:

రామా! నల్లని మేఘములు వంటి శరీర ఛాయ కలిగి, కోదండమును ధరించిన రామా ! రఘుకులమనే సాగరానికి చంద్రుని వంటి రామా ! పరమాత్మా! సార్వభౌమా!

రఘురామా! రామా! రామా! రఘురామా! జయరామా! రామా! రామా! జయరామా!

తల్లి, తండ్రి, గురువు నీవే! తోడు నీడ నీవే! ఈ భూమినంతిటినీ పాలించే సర్వేశ్వరుడివే! ఇంక ఆలస్యము చాలు రామయ్య! దాసులను బ్రోవటానికి రావయ్యా! నీ మహిమ పరిపూర్ణంగా తెలియుట ఎవరికి తరము? పలుకుటకు ఎవరికి వశము? ఓ రాఘవా!

చలనరహితమై రాయిగా మారిన అహల్యను చైతన్యపూరితం చేసింది నీ పవిత్రమైన పాదము. చంచలత్వం కలిగిన కోతిని కూడా జ్ఞాని చేసింది నీ తీయని నామము. నీకు సాటి దైవము లేరయ్యా! నిన్ను నేను నమ్మినాను రామయ్యా! నీ పాదాలే మా పాపములను హరిస్తాయి, అవే మాకు శరణం రాఘవా!

ఈ మంత్ర సారం, మహిమ హనుమంతుని కన్నా ఎవరికి తెలుస్తుంది? మహా జ్ఞాని, అతి బలవంతుడు, మాటల నేర్పరి, మహా భక్తుడు, వినయ సంపన్నుడు, సమయస్ఫూర్తి కలవాడు, రాజుకు నమ్మిన బంటు, ప్రభువుకు ఉత్తమ సేవకుడు...ఇలా ఎన్నో సుగుణాలు హనుమకు రామ నామము వలన కలిగాయి. హనుమంతుని నుండి నేటి సద్గురువుల వరకు తారక రామ మంత్రముతో తరించిన వారే.

యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకానజలిం
బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకం

ఎక్కడెక్కడైతే రాముని నామ సంకీర్తనం జరుగుతుందో అక్కడ శిరసువంచి అంజలి ఘటించి, ఆనంద బాష్పాలు నిండిన కనులతో నిలిచి ఉండే రాక్షాసంతకుడైన మారుతిని ధ్యానిస్తున్నాను.

ఈ శ్లోకం హనుమ ప్రగాఢమైన రామభక్తిని చక్కగా సూచిస్తుంది. రాముని నామం పలుకబడే ప్రతిచోటా హనుమ ఉంటాడట. ఆ నామస్మరణలో తనను తాను మరిచే నిజభక్తుడు హనుమ. అటువంటి హనుమ రాముని గురించి పాడితే ఎలా ఉండాలో అలాంటి గీతమే అందించారు గబ్బిత వేంకటరావు గారు.

కవి హనుమ హృదయంలోని భావనను ఎంత హృద్యంగా, వీనులకు విందుగా సర్వస్యశరణాగతితో వ్యక్తపరచారు. పరమాత్మ పాదాలు శరణు అని పరిపూర్ణంగా  భావించేవాడు  నిత్యం వచ్చే సమస్యలతో పాటు జనన మరణాలకు సంబంధించ బాధలను కూడా అవలీలగా దాటగలడు అన్నది సారాంశం. తల్లి తండ్రి గురువు నీవే అని భావించాలంటే పరమాత్మను అన్నిటా దర్శించగలిగే స్థాయికి ఎదగాలి. దానికి కఠోరమైన సాధనతో పాటు జన్మనిచ్చిన తల్లిదండ్రుల విలువ, గురువల ప్రాధాన్యత తెలిసి ఉండాలి. దీనికి తదనుగుణమైన పెంపకం ఎంతో అవసరం. పరమాత్మ సర్వేశ్వరుడని భావించటానికి అన్నిటి పట్ల సమభావం కలగాలి. అజ్ఞానాన్ని తొలగించే గురువులు కావాలి. అన్నిటికీ నీవే దిక్కు అన్న భావనతో కొలిచే భక్తునికి ఆయన మహిమలు అనంతముగా, నిరంతరముగా ప్రవహిస్తాయి. అదే ఇక్కడ హనుమకు కలిగిన భావన.

భర్త శాపవశాత్తు శిలయైన అహల్య నిర్దోషి. కానీ, ఇంద్రుడు గౌతముని తపమునకు భంగము కలిగించే సంకల్పంలో అహల్య ఒక పాత్రధారియై వేల ఏళ్ల పాటు శిలగా నిలుస్తుంది. అటువంటి అహల్యను తిరిగి చైతన్యవంతమైన ఋషిపత్నిగా చేసింది రామ పాదం. అలాగే వానర సమూహంలో తన శక్తిని తెలియక ఉన్న హనుమను, ఇతర వానరములను జ్ఞానులుగా చేసింది రామ నామం. అజ్ఞాన తిమిరాంధకారములనుండి జ్ఞానసుధారసం వైపు తీసుకు వెళ్లింది ఈ రామ నామం. ఈ భావనను ఎంతో చక్కగా ప్రస్తావించారు కవి. హనుమ హృదయాన్ని మన ముందు ఆవిష్కరించారు. అందుకే ఈ గీతం అజరామరమైంది. బీ. గోపాలం గారు అదే రీతిలో సంగీతం అందించగా కొత్త రఘురామయ్య గారు శ్రావ్యంగా పాడారు. రంగస్థల కళాకారులైన వీరు తమ గొంతులోని మాధుర్యాన్ని భక్తి భావంలో మేళవించి గీతానికి ప్రాణ ప్రతిష్ఠ చేశారు.

ఇక్కడ ఆర్జా జనార్దనరావు గారి గురించి చెప్పుకోవాలి. తెలుగు చలన చిత్రాలలో హనుమ అంటే ఆయనే అనేలా ఎన్నో చిత్రాలలో ఆంజనేయుడిగా నటించారు. దేహ సౌష్ఠవం కలిగిన ఆయన లవ కుశ, శ్రీకృష్ణావతారం, రామాంజనేయ యుద్ధం, వీరాంజనేయ, ఆంజనేయ చరిత్ర, సంపూర్ణ రామాయణం, త్యాగయ్య వంటి ఎన్నో చిత్రాలలో హనుమంతునిగా నటించాడు. ఆయన కనులలో భక్తి, వానర లక్షణాలు, నటనలో బుద్ధిర్బల యశోధైర్యాలు అద్భుతంగా పండించేవారు. ఆయనను చూస్తే హనుమ రూపం కళ్లకు కనబడినట్లే. ఈ గీతంలో ఆర్జా జనార్దన రావు గారు భక్తిపూరితమైన నటన అనుపమానం. అందుకే ఈ గీతం పరిపూర్ణతను పొందింది.

కొత్త రఘురామయ్య గారి గళంలో ఈ పాట వినండి.



వెడలెను కోదండపాణి - త్యాగరాజస్వామి కృతి

వెడలెను కోదండపాణి అనుజ సౌమిత్రితో గూడి పుడమిలో జనులెల్ల పొగడ పూజితుడౌ మునితో గూడి శిరమన కొండెయు జార  వురమున హారములు మెరయ కరమున శరచాపములును ఘ...