28, సెప్టెంబర్ 2010, మంగళవారం

నిర్వాణ షట్కము

జగద్గురువులు ఆదిశంకరులు

ఆదిశంకరుల రచనలు మూడు రకాలుగా విభజించవచ్చు. మొదటిది ఆధ్యాత్మికంగా బాగా ముందడుగు వేసిన వారికి - ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత మీద రాసిన భాష్యాలు. రెండవది వీటి సారాన్ని ప్రకరణలుగా రాసినవి. మూడవది దేవతా స్తోత్రాలు. నిర్వాణ షట్కము ప్రకరణగా భావించ వచ్చు. (ప్రకరణ అంటే - శాస్త్రాలలో ఇచ్చిన వివరణలో వచ్చిన సందేహాలను నివృత్తి చేసేవి అని). ఆత్మ అంటే ఏమిటి అనే దాన్ని ఏవేవి కాదో, ఏవేవి అంటవో, పట్టవో చెప్పి తర్వాత ఏమిటో అద్భుతంగా చెప్తుంది ఈ నిర్వాణ షట్కముశ్లోకాలు, తాత్పర్యం మీకోసము. యూట్యూబ్ లంకె 

మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం
న చ శ్రోత్రజిహ్వే న చ ఘ్రాణనేత్రే
న చ వ్యోమభూమిర్న తేజో న వాయుః
చిదానంద రూపః శివోహం శివోహం

నేను (ఆత్మను) - మనసును కాను; బుద్ధిని కాను; అహంకారాన్ని కాను; చిత్తం (మెదడు లోని విషయాన్ని దాచే ప్రాంతం - మతి)  కాను; చెవులు కాను; నాలుక కాను; ముక్కు కాను; కళ్ళు కాను; ఆకాశాన్ని కాను; భూమిని కాను; అగ్నిని కాను; వాయువును కాను. నేను సత్యమై, నిత్యమై ఉన్న ఆనంద స్వరూపాన్ని; నేనే శుభాన్ని.

న చ ప్రాణసంజ్ఞో న వై పంచవాయుః
న వా సప్తధాతుర్న వా పంచకోశః
న వాక్పాణిపాదౌ న చోపస్థపాయూ
చిదానంద రూపః శివోహం శివోహం


నేను (ఆత్మను) - ఊపిరిని, ఉచ్ఛ్వాస/నిశ్వాసను కాను; పంచప్రాణాలు కాను;  ఏడు ధాతువులను (రస, రక్త, మాంస, మేధస్, ఆస్తి, మజ్జ, శుక్ర) కాను, పంచ కోశములు (అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ) కాను ; వాక్కును కాను, చేతులు కాను, పాదములు కాను; పురుషాంగము/యోని కాను; విసర్జన చేసే అంగమును కాను; నేను సత్యమై, నిత్యమై ఉన్న ఆనంద స్వరూపాన్ని; నేనే శుభాన్ని.

న మే ద్వేషరాగౌ న మే లోభమోహౌ
మదో నైవ మే నైవ మాత్సర్యభావః
న ధర్మో న చార్థో న కామో న మోక్షః
చిదానంద రూపః శివోహం శివోహం


నాకు రాగద్వేషాలు, లోభమోహాలు లేవు; నాకు మద మాత్సర్యాలు లేవు; నేను ధర్మార్థకామమోక్షాల వెంట పడను ; నేను సత్యమై, నిత్యమై ఉన్న ఆనంద స్వరూపాన్ని; నేనే శుభాన్ని.

న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం
న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞాః
అహం భోజనైవ న భోజ్యం న భోక్తాః
చిదానంద రూపః శివోహం శివోహం

 
నాకు పాప పుణ్యములు, సుఖ దుఃఖాలు లేవు; నాకు మంత్రము, తీర్థము, వేదము, యజ్ఞములతో పని లేదు; నాకు ప్రియమైనది, ప్రీతిని కలిగించేది, నా చే ప్రీతి పొందబడేది లేదు; నేను సత్యమై, నిత్యమై ఉన్న ఆనంద స్వరూపాన్ని; నేనే శుభాన్ని.

న మే మృత్యుశంకా న మే జాతిభేదః
పితా నైవ మే నైవ మాతా న జన్మ
న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్యః
చిదానంద రూపః శివోహం శివోహం


నాకు మృత్యు భయము, జాతిభేదము, తల్లి, తండ్రి, జననము లేవు; నాకు బంధువులు, మిత్రులు, గురువులు, శిష్యులు లేరు; నేను సత్యమై, నిత్యమై ఉన్న ఆనంద స్వరూపాన్ని; నేనే శుభాన్ని.

అహం నిర్వికల్పో నిరాకారరూపో
విభుర్వ్యాప్య సర్వత్ర సర్వేంద్రియాణి
సదా మే సమత్వం న ముక్తిర్నబంధః
చిదానంద రూపః శివోహం శివోహం

నేను అన్ని గుణాలకు అతీతుడను (ఎటువంటి షరతులు లేని వాడిని); నేను నిరాకారుడను, అంతటా వ్యాపించి ఉన్నాను; నాకు ఇంద్రియాలు లేవు; నేను ఎల్లప్పుడూ ఒక్కలాగే ఉంటాను; నాకు బంధనాలు, విడుపు లేవు. నేను సత్యమై, నిత్యమై ఉన్న ఆనంద స్వరూపాన్ని; నేనే శుభాన్ని.

27, సెప్టెంబర్ 2010, సోమవారం

విశ్వనాథాష్టకం - తాత్పర్యం

ఆది శంకరులు నుతించిన కాశీ విశ్వనాథుని అష్టకం

గంగాధరుడు 

గంగా తరంగ రమణీయ జటా కలాపం,
గౌరీ నిరంతర విభూషిత వామ భాగం
నారాయణ ప్రియ మనంగ మదాపహారం
వారాణసీ పుర పతిం భజ విశ్వనాథం
తాత్పర్యం: గంగా నదీ అలలను తన జటాఝూటంలో అందంగా కలిగిన, తన ఎడమ వైపు పార్వతీ దేవి ఎల్లప్పుడూ శోభించే, శ్రీహరికి ప్రియుడైన, మన్మథుని గర్వము అణచిన, వారణాసి పురంలో వెలసిన ఆ విశ్వనాథుని భజన చేద్దాము.

వామే శక్తి ధరం వందే వకారాయ నమో నమః

వాచామగోచరమనేక గుణ స్వరూపం
వాగీశ విష్ణు సుర సేవిత పాద పీఠం
వామేన విగ్రహ వరేణ కళత్రవంతం
వారాణసీ పుర పతిం భజ విశ్వనాథం


తాత్పర్యం:  పదములకు, వర్ణనకు అందని అనేక గుణాలు కలిగిన స్వరూపంతో ఉన్న, బ్రహ్మ విష్ణు మరియు ఇతర దేవతలచే సేవించబడిన పాదములు కలిగిన, తన ఎడమ వైపు శుభములు కలిగించే పార్వతిని కలిగి ఉన్న, వారణాసి పురంలో వెలసిన ఆ విశ్వనాథుని భజన చేద్దాము.
పులిచర్మము ధరించిన శశిధరుడు

భూతాధిపం భుజగ భూషణ భూషితాంగం
వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం
పాశాంకుశాభయ వర ప్రద శూల పాణిం
వారాణసీ పుర పతిం భజ విశ్వనాథం


తాత్పర్యం:  సమస్త భూతములకు అధిపతియైన, సర్పములను ఆభరణంగా కలిగిన, పులిచర్మం వస్త్రంగా ధరించిన, జడలు కట్టిన కేశములు కలిగిన, పాశము (తాడు), అంకుశము, త్రిశూలము ధరించిన, అభయము, వరాలను ప్రసాదించే, వారణాసి పురంలో వెలసిన ఆ విశ్వనాథుని భజన చేద్దాము.
నెలవంక సిగపూవు నవ్వగా 

శీతాంశు శోభిత కిరీట విరాజమానం
ఫాలేక్షణానల విశోషిత పంచ బాణం
నాగాధిపారచిత భాసుర కర్మ పూరం
వారాణసీ పుర పతిం భజ విశ్వనాథం


తాత్పర్యం: చల్లదనాన్ని ఇచ్చే చంద్రుని కిరీటముగా కలిగి భాసిల్లుతున్న, తన ఉగ్రనేత్రముతో మన్మథుని దగ్ధము చేసిన, నాగేంద్రుని కర్ణములకు అలంకారముగా ధరించిన, వారణాసి పురంలో వెలసిన ఆ విశ్వనాథుని భజన చేద్దాము.
రౌద్రమున, ఆనందమున తాండవము

పంచాననం దురిత మత్త మతంగజానాం
నాగాంతకం దనుజ పుంగవ పన్నగానాం
దావానలం మరణ శోక జరాటవీనాం
వారాణసీ పుర పతిం భజ విశ్వనాథం

తాత్పర్యం: మదించిన ఏనుగులపాలిటి సింహంలా ఉన్న, అసురులపాలిటి గరుత్మంతుని వలె ఉన్న,  మరణాన్ని, శోకాన్ని, వృద్ధాప్యాన్ని నాశనం చేసే అగ్నిలా ఉన్న, వారణాసి పురంలో వెలసిన ఆ విశ్వనాథుని భజన చేద్దాము.
నిరంజనుడు, నిర్గుణుడు

తేజోమయం సుగుణ నిర్గుణమద్వితీయం
ఆనందకందమపరాజితమప్రమేయం
నాగాత్మకం సకల నిష్కలమాత్మ రూపం
వారాణసీ పుర పతిం భజ విశ్వనాథం


తాత్పర్యం:  తేజస్సు కలిగి, సుగుణములు కలిగి, గుణములు లేని, వేరే సాటిలేని, ఆనందకారకుడైన, ఓటమి ఎరుగని, తర్కానికి అందని, సర్పములకు ఆత్మయై, అన్ని శుద్ధ స్వరూపములు తానేయై, ఆత్మ స్వరూపుడైన, వారణాసి పురంలో వెలసిన ఆ విశ్వనాథుని భజన చేద్దాము.
సచ్చిదానందుడు

ఆశాం విహాయ పరిహృత్య పరస్య నిందా
పాపే రతిం చ సునివార్య మనః సమాధౌ
ఆదాయ హృత్ కమల మధ్య గతం పరేశం
వారాణసీ పుర పతిం భజ విశ్వనాథం


తాత్పర్యం:  ఏ కోరికలూ లేనివాడైన, దోషములు ఎంచని, నింద చేయని, పాపములకు దూరముగా ఉండి సమాధి స్థితిలో ఉన్న హృదయకమలము మధ్యలో నివసించి ఉన్న, వారణాసి పురంలో వెలసిన ఆ విశ్వనాథుని భజన చేద్దాము.
గరళ కంఠుడు

రాగాది దోష రహితం స్వజనానురాగం,
వైరాగ్య శాంతి నిలయం గిరిజా సహయం,
మాధుర్య ధైర్య శుభగం గరళాభిరామం
వారాణసీ పుర పతిం భజ విశ్వనాథం

తాత్పర్యం:  రాగద్వేషాది దోషములు ఎరుగని, తన భక్తులను ప్రేమతో చూసే, వైరాగ్యము, శాంతికి నిలయమై, హిమవంతుని పుత్రిక సహాయం పొందుతూ, మాధుర్యము, ధైర్యము కలిగి విషాన్ని ధరించిన, వారణాసి పురంలో వెలసిన ఆ విశ్వనాథుని భజన చేద్దాము

ఫలశ్రుతి:
వారాణసీ పురపతే స్తవనం శివస్య
వ్యాఖ్యాతమష్టకమిదం పఠతే మనుష్యః
విద్యాం శ్రియం విపుల సౌఖ్యమనంతకీర్తిం
సంప్రాప్య దేహ విలయే లభతే చ మోక్షం


తాత్పర్యం: వారణాసి పురంలో వెలసిన ఆ విశ్వనాథుని అష్టకాన్ని పఠనం చేసే మనుష్యులకు దేహమున్నప్పుడు విద్య, మంచి, ఎనలేని సుఖము, అనంతమైన కీర్తి, అటు తర్వాత మోక్షము లభించును. 

విశ్వనాథాష్టకమిదం యః పఠేచ్ఛివ సన్నిధౌ
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే

తాత్పర్యం: ఈ విశ్వనాథ అష్టకం శివుని సన్నిధిలో చదివిన వారికి శివలోకము, ఆ పరమశివుని ఆశీస్సులు పొందుదురు.

26, సెప్టెంబర్ 2010, ఆదివారం

శివ మానస పూజ



ఆది శంకరుల మహత్తు గురించి మాట్లాడేంత అర్హత నాకు లేదు. కానీ, కొన్ని మాటలు చెపితే నాకు తృప్తి కలుగుతుంది. మొదట,  ఆ పరమశివ రూపమైన జగద్గురువులకు నా మానసిక సాష్టాంగ నమస్కారములు.  ఆయన ఎటువంటి మానసిక స్థితిలో ఈ ఐదు శ్లోకాలు రాసారో వాటి అర్థం చూస్తే మనకు కొంత అవగతమవుతుంది.  నాలుగవ శ్లోకంలో వేదాంత సారమంతా ఇమిడి ఉంది గమనించండి. ఆత్మ, శరీరం, ఇంద్రియాలు, ప్రాణము, కర్మలు, నిద్ర - అన్ని ఆ భగవంతుని కొరకే  అన్న భావన ఎంత అందంగా, భక్తితో, శుద్ధ అంతఃకరణంతో భావించారో శంకరులు. ఇంతకన్నా విడమరచి చెప్పేది ఏముంది చెప్పండి సృష్టిలో?.

దేహమే దేవాలయము, జీవుడే సనాతన దైవము అని మనకు ఒక కవి శంకరుల సందేశాన్ని చెప్పారు కూడా. మానసిక సంకల్పము, మానసిక శుద్ధి ఉంటే చాలండి. దాని కోసమే కదా ఈ బాహ్య శుద్ధి (ఆచారము, నియమము, ఉపచారములు, నిష్ఠ లాంటివి)?. మనము తప్పు చేస్తున్నామో లేదా సరైన మార్గంలో ఉన్నామో మన మనస్సుకు తప్పకుండా తెలుస్తుంది. దానిని మీరు బయటికి చెప్పకర్లేదు. మీ పనులలో చూపిస్తే చాలు. చరాచరమైన ప్రతి వస్తువు, ప్రాణిలో ఆ పరమాత్మ ఉన్నాడు. అద్వైత సిద్ధాంత సారమిదే. 'స్థావర జంగమ రూప' అని వాగ్గేయకారులు ఆ రాముని స్తుతించినా, 'ఆత్మా త్వం' అని శంకరులు కింది విధిన శివుని పూజించినా అన్ని ఆ నిరాకర, నిరామయ, నిరంజనునికే. ఆకాశాత్ పతితం తోయం యథా గచ్ఛతి సాగరం సర్వ దేవ  నమస్కారః కేశవః ప్రతి గచ్ఛతి - ఆకాశాన్నుంచి కింద పడిన ప్రతి నీటి బిందువు వాగు, వంక, సెలయేరు, నది ద్వారా సాగరంలో కలుస్తుంది. అలాగే ప్రతి దేవతకు చేసే నమస్కారము ఆ కేశవునికే.


రత్నైః కల్పితమాసనం హిమజలైః స్నానం చ దివ్యాంబరం
నానారత్న విభూషితం మృగమదామోదాంకితం చందనం
జాతీచంపకబిల్వపత్ర రచితం పుష్పం చ ధూపం తథా
దీపం దేవ దయానిధే పశుపతే హృత్కల్పితం దృశ్యతాం

తాత్పర్యం: ఓ దయానిధి! పశుపతి! రత్నాలతో కూడిన ఆసనం, చల్లని నీటితో స్నానం, దివ్యమైన వస్త్రాలు, ఎన్నో రకాల రత్నాలతో అలంకరించి, చందనం పూసి, సుగంధ జాజి, చంపక పుష్పాలు, బిల్వపత్రాల మాలతో అలంకరించి, ధూపం, దీపం అన్ని మానసికం గా సమర్పించాను, స్వీకరించు.

సౌవర్ణే నవరత్నఖండరచితే పాత్రే ఘృతం పాయసం
భక్ష్యం పంచవిధం పయోదధియుతం రంభా ఫలం పానకం
శాకానామయుతం జలం రుచికరం కర్పూరఖండోజ్వలం
తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురూ

తాత్పర్యం: ఓ ప్రభూ! నవరత్నాలతో అలంకరిచిన బంగారు పాత్రలో నెయ్యి వేసిన తీయని పాయసం, భక్ష్యాది ఐదు రకాల వంటకాలతో, పాలు, పెరుగు, అరటి పండు, పానకము, ఫల రసాలు, వండిన కూరగాయలు, పచ్చ కర్పూరం కలిపిన తీయని నీరు, తాంబూలం - ఇవన్ని మానసికంగా భక్తితో సమర్పిస్తున్నాను, స్వీకరించు.

ఛత్రాచామరయోర్యుగం వ్యజనకం చా దర్శకం నిర్మలం
వీణాభేరి మృదంగకాహలకలా గీతం చ నృత్యం తథా
సాష్టాంగం ప్రణతిః స్తుతిర్బహువిధాః ఏతత్సమస్తం మయా
సంకల్పేన సమర్పితం తవ విభో పూజాం గృహాణ ప్రభో

తాత్పర్యం: ఓ ప్రభూ! ఛత్రము (గొడుగు), రెండు చామరాలు, చల్లనిగాలికోసం వింజామర, శుద్ధమైన అద్దం, వీణా వాదన, మృదంగాది ఇతర వాద్య ఘోషలు,  పాట, నృత్యం మరియు సాష్టాంగ నమస్కారముతో కూడిన ఎన్నో రకాల స్తుతులు - ఇవన్ని సంకల్పము ద్వారా మానసికంగా సమర్పిస్తున్నాను స్వీకరించు.

ఆత్మా త్వం గిరిజా మతిః సహచరాః ప్రాణాః శరీరం గృహం
పూజా తే విషయోపభోగ రచనా నిద్రాసమాధి స్థితిః
సంచారః పదయోః ప్రదక్షిణ విధిః స్తోత్రాణి సర్వా గిరో
యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం

తాత్పర్యం: ఓ శంభో! నా ఆత్మయే నీవు;  పార్వతి దేవియే నా బుద్ధి; నీ సహచరులు నా ప్రాణాలు; నా దేహమే నీ దేవాలయం; ప్రాపంచిక సుఖాలు, భోగాలు అన్నీ నీ పూజలు; నా నిద్రే సమాధి స్థితి; నా కదలికలు అన్నీ నీకు ప్రదక్షిణాలు; నా మాటలన్నీ నీ స్తోత్రాలు; నేను చేసే కర్మలన్నీ నీ ఆరాధనయే. 

కరచరణ కృతం వాక్కాయజం కర్మజం వా
శ్రవణ నయనజం వా మానసం వాపరాధం
విహితమవిహితం వా సర్వమేతత్క్షమస్వ
జయ జయ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో

తాత్పర్యం: ఓ మహాదేవ! శంబో! కరుణానిధీ! నా చేతులు, పాదములు, మాటలు, కర్మలు, చెవులు, కళ్లు, మనసు ద్వారా తెలిసీ, తెలియక చేసిన అపరాధాలు అన్ని క్షమించు. నీకు జయము జయము.

శ్రీరాముని రూపంలో రంగనాథుని వర్ణన - రంగపుర విహార

కర్ణాటక సంగీత త్రయంలో ఒకరు ముత్తుస్వామి దీక్షితులు (మన కాకర్ల త్యాగరాజు, శ్యామశాస్త్రి మిగిలిన ఇద్దరు). వీరు  1775 వ సంవత్సరంలో తమిళనాడులోని తంజావూర్ జిల్లాలోని తిరువారూర్ లో రామస్వామి, సుబ్బమ్మ అనే తమిళ అయ్యరు దంపతులకు జన్మించారు.   వీణావాదనలో ఆరితేరిన వీరు గురుగుహుని (సుబ్రహ్మణ్యస్వామి) కృప వలన అద్భుతమైన కీర్తనలను రచించారు. నవగ్రహ కృతులు, కమలాంబ నవావరణ కీర్తనలు, పంచలింగ కీర్తనలు లాంటివి ఎన్నో రచించారు. సుప్రసిద్ధమైన వాతాపి గణపతిం భజే ఆయన రచనే.  ఆయన కృతులలో ముద్రగా 'గురుగుహ' వాడారు.

తపాల శాఖ వారు విడుదల చేసిన ముత్తుస్వామి దీక్షితార్ స్మారక బిళ్ళ 
ఆయన రచించిన రంగ పుర  విహార అనే కీర్తన బృందావన సారంగా రాగంలో పాడబడింది. భక్తి రస పూరితమై, ఆ రాముని వర్ణన రమ్యంగా చేసిన ఈ కృతి చాలా ప్రజాదరణ పొందింది. దక్షిణాదిన అన్ని వైష్ణవ క్షేత్రాలలో దీనిని ప్రతిదినము వినిపిస్తూనే ఉంటారు. దాని సాహిత్యం, తాత్పర్యం  కింద మీకోసం. దీనిని భారత రత్న ఎమ్మెస్ సుబ్బులక్ష్మి చాలా ఏళ్ల క్రితం పాడారు. ఇటీవలి కళాకారులు పాడిన యూట్యూబ్ లంకె.

శ్రీ రంగనాథుడు

రంగపుర విహార జయ కోదండ రామావతార రఘువీర |శ్రీ రంగ|

అంగజ జనక దేవ బృందావన సారంగేంద్ర వరద రమాంతరంగ
శ్యామలాంగ విహంగ తురంగ సదయాపంగ సత్సంగ | రంగపుర|

పంకజాప్త కుల జలనిధి సోమ
వర పంకజ ముఖ పట్టాభిరామ
పదపంకజ జితకామ రఘురామ
వామాంక గత సీత వర వేష
శేషాంక శయన భక్త సంతోష
ఏణాంక రవి నయన మృదుతర భాష
అకళంక దర్పణ కపోల విశేష
ముని సంకట హరణ గోవింద
వేంకట రమణ ముకుంద
సంకర్షణ మూలకంద
శంకర గురుగుహానంద

తాత్పర్యం:

శ్రీరంగంలో వెలసిన రంగనాథ!  కోదండం ధరించి రామునిగా అవతరించిన రఘువీర!

మన్మథుని జనకుడైన వాడ! దేవతలను, గజేంద్రుడిని రక్షించి, పాలించే లక్ష్మీ అంతరంగంలో ఉన్న దేవ!  నీలమేఘ శరీరము కలవాడ! గరుత్మంతుని వాహనముగా కలిగి, ఎల్లప్పుడూ కరుణ, దయ గలిగిన చూపులతో సత్సాంగత్యములో ఉండే ఓ రంగనాథ!.

సూర్య వంశమనే సాగరానికి చంద్రుని వంటి వాడ! శుభకరమైన కలువ వంటి ముఖం కలవాడ!  కలువల వంటి తన పాదములతో కామాన్ని జయించిన వాడ! రఘురామ!  ఎడమ తొడపై సీతను గలిగి సుందరముగా కనిపించే రామ!  ఆదిశేషునిపై పరుండి భక్తులను సంతోషింప జేసే దేవ దేవ! సూర్య చంద్రులను కన్నులుగా కలిగి, సున్నితమైన మాటలతో అద్దమువలె ఎటువంటి కళంకం లేని చెంపలు కలిగి, ఋషుల బాధలు తొలగించే ఓ వెంకటరమణ! గోవింద!  ముకుంద! సర్వ శుభములు కలిగించే, అన్నిటికి మూలమైన వాడ! గురుగుహునికి ప్రియమైన వాడ!

24, సెప్టెంబర్ 2010, శుక్రవారం

వర్షరుతు వీడ్కోలు - శరదృతు ఆగమనం

 
గర్జించిన రుతు కాలమేఘం కురిపించింది నిత్య నిర్ఝరవర్షిణి
సుజలమైన సస్య ఆంధ్రమాత వినిపించింది సత్యసుధాతరంగిణి

నిండినాయి మా జలధారలు కుదిరినాయి రైతన్నల గుండెలు
అదిరినాయి నాళ్లతో పంటలోగిళ్లు చెదరినాయి కరవు పీడకలలు

నోచినారు సతులు వరలక్ష్మీ వ్రతం పలికినారు పతులు గణనాథునికి మంగళం
వీచినారు శ్రీనివాసుని  బ్రహ్మోత్సవం సమర్పిస్తున్నారు పితరులకు తర్పణం

విరిసింది పెరట్లో పచ్చని ముద్దబంతి మురిసింది ప్రతియింట ప్రౌఢ యువతి
వికసించింది తోటలో తెల్లని చేమంతి వేసింది శరదృతు శోభలకు నాంది

వస్తున్నవి ఆ సర్వమంగళ నవరాత్రులు తెస్తున్నవి మాయిళ్ల భక్తిసుధలు
వీస్తున్నవి శరచ్చంద్రుని చల్లని వెన్నెలలు ఇస్తున్నవి మాకు సకల శుభాలు


21, సెప్టెంబర్ 2010, మంగళవారం

నగుమోము గలవాని

ఉత్సవ సాంప్రదాయ కీర్తన - నగుమోము గలవాని - మధ్యమావతి రాగం




నగుమోము గలవాని నా మనోహరుని
జగమేలు శూరుని జానకీ వరుని

దేవాది దేవుని దివ్య సుందరుని
శ్రీ వాసుదేవుని సీతారాఘవుని

సుజ్ఞాన నిధిని సోమ సూర్యలోచనుని
అజ్ఞానతమము అణచు భాస్కరుని

నిర్మలాకారుని నిఖిలాఘ హరుని
ధర్మాది మోక్షమ్ము దయచేయు ఘనుని

బోధతో పలుమారు పూజించి
నేనారాధింతు శ్రీ త్యాగరాజ సన్నుతుని

క్షీర సాగర విహారా - ఉత్సవ సాంప్రదాయ కీర్తన

పరమ రామభక్తుడు త్యాగరాజు రచించిన ఉత్సవ సాంప్రదాయ కీర్తన ఒకటి ఆనంద భైరవి రాగంలో. బాలమురళిగారు మనల్ని భక్తి పారవశ్యంలో ముంచేస్తారు ఈ కీర్తన గానంలో:


క్షీర సాగర విహారా అపరిమిత ఘోర పాతక విదారా
కౄరజనగణ విదూరా నిగమ సంచార సుందర శరీరా

శత మఘాహిత విభంగా శ్రీ రామ శమన రిపు సన్నుతాంగా
శ్రిత మానవాంతరంగా  జనకజా శృంగార జలజ భృంగా

రాజాధి రాజ వేషా శ్రీ రామ రమణీయ కర సుభూషా
రాజనుత లలిత భాషా శ్రీ త్యాగరాజది భక్త పోషా

యూట్యూబ్ లంకె

వెడలెను కోదండపాణి - త్యాగరాజస్వామి కృతి

వెడలెను కోదండపాణి అనుజ సౌమిత్రితో గూడి పుడమిలో జనులెల్ల పొగడ పూజితుడౌ మునితో గూడి శిరమన కొండెయు జార  వురమున హారములు మెరయ కరమున శరచాపములును ఘ...