30, జులై 2010, శుక్రవారం

భారత రత్న, సంగీత కళానిధి సుబ్బులక్ష్మి

మన వృత్తిలోని విశేషాన్ని మన జీవనంలో అమలు పరచటం చాలా కష్టం. అలాగే మంచి జీవన శైలిని వృత్తిలో అనుకరించటం కూడా కష్టమే. బహు కొద్ది మంది తాము చేసే పనిలోని భావాన్ని తమ జీవితంలోని ప్రతి అడుగులో నిరూపించగలరు. సంగీతం అంటే కేవలం సప్త స్వరాలు, వాటిని అటు ఇటు తిప్పి పాడటం కాదు. ఒక వాగ్గీయకారుడు అనుభూతి పొంది ఆ వాగ్దేవి అనుగ్రహంతో రాసిన సుస్వర రస ప్రవాహాన్ని తన మానసిక, శారీరిక శుద్ధితో, నిర్మలమైన నవ్వుతో ఆ పరమాత్మను తలస్తూ, పొగడుతూ, ఆ అంతర్యామి లక్షణ వర్ణనలో లీనమై, ఒక్కొక్క అక్షరాన్ని మంత్రంలా భావించి తాదాత్మ్యం చెంది, శృతి, లయ బద్ధంగా పాడితే అది శాస్త్రీయ సంగీతం.

అంతర్యామిని దర్శిస్తూ పాడుతున్న సుబ్బులక్ష్మి

అలా పాడాలంటే - ఆలోచన, జీవన శైలి దానికి అనుగుణంగా ఉండాలి. అంటే, నిరాడంబరత, శాంతము, సహనము, ప్రేమ, భక్తి, బాహ్య/అంతః శుద్ధి, శరణాగతి, నిరపేక్షం లాంటి సుగుణాలు చాలా ఉండాలి. వీటికి తోడు గా కఠోర శ్రమతో, సద్గురువు వద్ద నేర్చుకున్న విద్య ఉంటే అది పంచమ శృతిలో ప్రౌఢ కోకిల పాడినట్టుగా శ్రావ్యంగా ఉంటుంది.

ప్రపంచంలో ఉన్న అన్ని మంచి లక్షణాలు ఒకే వ్యక్తిలో చూడాలని ఉందా?. అలా ఉంటే మరి వారికి ఆ సరస్వతి ఏమిటి?. ముల్లోకాలు వశమే. తన గానం, జీవనం, భక్తి, చిరునవ్వు, నిరాడంబరత, అందం, నిశ్చలమైన వ్యక్తిత్వము - ఇంక ఎన్నో ఎనో సుగుణాల రాశి ఆవిడ. మదురై షణ్ముఖవడివు సుబ్బులక్ష్మి (ఎం.ఎస్. సుబ్బులక్ష్మి). ఏమి చెప్పగలం ఆమె గానమాధుర్యం గురించి?. ఆ గానంలో ఉన్న భక్తి, శాస్త్రం గురించి?.

ఎన్ని సంపదలు, విద్యలు ఉన్నా స్వచ్చతను చిందించే సుబ్బులక్ష్మి

తెల్లవారకముందే దక్షిణ భారత దేశంలో లక్షలాది గుళ్లలో 'కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే' అని వినిపిస్తే అది ఆమె గొంతులో వెలువడిందే. 'భజ గోవిందం భజ గోవిందం' అని వినిపించే శ్రావ్యమైన గానం ఆమెదే. 'శుక్లాంబర ధరం విష్ణుం' తో మొదలయ్యి, 'విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ప్రభుః' అన్న వేయి నామాలతో అరగంటపాటు మీకు ఆ శ్రీ మహావిష్ణువుని స్తుతించే విష్ణు సహస్ర నామం ఆమె పాడిందే.  రేడియోలో, రికార్డుల్లో, వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఈమె గొంతు దక్షిణాదిన మారుమ్రోగుతూనే ఉంటుంది.

పొద్దునే లేచి ఏ చప్పుడూ లేకుండా, స్నానం చేసి, కుర్చీలో కూర్చొని ఆమె పాడిన 'భావయామి గోపాల బాలం' అన్న యమన్ కళ్యాణి రాగంలో అన్నమాచార్యుల కృతి వింటే భక్తి పారవశ్యం మనలో రాక మానదు. జో అచ్యుతానంద జో జో ముకుంద అని ఆ వెంకటేశ్వరునికి జోల ఆమె అంత లాలిత్యం, ప్రేమతో ఎవ్వరు పాడలేరు, పాడబోరు. 'డోలాయాం చల డోలాయాం' అనే కృతి పాడుతుంటే ఆ తిరుమలేశుడు నిజంగానే ఊయలలో ఊగుతూ మందహాసంతో ఈ సరస్వతిని ఆశేర్వదించిన ఉండవచ్చు. ఎం.ఎస్. 30 ఏళ్ల క్రిందట పాడిన పాట ఇది.  అలాగే, 'ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన'  అనే కీర్తనలోని  ఆధ్యాత్మిక తత్త్వాన్ని అద్భుతంగా వినిపించారు సుబ్బులక్ష్మి. తిరుమల స్వామి వారి ఆస్థాన గాయనిగా ఆవిడ అన్నమాచార్యుని కీర్తనలు చాలా ప్రాచుర్యంలోకి తెచ్చారు. ఒక సంగీతజ్ఞురాలిగా ఆమె అన్ని శిఖరాలను అధిరోహించి అక్కడే నిలిచిపోయింది. ఆవిడను దాటి వెళ్లే వారు ఇంత వరకు పుట్టలేదేమో.

శాస్త్రమంటే సుబ్బులక్ష్మే

సెప్టెంబర్ 16, 1916 న మదురై లో పుట్టింది సుబ్బులక్ష్మి. 13 ఏళ్ల  ప్రాయంలో కచేరీలు మొదలు పెట్టింది సుబ్బులక్ష్మి. అప్పటినుంచి తన భర్త మరణించేంతవరకు ఆరు దశాబ్దాలు భారత శాస్త్రీయ సంగీత సామ్రాజ్యాన్ని ఏలిన మహారాణి సుబ్బులక్ష్మి. నటిగా  హిందీ, తమిళ చితాల్లో తన ప్రతిభను చూపించింది ఆవిడ. మీరాబాయిగా ఆమె నటన, ఆమె పాడిన మీరా భజనలు ఆరు దశాబ్దాల తర్వాత కూడా ఇంకా ప్రజల మనస్సుల్లో ఉంది. పాత్రికేయుడైన సదాశివాన్ని పెళ్ళిచేసుకొని నిజమైన ధర్మపత్నిగా జీవించి, సహకరించింది. ఆ దంపతులు చేసిన సమాజ సేవ, దాన ధర్మాలు వారి నిర్మలత్వానికి ప్రతీక.

భారత దేశంలో అత్యున్నత పురస్కారం - భారత రత్న - పొందిన ఏకైక సంగీత కళాకారిణి ఆవిడ.  మెగసెసే, పద్మ విభూషణ్, పద్మశ్రీ, పద్మభూషణ్, సంగీత కళానిధి, కలైమామణి, తాన్సేన్ లాంటివి చెప్పక్కర్లేదు. ఐక్య రాజ్య సమితి జనరల్ అసెంబ్లీ, లండన్, ఫ్రాన్సు, మాస్కో లలో అంతర్జాతీయ స్థాయిలో చాలా గుర్తింపు పొందిన కచేరీలు ఎన్నో.

చెదరని అరవ కట్టులో దేవతలను గుర్తు చేసే రంగులో కంచి పట్టు చీర, సిగన తెల్లని మల్లెపూలు, నుదుట పెద్ద తిలకపు బొట్టు, ముక్కున మెరిసే రవ్వల పుడకలు, చెవులకు మెరిసే రవ్వల దిద్దులు,  మెడలో మెరిసే ఒక ఆభరణం, పెదవులపై మందాకినీ జలంలాంటి స్వచ్చమైన చిరునవ్వు, కళ్ళలో ఆ భగవంతుని చూస్తున్న చిదానందం, పారవశ్యం  - చేతిలో తంబురా పట్టి శ్రుతిలోఆవిడ పాడుతుంటే ఆ సరస్వతి మన కళ్ళ ఎదుట ఉన్నదా అనిపిస్తుంది. భారతీయ స్త్రీలో ఉండే అందం, అణకువ, సిగ్గు, భక్తి, మానసిక సౌందర్యం - వీటికి తోడు తమిళ సాంప్రదాయాన్ని పాటించే ఉత్తమ ఇల్లాలి లక్షణాలన్నీ ఉన్న మహా కళాకారిణి సుబ్బులక్ష్మి. ఏ భాషలో పాడినా ఆ భాష యొక్క సహజ లక్షణాలు పోకుండా, స్పష్టమైన ఉచ్చారణతో, భక్తితో అబ్బ ఎంత బాగుంది అని అనిపించేలా పాడారు ఆవిడ.

భక్తిలోతాదాత్మ్యం చెంది శ్రోతలను పారవశ్యంలో ముంచుతున్న సుబ్బులక్ష్మి

అప్పటి భారత ప్రధాని ఈవిడ గురించి మాట్లాడుతూ - "నేను ఈ దేశానికి మాత్రమే ప్రధానిని. సుబ్బులక్ష్మి అనంతమైన సంగీత సామ్రాజ్యానికి మహారాణి' అని అన్నారుట. మహాత్మా గాంధి ఈవిడ పాడే మీరా భజనల కోసం ఆవిడను పిలిపించుకునే వారుట.

డెబ్భై ఎనిమిదేళ్ళ వయసులో కంచి పరమాచార్యులు చంద్రశేఖర సరస్వతి మహాస్వామి సమక్షంలో ఆయన రచించిన 'మైత్రీం భజత' అని, ఆది శంకరులు రచించిన 'నాగేంద్ర హారాయ త్రిలోచనాయ' అని పాడి ఆయన ఆశీస్సులు, మన్ననలు పొందారు ఆవిడ. అంతకన్నా గొప్ప గౌరవం ఒక భారతీయ కళాకారుడి జీవితంలో ఉండదేమో.

ఎన్నో స్తోత్రాలకు ఆవిడ జీవం పోశారు - భజగోవిందం, అన్నపూర్ణాష్టకం,  నామ రామాయణం, హనుమాన్ చాలీసా, గోవిందాష్టకం, గణేశ పంచరత్నం, మీనాక్షీ స్తోత్రం, కనకధారా స్తోత్రం, రామనాధ స్తోత్రం, దుర్గా పంచరత్న స్తోత్రం, కాశీ విశ్వనాథ సుప్రభాతం, కామాక్షీ సుప్రభాతం, లక్ష్మీ అష్టోత్తరం - ఇలా దాదాపు ప్రతి మహిమాన్విత స్తోత్రం ఆమె గళంలో అమృతంగా మరి మనకు జాలువారింది. సామాన్యునికి తన గొంతును స్తోత్రాల రూపంలో అందించి శాశ్వతమైయ్యింది సుబ్బులక్ష్మి.  'అధరం మధురం, వదనం మధురం' అని మధురాష్టకం పాడుతుంటే ఆ శ్రీ కృష్ణుని మనోహరమైన రూపము మన కళ్ళ ఎదుట నిలుస్తుంది. న భూతో న భవిష్యతి అన్నట్టుగా పాడారు ఈ స్తోత్రాలన్నీ ఆవిడ.

నాయనమ్మ, అమ్మమ్మ అంటే ఇలా ఉండాలి అని అనిపించే వ్యక్తిత్వము, రూపము ఆమెది. పోటీ ప్రపంచమైన శాస్త్రీయ సంగీత ప్రపంచంలో శత్రువులు, విమర్శకులు లేకుండా అందరి చేత అమ్మ అని పిలిపించుకున్నారు ఆవిడ. ఆవిడ వినయం, నడవడిక, కవళికలు మనకందరికీ ఆదర్శ ప్రాయం. ఆదర్శ పత్ని గా సదాశివం గారిని కంటికి రెప్పల చూసుకుంటూ, అనుగమిస్తూ ధర్మపత్నిఅనే పదానికి ఉత్తమ ఉదాహరణ ఆవిడ అయ్యారు. సవతి బిడ్డలైనా తన బిడ్డలకన్న మిన్నగా సదాశివం మొదటి భార్య కూతుళ్ళని పెంచింది. ఆయన పెద్ద కూతురు రాధా విశ్వనాథన్ ఆవిడతో కొలిసి కొన్ని వందల కచేరిలలో పాడారు. వారి జీవితంలో వీడలేని బంధమై, ప్రేమ మూర్తిగా, సత్సాంప్రదాయాలకు పుట్టిల్లుగా తన గృహాన్ని పెంపొందించింది. ఆ తల్లి మరణించినప్పుడు ఈ బిడ్డలు పొందిన ఆవేదన వర్ణనాతీతం.

కంచు లాంటి కంఠం, శాస్త్రం పై పూర్తి పట్టు, చెదరని చిరునవ్వు, అనన్యమైన భక్తి ఆమె సంగీత సోపానానికి పునాది రాళ్ళు. వయసుతో భక్తి, శాస్త్రంలో పండి, ఎదిగిన కొద్దీ ఒదిగి, జీవితంలో ప్రతి కోణం లోను తన ఉన్నత విలువల్ని చూపించి, ఆచరించి, వాటి ఫలితాలను పొంది, తాను సంపాయించింది పేదలకు, పరమేశ్వరుడి సేవకు ధారా పోసి, 88 ఏళ్ల పండు వయసులో సుబ్బులక్ష్మి చెన్నైలోని స్వగృహంలో డిసెంబర్ 11, 2004 నాడు కన్ను మూశారు. ఆమె ఎప్పటికీ సంగీత రసజ్ఞుల గుండెల్లో ఉన్నతమైన స్థాయిలో నిలిచి పోతుంది.

శివుడు - హాలాహల భక్షణం

దేవతలు, రాక్షసులు పాల కడలిని అమృతం కోసం చిలకటంలో భాగంగా మందర పర్వతం, వాసుకి, కూర్మావతరమైన విష్ణువు - ఇవి చాలా సార్లు చదివే ఉంటాము.

కూర్మావతారము


ఈ క్షీర సాగర మథనంలో అమృతం కన్నా ముందు కాలకూట విషం బయట పడింది. దాన్ని హాలహాలంగా వర్ణించారు. ఈ కథను శ్రీమదాంధ్ర మహాభాగవతంలో పోతన మనోజ్ఞంగా వర్ణించాడు. అష్టమ స్కంధములో వీటి వివరాలు ఉన్నాయి. 

జలధిన్ కడవ సేయ శైలంబు కవ్వంబు
సేయ భోగిన్ త్రాడు సేయన్ తరువ
సిరియుసుధయున్ బడయ శ్రీవల్లభుడు దక్క
నొరుడు శక్తిమంతుడొకడు గలదే

సిరి సంపదలకు, అమృతమును పొందటానికి క్షీర సాగరమును కడవగా చేసి, పర్వత రాజమైన మందరగిరిని కవ్వముగా చేసి, సర్పరాజమైన వాసుకిని తాడుగా చేసి, సముద్రమును చిలుకే కార్యమును ఆ శ్రీ మహావిష్ణువు తప్ప ఇంకొక శక్తిమంతుడు ఎవ్వడైనా చేయ గలడా?.

ఆలోల జలధిలోపలన్
ఆలోనహి విడిచి సురలు నసురులు బరవం
గీలా కోలాహలమై
హాలాహలవిషము పుట్టె నవనీనాథ!

ఆ కల్లోలితమైన సముద్రము లోపల విషజ్వాలలు పుట్టుటచే, కోలాహలముతో ఆ వాసుకిని విడిచి దేవ దానవులు చెల్లాచెదరుగా పారిపోయారు.

అప్పుడు దేవతలు ఆ శివుని హాలహలమునుండి రక్షించమని స్తుతించారు. ఏమని?.

కొందరు కలడందురు నినున్
కొందరు లేదండు రతడు గుణిగాడనుచున్
కొందరు కలడని లేడని
కొందలమందుదురు నిన్నుగూర్చి మహేశా!

మూడుమూర్తులకును మూడులోకములకు
మూడుకాలములకు మూలమగుచు
భేదామగుచు దుదినభేదమై యొప్పారు
బ్రహ్మ మనః నీవ ఫాలనయన! 

సదసత్తత్త్వచరాచర
సదనంబగు నిన్ను బొగడ జలజభవాదుల్
పెదవులు గదలుప వెరతురు
వదలక నిను బొగడ నెంతవారము దేవా! 

నీకంటె నొండెరుగము
నీకంటెం బరులు గావనేరరు జగముల్
నీకంటె నొడయడెవ్వడు
లోకంబులకెల్ల నిఖిలలోకస్తుత్యా!

దేవ దేవా! నీవే మాకు శరణ్యము. కొందరు నీవు ఉన్నావు అంటారు, కొందరు నీవు సాకారుడవై లేవని అంటారు, మరి కొందరు నీవు కలవో లేవో అని తికమక పడతారు. నీయొక్క నిజతత్వము ఎవ్వరికి తెలియదు కదా పరమశివా! . ఓ త్రినేత్రా! త్రిమూర్తులకు, మూడు లోకాలకు, మూడు కాలాలకు మూలమై ఉంటూ బాహ్యమైన భేదాలు కనిపించినను, నిజానికి ఏకైక పరబ్రహ్మ అభేద తత్త్వమై నీవు ఉన్నావు. సత్యము, అసత్యములతో కూడియున్న ఈ చరాచర సృష్టికి ఆశ్రయమై యున్న నిన్ను పొగడుటకు బ్రహ్మాది దేవతలు కూడా పెదవులను కదుపుటకు సాహసింపలేరు. ఇక మేమెంత?. ఓ సర్వలోక పూజ్యా! మేము నిన్ను తప్ప ఇంకెవరినీ ఎరుగము. నీవు తప్ప ఇంకెవ్వరు ఈ లోకములను ఈ హాలాహలాన్నుండి కాపాడలేరు. ఈలోకములన్నిటా నీకన్నా గొప్పవాడు ఇంకెవ్వడూ లేడు.

అప్పుడు శివుడు ప్రసన్నుడై, వారిపై జాలి కలిగి, పార్వతితో ఇలా అన్నాడు.

ప్రాణేచ్ఛ వచ్చి చొచ్చిన
ప్రాణుల రక్షింపవలయు ప్రభువులకెల్లన్
ప్రాణులకిత్తురు సాధులు
ప్రాణంబులు నిమిషభంగురములని మగువా!

పరహితము సేయునెవ్వడు
పరమహితుండగును భూతపంచకమునకున్
పరహితమె పరమధర్మము
పరహితునకు నెదురులేదు సర్వేందుముఖీ!

హరి మది నానందించిన
హరిణాక్షి! జగంబులెల్ల నానందించున్
హరియును జగములు మెచ్చగ
గరళము వారింపుటొప్పు కమలదళాక్షీ!

ఓ పార్వతీ! ప్రాణములను రక్షించుకొను కోరికతో వచ్చి, శరణు జొచ్చిన ప్రాణులను ప్రభువులందరూ రక్షింపవలెను. సాధువులు, మహాత్ములు ఇతరులకు తమ ప్రాణములను, అవి క్షణంలో పోగలవని తెలిసి ఇచ్చెదరు కదా!. ఇతరులకు ఉపకారము చేసే వాడు పంచభూతములకు, సమస్త జీవరాశికి పరమ హితుడగును. పరోపకారమే పరమ ధర్మము. ఇతరుల మంచి కోరేవాడికి ఎందులోనూ ఎదురులేదు కదా. ఇతరులకు మంచి చేస్తే ఆ విష్ణువు కూడా సంతోషించును. విష్ణువు సంతోషిస్తే లోకాలన్నీ ఆనందిస్తాయి. శ్రీహరిని, సర్వ లోకములను ఆనందింప చేయటానికి విషాన్ని నివారించటం మంచిదికదా!.

అప్పుడు ఆ లోకమాత ఐన పార్వతి ఎలా ఆ శంకరుడు హాలాహలాన్ని తన కంఠంలో ఉంచుకోటానికి ఒప్పుకుందో పోతన గారు ఇలా వర్ణించారు.

మ్రింగెడివాడు విభుండని
మ్రింగెడిది గరళమని మేలని ప్రజకున్
మ్రింగుమనె సర్వమంగళ
మంగళసూత్రంబు నెంత మదినమ్మినదో!

మూడు లోకాలను దహించనున్న హాలాహాల జ్వాలలను తానే స్వీకరించదలుచుకున్న శివునకు శివాని లోకకల్యాణార్థమై అనుమతి ఇచ్చింది.  మింగ వలసినది ఘోరమైన విషమని తెలిసి, మింగేవాడు తన పతి దేవుడైనా,  జీవరాసులను రక్షించవలసి ఉన్నందున సర్వమంగళయైన ఆ పార్వతి, గరళమును మింగుమని పతి దేవునికి అనుమతినిచ్చెను. మరి ఆ సర్వలోక జనని తన మాంగల్య బలమును ఎంతగా నమ్మినదో కదా!. అప్పుడు శివుడు,

హాలాహాల భక్షణము

తన చుట్టున్ సురసంఘముల్ జయజయధ్వానంబులన్ బొబ్బిడన్
ఘన గంభీరరవంబుతో శివుడు లోకద్రోహి! హుం! పోకు ర
మ్మని కెంగేల దెమల్చి కూర్చి కడిగా నంకించి జంబూఫలం
బన సర్వంకషమున్ మహావిషము నాహారించె హేలాగతిన్

ఉదరము లోకంబులకును
సదనంబగుటెరిగి శివుడు చటుల విషాగ్నిన్
గుదురుకొన గంఠ బిలమున
బదిలంబుగ నిలిపె సూక్ష్మఫలరసము క్రియన్

హరుడు గళమునందు హాలాహలము వెట్ట
గప్పుగలిగి తొడవుకరణినొప్పె
సాధురక్షణంబు సజ్జనునకు నెన్న
భూషణంబు గాదె భూవరేంద్ర!


తన చుట్టూ దేవతా సమూహములు జయ జయ ధ్వనులతో కేకలు వేస్తుండగా, గంభీర స్వరముతో ఆ విషమేఘమును ఆజ్ఞాపించుచు, 'ఓ లోకద్రోహీ! ఎక్కడికీ పోకుండా నా దగ్గరకు రమ్ము' అని చెప్పి చెయ్యి చాచి ఆ మహావిషాన్ని అంతటా ఒకచోట చేర్చి ఒక్క ముద్దగా నేరేడు పండు లాగ విలాసముగా ఆరగించాడు. తన పొట్ట లోకములన్నిటికి నిలయమని తెలిసియున్న మహేశ్వరుడు చెదిరి ఉన్న విషాగ్నిని ఒకచోట కుదురుకునేలా కంఠంలో పదిలముగా, చిన్న ఫలరసమా అన్నట్లు నిలుపుకొన్నాడు. ఆ కంఠంలో విషము నలుపు పట్టిన ఆభరణంలా అలరారింది. సాధురక్షణ కూడా సజ్జనునకు ఒక ఆభరణమే కదా!.  అప్పుడు,

గరళంబు గంఠబిలమున
హరుడు ధరించుటకు మెచ్చి యౌనౌ ననుచున్
హరియు విరించియు నుమయున్
సురనాథుడు బొగడిరంత సుస్థిరమతితోన్


శివుడు గొంతుకలో గరళము ఉంచుకోవటం చూసి భళిభళి అంటూ శ్రీహరి, బ్రహ్మ, పార్వతి, ఇంద్రుడు మనస్ఫూర్తిగా మెచ్చుకున్నారు.

అలా ఆ పరమశివుడు నీలకంఠుడై ప్రపంచాన్ని ఆ విషాగ్ని నుంచి కాపాడాడు. ఈ క్షీర సాగర మథనం, హాలాహాల భక్షణం, జగన్మోహిని అవతారం (వివరాలు ఇంకొక వ్యాసంలో) అన్నీ మన ఆంధ్ర ప్రదేశ్ తీర ప్రాంతంలో గోదావరి జిల్లాల్లో జరిగింది అని ప్రజల నమ్మకం. పురాణాలు కూడా వీటిని సమర్థిస్తున్నాయి. ఇవి అంతర్వేది, ర్యాలి ప్రాంతంలో జరిగి ఉండవచ్చు. చారిత్రిక ఆధారాలుగా ఇక్కడ పుణ్యక్షేత్రాలు వెలశాయి.  అంతర్వేది వివరాలు.

ఓం నమః శివాయః


మహా మృత్యుంజయ మంత్రం:
 ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం
ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్

అత్యాశ, అవకాశవాదం

2009 శాసనసభ ఎన్నికల్లో అనూహ్యంగా ఓడిపోయినా పీ.సి.సి అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ గారు తన గుణపాఠం నేర్చుకోలేదు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ తనవంతు తను తెలంగాణా ఏర్పాటుకు ఇసుమంత కృషి కూడా చెయ్యలేదు. ఏడాది నుంచి ఈ విషయంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం సంక్షోభంలో ఉంటే ఆయన తన పదవిని, ఢిల్లీలో తన పలుకుబడిని ఉపయోగించి తెలంగాణపై స్పష్టతకు ఏమీ చెయ్యలేదు. కానీ, ఎప్పుడైతే చిదంబరంగారు రాత్రికి రాత్రి ప్రకటన చేశారో, అప్పటినుంచి తనకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశముందని గ్రహించి, దానికి అధిష్ఠానం ఆశీర్వాదం ఉందని తెలిసి, తన పావులు తను కదిల్పారు. అంటే?. తనకు తన నియోజకవర్గంలోనే గతి లేదు కాని రాష్ట్రాన్ని పాలించాలన్న అత్యాశా?. ఎంత అన్యాయమండీ శ్రీనివాస్ గారు?. పోయిన సారి మీరు మైనార్టీల మీద చేసిన వ్యాఖ్యలు మిమ్మల్ని ఓడిస్తే, ఈ 2010 ఉపఎన్నికల్లో పచ్చి తెలంగాణా వాదం మిమ్మల్ని, మీ ఆశలని ముంచింది. మైనార్టీ వోటర్లు చాలా మంది ఉన్న ఆ వోటు బ్యాంకు మిమ్మల్ని గెలిపించ లేకపోయింది.

అయ్యా. ఎప్పుడూ మీ గురించే కాదు. కొంచెం ప్రజల గురించి, వాళ్లు ఏమి అనుకుంటున్నారో తెలుసుకోండి. ఢిల్లీ చుట్టూ తిరిగి, అమ్మగారికి ముడుపులు, మొక్కులు చెల్లించుకుంటే చాలదు. కాస్త ప్రజల నాడి కూడా గమనించండి. మీరు తెలంగాణలో మంచి ధనికమైన జిల్లాలో ఉన్నారు. దాన్ని మీ ప్రాంతపు ప్రజల అభివృద్ధికి ఉపయోగించండి. ఇచ్చేది మేమే, తెచ్చేది మేమే, మేడం తెలంగాణాకు ఒకే చెప్పారు అని ప్రచారంలో మాట్లాడారు కదా మరి దాన్ని కార్యరూపంలో చూపించండి. ఇప్పటినుంచి ఒక సంవత్సరంలోపు తెలంగాణా రాష్ట్రాన్ని తేవటానికి ముఖ్యమంత్రి, శాసనసభ్యుల ద్వారా చెయ్యాల్సిన పని చేయించి, అలాగే పీ.సి.సి. అధ్యక్షుడిగా ఢిల్లీ వెళ్లి ఒత్తిడి పెట్టి, పార్లమెంటులో తెలంగాణా బిల్లు ప్రవేశపెట్టించండి. ఇంక చాలు మన నాటకాలు, దోబూచులాటలు, కాలాయాపానలు.

ప్రజలు మూడు సార్ల నుంచి, ముప్ఫై ఏళ్ళ నుంచి తెలంగాణా విషయంలో స్పష్టమైన తీర్పు ఇచ్చారు. వాటిని గౌరవించి, ఢిల్లీకి, వ్యాపారులకు అమ్ముడుపోకుండా తెలంగాణా ఏర్పాటుకు సహకరించండి. ప్రజలు మంచి ఉద్దేశాలను, పనులను ఎప్పటికైనా గౌరవిస్తారు. అలా చేస్తే, మిమ్మలిని, మీ పార్టీని ఆదరిస్తారు కూడా.

జై తెలంగాణ


తెలంగాణా ప్రజలు తీర్పు ఇచ్చారు. కాంగ్రెస్, టీడీపీల అవకాశవాద రాజకీయాలు, గత ఏడాదిగా నడుస్తున్న మోసాలకు తెరపడే సమయం వచ్చింది. మీకు తెలంగాణా కావాలా?. మీరు తెలంగాణా ఇస్తారా? అన్న ప్రశ్నలకు ధైర్యంగా, నిజాయితీగా సమాధానం చెప్పలేక కుప్పిగంతులు, పిల్లిమొగ్గలు వేసిన ఈ రెండు పార్టీలు తెలంగాణా వాదం ముందు తల వంచక తప్పలేదు. రాజీనామాలు చేసిన 12 మంది తెలంగాణా ప్రాంతపు టీ.ఆర్.ఎస్, బీ.జే.పీ ఎమ్మెల్యేలు తిరిగి భారీ మెజారిటీతో గెలుస్తున్నారు. 95 వేల వోట్ల మెజారిటీతో హరీష్ రావు గారు సిద్ధిపేట నుంచి గెలిచారు. ఇది వై.ఎస్.ఆర్ పులివెందుల నుంచి గెలిచిన రికార్డును బద్దలు కొట్టి శాసన సభ చరిత్రలో కనీ వినీ ఎరుగని ఆధిక్యత. ఎవరు ఇచ్చారు దీన్ని?. విసిగి, వేసారి, కోపంతో ఉన్న తెలంగాణ ప్రజలు. 
  1. తెచ్చేది, ఇచ్చేది మేమే అన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా నిజంగా తెలంగాణా తెస్తారా?.  రోజుకో మాట, నోటికో మాట మాట్లేడే మీ పార్టీ నాయకులు ఇప్పటికైనా ప్రజల నాడి గ్రహించి ముందుకు అడుగు నిజాయితీగా వేస్తారా?.
  2. తెలంగాణా, ఆంధ్ర రెండు కళ్ళు అన్న బాబు తెలుగు దేశం పార్టీకి చాలా చోట్ల డిపాజిట్ దక్కే అవకాశం కూడా లేదుట. మరి ఏమంటారు బాబు గారు?. మీ రెండు కళ్ళ భావనని మేము కాదనము కానీ, ఈ ఎన్నికలు తెలంగాణా గురించి. దాని గురించి 10 నెలలుగా మీరు మౌనం పాటించారు. ఇకనైనా నోరు తెరిచి, నిజాన్ని తెలుసుకొని మాట్లాడతారా?. మీ పార్టీకి ధరావతు కూడా దక్కట్లేదు అంటే ఏంటి తెలంగాణా లో టీ.డీ.పీ పరిస్థితి?.
  3. ఇప్పటికైనా తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు షెడ్యూలు ప్రకటించి దాన్ని అమలు పరుస్తారా సోనియా, మన్మోహన్?.
ఇక మాకు చాలు ఈ నాటకాలు, ఈ మోసాలు, ఈ అవకాశవాద రాజకీయాలు అని చెప్పుతో కొట్టి చెప్పలేక, వోటు అనే బ్రహ్మాస్త్రం ప్రయోగించారు తెలంగాణా ప్రజలు. వారి మనోభావాల్ని గౌరవించండి. వారి ఆకాంక్షల్ని నెరవేర్చండి.  ఇకనైనా, తమ మనస్సాక్షిని అనుసరించి, ప్రజల తీర్పును గౌరవించి కాంగ్రెస్, టీ.డీ.పీ పార్టీలు తెలంగాణా ఏర్పాటుకు తాము చేయ్యాల్సింది చేస్తే ప్రజలు వారిని మన్నిస్తారు. లేకుంటే వారికి రాజకీయ అధోగతే. మీరు ముందు చూపుతో వ్యవహరించకపోతే, ఈ రాష్ట్రంలో ముందున్నది ప్రత్యక్ష,ప్రచ్ఛన్న పోరాటమే. అందులో గెలుపు తెలంగాణా ప్రాంతపు ప్రజలదే.

జై తెలంగాణా తల్లి
జై తెలంగాణా

29, జులై 2010, గురువారం

ముద్ద బంతి పూలు పెట్టి

ముద్ద బంతి, మొగలి రేకులు, చిట్టెమ్మ, కిట్టయ్య, అరణాలు, కట్నాలు, అభిమానము, అవిటితనంలోని విచారము, పేదరికంలోని స్వాభిమానం - ఇవన్నీ కలిపి ఒక గ్రామీణ నేపథ్యంలో ఇద్దరు మహా నటీ నటులను పెట్టి చిత్రం తీసి, అందులో ఒక అందమైన, సందేశమున్న పాట చిత్రీకరిస్తే?. అదే 'కలసి ఉంటే కలదు సుఖం' చిత్రం లోని 'ముద్ద బంతి పూలు పెట్టి' అనే పాట. చలనచిత్రంలో సందేశముంటే అది కలకాలం నిలుస్తుంది అన్నదానికి మరో చక్కని ఉదాహరణ కలసిఉంటే కలదు సుఖం చిత్రం.






 కలసి ఉంటే కలదు సుఖం (1961)






కొసరాజు రాఘవయ్య చౌదరి గారు తమ కవితా పాటవాన్ని సులభమైన వాడుక తెలుగు పదాలలో ఈ పాటలో చూపించారు. మాస్టర్ వేణు సంగీతం ఈ రచనకు కలికితురాయి. ఒక అవిటి వాడు, అతని అంతః సౌందర్యం చూసి అతనంటే ముచ్చట పడిన ఒక అందమైన పిల్ల - వారిద్దరి మీద కథలో బాగా నప్పే విధంగా ఈ పాట చిత్రీకరించబడింది. వర్ష, శరదృతువులలో పూసే ముద్ద బంతిలో ఉండే స్వచ్ఛత, నిండుతనం, అందము ఇంకే పుష్పంలో ఉండదు. అచ్చం అలానే ఉంటుంది మహానటి సావిత్రి ఈ చిత్ర సన్నివేశాల్లో. ముద్ద బంతి స్త్రీ రూపములో మూర్తీభవించిందేమో అనిపించేంత అందము, నిర్మలత్వము, స్వాభిమానమున్న పాత్రలో మహానటి జీవించారు. వర్ష ఋతువులో వచ్చే మొగలి పూవు గుబాళింపు గుప్పుమని, మత్తు ఎక్కించి మైమరపిస్తుంది. యుక్త వయసులో ఉన్న స్త్రీకి, మొగలి రేకుల అందానికి, సువాసనకు అవినాభావ సంబంధం ఉంది. అందుకనే కొసరాజు వారు ఈ పాటలో మొగలిరేకును వాడి పాటకు, పాత్రకు అందాన్ని తెచ్చారు. ఇది నాయికానాయకుల వయసులోని ముచ్చట గురించి రాసిన భాగం.


ఇక సందేశానికి వస్తే:

అద్దమంటి మనసు, అందమైన వయసు కన్నా ఉండేది ఏంది అన్న వాక్యంలో ఎంత గూఢార్థముందో గమనించండి. మనసు స్వచ్ఛంగా ఉంటే - శరీర సౌందర్యము, ఆత్మ విశ్వాసము అదే ఉంటుంది అని చాల సున్నితంగా చెప్పారు రచయిత. అభిమానము, ఆప్యాయత ముందు కట్నాలు, కానుకలు ఎందుకు పనికి రావని ఈ గీతం మనకు మంచి సందేశాన్ని ఇస్తుంది. 'అభిమానమాభరణం మరియాదే భూషణం' అని భర్తృహరి నీతిని గేయం రూపంలో సులభమైన తెలుగులో చెప్పారు కవి. మంచి గుణమున్న పేదవాడి మనసుకన్న విలువైనది ఏమి లేదని మనసుకు హత్తుకునేలా చెప్పారు గేయకర్త. కాలు, చెయ్యి లేని అవిటివాడిని అయినవారు ఎలా ఎగతాళి చేస్తారో, తనకు పెళ్లి అవుతుందో కాదో అని దిగులు పడుతున్న నాయకుణ్ణి, నాయిక 'ఎవరేమి అన్ననేమి, ఎగతాళి చేయనేమి, , నవ్విన నాప చేనే పండదా' అని అతనిలో ఆత్మ విశ్వాసాన్ని నింపుతుంది. స్త్రీ లో ఉండే ధైర్యం, స్థైర్యం ఈ పాటలో అణువణువునా చూపించారు కొసరాజు వారు. అవే లక్షణాలను అద్భుతంగా నటనలో చూపించారు సావిత్రి. అవిటి వాడి రూపంలో నిర్మలమైన మనసుతో, అమాయకమైన పాత్రలో  ఎన్టీ రామారావు గారు ప్రేక్షకులను మురిపించి కంట తడి పెట్టించారు. 

అంతఃసౌందర్యానికి ఈ పాటలోని చరణాలలో ఎంత అందంగా కవి ప్రాధాన్యమిచ్చారో వారి వ్యక్తిత్వానికి నిలువుటద్దంగా నిలుస్తుంది. స్త్రీపురుషుల మధ్య గల భేదము, వారు ఒకరికొకరు ఏవిధంగా పరిపూర్ణతను కలిగిస్తారో కూడా ఈ గీతంలో మనకు అర్థమవుతుంది. ఆత్మస్థైర్యమున్న పల్లెటూరి పిల్ల-వికలాంగుడైన అమాయకపు పల్లెటూరి అబ్బాయి కలిస్తే, ఆమె ఆత్మసౌందర్యం, విశ్వాసం, పరిపక్వత అతని అవిటితనానికి, అమాయకత్వానికి ఆసరగా నిలిస్తే? అదే ఈ చిత్రం, ఈ గీతం. ఇటువంటి కళాకారులు, రచయితలు, దర్శకులు న భూతో న భవిష్యతి. ఈ భావాన్ని అద్భుతంగా పండించినందుకు కొసరాజు గారికి, ఎన్‌టీఆర్ గారికి, సావిత్రి గారికి శిరసు వంచి నమస్కారములు చేయాలి.

మంచి సామాజిక విలువలతో, ఒక అవిటివాడిని ప్రోత్సహించి, ప్రేమించి అతన్ని ఆత్మవిశ్వాసంతో నింపే ఒక శక్తివంతమైన పేద మహిళగా కథానాయిక, తన మంచి మనస్సుతో కుటుంబాలను కలిపి పేరు తెచ్చుకునే కథానాయకుడు, సున్నితమైన శృంగారము, మంచి సంభాషణలు, సంగీతము, ఆహ్లాదమైన చిత్రీకరణ - ఇదీ 1961 లో విడుదలైన 'కలసి ఉంటే కలదు సుఖం' చిత్రం.

మంచె, చేలు, తాటి చేతులు, గొర్రెలు, మేకలు, కాపరి, బుట్ట తలపై ఉన్న స్త్రీ, అమాయకంగా చిందు వేసే మనిషి, పల్లెటూరి తందానే తానేననే ఆలాపనలు ఈ 'ముద్దబంతి పూలు పెట్టి' పాటకు రంగం.

ఈ పాట మీకోసం. యూట్యూబ్లో పాట చూసి ఆనందించండి.

ముద్ద బంతి పూలు పెట్టి మొగిలి రేకులు జడను చుట్టి హంసలా నడిచి వచ్చే చిట్టెమ్మ మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా
అద్దమంటి మనసు ఉంది అందమైన వయసు ఉంది ఇంతకన్నా ఉండేది ఏంది కిట్టయ్యా  ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా

1. పుట్టింటి అరణాలూ ఘనమైన కట్నాలూ అత్తవారింటి నిండా వేచినా అవి అభిమానమంతా విలువ జేతునా |ముద్ద|
అభిమానమాభరణం మరియాదే భూషణం గుణము మంచిదైతే చాలయా మన గొప్పతనము చెప్పుకోను వీలయ్యా |అద్దమంటి|

2. కాలు చెయ్యి లోపమనీ కొక్కరాయి రూపమనీ వదినలు నన్ను గేలి చేతురా పిల్లను దెచ్చి పెళ్లి జేతురా
ఎవరేమి అన్ననేమి ఎగతాళి చేయ్యనేమి నవ్విన నాప చేనే పండదా నలుగురు మెచ్చు రోజు ఉండదా |అద్దమంటి| |ముద్ద|

27, జులై 2010, మంగళవారం

శిథిలావస్థలో భారతీయ జనతా పార్టీ

Kamalam
Hastam




కమలం వికసించింది - ఈ నానుడి చాలా ఏళ్ళు సాగినట్టే. 1984 సార్వత్రిక ఎన్నికల్లో ఇందిరా గాంధి హత్య సానుభూతి పవనాలు కాంగ్రెస్ ను గెలిపించినప్పుడు  542 లో,  2 సీట్లు మాత్రమే గెలుచుకున్న కమల దళం, తర్వాత రామ మందిర ఉద్యమంతో బాగా లాభ పడి 1989 లో 85, 1991లో 120,  1996 లో 161, 1998 లో  182, 1999లో 182 సీట్లు, 2004 లో 138 సీట్లు గెలుచుకుంది. ఈ దాదాపు దశాబ్దమున్నర కాలము (1989 -2004) భారతీయ జనతా పార్టీకి స్వర్ణ యుగమే.

రాజకీయ అతిరథులు వాజపేయి, అద్వానీల సారథ్యంలో హిందూ, కాంగ్రెస్ వ్యతిరేక నినాదాలతో బాగా లబ్ది పొంది, సంస్థాగతంగా బలపడి, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గెలిచి ప్రధాన ప్రతిపక్షంగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. దీనికి ప్రధాన కారణం అంతకు ముందు ఇందిరా, రాజీవ్ హయాంలో అవినీతి భాగోతాలు, వారి ఏక పక్ష పరిపాలన, ఆర్ధిక మాంద్యము మరియు ఆర్థిక విధానాల వల్ల దేశం సాంఘికంగా, ఆర్థికంగా బాగా దెబ్బ తిన్నది. ప్రజలు వారి పరిపాలనతో విసిగిపోయారు. ఆ సమయంలో వచ్చిన రామ మందిర నినాదం, వి.ఫై. సింగ్ నేత్రుత్వంలోని అవినీతి, కుంభకోణాలపై పోరాటం ప్రతిపక్షాలను ఏకం చేశాయి. ఇందులో భా.జ.పా చాలా లబ్ది పొందింది. ప్రధాన పతిపక్షంగా ఆ పార్టీ స్థానానికి వచ్చిన ఢోకా ఏమీ లేదు కాని, సంస్థాగతంగా, నినాదాల పరంగా పార్టీ ఒక కనిష్ఠ స్థాయిలో ఉంది అనిపిస్తోంది. కారణాలు ఎంతో చూద్దాము.
  1. జనాకర్షణ నేతలు లేరు - కురు వృద్ధులైన అద్వానీ, వాజపేయి రాజకీయ సన్యాసం చాలా ప్రణాలికా విహీనంగా సాగింది. ఒక ఉద్యమ స్ఫూర్తితో, నినాదంతో, ప్రభుత్వాన్ని ఎండగట్టి ఎన్నికలను గెలిపించే నాయకులు పార్టీలో లేరు. ఉన్న ఒకే ఒక్కడు నరేంద్ర మోడి కరడు గట్టిన హిందుత్వవాది గా ముద్ర పడి పోయాడు. అందుకని ఆయనను పార్టీలో అందరూ ఆమోదించ లేకపొతున్నారు.  మహారాష్ట్రలో ఒక్క రాజకీయ విజయాన్ని కూడా సాధించని గడ్కరీని తీసుకువచ్చి ఏకంగా పార్టీ జాతీయ అధ్యక్షుడిని చేశారు. ఇటీవలి ఆయన వ్యాఖ్యలు, వాటిని వెనక్కి తీసుకోవటం చూస్తుంటే ఆయనకు ఎంత పరిణతి ఉన్నది అనేది అనుమానమే.
  2. పార్టీ అధ్యక్షుడిగా రాజ్ నాథ్ సింగ్ చేసినంత నష్టం ఇంకెవ్వరూ ఆ పార్టీకి కలిగించలేదు. ముందు చూపు లేక, అంతర్గత కుమ్ములాటతో, పాతకాలపు ఆలోచనా పధ్ధతి, విధానాలతో పార్టీని నిర్వీర్యం చేశాడు ఆయన. వయసు మీద పడటంతో చూస్తూ ఊరుకున్నారు వాజపేయి, అద్వానీ. ఈయన గారి పుణ్యమా అని కొందరు పార్టీ వదలాల్సి వచ్చింది. ముఠాలు ఏర్పడి పార్టీ బజారున పడింది.
  3. కులాల, మతాల  మీద వచ్చిన రాజకీయ సమీకరణలు వారికి చాలా చోట్ల కలిసి రాలేదు. లోక్సభలో నాలుగోవంతు సీట్లున్న ఉత్తర ప్రదేశ్, బీహార్ లో పూర్తిగా అగ్ర వర్ణాలకి వ్యతిరేకంగా వచ్చిన సునామీలో వారు, కాంగ్రెస్ కొట్టుకు పొయ్యారు. బీసీలు, ఎస్సీ, ఎస్టీలు అగ్ర వర్ణాల వారికి ఎదురు తిరిగి తమకు రాజకీయంగా గుర్తింపు ఇచ్చే ఎస్పీ, బీ.ఎస్.పీ, ఆర్.జే.డీ లాంటి పార్టీలకు పట్టం కట్టారు. 
  4. కర్నాటక మినహా, తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో, దక్షిణాదిన ప్రాంతీయ పార్టీల ధాటికి తట్టుకోలేకపోయారు. వారి స్వార్థ పూరిత, అవకాశవాద రాజకీయాలకు నిలవలేకపోయారు - తృణమూల్, టీ.డీ.పీ, ఏ.ఐ.ఏ.డీ.ఎం.కే లాంటి పార్టీలు బీ.జే.పీ తో ఫుట్బాల్ ఆడుకున్నాయి.  పూర్తిగా హిందుత్వం వైపు కాకుండా, పూర్తిగా మతాతీత రాజకీయానికి దూరం కాలేక, చిన్న చిన్న పార్టీల మధ్య నలిగి పోయి తమల్ని తాము దెబ్బ తీసుకున్నారు భా.జ.పా నాయకులు. మేదావులైన నవీన్ పట్నాయక్, చంద్ర బాబు నాయుడు, మమత బెనర్జీ, జయలలితల రాజకీయ పిల్లిగంతులకు, చతురతకు భా.జ.పా తట్టుకోలేకపోయింది. అలాగే, హిందుత్వ నినాదం గట్టిగా ఉన్న మహారాష్ట్రలో శివసేనకు కట్టు బడి, స్థానిక నాయకత్వం లేక వెనకబడి పోయింది.
  5. రాజీవ్ మరణం తర్వాత సంస్థాగతంగా దెబ్బతిన్న కాంగ్రెస్ మళ్లీ  పీ.వీ. నరసింహారావు, మన్మోహన్ సింగ్ ల ఆర్ధిక విధానాల ఫలాలతో, సోనియా, రాహుల్ రాజకీయ పాఠాలు నేర్చుకుని పరిపక్వత చెంది పార్టీ పుంజుకోవటానికి దోహదం చేశారు. ఒంటెద్దు పోకడల రోజుకోసారి ముఖ్యమంత్రులను మార్చే విధానాలకు దూరంగా, కొంత అధికారానికి దూరంగా ఉంటూ వీరిద్దరూ పార్టీని, తమ స్థానాలను పూర్తిగా బలోపేతం చేశారు. రైతులకు వ్యతిరేకి అని టీ.డీ.పీ ని ఓడించిన వై.ఎస్.ఆర్ అండతో ఆంధ్రలో గెలిచి, రాజకీయ చాణక్యుడైన శరద్ పవార్ తో జత కట్టి మహారాష్ట్రలో, మహా కుల, మత ఓట్ల మేధావి అయిన కరుణానిధితో జత కట్టి తమిళనాట మంచి విజయాలు సాధించారు సోనియా, రాహుల్ గారు.ఈ ఇద్దరికీ సాటిగా, దీటుగా ప్రతిపక్షంలో ఎవ్వరు లేరు.
ఇలా, రాజకీయంగా, కాంగ్రెస్ పార్టీకి ఉన్న అర్థ, అంగ, ఆలోచనా బలాల ధాటికి తట్టుకోలేక, తమ అంతర్గత లోపాలను దిద్దుకోలేక, సతమతమవుతున్న పార్టీ బీ.జే.పీ. ప్రస్తుతం కర్ణాటకలో ఉన్న పరిస్థితి చూస్తే అక్కడ వచ్చే శాసనసభ ఎన్నికల్లో మళ్లీ గెలవటం గగనమే. యూపిలో నాలుగో స్థానానికి దిగారు. బీహార్లో నితీష్ దయ మీద బతుకుతున్నారు. తమిళనాడు, ఆంధ్ర, పశ్చిమ బెంగాల్ లో ప్రభావం నామమాత్రమే. ఇప్పటికే పదేళ్ళు పాలించిన మధ్య ప్రదేశ్ లో మళ్లీ గెలవటం తేలిక కాదు. ఒక్క గుజరాత్లోనే వారి పట్టు ఇంకా ఉంది.  అది ఎన్నాళ్ళో మరి. మిగిలిన అన్ని చోట్ల సడలుతోంది/సడలిపోయింది.  మొత్తానికి, సంస్థాగతంగా అద్భుతాలు జరిగితే తప్ప ఒక దశాబ్దం పాటు భా.జ.పాకు చాలా గడ్డు కాలమే.

గంగావతరణం - గంగమ్మ మహాత్యం మొదటి భాగం


అంగ భంగిమలు గంగ పొంగులై అన్నారు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. ఈ గంగ పొంగులు ఎలా ఉంటాయో తెలియాలంటే మీరు ఉత్తరాఖండ్ వెళ్లి తీరాలి. ఉత్తరకాశి జిల్లాలో 10వేల అడుగుల ఎత్తున హిమాలయాలలో గోముఖమునుండి వెలువడిన భాగీరథి 13 కిలో మీటర్ల దిగువన ఉన్న గంగోత్రి వద్ద ఉరకలెత్తుతూ ప్రవహిస్తుంది. ఆ భాగీరథి సామన్యమైన నదా? ఇక్ష్వాకు వంశజుడైన భగీరథుని ప్రయత్నంతో విష్ణు పాదం నుండి శివుని జటాఝూటములో చేరి అక్కడినుండి గంగోత్రి దగ్గర ఈ భువిన అడుగిడింది. మన పాపాలను కడిగే పుణ్యనది ఈ పావన భాగీరథి. గంగోత్రి నుండి ప్రయాణం చేస్తూ దేవప్రయాగ వద్ద అలకనందతో కలసి అక్కడినుండి గంగగా పిలువబడుతుంది. గంగోత్రి వద్ద, దేవ ప్రయాగ వద్ద ఈ గంగమ్మ పరవళ్లు చూస్తే వాల్మీకి మహర్షి రామాయణంలో వివరించినది ఎంత అక్షర సత్యమో అర్థామవుతుంది.అలాగే సీతారామశాస్త్రిగారి భావజాలం ఎంత మనోజ్ఞమో అర్థమవుతుంది. శ్రీమద్రామాయణంలోని గంగావతరణం మీకోసం. సగర పుత్రులకు స్వర్గ ప్రాప్తికై భగీరుథుడు గంగను భువికి రప్పించాడు. ఇది మనకు తెలిసిందే. కాని,  అసలు ఏమి జరిగింది అన్న విషయం కొంత తెలుసుకుందాము.

శ్రీమద్వాల్మీకి రామాయణంలో బాలకాండ 38 - 44 సర్గలలో ఈ గంగావతరణాన్ని విశ్వామిత్ర-రామలక్ష్మణ సంవాదంలో  వివరించారు.  కాళిదాసు రఘువంశం కావ్యంలో రమణీయంగా, విపులంగా ఈ విషయాన్ని రచించారు. నేను ఇంటర్ మీడియట్ రెండో సంవత్సరంలో (రెండవ భాష సంస్కృతం) రఘువంశంలోని ఈ అంశాన్ని చదువుకున్నాను. ఇటీవల రామాయణ పారాయణంలో మళ్లీ పఠించాను.

ఇక్ష్వాకు వంశంలో జన్మించిన సగరునికి ఇద్దరు భార్యలు - కేశిని, సుమతి. వీరికి సంతతి కలుగక, హిమాలయాలకు వెళ్లి భృగుప్రవర్శన మనే చోట తపస్సు చేశారు. వీరి తపస్సుకు మెచ్చి భృగు మహర్షి సగరుడి భార్యలలో ఒకరికి వంశాభివృద్ధి కలిగించే ఒక పుత్రుడు, ఇంకొకరికి అరవై వేల మంది పుత్రులు కలుగుతారు అని ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వాద ఫలంతో కేశినికి అసమంజుడు, సుమతికి అరవైవేలమంది సగర పుత్రులు జన్మిస్తారు. వీరిలో అసమంజుడు దుష్ట చేష్టలు చేస్తూ ఉంటే సగరుడు అతడిని రాజ్య బహిష్కారం చేస్తాడు.  అసమంజుని కుమారుడు అంశుమానుడు యోగ్యుడు.

ఈ సమయంలో సగరుడు యాగం తలపెడతాడు. యాగాశ్వాన్ని ఇంద్రుడు అపహరించి కపిల మహర్షి ఆశ్రమంలో దాచుతాడు. దీని వలన యాగం అసంపూర్ణంగా ఉంటుంది. అది తనకు అరిష్టమని గ్రహించిన సగరుడు తన అరవైవేలమంది పుత్రులను అశ్వాన్ని వెదకమని పంపిస్తాడు. భూనభోంతరాళములలో ఎక్కడ ఉన్నా వెదికి తీసుకురమ్మని ఆదేశిస్తాడు. సగర పుత్రులు భూమి అంతటా వెదికి, భూమిలో తవ్వి, సర్పలోకాన్ని వెదికి ఎక్కడ అశ్వం కనిపించక రసాతాలానికి వెళ్తారు. అన్ని దిక్కులు వెదికినా అశ్వం కనిపించదు. ఈశాన్య దిక్కులో శివస్థానంలో భూమిని తవ్వి వెదుకుతారు. అక్కడ కపిల మహర్షి ఆశ్రమంలో వారికి అశ్వం కనిపిస్తుంది. 'ఓరీ దుష్టుడా! నీవే మా తండ్రి గారి యాగాశ్వాన్నిఅపహరించావు' అని ఆ మహర్షిని దూషిస్తారు. అప్పుడు ఆ మహర్షి ఆగ్రహంతో వారిని ఒక్క చూపుతో భస్మీపటలం చేస్తాడు. ఆ మహర్షి క్రోధాగ్నికి భస్మపు కుప్పగా మారుతారు సగర పుత్రులు.

ఎన్నాళ్ళైనా పుత్రులు తిరిగి రాకపోయేసరికి సగరుడు మనుమడైన అంశుమానుడిని యాగాశ్వాన్ని, పిన తండ్రులను వెదకమని పంపిస్తాడు. కపిల మహర్షి ఆశ్రమము వద్దకు వచ్చి వారు దగ్ధమై ఉండటం చూసి దుఃఖితుడవుతాడు. వారికి ఉత్తరక్రియలు జరుపుదామని నిశ్చయిస్తాడు. కానీ, ఆ ప్రాంతంలో ఎక్కడ నీరు అనేది కనిపించదు. అప్పుడు సగర పుత్రుల మేనమామ (సుమతి సోదరుడు) అయిన గరుత్మంతుడు ప్రత్యక్షమై అంశుమానుడితో - 'నాయనా, ఇలా దగ్ధమైన నీ పిన తండ్రులకు స్వర్గ ప్రాప్తి జరగాలంటే మామూలు జలం చాలదు. దేవలోకంలో ఉన్న గంగానది వచ్చి వీరి భస్మంపై ప్రవహిస్తే వీరికి స్వర్గ ప్రాప్తి కలుగుతుంది' - అని చెప్తాడు. అంశుమానుడు యాగాశ్వాన్ని తీసుకొని సగరుడి దగ్గరకు తిరిగి వచ్చి జరిగింది వివరిస్తాడు. సగరుడు యాగాన్ని పరిసమాప్తి చేస్తాడు.

సగరుడు గంగను భువికి ఎలా తీసుకురావాలి అన్న దానిమీద నిర్ణయం తీసుకోలేకపోతాడు. తరువాత ముప్ఫై వేల సంవత్సరాలు పాలించి తనువు చాలిస్తాడు. అంశుమానుడు రాజ్యం పాలిస్తాడు. అతనికి దిలీపుడు అని ఒక సుపుత్రుడు జన్మిస్తాడు. అంశుమానుడు కొడుకుకి రాజ్యభారం అప్పగించి తపస్సులకై హిమాలయాలకు వెళతాడు. అంశుమానుడు ముప్ఫై రెండువేల ఏళ్ళు తపస్సు చేసిన తర్వాత స్వర్గ ప్రాప్తి పొందుతాడు కాని గంగను భూమి మీదకు తీసుకు రాలేకపోతాడు.

దిలీపుడు ధర్మబద్ధంగా పాలిస్తాడు. కానీ, ఆయన కూడా గంగను ఎలా తీసుకువచ్చి సగర పుత్రులకు స్వర్గ ప్రాప్తి కలిగించాలి అన్న సంకల్పం,నిశ్చయం చేసుకోలేకపోతాడు. దీని గురించి విచారపడతాడు దిలీపుడు. ఆ విచారంలోనే అతడు ప్రాణం విడుస్తాడు.  దిలీపుడికి సర్వ లక్షణ సంపన్నుడైన కుమారుడు కలుగుతాడు. అతడే భగీరథుడు.

భగీరథుడు పుత్రసంతానం లేక విచారంలో ఉంటాడు. అప్పుడు ఆ మహారాజు రాజ్యభారాన్ని మంత్రులకు అప్పగించి, తన పిత్రుదేవతలైన సగర పుత్రుల స్వర్గ ప్రాప్తికి, తనకు పుత్ర సంతాన ప్రాప్తి కోసం ఘోర తపస్సు చేస్తాడు. కొన్ని వేల ఏళ్ళు తపమొనరించిన తర్వాత బ్రహ్మ దేవుడు ప్రత్యక్షమై అతని తపస్సుకి మెచ్చి గంగ ప్రవాహం ద్వారా సాగరపుత్రులకు స్వర్గ ప్రాప్తి, భగీరథుడుకి పుత్రప్రాప్తి వరాలను ఇస్తాడు. కానీ, గంగా ప్రవాహాన్ని తట్టుకొనే శక్తి భూమికి లేదని, ఆ పనికి ఒక్క శంకరుడే సమర్థుడని చెప్పి అంతర్ధానం అవుతాడు బ్రహ్మ.

గంగావతరణం కోసం భగీరథుడు ఏడాది శివుడి గురించి తపస్సు చేస్తాడు. శివుడు ప్రత్యక్షమై గంగను తన శిరస్సులో దాల్చటానికి ఒప్పుకుంటాడు. దేవతలా ఆశీర్వాదంతో గంగావతరణం మొదలవుతుంది.

గంగ పొగరుతో శివున్ని ముంచి పాతాళానికి వెళ్లాలని ఉవ్విళ్లూరుతుంది. శివుడి క్రోధంతో ఆమె మదాన్ని అణిచి తన జటా ఝూటాల్లో ఆమెను బంధిస్తాడు. గంగ ఆ బంధనంలోంచి బయట పడటానికి తీవ్ర ప్రయత్నం చేసి విఫలమవుతుంది. అలా బందీ అయిన గంగను భువి మీదికి వదలమని భగీరథుడు మళ్ళీ శివుని మెప్పించ తపస్సు చేస్తాడు. ఆ సదాశివుడు సంతుష్టుడై గంగను భూమి మీదకు విడుస్తాడు.



అలా శివుని జటా ఝూటాల్లోంచి గంగానది హిమాలయాలలోని బిందు సరస్సు ప్రాంతంలో  భూమిని ఏడు పాయలుగా తాకుతుంది - తూర్పు దిక్కుగా హ్లాదిని, పావని, నళిని నదులుగా,  పశ్చిమ దిక్కుగా సుచక్షు, సీత, సింధు నదులుగా పారుతుంది.

గంగా ప్రవాహమున సాగి వచ్చిన చేపలు, తాబేళ్లు, మొసళ్ళు మరియు ఇతర జంతువులతో భూమి మిక్కిలి శోబిల్లెను. దివినుండి భువికి దిగి వచ్చిన గంగను దేవతులు, ఋషులు, గంధర్వులు, సిద్ధులు కన్నుల పండువగా, సంభ్రమాశ్చర్యములతో  చూశారు. గంగా ప్రవాహము కొన్ని చోట్ల అతివేగంగా, కొన్ని చోట్ల వంకరగా, కొన్ని చోట్ల విశాలముగా, కొన్ని చోట్ల దూకుతూ, తుళ్ళి పడుతూ, ఇంకొక చోట ప్రశాంతముగా సాగింది.  దేవతలు, ఋషులు మున్నగు వారు "ఈ జలము శివుని శిరస్సునుంది పడింది, కనుక అతి పవిత్రమైనది" అని తలచుకుంటూ, ఆ నీటిని తమ శిరస్సుపై చల్లుకొని ఆచమనం చేశారు. శాపం వలన దివినుండి భువికి చేరినవారు ఈ గంగలో మునిగి పాపరాహితులై, తిరిగి తమ లోకాలకు వెళ్లారు. పవిత్ర గంగానదీ స్నానముచే జనాలు అలసటలు తొలగి సంతోషించారు.


ఏడవ పాయ భగీరథుడి రథాన్ని దక్షిణ దిక్కుగా అనుసరించి,  జహ్ను మహర్షి ఆశ్రమాన్ని, యజ్ఞ వాటికను ముంచెత్తుతుంది. ఆ మహర్షి ఆగ్రహం చెంది ఆ నదిని మింగేస్తాడు. దేవతలు, ఋషులు, యక్షులు, గంధర్వులు ఆ మహర్షి పాదాలపై పడి గంగను వదలమని ప్రార్థిస్తారు. అప్పుడు శాంతించిన జహ్ను మహర్షి తన చెవి ద్వారా గంగను వదులుతాడు. అలా జహ్ను మహర్షి కుమార్తెయై గంగ జాహ్నవి అనే నామంతో కూడా పిలవబడింది. దక్షిణ దిశగా ప్రవహించి సాగరంలో కలిసి, పాతాళానికి వెళ్లి సగర పుత్రులను పావనం చేస్తుంది గంగ.

అప్పుడు బ్రహ్మాది దేవతలు ప్రత్యక్షమై భగీరథుడిని ప్రశంసించి, సాగరపుత్రులకు స్వర్గాలోకాలను అనుగ్రహిస్తారు. పిత్రుదేవతలకోసం అంతటి కష్టతరమైన కార్యం సాధించిన భగీరథుడికి ఎన్నో వరాలు ఇస్తారు. గంగావతరణానికి కారకుడైన అతడిని భువిలో గంగకు తండ్రిగా శ్లాఘిస్తారు. అప్పటినుంచి గంగ భాగీరథిగా ప్రసిద్ధి చెందింది.

గంగ మూడు లోకాలు (దివి, భువి, పాతాళం), మూడు దిక్కులు (తూర్పు, పడమర, దక్షిణ) పారింది కనుక త్రిపథగ గా పేరొందింది. అలా అవతరించిన గంగా నది ఈ అవనిలో అత్యంత పావనమైన నదిగా విశ్వ విఖ్యాతి పొందింది.

గంగను ఎన్నో విధాలా ఎంతో మంది  నుతించారు . ఆదిశంకరులు గంగాష్టకంలో అద్భుతంగా ఈ తల్లిని నుతించారు.

భగవతి తవ తీరే నీరమత్రసనోహమ్
విగతవిషయతృష్ణ కృష్ణమారధాయమి
సకలకలుషభంగే స్వర్గసోపనసంగే
తరలతరతరంగే దేవి గంగే ప్రసీద

భగవతి భవలీలామాలే తవాంభః
కణమణుపరిమాణం ప్రాణినో యే స్పృశంతి
అమరనగరనారీచామరగ్రాహిణీనాం
విగతకలికలంకాతంకమంకే లుఠంతి

బ్రహ్మాండం ఖండయంతీ హరశిరసి జటావల్లిముల్లాసయంతీ
స్వర్లోకాదాపతంతీ కనకగిరిగుహాగండశైలాత్‍స్ఖలంతీ
క్షోణీపృష్ఠే లుఠంతీ దురితచయచమూనిర్భరం భర్త్సయంతీ
పాథోధిం పూరయంతీ సురనగరసరిత్పావనీ నః పునాతు

మజ్జన్మాతంగకుంభచ్యుతమదమదిరామోదమత్తాలిజాలం
స్నానైః సిద్ధాంగనానాం కుచయుగవిగలత్కుంకుమాసంగపింగమ్
సాయంప్రాతర్మునీనాం కుశకుసుమచయైశ్ఛిన్నతీరస్థనీరం
పాయన్నో గాంగమంభః కరికరమకరాక్రాంతరం హస్తరంగమ్

ఆదావాదిపితామహస్య నియమవ్యాపారపాత్రే జలం
పశ్చాత్పన్నగశాయినో భగవతః పాదోదకం పావనమ్
భూయః శంభుజటావిభూషణమణిర్జహ్నోర్మహర్షేరియం
కన్యా కల్మషనాశినీ భగవతీ భాగీరథీ దృశ్యతే

శైలేంద్రాదవతారిణీ నిజజలే మజ్జజ్జనోత్తారిణీ
పారావారవిహారిణీ భవభయశ్రేణీ సముత్సారిణీ
శేషాంగైరనుకారిణీ హరశిరోవల్లీదలాకారిణీ
కాశీప్రాంతవిహారిణీ విజయతే గంగా మనోహారిణీ

కుతో వీచీర్వీచిస్తవ యది గతా లోచనపథం
త్వమాపీతా పీతాంబరపురవాసం వితరసి
త్వదుత్సంగే గంగే పతతి యది కాయస్తనుభృతాం
తదా మాతః శాంతక్రతవపదలాభోఽప్యతిలఘుః

గంగే త్రైలోక్యసారే సకలసురవధూధౌతవిస్తీర్ణతోయే
పూర్ణబ్రహ్మస్వరూపే హరిచరణరజోహారిణి స్వర్గమార్గే
ప్రాయశ్చితం యది స్యాత్తవ జలకాణికా బ్రహ్మహత్యాదిపాపే
కస్త్వాం స్తోతుం సమర్థః త్రిజగదఘహరే దేవి గంగే ప్రసీద

మాతర్జాహ్నవీ శంభుసంగమిలితే మౌళౌ నిధాయాంజలిం
త్వత్తీరే వపుషోఽవసానసమయే నారాయణాంఘ్రిద్వయమ్
సానందం స్మరతో భవిష్యతి మమ ప్రాణప్రయాణోత్సవే
భూయాద్భక్తిరవిచ్యుతా హరిహరాద్వైతాత్మికా శాశ్వతీ

గంగాష్టకమిదం పుణ్యం యః పఠేత్ప్రయతో నరః
సర్వపాపవినిర్ముక్తో విష్ణులోకం స గచ్ఛతి

 ఆది శంకరులు గంగమ్మను మూడు లోకాల పాపాలను హరించే దేవతగా అభివర్ణించారు. అదే రీతిలో మరెందరో గంగమ్మను నుతించారు.  ఆ తల్లి మహాత్యం మిగిలిన వివరాలు తరువాయి భాగంలో


శ్రీ రామ జయ రామ జయ జయ రామ

వెడలెను కోదండపాణి - త్యాగరాజస్వామి కృతి

వెడలెను కోదండపాణి అనుజ సౌమిత్రితో గూడి పుడమిలో జనులెల్ల పొగడ పూజితుడౌ మునితో గూడి శిరమన కొండెయు జార  వురమున హారములు మెరయ కరమున శరచాపములును ఘ...