16, ఆగస్టు 2017, బుధవారం

క్షీరాబ్ది కన్యకకు - అన్నమాచార్యుల అమ్మ వారి నీరాజనం

అమ్మ వారి నీరాజనం ఒకటైన  అన్నమాచార్యుల వారు రచించిన క్షీరాబ్ది కన్యకకు ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు పాడగా ఎంతో ప్రాచుర్యం పొందింది. అన్నమాచార్యుల వారికి సంకీర్తనలలో అమ్మ అలమేల్మంగను ఎన్నో కృతులలో కొనియాడారు. ఈ నీరాజనం సంకీర్తన తెలుగిళ్లలో, ముఖ్యంగా వివాహాది శుభకార్యాలలో ఎక్కువగా వినబడుతుంది.


క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని 
నీరజాలయకును నీరాజనం 

జలజాక్షి మోమునకు జక్కవ కుచంబులకు 
నెలకొన్న కప్పురపు నీరాజనం 
అలివేణి తురుమునకు హస్త కమలంబులకు
నిలువు మాణిక్యముల నీరాజనం

పగటు శ్రీ వేంకటేశు పట్టపురాణియై 
నెగడు సతి కళలకును నీరాజనం 
జగతినలమేల్మంగ చక్కదనములకెల్ల 
నిగుడు నిజ శోభనపు నీరాజనం

- సద్గురువులు తాళ్లపాక అన్నమాచార్యుల వారు

క్షీర సాగర మథనంలో ఆవిర్భించింది కాబట్టి మహాలక్ష్మిని క్షీరాబ్ది కన్యక అంటారు. ఆ అందమైన పదసంపుటిని అన్నమాచార్యుల వారు తన సంకీర్తనా నీరాజనంలో పల్లవి ఆరంభంలోనే ఉపయోగించారు. ఆ తల్లి అలా ఆవిర్భవించిన వెంటనే శ్రీమహావిష్ణువును వరించింది. నీటీలో పుట్టినది కాబట్టి తామరపూవుకు నీరజ అని పేరు వచ్చింది. ఆ తామరపూవులో నివసించే తల్లిని నీరజాలయగా అన్నమాచార్యుల వారు అభివర్ణించారు. కలువలవంటి కన్నులు గల తల్లికి, చక్కనైన ఆకృతి కలిగియున్న తల్లికి కర్పూరపు నీరాజనమట, నల్లని కురులతో ఉన్న ఆమె కొప్పుకు, కమలముల వంటి హస్తములకు మాణిక్యాలతో నీరాజనంట. ప్రకాశించే లావణ్యము కల శ్రీవేంకటపతికి పట్టపురాణియై వర్ధిల్లే ఆ తల్లికి యున్న కళలకు నీరాజనమట. ప్రపంచమంతా వ్యాపించే ఆ అలమేలుమంగ చక్కదనాలకు పాటలతో నీరాజనమట. అన్నమాచార్యుల వారి కృతులలో ప్రత్యేకత వారి అనుభూతులు పదములై జాలువారటం. తిఉర్చానూరులో వెలసిన ఆ పద్మావతీ దేవిని చూస్తే ఈ సంకీర్తన ఎటువంటి అనుభూతితో సద్గురువులు రచించారో అర్థమవుతుంది. ఆరాత్రికముగా చెప్పబడి, తరువాత ఆరతిగా రూపాంతరం చెందిన అర్చనా విధి హారతి. పగటి పూట కూడా వెల్గిచించబడి చేయునది కాబట్టి ఆరాత్రికము అయింది. ఇవి ఏక హారతి, దీప హారతి, ధూప హారతి, కర్పూర హారతి, కుంభ హారతి వంటి అనేక రకములు. ఈ కృతిలో అన్నమాచార్యుల వారు కర్పూర నీరాజనంతో పాటు, నవరత్నాలతో, గానముతో నీరాజనం పలికారు.

ఈ సంకీర్తన గురించి ప్రస్తావించినప్పుడు ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారి గాత్ర వైభవం గురించి చెప్పుకోవాలి. అన్నమాచార్యుల వారి కీర్తనలకు కొన్నింటికి ఆవిడ మరింత వెలుగులు దిద్దారు అనిపిస్తుంది. అన్నమయ్య కృతులను శాశ్వతం చేయటంలో సుబ్బులక్ష్మి గారు తనవంతు కృషి చేశారు. ఆవిడలోని పవిత్రత, భక్తి భావాలు ఆమె గానంలో ప్రకటితమవుతాయి. ఆవిడ పాడిన ఈ సంకీర్తన వీడియో చూస్తే అది అర్థమవుతుంది. 

గోపాలకృష్ణుడు నల్లన - రావు బాలసరస్వతీదేవి గారి లలిత గీతం

గోపాలకృష్ణుడు నల్లన గోకులములో పాలు తెల్లన
కాళిందిలో నీళ్లు చల్లన పాట పాడవే నా గుండె ఝల్లన

మా చిన్ని కృష్ణయ్య లీలలు మంజుల మధు మురళి ఈలలు
మా కీరసారికల గోలలు మాకు ఆనంద వారాశి ఓలలు

మా ముద్దు కృష్ణుని మాటలు మరువరాని తేనె తేటలు
మా పూర్వ పుణ్యాల మూటలు మమ్ము దరిచేర్చు తిన్నని బాటలు

ఎంత చక్కని లలిత గీతమో కదా! లలిత గీతాలలో కృష్ణభక్తికి, గోపికల మనోభావనలకు ప్రత్యేక స్థానం ఉంది. ఆ గోపస్త్రీల హృదయాలలోని భావఝరులను లలిత గీతాలు చక్కగా ఆవిష్కరిస్తాయి. నల్లనయ్య, గోకులంలోని దధి క్షీర నవనీతాలు, యమునా నది, కాళింది, కృష్ణయ్య వేణు గానం, ముద్దు ముద్దు మాటలు, గోపకులం ఆనందడోలికలు..ఇవి లలిత సంగీతంలో పండినంతగా శాస్త్రీయ సంగీతంలో పండవేమో అని నా అభిప్రాయం. ఇక ఈ గీతానికి వస్తే - 1947లో విడుదలైన రాధిక అనే చిత్రంలో వెంపటి సదాశివబ్రహ్మం గారు రచించగా సంగీతం సాలూరి హనుమంతరావు గారు అందించారు. లలిత సంగీత సామ్రాజ్ఞి రావు బాలసరస్వతీదేవి గారు ఆలపించారు. లలితగీతాల కోసమే బాలసరస్వతి గారు జన్మించారా అన్నట్లు ఈ గీతాలు వారి గళంలో జాలువారుతాయి. సదాశివబ్రహ్మం గారు ఎంతో ప్రతిభ ఉన్న రచయిత. వారి చలనచిత్ర గీతాలు అజరామరమైనవి. ఈ గీతంలో రచయిత గోపెమ్మ మనసును అద్భుతంగా ఆవిష్కరించారు. ఆయన ఉపయోగించిన పదాలు తెలుగుదనం ఉట్టిపడుతూ భావాన్ని లలితంగా ప్రవహింపజేశాయి. మంజులు మధు మురళి ఈలలు, కీరసారికల గోలలు, ఆనంద వారాశి ఓలలు, దరిచేరు తిన్నని బాటలు...ఇవన్నీ భావంతో పాటూ తెలుగు భాషా వైభవాన్ని ఇనుమడింపజేశాయి. అంతే చక్కగా హనుమంతరావు గారు సంగీతం అందించారు. బాలసరస్వతి గారి గానం మాధుర్యభరితమైన ప్రవాహమే.

నేటి తరం వారికి ఈ ప్రముఖులు పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. వారి కోసం ఈ అలనాటి ప్రజ్ఞాశాలుల విశేషాలు కొన్ని.

1.రావు బాలసరస్వతీదేవి గారు


తెలుగు సినీ పరిశ్రమలోని తొలి తరం గాయనీమణుల్లో బాలసరస్వతి గారు అగ్రగణ్యులు. లలిత గీతాల గానంతో ఆకాశవాణిలో, నేపథ్య గీతాల గానంతో చలనచిత్ర పరిశ్రమలో తొలి గాయనిగా పేరొందారు. 1928లో ఇప్పటి నెల్లూరు జిల్లాలోని వెంకటగిరిలో జన్మించిన వీరు చిన్నతనంలోనే చిత్తజల్లు పుల్లయ్య గారి దర్శకత్వంలో విడుదలైన సతీ అనసూయ, భక్త ధ్రువ చిత్రాలలో పాడారు. సంగీతం ఆలత్తూరు సుబ్బయ్య గారి వద్ద సంగీతం నేర్చుకున్నారు. ప్రముఖ హిందీ గాయకులు సైగల్ గారి ప్రభావం బాలసరస్వతి గారిపై ఉండేది. సైగల్ గారి లలితమైన శైలే బాలసరస్వతి గారి గాత్ర ధర్మమైంది. బాలనటిగానే పేరొందిన వీరు తొలుత తమిళం, తరువాత తెలుగు చలనచిత్రాలలో నటించారు. మొత్తం 15 చిత్రాలకు పైగా నటించారు. నటన తగ్గించి గాయనిగా స్థిరపడ్డారు. 1940 నుండి 67 వరకు గాయనిగా 85కు పైగా చిత్రాలలో పాడారు. వారి సినీ మరియు లలిత గీతాలు ప్రజల మనసుల్లో నిలిచిపోయాయి. హాయమ్మ హాయి, తానే మారెనా, ధరణికు గిరి భారమా, తలుపు తీయునంతలోనే, కనుగొంటి కనుగొంటి వంటి ఎన్నో గీతాలు ప్రజల మనసులను దోచుకున్నాయి. మహామహులైన తెలుగు తమిళ సంగీత దర్శకులకు తమ గానం అందించారు. అందరు మేటి గాయకులతోనూ పాడారు. ఆకాశవాణిలో 65 ఏళ్లు పాడిన ఘనత వీరిది. 90 ఏళ్ల వయసులో కూడా ఇప్పటికీ వారి గాత్రంలోని లాలిత్యం ఏ మాత్రమూ తగ్గలేదు. కోలంకి రాజా వారిని వివాహం చేసుకున్న వీరు ఆయన మరణించిన తరువాత ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. రాజావారి భూముల వివాదంలో కోర్టుల చుట్టూ తిరగలేక బాధ పడ్డారు. ప్రస్తుతం హైదరాబాదులో వారి మనుమడి దగ్గర ఉంటున్నారు.

2. సాలూరి హనుమంతరావు గారు:


సాలూరి సన్యాసిరాజు గారి కుమారుడైన వీరు ప్రఖ్యాత సంగీత దర్శకులు సాలూరి రాజేశ్వరరావు గారి అన్నగారు. వీరు 1944-78 మధ్య దక్షిణాదిన చలనచిత్రాలకు సంగీతం అందించారు. అందులో ఒకటి రాధిక చిత్రం. 1917లో విజయనగరం జిల్లా సాలూరు సమీపంలోని శివరామపురంలో వీరు జన్మించారు. వీరు ద్వారం వేంకటస్వామి నాయుడు గారి వద్ద శాస్త్రీయ సంగీత శిక్షణను పొందారు. కర్ణాటక మరియు హిందూస్థానీ శాస్త్రీయ సంగీతాలలో నైపుణ్యం పొందారు. వీరు మొట్టమొదట 1947లో చిత్తజల్లు పుల్లయ్య గారి దర్శకత్వంలో, అంజలీదేవి నాయికగా విడుదలైన గొల్లభామ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు. అల్లావుద్దీన్ అద్భుతదీపం, చరణదాసి, ఉషా పరిణయం, దక్ష యజ్ఞం, చంద్రహాస, బాంధవ్యాలు, రైతుబిడ్డ, ఆరాధన మొదలైన 75 చిత్రాలకు సంగీతాన్ని అందించి 1980లో మరణించారు.

3. సదాశివబ్రహ్మం గారు:


వెంపటి సదాశివబ్రహ్మం గారు అలనాటి కథలు, పాటలు, సంభాషణల రచయిత. 1905లో తూర్పు గోదావరి జిల్లాలో జన్మించిన వీరు తొలుత 1941లో విడుదలైన చూడామణి అనే చిత్రానికి సంభాషణలు, పాటలు, కథ అందించారు. తరువాత తెనాలి రామకృష్ణ (1941,56), పల్నాటి యుద్ధం (1947), రాధిక (1947), కీలుగుర్రం, సంసారం, పక్కింటి అమ్మాయి, కన్యాశుల్కం, చరణదాసి, భలే రాముడు, సువర్ణ సుందరి, శారద, అప్పు చేసి పప్పు కూడు, చెంచులక్ష్మి, ఇల్లరికం, లవకుశ, పరమానంద శిష్యుల కథ మొదలైన ఎన్నో అద్భుతమైన చిత్రాలకు సాహిత్యాన్ని అందించారు. భలే రాముడు చిత్రంలోని ఓహో మేఘమాల, అవకుశ చిత్రంలో లేరు కుశలవుల సాటి అన్న పాట ఎంత ప్రజాదరణ పొందిందో అందరికీ తెలిసిందే. లవకుశ మరియు రహస్యం చిత్రాలలోని పద్యాలు చాలమటుకు వీరు రచించినవే. గీత రచయితగా కన్నా, సంభాషణలు, కథా రచయితగా వీరు పేరొందారు. సదాశివబ్రహ్మం గారు 1968లో చెన్నైలో మరణించారు. 

15, ఆగస్టు 2017, మంగళవారం

కంట జూడుమి - త్యాగరాజ స్వామి కృతి


కంట జూడుమి ఒక పరి క్రీగంట జూడుమి! 

బంటుడై వెలయు బాగుగాని తప్పు 
తంటలెల్ల మానుకొన్న నన్ను క్రీగంట జూడుమి! 

అలనాడు సౌమిత్రి పాద సేవ 
చెలరేగి సేయు వేళ సీతతో 
పలికి చూచినంత పులకాంకితుడై 
పరగిన యటు త్యాగరాజుని క్రీగంట జూడుమి!

ఓ రామా! నీ బంటునైన నన్ను ఒకసారి క్రీగంట చూడుము! నా తప్పు పనులన్నీ మానుకొన్నాను. ఆ నాడు నీకు ఎంతో సేవ చేసిన లక్ష్మణుని గురించి సీతతో పొగడగా ఆ సౌమిత్రి ఎంతో సంతోషించాడు. నన్ను కూడా ఆ విధంగా కంట పెట్టుకొని చూడుము.

రామలక్ష్మణుల మధ్య ఉన్న అనుబంధాన్ని త్యాగరాజస్వామి ఎన్నో కృతులలో ప్రస్తావించారు. లక్ష్మణునికి అన్న మాటే వేదం. ఎందుకు? రాముడు అన్న పాత్రలో అలా వ్యవహరించాడు కాబట్టి. నారాయణునికి ఆదిశేషుడు శయ్యగా నిలిచి సౌఖ్యం కలిగించిన రీతి ఆ శేషుని అంశ అయిన లక్ష్మణుడు రామావతారంలో అదే శ్రీహరి రూపమైన రామునికి నిరంతరం సేవ చేసుకున్నాడు. రాముడికి లక్ష్మణుడు బహిర్ప్రాణం ఐతే లక్ష్మణునికి రాముడు తండ్రి తరువాత తండ్రి. సీతారాముల సేవలో తరించిన లక్ష్మణుని నిబద్ధతను చూసి రాముడు ఆ విషయాన్ని సీతతో ప్రస్తావించిన విషయాన్ని త్యాగరాజస్వామి ఈ కృతి ద్వారా మనకు మరల గుర్తు చేసి, లక్ష్మణుని కనిపెట్టుకుని ఉన్న రీతి తనను కూడా గమనించి బ్రోవమని వేడుకున్నాడు. భక్తునికి-భగవంతుని మధ్య సంభాషణలలో ఎన్ని రకాలో కదా? ఆ వైవిధ్యాన్నే త్యాగరాజస్వామి ఈ కృతి ద్వారా తెలియజేశాడు. వాచస్పతి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని ఎమ్మెల్ వసంతకుమారి గారు గానం చేశారు.

శ్రీరామపట్టాభిషేకం - శ్రీమద్రామాయణం యుద్ధకాండ 128వ సర్గ


శ్రీరామనవమి అనంతరం దశమి నాడు శ్రీరామపట్టాభిషేకం చేయటం భద్రాద్రిలో ఆనవాయితీ. శ్రీరామ పట్టాభిషేకానికై జరిగిన సన్నాహాలు, పట్టాభిషేక మహోత్సవాన్ని వాల్మీకి మహర్షి శ్రీమద్రామాయణం యుద్ధకాండ 128వ సర్గలో వర్ణించారు.

రామన్న తన తల్లి కైకకు తండ్రి దశరథుడిచ్చిన మాట ప్రకారం వనవాసానికి వెళ్లి, ఆ సమయంలో రావణునిచే అపహరించబడిన సీతను కాపాడటానికి అధర్మానికి ఒడిగట్టిన రావణుని సంహరించి ధర్మ స్థాపన చేస్తాడు. వనవాస సమయంలో భరతుని పాలన చేయమనగా, ఆతడు అన్న పాదుకలనుంచి 14 ఏళ్లు ఆయన దాసునిగా రాజ ధర్మాన్ని నిర్వర్తించాడు. యుద్ధం తరువాత రాముడు అయోధ్యకు తిరిగి రాగా, రామన్నను రాజ్యాన్ని స్వీకరించవలసిందిగా భరతుడు కోరాడు. రాముడు తిరిగి రాజ్యాన్ని చేపట్టడానికి అంగీకరించాడు.

వనవాసం వలన పెరిగిన జటాఝూటములమును ముడివిప్పి మంగళ స్నానం చేశాడు. అనేక రకాల సుగంధ లేపనాలను ఆయనకు అలదగా ఆయన అద్భుతంగా ప్రకాశించాడు. శతృఘ్నుడు రామలక్ష్మణులను అలంకరించారు. దశరథుని పత్నులు సీతమ్మను అలంకరించారు. కౌసల్య వానర పత్నులను అలంకరించింది. సుమంత్రుడు రథాన్ని తీసుకురాగా రాముడు దానిని అధిరోహించాడు. సుగ్రీవుడు, హనుమంతుడు కూడా మంగళ స్నానములు చేసి తమను తాము అలంకరించుకున్నారు.

భరతుడు పగ్గాలు చేపట్టగా, లక్ష్మణుడు వింజామర వీచగా, శతృఘ్నుడు ఛత్రము పట్టగా రాముడు అయోధ్య వీధులలో రధముపై విహరించాడు. సుగ్రీవుడు శత్రుంజయమను ఏనుగునెక్కాడు. వానరులందరూ మానుష రూపము ధరించారు. ప్రజలందరూ రామునికి జయ జయ ధ్వానాలు పలికారు. సంగీత వాద్యములతో నృత్యములతో ఆ రాముడు అయోధ్యాపురాన్ని కలయబెట్టాడు. తన మంత్రులతో సుగ్రీవ విభీషణాదులతో తన మైత్రిని గురించి ప్రస్తావించాడు. రాముని పలుకులతో హర్షించిన ప్రజలు తమ ఇళ్లపై పతాకాలను ఎగురవేశారు.

రాముడు రాజప్రాసాదాన్ని చేరుకొని తొలుత ముగ్గురు మాతలకు నమస్కరించాడు. సుగ్రీవాదులకు ఉచితమైన వసతులు చూడమని భరతునితో చెప్పాడు. భరతుడు సుగ్రీవుని రామ పట్టాభిషేకానికై ఏర్పాట్లను ఆరంభించవలసిందిగా కోరాడు. తదనుగుణంగా సుగ్రీవుడు జాంబవంతుని, హనుమంతుని, వేగదర్శిని, ఋషభుని నాలుగు సాగరములనుండి పవిత్ర జలాలను తీసుకు రావలసిందిగా ఆదేశించాడు. వానరులు వారి ఆదేశాల మేరకు 500 నదుల నీరు తీసుకు వచ్చారు. శతృఘ్నుడు రాజ గురువైన వశిష్ఠుల వారితో ఆ జలాల గురించి తెలిపాడు.

వశిష్ఠుడు నవరత్న ఖచితమైన సింహాసనం మీద సీతారాములను ఆసీనులు కావలసిందిగా కోరాడు. వశిష్ఠ, జాబాలి, వామదేవ,కాశ్యప,కాత్యాయన, సుయజ్ఞ, గౌతమ, విజయ మహర్షులు రాముని పవిత్రమైన సుగంధ జలాలతో అభిషిక్తుని చేశారు. మనువును అలంకరించిన నవరత్న ఖచితమైన కిరీటముతో రాముని అలంకరించి రాముని ఆశీర్వదించారు.  శతృఘ్నుడు తెల్లని ఛత్రము పట్టుకోగా, విభీషణుడు, సుగ్రీవుడు వింజామర వీచారు. వాయుదేవుడు ఇంద్రుని బహుమతిగా వంద కలువలున్న స్వర్ణమాలను బహుకరించాడు. వాయుదేవుడు ముత్యాల మరియు ఇతర రత్నాల హారాలను రామునికి సమర్పించాడు. అప్సరసలు నృత్యం చేశారు. ప్రకృతి పుష్పములతో, ఫలములతో పులకరించింది.

రాముడు తొలుత బ్రహ్మణులను, తరువాత సుగ్రీవ అంగదాదులకు కానుకలు అందజేశాడు. సీతమ్మకు ముత్యాల హారాన్ని బహుకరించాడు. రాముడు సీతతో ఆ హారాన్ని సభలో అత్యంత పరక్రమవంతుడు, బుద్ధిమంతుడు, వినయసంపన్నుడు మరియు సమస్త శుభగుణములు కల్వానికి బహుకరించమనగా సీతమ్మ ఆ హారాన్ని హనుమకు ఇచ్చింది. రాముడు మిగిలిన వానరులకు కూడా కానుకలిచ్చాడు. తరువాత సుగ్రీవాదులు కిష్కింధకు, విభీషణుడు లంకకు తిరిగి వెళ్లారు.

ఎన్నగ మనసుకు రాని - త్యాగరాజ స్వామి కృతి


ఎన్నగ మనసుకు రాని పన్నగ శాయి సొగసు
పన్నుగ గనుగొనని కన్ను లేలే? కంటి మిన్ను లేలే?

మోహముతో నీలవారివాహ కాంతిని గేరిన
శ్రీహరిని గట్టుకొనని దేహమేలే? ఈ గేహ మేలే?

సరసిజ మల్లె తులసి విరజాజి పారిజాత
విరులచే పూజించని కరము లేలే? ఈ కాపురము లేలే?

మాలిమితో త్యాగరాజునేలిన త్యాగరాజ మూర్తిని
లాలించి పొగడని నాలికేలే? సూత్ర మాలికేలే? 

మనసు ఎంచలేని శేషసాయి సొగసును కనుగొనలేని కన్నులెందుకు? కంటిరెప్పలెందుకు? తన్మయత్వంతో నీలమేఘ కాంతిని కలిగిన శ్రీహరి రూపమును తన యందు స్థిరము చేసుకోలేని ఈ దేహమెందుకు? ఈ గృహమెందుకు? కలువలు, మల్లెలు, తులసి, పారిజాత పుష్పములచే ఆ రాముని పూజించలేని చేతులెందుకు? గృహస్థాశ్రమమెందుకు? మక్కువతో త్యాగరాజును ఏలిన ఆ స్వామిని లాలించి పొగడని నాలుకెందుకు? హారములెందుకు?

- సద్గురు త్యాగరాజ స్వామి

త్యాగరాజస్వామి వారు ఈ కృతి నీలాంబరి రాగంలో స్వరపరచారు. నీలాంబరి జోలపాడి విశ్రాంతిని కలిగించి నిదురలోకి తీసుకు వెళ్లే అద్భుతమైన రాగం. ధీర శంకరాభరణ జన్యమైన ఈ రాగం పవిత్రతను, భక్తిని, తల్లి లాలనను చక్కగా పండిస్తుంది. త్యాగరాజస్వామి ఎన్నగా మనసుకు రాని, ఉయ్యాలలూగవయ్యా, లాలియూగవే, దీక్షితుల వారి అంబా నీలాయతాక్షి, శ్యామశాస్త్రి గారి బ్రోవవమ్మ, పొన్నయ్య పిళ్లై గారి అంబా నీలాంబరి, నారాయణ తీర్థుల వారి మాధవ మామవ దేవా, ఊతుక్కాడు వేంకటసుబ్బయ్య గారి మణినూపురధారి ఈ రాగంలోనే స్వరపరచబడ్డాయి. ప్రతి ఒక్కటి కూడా ముందు చెప్పిన లక్షణాలను చక్కగా ఆవిష్కరించాయి. ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గారు ఈ కృతిని మనోజ్ఞంగా ఆలపించారు. 1946లో విడుదలైన త్యాగయ్య చిత్రంలో చిత్తూరు నాగయ్య గారు, గుబ్బి జయమ్మ గారు కూడా ఎంతో భావగర్భితంగా ఆలపించారు

నానాటి బతుకు నాటకము - తాళ్లపాక అన్నమాచార్యుల సంకీర్తన


నానాటి బతుకు నాటకము 
కానక కన్నది కైవల్యము 

పుట్టుటయు నిజము పోవుటయు నిజము 
నట్టనడిమి కాలము నాటకము 
యెట్టనెదుట గలదీ ప్రపంచము
కట్టకడపటిది కైవల్యము 

కుడిచేదన్నము కోక చుట్టేది
నడిమంత్రపు పని నాటకము 
వొడిగట్టు కొనినవుభయ కర్మములు 
గడి దాటినపుడె కైవల్యము 

తెగదు పాపము తీరదు పుణ్యము 
నగి నగి కాలము నాటకము 
ఎగువనె శ్రీ వేంకటేశ్వరుడేలిక 
గగనము మీదిది కైవల్యము

-తాళ్లపాక అన్నమాచార్యులవారు


ఇల్లు-వాకిలి-తల్లిదండ్రులు-పిల్లలు-పనివాళ్లు-కళకళలాడే ఇల్లు-తల్లిదండ్రులు కాలం చెందటం-పిల్లలు పెళ్లిళ్లై బయటకు వెళ్లిపోవటం-భార్య-భర్త/పనిమనిషి-> దంపతుల్లో ఎవరో ఒకరు ముందు పోవటం-> ఒంటరి పక్షి/పనిమనిషి->గూడు చినబోయెరా!ఒక జీవితకాలం చూస్తే ముందు ఏమీ లేదు, వెనుక ఏమీ లేదు. ఓ నాటకంలో పాత్రలు పోషించటం, దేహం శిథిలమైనప్పుడు ఆత్మ కొత్త గూడు వెతుక్కోవటం...నట్టనడుమ ఎందుకీ అహంకారం? అంతా మన చేతుల్లోనే ఉన్నట్లు, మనుషులపై ఆధిపత్యపు పోరు, మౌనయుద్ధాలు..ఉన్నన్నాళ్లూ హాయిగా మనసు తేలికగా ఉంచుకొని సమయం రాగానే కొత్తగూటికి స్వేచ్ఛగా ఎందుకు ఎగిరిపోలేకున్నాము?

మనం మోసుకొచ్చిన బరువులు కొన్నైతే, కొత్తగా వేసుకున్న బరువులు మరిన్ని - సంస్కారాలు, కర్మఫలాలు (సంచిత, ప్రారబ్ధ, ఆగామి)...అన్నీ కలిసి ఆ పక్షిని  ఈ భూమ్మీదే మోక్షం పొందని ఆత్మగా తిప్పి తిప్పి జననమరణమనే చక్రబంధంలో కట్టిపడేస్తున్నాయి. కొన్ని కర్మ ఫలాలు బ్రహ్మజ్ఞానంతో పటాపంచలైతే మరి కొన్ని అనుభవించవలసినదే. కాకపోతే ఆ అనుభవంలో దేహాత్మ స్ఫురణ కలిగిన వానికి తామరాకు మీద నీటిబొట్టులా ఆ కర్మఫలాల వల్ల కలిగే బాధ తగ్గుతుంది. దీనికి సద్గురువే శరణ్యం. కర్మఫలాలు ఎలా ఉన్నా, జీవితమనే నాటకంలో సంసారబంధాలు,అనుబంధాల వలన కలిగే దుఃఖానికి భక్తి జ్ఞాన వైరాగ్యాములలో ఏదైనా మందే. భక్తితో భారం భగవంతునిపై వేస్తే, జ్ఞానంతో అజ్ఞానం తొలగి స్థితప్రజ్ఞత కలుగుతుంది. ఎవరో కొందరు కారణ జన్ములకు తప్ప ఎక్కువ శాతం మనుషులకు వైరాగ్యము అన్ని అవస్థలు దాటిన తరువాతే పరిపక్వమవుతుంది..ఈ కర్మలు, తద్వారా పాపపుణ్యముల లెక్క ఎప్పటికీ తెగనిదే. ఆ రెండిటి లెక్కలు దాటగలిగితేనే మోక్షము. అందుకు ఉన్నది ఒక్కటే దిక్కు  పరమాత్ముడైన శ్రీవేంకటేశ్వరుడు.

ఈ అన్నమయ్య కృతిని సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తి గారు రేవతి రాగంలో స్వరపరచగా భారతరత్న ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు తితిదే వారి ఆల్బంలో పాడి దానిని శాశ్వతం చేశారు. ఈ సంకీర్తనలోని సందేశం అర్థం చేసుకుంటే జీవితంలో దుఃఖము దూరమవుతుంది. శాశ్వతానందము కలుగుతుంది.


కడలి దరి దాక నడచెదము గాక - దేశభక్తి గీతం


కడలి దరి దాక నడచెదము గాక
చదలురుగు దాక కదలెదము గాక
ఆ కడలి ఆ చదలు ఏకమగు గాక
చేయి చేయి హాయినిడి చేరి విడిపోక

చీకటుల్ చెదరగా శృంఖలాల్ బెదర
తోడుగా నీడగా మా గాంధి నడువగా
అడుగిడిన జగమదర మా గాంధి నడువగా

మన ప్రభుత మన ఘనత కొని తెచ్చు వరకు
మన గాంధి మన తండ్రి మది నిలుపుకొనుచు
కనులలో ఒక జ్యోతి గళములో ఒక గీతి
మా మనసులో మెరయు ఒక ప్రేమహేతి

బరువులకు బాధలకు శిరసొరగనీక
బ్రతుకు చావుల మాట మది చొరగనీక
ఈ ఆశ ఈ రీతి కొనసాగు వరకు
చేయి చేయి హాయినిడి చేరి విడిపోక

అటు స్నేహమిటు స్నేహమొలికుంచుకొనుచు
అటు దివ్వె అటు దివ్వె వెలిగించుకొనుచు
అవని అంతా ప్రేమ గృహమైన వరకు
ఆ అంచు ఈ అంచు కలిపేయువరకు


(గాంధీ మహాత్ముని దండి సత్యాగ్రహం యాత్ర సందర్భంగా రచించినబడిన గీతం, పాలగుమ్మి విశ్వనాథం గారి సంగీతంలో ఆకాశవాణి ద్వారా వెలువడిన దేశభక్తి గీతం)

వెడలెను కోదండపాణి - త్యాగరాజస్వామి కృతి

వెడలెను కోదండపాణి అనుజ సౌమిత్రితో గూడి పుడమిలో జనులెల్ల పొగడ పూజితుడౌ మునితో గూడి శిరమన కొండెయు జార  వురమున హారములు మెరయ కరమున శరచాపములును ఘ...