24, సెప్టెంబర్ 2016, శనివారం

మామ శకుని - ధూళిపాళ సీతారామశాస్త్రి గారు


మామ శకుని అనగానే మొదట సీఎస్సార్ తరువాత ధూళిపాళ గారి పేర్లు గుర్తుకోస్తాయి. ఒక లక్ష్యంతో కౌరవుల నాశనానికై ప్రతిజ్ఞ చేసిన శకుని పాత్రను ధూళిపాళ గారు ఎంతో బాగా పోషించారు. దాదాపు 40 ఏళ్ల సినీ నటజీవితంలో 300కు పైగా చిత్రాలలో నటించారు. ఆయన 95వ జయంతి ఈరోజు. ఆ సహజ నటునికి నివాళిగా ఈ వ్యాసం.

1921 సెప్టెంబర్ 24న ఇప్పటి గుంటూరు జిల్లా దాచేపల్లి గ్రామంలో (పల్నాడు ప్రాంతం) రత్నమ్మ మరియు శంకరయ్య దంపతులకు ధూళిపాళ సీతారామశాస్త్రి గారు జన్మించారు. 8వ తరగతి వరకు దాచేపల్లిలో చదువుకొని తరువాత బాపట్లలోని ప్రఖ్యాత శంకర విద్యాలయంలో వేదవిద్యను అభ్యసించారు. తొలుత ప్లీడరు గుమాస్తాగా పనిచేశారు. తరువాత స్త్రీ పాత్రల ద్వారా నాటక రంగ ప్రవేశం చేశారు. ఆయనకు నాటక రంగంలో బాగా పేరు తెచ్చిన పాత్ర దుర్యోధనుడు. ఆ కాలంలో మంచి నటుడు, రచయిత, గాయకుడు, దర్శకుడు అయిన గయుడు గారు ధూళిపాళ గారిని సినీ రంగానికి పరిచయం చేశారు. గయుడి గారి సహాయంతో 1962లో విడుదలైన భీష్మ చిత్రంలో దుర్యోధనుడి పాత్ర ధూళిపాళ గారికి లభించింది. దుర్యోధనుడిగా ధూళిపాళ గారు తొలిచిత్రంలోనే అద్భుతంగా నటించారు. ఆ పాత్ర ఆయనకు ఎంతో పేరు తెచ్చింది.

అదే సంవత్సరంలో పుండరకీక్షయ్య గారి నిర్మాణంలో కమలాకర కామేశ్వరరావు గారు మహామంత్రి తిమ్మరుసు చిత్రం విడుదల చేశారు. ఆ చిత్రంలో ధూళిపాళ గారు అల్లసాని పెద్దన పాత్ర వేసి మెప్పు పొందారు. ఇక తరువాత ఆయనకు వరుసగా అవకాశాలు వచ్చాయి. 1963లో విడుదలైన శ్రీకృష్ణార్జున యుద్ధం చిత్రంలో బావ-బావమరది మధ్య యుద్ధానికి కారకుడైన గయిని పాత్రను వేశరు. సినిమాలో గయుడిగా ధూళిపాళ గారి పాత్రం చాలా ముఖ్యమైనదే. తరువాత వచ్చిన అద్భుతకళాఖండంలో ధూళిపాళ గారు తనకు పేరు తెచ్చిన పాత్ర వేసే అవకాశం వచ్చింది. లక్ష్మీ రాజ్యం గారు నిర్మాతగా కమలాకర కామేశ్వరరావు గారి దర్శకత్వంలోనే 1963లో విడుదలై ప్రపంచమంతా పేరుపొంది తెలుగు సినీ స్వర్ణయుగంలో ఆణిముత్యం లాంటి చిత్రమైన నర్తనశాల (విరాట పర్వం) చిత్రంలో ధూళిపాళ గారు సుయోధనుడి పాత్ర వేశారు. దుర్లక్షణాలను తనం ముఖంలో అద్భుతంగా పండించి తన వంతు పాత్రను పరిపూర్ణంగా పోషించారు. కాకపోతే ఆ చిత్రంలో ఎస్వీఆర్, ఎన్‌టీఆర్, సావిత్రిల నటనా కౌశలం ముందు ఇంకెవ్వరూ నిలువలేకపోయారు. అఖండమైన విజయం సాధించి తెలుగు చలనచరిత్రలో కలికితురాయిగా నిలిచిన చిత్రం ఇది.

1964లో సీతారాం గారి దర్శకత్వంలో ఆయనే నిర్మాతగా విడుదలైన మరో మంచి చిత్రం బొబ్బిలి యుద్ధం. 18వ శతాబ్దంలో విజయనగరం క్షత్రియ గజపతి రాజులు మరియు బొబ్బిలి వెలమ రాజుల మధ్య జరిగే ఆధిపత్యపు పోరును తెరకెక్కించిన ఈ చిత్రంలో ధూళిపాళ గారు నరసరాయుడు పాత్రను పోషించారు. మళ్లీ పుండరీకాక్షయ్య/కమలాకర కామేశ్వరరావు గారి కాంబినేషన్‌లో 1967లో విడుదలైన శ్రీకృష్ణావతారం చిత్రంలో ధూళిపాళ గారు సత్రాజిత్తు పాత్రను పోషించారు. తరువాత ఉండమ్మా బొట్టు పెడతా, బాంధవ్యాలు, ఆత్మీయులు, ఏకవీర, బాలరాజు కథ, మట్టిలో మాణిక్యం, బాలభారతం, శ్రీరామాంజనేయ యుద్ధం, అందాలరాముడు, గుణవంతుడు, సీతాకళ్యాణం, మహాకవి క్షేత్రయ్య, కురుక్షేత్రం వంటి ఎన్నో చిత్రాలలో మంచి పాత్రలు పోషించారు.

ధూళిపాళ గారి నటజీవితంలో ముఖ్యమైన చిత్రాలు శ్రీకృష్ణ పాండవీయం (1966), బాలభారతం (1972), మరియు దాన వీర శూర కర్ణ (1977) చిత్రాలు. మూడింటిలోనూ ఆయన శకుని పాత్రను అద్భుతంగా పోషించారు. ఆ కళ్లలో పగ, ప్రతీకార జ్వాల ప్రస్ఫుటంగా కనబరచారు. డైలాగ్స్‌లో కుటిల రాజనీతి హృద్యమైన తెలుగు భాషలో సుస్పష్టమైన ఉచ్చారణతో ఆయన చలనచిత్రాల వైభవాన్ని ఇనుమడింపజేశారు. ధూళిపాళ గారికి పేరు తెచ్చిన మరో పాత్ర సాంఘిక చిత్రమైన బాంధవ్యాలు. 1968లో విడుదలైన ఈ చిత్రాన్ని ఎస్వీ రంగారావు గారు నిర్మించి దర్శకత్వం వహించారు, ప్రధాన పాత్ర కూడా అయానదే. ఆయన తమ్మునిగా ధూళిపాళ గొప్పగా నటించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి నంది అవార్డును పొందారు. చిత్రం కూడా ఉత్తమ చలనచిత్రంగా నంది అవార్డు గెలుచుకుంది. ధూళిపాళ గారి సినీ ప్రస్థానంలో చాలా మటుకు పాత్రలు పౌరాణిక, చారిత్రాత్మక పాత్రలే. కమలాకర కామేశ్వరరావు గారే మళ్లీ 1977లో విడుదలైన కురుక్షేత్రం చిత్రంలో ఆయనకు ఇంద్రుని పాత్రను ఇచ్చారు. విఠలాచార్య గారి చిత్రాలలో కూడా ధూళిపాళ గారు మంచి పాత్రలు వేశారు.

గొప్ప హనుమద్భక్తులైన ధూళిపాళ గారు కంచికామకోటి పీఠాధిపతులు జయేంద్ర సరస్వతీ స్వామి వారి ఆశీర్వాదంతో 2001లో సన్యాసం స్వీకరించారు. గుంటూరులో మారుతి ఆశ్రమాన్ని స్థాపించారు. 2007 ఏప్రిల్ 13న సిద్ధి పొందారు. పల్నాటి పొరుషం తన భాషలో కనబరచే రంగస్థల నటుడు, స్ఫురద్రూపి, మంచి వాక్పటిమ, ప్రత్యేకమైన నటనా కౌశలం కలిగి ఉండటంతో పాటు భక్తుడు అయిన ధూళిపాళ సీతారామశాస్త్రి గారికి జోహార్లు.

-అక్కిరాజు ప్రసాద్ (24 సెప్టెంబర్ 2016)

23, సెప్టెంబర్ 2016, శుక్రవారం

ప్రతిభామూర్తి సింగీతం శ్రీనివాసరావు

ఆయన చిత్రాలు మూస మసాల ధోరణికి భిన్నంగా ఎంతో విలక్షణతతో, సాంకేతిక నైపుణ్యంతో, నటీనటుల ప్రతిభను పూర్తిగా ఉపయోగించుకునే కోవకు చెందినవి. సంభాషణలు లేకుండా ఒక చిత్రానికి దర్శకత్వం వహించి దానిని విజయవంతం చేసిన సత్తా ఆయనలో ఉంది. ఒక్కొక్క చిత్రం ఒక్కో కోణంలో ఒక్కో సందేశంతో ఒక్కో నైపుణ్యంతో ఆయన తీర్చిదిద్దారు. హాలీవుడ్ స్థాయిలో చిత్రాలను ఆయన మనకు అందించారు. అదేనండీ, సింగీతం శ్రీనివాసరావు గారి గురించి చెబుతున్నా! ఈరోజు ఆయన 85వ పుట్టినరోజు. తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషలలో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు దర్శకునిగా, నిర్మాతగా, రచయితగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకున్న ఆ ప్రతిభామూర్తి విశేషాలు కొన్ని.



ఆంధ్రప్రదేశ్‌లొని నెల్లూరు జిల్లా గూడురులో 1931, సెప్టెంబర్ 21న జన్మించిన శ్రీనివాసరావు గారు మద్రాసు విశ్వవిద్యాలయంలో చదువుకొని 1954లో కేవీ రెడ్డి గారి వద్ద మాయబజార్ చిత్రానికి అప్రెంటిస్‌గా చేరారు. సాంకేతిక కారణాల వలన మాయాబజార్ నిర్మాణం ఆలస్యం కావటంతో ఆయన కేవీ రెడ్డి గారి వద్దే దొంగరాముడు చిత్రంలో పనిచేశారు. అక్కడినుండి అద్భుతమైన ఆయన సినీప్రస్థానం మొదలైంది. పాటలు పాడటం, సాహిత్యం రాయటం, దర్శకత్వం, నిర్మించటం, నటన ఇలా ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. కేవీ రెడ్డి గారు, పింగళి నాగేంద్రరావు గారి శిష్యరికంలో ఆయన నైపుణ్యం సంపాదించారు. దొంగరాముడు చిత్రానికి ఆయన సహాయ దర్శకునిగా పనిచేసినా ఆయన పేరు టైటిల్స్‌లో వేయలేదు. అలాగే మాయాబజార్, జగదేకవీరుని కథ, పెళ్లినాటి ప్రమాణాలు, శ్రీకృష్ణార్జున యుద్ధం వంటి చిత్రాలలో కూడా పనిచేశారు. 1972లో మొట్టమొదటి సారి శ్రీనివాసరావు గారు స్వంతంగా నీతి నిజాయితీ అనే చిత్రం తీశారు. ఆ చిత్రం ఆడలేదు. 1974లో ఆయన తొలి తమిళ చిత్రం దిక్కత్ర పార్వతి అనే చిత్రానికి దర్శకతం వహించారు. రాజాజీ రచించిన ఓ నవల ఆధారంగా తీసిన ఈ చిత్రం జాతీయ స్థాయిలో ఉత్తమ తమిళ చిత్రం అవార్డు పొందింది. నటిగా లక్ష్మికి ఎంతో పేరు తెచ్చిపెట్టింది. హిందీలో వచ్చిన సీష్‌మహల్ అనే చిత్రాన్ని 1975లో జమీందారు గారి అమ్మాయిగా నిర్మించారు. ఆచిత్రంలోని మ్రోగింది వీణ పదే పదే హృదయాలలోన అనే అద్భుతమైన పాట మనకు తెలిసిందే.

ఆయన సినీ ప్రస్థానంలో ముఖ్యమైన ఘట్టం 1976లో విడుదలైన అమెరికా అమ్మాయి చిత్రం. ఓ అమెరికా అమ్మాయి భారతీయ కళలపట్ల ఆకర్షించబడి ఇక్కడి మనుషులను ఎలా మారుస్తుందో ఈ చిత్రంలో సింగీతం వారు మనకు అద్భుతంగా తెరపై చూపించారు. ఈ చిత్రం మంచి విజయం సాధించింది. అటుతరువాత వచ్చిన చిత్రాలన్నీ వైవిధ్య భరితమైనవి, విలక్షణమైనవి. పంతులమ్మ, సొమ్మొకడిది సోకొకడిది, రామచిలక వంటి అద్భుతమైన తెలుగు చిత్రాలకు దర్శకత్వం వహించారు. అదే సమయంలో ఎన్నో తమిళ కన్నడ చిత్రాలను అందించారు. తరువాత మైలు రాయి 1984లో విడుడలైన మయూరి చిత్రం. ప్రఖ్యాత నర్తకి సుధా చంద్రన్ గారి నిజ జీవితం ఆధారంగా తీసిన చిత్రం ఉత్తమ చలన చిత్రం అవార్డు పొందింది. ఆయన దర్శకత్వంలో అమెరికాలో పుట్టిన ఓ అబ్బాయి నేపథ్యంలో చిత్రం 1987లో విడుదలై అద్భుతమైన విజయం సాధించింది. తరువాత 1988లో వచ్చిన కళాఖండం పుష్పక విమాన. మాటలు లేకుండా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన చిత్రం ఇది. కమల్ హాసన్ గారి నట జీవితంలో ఈ చిత్రం ఓ కలికితురాయి. ఈ చిత్రానికి కూడా జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఎన్నో అవార్డులు వచ్చాయి.  1989లో వచ్చిన మరో అద్భుత సృష్టి అపూర్వ సహోదరగళ్  (తెలుగులో అపూర్వ సహోదరులు). అన్ని భాషలలోనూ ఈ విజయం సాధించింది. కమల్ హాసన్ గారి నటనా కౌశలాన్ని శ్రీనివాస రావు గారు మరింత ఇనుమడింపజేసేలా మనకు ఈ చిత్రాన్ని అందించారు. గొప్ప సాంకేతిక విలువలతో విలక్షణమైన కథతో ఈ చిత్రం వారివురికీ ఎంతో పేరు తెచ్చింది.

1990లో శ్రీనివాసరావు గారు ఇంకో విలక్షణమైన హాస్యరస ప్రధాన చిత్రాన్ని మనకు అందించారు. అదే తమిళంలో తీసిన మైకెల్ మదన కామ రాజు అనే చిత్రం. కమల్ హాసన్ గారు నాలుగు పాత్రలు పోషించిన ఈ చిత్రం ఓ అద్భుత కళావిష్కరణ. కమల్ హాసన్ గారి సినీ ప్రస్థానంలో మరో గొప్ప చిత్రం. మంచి విజయం సాధించింది. తెలుగు చలన చిత్ర చరితలో 1991 ఓ ముఖ్యమైన సంవత్సరం. సింగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో బాలకృష్ణ గారు కథానాయకుడుగా ఓ అద్భుతమైన చిత్రం విడుదలైంది. అదే ఆదిత్య 369. టైం మెషిన్ ద్వారా శ్రీకృష్ణదేవారాయల కాలానికి వెళ్లి మనకు ఓ సోషియో ఫ్యాంటసీ చిత్రాన్ని ఆయన తీశారు. ఈ చిత్రం కూడా అద్భుతమైన విజయం సాధించింది. తరువాత బృందావనం, మేడం వంటి విలక్షణమైన చిత్రాలు ఆయన దర్శకత్వంలో వచ్చాయి.

1994లో విడుదలైన మరో కళాఖండం భైరవ ద్వీపం చిత్రం. బాలకృష్ణ గారి సినీ విజయాలలో ఈ చిత్రం ఒకటి. జానపద ఇతివృత్తంలో మంచి కథతో జగదేకవీరుని కథను తలపించేలా శ్రీనివాసరావు గారు ఈ చిత్రాన్ని తీశారు. ఈ చిత్రానికి నంది అవార్డు వచ్చింది. తరువాత కూడా ఎన్నో మంచి చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. 2 జాతీయ అవార్డులు, 7 నంది అవార్డులు, 3 ఫిల్మ్ ఫేర్ అవార్డులు, 3 కర్ణాటక రాష్ట్ర అవార్డులు. అరవై రెండేళ్ల ఆయన సుదీర్ఘ సినీ ప్రస్థానం మన సినీ ప్రపంచంలో ఓ మంచి అనుభూతి. దర్శకత్వ ప్రతిభ, సంభాషణలలో పటుత్వం, నిర్మాణంలో సాంకేతిక విలువలు, కథలో విలక్షణత, నటీనటుల ఉన్నతమైన నటనా కౌశలం, అద్భుతమైన ఛాయాగ్రహణం, మంచి సంగీతం ఆయన చిత్రాల ప్రత్యేకతలు. కమల్ హాసన్ గారి సినీజీవితపు విజయాలలో సింగీతం వారిది చాలా ముఖ్యమైన స్థానం.

ఎప్పటికప్పుడు కొత్త కొత్త సాంకేతిక నైపుణ్యాన్ని సంపాదించుకునే వ్యక్తిత్వం ఆయనది. ఆయన చిత్రాలు ముందు చూపుతో ఉంటాయి. కథలు దానిని సంపూర్ణంగా ప్రతిబింబిస్తాయి. ఆయన సినీయానంలో పుష్పక విమానానికి అత్యధికంగా ప్రజాదరణ రాగా, ఆదిత్య 369 ఆయనకు అన్నిటికన్నా తృప్తిని ఇచ్చిన చిత్రమట. 85ఏళ్ల వయసులో కూడ నేటి తరం దర్శకులకు పోటీగా చిత్రాలు తీయటానికి సిద్ధమంటున్న సింగీతం శ్రీనివాసరావు గారికి భగవంతుడు ఆయురారోగ్యాలతో మరింత ఉత్సాహాన్ని కలిగించాలని నా ప్రార్థన.

అక్కిరాజు ప్రసాద్ (21/9/2016)

నాటక కళాప్రపూర్ణ స్థానం నరసింహారావు గారు

అక్కిరాజు ప్రసాద్ (23/09/2016)
=========================


తెలుగు నాట రంగస్థల నటనకు, తరువాత సినీ నటనకు ఆద్యులైన వారిలో ఆయన ఒకరు. స్త్రీ పాత్రలకు ఆయన పెట్టింది పేరు. శ్రీకృష్ణ తులాభారంలో సత్యభామ పాత్రకు రంగస్థలంలో పేరు తెచ్చింది ఆయన నటనా కౌశలమే. చింతామణి, దేవదేవి(విప్రనారాయణ), మధురవాణి (కన్యాశుల్కం) వంటి అద్భుతమైన పాత్రలను పోషించిన స్థానం నరసింహారావు గారి 114వ జయంతి నేడు. తొలితరం చిత్రాలలో కూడా నటించిన ఆయన 1500లకు పైగా రంగస్థల ప్రదర్శనలిచ్చారు. 1902వ సంవత్సరం సెప్టెంబర్ 23న గుంటూరు జిల్లా బాపట్లలో ఆదెమ్మ, హనుమంతరావు దంపతులకు నరసింహారావు గారు జన్మించారు. బాపట్లలో భావనారాయణస్వామి వారి దేవస్థానం సమీపంలోనే ఉండేది వీరి ఇల్లు. 16వ ఏట తండ్రి మరణించగా స్థానం వారు తరువాత మేనమామ కామరాజు వేంకటనారాయణ గారి వద్ద పెరిగారు. ఆ మేనమామ కూతురు హనుమాయమ్మను స్థానం వారు వివాహం చేసుకున్నారు. వీరికి సావిత్రి అని ఒక కుమార్తె పుట్టింది.

బాపట్ల భావనారాయణస్వామి వారి గుడిలో భజనకు అలవాటు చేసుకున్న స్థానం వారు అక్కడే ఓ బాబా వద్ద ఊపిరిపై పట్టు సాధించి ఎక్కువ సేపు పాడగలిగే మెళకువ నేర్చుకున్నారు. మేనమామ బాపట్లలోనే ప్లీడరుగా చేసేవారు. ఆయన సహాయంతో నాటకాల రిహార్సల్స్ చేసుకునే వసతి కలిగింది. బాపట్లలో చదుకువుకునేటప్పుడే ఆయన చిత్రలేఖనం నేర్చుకున్నారు. ఈ చిత్రకళానైపుణ్యం, భజనల అనుభవం, మేనమామ ఇంట్లో హార్మోనియంతో సాధన ఆయన నాటక రంగ ప్రస్థానానికి మూలస్థంభాలైనాయి. భావనారాయణ స్వామి వారి గుడిలో జరిగే బుర్రకథలు, కూచిపూడి యక్షగానాలు, భామా కలాపాలు ఆయనపై ఎంతో ప్రభావం చూపాయి. అభినవ సత్యభామగా పేరొందిన వెంపటి వెంకటనారాయణ గారి నటన ఆయనను ప్రభావితం చేసింది.

1920లో నాటక రంగం ప్రవేశించిన ఆయనకు త్రిపురారిభట్ల వీరరాఘవస్వామి అనే నటుడు శిక్షణనిచ్చారు. తెనాలిలోని రామ విలాస సభ ద్వారా ఆయన రంగ ప్రవేశం జరిగింది. స్థానం వారి మొట్టమొదటి రంగస్థల పాత్ర సత్యహరిశ్చంద్రలో చంద్రమతి. 1921వ సంవత్సరంలో ఈ నాటక ప్రదర్శన జరిగింది. ఆయన నటనకు ముగ్ధులైన చెళ్లపిళ్ళ వేంకట శాస్త్రి గారు స్థానం వారి వద్దకు వచ్చి మరీ ఆశీర్వదించారుట. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారి కార్యక్రమాల సహాయానికి చీరాలలో ఈ నాటకాన్ని మరల వేయాలని కోరగా తల్లి ముందు అంగీకరించలేదు. తరువాత ఊరిపెద్దల ఒత్తిడితో ఆవిడ ఒప్పుకోక తప్పలేదు. ఆ ప్రదర్శనకు ఆయనకు పది రూపాయల పారితోషకం లభించింది. తరువాత అదే నాటకాన్ని గుంటూరు, వేటపాలంలలో ప్రదర్శించారు.

తరువాత ఆయనకు పేరు తెచ్చిన పాత్ర రోషనారా. ఔరంగజేబు చెల్లెలైన రోషనార కథను కొప్పరపు సుబ్బారావు గారు నాటకంగా రచించగా ఆ పాత్రను స్థానం వారు పోషించి లబ్దప్రతిష్ఠులైనారు. తరువాత తెనాలిలోని మూడు ప్రఖ్యాత నాటక సంస్థల ద్వారా ఎన్నో నాటకాలు వేశారు. ఆయనకు పేరు తెచ్చిన ఇతర పాత్రలు భక్త ప్రహ్లాదలోని లీలావతి, శ్రీకృష్ణ లీలలులో యశోద, మోహినీ రుక్మాంగదలో మోహిని పాత్రలు. రామ విలాస సభ ద్వారా రోషనార, సోహ్రాబ్ అండ్ రుస్తుం, అభిజ్ఞాన శాకుంతలం, కన్యాశుల్కం, సతీ అనసూయ, చింతామణి, సారంగధర, చంద్రగుప్తలో ముర, బొబ్బిలియుద్ధంలో మల్లమదేవి, చండికలో చండిక వంటి ఎన్నో నాటకాలలో ఆయన పాత్రలు ధరించారు.

ఆయన హావభావాలు, హొయలు, చిలిపి నవ్వులు, శృంగార రసావిష్కరణలు ఆనాటి రంగస్థల రసికుల మనసులను ఉర్రూతలూగించాయి. ఆయన పాటలు ప్రేక్షకుల మనసులను దోచుకునేవి. స్త్రీ పాత్రలను ధరించటంలో వేషభూషలు, నడవడికలు, మాటలపై ఆయన అత్యంత శ్రద్ధతో సిద్ధమయ్యేవారు. ప్రేమ తరువాత ప్రతీకారం కనబరచే రోషనారా పాత్రా ఆనాడు తెలుగునాట అందరి నోట మెలిగింది. సత్యభామగా, చిత్రాంగిగా, శకుంతలగా ఆయన అభినయం అనుపమానం.

స్థాణం వారి రంగస్థల జీవితంలో కలికితురాయి సత్యభామ పాత్ర. ఆయన శ్రీకృష్ణ తులాభారంలోని ఈ పాత్రకోసం భీమవరపు నరసింహారావు గారి సహకారంతో మీరజాల గలడా అనే ప్రఖ్యత గీతాన్ని రచించారు. ఈ నాటకం, పద్యంతో ఆయన తెలుగు నాటక చరిత్రలో కొత్త యుగాన్ని ఆరంభించారు. పాటనుండి పద్యానికి పద్యం నుండి పాటకు మారుతూ గంటల తరబడి పాడుతూ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశరు. పద్యగద్యాల సమన్వయంతో కొత్త పంథాను సృష్టించారు. తెనాలి నుండి ఆయన ప్రస్థానం శ్రీకృష్ణ తులాభారం ద్వారా చెన్నైకి సాగింది. 1928లో ఈ ప్రదర్శన జరిగింది. తరువాత బెంగుళూరులో వరుసన 22 ప్రదర్శనలు ఇచ్చి ప్రఖ్యాత రంగస్థల కళాకారులు గుబ్బి వీరన్న గారి ప్రశంసలు కూడా పొందారు. ఆయన సత్యభామ పాత్రకు కాశీనాథుని నాగేశ్వరరావు గారు, సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి నాయకులు ముగ్ధులై ఎంతో ప్రశంసించారు.

బళ్లారి రాఘవ, బందా కనకలింగేశ్వరరావు, వేమూరి గగ్గయ్య, ఈలపాట రఘురామయ్య వంటి మేటి రంగస్థల నటులకు సమకాలీకులు స్థానం వారు. ఆకాశవాణిలో కన్యాశుల్కం మరియు గణపతి వంటి నాటకాలతో ప్రజలను అలరించారు. రాధాకృష్ణ, సత్యభామ అనే తొలితరం చిత్రాలలో నటించారు. నటస్థానం అనే పుస్తకాన్ని రచించారు. ఆయన ప్రతిభకు గుర్తింపుగా 1956లో పద్మశ్రీ అవార్డు, 1961లో సంగీత నాటక అకాడెమీ అవార్డు వచ్చాయి. ఆయనకు నరసాపురంలో నటకావతంస బిరుదు (1924), కలకత్తా మేయర్ బంగారు పతకం (1932), రంగూనులో స్వర్ణ కిరీట ధారణ (1933), విజయనగరంలో నటశేఖర బిరుదు (1953), న్యూఢిల్లీలో డాక్టర్ రాధాకృష్ణన్ గారి అభినందన (1954), నాటక కళాప్రపూర్ణ బిరుదు (1960) లభించాయి. ఆయన నాటక కళాపరిషత్తుకు అధ్యక్షత కూడా వహించారు. 1957లో ఆకాశవాణిలో చేరి నాటక కార్యక్రమాల ప్రయోక్తగా పదేళ్లు పనిచేశారు. పక్షవాతంతో ఏడాదిపాటు మంచాన పడి 1971 ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీన తెనాలిలో ఆయన పరమపదించారు.

ప్రముఖ ఆచార్యులు డాక్టర్ మొదలి నాగభూషణ శర్మ గారు స్థానం వారి గురించి "నటకావతంస స్థానం నరసింహారావు నట జీవన ప్రస్థానం" అనే పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తక ఆధారంగా ఈ వ్యాసం రచించబడింది.

స్థానంవారు పాడిన మీరజాల గలడా నాయానతి
https://www.youtube.com/watch?v=-mVLrCRnjSc

22, ఆగస్టు 2016, సోమవారం

కంచికి పోతావా కృష్ణమ్మా - వేటూరి భావ వీచిక


కంచికి పోతావా కృష్ణమ్మా ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా
కంచిలో ఉన్నది బొమ్మ అది బొమ్మ కాదు ముద్దుగుమ్మ

త్యాగరాజ కీర్తనల్లే ఉన్నాది బొమ్మ రాగమేదో తీసినట్టు ఉందమ్మా
ముసిముసి నవ్వుల పూవులు పూసింది కొమ్మ మువ్వ గోపాలా మువ్వ గోపాలా మువ్వ గోపాల అన్నట్టుందమ్మా
అడుగుల్లో సవ్వళ్లు కాదమ్మా అవి ఎడదల్లో సందళ్లు లేవమ్మా

రాసలీల సాగినంక రాధ నీవేనమ్మా రాతిరేళ కంట నిదర రాదమ్మా
ముసిరిన చీకటి ముంగిట లేచింది కొమ్మ ముద్దు మురిపాల మువ్వ గోపాలా నీవు రావేల అన్నట్టుందమ్మా
మనసు దోచుకున్న ఓయమ్మా నీ మనసు దాచుకోకు బుల్లెమ్మా

వేటూరి సుందరరామమూర్తిగారి సాహిత్యంలో జానపద హంగులు, శాస్త్రీయ సొబగులు మేళవించి ఉంటాయి. అటువంటి గీతమే ఈ కంచి పోతావా కృష్ణమ్మా అనే గీతం. నాయిక కబుర్లు తెలుసుకునే ప్రక్రియను ఎంతో అందంగా జానపదాల్లో వేటూరి వారు మనకు అందించారు. ఆ నాయిక గాథను వర్ణించటానికి వేటూరి వారు కంచిని, చిన్ని కృష్ణుని ఎన్నుకున్నారు. కంచిలో ఉన్న ఆ ముద్దుగుమ్మ ఎలా ఉంటుందో వివరించారు. త్యాగరాజ కీర్తనల్లె ఉన్నాదీ బొమ్మ అన్నాడు. వాగ్గేయకారులలో త్యాగరాజస్వామి అగ్రగణ్యుడు. ఆయన కీర్తనలు ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిందే. ఆ కీర్తనల ఔన్నత్యాన్ని ఈ ముద్దుగుమ్మ రూపానికి సారూప్యంగా తెలిపారు. కీర్తనల రాగం కూడా భావానికి తగినట్లుగా ఉండటం త్యాగయ్య సంకీర్తనల ప్రత్యేకత. రాగాన్ని ఆలాపిస్తే ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా ఉందిట ఆ ముద్దు గుమ్మ. ముసి ముసి నవ్వులనే పూలు తన ముఖంలో పూయించందట ఆ నాయిక. మువ్వ గోపాలా మువ్వ గోపాలా అని పిలిచినట్లుందట. ఆమె అడుగులు వేస్తుంటే వచ్చే మువ్వల సవ్వడులు ఆమె హృదయ స్పందనలట. ఇటువంటి సాహిత్యం వేటూరి వారికే సాధ్యం. నాయిక మధురమైన భావనలు ఆమె హృదయస్పందనలుగా, ఆమె పదమంజీరముల సవ్వడులుగా కవి ప్రస్తుతించారు. బృందావనిలో రాసలీల (ఏవండోయ్ రాసలీల అంటే శృంగారం కాదు, ఒకరితో ఒకరు మైమరచి ఆడుతూ పాడుతూ జరుపుకునే వేడుక) ముగియగానే రాధ పరిస్థితి ఎలా ఉందో అలాంటిదట నాయిక పరిస్థితి. రాతిరంతా నిదుర రాదట, చీకటి తొలగకముందే (తెల్లవారకముందే) లేచిన ఆ ముద్దు గుమ్మ మువ్వ గోపాలా నీవు రావేలా అన్నట్లుగా ఉందట. ఆ నాయకుడు కృష్ణుని ద్వారా తన మనసు దోచుకున్న ఆ నాయికను తన మనసులో ఉన్న భావనను వ్యక్త పరచవలసిందిగా కోరుతున్నాడు.

నాయిక పట్ల తనకున్న భావనలను వార్తాహరునికి నాయకుడు వ్యక్తపరచే గీతం ఇది. ఆ వార్తాహరుడే కృష్ణుడు, ఆ నాయిక కంచిలో ఉన్నట్లు భావన. వేటూరి వారు నాయకుని భావ వీచికలను ఆవిష్కరించిన రీతి ఎంత అద్భుతమో బాలు గానం కూడా అంతే మధురం. ఈ గీతం ఆలాపనలో బాలు కనబరచిన భావ సౌందర్యం, లాలిత్యం సున్నితమైన ప్రేమకు ప్రతీకగా నిలిచింది. అలాగే, సుశీలమ్మ ఆలాపనలు కూడా చాలా లలితంగా ఉంటాయి. ఇక చిత్రం విషయానికొస్తే, నాయకునిగా చంద్రమోహన్ జీవితంలో ఇది మరో మంచి చిత్రం. సగటు మధ్య తరగతి మగాడి మనోవికారాలను అద్భుతంగా ప్రతిబింబించే పాత్ర ఇది. అలాగే, నాయిక పాత్రలో నటి సులక్షణ ఎంతో చక్కగా నటించారు. ప్రేమికులనుండి భార్యా భర్తలుగా మారిన ఓ జంట మధ్య ఉండే ఆటుపోట్లను వీరిద్దరు చక్కగా పాత్రలలో జీవించి మనలను అలరించారు. మామ మహదేవన్ మోహన రాగంలో కూర్చిన ఈ గీతం తెలుగు చలన చిత్ర గీతాలలో ఒక మంచి మధురమైన గీతంగా నిలిచింది. కళాతపస్వి విశ్వనాథ్ గారి దర్శకత్వంలో జంధ్యాల సంభాషణలు, నటీనటుల ప్రతిభ, సంగీత దర్శకులు, గాయనీ గాయకుల పటిమతో ఈ చిత్రం ఘన విజయాన్ని సాధించింది. 

20, ఆగస్టు 2016, శనివారం

నువ్వు వస్తావని బృందావని ఆశగ చూసేనయ్యా - ఆరుద్ర కృష్ణభక్తి గీతం


నువ్వు వస్తావని బృందావని ఆశగ చూసేనయ్యా కృష్ణయ్యా
వేణువు విందామని నీతో ఉందామని నీ రాధ వేచేనయ్యా! రావయ్యా! ఓ కృష్ణయ్యా!
ఓ గిరిధర! మురహర! రాధా మనోహరా!

నీవు వచ్చే చోట నీవు నడిచే బాట మమతల దీపాలు వెలిగించాను
కుశలము అడగాలని పదములు కడగాలని కన్నీటి కెరటాలు తరలించాను
ఓ గిరిధర! మురహర! నా హృదయేశ్వరా! నీ రాధ గుండెలలో తాపము చల్లార్చరా!
కృష్ణయ్యా! ఓ కృష్ణయ్యా! కృష్ణయ్యా! ఓ కృష్ణయ్యా!
గోపాలా! గోవింద గోవింద గోవింద గోవింద గోపాలా!

నీ పదరేణువునైనా పెదవుల వేణువునైనా బ్రతుకే ధన్యమని భావించాను
నిన్నే చేరాలని నీలో కరగాలని నా మనసే హారతిగా వెలిగించాను
ఓ గిరిధర! మురహర! నా హృదయేశ్వరా! ఒకసారి దయచేసి నాతిని దయచూడరా!
కృష్ణయ్యా! ఓ కృష్ణయ్యా! కృష్ణయ్యా! ఓ కృష్ణయ్యా!
గోపాలా! గోవింద గోవింద గోవింద గోవింద గోపాలా!



రాధ మధుర భక్తిని మనోజ్ఞంగా ఆవిష్కరించిన మరో సినీ గీతం ఈ నువ్వు వస్తావని అనే గీతం. 1978లో విడుదలైన మల్లెపూవు చిత్రంలో ఆరుద్ర గారు రచించిన ఈ గీతానికి సంగీతం చక్రవర్తి గారు అందించగా రాధ మనోభావనను అద్భుతంగా వాణీ జయరాం గారు తమ గళంలో మనకు అందించారు. ఆరుద్రగారి అసలు పేరు భాగవతుల సదాశివశంకర శాస్త్రి. ఆరుద్ర సినీ గేయ రచయితే కాకుండా కవితలు, కథలు, నాటకాలు, గ్రంథాలు రచించిన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన ప్రముఖమైన రచనలలో సమగ్రాంధ్ర సాహిత్యం అనే 12 భాగాల పరిశోధనాంశం. ఆయన 1950 నుండి 1993 వరకు సినీ గేయ రచయితగా, సంభాషణల రచయితగా ఎంతో పేరు ప్రతిష్ఠలు పొందారు. ప్రముఖ కవి శ్రీశ్రీ వీరి మేనమామ. అలాగే ప్రముఖ రచయిత్రి డాక్టర్ రామలక్ష్మి వీరి సతీమణి. ఆరుద్ర ఇతర ప్రముఖ రచనలలో 1948 కాలం నాటి నిజం రజాకార్ల అరాచకాల నేపథ్యంలో రచించిన త్వమేవాహం అనే అద్భుతమైన సాహితీ సౌరభం. శ్రీశ్రీ లాగానే ఆరుద్ర కూడా మంచి విప్లవ రచయిత. కమ్యూనిష్టులతో అనుబంధం ఆయన రచనలపై ప్రభావం చూపింది. తిరువళ్లువార్ రచించిన తమిళ ప్రబంధం తిరుక్కురళ్‌ను ఆయన ఆంధ్రీకరించారు. రాముడికి సీత ఏమవుతుంది అనే సంచలనాత్మకమైన రచన కూడా చేశారు. ఆయన రచించిన కొన్ని అద్భుతమైన సినీ గేయాలు:

చెట్టులెక్కగలవా ఓ నరహరి, నారాయణా హరి నారాయణా, పాలకడలిపై శేషతల్పమున, నీల గగన ఘనశ్యామ - చెంచులక్ష్మి, మనసే అందాల బృందావనం - మంచి కుటుంబం, హైలో హైలెస్సా హంస కదా నా పడవ, మహాదేవ శంభో, జో జో జోల - భీష్మ, రంభ ఊర్వశి తలదన్నే రమణీ లలామ ఎవరు? - వీరాభిమన్యు, సిరి సిరి లాలి చిన్నారి లాలి - భక్త ప్రహ్లాద, ఈ మౌనం ఈ బిడియం -  డాక్టర్ చక్రవర్తి, ఈ ముసి ముసి నవ్వుల విరిసిన పువ్వుల, హలో హలో ఓ అమ్మాయి - ఇద్దరు మిత్రులు, కొండగాలి తిరిగింది గుండె ఊసులాడింది - ఉయ్యాల జంపాల, ఏవండోయ్ శ్రీవారు ఒక చిన్నమాట - మంచి మనసులు, యమునా తీరమున సంధ్యా సమయమున - జయభేరి, పచ్చని చెట్టు ఒకటి వెచ్చని చిలుకలు రెండు - రాము, ధనమేరా అన్నిటికీ మూలం - లక్ష్మీ నివాసం, చింతచెట్టు చిగురు చూడు - అదృష్టవంతులు, చంటి బాబు ఓ బుజ్జిబాబు - అందరూ దొంగలే, నువ్వడిగింది ఏనాడైనా కాదన్నానా, మబ్బే మసకేసిందిలే - వయసు పిలిచింది, మరు మల్లియ కన్నా తెల్లనిది - మల్లెపూవు, గోగులు గోగులు పూచే ఓ లచ్చా గుమ్మడి - ముత్యాల ముగ్గు, అబ్బోసి చిన్నమ్మా, సమూహ భోజనంబు  - అందాల రాముడు, అమ్ము కుట్టి అమ్ము కుట్టి - పెళ్లి పుస్తకం...ఇలా ఎన్నో ఎన్నెన్నో.

ఇక ఈ గీతానికి వస్తే రాధ మధుర భక్తికి ప్రతిబింబం. తనలోని భావనలన్నిటినీ స్వామికి  తాను నాయికయై సమర్పించింది. విరహం, భక్తి, వైరాగ్యం, శృంగారం, శరణాగతి అన్నీ కలబోసిన భక్తి రాధది. ఆ భావనలను ఆరుద్రగారు అచ్చతెనుగులో అద్భుతంగా పండించారు. వేణుమాధవుని కోసం బృందావనమంతా వేచియుందిట, ఆయన వస్తే ఆయన వేణుగానం వింటూ కాస్త సమయం గడుపుదామని రాధ వేచియుందట. ఎవరా కృష్ణుడు? గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోకులాన్ని కాపాడిన గిరిధరుడు, ముర అనే రాక్షసుని సంహరించిన వాడు, రాధ మనసు దోచుకున్నవాడు.

స్వామి వచ్చే చోట, ఆయన నడిచే బాట అంతా మమతల దీపాలు వెలిగించిందట. అంటే, హృదయాన్ని ఆయనకు సమర్పించి ఆయనను ఆహ్వానిస్తోంది. స్వామి క్షేమ సమాచారం తెలుసుకొని ఆయన పాదాలు కడగటానికి కన్నీటి కెరటాలను తరలించిందట. ఆ రాధా హృదయేశ్వరుని దర్శనానికై తపిస్తున్న రాధ హృదయ స్పందన ఎంత అందంగా ఉందో కదా? అందుకే రాధ మధురభక్తికి ప్రతిబింబమైంది.

మధురభక్తిలో మరో ప్రత్యేకత ఆ స్వామి భక్తి సామ్రాజ్యంలో కించిత్ స్థానమున్నా చాలు జన్మ ధన్యమే అన్న భావన. అదే భావన రాధ మనసునుండి వెలువడింది. ఆయన పాదాలు తాకిన ధూళి అయినా, ఆయన పెదవలుపై వేణువైనా చాలు అని భావించింది రాధ మనసు కనుగొన్న కవి హృదయం. మధురభక్తికి తారాస్థాయి నేను అన్న భావన పటాపంచలై స్వామిలో ఐక్యం కావటం. ఆ స్వామిని చేరుకోవాలని ఆయనలో ఏకమవ్వాలని తన మనసును హారతిగా సమర్పించిందిట ఆ రాధ. తనపై దయచూపమని స్వామిని వేడుకునే రాధ భావనలను అత్యంత నిర్మలంగా ఆవిష్కరించారు ఆరుద్ర గారు.

మధురభక్తి సోపానంలో ఎన్నో భావవ్యక్తీకరణలు. స్వామిని నాయకునిగా భావించి, ప్రేమించి, ఆరాధించి, ఆయన రానందుకు అలిగి, కోపగించి, దుఃఖించి, వచ్చినంత అలుక చూపి, స్వామి బుజ్జగింపులో కరగి, ఆయన ప్రేమ సామ్రాజ్యంలో ఓలలాడి, తనను తాను మరచి, నాది-నేను అన్న అహంకార లక్షణాలు విడిచే సోపానం ఇది. తాను ఆయన అనే ద్వైత భావం నుండి అద్వైత భావనకు చేరుకునే కష్టతర ప్రయాణం ఇది. భౌతిక ప్రపంచంలో ఉన్న వారికి ఈ భావన అర్థం కాక విపరీతార్థాలు తీసి ఆ మధురభక్తిలో ఉన్న వారి పట్ల వివక్ష చూపి హింసించిన సందర్భాలు ఎన్నో. అన్ని ఆటుపోట్లనూ తట్టుకొని మధుర భక్తులు స్వామిలో ఐక్యమై ముక్తిని పొందారు. అటువంటి వారిలో రాధ అగ్రగణ్యురాలు. ఆ మధుర భక్తులకు దేహస్ఫురణలు, దేహానికి సంబంధించిన అవలక్షణాలు ఏవీ అంటవు. వారి తనువు, మనసు అణువణువు స్వామే. ఆ భావననే ఆరుద్రగారు ఈ గీతం ద్వారా మనకు అందించారు. కృష్ణభక్తి సామ్రాజ్యంలో ఈ గీతానికి ఒక స్థానం తప్పకుండా ఉంటుంది. మనకు ఇంతటి అద్భుతమైన గీతాన్ని అందించిన ఆరుద్రగారికి జోహార్లు. ఈ మధుర భక్తి గీతాన్ని వాణీ జయరాం గారు మనోహరంగా ఆలపించారు. చక్రవర్తి గారి సంగీతం ఆరుద్రగారి సాహిత్య క్షీరానికి తేనెలా తోడైంది. ఈ ముగ్గురి ప్రతిభకు ఫలమే ఓ సుందర కృష్ణభక్తి గీతం.



12, ఆగస్టు 2016, శుక్రవారం

శ్రీ వరలక్ష్మీ నమస్తుభ్యం - ముత్తుస్వామి దీక్షితుల వరలక్ష్మీ వ్రతం కృతి


శ్రీ వరలక్ష్మీ నమస్తుభ్యం వసుప్రదే
శ్రీ సారస పదే రసపదే సపదే పదే పదే

భావజ జనక ప్రాణ వల్లభే సువర్ణాభే
భానుకోటి సమాన ప్రభే భక్త సులభే
సేవకజన పాలిని  శ్రిత పంకజ మాలిని
కేవల గుణశాలిని కేశవ హృత్కేళిని

శ్రావణ పౌర్ణమీ పూర్వస్థ శుక్రవారే
చారుమతీ ప్రభ్రుతిః పూజితాకారే
దేవాది గురు గుహ సమర్పిత మణిమయ హారే
దీనజన సంరక్షణ నిపుణ కనక ధారే
భావనాభేద చతురే భారతీ సన్నుత వరే
కైవల్య వితరణపరే కాంక్షిత ఫలప్రదకరే 

సకల సంపదలను కలిగించే వరమహాలక్ష్మికి నమస్కారములు. కలువల వంటి అందమైన పాదములు కలిగిన, తీయని పలుకులు పలికే ఆ తల్లికి పదే పదే నమస్కారములు. మన్మథుని తండ్రియైన శ్రీమహావిష్ణువు పత్నియైన, బంగారు కాంతితో కోటి సూర్యుల ప్రకాశం కలిగిన, భక్తులకు సులభయమైన, సేవక జనులను పాలించే, భక్తులచే కలువల మాలలతో పూజించబడే, సకల శుభ గుణసంపన్నురాలైన, కేశవుని హృదయములో ఆటాడే ఆ వరమహాలక్ష్మికి నమస్కారములు. శ్రావణ పౌర్ణమి ముందటి శుక్రవారమునాడు చారుమతి మొదలైన వారిచే పూజించబడిన, దేవతలు, కుమారస్వామిచే మణిఖచితమైన హారములను స్వీకరించిన, దీనులను రక్షణలో నిపుణురాలైన, దారిద్య్రంలో  ఉన్నవారికి కనకధారను కురిపించే, విచక్షణలో చతురురాలైన, సరస్వతిచే కొలువబడిన, మోక్షాన్ని ప్రసాదించే పరదేవతయైన, కోరిన కోర్కెలు తీర్చే వరమహాలక్ష్మికి నమస్కారములు.

ముత్తుస్వామి దీక్షితుల వారి ఈ కృతి వరలక్ష్మి గురించి ప్రత్యేకంగా వ్రాయబడింది. శ్రీరాగంలో అందంగా కూర్చబడిన ఈ కృతిలో వరలక్ష్మీ వ్రతం శ్రావణ పౌర్ణమి ముందటి శుక్రవారం నాడు జరుపుకోవటం గురించి ప్రస్తావన ఉంది. దీక్షితులవారు సిద్ధులు. అందుకే వారి నోట వచ్చిన పలుకులు దేవతా నివాసాలైనాయి. అటువంటిదే ఈ మహాలక్ష్మి స్తుతి. పల్లవి-అనుపల్లవిలోనే ఆయన పొందిన అనుభూతిలోని ఆధ్యాత్మిక ఔన్నత్యం మనకు అర్థమవుతుంది. వసుప్రదే, శ్రీ సారస పదే, సపదే, పదే పదే అన్న పదప్రయోగంలో దీక్షితులవారి ఉపాసనా శక్తి ప్రతిబింబిస్తుంది. చరణాలలో ఆయన సంస్కృత భాషా వైభవం సువర్ణమయమై ప్రకాశిస్తుంది. నన్ను బాగా ప్రభావితం చేసిన పదాలు కేశవ హృత్కేళిని మరియు భావనాభేద చతురే అన్నవి. శ్రీమహావిష్ణువు హృదయంలో ఆడుకునే తల్లిగా దీక్షితులవారు అమ్మను వర్ణించారు. నిజమే. ఆ పరమాత్మ హృదయస్థానంలో నిలిచి ఆయనను నిత్యం రమింపజేసే తల్లికి ఆ పదం ఎంత సముచితం కదా? భావనలలో భేదాన్ని చూపించటం చతురత కలిగిన తల్లిగా వాగ్గేయకారులు స్తుతించారు. అంటే భక్తుల భావనలను బట్టి అనుగ్రహించే తల్లి అని నా అభిప్రాయం. అలాగే దుష్టశిక్షణలో పరమాత్మకు తోడుగా, భక్తసులభగా, స్వామికి హృదయేశ్వరిగా నిత్యం సేవించే తల్లికి ఎన్ని లక్షణాలో. అందుకే గుణశాలిని అని మొదటి చరణంలో చెప్పి రెండవ చరణంలో భావనా భేద చతురే అని సంపూర్ణం చేశారు. కృతి ఆఖరి పంక్తిలో కైవల్య వితరణ పరే కాంక్షిత ఫలప్రదకరే అని పలికి పరము ఇహము రెండితా మన కోరికలను తీర్చే కల్పవల్లిగా ఆ వరమహాలక్ష్మిని కొనియాడారు. ఇటువంటి భావనలు ఉపాసనలో సిద్ధి పొందిన వారి నోట మాత్రమే ఆవిష్కరించబడుతాయి.  దీక్షితుల వారి ఆధ్యాత్మిక సంపదకు శతసహస్ర వందనాలు.

అందరికీ వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు.  శ్రీవరలక్ష్మీ నమస్తుభ్యం అనే కృతిని మంగళంపల్లి బాలమురళీకృష్ణగారు ఆలపించగా వినండి.

మహాదేవ్యైచ విద్మహే విష్ణుపత్నీచ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్!

7, ఆగస్టు 2016, ఆదివారం

ఔరా అమ్మక చెల్లా ఆలకించి నమ్మడమెలా


శ్రీకృష్ణుని లీలలను వర్ణించటం మన తరమా? ఆ స్వామి తత్త్వం తెలుసుకోవటం అంత సులభమా?  ఆయన గాథలు నమ్మశక్యంగా ఉంటాయి. ఈ భావనలను వ్యాస భగవానుడిని నుండి పోతన వరకు ఎందరో భాగవతోత్తములు మనకు తెలియజేశారు. అటువంటి భావనే సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు మనకు ఆపద్బాంధవుడు అనే చిత్రంలోని ఔరా అమ్మక చెల్లా అనే గీతం ద్వారా అందించారు. అద్భుతమైన జానపద ప్రయోగంతో రచించిన ఈ గీతం కృష్ణ తత్త్వ మహత్వాన్ని మనకు తెలియజేస్తుంది. వివరాలు ఈ బ్లాగు పోస్టులో.

ఔరా అమ్మక చెల్లా ఆలకించి నమ్మడమెలా
అంత వింత గాధల్లో ఆ నందలాలా
బాపురే బ్రహ్మకు చెల్లా వైనమంత వర్ణించ వల్ల
రేపల్లె వాడల్లో ఆనందలీల
అయినవాడే అందరికీ అయినా అందడు ఎవరికీ
అయినవాడే అందరికీ అయినా అందడు ఎవరికీ
బాలుడా గోపాలుడా లోకాలపాలుడా
తెలిసేది ఎలా ఎలా ఛాంగుభళా


నల్ల రాతి కండలతో కరుకైనవాడే
వెన్నముద్ద గుండెలతో కరుణించు తోడే
నల్ల రాతి కండలతో కరుకైనవాడే ఆ నందలాలా
వెన్నముద్ద గుండెలతో కరుణించుతోడె ఆనందలీలా
ఆయుధాలు పట్టను అంటూ బావ బండి తోలి పెట్టే ఆ నందలాలా
జాణ జానపదాలతో జ్ఞాన గీతి పలుకునటే ఆనందలీలా
బాలుడా గోపాలుడా లోకాలపాలుడా
తెలిసేది ఎలా ఎలా ఛాంగుభళా

ఆలమంద కాపరిలా కనిపించలేదా ఆ నందలాలా
ఆలమందుకాలుడిలా అనిపించు కాదా ఆనందలీల
వేలితో కొండను ఎత్తే కొండంత వేలు పట్టే ఆ నందలాలా
తులసీ దళానికే తేలిపోయి తూగునటే ఆనందలీల
బాలుడా గోపాలుడా లోకాలపాలుడా
తెలిసేది ఎలా ఎలా ఛాంగుభళా

ఉత్తర భారతంలో నందలాలా అంటే నందుని ముద్దుబిడ్డ అయిన కృష్ణుడు. లాడ్లా అనే పదం నుండి లాలాగా రూపాంతరం చెందింది. ఆయన లీలలు గోకులమంతటికీ ఆనందం కలిగించాయి కాబట్టి సిరివెన్నెల ఆయనను ఆనందలీల అన్నారు. ఈ ఆ నందలాల, ఆనందలీల అన్న రెండు ఒకేలా ధ్వనించే పద సంపుటిని పునాదిగా చేసుకొని ఈ మహత్తరమైన గీతాన్ని మనకు అందించారు. అమ్మక చెల్ల, చాంగుభళా వంటి పదాలను మళ్లీ మనకు గుర్తు చేసి తెలుగుదనం సుగంధాలను మళ్లీ గుబాళింపజేశారు. ఆ కృష్ణుని వైనాన్ని వర్ణించటం బ్రహ్మ వల్ల కూడా కాదు అని సిరివెన్నెల ఈ గీతంలో తెలిపారు. కృష్ణుని తత్త్వానికి మూలం అన్నిటా తానే ఉండి, ఏదీ తనకు అంటించుకోని తామరాకు మీది నీటిబొట్టు చందం. ఆ రహస్యాన్ని అయినవాడే అందరికీ, అయినా అందడు ఎవ్వరికీ అన్న పంక్తితో మనకు తేటతెల్లం చేశారు. ఆ కృష్ణుడు బాలుడా? గోపాలుడా? లోకాలను పాలించేవాడా? ఎలా తెలిసేది అని కృష్ణ తత్త్వంలో మునిగి తేలే ఆశ్చర్యాన్ని మనోజ్ఞంగా వ్యక్త పరచారు.

నల్లరాతి-వెన్నముద్ద..కరుకుదనం-సుతిమెత్తదనానికి ప్రతీకగా ఆ కృష్ణుని నుతించారు. ఆ పదాలను సముచితంగా గానం చేశారు బాలు, చిత్ర.  తాను ఆయుధాలను పట్టను అని దుర్యోధనుడికి మాట ఇచ్చి విజయునికి రథ సారథిగా నిలిచాడు. ఎంత గొప్ప సందేశం కదా మనకు? మనకు సారథి ఆ జగద్గురువైన శ్రీకృష్ణుడు. ఈ తత్త్వాన్ని సిరివెన్నెల మనకు ఎంతో అందంగా తెలియజేశారు. గోపకులంలో రాసలీలలతో, తన మహిమలతో మనకు జ్ఞానాన్ని గీత ద్వారా బోధించాడు ఆ కృష్ణుడు. శ్రీకృష్ణుడు పలికిన ప్రతి మాట, వేసిన ప్రతి అడుగు, ప్రతి లీల, ప్రతి చేష్ట మనకు సందేశం కలిగినదే. అన్నిటా మునిగి తేలుతూ స్థితప్రజ్ఞత ఎలా సంపాదించుకోవాలో కృష్ణుడు మనకు తెలిపాడు. ఆ గొప్ప తత్త్వాన్ని జాణ జ్ఞాన పదాలతో జ్ఞాన గీతి పలుకునటే అన్న పంక్తిలో సిరివెన్నెల తెలిపారు. పశువుల కాపరిలా కనిపించే కృష్ణుడు మరోవైపు కాలుడిలా కనిపించాడు. గోకులం కోసం గోవర్ధన పర్వతాన్ని చిటికెన వేలిపై ఎత్తిన పరమాత్మ ఆ కృష్ణుడు. కొండంత అండగా మనకు సాయం నిలిచే ఆపద్బాంధవుడు ఆ ఆనందమూర్తి. భక్తితో కొలిచి సమర్పించిన తులసీదళానికి బద్ధుడైనాడు ఆ కృష్ణుడు అన్న తులాభారం గాథను మనకు చివరి పంక్తిలో మనకు అందించారు.

సీతారామశాస్త్రి గారి తెలుగులో సౌందర్యంతో పాటు లోతైన భావ సంపద పొదిగి ఉంటుంది. అంతేనా? దివ్యత్వాన్ని అలదుకున్న పద ప్రయోగం ఉంటుంది. ముఖ్యంగా అయాన రాసిన సంగీత, నాట్య, భక్తి రస ప్రధాన గీతాలలో ఇవి మరింత ప్రకాశిస్తాయి. అటువంటి గీతమే ఔరా అమ్మక చెల్లా. మనకు అర్థమయ్యే పదాలతో అనంతమైన భావనను అందించే అరుదైన కవి సిరివెన్నెల. కృష్ణతత్త్వం తెలియాలంటే ఆ నందలాలా రాసలీలలను, నందగోపకుల్ ఆనంద పారవశ్యాన్ని, ఆ యశోదమ్మ వాత్సల్యాన్ని, రాధమ్మ ప్రేమను అనుభూతి చెందాలి. ఈ గీతం వింటుంటే సిరివెన్నెల వారి అనుభూతులు అలా హృదయఫలకంపై కదలాడుతూ కనిపిస్తాయి. కీరవాణి గారు ఈ గీతానికి సంగీతంతో అద్భుతంగా అలంకరించారు. విశ్వనాథ్ గారి దర్శకత్వ ప్రతిభ ఈ పాట చిత్రీకరణలో కనబడుతుంది. సాహిత్యానికి అనుగుణంగా దానికి గాత్రంతో ప్రాణప్రతిష్ఠ చేసిన గాయకులు బాలు, చిత్ర గార్లు. వీరందరిలోని ప్రతిభా సరస్వతికి నా వందనాలు.

వెడలెను కోదండపాణి - త్యాగరాజస్వామి కృతి

వెడలెను కోదండపాణి అనుజ సౌమిత్రితో గూడి పుడమిలో జనులెల్ల పొగడ పూజితుడౌ మునితో గూడి శిరమన కొండెయు జార  వురమున హారములు మెరయ కరమున శరచాపములును ఘ...