9, జూన్ 2015, మంగళవారం

కంజదళాయతాక్షి కామాక్షి

కంజదళాయతాక్షి కామాక్షి కమలా మనోహరి త్రిపురసుందరి


కంజదళాయతాక్షి కామాక్షి కమలా మనోహరి త్రిపురసుందరి

కుంజర గమనే మణిమండిత మంజుల చరణే మామవ శివ
పంజర శుకి పంకజముఖి గురుగుహ రంజని దురిత భంజని నిరంజని

రాకా శశివదనే సురదనే
రక్షిత మదనే రత్న సదనే
శ్రీకాంచన వసనే సురసనే
శృంగారాశ్రయ మంద హసనే
ఏకానేకాక్షరి భువనేశ్వరి
ఏకానందామృత ఝరి భాస్వరి
ఏకాగ్ర మనోలయకరి శ్రీకరి
ఏకామ్రేశ గృహేశ్వరి శంకరి

ఎర్రని కలువలవంటి కనులు గల ఓ కామాక్షీ! శ్రీమహాలక్ష్మికి ప్రియమైన ఓ త్రిపుర సుందరీ!

ఏనుగువలె అందముగా మెల్లగా నడిచే తల్లీ! మణులతో అలంకరించబడిన మృదువైన పాదముల కల అమ్మా! శివుని హృదయమనే పంజరములో యున్న చిలుక వంటి పార్వతీ! కలువ వంటి ముఖము గల అమ్మా! కార్తికేయునికి ఆనందం కలిగించే తల్లీ! పాపాలన్నిటినీ నాశనం చేసే పవిత్రమైన తల్లీ! 

నిండు పున్నమి నాటి చంద్రుని వంటి ముఖము కల అమ్మా! మంచి పలువరుస కల తల్లీ! మన్మథుని కాపాడిన తల్లీ! రత్న సింహాసనాన్ని అధిరొహించి బంగారు వస్త్రాలను ధరించిన తల్లీ! అద్భుతమైన సౌందర్యము మరియు చిరునవ్వు కలిగిన అమ్మా! ఒకటి లేదా అనేక అక్షరములతో కొలువబడిన తల్లీ! సమస్తభువనములకు ఈశ్వరివి! సచ్చిదానందమనే అమృతాన్ని ప్రవహిస్తూ ప్రకాశించే తల్లీ! ఏకాగ్రమైన మనసుకు లయకారిణివి! శుభములు కలిగించే తల్లీ! ఏకామ్రేశ్వరుని పత్నివి! శంకరీ! 

కంచిలోని శివుడు ఏకామ్రేశ్వరుడు, పార్వతి కామాక్షీ రూపం. ఆ కామాక్షిపై కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకరైన ముత్తుస్వామి దీక్షితులు రచించిన ఈ కృతి ఎంతో ప్రాచుర్యం పొందింది. దేవీ ఉపాసనలో దీక్షితులవారు అమ్మ సాక్షాత్కారము పొంది సిద్ధులైనారు. శ్రీచక్ర నివాసిని అయిన ఆదిపరాశక్తి వైభవానికి ముత్తుస్వామి దీక్షితుల కీర్తనలు ఆనంద నిలయాలు.

సంగీత త్రయంలో దీక్షితులవారు, శ్యామశాస్త్రుల వారు కంచి కామాక్షి అమ్మపై ఎన్నో కీర్తనలను రచించారు.  కామాక్షీ వైభవాన్ని వీరిరువురూ తమ కీర్తనల ద్వారా ఎంతో ప్రభావవంతంగా ప్రచారం చేశారు. 

దీక్షితుల వారు పల్లవిలోనే రాగముద్రను కమలామనోహరి అన్న పదం ద్వార ఉపయోగించారు. ఓంకార పంజర శుకీం అన్న శ్లోకానికి దగ్గరగా ఆయన శివ పంజర శుకి అన్న అమ్మవారిని వర్ణించారు. శివుని హృదయంలో శక్తి నివసించటం ఈ విశ్వతత్త్వానికి ప్రతీక. అందుకే ఈ శివ పంజర శుకి అన్నది చాల నిగూఢార్థమైన ప్రయోగం. గురుగుహ అన్నది ఆయన ముద్ర. 

దీక్షితుల వారి రచనలు ఎక్కువ మటుకు సంస్కృత భాషలోనే చేశారు. ఇసుకతో చేసిన లింగాన్ని మామిడి చెట్టు కింద అర్చించి వివాహమాడిన సన్నివేశానికి ప్రతీక కంచిలోని కామాక్షీ ఏకామ్రేశ్వరుల దేవాలయం. శక్తి పీఠాలలో ఒకటైన కంచి ఆది శంకరులు ఇక్కడి అమ్మవారిని కొలిచిన తరువాత ప్రాభవాన్ని పొందింది. ఏకామ్రేశ గృహేశ్వరి శంకరి అని దీక్షితులు ఈ ఆది దంపతుల దివ్యక్షేత్ర మహిమను చాటారు.

ఈ కృతి చివరలో చిట్ట స్వరం దీనికి ఎంతో అందాన్నిచ్చింది. ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారి మధురమైన గాత్రంలో వినండి.


8, జూన్ 2015, సోమవారం

నిను వినా నామదెందు

నిను వినా నామదెందు నిలువదే శ్రీహరి హరి 


నిను వినా నామదెందు నిలువదే శ్రీహరి హరి

కనులకు నీ సొగసెంతో గ్రమ్మి యున్నది గనుకను 

నీదు కధలు వీనులందు నిండి యున్నది
శ్రీద నీ నామము నోట జెలగి యున్నది గనుక 

నేను ఎచట జూచినను నీవై యున్నది
భాను వంశ తిలక నీదు భక్తుడనుచు పేరు గనుక

కపటమౌ మాటలెల్ల కమ్మనైనది
తపము యాగ ఫలము నీవె త్యాగరాజ సన్నుత

ఓ శ్రీహరీ! నీపైన కాకుండా వేరే ఏ దానిపై నా మనసు నిలువదు. నీ రూపవైభవమంతా నా కళ్లకు కమ్మి యున్నది, నీ కథలు నా చెవుల యందు నిండి యున్నవి, నీ నామము నా నోట నిరంతరము యున్నది, నేను ఎక్కడ చూసినా నీవే కనిపిస్తున్నావు. ఓ సూర్య వంశ తిలకమా! నీ భక్తుడనని నాకు పేరు. కపటమైన మాటలు తీయగా ఉండవచ్చు. కానీ, నావి అటువంటి మాటలు కావు. నా తపస్సు, యోగ ఫలము నీవే శ్రీరామా!

త్యాగరాజస్వామి రామునిపై గల భక్తిని ఆయనతోనే ఈ సంకీర్తనలో విన్నవిస్తున్నారు. ప్రహ్లాదుడు నిరంతరం హరి ధ్యాసతో ఎలా తరించాడో అలాగే త్యాగరాజ స్వామి రామతారక మంత్ర జపంతో పరిపూర్ణ చైతన్య స్థితిని పొందారు. దాదాపు ముప్ఫై ఎనిమిదేళ్ల వయసుకే కోటి రామ మంత్రానుష్ఠానాన్ని పూర్తిజేసి, మంత్ర సిద్ధి, తదుపరి రామసాక్షాత్కారం పొందారు. అటు తరువాతనే 24వేల సంకీర్తనలను రచించారు. జీవనోపాధికి ఉంఛవృత్తిని ఎన్నుకొని విషయలోలుడు కాకుండా అతి నిరాడంబరంగా జీవించి జీవబ్రహ్మైక్యం పొందాడు త్యాగయ్య.

ఈ సంకీర్తనలో త్యాగయ్య రామునిపై గల నిరంతర దృష్టిని తెలుపుతున్నారు. పంచేద్రియములను విషయ వాంఛలపై, ప్రాపంచిక విషయాలపై కాకుండా అణువణువున నిండిన శ్రీహరిపై నిలిపి అపర రామభక్తుడిగా పేరొందాడు త్యాగయ్య. ఆ భక్తికి కలికితురాయి ఈ కీర్తన.

త్యాగయ్య ఎంతటి భక్తితో రచించారో ఈ కీర్తనను అంతే అద్భుతంగా గానం చేశారు సుస్వరలక్ష్మి ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు. నవరస కన్నడ రాగంలో త్యాగరాజ హృదయావిష్కరణ హృద్యంగా, మనోజ్ఞంగా, రమ్యంగా మనకు అందించారు ఆమె.

సంగీతానికి భక్తి ఆయువు పట్టు. ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు భక్తితో వచ్చిన తాదాత్మ్యతకు దర్పణం. అందుకే ఈ కీర్తన ఆమె గొంతులో త్యాగయ్య భావాన్ని అక్షరాలా ప్రతిబింబింపజేసింది.

చూడరమ్మ సతులారా సోబాన పాడరమ్మ


చూడరమ్మ సతులారా సోబాన పాడరమ్మ


చూడరమ్మ సతులారా సోబాన పాడరమ్మ
కూడున్నది పతి చూడి కుడుత నాంచారి
సోబానే సోబానే సోబానే సోబానే

శ్రీమహాలక్ష్మియట సింగారాలకేమరుదు
కాముని తల్లియట చక్కదనాలకేమరుదు
సోముని తోబుట్టువట సొంపుకళలకేమరుదు
కోమలాంగి ఈ చూడి కుడుత నాంచారి

కలశాబ్ధి కూతురట గంభీరాలకేమరుదు
తలపలోక మాతయట దయ మరి ఏమరుదు
జలజనివాసినియట చల్లదనమేమరుదు
కొలదిమీర ఈ చూడి కుడుత నాంచారి

అమరవందితయట అట్టీ మహిమ ఏమరుదు
అమృతము చుట్టమట ఆనందాలకేమరుదు
తమితో శ్రీవేంకటేశు తానె వచ్చి పెండ్లాడె
కొమెర వయస్సు ఈ చూడి కుడుత నాంచారి 

చూడికుడుత నాంచారి: గోదాదేవి (చూడి కుడుత అనేది తమిళ పదం. తాను ధరించిన మాలను స్వామికి ఇచ్చిన అని దాని అర్థం, అలా చేసింది  గోదాదేవి కాబట్టి ఆమెను చూడికుడుత్త నాచ్చియార్ అంటారుట).

సతులారా! మన గోదాదేవి పతితో కూడియున్నది. పెండ్లిపాటలు పాడండి. (సోబాన అనే పదం కలిగిన పాటలు పెళ్లి పాటలుగా ప్రాచుర్యం పొందాయి)

ఈమె శ్రీమహాలక్ష్మి యట, అలంకారాలకు (శృంగారమునకు) ఏమి తక్కువ?  మన్మథుని తల్లియట, చక్కదనాలు ఏమి తక్కువ? చంద్రుని తోబుట్టువట (క్షీర సాగర మథనంలో లక్ష్మితో పాటు చంద్రుడు కూడా ఆవిర్భవించాడు కాబట్టి వారిద్దరు తోబుట్టువులయ్యారు), ప్రసన్నత మరియు కళకు ఏమి తక్కువ? ఈ గోదాదేవి చాల కోమలమైన శరీరము కలది. 

ఈమె సముద్రుని కూతురట, గంభీరానికేమి తక్కువ? తలచితే లోకానికి తల్లియట దయకేమి తక్కువ? నీటినుండి పుట్టిన కమలంలో నివసిస్తుందట చల్లదనానికేమి తక్కువ?  ఈ గోదాదేవి అన్నీ అపరిమితంగా కలిగినది.

ఈమె దేవతల వందనాలు పొందినదట, అటువంటి మహిమలకేమి తక్కువ?  అమృతానికి చుట్టమట (క్షీర సాగర మథనంలో అమృతము కూడా ఉద్భవించింది కాబట్టి) మరి ఆనందాలకేమి తక్కువ? కౌమార్యంలో ఉన్న ఈమెను ఆత్రుతతో శ్రీవేంకటేశుడు తానే వచ్చి పెండ్లాడాడు. 

అన్నమాచార్యుల వారు గోదా వైభవాన్ని ఈ సంకీర్తన ద్వారా అద్భుతంగా వివరించారు. శ్రీరంగనాథుని పుట్టుకతోనే కొలిచిన గోదా శ్రీమహాలక్ష్మి అవతారంగా దర్శించి ఈ సంకీర్తనను మనకు అందించారు. గోదాదేవి శృంగారాన్ని, సౌందర్యాన్ని, తల్లి ప్రేమను, కరుణను, కళలను, మహిమలను, గాంభీర్యాన్ని, కోమలత్వాన్ని అద్భుతమైన ఉపమానములతో లక్ష్మీదేవితో పోల్చి ఈ కీర్తనకు దివ్యత్వాన్ని చేకూర్చారు. ఆమె ఈ గుణాలను గమనించి శ్రీరంగనాథుడు వచ్చి పెండ్లాడిన సందర్భంగా సతులను సోబాన పాడరమ్మా అని కోరుతున్నాడు సంకీర్తనాచార్యుడు. పదకవితా పితామహుని భావ సంపద, భక్తి జ్ఞాన సౌరభాలు ఈ సంకీర్తన ద్వారా ప్రకాశిస్తున్నాయి. తల్లిలో ఉండే సర్వ సులక్షణాలను అన్నమయ్య ఇందులో పొందుపరచారు.

విష్ణుచిత్తుని ఇంట జన్మించిన ఆ లోకమాత శ్రీరంగనాథునితో ఏకమయ్యే అద్భుతమైన అవతరణిక తిరుప్పావై.  ఆ తిరుప్పావైలోని ఘట్టాలను ఎందరో సంకీర్తనాచార్యులు తమ భావాలలో వ్యక్తపరచారు. గోదావైభవాన్ని స్వయంగా శ్రీవిల్లిపుత్తూరులో దర్శించి తరించిన అన్నమాచార్యుల వారు దానిని తిరుమల-తిరుపతిలో వెలసిన వేంకటేశుడు-అలమేల్మంగల వైభవానుభూతికి సారూప్యంగా వర్ణించారు. తన జీవితాన్ని శ్రీరంగంలోని రంగనాథునికి సమర్పించిన గోదా 'నేను' అన్న భావాన్ని త్యజించి స్వామిలో ఐక్యమయ్యింది. అందుకే లోకవంద్య అయ్యింది.

అన్నమాచార్యుల వారు అమ్మవారిని ఎన్నో కీర్తనలలో నుతించారు. మెరుగు బోడి అన్నా, చూడికుడుత నాంచారి అన్నా, క్షీరాబ్దికన్యక అన్నా, జయలక్ష్మి అన్నా, ఆ అమ్మను ప్రతి ఒక్క సంకీర్తనలోనూ ప్రత్యేకంగా, ఒక వినూత్నమైన భావాన్ని మన ముందు ఆవిష్కరించారు.  పరమాత్మ యొక్క మాయా స్వరూపిణిగా కూడా మనకు వివరించారు. స్వామితో సరస శృంగార సల్లాపాలు సలిపే అమ్మ, లోకమాతగా, మనలను అపారమైన కరుణతో అనుగ్రహించే తల్లిగా, చల్లని చూపులతో కాపాడే కల్పవల్లిగా, సకల సద్గుణాల రాశిగా అన్నమాచార్యుల వారు ఎన్నో కీర్తనలలో ప్రస్తుతించారు. వాటిలో ఈ చూడరమ్మ సతులాలా ప్రత్యేకమైనది.

వివాహమనేది మానవ జన్మలో ఎంతో పవిత్రమైనది. దానికి సంబంధించిన వేడుకలను, ముచ్చటలను అన్నమాచార్యుల వారు తమ పదశోభలలో ఎంతో మధురంగా జనులకు అర్థమయ్యే భాషలో, అనాటి సమాజానికి అద్ధం పట్టేలా రచించారు. పిడికిట తలంబ్రాల పెళ్లికూతురని పాడినా, సోబాన పాడరమ్మా అని నుతించినా ఆయా వేడుకలను మనకు ఇప్పటికీ తెలిసేలా సాహిత్యాన్ని గుప్పించారు. ఇదే మన సంస్కృతిలోని గొప్పతనం. అది ఒక గంగా ప్రవాహంలాంటిది. మహానుభావుల భావ స్పందనలు రచనలుగా మారి, తర తరాల వారసత్వంగా మనకు అందుతోంది.

అన్నమాచార్యుల పదకవితా వైభవం, ఆధ్యాత్మిక ఉన్నతికి ఈ కీర్తన ఒక కలికితురాయి.  గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్ గారి గళంలో ఈ సంకీర్తనను వినండి.



6, జూన్ 2015, శనివారం

తిరుమల తిరుపతి వేంకటేశ్వరా - మహామంత్రి తిమ్మరుసు


తిరుమల తిరుపతి వేంకటేశ్వరా కూరిమి వరముల కురియుమయా 

చెలిమిని విరిసే అలర్మేల్మంగమ చెలువములే ప్రియ సేవలయా 

నయగారములను నవమల్లికలా 
మమకారాలను మందారములా 
మంజుల వలపుల మలయానిలముల 
వింజామరమున వీతుమాయా 

ఆశారాగమే ఆలాపనగా 
సరస రీతుల స్వరమేళనగా 
అభినయ నటనలే ఆరాధనగా 
ప్రభునలరించి తరింతుమయా

మహామంత్రి తిమ్మరుసు చిత్రంలో పింగళి నాగేంద్రరావు గారి సాహిత్యం, పెండ్యాల నాగేశ్వరరావు గారి సంగీతంలో ఎస్ వరలక్ష్మి, పి. సుశీల గారు కలిసి పాడిన గీతం.

చలనచిత్రాలు సందేశానికి, సంగీత సాహిత్యాలకు, భక్తికి మంచి మాధ్యమాలు అని నిర్మాతలు, దర్సకులు అనుకున్న కాలం 1950-60 దశాబ్దాలు. మహామంత్రి తిమ్మరుసు అనే చిత్ర కథ చరిత్రకు సంబంధించినది, రాచరికానికి సంబంధించినది. అందులో, విజయనగర సామ్రాజ్యాధీశుడు సాహితీ ప్రియుడు, బహుభాషా కోవిదుడు, ఎన్నో దేవాలయాలకు నిధులు ఇచ్చి, నిర్మించిన వాడు. సనాతన ధర్మం నిలబడి ముందుకు వెళ్లటానికి ఎంతో తోడ్పడిన మహనీయుడు. తెలుగు భాష మాధుర్యాన్నిఆస్వాదించి రచనలు చేసిన కోవిదుడు ఆయన. అటువంటి రాజు కొలువులో మంత్రి తిమ్మరుసు. మహామేధావి, విద్యా సంపన్నుడు. ఇటువంటి నేపథ్యం కలిగిన చిత్రం ఈ మహామంత్రి తిమ్మరుసు.



మహారాజుల సంగీత సాహిత్యాభిలాషలు అంతఃపురములలో రాణుల వద్ధ కూడా  వికసించేవి. దీనికి చరిత్ర సాక్ష్యం. మంచి సంగీత నృత్య కళాకారులు ఆస్థానాలలో పేరు పొందారు. అలాగే స్వయంగా రాజులు, రాణులు సంగీత సాహిత్య నృత్య ప్రావీణ్యం పొందారు. అందుకు మచ్చు తునకగా ఈ భక్తి గీతాన్ని మహామంత్రి తిమ్మరుసు చిత్రంలో పొందుపరచారు. రాయలే వీణ వాయించగా రాణులు గానం చేయగా నర్తకి ఈ మధుర భక్తి సుమాన్ని మన ముందు ఆవిష్కరించారు. రాయలంటే అన్న ఎన్ టీ ఆర్ అనేలా ఆయన నటించారు. అలాగే ఎస్ వరలక్ష్మి, దేవిక గాత్ర ధర్మానికి అనుగుణంగా నటించారు. ఇక ఎల్ విజయలక్ష్మి సంగతి చెప్పేదేముంది? భరత నాట్య కౌశలాన్ని ఊహించలేని స్థాయికి తీసుకువెళ్లిన మహా నర్తకి ఆమె. ఈ గీతంలోని భావనను తన ఆహార్యముతో, ఆంగికముతో అద్భుతంగా నృత్యసేవగా ప్రదర్శించారు.

తిరుమల వేంకటేశుని నుతించే ఈ గీతంలో శరణాగతి భావన కన్నా సేవలో కలిగే మధుర భావాలను పొందు పరచారు. కృష్ణదేవరాయల రాణులపై చిత్రీకరించిన ఈ పాటలో తమలో కలిగే భావనలను ఎలా స్వామి సమర్పిస్తున్నారో కవి మనకు తెలియజేశారు.

ఓ వేంకటేశ్వరా! ప్రేమను, వరములనివ్వు స్వామీ! స్నేహాన్ని విరిసే అలమేలుమంగ యొక్క సౌందర్యమే నీకు ప్రియమైన సేవలు! మృదుత్వముతో కూడిన మాటలే నవ మల్లికలుగా, మమకారమే మందార పుష్పాలుగా, మంజులమైన వలపులే పిల్లగాలులుగా వింజామరలు వీస్తాము స్వామీ! ఆశతో కూడిన రాగమే ఆలాపనగా, సరసముతో కూడిన హావభావములే స్వరాల కలయికగా, నాట్యాభినయాలే ఆరాధనగా నిన్ను అలరించి తరించెదము స్వామీ!

శృంగార రసంతో కూడిన భక్తిని మధురభక్తి అంటారు. అన్నమాచార్యుల నుండి క్షేత్రయ్య వరకు ఈ మధురభక్తిని తమ పదాలలో విశదీకరించారు. మనలో కలిగే ఏ భావననైనా స్వామికి అహంకారం లేకుండా సమర్పించ గలిగితే అది ఆయనకు స్వీకారమే. అందుకే మహా వాగ్గేయకారుల శృంగార ప్రాధాన్యమైన సంకీర్తనలు  స్వామి పాదాల వద్ద శాశ్వత సుగంధ పూరితమైన పుష్పాలుగా నిలిచాయి. అటువంటి గీతమే ఈ తిరుమల తిరుపతి వేంకటేశ్వరా. కళాకారులలో స్వతహాగా కలిగే మానవీయ భావనలకు దివ్యత్వం కలిగించే రీతిలో సాగుతుంది ఈ గీతం.

పింగళి నాగేంద్ర కవి యొక్క రస హృదయస్పందనే ఈ మంచి గీతం. దీనికి పెండ్యాల వారి మాధుర్య భరితమైన సంగీతం తోడై ఒక పరిపూర్ణమైన గీతంగా నిలిచింది. మాధుర్యానికి మారుపేరైన సుశీలమ్మ గారి గొంతు, గాంభీర్యానికి, భావానికి నెలవైన ఎస్ వరలక్ష్మి గారి గొంతు ఈ గీతానికి సాధనాలై ఇప్పటికీ మధుర భక్తి సువాసనలను చిందింపజేస్తున్నాయి. 

5, జూన్ 2015, శుక్రవారం

మోక్షము గలదా


మోక్షము గలదా భువిలో జీవన్ముక్తులు గాని వారలకు



మోక్షము గలదా భువిలో జీవన్ముక్తులు గాని వారలకు

సాక్షాత్కార! నీ సద్భక్తి సంగీత జ్ఞాన విహీనులకు

ప్రాణాలన సంయోగము వల్ల ప్రణవ నాదము సప్తస్వరము బరగ
వీణావాదనలోలుడౌ శివమనోవిత మెరుగరు త్యాగరాజ వినుత

ప్రపంచమున దేహేంద్రియములతో జీవించియుండు కర్మబంధములకు అంటనివారు కానిచో భువిలో మోక్షము గలదా?

ఎల్లప్పుడూ ప్రత్యక్ష సిద్ధమైయున్న రూపము గలవాడా! నిన్ను తెలియుటకు సాక్షాత్సంబంధము గలది నాదోపాసనమే. ప్రాణవాయువు, అగ్ని యొక్క కలయిక వలన ప్రణవనాదము ఉద్భవించింది. ఆ నాదమే సప్తస్వరములై సంగీతమైనది. సంగీతజ్ఞానము, భక్తిలేని మానవులకు మోక్షము కలుగదు. వీణావాదన తత్త్వజ్ఞుడైన శివుని మనసు తీరును సంగీతజ్ఞానవిహీనులు తెలియలేరు. ఆ మర్మము ఎరిగిన వారికి ప్రణవరూపుడగు శివుడు సాక్షాత్కరించును. కావున నాదస్వరూపమును గుర్తెరిగి పరమాత్మను కీర్తించుట ముక్తికి మార్గము. ఓ దేవా! త్యాగరాజు నిన్ను వినుతించుచున్నాడు.

కలౌ నామ సంకీర్తనం అన్నాడు నారదుడు. కలియుగంలో నామ సంకీర్తనే మోక్షమునకు ఉత్తమమైన మార్గము. ఎందుకు? యుగ లక్షణాలను బట్టి మోక్ష పథము మారుతుంది. పాప పురుషుడు అధర్మాన్ని మూడు పాళ్లు ధర్మాన్ని ఒక పాలుగా చేసే సమయం ఈ కలియుగం. పాపపుణ్యముల మూటలను కేవలం నామ సంకీర్తన పటాపంచలు చేస్తుంది. ఈ పనికోసమే పరమాత్మ శ్రీవేంకటేశ్వర స్వామిగా, షిర్డీ సాయి వంటి ఇతర సద్గురువుల రూపంలో అవతరించాడు. వస్తువులలోను, జనుల ఆలోచనలలోని కలుషితం వలన క్రతువులు కలియుగంలో మోక్షాన్ని ప్రసాదించలేవు. అన్నమాచార్యులు, త్యాగరాజస్వామి వంటి మహాపురుషులు ఈ విషయాన్ని తెలుసుకొని తమ సంకీర్తనల ద్వారా పరమాత్మను నుతించి మోక్షాన్ని పొందారు. మోక్షమనగా బంధనములనుండి విముక్తి పొందటమే. అది జరిగిన తరువాత దేహి, దేహము యొక్క జ్ఞానము శాశ్వతమై మానవుడు దుఃఖరహితుడవుతాడు.

సంకీర్తనకు సాహిత్యము, సంగీతము తల్లిదండ్రులు. ఆ సంగీత జ్ఞానము భక్తికి, తద్వారా మోక్షానికి ఏ విధంగా ఉపయుక్తమో ఈ కీర్తన ద్వారా త్యాగరాజస్వామి వివరించారు. విశ్వానికి మూలమైన ప్రాణవాయువు మరియు అగ్ని కలయిక నుండి ఓంకారం జనించింది. ఓంకారమునుండి సప్తస్వరములు ఉద్భవించాయి. ఈ సప్తస్వర విన్యాసమే సంగీతము. కాబట్టి విశ్వానికి మూలమైన ప్రాణానలముల శక్తి సంగీతములో ఉంది. అందుకే అతి పవిత్రమైనది, మహత్తరమైనది. ఆ సప్తస్వరముల మేళనలో భావం కలిస్తే ఇక అది మంత్రసమానమే. అటువంటి సంకీర్తనలను శరణాగతితో పాడితే మనలోని మాలిన్యాలు తొలగి, ప్రణవ ప్రేరితమైన దివ్య శక్తి ప్రవేశించి మనలను ఆత్మ సాక్షాత్కారమువైపు నడిపిస్తాయి. కావలసినది ఈ మహత్తు యొక్క జ్ఞానము, పరమాత్మ పట్ల భక్తి మరియు శరణాగతి.

సంగీత జ్ఞానముతో, సంకీర్తనలతో శివతత్త్వాన్ని, తద్వారా మోక్షాన్ని పొందగలమని త్యాగరాజుల వారు సారమతి రాగంలో మనకు తెలియజేస్తున్నారు.

ఈ భావపూరితమైన త్యాగరాజస్వామి వారి కృతిని ఎమ్మెల్ వసంతకుమారి గారి గాత్రంలో వినండి.

4, జూన్ 2015, గురువారం

ఆనంద తాండవమాడే శివుడు

ఆనంద తాండవమాడే శివుడు అనంత లయుడు చిదంబర నిలయుడు


ఆనంద తాండవమాడే శివుడు అనంత లయుడు చిదంబర నిలయుడు

నగరాజ సుత చిరునగవులు చిలుకంగ సిగలోన వగలొలికి ఎగిరి ఎగిరి దూకంగ సురగంగ

ప్రణవనాదం ప్రాణం కాగా
ప్రకృతి మూలం తానం కాగా
భువనమ్ములే రస భూమికలు కాగా
భుజంగ భూషణుడు అనంగ భీషణుడు 
పరమ విభుడు గరళ ధరుడు 
భావ రాగ తాళ మయుడు సదయుడు

ఏమి శాంభవ లీల!! ఏమా తాండవ హేల!!
అణువణువులోన దివ్యానంద రసడోల
సురగరుడులు ఖేచరులు విద్యాధరులు
నిటల తట ఘటిత నిజకర కమలులై
నిలువగా కురువరా యని పిలువగా కొలువగా

ధిమి ధిమి ధిమి ధిమి ఢమరుధ్వానం ధిక్కటముల మార్మ్రోయగా
కిణ కిణ కిణ కిణ మణి నూపురముల ఝణత్కారముల మ్రోయగా
విరించి తాళము వేయగా 
హరి మురగలు మ్రోయింపగా 
ప్రమథులాడగా అప్సరలు పాడగా 
ఆడగా పాడగా ఆనంద తాండవమాడే

అమెరికా అమ్మాయి చిత్రానికి డాక్టర్ సింగిరెడ్డి నారాయణరెడ్డిగారు రచించిన శివతాండవ గీతం ఇది. అమెరికాలో జన్మించిన స్త్రీ భారతదేశపు కోడలుగా వచ్చి ఈ గీతంలోని భావాన్ని అనుభూతి చెందుతుంది. ఒక శివాలయంలో కలిగే ఈ అనుభవానికి సినారెగారి గీతం, జి.కె.వెంకటేష్ గారి సంగీతం తోడు కాగా సుశీలమ్మ గారి గొంతులో తేటతేనె తెలుగులో అమృతాన్ని కురిపించింది.

కైలాసంలో పరమశివుని ఆనంద తాండవ హేలను కవి మధుర మనోజ్ఞంగా ఆవిష్కరించారు.



 అనంతమైన లయలో నిమగ్నుడైన వాడు, ఆకసమంతా నిండియున్న శివుడు ఆనంద తాండవమాడుతున్నాడు.  (చిదంబర నిలయుడు అనగా చిదంబర క్షేత్రంలో వెలసిన నటరాజస్వామి అని కూడా అర్థం చెప్పవచ్చు. కానీ, లయకారకుడైన శివుడు ఆకాశమంతా నిండి ఉన్నాడు అన్నది సముచితము అనిపించింది)

హిమవంతుని కుమార్తె అయిన పార్వతి చిరునవ్వులొలికిస్తూ ఉండగా, శిరసులో జటాఝూటమునందు దేవగంగ వగలు ఒలికిస్తూ ఎగిసి ఎగిసి దూకుచుండంగా, శివుడు ఆనందతాండవం చేస్తున్నాడు.. ప్రణవనాదమైన ఓంకారం ప్రాణమవగా, ప్రకృతికి మూలమైన కాలం తాళం కాగా. సమస్తలోకాలు నవరసాల పాత్రను పోషిస్తుండగా, సర్పములను ఆభరణములుగా కలిగిన వాడు, మన్మథుని దహనం చేసిన వాడు, సర్వేశ్వరుడు, కంఠంలో విషాన్ని ధరించిన వాడు, భావము, రాగము, తాళములలో లయమైన వాడు, అపారమైన దయ కలిగిన వాడు అయిన పరమశివుడు ఆనంద తాండవం చేస్తున్నాడు.

ఆహా! ఎంత అద్భుతమా శివుని లీల? ఏమిటా నృత్య విన్యాసము?  అణువణువులో దివ్యమైన ఆనంద రసం పొంగి పొరలుతున్నది! దేవతలు, గరుత్మంతుడు, ఆకాశములో సంచరించే దేవగణములు, జీమూతవాహనుడు మొదలైన దేవ వర్గము (విద్యాధరులు) ముక్కంటి అయిన శివునికి చేతులతో నమస్కరించుచు నిలువగా, కైలాసపతీ అని పిలువగా, కొలువగా పరమశివుడు ఆనందతాండవం చేస్తున్నాడు.

ధిమి ధిమి ధ్వనులతో దిక్కులన్నీ మారుమ్రోగగా, కిణ కిణ కిణ అనే రావముతో గజ్జెలు ఝణత్కారము చేయగా, బ్రహ్మ తాళము వేయగా, విష్ణువు నాదస్వరము వాయించగా, ప్రమథ గణములు ఆడగా,  అప్సరసలు పాడగా పరమశివుడు ఆనందతాండవం చేస్తున్నాడు.

సినారె గారి భావ సంపద, భాషా కౌశలం, పద విన్యాసం ఈ తాండవహేలలో ఒక దివ్య పారిజాత సుమంలా వికసించాయి. తెలుగులో మాధుర్యాన్ని, క్రొత్తదనాన్ని కురిపించటంలో సినారె గారికి సాటి ఎవ్వరూ లేరు. ఈ గీతంలోని భావగర్భితమైన ప్రాస దీనికి తార్కాణం. నటేశుని నాట్యాన్ని సమస్త దేవతల నృత్య వాయిద్య గాత్ర సహకారాన్ని, ఆ లయకారుని అద్భుత విన్యాసాన్ని మనకు కళ్లకు కట్టీనట్లుగా సినారె గారి కలంలో జాలువారింది.  తాళ వాద్యముల అద్భుత సమన్వయముతో, పార్వతి చిరునవ్వుతో, గంగమ్మ చిందుతో స్వామి ఆనంద పరవశములో నర్తన చేస్తుంటే ఆహా! ఆ భావనే కైలాస గిరి రమణీయ దృశ్య కావ్యావిష్కరణ కనుల ముందు కలుగ జేస్తుంది.



ఇక చిత్రం విషయానికొస్తే, నాయిక ఆన్నె ఒక ఫ్రెంచ్ నర్తకి. ఆమె భారతదేశం వచ్చి వెంపటి చిన సత్యం గారి వద్ద కూచిపూడి అభ్యసించి, ఆ కళలో, భరతనాట్య శాస్త్త్రములో ప్రావీణ్యము సంపాదించి, దేవయాని అనే పేరుతో గొప్ప కళాకారిణిగా పేరు పొందారు. పద్మశ్రీ బిరుదు కూడా పొందారు. మనం స్వధర్మాన్ని, మన ప్రాచీన కళలను వదులుకొని పాశ్చాత్య నాగరికత వెంట పడుతున్న సమయంలో మన కళలలోని దివ్యత్వాన్ని గ్రహించి ఆ కళను ఆరాధించిన ఈమె మనకు మార్గదర్శకురాలు. భాష, సంస్కృతి, సాంప్రదాయము, భావము తెలియని విదేశీ వనిత అన్నీ నేర్చుకొని అత్యున్నత స్థాయికి చేరుకుందంటే అది సామాన్యమైన పట్టుదల కాదు. ఆమెలోని తృష్ణకు, శ్రమకు జోహార్లు. ఇలాంటి వారి  మన కళలలోని అద్భుతాలను కనుగొని, వాటిని సముచితంగా గౌరవించే ప్రయత్నం ఇకనైనా చేయాలి.

సుశీలమ్మ గళంలో ఈ పాట మాధుర్యాన్ని, దేవయాని గారి నాట్యంలో ఈ భావ వ్యక్తీకరణను ఆస్వాదించండి.

29, మే 2015, శుక్రవారం

శ్రీ నీలోత్పలనాయికే


శ్రీ నీలోత్పల నాయికే జగదంబికే శ్రినగర నాయికే మామవ వర దాయికే 

 దీన జనార్తి ప్రభంజన రీతి గౌరవే 
దేశిక ప్రదర్శిత చిద్రూపిణి నత భైరవే 
ఆనందాత్మానుభవే అద్రిరాజ సముద్భవే 
సూన శరారి వైభవే జ్ఞాన సుధార్ణవే శివే 

సంకల్ప వికల్పాత్మక చిత్తవృత్తి జాలే 
 సాధు జనారాధిత సద్గురు కటాక్ష మూలే 
 సంకట హర ధురీణతర గురు గుహానుకూలే 
 సమస్త విశ్వోత్పత్తి స్థితి లయాది కాలే 
 విటంక త్యాగరాజ మోహిత విచిత్ర లీలే 
 శంకరి కృపాల వాలే హాటక మయ చేలే 
 పంకజ నయన విశాలే పద్మరాగ మణిమాలే 
 శంకర సన్నుత బాలే శారద గాన లోలే

నీలి కలువపై స్థిరమైయున్న ఓ జగదంబా! శ్రీనగర శారదా పీఠానికి నాయికా! నాకు వరములిచ్చే తల్లీ! దీన జనుల ఆర్తిని తీర్చే నీ రీతి వలన అద్భుతమైన కీర్తి కలిగిన తల్లీ! పండితులచే సర్వోన్నతమైన చైతన్యరూపముగా పొగడబడి, భైరవునిచే నుతించబడిన తల్లీ! నిరంతరం ఆనందాన్ని అనుభవిస్తూ ఉండే తల్లీ! హిమవంతుని కుమార్తెవైన నీవు మన్మథుని వైరి అయిన శివునికి వైభవాన్ని కలిగిస్తున్నావు!  జ్ఞానసాగరానివి నీవు శివానీ!
సంకల్పము, దానికి వికల్పము కూడా నీ చిత్తము ద్వారా అమలుచేస్తావు. సాధువులచే ఆరాధించబడినావు! సద్గురువుల కటాక్షానికి మూలము నీవు! మా కష్టాలను తొలగించే నిపుణురాలవు నీవు! గురుగుహునికి ఎల్లప్పుడూ అనుకూలంగా ఉన్నావు!  ఈ విశ్వము యొక్క సృష్టి, స్థితి, లయములకు కారణము నీవే! నీ ఆశ్చర్యకరమైన లీలలతో శివుని సమ్మోహనుని చేసినావు! శంకరీ! నీవు కృపకు నిలయానివి! బంగారు వస్త్రాలను ధరించిన తల్లివి! కలువల వంటి విశాలమైన కన్నులు కలిగి, కెంపులతో కూడిన హారములను ధరించినావు! శంకరునిచే నుతించబడిన బాలా త్రిపురసుందరివి! గానములో లీనమయ్యే శారదవు నీవు! 

ముత్తుస్వామి దీక్షితులవారు కర్ణాటక సంగీత త్రయంలో ఒకరు. ఈ కృతిలో ఆయన అమ్మవారిని రీతిగౌళ రాగంలో నుతించారు. అమ్మ అపారమైన కరుణకు, దయకు, మహిమలకు నిలయం. ఆ తల్లిని ఉపాసన చేసిన దీక్షితులవారు మంత్ర సమానమైన పదాలతో కొలిచారు. చిద్రూపిణి అన్న పదానికి ఎంతో నిగూఢమైన అర్థముంది. లలితా సహస్రనామావళిలో, ఇతర దేవి స్తోత్త్రములలో అమ్మ చిద్రూపిణిగా వర్ణించబడింది. పరిపూర్ణమైన చైతన్య స్వరూపిణి అమ్మ. ఆ చైతన్యమే చిత్. అలాగే, సంకల్పము, వికల్పము రెండూ కూడా తన చిత్తముతో అమలు చేసేది అమ్మ. ఇటువంటి భావనలు అనుభూతి చెందితే తప్ప కలుగవు. దీక్షితుల వారు అమ్మను కమలాంబ నవావర్ణ కృతులను ఎంతో మనోజ్ఞంగా రచించారు. అమ్మ సృష్టి స్థితి లయములకు కారణమని పలికారు. దేవీ ఉపాసనలో అమ్మను సర్వశక్త్యాత్మికగా ముగురమ్మలకు మూలంగా, త్రిమూర్తుల శక్తి సమన్వితగా వైభవంగా నుతించబడినది. అదే తరహాలో దీక్షితుల వారు ఈ కీర్తనలో అమ్మ లీలలను, రూపాన్ని ప్రస్తుతించారు. చిదంబరంలో శివకామి అమ్మవారికి బంగారు చీర అలంకరిస్తారు. అదే రీతిని దీక్షితుల వారు ఈ శాంకరిని హాటకమయ చేలే గా అభివర్ణించారు. 

డాక్టర్ బాలమురళీకృష్ణగారి గళంలో ప్రసిద్ధి పొందిన ఈ కృతిని వినండి

వెడలెను కోదండపాణి - త్యాగరాజస్వామి కృతి

వెడలెను కోదండపాణి అనుజ సౌమిత్రితో గూడి పుడమిలో జనులెల్ల పొగడ పూజితుడౌ మునితో గూడి శిరమన కొండెయు జార  వురమున హారములు మెరయ కరమున శరచాపములును ఘ...