14, మే 2015, గురువారం

గీతామృతము -సాంఖ్య యోగము




ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే
సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే

క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః
స్మృతిభ్రంశాద్బుద్ధినాశో బుద్ధి నాశాత్ ప్రణశ్యతి

యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి
తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస చ శ్రుతస్య చ

రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్
ఆత్మ వశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్ఛతి

విషయ చింతన చేయు పురుషునికి ఆ విషయములందు ఆసక్తి ఏర్పడును. ఆసక్తి వలన ఆ విషయములను పొందుటకై కోరికలు కలుగును. ఆ కోరికలు తీరనప్పుడు క్రోధము ఏర్పడును.

అట్టి క్రోధము వలన వ్యామోహము కలుగును. దాని ప్రభావమున స్మృతి ఛిన్నాభిన్నమగును. స్మృతిభ్రష్టమైనందున బుద్ధి అనగా జ్ఞానశక్తి నశించును. బుద్ధి నాశనము వలన మనుష్యుడు తన స్థితినుండి పతనమగును.

ఎప్పుడు నీ బుద్ధి మోహమనే మాలిన్యమును దాటగలదో అప్పుడు విన్న, వినబోవు ఇహము, పరమునకు సంబంధించిన భోగములనుండి వైరాగ్యమును పొందగలవు.

ఇంద్రియములను వశములో ఉంచుకొనిన సాధకుడు రాగద్వేషాలు లేకుండా, ఇంద్రియముల ద్వారా విషయాలను గ్రహించుచున్ననూ ప్రశాంతతను పొందుచున్నాడు. 

శ్రీకృష్ణభగవానుడు అర్జునునితో శ్రీమద్భగవద్గీత సాంఖ్య యోగమునందు (2-62, 2-63,2-52,2-64 శ్లోకములు)

కలి నరులకు మహిమలు దెలిపేమి ఫలమన లేదా



కలి నరులకు మహిమలు దెలిపేమి ఫలమన లేదా

ఇలను వెలయు వర వృషరాజులకటుకుల రుచి తెలియు చందముగానే

దారసుతులకై ధనములకై ఊరుపేరులకై బహు పెద్దతనముకై
సారెకు భక్త వేసము గొనువారికి తారక నామ శ్రి త్యాగరాజార్చిత 

కలియుగంలో స్వార్థపు ప్రయోజనాల కోసం భక్తులుగా చలామణీ అయ్యే మానవుని స్వభావాన్ని ఈ కృతి ద్వారా త్యాగరాజ స్వామి నిందిస్తున్నారు.

కలియుగంలో మానవులకు నీ నామ మహిమలు తెలిపి ఏమి ఫలమని నీవనలేదా? ఈ భూమిపై ధనికులనే పెద్దలకు అటుకుల రుచి తెలియని విధముగా ఈ మానవులకు తారక నామ మహిమ ఏ విధంగా తెలుస్తుంది? భార్యా బిడ్డల కోసం, ధనము కోసం, భూమి, పేరు కోసం, పెద్దరికం కోసం, కానుకల కోసం భక్తుని వేషం వేసే మానవులకు నీ నామ మహిమలు తెలిపేమి ఫలము? ఓ శివునిచే పూజించబడ్డ తారక నామ!

ఈ సంకీర్తనలో వర వృష రాజునకు అన్న పదానికి ఎద్దు అన్న అర్థం ఉన్నా, శ్రీమంతుడు అన్న అర్థమే సందర్భానికి సముచితమనిపించింది.

చాలా మంది మానవులు భక్తి తన అవసరాల కోసం, స్వార్థం కోసం నటిస్తారన్నది ఈ కీర్తన భావం. ఈ విధంగా జీవించే వారికి నామ మహిమ తెలిపినా ఉపయోగం లేదు. ఎందరో మహానుభావులను తరించిన నామం రామ నామం.   దాని గూఢము, మహిమ తెలియాలంటే భౌతికమైన విషయాలకు అతీతంగా ఆలోచించ గలగాలి. మన జీవన శైలి, జీవిత తత్త్వము ఈ నామ మహిమానుభూతికి ఎంతో తోడ్పడతాయి. కలియుగ లక్షణం అనేక మూలాంశాలలో అసంతులన వలన వచ్చే భావ కాలుష్యము. దీని వలన బుద్ధి ప్రకోపించి మనిషిని చెడు వైపు నెడుతుంది. తద్వారా, మానవుడు దైవ సంబంధమైన విషయాలను కూడా తన స్వార్థానికి వాడుకొని అసలు విషయాన్ని మరస్తాడు. అధోగతికి ఇది మొదటి మెట్టు. రామనామ మహిమలో రమించే వానికి వేరే ఏవీ పట్టవు. రామనామననేది ఒక రసాయనం (కలి మల హరణము) అని వాగ్గేయకారులు త్యాగయ్య, రామదాసు, అన్నమాచార్యుల వారు నొక్కి వక్కాణించారు. దానికి వారికి కలిగిన అనుభూతులు, దార్శనికాలు ప్రమాణం. అందుకే వారి సంకీర్తనలు చిరకాలం ప్రచారం పొందుతాయి. తారక నామ మంత్రామృతాన్ని పానం చేసిన ఈ వాగ్గేయకారులు దాని మహిమను అదే పవిత్రతో సంకీర్తనలలో వర్ణించి, తమ నాద శక్తిని దానికి ప్రాణంగా ధార పోశారు. అందుకే అవి కూడా మంత్ర సమానమై ఈ కలికాలంలో మనకు సన్మార్గాన్ని చూపుతున్నాయి.

కుంతలవరాళి రాగంలో ఈ కృతి కూర్చబడింది. బాలమురళీకృష్ణ గారి గాత్రంలో వినండి.

13, మే 2015, బుధవారం

ఓంకార రూపిణీ క్లీంకార వాసినీ


ఓంకార రూపిణీ క్లీంకార వాసినీ
జగదేక మోహినీ ప్రకృతి స్వరూపిణీ

శర్వార్థ దేహినీ సకలార్థ వాహినీ
భక్తాఘ దాహినీ దహరాబ్జ గేహినీ

మృగరాజ వాహన నటరాజు నందన
అర్థేందు భూషణ అఖిలార్తి శోషణ
కాంచికా కామాక్షీ మాధురి మీనాక్షీ
మముబ్రోవవే తల్లీ అనురాగ శ్రీవల్లీ

బేతవోలు రామబ్రహ్మం గారి మరో అద్భుతమైన రచన ఈ భక్తి గీతం. అమ్మవారిపై రాసిన ఈ గీతంలో ఆయన క్లీం అన్న బీజాక్షరం కూడా ఉపయోగించారు. క్లీం బీజాక్షరాలలో చాలా శక్తివంతమైనది. సరిగ్గా దీనిని శ్వాసతో అనుసంధానం చేసి ఉచ్ఛరిస్తే ప్రాణ శక్తితో బంధం ఏర్పడి కామ్యములను తీరుస్తుంది. కర్మవిముక్తులను చేస్తుంది. రామబ్రహ్మం గారు దేవీ భక్తులు. అమ్మపై ఆయనకు గల నమ్మకం ఈ కృతిలో అర్థమవుతుంది. అ ఉ మ అనే అక్షరాల కలయిక ప్రణవం. ఈ ఓంకారం పరబ్రహ్మ చైతన్యానికి రూపం. ఓం మరియు క్లీం అనేవి దేవీ ఉపాసనలో ఎంతో ప్రాధాన్యత కల బీజాక్షరాలు. గీత రచయిత ఈ విధంగా వేడుకుంటున్నారు -

అమ్మా! నువ్వు ఆ ప్రణవ స్వరూపిణివి, శక్తివంతమైన క్లీం అనే బీజాక్షరం నీకు నివాసం. ఈ విశ్వంలో కెల్లా సౌందర్యవంతమైన స్త్రీవి నువ్వే అమ్మా! నీవు ప్రకృతి స్వరూపిణివి. శివునికి అర్థ భాగంగా ఉన్నావు! సమస్త అర్థములను తీర్చేటి అమ్మవు నీవు. భక్తుల పాపములను దహించే తల్లీ! నీవు శివుని ఇల్లాలువు. సింహవాహినివి! శివునికి ఆనందం కలిగించెడిదానవు. నెలవంక శిరసుపై ధరించి, సమస్త కష్టములను తొలగిస్తున్నవు. కంచిలో కామాక్షీ! మదురైలో మీనాక్షి! మమ్ములను కాపాడుము ఓ అనురాగరూపిణీ!

సుశీల గారు చాల ఆర్తితో పాడారు ఈ గీతాన్ని. వినండి.

12, మే 2015, మంగళవారం

అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా


అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా
విశ్వైకనాథుడే విచ్చేయునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట

నా తనువు ఓ తల్లి నీ సేవ కొరకు అర్పింతునోయమ్మ పై జన్మ వరకు
నా ఒడలి అచలాంశ నీ పురము జేరి నీ పాదముద్రతో నెగడాలి తల్లి

నా ఒడలి ఉదకాంశ నీ వీడు చేరి నీ పాదపద్మాలు కడగాలి తల్లి
నా తనువు తేజోంశ నీ గుడికి చేరి నీ ముందు దివ్వెగా నిలవాలి తల్లి

నా తనువు మరుదంశ నీ గుడికి చేరి వీచోపు కొసలలో విసరాలి తల్లి
నా తనువు గగనాంశ నీ మనికి చేరి నీ నామగానాలు మోయాలి తల్లి

అన్నపూర్ణాదేవిని స్తుతిస్తూ రచయిత బేతవోలు రామబ్రహ్మం గారు ఎంత భావగర్భితమైన గీతాన్ని రాశారో!

మానవ జన్మకు సంబంధించిన అంశాలన్నిటినీ ఆ తల్లి సేవకు ఎలా సమర్పించదలచుకున్నాడో రచయిత ఈ గీతంలో వివరిస్తున్నారు.

ఓ తల్లీ! అన్నపూర్ణాదేవి! నిన్ను అర్చిస్తున్నాను! నా మనవిని ఆలకించి నన్ను కాపాడు! విశ్వనాథుడే వచ్చి నీ ఇంటి వాకిట భిక్ష కోసం నించుంటాడట! ఓ తల్లీ! నా శరీరం మళ్లీ జన్మ వరకు నీ సేవకు అర్పిస్తున్నాను. నా శరీరములోని పృథివీ తత్త్వము నీవు నివసించే పురం చేరి నీ పాదముద్రతో కలిసి వర్ధిల్లాలి. నా శరీరంలోని జల తత్త్వము నీవు ఉండే ఇల్లు చేరి నీ పదకమలాలను కడగాలి. నా శరీరములోని తేజో తత్త్వము నీ గుడి ముంగిట దీపంలా వెలగాలి. నాలోని వాయు తత్త్వము నీ గుడికి చేరి వింజామరల కోసలలో నిలిచి నీకు గాలి విసరాలి. నా శరీరంలోని ఆకాశ తత్త్వము నీ నివాసానికి చేరి నీ నామాలను నుతించే గానాలను మోయాలి తల్లీ!

దేహానికి సంబందించిన ఐదు తత్త్వాలను - పృథివ్యాపస్తేజోవాయురాకాశాలను - తల్లి సేవకు సమర్పించటం ఈ భక్తుని పరిపూర్ణమైన మనోవికాసానికి, జన్మ కారణ జ్ఞాన వికాసానికి ప్రతీక. ఈ అంశాలను దుర్వినియోగం చేయకుండా దేహాన్ని దేవాలయం చేయటం ఈ గీత లక్షణ సంపద. జగన్మాత కరుణానిధి. ఆ తల్లి తనను శరణన్న వారిని కరుణించి కన్నబిడ్డలలా కాపాడుతుంది. మానవ జన్మకు ఇంతకు మించి సేవ ఏమున్నది? మనలోని ప్రతి అంశాన్నీ ఆ దివ్యత్వానికి సమర్పిస్తే ఇక మాయకు, తద్సంభూతమైన అహంకారాది వికారములకు స్థానమే లేదు.

ఇటువంటి గీతాన్ని రచించాలంటే పదకారుడు ఎంతటి ఆధ్యాత్మిక వికాసాన్ని పొంది ఉంటాడో ఊహిస్తేనే తనువు పులకరిస్తుంది. ఆయా అంశాలను మన తల్లికి అర్చనా విధులలో వినియోగించటం జీవాత్మ పరమాత్మల మధ్య భేదాన్ని ఛేదించి అద్వైతము వైపు వడి వడిగా అడుగులు వేయటాన్ని సూచిస్తోంది. భక్తి, భావం ఒకటైతే పదాలు అవే కలిసొస్తాయి. వీడు అన్నది తమిళ పదం. అలాగే మని అన్నది సంస్కృతనుండి జనించి కన్నడ భాషలో నివాసానికి వాడే పదం. ఇలా ఈ గీతంలో భావానికి వేర్వేరు భాషల పదాలు ఎంతో అందంగా ఒదిగిపోయాయి. అన్నపూర్ణమ్మకు హారంగా పొదిగి ప్రకాశిస్తున్నాయి. అంశలకు సంబంధించిన పదాలను పరిశీలిస్తే కృతికర్త భాషా పటిమ మనకు అర్థమవుతుంది. అచలాంశ అన్న పదం ఆయనకు దేహం గురించిన లోతైన జ్ఞానాన్ని తెలియజేస్తుంది. అలాగే ఉదకాంశ, మరుదంశ, తేజోంశ మరియు గగనాంశ. ఆలోచించండి! శరీరం ఎంతటి అద్భుతమైన పంచ భూతముల కలయికో? మరి ఆది పరాశక్తి ప్రకృతి రూపిణి కదా? ఆమెకు ఈ పాంచభౌతిక మూలాలను సమర్పిస్తే మనలను మనం పూర్తిగా అర్పించినట్లేగా? ఈ విశ్వైకజనని అనబడే అనంత శక్తితో ఈ చిరు శక్తి అనుసంధానమై ఉజ్జ్వల తేజో తరంగంగా భాసిల్లినట్లేగా? అనంతమైన విశ్వంలో అశాశ్వతమైన శరీరానికి ఇంతకన్నా సార్థకత ఏముంది. నా మనసుకు హత్తుకొని సాహిత్యం చదువుతుంటే కళ్లలో నీళ్లు తెప్పించిన ఈ గీత రచయిత మనోవికాసానికి నా జోహార్లు.

సుశీలమ్మ గళంలో ఈ పాట వినండి.

11, మే 2015, సోమవారం

శీతాద్రి శిఖరాన - మంగళ హారతి



శీతాద్రి శిఖరాన పగడాలు తాపించు మా తల్లి లత్తుకకు నీరాజనం
కెంపైన నీరాజనం భక్తి పెంపైన నీరాజనం

యోగీంద్ర హృదయాల మ్రోగేటి మా తల్లి బాగైన అందెలకు నీరాజనం
బంగారు నీరాజనం భక్తి పొంగారు నీరాజనం

నెలకొల్పు డెందాన వలపు వీణలు మీటు మా తల్లి గాజులకు నీరాజనం
రాగాల నీరాజనం భక్తి తాళాల నీరాజనం

మనుజాళి హృదయాల తిమిరాలు తొలగించు మా తల్లి నవ్వులకు నీరాజనం
ముత్యాల నీరాజనం భక్తి నృత్యాల నీరాజనం

చెక్కిళ్ల కాంతితో క్రిక్కిరిసి అలరారు మా తల్లి ముంగెరకు నీరాజనం
రతనాల నీరాజనం భక్తి జతనాల నీరాజనం

పసిబిడ్డలను చేసి ప్రజలెల్ల పాలించు మాతల్లి చూపులకు నీరాజనం
అనురాగ నీరాజనం భక్తి కనరాగ నీరాజనం

పగడాల మరిపించు ఇనబింబమనిపించు మాతల్లి కుంకుమకు నీరాజనం
నిండైన నీరాజనం భక్తి మెండైన నీరాజనం

తేటిపిల్లలవోలె గాలికల్లలలలాడు మా తల్లి కురులకు నీరాజనం
నీరాల నీరాజనం భక్తి భావాల నీరాజనం

జగదేక మోహినీ సర్వేశు గేహిని మాతల్లి రూపునకు
భక్తి నిలువెత్తు నీరాజనం భక్తి నిలువెత్తు నీరాజనం

బేతవోలు రామబ్రహ్మం గారు తెలుగు భాషలో ప్రావీణ్యం పొంది ఆచార్యులుగా కూడా ఎన్నో ఏళ్లు పని చేశారు. భాషపై పట్టుతో పాటు ఆధ్యాత్మికోన్నతి కూడా వారికి భగవంతుని అనుగ్రహంగా వచ్చింది. తెలుగు మరియు సంస్కృత భాషలలో ఉభయ భాషా ప్రవీణులు వీరు. దేవీభాగవతంపై వీరు విస్తృత పరిశోధన చేశారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరబాద్ లో తెలుగు విభాగంలో ఎన్నో ఏళ్లు ఆచార్యునిగా భాషాసేవ చేశారు.

వీరి రచన ఈ శీతాద్రి శిఖరాన భక్తి గీతం.

లోకమాతకు ఇలా నీరాజనం ఇస్తున్నాడు కవి.

హిమవత్పర్వత శిఖరంపై పగడాలతో తాపినట్లుగా ఉన్న మా తల్లి కాళ్ల పారాణికి కెంపువంటి ఎరుపైన, భక్తితో నిండిన నీరాజనం. యోగుల హృదయాలలో చక్కగా మ్రోగే తల్లి అందెలకు బంగారు, భక్తి రంగరించిన నీరాజనం. హృదయంలో నిలిపిన వారికి ప్రేమ వీణలు మ్రోగించే తల్లి గాజులకు రాగాలతో, భక్తి భావములతో నీరాజనం. మానవాళి హృదయాలలోని అంధకారాన్ని తొలగించే తల్లి నవ్వులకు ముత్యాల మరియు భక్తితో కూడిన నృత్యాల నీరజనం. బుగ్గలపై గల వెలుగుతో క్రిక్కిరిసి అలరారే తల్లి ముక్కు పోగుకు రతనాల, భక్తి ప్రయత్నాలతో కూడిన నీరాజనం. ప్రజలందరినీ పసిబిడ్డలను చేసి పాలించే తల్లి చూపులకు అనురాగంతో, భక్తి కనబరుస్తూ నీరాజనం. పగడాలను మరపించేలా, సూర్యబింబంవలె అనిపించే తల్లి కుంకుమకు నిండైన, భక్తి మెండుగా గల నీరాజనం. తేనేటీగ పిల్లల వలే గాలికి అటు ఇటూ ఊగే తల్లి కురులకు నీటితో మరియు భక్తి భావములతో నీరాజనం. జగములోకెల్ల అతి సౌందర్యవతి, సర్వేశ్వరుని పత్ని అయిన తల్లి రూపమునకు భక్తితో నిలువెత్తు నీరాజనం.

కేవలం ప్రాస కోసం పదాలు కాకుండా మంచి భావ సంపద కూడా ఈ గీతంలో ఉన్నాయి. భక్తి విశ్వాసాలతో కూడిన నీరాజనాలు అమ్మ తప్పకుండా స్వీకరించి అనుగ్రహిస్తుంది.

వేదవతీ ప్రభాకర్ గారు ఈ మంగళహారతిని ఆలపించారు

10, మే 2015, ఆదివారం

ముందు తెలిసెనా ప్రభూ ఈ మందిరమిటులుంచేనా



ముందు తెలిసెనా ప్రభూ ఈ మందిరమిటులుంచేనా
మందమతిని నీవు వచ్చు మధుర క్షణమేదో.. కాస్త ముందు తెలిసెనా ప్రభూ..

అందముగా నీ కనులకు విందులుగా వాకిటనే
సుందర మందార కుంద సుమదళములు పరువనా
దారి పొడుగునా తడిసిన పారిజాతములపై
నీ అడుగుల గురుతులే నిలిచినా చాలును
ముందు తెలిసెనా ప్రభూ
ఈ మందిరమిటులుంచేనా
మందమతిని నీవు వచ్చు
మధుర క్షణమేదో.. కాస్త ముందు తెలిసెనా ప్రభూ..

బ్రతుకంతా ఎదురుచూతు పట్టున రానే రావు
ఎదుర రయని వేళ వచ్చి ఇట్టే మాయమౌతావు
కదలనీక నిముషము నను వదలిపోక నిలుపగ
నీ పదముల బంధింపలేను హృదయము సంకెల చేసి
ముందు తెలిసెనా ప్రభూ ఈ మందిరమిటులుంచేనా
మందమతిని నీవు వచ్చు మధుర క్షణమేదో.. కాస్త ముందు తెలిసెనా ప్రభూ..


శ్రీకృష్ణుని కోసం వేచి ఉన్న గోపిక భావనను దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు తమ కవితాఝరిగా ఇలా ఆవిష్కరించారు.

ప్రభూ! నీవు వచ్చే వేళ ముందే తెలిస్తే ఈ మందిరాన్ని ఈ మందమతి ఇలా ఉంచేనా! నీవు వచ్చే మధుర క్షణమేదో ముందు తెలిస్తే బాగుండు!

నీ  కనులకు విందుగా ఇంటి ముంగిట అందమైన మందార పూవుల రేకులతో పరచి అలంకరించనా? నీ అడుగు జాడలు నిలిచినా చాలు ప్రభూ! నీవు వచ్చే వేళ ముందే తెలిస్తే ఈ మందిరాన్ని ఈ మందమతి ఇలా ఉంచేనా! నీవు వచ్చే మధుర క్షణమేదో ముందు తెలిస్తే బాగుండు!

జీవితమంతా ఎదురుచూస్తునే ఉన్నాను ఒక పట్టున రానే రావు! ఎదురు చూడని సాయం వేళ వచ్చి చిటికెలో మాయమవుతావు! నా హృదయముతో నీ పాదాలను బంధించి, నన్ను వదిలి వెళ్లకుండా, కదలకుండా ఒక్క నిమిషం కూడా నిన్నుంచలేను ప్రభూ! నీవు వచ్చే వేళ ముందే తెలిస్తే ఈ మందిరాన్ని ఈ మందమతి ఇలా ఉంచేనా! నీవు వచ్చే మధుర క్షణమేదో ముందు తెలిస్తే బాగుండు!

కృష్ణశాస్త్రి కవితలా అని దేవులపల్లి వారి సాహితీసంపదను ఒక కొలబద్దగా సాహిత్యకారులు గౌరవించారు. దానికి కారణం లలితమైన, భావయుక్తమైన, హృదయాన్ని తాకే సాహిత్యాన్ని ఆయన తన రచనలలో గుప్పించారు. హృదయం ఎంత సున్నితంగా ఉండగలదో ఆయన సాహిత్యం మనకు నిరూపిస్తుంది. ఈ గీతంలో నాయిక స్వామికోసం పరితపించి, వేచి వేసారి, ఆయన వచ్చి క్షణంలో మటుమాయమైపోతే కలిగే భావనను ఒక సుందరసుమంలా నిలిపారు. పదధూళి, అడుగుల గురుతులు వంటి పదాలు ఆయన సాహిత్యంలో కోకొల్లలు.  తాను స్వామి వేరు అన్న భావనలో ఉన్న నాయిక నవరసాలను ఒలికిస్తుంది. రానంత కాలము విరహము, రాగానే కలహము, వెళ్లిపోగానే దిగులు...ఇలా ఎన్ని మధుర భావనలో ఆ నాయికలో. ఈ గీతంలో స్వామి తన వద్ద ఉన్న కొద్ది సమయం చాలక నిరాశ, ఆయన వచ్చే విషయం ముందే తెలిస్తే కలయికను మరింత మధురంగా చేద్దామనే తపన..అమితమైన ప్రేమ మరియు భక్తి....హృదయంతో పాదాలకు సంకెలలు వేయలేను అన్న సున్నితమైన సందేశం...దేవులపల్లివారికే చెల్లు.

భాషకు భావం ప్రాణం. భావానికి కవి హృదయంలోని నిర్మలత్వం పునాది. నిర్మలత్వానికి భక్తి, తదనుగుణ జనిత పారవశ్యానుభూతులు ఉచ్ఛ్వాస నిశ్వాసలు. వీటన్నిటికీ పరిపూర్ణమైన ప్రతిబింబం దేవులపల్లి వారి సాహిత్యం. అందుకే ఆయన ఆధునిక తెలుగు కవులలో అగ్రగణ్యుడు. మరే కవికీ అందనంత దూరంలో నిలించిన ధృవతార.

ఈ గీతాన్ని మేఘసందేశం చిత్రంలో ఒక అద్భుతమైన సన్నివేశంలో నాయికా-నాయకులపై చిత్రీకరించారు. గోదావరి ఒడ్డు, నాయిక కుటీరం, నాయకుని పడవ ప్రయాణం, తదుపరి భావావేశం, నాయిక నృత్య స్పందన...ఇదీ ఆ మధుర చిత్రంలోని ఈ గీతానికి గల ఘట్టం. సుశీలమ్మ గొంతులో తెలుగుదనం తేనెతో కలిసి రంగరించి పోసినట్లుగా జాలువారింది ఈ గీతం. రమేష్ నాయుడు గారి సంగీతం అజరామరం.

ఎంతెంత దయ నీది ఓ సాయీ



ఎంతెంత దయ నీది ఓ సాయీ నిను ఏమని పొగడను సర్వాంతర్యామీ

తొలగించినావు వ్యాధులు ఊదితో వెలిగించినావు దివ్వెలు నీటితో
నుడులకు అందవు నుతులకు పొంగవు పాపాలు కడిగేసే పావన గంగవు

భక్త కబీరే నీ మతమన్నావు భగవానుడే నీ కులమన్నావు
అణువున నిండిన బ్రహ్మాండంలా అందరిలో కొలువున్నావు

ప్రభవించినావు మానవ మూర్తివై ప్రసరించినావు ఆరని జ్యోతివై
మారుతి నీవే గణపతి నీవే సర్వ దేవతల నవ్యాకృతి నీవే

బాబా సాయిబాబా! బాబా మా సాయిబాబా! బాబా షిర్డి సాయిబాబా! బాబా షిర్డి బాబా!

- డాక్టర్ సి. నారాయణ రెడ్డి గారు

ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్న శ్రీకృష్ణుని పలుకుల ఫలితంగా 19వ శతాబ్దపు చివర హిందూ-ముస్లిం ఘర్షణలతో ఆశాంతికి గురవుతున్న మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ ప్రాంతంలో గోదావరీ నదీ తీరాన షిర్డీ సాయి అవతరించాడు. దత్తావతారునిగా కొలువబడ్డాడు. మతాలకు అతీతంగా మనుషులను ఏకం చేశాడు సాయి. డబ్బుకు అతీతంగా, బైరాగిగా జీవించి ఈనాడు కోట్లాది భక్తులకు సమర్థ సద్గురువుగా, దైవంగా నిలిచాడు. శ్రద్ధ మరియు సబురీ అన్న రెండు సిద్ధాంతాలతో నమ్మిన వారికి ఎన్నెన్నో మహిమలను చూపించాడు. అంధకారంలో ఉన్నవారి కన్నులు తెరిపించాడు. ఆయన జీవితంలో ప్రతి రోజూ ఒక అద్భుతమే. ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు అని చెప్పిన అన్నమయ్య మాటను అక్షరాలా నిజం చేశాడు. మహళ్సా మరియు శ్యామాకు మారుతిగాను, కొందరికి పాండురంగనిగా, కొందరికి శివునిగా, కొందరికి రామునిగా, కొందరికి గణపతిగా, ఎందరికో దత్తాత్రేయునిగా ఏ విధమున కొలిస్తే ఆ రూపంలో కనిపించి కరుణించాడు. యద్భావం తద్భవతని దర్శనమిచ్చాడు ధన్యుల జేశాడు. 

అహంకారం వీడి శరణన్న వారిని అనుగ్రహించాడు. చూపులేని వారికి చూపు ఇచ్చి, క్షయ కలిగిన వానికి క్షయరహితునిగా చేసి, పాము కాటుకు గురైన వారికి క్రోధంతో ఉపశమనం, పొయ్యిలో పడుతున్న బిడ్డను సిద్ధ శక్తులతో తన చేయి కాల్చుకొని రక్షిచాడు. ఊదీతో నిండు చూలాలి ప్రాణాలు కాపాడాడు, ఎన్నో రోగాలనుండి ఉపశమనం కలిగించాడు. ఇలా అగణితం సాయి మహిమలు. దురాశతో దీపాలకు నూనెను ఇవ్వను అని చెప్పిన వ్యాపారి కళ్లు తెరిపించటానికి నీటితో దీపాలు వెలిగిస్తాడు సాయి. సబ్ కా మాలిక్ ఏక్ హై అని పైకి చూపేవాడు. తాను దైవమని ఎన్నడూ చెప్పలేదు. కానీ, తన పాదాల వద్ద గంగాయమునల ధారలను సృష్టించాడు. 

సాయి పొగడ్తలకు లొంగలేదు, మాటలకు అందలేదు. భక్తుల పాపాలను కడిగే పావన గంగలా అవతరించాడు. ఇస్లాం మతస్థుడైనా కబీరు రామభక్తుడు. ఆతని సిద్ధాంతమే తన మతంగా, ఫకీరుగానే ఉంటూ రామనవమి ఉత్సవాలను నిర్వహించాడు సాయి. జ్ఞాన చక్షువులు తెరచి చూస్తే అందరిలోను తానే ఉండి బ్రహ్మాండమంతా నిండి ఉన్న పరమాత్మే సాయి. 

ఈ భావాన్ని డాక్టర్ సి. నారాయణ రెడ్డి గారు ఈ గీతంలో ఎంతో రమ్యంగా, భక్తిపూరితమైన పదాలతో పొందుపరచారు. సాయి భక్తులకు నియమ నిష్ఠలకన్నా భక్తి విశ్వాసాలు ఆయుధాలు. ఆచారాల కన్నా శ్రద్ధ, ఓర్పు మార్గాలు. అదే భావాన్ని, భిన్నత్వంలో ఏకత్వాన్ని, సర్వ మానవ సౌభ్రాతృత్వాన్ని నారాయణ రెడ్డి గారు ఈ గీతంలో సంపూర్ణంగా వ్యక్తపరచారు. 

ఎస్. జానకి గారి గళంలో ఈ గీతం వినండి

వెడలెను కోదండపాణి - త్యాగరాజస్వామి కృతి

వెడలెను కోదండపాణి అనుజ సౌమిత్రితో గూడి పుడమిలో జనులెల్ల పొగడ పూజితుడౌ మునితో గూడి శిరమన కొండెయు జార  వురమున హారములు మెరయ కరమున శరచాపములును ఘ...