14, మే 2015, గురువారం

కలి నరులకు మహిమలు దెలిపేమి ఫలమన లేదా



కలి నరులకు మహిమలు దెలిపేమి ఫలమన లేదా

ఇలను వెలయు వర వృషరాజులకటుకుల రుచి తెలియు చందముగానే

దారసుతులకై ధనములకై ఊరుపేరులకై బహు పెద్దతనముకై
సారెకు భక్త వేసము గొనువారికి తారక నామ శ్రి త్యాగరాజార్చిత 

కలియుగంలో స్వార్థపు ప్రయోజనాల కోసం భక్తులుగా చలామణీ అయ్యే మానవుని స్వభావాన్ని ఈ కృతి ద్వారా త్యాగరాజ స్వామి నిందిస్తున్నారు.

కలియుగంలో మానవులకు నీ నామ మహిమలు తెలిపి ఏమి ఫలమని నీవనలేదా? ఈ భూమిపై ధనికులనే పెద్దలకు అటుకుల రుచి తెలియని విధముగా ఈ మానవులకు తారక నామ మహిమ ఏ విధంగా తెలుస్తుంది? భార్యా బిడ్డల కోసం, ధనము కోసం, భూమి, పేరు కోసం, పెద్దరికం కోసం, కానుకల కోసం భక్తుని వేషం వేసే మానవులకు నీ నామ మహిమలు తెలిపేమి ఫలము? ఓ శివునిచే పూజించబడ్డ తారక నామ!

ఈ సంకీర్తనలో వర వృష రాజునకు అన్న పదానికి ఎద్దు అన్న అర్థం ఉన్నా, శ్రీమంతుడు అన్న అర్థమే సందర్భానికి సముచితమనిపించింది.

చాలా మంది మానవులు భక్తి తన అవసరాల కోసం, స్వార్థం కోసం నటిస్తారన్నది ఈ కీర్తన భావం. ఈ విధంగా జీవించే వారికి నామ మహిమ తెలిపినా ఉపయోగం లేదు. ఎందరో మహానుభావులను తరించిన నామం రామ నామం.   దాని గూఢము, మహిమ తెలియాలంటే భౌతికమైన విషయాలకు అతీతంగా ఆలోచించ గలగాలి. మన జీవన శైలి, జీవిత తత్త్వము ఈ నామ మహిమానుభూతికి ఎంతో తోడ్పడతాయి. కలియుగ లక్షణం అనేక మూలాంశాలలో అసంతులన వలన వచ్చే భావ కాలుష్యము. దీని వలన బుద్ధి ప్రకోపించి మనిషిని చెడు వైపు నెడుతుంది. తద్వారా, మానవుడు దైవ సంబంధమైన విషయాలను కూడా తన స్వార్థానికి వాడుకొని అసలు విషయాన్ని మరస్తాడు. అధోగతికి ఇది మొదటి మెట్టు. రామనామ మహిమలో రమించే వానికి వేరే ఏవీ పట్టవు. రామనామననేది ఒక రసాయనం (కలి మల హరణము) అని వాగ్గేయకారులు త్యాగయ్య, రామదాసు, అన్నమాచార్యుల వారు నొక్కి వక్కాణించారు. దానికి వారికి కలిగిన అనుభూతులు, దార్శనికాలు ప్రమాణం. అందుకే వారి సంకీర్తనలు చిరకాలం ప్రచారం పొందుతాయి. తారక నామ మంత్రామృతాన్ని పానం చేసిన ఈ వాగ్గేయకారులు దాని మహిమను అదే పవిత్రతో సంకీర్తనలలో వర్ణించి, తమ నాద శక్తిని దానికి ప్రాణంగా ధార పోశారు. అందుకే అవి కూడా మంత్ర సమానమై ఈ కలికాలంలో మనకు సన్మార్గాన్ని చూపుతున్నాయి.

కుంతలవరాళి రాగంలో ఈ కృతి కూర్చబడింది. బాలమురళీకృష్ణ గారి గాత్రంలో వినండి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి