26, జూన్ 2011, ఆదివారం

అన్నమయ్య నాదోపాసన - అన్ని మంత్రములు ఇందే ఆవహించెను

హరియవతార మీతడు అన్నమయ్య
కలియుగ దైవమైన వేంకటేశుని మంత్రాన్ని నుతిస్తూ తాళ్లపాక అన్నమాచార్యులు ఒక దివ్యమైన కీర్తన రచించారు. మంత్రాలన్నీ ఈ వేంకటేశ మంత్రములో నున్నవని దీని సారము. అమృతవర్షిణి రాగంలో అమృతాన్ని కురిపించారు అన్నమయ్య గురుదేవులు. సంకీర్తనా శైలిలో ఆనాటి వాడుక భాషలో, సుళువుగా పామరునికి కూడా అర్థమయ్యే భాషలో తన రచనలు చేసి అన్నమయ్య ఎప్పటికీ ప్రతి తెలుగువారి హృదయ కమలములోనూ సుస్థిర స్థానం ఏర్పచుకున్నారు. అవతారమంటే ఒక ముఖ్యమైన మార్పుకు నాంది వేసి దానిని సఫలీకృతం చేయటమే కదా? మరి ఆ ఏడుకొండలవాసుని వేల కీర్తనలలో నుతించి ఆ వేంకటేశ ప్రాభవాన్ని కలియుగ వాసులకు అందించారు అన్నమయ్య. అందుకే ఆయన అవతారము పూర్ణము, ధన్యము మరియు సాఫల్యము.

 సాహిత్యం:

అన్ని మంత్రములు ఇందే ఆవహించెను - వెన్నతో నాకు గలిగె వేంకటేశు మంత్రము


నారదుడు జపియించె నారాయణ మంత్రము - చేరె ప్రహ్లాదుడు నారసింహ మంత్రము
కోరి విభీషణుడు చేకొనె రామ మంత్రము - వేరె నాకు గలిగె వేంకటేశు మంత్రము


రంగగు వాసుదేవ మంత్రము ధృవుడు జపియించె - అంగవించె కృష్ణ మంత్రము అర్జునుడు
ముంగిట విష్ణు మంత్రము మొగిశుకుడు పఠించె - వింగడమై నాకు నబ్బె వేంకటేశు మంత్రము


ఇన్ని మంత్రముల కెల్ల ఇందిరనాథుడె గుఱి - పన్నిన దిదియే పరబ్రహ్మ మంత్రము
నన్ను గావగలిగేబో నాకు గురుడియ్యగాను - వెన్నెల వంటిది శ్రీవేంకటేశు మంత్రము


వినా వేంకటేశం న నాథో న నాథః సదా వేంకటేశం స్మరామి స్మరామి

భావము:

"చిన్నప్పుడే నాకు అందిన ఈ వేంకటేశ మంత్రములో అన్ని మంత్రాలు నిలయమై ఉన్నాయి. నారదుడు నారాయణ మంత్రము జపించగా, ప్రహ్లాదుడు నారసింహ మంత్రమును పొందాడు. సంకల్పముతో విభీషణుడు రామ మంత్రమును పొందగా, నాకు ప్రత్యేకముగా వేంకటేశ మంత్రము కలిగినది. ధ్రువుడు అందమైన వాసుదేవ మంత్రమును జపించగా, కృష్ణుని మంత్రమును అర్జునుడు భక్తితో సాధన చేసెను. చిలుక అయిన శుకుడు ముక్కుతో విష్ణు మంత్రమును పఠించగా, నాకు అనన్యమైన ఈ వేంకటేశ మంత్రము అబ్బినది. ఇన్ని మంత్రములకు శ్రీహరిని కనుటయే లక్ష్యము. ఇదియే తథ్యముగా పరబ్రహ్మ మంత్రము. నన్ను కాచుటకు నా గురువులిచ్చిన వెన్నెలవంటిది ఈ వేంకటేశు మంత్రము." - అన్నమయ్య

అంతరార్థము:

శ్రీ వేంకటేశుడే పరబ్రహ్మము. ఆయన మంత్రము మోక్షమునకు ఏకైక సాధనము. అంతకు మునుపు ఉత్తమోత్తములైన హరి భక్తులు (నారదుడు, ప్రహ్లాదుడు, విభీషణుడు, ధ్రువుడు, అర్జునుడు, శుకుడు) ఆ పరమాత్ముని వేర్వేరు అవతారముల మంత్రములతో కొలిచి మోక్షమును పొందారు. నాకు ప్రత్యేకమైన, అనన్యమైన వేంకటేశు మంత్రము చిన్నతనములోనే గురువుల అనుగ్రహము వలన వెన్నెల లాగా కలిగినది. అన్ని మంత్రములు ఈ వేంకటేశ మంత్రములో స్థిరమై ఉండుట వలన ఇదియే పరబ్రహ్మము, మోక్షకారకము అని అన్నమయ్య వేంకటేశుని మంత్ర మహిమను కొనియాడారు. కలియుగములో శ్రీనివాసుని స్మరించుట మించి మోక్షమునకు సులువైన మార్గము లేదని ఆయన నొక్కి వక్కాణించారు. అందుకే ఆయనను 'హరి అవతారమీతడు అన్నమయ్య' అని కొలిచారు శిష్యకోటి. మన పాపములను హరించే శ్రీ వేంకటేశుని పాదపద్మములకు, అన్నమయ్య గురు చరణములకు నీరాజనములు.

విద్వాంసులు, సహృదయులు, గురువులు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాదు గారు ఈ సంకీర్తనను అమృతవర్షిణి రాగంలో వెన్నెలరేయి అంత చల్లగా, వేసవి మామిడి పండంత తీయగా ఆలాపించారు. వారికి శిరసు వంచి పాదాభివందనములు.

8, మే 2011, ఆదివారం

శంకర జయంతి - సంగ్రహ చరిత్ర

(కంచి కామకోటి పీఠం వారి వెబ్ సైటు, గీతా ప్రెస్సు వారి వివేక చూడామణిలోని శంకరులపై ఉపోద్ఘాతము ఆధారంగా)

సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం
అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం


పరమశివుని మొదలు, ఆది శంకరుల మధ్యగా, నా గురువులు రమణరావు గారి వరకు ఉన్న గురు పరంపరకు వందనములు.

శ్రుతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం
నమామి భగవత్పాద శంకరం లోకశంకరం

ఆది శంకరుల జయంతి నేడు. శంకరశ్శంకరస్సాక్షాత్ - శంకరాచార్యులంటే సాక్షాత్తు శంకరులే అని చెబుతాము. ఆ ఆది శంకరుల కృప వలన మనకు ఈ రోజు హిందూ మతములో స్పష్టత, పారదర్శకత, లోతు, ఐక్యత ఉన్నవని అనుటలో అతిశయోక్తి ఏ మాత్రం లేదు. 

ఎందరో మహర్షుల, ఋషుల నోట అంతర్యామి వాక్కులుగా పలుకబడిన శక్తి వేదములుగా ప్రకాశిస్తున్నాయి. ఎవరో రచించి, మరెవరో పరిశీలనము, విమర్శ చేసేందుకు అవి పురాణాలు, నవలలు కావు. విశ్వవ్యాప్తుని మనోకమలము నుండి స్వయంగా మహాపురుషుల నోట వెలువడిన సచ్చిదానందములు వేదములు. అంతటి వేదములకు కూడా వక్ర భాష్యము చెప్పి, భారతీయ సమాజంలో విభజన కలిగించి, మూఢ ఛాందస భావాలను ప్రేరేపించి అన్యమతముల వైపు ప్రజలను మళ్లించిన సమయంలో ఆ పరిస్థితిని చక్క దిద్దటానికి శంకరులు కాలడిలో శివ గురు శక్తితో ఆర్యాంబ గర్బమున ఉత్తరాయణ పుణ్య కాలమున వైశాఖ శుద్ధ పంచమి నాడు ఆర్ద్ర నక్షత్రములో అవతరించారు. చిన్ముద్రతో, మౌనంతో జ్ఞానాన్ని వ్యాపింప జేసే దక్షిణామూర్తి రూపమైన పరమ శివుడు ఈ దంపతులను ఆశీర్వదించగా శంకరులు ఉదయించారు. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు ఆయన దైవిక శక్తి, మార్గము కాలడిలో ప్రస్ఫుటించాయి.

మూడవ యేటనే తండ్రిని కోల్పోయిన శంకరులకు ఐదవ యేట ఉపనయన సంస్కారము జరిగింది. బ్రహ్మచర్య దీక్షలో భాగంగా మాధుకరం కోసం భిక్షాటనకు వెళ్లిన శంకరులకు ఒక పేద బ్రాహ్మణుని యింటి యిల్లాలు వద్ద ఉసిరికాయ తప్ప ఏమీ దొరకలేదు. ఆమె దుస్థితికి కరిగిన శంకరులు లక్ష్మీదేవిని కనకధారా స్తోత్ర రూపంలో ప్రార్థించగా ఆ తల్లి కరుణించి ఆ ఇంట బంగారు ఉసిరికలు కురిపించి వారి దారిద్ర్యాన్ని పోగొట్టిందిట. 

దిన దిన ప్రవర్థమాన మవుతున్న శంకరులకు మహర్షులు వచ్చిన దేశాన్ని ఉద్ధరించాలన్న కర్తవ్యాన్ని గుర్తు చేశారు. ఒకరోజు బాల శంకరులు నదీస్నానము చేస్తుండగా ఒక మొసలి అతని కాలిని నోట కరచుకుంటుంది. కేకలు పెడుతున్న కుమారుని చూసి ఆర్యాంబ భయపడుతుంది. ఏమి చెయ్యాలో తెలియక ఆమె దుఃఖిస్తుంది. అప్పుడు శంకరులు తల్లితో తన జీవితం ముగియబోతోందని, తల్లి తన సన్యాసానికి అంగీకరిస్తే తాను సన్యాసిగా రెండవ జీవితం ప్రారంభిస్తానని అంటాడు. తల్లి అనుమతితో సన్యాసం స్వీకరించి శంకరులు భారత దేశ యాత్ర మొదలు పెడతారు.

ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నర్మదానదిని తన కమండలములో బంధించిన శంకరుని చూసి ముగ్ధులైన గురు గోవింద భగవత్పాదులు శంకరులను తన శిష్యునిగా స్వీకరిస్తారు. గోవింద భగవత్పాదులు శంకరులకు వేదవేదాంగాలు ఉపదేశిస్తారు. ఆత్మ, పరమాత్మ ఒక్కటే అన్న అద్వైత సిద్ధాంతాన్ని కూడా శంకరులకు బోధిస్తారు. ఆ సందేశాన్ని ప్రపంచానికి చాటమని శంకరులను ఆశీర్వదించి పంపిస్తారు.

శంకరులు కాశీకి పయనమవుతారు. అక్కడికి చేరే సమయానికి ఆయనకు చాలా మంది శిష్యులు ఏర్పడుతారు. ఒకసారి ఒక శిష్యుడు నది ఈవలి ఒడ్డున గురువుల వస్త్రములు ఆరవేస్తుండగా శంకరులు అతనిని ఆవలి ఒడ్డు నుండి పిలుస్తారు. గురువుగారి పూర్తి ధ్యాసతో ఆ శిష్యుడు అడుగులు వేస్తూ నదిని దాటుకుంటూ వెళతాడు. ఆ శిష్యుడు అడుగు వేసిన ప్రతిచోట ఒక పద్మము వెలసి ఆయనను నీట మునగ కుండా కాపాడుతుంది. అంతటి మహిమాన్వితమైన గురుకృపను పొందిన ఆ శిష్యుడు పద్మపాదునిగా పేరు పొందాడు.

ఒక రోజు శంకరులు గంగానదిలో స్నానం ముగించుకుని శిష్యులతో కలిసి విశ్వనాథుని మందిరానికి వెళుతున్నప్పుడు ఒక నిమ్న జాతికి చెందిన వాడు ఎదురు పడతాడు. అప్పటి ఆచారాల ప్రకారం శంకరులు  వాడిని తప్పుకో, దారి విడువుము అని అంటారు. అప్పుడా చండాలుడు నీవు తప్పుకోమంటున్నది ఈ దేహమునా? నా ఆత్మనా? అని ప్రశ్నిస్తాడు. అప్పుడు శంకరులు తన అహంకారానికి పశ్చాత్తాపపడి ఆ చండాలుని పరమశివునిగా గ్రహించి ప్రణమిల్లుతారు. ఆ సందర్భంలో చండాలుని రూపములో ఉన్న శివుడు శంకరుని ఉద్దేశించి వేసిన ప్రశ్నలు మొదటి రెండు శ్లోకములు, అటు తర్వాత శంకరుల నోట వెలువడిన శ్లోకాలు మనీషా పంచకంగా పేరొందాయి. అద్వైతామృత సారమైన ఈ మనీషా పంచకం పరబ్రహ్మమొక్కటే అన్న సందేశాన్ని శంకర భగవత్పాదుల నోట మనకు అందించబడినది. తనలో ఉన్న ఆఖరి దుర్గుణమును ఈ సందర్భముగా శంకరులు దగ్ధము చేసుకునే అవకాశమును ఆ పరమ శివుడు చండాలుని రూపములో కలిగించాడు.

బ్రహ్మసూత్రాల కర్త అయిన వ్యాసుల వారి అనుగ్రహంతో వాటి భాష్యాలను అద్వైత సిద్ధాంతంతో పాటు దేశవ్యాప్తంగా ప్రచారం చేయటానికి పయనమవుతారు శంకరులు. దేశాటన చేస్తూ కాంచీపురంలో కామకోటి పీఠం, శృంగేరి శారదా పీఠం వంటి ఎన్నో క్షేత్రాలను స్థాపించారు. ఎన్నో వేల దేవాలయాలను పునరిద్ధరించారు. తిరువైమరుదూరు, తిరుచ్చి, శ్రీశైలము మొదలైన ప్రదేశాలలో ఎన్నో అద్బుతమైన స్తోత్రాల ద్వారా అక్కడి పుణ్యక్షేత్రాలను పునరుత్థానం చేసారు.

హఠకేశ్వరం అడవులు శ్రీశైల ప్రాంతంలో ఉన్నాయి. ఇవి కీకారణ్యములు. ఇక్కడ కాపాలికులు నివసించే వారు. కాపాలికులు శ్మశానాలలో ఉంటూ ఆటవిక జంతు మానవ బలుల ద్వారా దేవతలకు ప్రీతి కలిగించే వారు.  ఆది శంకరులు ఒకసారి ఇక్కడ తపస్సు చేస్తుండగా ఒక కాపాలికుడు వచ్చి శంకరులను ఆ పరమేశ్వరునికి బలిగా రమ్మని అడుగుతారు. అందుకు శంకరులు సమ్మతించి బలికి సిద్ధమయ్యారు. కాపాలికుడు శంకరుల తల నరుకబోగా విష్ణుమూర్తి నృసింహ రూపంలో ప్రత్యక్షమై కాపాలికుని సంహరిస్తాడు. ఆ సందర్భముగా ఆది శంకరులు ఆ నరహరిని స్తుతిస్తూ కరుణారస పూరితమైన, శరణాగతితో నిండిన లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని రచించారు.

శంకర భగవత్పాదులు కాశీలో ఉన్న సమయంలో అక్కడ నివసించుచున్న వివిధ మతముల వారి వాదనను ఖండిస్తారు. అక్కడినుండి కురుక్షేత్రమునకు, తదుపరి బదరికాశ్రమునకు వెళ్లి ఎన్నో రచనలు చేశారు. ఆయన రచనలు చాల వరకు కాశీలో, బదరికాశ్రమములో చేసినవే. తదుపరి శంకరులు ప్రయాగ, అటు తర్వాత మాహిష్మతీ పురము వెళ్తారు. అక్కడ మండన మిశ్రుల వద్ద శాస్త్రార్థ విచారము మొదలు పెడతారు. మధ్యవర్తిగా మండన మిశ్రుని భార్య అయిన భారతీదేవి వ్యవహరిస్తుంది. చివరకు మండన మిశ్రులు ఓడిపోతారు. ఆయన శంకరుల శిష్యరికము స్వీకరించి సురేశ్వరాచార్యులుగా ప్రసిద్ధి పొందారు. భర్త ఓటమి పాలు కాగా భారతీదేవి శాస్త్రార్థ విచారము కొనసాగిస్తుంది. శంకరులను కామ శాస్త్రమున ప్రశ్నిస్తుంది. దీనికి సమాధానం చెప్పుటకు శంకరులు మరణించిన అమరుక మహారాజు శరీరమును యోగబలముతో పరకాయ విద్యచే ప్రవేశించి కామ శాస్త్రమును అభ్యసిస్తారు. భర్త సన్యాసి కాగా భారతి బ్రహ్మ ప్రాప్తికై సిద్ధపడగా శంకరులు ఆమెకు నచ్చజెప్పి శృంగేరి తీసుకువెళ్తారు. అచ్చట ఉండి అధ్యాపనము గావించమని అడిగారు. భారతీదేవి ద్వారా విద్యాభ్యాసము జరిగినందునే శృంగేరీ శారదా పీఠములలో శిష్యసాంప్రదాయములు భారతీ సాంప్రదాయములుగా ప్రసిద్ధి చెందినవి.

మధ్య భారతమున విజయము పొందిన శంకరులు దక్షిణ దేశమునకు వెళ్తారు. మహారాష్ట్రములో శైవులను, కాపాలికులను ఓడిస్తారు. ఆ తరువాత తుంగభద్రా తీరమును చేరి అచట మందిరమును నిర్మించి శారదాదేవిని ప్రతిష్ఠిస్తారు. సురేశ్వరాచార్యులను ఇచ్చట ఆచార్యులుగా నియమిస్తారు. అటు తర్వాత పురీ వెళ్లి గోవర్ధన పీఠమును స్థాపించి పద్మపాదాచార్యులను అచ్చట ఆచార్యులుగా నియమిస్తారు. దక్షిణాదిన చోళ, పాండ్య రాజుల సహాయముతో అక్కడి శాక్తేయ, గాణాపత్య కాపాలిక సాంప్రదాయములలోని అనాచారములను దూరము చేస్తారు. ఈ విధంగా దక్షిణాదిన అంతటా ధర్మధ్వజమును ప్రతిష్ఠిస్తారు. అటు తరువాత ఉత్తర భారతము వైపు దృష్టి పెట్టి ఉజ్జయినిలో భైరవుల భీషణ సాధనములను నిలిపివేస్తారు. అక్కడినుండి ద్వారక వెళ్లి అక్కడ మఠమును స్థాపించి శిష్యుడైన హస్తామలకాచార్యులను అచార్యులుగా నియమిస్తారు. తరువాత గంగానదీ పరీవాహ ప్రాంతములలో పండితులను ఓడించి, కాశ్మీరమున శారదా క్షేత్రము చేరి అక్కడి పండితులను కూడా ఓడించి స్వమతమును ప్రతిష్ఠిస్తారు. అచటినుండి కామరూపము వెళ్లి అచట శైవులను ఓడించి బదరికాశ్రమము వెళ్తారు.

తల్లి ఆర్యాంబ మరణించినప్పుడు సన్యాసియైన తాను ఆమెకు ఉత్తరక్రియలు చేయకూడదని తన కంటి నుండి అగ్నిని సృష్టించి ఆమె చితికి నిప్పు రాజిల్ల జేస్తారు. తన అనుపమానమైన శక్తితో మూకాంబిక, కోటచాద్రి, తిరుమల, పురీ, ద్వారక మొదలైన క్షేత్రాలను అత్యంత మహిమాన్విత క్షేత్రాలుగా తీర్చిదిద్దుతారు శంకరులు.భక్తి, జ్ఞాన, వైరాగ్యములతో  మానసికోత్థానం కోసం, హిందూ మత శాఖల, పీఠాల ఐక్యత కోసం, ఉనికి కోసం అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు.  ఎందరో పండితులు, విమర్శకులను ఒప్పించి దేశ వ్యాప్తంగా పంచాయతన పద్ధతిలో పీఠాలు, మఠాలు, క్షేత్రాలు స్థాపిస్తారు.  పామరులనుండి పండితుల వరకు వారి వారి చేతనావస్థను బట్టి స్తోత్రాలు, ప్రకరణలు, లోతైన ఆధ్యాత్మిక గ్రంథాలు రాసి,  ఈనాటి వరకు ఆ జ్ఞాననిధి, ఆధ్యాత్మిక వారసత్వ సంపద నిలిచేలా చేశారు.

తన యాత్రల చివరలో శంకరులు బదరీ క్షేత్రానికి వెళ్లినప్పుడు శ్రీ మహావిష్ణువు ఆయనను అలకనంద నదిలో ఉన్న తన విగ్రహాన్ని ప్రతిష్ఠించి అక్కడ ఒక క్షేత్రాన్ని ఏర్పాటు చేయమని నిర్దేశిస్తాడు. శంకరులు అక్కడ బదరీనారాయణ క్షేత్రాన్ని, జ్యోతిర్మఠాన్ని స్థాపించి, తోటకాచార్యులను అక్కడ ఆచార్యులుగా నియమించి, కేదారనాథ్ క్షేత్రము వెళ్లి  32 వ ఏట ఆ పరమాత్మలో ఐక్యమవుతారు.

ఆ శంకరుల కృప వలననే మనకు నేడు అష్టాదశ శక్తి పీఠములు, చార్ ధామ్ మొదలైన పుణ్య క్షేత్రాలు, వాటి వలన మనకు అత్యున్నతమైన హైందవ అద్వైత సిద్ధాంత సారమైన జీవనశైలి, సమాజము భాసిల్లుతున్నాయి.

గాణాపత్యము, శాక్తేయము, సౌరము, వైష్ణవము, శైవము - ఈ విధంగా విభజింపబడ్డ హిందూమత ఆరాధానా విధానాన్ని పంచాయతన విధానం ద్వారా ఏకం చేసి భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలకు ఒక అనుపమానమైన ఆధ్యాత్మిక వేదికను వెలకట్టలేని జీవనశైలిగా ఇచ్చారు శంకరులు. 

శంకరుల రచనలు:

ఆదిశంకరుల రచనలు మూడు రకాలుగా విభజించవచ్చు. మొదటిది ఆధ్యాత్మికంగా బాగా ముందడుగు వేసిన వారికి - ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత మీద రాసిన భాష్యాలు. రెండవది వీటి సారాన్ని ప్రకరణలుగా రాసినవి. మూడవది దేవతా స్తోత్రాలు.

శంకరులు మొత్తం 272 గ్రంథములు రచించారని నానుడి. వీరి కొన్ని రచనలలో బ్రహ్మ సూత్ర భాష్యము, ఉపనిషద్భాష్యము, గీతా భాష్యము, విష్ణు సహస్రనామ భాష్యము, సనత్సుజాతీయ భాష్యము, హస్తామలక భాష్యము, లలితా త్రిశతీ భాష్యము, వివేకచూడామణి, ప్రబోధసుధాకరము, ఉపదేశ సహస్రి మొదలగునవి.

ఆయన చేసిన స్తోత్రాల్లో మనీషా పంచకము, సాధన పంచకము, భజగోవిందము, గోవిందాష్టకము, పాండురంగాష్టకము, శివ సువర్ణమాలా స్తోత్రము, అర్థనారీశ్వర స్తోత్రము, కాలభైరవాష్టకము, దక్షిణామూర్తి స్తోత్రము, నిర్వాణ షట్కము, అన్నపూర్ణాష్టకము, గణేష పంచరత్నము, అచ్యుతాష్టకము, మహిషాసుర మర్దిని స్తోత్రము, త్రిపురసుందరీ స్తోత్రము, భుజంగాష్టకాలు, భవాన్యష్టకము, దేవీనవరత్నమాలికా, విశ్వనాథాష్టకము, ఉమామహేశ్వర స్తోత్రము ఇలా ఎన్నో సామాన్య జనులకు జీవన దిశానిర్దేశము చేసే స్తుతులను రచించారు. ఆధ్యాత్మికంగా ఇంకొక పై మెట్టులో సౌందర్యలహరి, శివానందలహరి, వివేకచూడామణి మొదలైనవి, ఇంకొక పై మెట్టుపై భాష్యాలు.

ఇవే కాక, ఆనంద లహరి, అనాత్మ విగర్హణ ప్రకరణము, అపరోక్షానుభూతి, ఆత్మ బోధ, ఆత్మ పంచకము, భగవాన్ మానస పూజ, బ్రహ్మ జ్ఞానావళి మాల, దశ శ్లోకీ, ధన్యాష్టకము, గంగాష్టకము, గౌరి దశకము, గురు అష్టకము, గురు పాదుకా పంచకము, హనుమత్ పంచరత్నము, జ్యోతిర్లింగ స్తోత్రము, కాశీ పంచకము, కౌపీన పంచకము, మంత్ర మాతృక పుష్పమాలా స్తవము, మాయా పంచకము, నిర్గుణ మానస పూజ, నిర్వాణ మంజరి, పంచీకరణము, పాండురంగాష్టకము, ప్రశ్నోత్తర రత్న మాలిక, ప్రాతఃస్మరణ స్తోత్రము, రంగనాథాష్టకము, శత శ్లోకీ, సిద్ధాంత తత్త్వ బిందు, స్వరూపానుసంధానాష్టకము లాంటి అద్భుతాలు ఎన్నో రచించారు.
 
కొన్ని స్తోత్రాల వివరాలు.

విష్ణు షట్పది:

మనస్సుపై స్వాధీనము కొరకు విష్ణుని ప్రార్థిస్తూ రచించిన ఈ స్తోత్రము మానసిక ప్రశాంతతకు చాలా తోడ్పడుతుందని నమ్మకం. భయము, అహంకారముతో కప్పబడిన ఈ జీవితం భవ సాగరమై మరిన్ని జన్మలకు కారణము అవుతుంది. కావున, వాటిని అధిగమించి, మనసును లగ్నము చేసి, ధ్యేయము వైపు ధ్యానించి సత్య జ్ఞాన ప్రాప్తికి కృషి చేయవలెను అని ఈ స్తోత్రము ద్వారా మనకు ఆది శంకరులు చక్కని సందేశాన్ని అందించారు. భయమే మృత్యువు, భయమే శత్రువు. అహంకారమే పతనము. అహంకారమే అత్యంత ప్రమాదకరమైన శత్రువు. వాటిని అధిగమించటం  ఆధ్యాత్మిక పరమార్థము. అదే పరమాత్ముని దర్శనము. అదే మోక్ష కారకము.

సాధనా పంచకము:

శంకరులు అద్వైత సిద్ధాంతమును కాలి నడకలో భారత దేశమంతా తిరుగుతూ ప్రచారం చేసి, దానికోసం కావలసిన పీఠాలను, ధార్మిక క్షేత్రాలను స్థాపించారు. సద్గురు సాంగత్యము, శిష్యరికము, దైవారాధన, నిత్య నైమిత్తిక చర్యలు, ధ్యానము, యోగము, సత్సంగము, భక్తి మొదలైన సాధనాలతో పరబ్రహ్మ తత్త్వమును గ్రహించి, అనుభూతి పొందవచ్చు అని శంకరులు మనకు దివ్యామృతమును అందజేశారు.

దీనికోసం ఏమి చేయాలో ఒక ఉన్నతమైన స్థాయిలో ఐదు సూత్రాలను ఆదిశంకరులు మనకు సాధనా పంచకం రూపంలో ఇచ్చారు. ఇందులో విషయము చాలా సులభముగా అనిపించినా, అది ఆచరణలో పెట్టటానికి ఎంతో నియమము, నిగ్రహము, పట్టుదల అవసరం. ఉదాహరణకు - వేదములను అధ్యయనం చేద్దాము - అనేది ఒక ధ్యేయము. మరి దానికి సరైన గురువు, పాఠశాల, క్రమశిక్షణతో కూడిన దైనందినచర్య, అభ్యాసము, ఏకాగ్రత, సాధన - ఇవన్నీ కావాలి. అలాగే, అహంకారము వదలుట అనేది ఒక ధ్యేయము - మరి దీనికి మన అలవాట్లు, మానసిక స్థితి ఏవిధంగా ఉండాలో ఊహించండి. నియమిత సాత్త్విక ఆహారము తీసుకోవటం, సుఖములకు, దుఖములకు అతీతంగా, రాగద్వేషాలు లేకుండా - ఒక రకమైన ఉదాసీన వైఖరిని అలవరచుకోవాలి. దీనికి మళ్లీ పైన చెప్పిన గురువు, అభ్యాసము, సాధన, క్రమశిక్షణ అన్నీ అవసరం.సాధనా పంచకాన్ని ఒక శిఖర మార్గముగా తీసుకుని, దానిలో ఉన్న ప్రతి పరమాణు ధ్యేయములకు సద్గురువును ఆశ్రయించి, శ్రుతులను అనుగమిస్తూ, జీవన శైలిలో వాటిలో పయనిస్తూ, అవరోధాలను అధిగమిస్తూ అవరోహణ చెయ్యాలి. దీనికి భక్తి, జ్ఞానము, వైరాగ్యము, పరిశ్రమ, సహనము, శ్రద్ధ అన్ని తోడు చేసుకోవాలి. అప్పుడే ఆ సచ్చిదానంద స్థితిని పొందగలరు. ఈ పంచకము లోని భావమును, నిగూఢమైన ఆశయములను, సందేశమును తెలుసుకోవలసినదిగా సాధకులకు శంకరుల ఉద్దేశము. 

శివ సువర్ణమాలా స్తుతి:

యాభై శ్లోకాలలో లయ బద్ధమైన పదాలు,  భక్తి, సర్వస్య శరణాగతి, ఆత్మానుభూతి, లోతైన వివేచనము తో సాగే సువర్ణమాల స్తోత్రమును ఆ అపర శంకరుడు ఆది శంకరులు రచించారు.  సాంబ = స+ అంబ - నిరంతరం ఆ జగదంబ అయిన పార్వతితో కూడి అర్థనారీశ్వరుడై ఉన్నాడు కాబట్టే ఆ పరమ శివుడు సాంబుడు అయినాడు.  పార్వతీ సమేతుడవైన  శివా! శంభో! నీ పాదములకు నమస్కారములు. నాకు శరణునిమ్ము అనే అంతరార్థంతో సాగే ఈ స్తోత్రములో శివుని అశేష కీర్తి,  అగణిత గుణ గణములను ఆది శంకరులు నుతించారు. స్తోత్రము ముందుకు సాగుతున్న కొద్దీ ఆ పరమశివుని వర్ణన, కైలాసము ఎదుట ఉందా అన్న భావన ఆదిశంకరులు కలిగిస్తారు. యాభై శ్లోకాలు అనర్గళంగా ఒకే దేవతపై రాయాలంటే ఆత్మ జ్ఞాన పరిపూర్ణుడై, దైవ సాక్షాత్కారము కలిగి, ఎల్లప్పుడూ ఆ దైవము కన్నుల ఎదుట నిలిచి ఇటువంటి అనుభూతిని కలిగిస్తే, ఆ ఆవేశం స్తోత్ర రూపంలో వెలువడి ఇన్ని వేల ఏళ్ళు నిలబడ గలుగుతుంది.

ఆయన మహిమను తెలిపే ఒక స్తుతి - తోటకాష్టకము:

ఆ శంకరుని శిష్యులలో ఒకడైన ఆనందగిరి తన గురువులను స్తుతిస్తూ రచించిన తోటకాష్టకం ఆ శంకరుల లక్షణాలను, వైభవాన్ని, ఆధ్యాత్మిక శక్తిని ప్రతిబింబిస్తుంది.ఆనందగిరి ఈ స్తోత్రాన్ని తోటక ఛందములో రాయటం వలన దీనికి తోటకాష్టకం అని పేరు వచ్చింది. దీని వెనక ఒక చిన్న కథ ఉంది.

శంకరుల శిష్యులలో ఆనందగిరి కొంత మంద బుద్ధి. కానీ, అమితమైన గురు భక్తి కలవాడు. నిరంతర గురు సుశ్రూషలో ఉండేవాడు గిరి. ఒక రోజు, శంకరులు తన ప్రాతః కాల దినచర్యలో భాగంగా ఉపనిషత్ ప్రవచనం ఆరంభించారు. ఆ సమయంలో శిష్యులంతా శాంతి పాఠం మొదలు పెట్టారు. కానీ, గిరి మాత్రం అక్కడ లేదు.  గురువు గారి వస్త్రములు ఉతకటానికి నది దగ్గరకు వెళ్ళాడు. శంకరులు ఇది గమనించి మిగిలిన శిష్యులను గిరి వచ్చేదాకా వేచి ఉండమని పలుకుతారు. అప్పుడు పద్మపాదుడనే శిష్యుడు గర్వముతో 'వాడు మూర్ఖుడు, వానికి శాస్త్రములు నేర్వవలసిన అర్హత లేదు. వానికోరకు ఎందుకు వేచి ఉండటం' అని అంటాడు. శంకరులు పద్మపాదుని గర్వము అణచుటకు, తన దైవ శక్తితో ఆనందగిరికి సకల శాస్త్ర పరిజ్ఞానమును క్షణకాలములో కలిగేలా చేస్తారు. నది వద్దనుండి తిరిగి వచ్చిన ఆనందగిరి గురువుగారిని నుతిస్తూ తోటకాష్టకాన్ని ఆశువుగా పఠించాడు.

మిగిలిన శిష్యులకు సిగ్గు, విస్మయం కలిగించేలా అతి కష్టమైనా తోటక ఛందములో ఎనిమిది శ్లోకాలతో అద్భుతంగా సాగుతుంది తోటకాష్టకం. అటు తర్వాత, ఆనందగిరి శృతి సార సముద్ధరణ అనే ఇంకొక రచన కూడ తోటక ఛందములో చేస్తాడు. శంకరుల నలుగురు ముఖ్య శిష్యులలో ఒకడై , తోటకాచార్యులుగా పిలవబడి, గురువులచేత బదరీలోని జ్యోతిర్మఠం నడపటానికి నియమించబడతాడు.

ముగింపు:

ఎంతో మంది స్వాములు, యతులు తర్వాత భారత దేశంలో జన్మించి, ఆధ్యాత్మిక సందేశాన్ని ప్రచారం చేశారు, కానీ శంకరులు సుస్థిర పరచిన అద్వైత సారము, ధార్మిక సిద్ధాంతాలు, పద్ధతులు ఇప్పటికీ చెక్కు చెదరకుండా, ప్రామాణికాలై కాలపు ఒడిదుడుకులను తట్టుకొని హిమాలయముల వలె ఉన్నతముగా నిలిచాయి. ఇట్టి ఆధ్యాత్మిక సంపదను ఇచ్చిన ఆ పరమ శివ రూపమైన జగద్గురువులకు శత సహస్ర పాదాభివందనములు. 

జయ జయ శంకర! హర హర శంకర!

నా ఈ బ్లాగులో కొన్ని శంకరుల రచనలపై వ్యాసాలు:
  1. శ్రీమచ్ఛంకరాచార్య కృత కాశీ పంచకము - తాత్పర్యము
  2. శంకర విరచిత భవాన్యష్టకం, తాత్పర్యము
  3. శ్రీమచ్ఛంకరభగవత విరచిత మనీషాపంచకం - తాత్పర్యము
  4. శ్రీ శంకరభగవత్పాదకృత లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రము తాత్పర్యము 
  5. శ్రీమచ్ఛంకరభగవతః కృత కృష్ణాష్టకం - తాత్పర్యము
  6. శ్రీమచ్ఛంకరాచార్యకృత శ్రీకృష్ణాష్టకం - తాత్పర్యము
  7. శంకరాచార్యవిరచిత షట్పదీ - తాత్పర్యము
  8. పాండురంగాష్టకం - తాత్పర్యము
  9. తోటకాష్టకం - తాత్పర్యము
  10. శ్రీ శంకరాచార్య కృత శివ సువర్ణమాలా స్తుతి
  11. శివనామావళ్యష్టకం - తాత్పర్యము
  12. శివ అక్షరమాలా స్తోత్రము - తాత్పర్యము
  13. అర్ధనారీశ్వరాష్టకం - తాత్పర్యము
  14. కాలభైరవాష్టకం
  15. దక్షిణామూర్తి స్తోత్రము - తాత్పర్యము
  16. శివాష్టకం - తాత్పర్యము
  17. శివపంచాక్షరీ స్తోత్రం - తాత్పర్యము
  18. మహిషాసుర మర్దిని
  19. శారదా భుజంగం మరియు సరస్వతీ స్తోత్రం
  20. లలితా పంచరత్న స్తోత్రం
  21. దేవీ నవరత్నమాలికా స్తోత్రం
  22. త్రిపురసుందరీ అష్టకం
  23. అన్నపూర్ణాష్టకం
  24. ఉమామహేశ్వర స్తోత్రము
  25. ప్రాతః స్మరణం
  26. నిర్వాణ షట్కము
  27. విశ్వనాథాష్టకం - తాత్పర్యం
  28. శివ మానస పూజ
  29. విఘ్నేశ స్తుతి - గణేశ పంచరత్నం                             

2, మార్చి 2011, బుధవారం

శివస్తోత్రాలు మహాశివరాత్రి సందర్భంగా

నా బ్లాగ్ లో ఇదివరకు ప్రచురించిన కొన్ని శివస్తోత్రాలు మహాశివరాత్రి సందర్భంగా. వందే శివం శంకరం!!

   

22, ఫిబ్రవరి 2011, మంగళవారం

శ్రీమచ్ఛంకరాచార్య కృత కాశీ పంచకము - తాత్పర్యము

వారణాశి
అయోధ్యా మథురా మాయా కాశీ కాంచీ అవంతికా
పురీ ద్వారావతీ చైవ సప్తైత మోక్షదాయికాః

అయోధ్య, మథుర, మాయ (హరిద్వార్), కాశి (వారణాశి), కంచి, అవంతిక (ఉజ్జయిని), పురీ, ద్వారక అనే ఏడు పుణ్యధామములు మోక్షమును ప్రసాదించే క్షేత్రములు.  ఈ క్షేత్రములు దర్శించి భక్తి, శ్రద్ధలతో కొలిచే వారికి మోక్షము కలుగుతుందని భారతీయ ఆధ్యాత్మిక వేత్తల ప్రగాఢ విశ్వాసం. దీనికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. ఈ అన్ని క్షేత్రాలలోకీ అత్యంత మహిమాన్వితమైనది వారణాశి. కాశ్యాం హి మరణాన్ముక్తిః - కాశీలో మరణం పొందిన వారికి ముక్తి వెంటనే కలుగుతుంది అని ఇంకో ఆర్యోక్తి. వరుణ మరియు ఆశి నదులు గంగానదిలో సంగమమయ్యే ప్రాంతంలో ఉన్న పట్టణం కాబట్టి కాశిని వారణాశిగా పిలుస్తారు. 

ఆది శంకరులు దేశమంతా పర్యటిస్తూ కాశీ పట్టణంలో చాల కాలం గడిపారు. ఆ నగరంలోనే ఆయన కాశీ పంచకం, మనిషి తానూ ఎవరో తెలుసుకునే సాధనమైన మనీషా పంచకం రచించారు.  ఇదివరకే మహత్కర మనీషా పంచకము ఈ బ్లాగ్ లో వివరించాను. ఈ వ్యాసంలో కాశీ పంచకము, తాత్పర్యము మీకోసం.

మణికర్ణికా ఘట్టము

మనోనివృత్తిః పరమోపశాంతిః
సా తీర్థవర్యా మణికర్ణికా చ
జ్ఞానప్రవాహా విమలాదిగంగా
సా కాశికాహం నిజబోధరూపా  ౧

యస్యామిదం కల్పితమింద్రజాలం
చరాచరం భాతి మనోవిలాసం
సచ్చిత్సుఖైకా పరమాత్మరూపా
సా కాశికాహం నిజబోధరూపా  ౨

కోశేషు పంచస్వధిరాజమానా
బుద్ధిర్భవానీ ప్రతిదేహగేహం
సాక్షీ శివః సర్వగతోఽంతరాత్మా
సా కాశికాహం నిజబోధరూపా  ౩

కాశ్యాం హి కాశ్యతే కాశీ కాశీ సర్వప్రకాశికా
సా కాశీ విదితా యేన తేన ప్రాప్తా హి కాశికా  ౪

కాశీక్షేత్రం శరీరం త్రిభువన జననీ వ్యాపినీ జ్ఞానగంగా
భక్తిః శ్రద్ధా గయేయం నిజగురుచరణధ్యానయోగః ప్రయాగః
విశ్వేశోఽయం తురీయః సకలజనమనఃసాక్షిభూతోఽంతరాత్మా
దేహే సర్వం మదీయే యది వసతి పునస్తీర్థమన్యత్కిమస్తి  ౫

తాత్పర్యము: 

మనసులోని ప్రశ్నలకు నివృత్తి, అత్యుత్తమమైన ఉపశాంతి, తీర్థ రాజమైన మణి కర్ణిక , జ్ఞాన ప్రవాహమైన, శుద్ధమైన గంగానదికి  రూపమైన, నిజ ఆత్మ రూపమైన ఆ కాశికను నేనే.

మాయా పూరితమైన (ఇంద్రజాలము వలె) ఈ చరాచర సృష్టికి నిలయమైన, సచ్చిదానందమునకు రూపమైన, పరమాత్మ రూపమైన, నిజ ఆత్మ రూపమైన ఆ కాశికను నేనే. 

పంచ కోశముల జ్ఞాన ప్రకాశమైన, భవాని అనే దేహమునందు అర్థ భాగముగా ప్రకాశించుచు, అంతరాత్మకు ప్రభువైన, సాక్షియైన శివునిగా,  నిజ ఆత్మ రూపమైన ఆ కాశికను నేనే. 

కాశి కాశిలోనే యుండి అన్నిటినీ ప్రకాశింప చేయును. అటువంటి కాశిని తెలుసుకున్న వాడు కాశికి చేరును. 

నా దేహమే కాశిలో ఉన్న విశ్వనాథుని దేవాలయము. నా భక్తియే విశ్వవ్యాప్తమైన త్రిభువన జనని గంగానది. నా శ్రద్ధయే గయా క్షేత్రము. గురుదేవుని నిజ పాద ధ్యానమే నాకు ప్రయాగ. నా అంతరాత్మయే ఈ సకల జగత్ప్రాణి మనస్సాక్షీ  భూతమైన ఆ విశ్వేశ్వరుడు. దేహములో అంతటా ఈ విధముగా నివశించి యుండగా వేరే తీర్థములతో పని ఏమున్నది?

శంకరావతారులు జగద్గురువులు

పరిశీలన:

ప్రత్యక్షముగా కనిపిస్తున్న కాశీ క్షేత్రము మరియు తన దేహములోని ఆత్మ ఒకటే అని నిస్సందేహముగా ఈ స్తోత్రము ద్వారా చాటారు ఆది శంకరులు. పరిపూర్ణ ఆత్మ జ్ఞాన అనుభూతుడైన శంకర గురువులకు తన శరీరమే దేవాలయము, అందులోని జీవుడే (ఆత్మ) పరమాత్మ, సనాతన దైవము. ఈ భావాన్ని శంకరులు ఈ కాశీ పంచకము ద్వారా  -భక్తి శ్రద్ధలే సజల స్రవంతి యైన గంగ మరియు మోక్ష ధామమైన గయలని, అహంకారమును నాశనము చేసి, జ్ఞాన జ్యోతిని వెలిగించి ఆత్మ సాక్షాత్కారములో మార్గ సహాయకుడైన సద్గురువు పాద పద్మములే ప్రయాగయని -  అద్వైతములోని జీవాత్మ పరమాత్మ ఏకత్వమును అత్యున్నతమైన స్థాయిలో ఉదహరించారు. 

దేహములోని పంచకోశములలోని ప్రకాశమును ఆ భవానీశంకరుని రూపముగా, ఆ దేహమును చరాచర సృష్టికి సంకేతముగా, మాయారూపముగా,  మోక్ష సాధనకు సాధనముగా ఈ స్తుతిలో వర్ణించారు ఆది శంకరులు.  కాశీ క్షేత్రములో కనిపించే యోగము, జీవన్ముక్తి, గంగా నది మహత్తు, ఆ నదీమ తల్లి సర్వ వ్యాపకత, అక్కడి మణి కర్ణికా ఘట్టములో జరిగే నిరంతర దేహ కాష్టము, నదిలో ప్రవహించే అనేకములు, విశాలాక్షీ విశ్వేశ్వరులు - మొత్తం కాశీ పట్టణమే మహదనుభవైక  వేద్యముగా భావించి, ఆ భావనను పరిపూర్ణముగా ఆత్మకు ఆలయమైన దేహములో అనుభూతి చెంది రచించారు శంకరులు. అందుకే, ఆయన శంకారవతారులు, జగద్గురువులు అయినారు. 

శ్రీ గురుభ్యో  నమః.

20, ఫిబ్రవరి 2011, ఆదివారం

తులసీదాస కృత రామచంద్ర స్తుతి - శ్రీ రామచంద్ర కృపాళు


అందాల రాముని వర్ణించటం రామభక్తుని ప్రథమ లక్షణం. ఆ ఇందీవర శ్యాముని శరీర సౌందర్యమును వర్ణనలో కమలములతో ఉపమానము చేయనిదే అది సంపూర్ణము కాదు, మనసును హత్తుకోదు. ప్రతి శ్రీహరి స్తుతిలో ఈ ఉపమానము ఉండవలసిందే. అలాగే, రాముని నుతిలో ఆయన ధర్మ సంరక్షణలో చేసిన దుష్ట సంహారము, ఆయన ధనుస్సు, అస్త్రములు గురించి కూడా ప్రస్తావన తప్పకుండా జరుగుతుంది.

ఇదే శైలిని, భావాన్ని గోస్వామి తులసీ దాసు తన రామచంద్ర స్తుతిలో వ్యక్త పరచారు. తులసీదాసు హృదయములో వికసించిన మనోజ్ఞ  మాధుర్య భక్తి సుమం రామచంద్ర స్తుతి. అవధ భాషలోనే కాకుండా సంస్కృతములో కూడా ఆయన గొప్ప రచనలు చేసాడు అనటానికి ఈ నుతి ఒక గొప్ప ఉదాహరణ. తులసీ దాసు కొన్ని అద్భుతమైన ఉపమానములు, పదప్రయోగాలు ఈ నుతిలో చేసారు - హరణ భవ భయ దారుణం - దారుణమైన సంసారమనే భయాన్ని హరించే వాడు...అంతకన్నా రాముని మహిమను చెప్పే భావన ఏముంటుంది?.  అలాగే కమలమునకు కంజము అనే పదము ఉపయోగించి, ఆ రాముని అందమైన కన్నులు, చేతులు, పాదములు, ముఖము అన్నీ ఆ వికసించే కలువలా అందముగా ఉన్నాయి అనే భావాన్ని ముత్యాల వరుసలా, కాసుల పేరులా పేర్చారు తులసీ దాసు. నవ నీల నీరద సుందరం అనే పద మాలికతో రాముని నీల మేఘ శ్యామ రూపాన్ని కన్నులకు కట్టినట్టుగా రచించారు. రఘువంశ కులతిలకుడు, కోసల రాజ్యమనే ఆకాశానికి చంద్రుడు, దశరథ పుత్రుడు అనే భావాన్ని 'రఘునంద ఆనందకంద కోసల చంద దశరథ నందనం' అనే పద రత్న మాలికతో వర్ణించారు. ఎంత అందమైన ప్రాస?.

అలాగే, ప్రతి శ్లోకములోనూ మనోహరమైన పద ప్రయోగం - (భయ దారుణం, కంజారుణం), (నీరద సుందరం, జనక సుతావరం), (దైత్య వంశ నికందనం, దశరథ నందనం),  (అంగ విభూషణం, జిత ఖర దూషణం),  (ముని మనరంజనం, ఖలదళ గంజనం) - ఇలా కవలల వంటి కలువలైన పదాలను ప్రయోగించి, కమలలోచనుని, కమలనాభుని, కమల ప్రియుని భక్తితో, భావముతో నుతించారు గోస్వామి. అందుకే ఈ స్తుతి ఎంతో ప్రాచుర్యం పొందింది. 

రామచంద్ర స్తుతి సాహిత్యము, తాత్పర్యము మీకోసం. ఇంత ఆహ్లాదమైన, అందమైన భక్తి నుతిని భారత రత్న, గాన గోకిల లతా మంగేష్కర్ గొంతులో వినండి.


శ్రీరామచంద్ర కృపాళు భజ మన హరణ భవభయ దారుణం
నవకంజలోచన కంజముఖ కరకంజ పదకంజారుణం  ౧

కందర్ప అగణిత అమిత ఛవి నవ నీల నీరద సుందరం
పటపీత మానహు తడిత రుచి శుచి నౌమి జనక సుతావరం   ౨

భజ దీన బంధు దినేశ దానవ దైత్యవంశ నికందనం
రఘునంద ఆనందకంద కోసల చంద దశరథ నందనం   ౩

శిరముకుట కుండల తిలక చారు ఉదార అంగ విభూషణం 
ఆజానుభుజ శర చాపధర సంగ్రామ జిత ఖరదూషణం  ౪

ఇతి వదతి తులసీదాస శంకర శేష ముని మనరంజనం
మమ హృదయకంజ నివాస కురు కామాదిఖలదళ గంజనం   ౫

తాత్పర్యము:

ఓ మనసా! వికసించిన కమలముల వంటి కన్నులు, ముఖము, చేతులు, పాదములు కల,  అమితమైన కృప కలిగిన, ఈ జీవనములోని భయాలను పారద్రోలే శ్రీ రామచంద్రుని భజించుము.  

కోటి మన్మథుల కన్నా అందమైన వాడు, క్రొత్తగా ఏర్పడిన నీలి మేఘమువలె సుందరుడు, ఎల్లప్పుడూ శుచియైన పీతాంబరములు (పచ్చని పట్టు వస్త్రములు) ధరించి అందముగా ఉండేవాడు, సీతాదేవి వరుడు అయిన రామునికి నమస్కారములు. 

దీన బంధువు, సూర్యవంశమున జన్మించిన వాడు, రాక్షస వంశములను నిర్మూలనము చేసిన వాడు, రఘు కులమునకు ఆనందకారుడు, కోసల రాజ్యానికి చంద్రుని వంటి వాడు, దశరథుని పుత్రుడు అయిన శ్రీ రాముని భజించుము. 

ఆ శ్రీరాముడు శిరసుపై కిరీటమును ధరించిన వాడు, కుండలములు ధరించిన వాడు, ఎన్నో ఆభరణాలతో శోభిల్లే శరీరము కలవాడు, మోకాళ్ళ వరకు ఉన్న చేతులకు ధనుస్సు, శరములు కలిగిన వాడు, యుద్ధములో ఖర దూషణ రాక్షసులను సంహరించిన వాడు.

"నా హృదయ కమలములో నివసించే ఓ రామచంద్రా! నాలోని కామాది దుష్ట గుణముల సమూహమును నాశనము చేసే ప్రభూ! " - అని శంకరుడు, అది శేషుడు, ఇతర మునుల మనసు రంజిల్ల చేసే తులసీ దాసు ఈ విధంగా నుతిస్తున్నాడు.

17, ఫిబ్రవరి 2011, గురువారం

త్యాగరాజ రామభక్తి - ఎంత వేడుకొందు రాఘవా



శ్రీమాన్ అంబుజ సంభవాన్వయ లసత్కాకర్ల వంశాగ్రణీః
న్యాయ వ్యాకరణ ప్రమాణగతి విద్విద్వజ్జనారాధితః
సాన్గాధీత విలోడిత శృతి శిఖా దుగ్ధాగ్ధిలబ్ధామృతః
జ్యోతిర్మార్గ విదాం వరోవిజయతే శ్రీ త్యాగరాజో గురుః 
(త్యాగరాజ స్వామిని నుతిస్తూ వారి శిష్యులు శ్రీ వాలాఝీపేట వేంకటరమణయ్య భాగవతార్ గారు రాసిన శ్లోకము)
పవిత్రమైన కాకర్ల వంశములో జన్మించి, న్యాయ, వ్యాకరణ శాస్త్రముల యందు సంపూర్ణమైన పరిశోధనలు చేసి, వేద వేదాన్తములనే క్షీర సాగరమునందు జన్మించిన అమృత పానము చేయుచు బ్రహ్మ తేజస్సుతో ప్రకాశించుచున్న కోవిదులలో ఉత్తముడైన శ్రీ త్యాగరాజ గురువునకు విజయము కలుగు గాక!

రామ భక్తాగ్రేసరుడు, కలియుగ నారదులు కాకర్ల త్యాగరాజు వారు రాసిన ఎంత వేడుకొందు రాఘవా అనే కీర్తన నా మనసును చాల హత్తుకున్న కీర్తన. కారణం దాని రాగం లక్షణం, ఆలాపన, గతి. 

భక్తీ మార్గములో ఉన్నప్పుడు వేడుకొనుట, అలసట, గగుర్పాటు, ఆనంద బాష్పములు, ప్రశ్న, పరి ప్రశ్న, అంతర్మథనం, నిష్ఠూరం, ఆవేదన, శరణాగతి లాంటి వేర్వేరు భావనలు, ప్రతిక్రియలు కలుగుతుంటాయి. వీటిలో ప్రశ్న, అలసట, ఆవేదన ఈ కీర్తన లక్షణాలు. నీ దర్శన భాగ్యం కోసం ఎంతని వేడుకునేది? అని రాముని ప్రశ్నిస్తున్నాడు త్యాగరాజు. అలా ప్రశ్నిస్తున్నప్పుడు ఆయన ఉనికిని గాని, మహత్తును గాని, కీర్తిని గాని ప్రశ్నిచటం లేదు. కేవలం - ఇంత నమ్మినా కూడా తనకు ఎంత కాలం ఈ పరీక్ష అని ఆవేదన. 

సరస్వతీ మనోహరి రాగంలో ఈ కీర్తన కూర్చబడినది. కీర్తన సాహిత్యం, తాత్పర్యము. శ్రవణం ఓ ఎస్ త్యాగరాజన్ గారి గళంలో.

సాహిత్యం: 

ఎంత వేడుకొందు రాఘవా | ఎంత వేడుకొందు|

పంతమేలరా ఓ రాఘవా | ఎంత వేడుకొందు| 

చింత దీర్చుటకెంత మోడి రా  అంతరాత్మ చెంత రాక నే |  నెంత వేడుకొందు| 

చిత్తమందు నిన్ను జూచు సౌఖ్యమే ఉత్తమంబనుచు ఉప్పొంగుచును 
సత్తమాత్రమా! చాల నమ్మితిని సార్వభౌమ శ్రీ త్యాగరాజనుత | ఎంత వేడుకొందు| 


తాత్పర్యము: 
ఓ రామా! నిన్నెంత వేడుకొందును? నా పట్ల నీకేల పంతము? నా చింత తీర్చుటకు నీకు ఎందుకు ఇంత బింకము? నా అంతరాత్మ నీవే అయి కూడా నా వద్దకు రాకుండా యున్నావు. నా మనసులో నిన్ను దర్శించే సౌఖ్యమే అన్నిటి కన్నా ఉత్తమమని ఉప్పొంగుచున్నాను. ఈ బాహ్యప్రపంచము నందలి ప్రతి వస్తువులోను, అంతటా నీ శక్తి వ్యాపించి యున్నదని చాలా నమ్మితిని. ఓ సార్వభౌమా! త్యాగరాజునిచే నుతించబడిన రామా! నిన్నెంత వేడుకొందును? 

తులసీదాసు హనుమాన్ చాలీసా - ఎమ్మెస్ రామారావు గారి తెలుగు హనుమాన్ చాలీసా

ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం 
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం 

బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగాతా 
ఆజాడ్యం వాక్పటుత్వం చ హనుమాత్ స్మరణాద్భవేత్ 

హనుమాన్ అంజనా సూనుః వాయుపుత్రో మహాబలః
రామేష్టః ఫల్గుణస్సఖః పింగాక్షో అమిత విక్రమః
ఉదధిః క్రమణశ్చైవ సీతాశోకవినాశకః
లక్ష్మణః ప్రాణదాతాచ దశగ్రీవస్య దర్పః
ద్వాదశైతాని నామాని కపీన్ద్రస్య మహాత్మనః
స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః
తస్మ మృత్యు భయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్ 



హనుమద్ తత్త్వము:

మానవ జన్మ అవరోధాలు, కష్టాలతో నిండి ఉంటే, మన ధర్మం నిర్వర్తించటం ఎలా? మానసిక దౌర్బల్యం, శారీరక అశక్తత ఉంటే, మన కర్తవ్య పాలన ఎలా?. అందుకనే, మనకు రామాయణంలో హనుమంతుని పాత్రను ఉంచారు వాల్మీకి మహర్షి. భగవంతునిపై పరిపూర్ణమైన నమ్మకం, శరణాగతి ద్వారా వానరుడైన హనుమంతుడు ఎటువంటి ఊహించలేని అవరోధాలను దాటి ధర్మ పాలనలో తన ప్రభువైన రామచంద్రునికి తన వంతు సాయం చేశాడు?.

మరి ఆ హనుమంతునికి ఎన్ని అవరోధాలు? - మొదట కోతి జన్మ వలన చంచలమైన మనస్సు, తన శక్తి తను తెలుసుకోలేని బుద్ధి. వీటిని స్థిరపరుచుకొనుటకు రాముని పట్ల అచంచలమైన భక్తి, పూర్తి సమర్పణ ఉపయోగ పడింది.  తరువాత రామభక్తుడనే ముద్ర బిళ్ళ కలిగి ఉండటం వలన సాగరం దాటే సమయంలో ఎంతోమంది సహాయం పొందుతాడు. అలాగే, రామ నామ జపంతో రాక్షసులను సంహరించి మాత చెంతకు చేరుతాడు. తన మనసు చలించినప్పుడల్లా, ఆ ప్రభు నామ స్మరణ, దాని వలన ఆయన పట్ల తన కర్తవ్యము గుర్తుకు వచ్చి ముందుకు సాగుతాడు. సుందరకాండలో దీనికి ఉదాహరణలు ఎన్నో? - మండోదరిని చూసి సీత అనుకుని భ్రమించటం, సీతాదేవి కాన రాక, దాని వలన ఎటువంటి ఫలితాలు ఉంటాయో ఊహించుకొని, దాని వలన నిరాశ, నిస్పృహ చెందటం, అప్పుడు మరల రామ నామ బలంతో, శుభ సూచనలు కలిగి ముందుకు వెళ్ళటం, సీతాదేవి ముంగిట రాముని గుణ కీర్తన వలన ఆమెను సంతోషపరచటం, ఆత్రుతలో లంకాదహనం కావించి చిన్తిస్తున్నప్పుడు రాముని స్మరణ వలన, సీతెదేవికి ఎటువంటి హాని కలుగదు అనే దృఢ విశ్వాసం కలిగే స్థైర్యం కలగటం...ఇలా సుందరకాండ వెదికితే మానసిక చాంచల్యం, దానికి పరిష్కారం అనే విషయానికి ఉదాహరణలు కోకొల్లలు. అలాగే యుద్ధ సమయంలో హనుమంతుని శౌర్యము, సంజీవని పర్వతం తెచ్చుట, రామ లక్ష్మణులను మైరావణుని బారి నుండి కాపాడుట - వీటన్నిటిలో హనుమంతుని పాత్ర అనిర్వచనీయమైనది. అంతటి మహా శక్తి సంపన్నుడు హనుమంతుడు. ఆ శక్తికి మూలం అచంచలమైన రామభక్తి, దాస్యము, శరణాగతి. మరి అంతటి మహనీయుని స్మరిస్తే మన బాధలు, పీడలు తొలగకుండా ఉంటాయా? దీనికి ఉదాహరణగా కొన్ని కోట్ల మంది, కొన్ని వందల వేల సంవత్సరాలుగా హనుమనుతుని ఉపాసనతో శక్తి మంతులై, దీమంతులై తరించిన వారు ఉన్నారు.   ఒక్క హనుమాన్ చాలీసాను పూర్తి విశ్వాసంతో నిరంతర పారాయణ చేసి అధిగమించలేని బాధలను, రోగాలను, పీడలను, మానసిక శారీరిక దృఢత్వము కలిగి ముందుకు వెళ్ళిన వారు ఎంతో మంది.  అంత మహత్తు గలవి హనుమంతుని స్తోత్రాలు, మంత్రాలు.


ఎమ్మెస్ రామారావు గారి చాలీసా


మహానుభావులకు దైవానుగ్రహం ఎలా ఎప్పుడు కలుగుతుందో చెప్పలేము. తెలుగులో తొలి సినీ నేపథ్యగాయకులైన మోపర్తి ఎమ్మెస్ రామారావుగారికి హనుమంతుని కృప అలాగే కలిగింది. తెనాలిలో మోపర్తి రంగయ్య-మంగమ్మ దంపతులకు 1921 జూలై 3న జన్మించిన ఎమ్మెస్ రామారావు గారు నిడుబ్రోలులో పాఠశాల విద్యనభ్యసించి గుంటూరు హిందూ కళాశాలలో డిగ్రీ చదివారు. కాలేజీలో పాటల పోటీలో ప్రథమ బహుమతి గెలుచుకున్న ఆయనను నండూరి సుబ్భారావు గారు చలనచిత్రాలలో పాడాలని ప్రోత్సహించారు. దానితో చెన్నై వెళ్లి నేపథ్య గాయకునిగా పేరొందారు. 1944-64 మధ్య ఇరవై ఏళ్ల పాటు చలన చిత్రాలలో పాటలు పాడారు. సినిమారంగంలో అవకాశాలు తగ్గిపోవటంతో రాజమండ్రిలో సత్యసాయి గురుకులంలో వార్డెన్  ఉద్యోగంలో చేరారు. తరువాత హనుమంతుని అనుగ్రహంతో తొలుత చాలీసా, తరువాత సుందరకాండ తెలుగులో రచించారు. అప్పటినుంచి ఆయన పేరు చెప్పగానే ఆ హనుమద్భక్తుని రూపమే ఆంధ్రదేశమంతా ప్రకటితమయ్యింది.

సాధారణంగా ఒక మహా రచనను ఇంకొక భాషలోకి అనువదిస్తే అందులో ఉన్న నిజ భావన, మాధుర్యము, సందర్భము, ఆ కవి అనుభూతి సంపూర్ణంగా అనువాదనలో కనిపించదు. ఎందుకంటే, ఆ సమయములో ఆ కవి అనుభవించిన భావన ఒక ప్రత్యేకమైన దైవిక శక్తి సంకల్పంతో  కూడి, జరిగితేనే అది మహా రచన అయ్యింది కాబట్టి, అదే అనుభూతి ఈ అనువాదం చేసే కవికి కలిగే అవకాశాలు చాలా తక్కువ కాబట్టి. కానీ, హనుమాన్ చాలీసా విషయంలో తులసీదాసు పొందిన భావన, చూపించిన భక్తి, శరణాగతి మన తెలుగులోకి అనువదించిన శ్రీ ఎమ్మెస్ రామారావు గారు దాదాపు చూపించారు. అందుకే ఆయన రచించి ఆలపించిన సుందరకాండ, హనుమాన్ చాలీసా హనుమద్భక్తుల నోట మారు మ్రోగుతూనే ఉంది. ఆయన రచనలు బాగా ప్రాచుర్యం చెందటానికి కారణం భక్తి, భాష, భావన మూడు బాగా సమ్మిళితం చేయటం వలన మరియు అటువంటి రచనలు ఫలాపేక్ష లేకుండా, హనుమంతుని స్మరిస్తూ, అనుభవైకవేద్యమై అమృత గానం చేయటం వలన. కలియుగంలో భక్తి, స్తుతిని మించిన మోక్ష సాధనం లేదని ఎన్నో శృతి స్మృతి పురాణాలు ఘోషించాయి. ఆ మార్గాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకుని ఎమ్మెస్ రామారావు గారు తులసీదాస్ రచించిన చాలీసాను తెలుగులోకి అద్భుతంగా అనువదించారు, పాడారు. స్వతహాగా మంచి లలితా సంగీత, నేపథ్య గాయకులైన రామారావు గారు ఈ మార్గంలోకి వెళ్లి సంపూర్ణమైన అనుభూతిని మనకు పంచి ఇచ్చారు. ఆ మహానుభావునికి హృదయ పూర్వక నివాళులు.

తులసీదాసు హనుమాన్ చాలీసా సాహిత్యం:


శ్రీగురు చరణ సరోజ రజ నిజ మను ముకుర సుధారి
వరణౌ రఘువర విమల యశ జో దాయక ఫల చారి
బుద్ధిహీన తను జానికై సుమిరౌ పవనకుమార్
బల బుద్ధి విద్యా దేహి మోహి హరహు కలేశ వికార్

జయ హనుమాన జ్ఞాన గుణ సాగర  జయ కపీశ తిహు లోక వుజాగర

రామ దూత అతులిత బల ధామా అంజనిపుత్ర పవనసుత నామా

మహావీర విక్రమ బజరంగీ కుమతి నివార సుమతి కే సంగీ

కంచన వరణ విరాజ సువేశా కానన కుండల కుంచిత కేశా

హాథ వజ్ర ఔర్ ధ్వజా విరాజై కాంధే మూంజ జనేవూ సాజై

శంకర సువన కేసరీనందన తేజ ప్రతాప మహా జగ వందన

విద్యావాన గుణీ అతి చాతుర రామ కాజ కరి వే కో ఆతుర

ప్రభు చరిత్ర సుని వే కో రసియా రామ లఖన సీతా మన బసియా

సూక్ష్మ రూప ధరి సియహి దిఖావా వికట రూప ధరి లంక జరావా

భీమ రూప ధరి అసుర సంహారే రామచంద్ర కే కాజ సవారే

లాయ సజీవన లఖన జియాయే శ్రీరఘువీర హరఖి వురలాయే

రఘుపతి కీన్హీ బహుత బడాయీ తుమ మమ ప్రియ భరతహి సమ భాయీ

సహస వదన తుమ్హరో యశ గావై అస కహి శ్రీపతి కంఠ లగావై

సనకాదిక బ్రహ్మాది మునీశా నారద శారద సహిత అహీశా

యమ కుబేర దిగపాల జహా తే కవి కోవిద కహి సకై కహా తే

తుమ ఉపకార సుగ్రీవహి కీన్హా రామ మిలాయ రాజ పద దీన్హా

తుమ్హరో మంత్ర విభీషణ మానా లంకేశ్వర భయే సబ జగ జానా

యుగ సహస్ర యోజన పర భానూ లీల్యో తాహి మధుర ఫల జానూ

ప్రభు ముద్రికా మేలి ముఖ మాహీ జలధి లాంఘి గయే అచర జనాహీ

దుర్గమ కాజ జగత కే జేతే సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే

రామ దుఆరే తుమ రఖవారే హోత న ఆజ్ఞా బిను పైఠారే

సబ సుఖ లహై తుమ్హారీ శరనా తుమ రక్షక కాహూ కో డరనా

ఆపన తేజ సమ్హారో ఆపై తీనోం లోక హాంకతే కాంపై

భూత పిశాచ నికట నహి ఆవై మహావీర జబ నామ సునావై

నాసై రోగ హరై సబ పీరా జపత నిరంతర హనుమత వీరా

సంకట తే హనుమాన ఛుడావై మన క్రమ వచన ధ్యాన జో లావై

సబ పర రామ తపస్వీ రాజా తిన కే కాజ సకల తుమ సాజా

ఔర మనోరథ జో కోయీ లావై సోయీ అమిత జీవన ఫల పావై

చారో యుగ పరతాప తుమ్హారా హై పరసిద్ధ జగత ఉజియారా

సాధు సంత కే తుమ రఖవారే అసుర నికందన రామ దులారే

అష్ట సిద్ధి నౌ నిధి కే దాతా అస వర దీన జానకీ మాతా

రామ రసాయన తుమ్హరే పాసా సదా రహో రఘుపతి కే దాసా

తుమ్హరే భజన రామ కో పావై జనమ జనమ కే దుఖ బిసరావై

అంత కాల రఘుబర పుర జాయీ జహాం జన్మ హరిభక్త కహాయీ

ఔర దేవతా చిత్త న ధరయీ హనుమత సేఈ సర్బ సుఖ కరయీ

సంకట కటై మిటై సబ పీరా జో సుమిరై హనుమత బలవీరా

జై జై జై హనుమాన గోసాయీ కృపా కరహు గురు దేవ కీ నాయీ

జో సత బార పాఠ కర కోయీ ఛూటహి బంది మహా సుఖ హోయీ

జో యహ పఢై హనుమాన చలీసా హోయ సిద్ధి సాఖీ గౌరీసా

తులసీదాస సదా హరి చేరా కీజై నాథ హృదయ మహ డేరా

పవనతనయ సంకట హరణ మంగల మూరతి రూప
రామ లఖన సీతా సహిత హృదయ బసహు సుర భూప


ఎమ్మెస్ రామారావు గారి తెలుగు హనుమాన్ చాలీసా సాహిత్యం



శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు
బుద్ధిహీనతను గలిగిన తనువులు బుద్బుదములని తెలుపు సత్యములు 

జయహనుమంత జ్ఞాన గుణ వందిత జయ పండిత త్రిలోక పూజిత
రామదూత అతులిత బలధామ అంజనీ పుత్ర పవన సుత నామ

ఉదయభానుని   మధుర ఫలమని భావన లీల అమృతమును గ్రోలిన
కాంచన వర్ణ విరాజిత వేష కుండల మండిత కుంచిత కేశ 

రామ సుగ్రీవుల మైత్రిని గొలిపి రాజ పదవిని సుగ్రీవున నిలిపి
జానకీపతి ముద్రిక దోడ్కొని జలధి లంఘించి లంక జేరుకొని 

సూక్ష్మ రూపమున సీతను జూచి వికట రూపమున లంకను గాల్చి 
భీమరూపమున అసురుల జంపిన రామ కార్యమును సఫలము జేసిన

సీత జాడ గని వచ్చిన నిను గని శ్రీ రఘువీరుడు కౌగిట నినుగొని 
సహస్ర రీతుల నిను గొనియాడగ కాగల కార్యము నీపై నిడగ 

వానరసేనతో వారధి దాటి లంకేశునితో తలపడి పోరి
 హోరుహోరున పోరు సాగిన అసుర సేనల వరుసను గూల్చిన

లక్ష్మణ మూర్ఛతో రాముడడలగ సంజీవి దెచ్చిన ప్రాణ ప్రదాత
రామలక్ష్మణుల అస్త్రధాటికి అసురవీరులు అస్తమించిరి 

తిరుగులేని శ్రీరామబాణము జరిపించెను రావణ సంహారము 
ఎదురులేని ఆ లంకాపురమున ఏలికగా విభీషణు  జేసిన 

సీతారాములు నగవుల గనిరి ముల్లోకాల హారతులందిరి
అంతులేని ఆనందాశ్రువులే అయోధ్యాపురి పొంగిపొరలే 

సీతారాముల సుందర మందిరం శ్రీకాంతుపదం నీ హృదయం 
రామ చరిత కర్ణామృత గాన రామ నామ రసామృత పాన 

దుర్గమమగు ఏ కార్యమైనా సుగామమే యగు నీ కృపజాలిన
కలుగు సుఖములు నిను శరణన్న తొలగు భయములు నీ రక్షణయున్న 

రామ ద్వారపు కాపరి వైన నీ కట్టడి మీర బ్రహ్మాదుల తరమా     
భూత పిశాచ శాకిని ఢాకిని భయపడి పారు నీ నామజపము విని

ధ్వజా విరాజా వజ్ర శరీరా భుజబల తేజా గదాధరా 
ఈశ్వరాంశ సంభూత పవిత్ర  కేసరీ పుత్ర పావన గాత్ర 

సనకాదులు బ్రహ్మాది దేవతలు శారద నారద ఆదిశేషులు
యమకుబేర దిక్పాలురు కవులు పులకితులైరి నీ కీర్తి గానముల 

సోదర భరత సమానా యని శ్రీరాముడు ఎన్నిక గొన్న హనుమా 
సాధుల పాలిట ఇంద్రుడవన్నా అసురుల పాలిట కాలుడవన్నా

అష్టసిద్ధి నవనిధులకు దాతగ జానకీ మాత దీవించెనుగ  
రామ రసామృత పానము జేసిన మృత్యుంజయుడవై వెలసిన 

నీ నామ భజన శ్రీ రామ రంజన జన్మ జన్మాంతర దుఃఖ భంజన 
ఎచ్చటుండినా రఘువరదాసు చివరకు రాముని చేరుట తెలుసు
  
ఇతర చింతనలు మనసున మోతలు స్థిరముగా మారుతి సేవలు సుఖములు
ఎందెందున శ్రీరామ కీర్తన అందందున  హనుమాను నర్తన

శ్రద్ధగ దీనిని ఆలకింపుమా శుభమగు ఫలములు కలుగు సుమా
భక్తి మీరగా గానము చేయగ ముక్తి గలుగు గౌరీశులు సాక్షిగా 

తులసీదాస హనుమాన్ చాలీసా  తెలుగున సుళువుగ నలుగురు పాడగ
పలికిన సీతారాముని పలుకున దోషములున్న మన్నింపుమన్న 

మంగళ హారతి గొను హనుమంత సీతా రామ లక్ష్మణ సమేత
నా అంతరాత్మ నిలుమో అనంత నీవే అంతా శ్రీ హనుమంత

పరిశీలన:

మొట్ట మొదట: రామారావు గారి చాలీసాలోని శ్లోకాలు తులసీదాసు చాలీసాలోని శ్లోకాల వరుసలో లేవు. కొంత రామాయణ గాథను అనుసరించి తన అనువాదాన్ని చేసినట్టు అర్థమవుతున్నది.

ఎమ్మెస్ రామారావు గారి ప్రయత్నం పూర్తి అనువాదం కాదు.  తులసీదాసుని హృదయాంతరంగము నుండి వెలువడిన మహామంత్ర సమానమైన చాలీసా పూర్తిగా రామాయణంలో హనుమంతుని భక్తిని, వీరత్వమును, రాక్షస సంహారమును, రామ చరణారవింద దాస్యమును, రామభక్తి మహాత్మ్యమును విషాద పరచి, ఆ హనుమంతుని స్మరణ సామాన్య మానవుల కష్టాలను, దౌర్బల్యాలను దూరం చేయటానికి దోహద పడుతుంది అని ఉద్బోధిస్తుంది. ఇదే భావనను, కొంత కుదించి, కొంత ఆధ్యాత్మికంగా మెరుగు దిద్ది, సీతారామచంద్రుల కీర్తిని, వారియందు హనుమంతునికి గల భక్తిని, ఆయన గుణ గణములను అచ్చ తెలుగులో మన ముందుంచారు రామారావు గారు. 

ముందు ధ్యాన శ్లోకము చూడండి:

తులసీదాసు 'నా మనసు అనే మలిన పడ్డ అద్దాన్ని శ్రీ గురు చరణ కమలములతో శుద్ధి చేసి, నేను రఘువరుని విమలమైన యశస్సును కీర్తిస్తున్నాను. దాని వలన ఆ ప్రభువు నాకు నాలుగు (బహు విధములు అని అర్థము) విధములైన ఫలము ఇస్తున్నాడు. బుద్దిహీనుడ నైన నేను ఆ వాయుపుత్రుని నా మనసు యందు ధ్యానించి, నాకు బలము, బుద్ధి, విద్య ఇచ్చి, నాకున్న క్లేశములన్నీ తొలగించుము అని ఆ హనుమంతుని ప్రార్థిస్తున్నాను. ' అని నుతిస్తే రామారావు గారు - 'ఆ హనుమంతుని చరణములు ఇహము, పరము సాధనకు శరణములు అని, బుద్ధి హీనత కలిగిన శరీరము నీటి బుడగ వంటి సత్యమును తెలిపేవి' అని ఇంకొంచెం వైరాగ్యము, పై మెట్టు అధ్యాతిమిక భావన కలిగించారు.

వీలైనంత తులసీదాసు ఉపయోగించిన ప్రాకృత భాషా పదాలను అలాగే ఉంచి ఆ మహానుభావుని పట్ల తన గౌరవాన్ని, తులసీదాసు అక్షరమాలలో ఉన్న దైవ బలాన్ని పునరుద్ఘాటించారు. మిగిలిన చాలీసాలో చాలా మటుకు సరళ అక్షరాలను వాడి, కష్టమైన ఒత్తులు, గుణింతాలు లేకుండా రచించారు.

రామారావుగారి చాలీసా సరళమైన తెలుగులోనే ఉంది కాబట్టి తులసీ చాలీసా భావార్థము తెలుగు చాలీసా సాహిత్యంలో తేలిగ్గానే అర్థమవుతుందని భావిస్తున్నాను. 

వెడలెను కోదండపాణి - త్యాగరాజస్వామి కృతి

వెడలెను కోదండపాణి అనుజ సౌమిత్రితో గూడి పుడమిలో జనులెల్ల పొగడ పూజితుడౌ మునితో గూడి శిరమన కొండెయు జార  వురమున హారములు మెరయ కరమున శరచాపములును ఘ...