8, డిసెంబర్ 2010, బుధవారం

పాండురంగాష్టకం - తాత్పర్యము

పండరీపుర దైవమైన  పాండురంగని మహిమలు మనకు పుండరీకుని గాథ ద్వారా తెలుస్తుంది. 


పండరీపురంలో పుండరీకుడనే  వర్తకుడుండే వాడు. ముసలి వారైన అతని తల్లిదండ్రులు తన అభివృద్ధికి ఆటంకమని తలచి వారిని ఇంట్లోనుంచి గెంటి వేస్తాడు. వారు  ఒక పేద యాత్రికుల బృందములో చేరి కాలి నడకన  కాశీ ప్రయాణం బయలు దేరుతారు. పుండరీకుడు మాత్రం అశ్వాలు, రథాలతో బయలుదేరుతాడు. దారిలో తల్లిదండ్రులను దాటినా, వారిని పట్టించుకోకుండా ముందుకు సాగుతాడు.

దారిలో అతను రోహిత దాసుడనే చర్మకారుడి కుటీరం చూస్తాడు. రోహిత దాసుడు తన సుఖాలను పక్కకు పెట్టి తన తల్లిదండ్రులకు భక్తి తో సేవ చేస్తుంటాడు. అక్కడ ఆ రోజు రాత్రి పుండరీకుడు కొలనులో ముగ్గురు అందవిహీనమైన స్త్రీలు మునిగి అందమైన దేవతా స్త్రీలగా మారటం చూస్తాడు. వారిని గంగ యమునా గోదావరి నదులుగా తెలుసుకుంటాడు. ఆ నదులు తమలో మునిగిన వారి పాపముల వలన అందవిహీనంగా మారి, ఇక్కడ రోహితుని కుటీరంలో ఉన్న పవిత్రమైన నీటిలో స్నానం చేసి వాటిని ప్రక్షాళనం చేసుకుంటున్నామని చెపుతారు. అది కేవలం రోహితుడు తన తల్లిదండ్రులను సేవించటం వలన జరిగిందని తెలుసుకుంటాడు.

అప్పుడు పుండరీకుని జ్ఞానోదయం కలిగి తల్లీ దండ్రులను కలుసుకొని వారిని, క్షమించమని అడిగి,  తన వద్దకు తీసుకువెళ్ళి మిగిలిన జీవితమంతా వారి సేవ చేస్తాడు. ఒకనాడు శ్రీ మహావిష్ణువు ఒక గొల్లకాపరి రూపంలో పుండరీకుని నివాసానికి వెళ్తాడు. పుండరీకుడు తాను తల్లిదండ్రుల సేవలో నిమగ్నుడనై ఉన్నానని, వేచి ఉండమని చెప్తాడు. విష్ణుమూర్తి తాను ఎవరు అన్నది తెలుపుతాడు. అయినా, పుండరీకుడు తాను తల్లిదండ్రుల సేవలో ఉన్నానని, తాను వచ్చేంత వరకు ఇటుకపై కుఉర్చోని ఉండమని చెప్తాడు. అతని మాతృ, పితృ భక్తికి మెచ్చి విష్ణువు ఆ ఇటుకపైనే కూర్చుని అక్కడ శిలారూపంలో వెలుస్తాడు. అదే పండరిపురంలోని దివ్యక్షేత్రము. అటు తర్వాత, పుండరీకుడు ఆ  విఠలుని  (కదలని ఇటుకపై ఉన్నవాడు) సేవలో తరించి ఐక్యమవుతాడు.

ఆ పండరీ పుర వాసుని స్తుతిస్తూ జగద్గురువులు రచించిన పాండురంగాష్టకము, తాత్పర్యము మీకోసం.   శ్రవణం ప్రతివాద భయంకర శ్రీనివాస్ (పీ.బీ. శ్రీనివాస్ గారు) గారి గళంలో



మహాయోగపీఠే తటే భీమరథ్యా
వరం పుండరీకాయ దాతుం మునీంద్రైః
సమాగత్య తిష్ఠంతమానందకందం
పరబ్రహ్మలింగం భజే పాండురంగం

తటిద్వాససం నీలమేఘావభాసం
రమామందిరం సుందరం చిత్ప్రకాశం
వరం త్విష్టకాయాం సమన్యస్తపాదం
పరబ్రహ్మలింగం భజే పాండురంగం

ప్రమాణం భవాబ్ధేరిదం మామకానాం
నితంబః కరాభ్యాం ధృతో యేన తస్మాత్
విధాతుర్వసత్యై ధృతో నాభికోశః
పరబ్రహ్మలింగం భజే పాండురంగం

స్ఫురత్కౌస్తుభాలంకృతం కంఠదేశే
శ్రియా జుష్టకేయూరకం శ్రీనివాసం
శివం శాంతమీడ్యం వరం లోకపాలం
పరబ్రహ్మలింగం భజే పాండురంగం

శరచ్చంద్రబింబాననం చారుహాసం
లసత్కుండలాక్రాంతగండస్థలాంతం
జపారాగబింబాధరం కంజనేత్రం
పరబ్రహ్మలింగం భజే పాండురంగం

కిరీటోజ్వలత్సర్వదిక్ప్రాంతభాగం
సురైరర్చితం దివ్యరత్నైరనర్ఘైః
త్రిభంగాకృతిం బర్హమాల్యావతంసం
పరబ్రహ్మలింగం భజే పాండురంగం

విభుం వేణునాదం చరంతం దురంతం
స్వయం లీలయా గోపవేషం దధానం
గవాం బృందకానందదం చారుహాసం
పరబ్రహ్మలింగం భజే పాండురంగం

అజం రుక్మిణీప్రాణసంజీవనం తం
పరంధామ కైవల్యమేకం తురీయం
ప్రసన్నం ప్రపన్నార్తిహం దేవదేవం
పరబ్రహ్మలింగం భజే పాండురంగం

స్తవం పాండురంగస్య వై పుణ్యదం యే
పఠంత్యేకచిత్తేన భక్త్యా చ నిత్యం
భవాంభోనిధిం తే వితీర్త్వాంతకాలే
హరేరాలయం శాశ్వతం ప్రాప్నువంతి

ఇతి శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ పాండురంగాష్టకం సంపూర్ణం

తాత్పర్యము: 

మహాయోగ పీఠం అయిన పండరీపురంలో, భీమ రథీ తీరంలో, మునీన్ద్రులతో కూడి పుండరీకునికి వరములిచ్చిన, అనంతమైన ఆనందమునకు మూలమైన, పరబ్రహ్మమైన పాండురంగని నేను పూజిస్తున్నాను. 

తన పాదపద్మములను ఇటుకలో స్థిరముగా ఉంచిన వాడు (విఠలుడు), మెరుపు తీగవలె అలంకరించబడిన వాడు, నీల మేఘ శ్యాముడు, లక్ష్మీ దేవికి నివాసమైన వాడు, సుందరమైన వాడు, ప్రకాశించే అంతరంగము కలవాడు,  పరబ్రహ్మమైన పాండురంగని నేను పూజిస్తున్నాను. 

చేతులను వంచి నడుముపై ఉంచుకొని ఈ మిథ్యా ప్రపంచమంతా నడుములోతు వరకే అని సందేశాన్ని ఇచ్చే, తన నాభి నుండి కమలమును సృష్టించి అందులో బ్రహ్మకు నివాసము ఏర్పరచిన వాడు, పరబ్రహ్మమైన పాండురంగని నేను పూజిస్తున్నాను. 

కౌస్తుభ మణిని మెడలో ధరించిన వాడు, అందమైన భుజకీర్తులు కలవాడు, అందంగా అలంకరించబడిన కురులు కలవాడు, లక్ష్మీ దేవికి నివాసమైన వాడు, శాంతమైన వాడు, శుభకరుడు, జగత్తును కాపాడే వాడు, పరబ్రహ్మమైన పాండురంగని నేను పూజిస్తున్నాను. 

శరత్కాలములోని చంద్రుని వంటి ముఖము కలవాడు, సమ్మోహనము కలిగించే చిరునవ్వు కలవాడు, మెరిసే కర్ణ కుండలములు  చెంపలపై వరకు కలవాడు, ఎర్రని మందారము రంగులో, దొండపండు వంటి పెదవి కలవాడు, కలువ పూల వంటి కళ్ళు కలవాడు, పరబ్రహ్మమైన పాండురంగని నేను పూజిస్తున్నాను. 

నలుదిక్కుల ప్రసరించే ప్రకాశము గల కిరీటమును ధరించిన వాడు, దేవతలచే అమూల్యమైన రత్నములతో పూజించబడే వాడు, మూడు వంపుల ఆహర్యములో నిలబడిన వాడు, వన మాలలు, శిఖి పించము ధరించిన వాడు, పరబ్రహ్మమైన పాండురంగని నేను పూజిస్తున్నాను. 

సర్వ వ్యాప్తమైన వాడు, వేణువును వాయించే వాడు, దుష్టుల పాలిటి చరమ గీతమైన వాడు, ఆటగా గోపాలుని వేషములో ఉండేవాడు, గోవులకు ఆనందము కలిగించే వాడు, వికసించిన కలువ వంటి చిరు నవ్వు కలవాడు, పరబ్రహ్మమైన పాండురంగని నేను పూజిస్తున్నాను. 

జననము లేని వాడు, రుక్మిణీ వల్లభుడు, అనంతమైన ప్రకాశకుడు, ఏకైక మోక్ష కారకుడు, నాలుగవ స్థితి (తురీయం) అయిన వాడు,  ప్రసన్నుడు, దేవ దేవుడు, శరణాగతుల ఆర్తిని పోగొట్టే వాడు, పరబ్రహ్మమైన పాండురంగని నేను పూజిస్తున్నాను. 

పాండురంగని నుతించే ఈ స్తోత్రాన్ని భక్తి మరియు శ్రద్ధతో పఠించే వారు సులభముగా సంసార సాగరాన్ని దాటి, విష్ణు లోక నివాసము పొందుతారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి