18, జనవరి 2011, మంగళవారం

శ్రీమచ్ఛంకరభగవత విరచిత మనీషాపంచకం - తాత్పర్యము

శంకర భగవత్పాదులు కాశీలో నివసిస్తున్నప్పటి సంఘటన ఇది. ఒక రోజు శంకరులు గంగానదిలో స్నానం ముగించుకుని శిష్యులతో కలిసి విశ్వనాథుని మందిరానికి వెళుతున్నప్పుడు ఒక నిమ్న జాతికి చెందిన వాడు ఎదురు పడతాడు. అప్పటి ఆచారాల ప్రకారం శంకరులు  వాడిని తప్పుకో, దారి విడువుము అని అంటాడు. అప్పుడా చండాలుడు నీవు తప్పుకోమంటున్నది ఈ దేహమునా? నా ఆత్మనా? అని ప్రశ్నిస్తాడు. అప్పుడు శంకరులు తన అహంకారానికి పశ్చాత్తాపపడి ఆ చండాలుని పరమశివునిగా గ్రహించి ప్రణమిల్లుతాడు. ఆ సందర్భంలో చండాలుని రూపములో ఉన్న శివుడు శంకరుని ఉద్దేశించి వేసిన ప్రశ్నలు మొదటి రెండు శ్లోకములు, అటు తర్వాత శంకరుల నోట వెలువడిన మనీషా పంచకం.

అద్వైతామృత సారమైన ఈ మనీషా పంచకం పరబ్రహ్మమొక్కటే అన్న సందేశాన్ని శంకర భగవత్పాదుల నోట మనకు అందించబడినది. తనలో ఉన్న ఆఖరి దుర్గుణమును ఈ సందర్భముగా శంకరులు దగ్ధము చేసుకునే అవకాశమును ఆ పరమ శివుడు చండాలుని రూపములో కలిగించాడు.  ఈ పంచకము, తాత్పర్యము.



అన్నమయాదన్నమయమథవా చైతన్యమేవ చైతన్యాథ్
యతివర దూరీకర్తుం వాంఛసి కిం బ్రూహి గచ్ఛ గచ్ఛేతి

ఓ యతివరా! దూరము వెళ్ళుము దూరము వెళ్ళుము అని అంటున్నావు నన్ను. అది ఒక ఆహారము తిన్న శరీరము ఇంకొక ఆహారము తిన్న శరీరమును అంటున్న మాటయా? లేక  ఒక చైతన్యము ఇంకొక చైతన్యమునా? దేనిని పొమ్మని అంటున్నావు?  చెప్పుము.

ప్రత్యగ్వస్తుని నిస్తరంగసహజానందావభోధాంబుధౌ
విప్రోఽయం శ్వపచోఽయమిత్యపి మహాంకోఽయం  విభేధభ్రమః
కిం గంగాంబుని బింబితేఽంబరమణౌ చాండాలవీథీపయః
పూరే వాఽంతరమస్తి కాంచనఘటీమృత్కుంభయోర్వాఽంబరే

ఎలాగైతే సూర్యుని ప్రతిబింబము నిశ్చలమైన నీటిపై స్పష్టంగా కనిపిస్తుందో అలాగే పరబ్రహ్మము ఈ చరాచర సృష్టిలోని ప్రతి వస్తువులోను స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఎందుకు ఈ అయోమయము? సందిగ్ధము? పవిత్ర గంగానదిలో కనిపించే సూర్యుని ప్రతిబింబానికి, ఒక చండాలుడు ఉండే వీధిలోని నీటిలో కనిపించే సూర్యుని ప్రతిబింబానికి తేడా ఏమైనా ఉందా? అలాగే నీటిని కలిగిన ఉన్న బంగారు మరియు మట్టి పాత్రల వలన ఈ రెండిటిలో ఉన్న నీటికి ఏమైనా భేదము కలదా?

          మనీషాపంచకం

జాగ్రత్స్వప్నసుషుప్తిషు స్ఫుటతరా యా సంవిదుజ్జృంభతే
యా బ్రహ్మాదిపిపీలికాంతతనుషు ప్రోతా జగత్సాక్షిణీ
సైవాహం న చ దృశ్యవస్త్వితి దృఢప్రజ్ఞాపి యస్యాస్తి చే-
చ్చాండాలోఽస్తు స తు ద్విజోఽస్తు గురురిత్యేషా మనీషా మమ  ౧

ఎవరైతే - తనలో ఉన్న ఆత్మ పరబ్రహ్మ రూపమై జాగ్రత్, స్వప్న, సుషుప్తావస్థలలో అవగతమవుతుందో, అదే ఆత్మ చీమలో కూడా ఉందని, అది చేతనమై, అగోచరమై, సాక్షియై ఉన్నదని - తెలుసుకున్నాడో వాడే అత్యుత్తమమైన గురువు/తత్త్వవేత్త - వాడు చండాలుడైన నేమి బ్రాహ్మణుడైన నేమి.

బ్రహ్మైవాహమిదం జగచ్చ సకలం చిన్మాత్రవిస్తారితం
సర్వం చైతదవిద్యయా త్రిగుణయాఽశేషం మయా కల్పితమ్
ఇత్థం యస్య దృఢా మతిః సుఖతరే నిత్యే పరే నిర్మలే
చాండాలోఽస్తు స తు ద్విజోఽస్తు గురురిత్యేషా మనీషా మమ  ౨

అజ్ఞానము, త్రిగుణముల (సత్త్వ, రజస్,  తమో గుణములు) వలన ఈ విశ్వము వేర్వేరు రకములైన జీవులతో ఉన్నట్లు అనిపించినప్పటికీ, ఏ పరబ్రహ్మ రూపమున ఈ విశ్వమున్నదో, నిరంతర ఆ పరబ్రహ్మ ధ్యాసతో, తానే పరబ్రహ్మమని గ్రహించిన వాడే ఉత్తమైన గురువు - వాడు చండాలుడైన నేమి బ్రాహ్మణుడైన నేమి.

శశ్వన్నశ్వరమేవ విశ్వమఖిలం నిశ్చిత్య వాచా గురో-
ర్నిత్యం బ్రహ్మ నిరంతరం విమృశతా నిర్వ్యాజశాంతాత్మనా
భూతం భాతి చ దుష్కృతం ప్రదహతా సంవిన్మయే పావకే
ప్రారబ్ధాయ సమర్పితం స్వవపురిత్యేషా మనీషా మమ  ౩

ఈ విశ్వము ఒక అశాశ్వతమైన మాయయని, ఈ శరీరము ఆ పరమాత్మను శాంతముతో, సంపూర్ణ విశ్వాసముతో ధ్యానించుటకు, తద్వారా పాపములను ఆ పవిత్రమైన అగ్ని యందు దాహించుటకు ఇవ్వబడినదియని సెప్పిన గురువుల మాటను నేను పూర్తిగా నమ్ముతున్నాను.
 
యా తిర్యఙ్నరదేవతాభిరహమిత్యంతః స్ఫుటా గృహ్యతే
యద్భాసా హృదయాక్షదేహవిషయా భాంతి స్వతోఽచేతనాః
తాం భాస్యైః పిహితార్కమండలనిభాం స్ఫూర్తిం సదా భావయ-
న్యోగీ నిర్వృతమానసో హి గురురిత్యేషా మనీషా మమ  ౪

మేఘములచే కప్పబడిన సూర్యుని వలె అజ్ఞానము జీవిని పరమాత్ముని కానకుండా చేయుచున్నది. ఆ పరబ్రహ్మము వలన ఈ చరాచర సృష్టి యందు కార్యములు జరుగుతున్నవని, ఆ సత్యమును తనయందే గ్రహించిన యోగి  ఉత్తమమైనవాడు అని నా అభిప్రాయము.

యత్సౌఖ్యాంబుధిలేశలేశత ఇమే శక్రాదయో నిర్వృతా
యచ్చిత్తే నితరాం ప్రశాంతకలనే లబ్ధ్వా మునిర్నిర్వృతః
యస్మిన్నిత్యసుఖాంబుధౌ గలితధీర్బ్రహ్మైవ న బ్రహ్మవిద్
యః కశ్చిత్స సురేంద్రవందితపదో నూనం మనీషా మమ  ౫

ఇంద్రాది దేవతలచే పూజించబడే పరబ్రహ్మముపై నిరంతర ధ్యానము కలిగిన వాడు, పరిపూర్ణ శాంతుడై యుండును. అట్టివాడు ఆ పరబ్రహ్మమును తెలిసికొని యున్నాడు అని, అతడే ఆ పరబ్రహ్మ అని నా పూర్తి నమ్మకము.

దాసస్తేఽహం దేహదృష్ట్యాఽస్మి శంభో
జాతస్తేంఽశో జీవదృష్ట్యా త్రిదృష్టే
సర్వస్యాఽఽత్మన్నాత్మదృష్ట్యా త్వమేవే-
త్యేవం మే ధీర్నిశ్చితా సర్వశాస్త్రైః

ఓ శంభో! నేను ఈ శరీర రూపముతో  నీ సేవకుడను. ఓ త్రినేత్రా! జీవ రూపములో నేను నీలో ఒక భాగమును. ఆత్మ రూపములో నీవు నా యందు, మరి సమస్త జీవకోటి యందు యున్నావు. నేను నా బుద్ధి ద్వారా, శాస్త్రముల ద్వారా ఈ విషయమును గ్రహించి యున్నాను.

 ఇతి శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ మనీషాపంచకం సంపూర్ణమ్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి