21, సెప్టెంబర్ 2010, మంగళవారం

రామ రామ యనరాద

మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి మాతామహులైన శ్రీ ప్రయాగ రంగదాసు గారి మరొక రచన:


రామ రామ యనరాద రఘుపతి రక్షకుడని వినలేదా
కామజనకుని కథ వినువారికి కైవల్యంబే కాదా

ఆపద్బాంధవుడగు శ్రీరాముని ఆరాధించగ రాదా
పాపంబులు పరిహారమొనర్చెడి పరమాత్ముండే కాదా

సారహీన సంసార భవాంబుధి సరగున దాటగ రాదా
నీరజాక్షుని నిరతము నమ్మిన నిత్యానందమే కాదా

వసుధను గుడిమెళ్లంకను వెలసిన వరగోపలుడె కాదా
పసివాడగు శ్రీ రంగదాసుని పాలించగ వినలేదా
యూట్యూబ్ లంకె.

శ్రీ కృష్ణాయను నామ మంత్ర రుచి

కర్ణాటకలోని కోలారు ప్రాంతంలో నివసించిన కైవార అమర నారేయన అనే వాగ్గేయకారుడు రాసిన మంచి సందేశమున్న గీతం. యూట్యూబ్ లంకె.

కైవార అమరనారాయణ గుడి

శ్రీ కృష్ణాయను నామ మంత్ర రుచి సిద్ధించుట నాకెన్నటికో
శ్రీ గురుపాదాబ్జంబులు మదిలో స్థిరముగ నిలిచేదెన్నటికో

మరవక మాధవు మహిమలు పొగడే మర్మము తెలిసేదెన్నటికో
హరి హరి హరి హరి హరి నామామృత పానము చేసేదెన్నటికో

కమలాక్షుని నా కన్నులు చల్లగ గని సేవించేదెన్నటికో
లక్షణముగ శ్రీ లక్ష్మీ రమణుని దాసుడనయ్యేదెన్నటికో

పంచాక్షరీ మంత్రము మదిలో పఠియించుట ఇంకెన్నటికో
ఆదిమూర్తి శ్రీ అమరనారేయన భక్తుడనయ్యేదెన్నటికో

17, సెప్టెంబర్ 2010, శుక్రవారం

సగ్గుబియ్యం-ఖర్జూరాలు పాయసం

చక్కెర, బెల్లం లేకుండా పాయసం చెయ్యాలి అనుకుంటున్నారా?. అయితే ఈ కింద వంటకం ప్రయత్నించండి.


కావలసిన పదార్థాలు: 
సగ్గుబియ్యం ఒక చిన్న గ్లాస్ నిండా, పచ్చి ఖర్జూరాలు(లయన్ డేట్సు లాంటివి) పది మెత్తగా రుబ్బి(నీళ్ళు లేకుండా), ఏలకుల పొడి.

పధ్ధతి:
పాత్రలో రెండు గ్లాసులు నీళ్ళు పోసి, అందులో సగ్గుబియ్యం వేసి పూర్తిగా తెల్లదనం పొయ్యేంత వరకు ఉడికించాలి. అడుగు అంటకుండా తిప్పుతూ ఉండాలి. అప్పుడు దీనిలో, గ్రైండ్ చేసిన పచ్చి ఖర్జూరాల పేస్టు వేసి అది పూర్తిగా కరిగేంత వరకు కలియబెట్టుటు ఉండాలి. కావలసినంత ఏలకుల పొడి వేసి కలియబెట్టాలి. ఖర్జూరాల పేస్టు కరిగి, సగ్గుబియ్యం పూర్తిగా ఉడికిన తర్వాత పొయ్యి మీదినుంచి దించేసి పెట్టుకోండి. కాచి, కొద్దిగా చల్లార్చిన పాలు మీగడ లేకుండా ఆ ఉడికిన మిశ్రమం కొంత చల్ల బడిన తర్వాత కావలసినన్ని కలుపుకోవాలి.  కాస్త పలచగా పాయసం రావాలి అంటే పైన చెప్పిన పాళ్ళకు ఒక గ్లాసున్నర పాలు పడతాయి.

అలంకరణ మరియు రుచి ఇష్టపడేవాళ్ళు -  జీడిపప్పు, కిస్మిస్ వగైరా ఊరికే బాణలిలో కాస్త దోరగా వేయించుకొని కలుపుకోవచ్చు (నెయ్యి/నూనెలో వేయించాల్సిన పనిలేదు). పూర్తిగా సగ్గుబియ్యం కాకుండా సగం సగ్గుబియ్యం సగం సేమియా వేసి లేక పూర్తిగా సేమియా వేసి చేసుకోవచ్చు.  చిత్రంలో ఉన్న పాయసం రెండు సగంసగం వేసి చేసినది. సేమియా వేయదలచుకుంటే దాన్ని వేయించుకుని పెట్టుకోండి (నెయ్యి/నూనె అక్కరలేదు).

13, సెప్టెంబర్ 2010, సోమవారం

మొలకలు - పొద్దున ఫలహారం రకాలు

ఈ మధ్య మొలకలు అందరు ఏదో ఒక రూపంలో వినటమో, తినటమో చేస్తూనే ఉన్నారు. ఆరోగ్యానికి మంచిదని మంతెన వారు తమ ప్రకృతి చికిత్స కార్యక్రమం ద్వారా మొలకలను బాగా ప్రాచుర్యంలోకి తెచ్చారు. రోజు మొలకలు తినాలి అనుకునే వాళ్లకి మరి దాంట్లో కాస్త రుచి కోసం మీకు ఈ కింది రకాలు.

1 . మొలకలు,  టమాటో, క్యారెట్, కీర సలాడ్:

కావలసిన పదార్థాలు: టమాటో (ఒకటి), కీర దోసకాయలు (చిన్నది ఒకటి), ఒక పచ్చి మిరపకాయ, రెండు క్యారెట్లు, ఒక నిమ్మకాయ దబ్బ, ఉప్పు, తేనె, కొత్తిమీర.


చేసే పధ్ధతి:

కీర దోసకాయని చెక్కుతీసి సన్నగా ముక్కలు చేసుకోండి 3 మి.మి సైజులో. అలాగే  టమాటో, పచ్చి మిరపకాయను బాగా కడిగి సన్నని ముక్కలు చేసుకోండి. క్యారెట్లను తొక్కు తీసి తురుముకోండి. ఇవన్ని కలిపి, వాటిలో రెండు-మూడు గుప్పెళ్ళ పెసర మొలకలు వేసి కలిపి, కొంచెం నిమ్మకాయ పిండండి. ఒక్క 2 -3 చుక్కల తేనె, ఉప్పుకావాల్సిన వాళ్లు ఉప్పు వేసి బాగా కలియబెట్టి కొత్తిమీరను సన్నగా తరిగి అలంకరించండి. అప్పటికప్పుడు తింటే నీరు ఊరకుండ భలే రుచిగా ఉంటుంది.

పులుపు రుచి మార్పు కావాలి అనుకునే వాళ్ళకి, నిమ్మ రసం బదులు కొంచెం పచ్చి మామిడి తురుము వేసుకోవాచు. అలాగే, క్యారెట్ బదులు లేత పచ్చికొబ్బరి, బీట్ రూట్, ముల్లంగి, బూడిద గుమ్మడి, సొరకాయ, బీర కాయ, పొట్ల కాయ తురుములలో ఏదైనా వేసుకోవచ్చు. వేసే తురుమును బట్టి కొంచెం ఉప్పు వేసుకోవచ్చు.

2 . మొలకలు-వేరుశనగ పొడి, ఖర్జూరం పొడి

కావలసిన పదార్థాలు: వేరు శనగలు గుప్పెడు, 3 - 4 ఎండుర్జూరాలు












చేసే పధ్ధతి:

వేరు శనగలు (పల్లీలు) వేయించి, పొట్టు తీసి, ఎండు ఖర్జూరంతో కలిపి పొడి చేసుకుని మొలకలతో కలిపి తింటే మంచి రుచి, ఆరోగ్యానికి కూడా అన్ని అందుతాయి. దీనిలో మార్పుగా - పల్లీల బదులు నువ్వులు కానీ, వేరే ఏ డ్రై ఫ్రూట్ అయినా వేసుకోవచ్చు (బాదం, జీడి పప్పు మొదలైనవి - ఇవి వాడినప్పుడు కొంచెం తక్కువ మోతాదులో వేసుకోవాలి). అలాగే, ఖర్జూరాల బదులు బెల్లం తక్కువ మోతాదులో వేసుకోవచ్చు. కొవ్వు, బరువు సమస్య లేని వాళ్లు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ వేసుకోచ్చు. డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. నువ్వులలో చాలా ఎక్కువ క్యాల్షియం ఉంటుంది కాబట్టి చాలా మంచిది ఆరోగ్యానికి.

3 . మొలకలు-పండ్ల సలాడ్

కావలసిన పదార్థాలు: పండీ పండని అరటి పండు, ఆపిల్, దానిమ్మ పండు (సగం చెక్క), కొంచెం నిమ్మ రసం, ఒక అర చెంచా తేనె



చేసే పధ్ధతి:

ముందుగా దానిమ్మ పండు ఒలిచి గింజలు తయారుగా పెట్టుకోండి. అలాగే ఆపిల్ కడిగి సన్నని ముక్కలు తరిగి పెట్టుకోండి. వెంటనే అరటిపండు చిన్న ముక్కలుగా చేసుకోండి. ఈ ముక్కలన్నితిని పెసల మొలకలతో కలిపి కొంచెం నిమ్మరసం, తేనె వేసి కలయపెట్టండి. ఎన్ని ఎక్కువ ఆపిల్ ముక్కలు ఉంటే అంత బాగుంటుంది. అరటి పండు, ఆపిల్ వెంటనే రంగు మారి పాడు అయి పోతాయి కాబట్టి చేసిన వెంటనే తినాలి దీన్ని. ఒక గ్లాస్ పాలతో ఇది తీసుకుంటే మీకు ఫలహారం చాలు.

9, సెప్టెంబర్ 2010, గురువారం

విఘ్నేశ స్తుతి - గణేశ పంచరత్నం

భాద్రపద శుద్ధ చవితి వచ్చేసింది. గణ నాయకుని వ్రతం అందరు భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారారని ఆశిస్తూ, ఆది శంకరుల నోట వెలువడిన గణేష పంచరత్నం స్తోత్రం (యూ ట్యూబ్ లంకె), దాని అర్థం మీకోసం.

శ్రీ విఘ్న రాజం భజే

ముదాకరాత్త మోదకం సదా విముక్తి సాధకం
కళాధరావతంసకం విలాసిలోక రక్షకం
అనాయకైక నాయకం వినాశితే భదైత్యకం
నతాశుభాశు నాశకం నమామి తం వినాయకం

నతేతరాతి భీకరం నవోదితార్క భాస్వరం
నమస్సురారి నిర్జనం నతాధికా పదుద్ధరం
సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం
మహేశ్వరం సమాశ్రయే పరాత్పరం నిరంతరం

సమస్త లోక శంకరం నిరస్త దైత్య కుంజరం
దరేదరోదరం వరం వరే భవక్త్ర మక్షరం
కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం
మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరం

అకించనార్తి మార్జనం చిరంతనోక్తి భాజనం
పురారి పూర్వ నందనం సురారి గర్వ చర్వణం
ప్రపంచ నాశ భీషనం ధనంజయాది భూషణం
కపోల దాన వారణం భజే పురాణ వారణం

నితాంతికాంత దంతకాంతిమంతకాంతకాత్మజం
అచింత్య రూప మంతహీనమంతరాయకృంతనం
హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినం
తమేకదంతమేవతం విచింతయామి సంతతం


తాత్పర్యం:
  1. మోదకములు చేతిలో ఆనందంగా ఉంచుకుని, ఎల్లప్పుడూ మోక్షాన్ని ప్రసాదించే, శిరస్సున చంద్రుని ధరించిన, లోకాన్ని కాపాడే, నాయకులకే నాయకుడైన, అసురులను, అన్ని ఆశుభాలను నశింప జేసే ఆ విఘ్నేశునికి నా నమస్కారములు. 
  2. భక్తుల శత్రువులకు భయం కలిగించే వానికి, అప్పుడే ఉదయిస్తున్న సూర్యుని వలె ప్రకాశిస్తున్న వానికి, దేవతలు, అసురులచే నుతింపబడేవాడికి , భక్తుల విఘ్నాలను తొలగించే వానికి, దేవతలకే దేవునికి, సర్వ సంపదలకు అధిపతి అయిన వానికి, గజరాజుకు, దేవతల గణాలకు అధిపతి అయిన వానికి ఎల్లప్పుడూ నా నమస్కారములు. 
  3. సమస్త లోకాలకు శుభం కలిగించే వానికి, లోకాన్ని గజాసురుని బారినుండి కాపాడిన వానికి, పెద్ద ఉదరముతో, గజముఖముతో జనులను ఆశీర్వదించే వానికి, కరుణను కురిపించే వానికి, తప్పులను క్షమించి, శుభము, యశస్సు కలిగించే వానికి, తనకు నమస్కరించే వానికి సర్వ శుభాలు కలుగ జేసే విఘ్నరాజునికి నా నమస్కారములు.
  4. కోరికలను తీర్చి, బాధలను నశింప  జేసే వానికి, అనాదిగా పూజింపబడిన వానికి, ప్రళయ కారకుడైన శివుని పెద్ద కుమారునికి, అసురుల గర్వాన్ని అణచే వానికి, ప్రళయ కాలంలో భీషణంగా ఉండే వానికి, సర్పము ఆభరణంగా ఉన్నవానికి, మద గజము వలె ఉత్సాహముగా ఉన్నవానికి, పురాతనమైన వానికి నా భజనలు. 
  5. ఎంతో శోభతో ఉన్న దంతము కలవానికి (ఏకదంతునికి), మృత్యుంజయ కారకుడైన శివుని కుమారునికి, వర్ణనకు, ఊహకు అందని ఆకారము కలవానికి, అంతము లేని వానికి, విఘ్నాలు, ఆపదలు తొలగించే వానికి, వసంత రుతువులాగా యోగుల మనస్సులో నిలిచే వానికి ఎల్లప్పుడూ నా స్మరణ.

7, సెప్టెంబర్ 2010, మంగళవారం

శ్రీరామ జననం - ప్రయాగ రంగదాసు గారి రచన

ప్రయాగ రంగదాసు గారు మన ఆంధ్ర ప్రదేశ్ లో పుట్టిన ఒక వాగ్గేయ కారుడు.  మన మంగళంపల్లి బాలమురళీ కృష్ణగారి మాతామహులు వీరు. ఈయన ఎన్నో మంచి కీర్తనలు శ్రీ రాముని మీద రచించారు. వాటిలో ఒకటి శ్రీరాముని జననం గురించి ఈ క్రిందది . రంగదాసు గారు శ్రీమద్వాల్మీకి రామాయణంలోని బాలకాండం ప్రేరణతో ఈ కీర్తన రాశారు. కోనసీమలోని గుడిమెళ్లంకపురం వీరి స్వగ్రామం.

దీని సారాంశము:

దశరథుడు బ్రాహ్మణులకు దానాలు చేయగా, అన్ని దిశలా మలయ మారుతాలు వీచగా, భూదేవి బాధను తగ్గించటానికి,  చైత్రమాసమున, శుద్ధ నవమి నాడు, పునర్వసు నక్షత్రమున, కర్కాటక లగ్నమందు మెరుపులు మెరుస్తుండగా, దేవతలు పూలవానలు కురిపిస్తుండగా, దేవతల క్షేమము కొరకు, రాక్షసులను చంపటానికి శ్రీరాముడు కౌసల్యా గర్భమున జన్మించాడు.  

రంగదాసు గారు తన ముద్రగా తన స్వగ్రామాన్ని వాడటం ఆయన వ్యక్తిత్వాన్ని చూపుతుంది. అరవైయ్యవ దశకంలోని ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రవణం.

కళ్యాణ రామునికి కౌసల్య లాలి

 రాముడుద్భవించినాడు రఘుకులంబున
తామసులను దునిమి దివిజ
సోమంబుల క్షేమముకై
కోమలి కౌసల్యకు |శ్రీ రాముడు|


పలువరుస ఆణిముత్యపు
సిరులోయన కిలకిలమని నవ్వుచు


దశరథుండు భూసురులకు ధనమొసంగగా
విసరె మలయమారుతములు
దిశలెల్లను విశదములై
వసుమతి దుర్భరము బాప |రాముడు|


తనరు చైత్ర శుద్ధ నవమి పునర్వసందున
సరస కర్కాటకలగ్న
మరయగ సురవరులెలమిని
కురిపించిరి విరుల వాన |రాముడు|


ధరను గుడిమెళ్లంకపురము
నరసి బ్రోవగా
కరుణతో శ్రీ రంగదాసు
మొరలిడగను కరుణించియు వరమీయగ హరియై |రాముడు|

మెడనొప్పి - వ్యాయామాలు

గమనిక: యోగాలో శిక్షణ పొందిన గురువు వద్ద ఈ ఆసనాలు నేర్చుకుంటే సరైన ఫలితాలు ఉంటాయి. కాబట్టి, గురువును సంప్రదించి మాత్రమే ఈ ఆసనాలు వెయ్యండి. 

కంప్యూటర్ ముందు కూర్చుని ఎక్కువసేపు పని చేసే ఎవ్వరికైనా మెడకు, నడుముకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మెడ నొప్పి (స్పాన్దిలైటిస్) ఇందులో అతి సాధారణం. దీనికి కారణం సరైన కూర్చునే విధానము, కంప్యూటర్ని చూసే విధానము లేక. ఆ విధానాల గురించి మీ ఎర్గానమిస్ట్ ను సంప్రదించండి. ఇక, మెడ నొప్పి ఉన్నవాళ్లకు, ఆ నొప్పి మరియు దానికి సంబంధించిన ఇతర దుష్ప్రభావాలను పూర్తిగా అరికట్టటానికి ఈ ఆసనాలు 100 % పని చేస్తాయి. దీనికి ఉదాహరణ నేనే. రెండు నెలల క్రితం విపరీతమైన మెడనొప్పి, తలనొప్పితో బాధపడ్డాను. అప్పుడు మంతెన సత్యనారాయణ గారి రోగాలు-ఆసనాలు పుస్తకం చదివి ఈ ఆసనాలు నేర్చుకున్నాను. ఈరోజు నాకు పూర్తిగా ఆ మెడనొప్పి చాయలు లేవు.  వీటిని ఇదే వరసలో, గురువు దగ్గర నేర్చుకొని మీ మెడ నొప్పిని  పోగొట్టుకోండి.
  1. మత్స్యాసనం
  2. ఉష్ట్రాసనం
  3. సర్పాసనం
  4. భుజంగాసనం
  5. ధనురాసనం
 గూగుల్ లో ఈ ఆసనాలు ఎలా చెయ్యాలో కొన్ని వందల సైట్లు అందమైన చిత్రాలతో ఉన్నాయి.  ఆసనాలు వేసి, మీ మెడను ఆరోగ్యవంతము చెయ్యండి.

మత్స్యాసనం
ఉష్ట్రాసనం
సర్పాసనం
భుజంగాసనం
ధనురాసనం 

వెడలెను కోదండపాణి - త్యాగరాజస్వామి కృతి

వెడలెను కోదండపాణి అనుజ సౌమిత్రితో గూడి పుడమిలో జనులెల్ల పొగడ పూజితుడౌ మునితో గూడి శిరమన కొండెయు జార  వురమున హారములు మెరయ కరమున శరచాపములును ఘ...