13, సెప్టెంబర్ 2010, సోమవారం

మొలకలు - పొద్దున ఫలహారం రకాలు

ఈ మధ్య మొలకలు అందరు ఏదో ఒక రూపంలో వినటమో, తినటమో చేస్తూనే ఉన్నారు. ఆరోగ్యానికి మంచిదని మంతెన వారు తమ ప్రకృతి చికిత్స కార్యక్రమం ద్వారా మొలకలను బాగా ప్రాచుర్యంలోకి తెచ్చారు. రోజు మొలకలు తినాలి అనుకునే వాళ్లకి మరి దాంట్లో కాస్త రుచి కోసం మీకు ఈ కింది రకాలు.

1 . మొలకలు,  టమాటో, క్యారెట్, కీర సలాడ్:

కావలసిన పదార్థాలు: టమాటో (ఒకటి), కీర దోసకాయలు (చిన్నది ఒకటి), ఒక పచ్చి మిరపకాయ, రెండు క్యారెట్లు, ఒక నిమ్మకాయ దబ్బ, ఉప్పు, తేనె, కొత్తిమీర.


చేసే పధ్ధతి:

కీర దోసకాయని చెక్కుతీసి సన్నగా ముక్కలు చేసుకోండి 3 మి.మి సైజులో. అలాగే  టమాటో, పచ్చి మిరపకాయను బాగా కడిగి సన్నని ముక్కలు చేసుకోండి. క్యారెట్లను తొక్కు తీసి తురుముకోండి. ఇవన్ని కలిపి, వాటిలో రెండు-మూడు గుప్పెళ్ళ పెసర మొలకలు వేసి కలిపి, కొంచెం నిమ్మకాయ పిండండి. ఒక్క 2 -3 చుక్కల తేనె, ఉప్పుకావాల్సిన వాళ్లు ఉప్పు వేసి బాగా కలియబెట్టి కొత్తిమీరను సన్నగా తరిగి అలంకరించండి. అప్పటికప్పుడు తింటే నీరు ఊరకుండ భలే రుచిగా ఉంటుంది.

పులుపు రుచి మార్పు కావాలి అనుకునే వాళ్ళకి, నిమ్మ రసం బదులు కొంచెం పచ్చి మామిడి తురుము వేసుకోవాచు. అలాగే, క్యారెట్ బదులు లేత పచ్చికొబ్బరి, బీట్ రూట్, ముల్లంగి, బూడిద గుమ్మడి, సొరకాయ, బీర కాయ, పొట్ల కాయ తురుములలో ఏదైనా వేసుకోవచ్చు. వేసే తురుమును బట్టి కొంచెం ఉప్పు వేసుకోవచ్చు.

2 . మొలకలు-వేరుశనగ పొడి, ఖర్జూరం పొడి

కావలసిన పదార్థాలు: వేరు శనగలు గుప్పెడు, 3 - 4 ఎండుర్జూరాలు












చేసే పధ్ధతి:

వేరు శనగలు (పల్లీలు) వేయించి, పొట్టు తీసి, ఎండు ఖర్జూరంతో కలిపి పొడి చేసుకుని మొలకలతో కలిపి తింటే మంచి రుచి, ఆరోగ్యానికి కూడా అన్ని అందుతాయి. దీనిలో మార్పుగా - పల్లీల బదులు నువ్వులు కానీ, వేరే ఏ డ్రై ఫ్రూట్ అయినా వేసుకోవచ్చు (బాదం, జీడి పప్పు మొదలైనవి - ఇవి వాడినప్పుడు కొంచెం తక్కువ మోతాదులో వేసుకోవాలి). అలాగే, ఖర్జూరాల బదులు బెల్లం తక్కువ మోతాదులో వేసుకోవచ్చు. కొవ్వు, బరువు సమస్య లేని వాళ్లు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ వేసుకోచ్చు. డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. నువ్వులలో చాలా ఎక్కువ క్యాల్షియం ఉంటుంది కాబట్టి చాలా మంచిది ఆరోగ్యానికి.

3 . మొలకలు-పండ్ల సలాడ్

కావలసిన పదార్థాలు: పండీ పండని అరటి పండు, ఆపిల్, దానిమ్మ పండు (సగం చెక్క), కొంచెం నిమ్మ రసం, ఒక అర చెంచా తేనె



చేసే పధ్ధతి:

ముందుగా దానిమ్మ పండు ఒలిచి గింజలు తయారుగా పెట్టుకోండి. అలాగే ఆపిల్ కడిగి సన్నని ముక్కలు తరిగి పెట్టుకోండి. వెంటనే అరటిపండు చిన్న ముక్కలుగా చేసుకోండి. ఈ ముక్కలన్నితిని పెసల మొలకలతో కలిపి కొంచెం నిమ్మరసం, తేనె వేసి కలయపెట్టండి. ఎన్ని ఎక్కువ ఆపిల్ ముక్కలు ఉంటే అంత బాగుంటుంది. అరటి పండు, ఆపిల్ వెంటనే రంగు మారి పాడు అయి పోతాయి కాబట్టి చేసిన వెంటనే తినాలి దీన్ని. ఒక గ్లాస్ పాలతో ఇది తీసుకుంటే మీకు ఫలహారం చాలు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి