17, సెప్టెంబర్ 2010, శుక్రవారం

సగ్గుబియ్యం-ఖర్జూరాలు పాయసం

చక్కెర, బెల్లం లేకుండా పాయసం చెయ్యాలి అనుకుంటున్నారా?. అయితే ఈ కింద వంటకం ప్రయత్నించండి.


కావలసిన పదార్థాలు: 
సగ్గుబియ్యం ఒక చిన్న గ్లాస్ నిండా, పచ్చి ఖర్జూరాలు(లయన్ డేట్సు లాంటివి) పది మెత్తగా రుబ్బి(నీళ్ళు లేకుండా), ఏలకుల పొడి.

పధ్ధతి:
పాత్రలో రెండు గ్లాసులు నీళ్ళు పోసి, అందులో సగ్గుబియ్యం వేసి పూర్తిగా తెల్లదనం పొయ్యేంత వరకు ఉడికించాలి. అడుగు అంటకుండా తిప్పుతూ ఉండాలి. అప్పుడు దీనిలో, గ్రైండ్ చేసిన పచ్చి ఖర్జూరాల పేస్టు వేసి అది పూర్తిగా కరిగేంత వరకు కలియబెట్టుటు ఉండాలి. కావలసినంత ఏలకుల పొడి వేసి కలియబెట్టాలి. ఖర్జూరాల పేస్టు కరిగి, సగ్గుబియ్యం పూర్తిగా ఉడికిన తర్వాత పొయ్యి మీదినుంచి దించేసి పెట్టుకోండి. కాచి, కొద్దిగా చల్లార్చిన పాలు మీగడ లేకుండా ఆ ఉడికిన మిశ్రమం కొంత చల్ల బడిన తర్వాత కావలసినన్ని కలుపుకోవాలి.  కాస్త పలచగా పాయసం రావాలి అంటే పైన చెప్పిన పాళ్ళకు ఒక గ్లాసున్నర పాలు పడతాయి.

అలంకరణ మరియు రుచి ఇష్టపడేవాళ్ళు -  జీడిపప్పు, కిస్మిస్ వగైరా ఊరికే బాణలిలో కాస్త దోరగా వేయించుకొని కలుపుకోవచ్చు (నెయ్యి/నూనెలో వేయించాల్సిన పనిలేదు). పూర్తిగా సగ్గుబియ్యం కాకుండా సగం సగ్గుబియ్యం సగం సేమియా వేసి లేక పూర్తిగా సేమియా వేసి చేసుకోవచ్చు.  చిత్రంలో ఉన్న పాయసం రెండు సగంసగం వేసి చేసినది. సేమియా వేయదలచుకుంటే దాన్ని వేయించుకుని పెట్టుకోండి (నెయ్యి/నూనె అక్కరలేదు).

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి