13, ఆగస్టు 2026, గురువారం

తత్ - తత్త్వమసి- ఓ కథ



వేదాలు పరమపురుషుడైన పరమాత్మను తత్ అని సంబోధించాయి. తత్ అంటే అది. అంటే మనకు సమీపంలో లేనిది అన్నట్లు స్ఫురిస్తుంది. వేదాలు ఇలా ఎందుకు చెప్పాయి? దూరంగా ఉన్నవాడు సమీపంలోనే ఉన్నాడు "దూరాత్ దూరే అంతికే చ" అంటుంది. అవగాహన కానంత సేపూ దూరంగా ఉంటుంది, అర్థమైతే దగ్గరే (అనగా లోపలే) ఉంటుందని అర్థం. దీనికి ఉదాహరణగా ఒక కథ.

ఒక ఊళ్లో పెళ్లీడుకొచ్చిన పిల్లకి తల్లిదండ్రులు అప్పటి సాంప్రదాయాన్ని అనుసరించి సన్నిహిత బంధువుల పిల్లవాడిని వరునిగా ఎంపిక చేశారు. కానీ, ఆ పిల్ల ఆ వివాహానికి ఒప్పుకోకుండా అందరికన్నా శ్రేష్ఠుడినే వరిస్తాను అంటుంది. తల్లిదండ్రులు వాదన చేయలేక పక్కకు తప్పుకుంటారు.

అందరికన్నా ఉన్నతుడు రాజు కాబట్టి తాను రాజును తప్ప ఇంకెవ్వరినీ పెళ్ళాడనంటుంది ఆ పిల్ల. అప్పటినుండీ రాజుగారిని వెంబడించసాగింది. ఒకనాడు పల్లకీలో పోతున్న రాజుకు దారిలో ఒక సన్న్యాసి కనబడితే పల్లకీ దిగి ఆ సన్న్యాసికి ప్రణామలు చెప్పి తన ప్రయాణం కొనసాగిస్తాడు. ఇది గమనించిన పిల్ల అందరి కంటే సన్న్యాసి గొప్పవాడు, కాబట్టి నేను సన్న్యాసినే పెళ్లాడతాను అనుకుని ఆయన వెంట పడింది. ఒకనాడు సన్న్యాసి ఒక అశ్వత్థ వృక్షం క్రింద ఉన్న వినాయకుని ప్రతిమకు నమస్కారం పెట్టడం చూసింది. ఆ పిల్ల తన అభిప్రాయాన్ని మళ్ళీ మార్చుకొని సన్న్యాసి కంటే గణేశుడే గొప్పవాడని ఆయనను వివాహమాడ నిశ్చయించుకుంటుంది. ఆ విగ్రహం ముందు కూర్చుంటుంది. చెట్టు క్రింద ప్రతిమ కావడం వల్ల అక్కడకు పెద్దగా ఎవ్వరూ వచ్చేవారు కాదు. ఒకనాడు అటుపోతున్న ఒక కుక్క ఆ ప్రతిమపై మూత్రం విడిచింది. ఆ ప్రతిమ కంటే ఆ కుక్క గొప్పదని ఆ పిల్ల కుక్క వెంటబడుతుంది. ఆ దారిన పోతున్న ఒక పిల్లవాడు ఆ కుక్కపై ఓ రాయిని విసిరి దానిని గాయపరస్తాడు. ఈ బాధకు అది మరింత వేగంగా పరుగెడుతుంది. దీనినంతా గమనించిన ఓ యువకుడు ఆ మూగజీవిని కొట్టే పిల్లవాడిని చీవాట్లు వేశాడు. ఆ పిల్లవాడిని మందలించిన యువకుడే అందరికన్నా గొప్పవాడనుకుంటుంది ఆ పిల్ల. అతనినే వివాహమాడుతాను అంటుంది. ఇంతకూ ఆ యువకుడెవరో కాదు - తల్లిదండ్రులు ఎంపిక చేసినవాడే.

ఎక్కడో ఉన్నాడనుకొన్నవాడు సమీపానే ఉన్నాడు. అదీ కథ. ఈశ్వరుడెక్కడో ఉన్నాడని దేశమంతా వెదుకుతావు, ఎరుగనంత వరకు నీకు ఆయన దూరస్థుడే. ఎంత వెదికినా కనబడడు. నీకు దగ్గరే ఉంటాడు. అన్నిటికంటే దూరంగా, అన్నిటి కంటే దగ్గరగా ఉంటాడు అంటుంది శృతి. ఎక్కడో దూరంగా ఉన్నాడని తత్ అంటూ మనం చెప్పుకునే భగవంతుడు మనకు దగ్గరలోనే, మనలోనే ఉన్నాడు. నువ్వు అదే అని చెప్పే తత్త్వమసి అన్నదాని అర్థం ఇదే. కాబట్టి పరమాత్మ యొక్క నైజాన్ని సూచించే దాన్ని తత్త్వం అంటారు. ఏ విషయానికైనా గల అంతరార్థాన్ని తత్త్వమంటారు.

- కంచి పరమాచార్యుల వారు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి