ఆవిడ సినీ ప్రస్థానం గురించి ఇంకొక రోజు రాస్తాను. ఆవిడలో నాకు చాలా ప్రత్యేకంగా అనిపించిన లక్షణాలు:
1. ఒక స్త్రీగా అనేక పాత్రలలో, భార్యగా, అక్కగా, తల్లిగా, అమ్మమ్మగా, నాయనమ్మగా ఆవిడ ఎంతటి త్యాగాలు చేశారో, అంతే అద్భుతమైన సిద్ధాంతాలతో కుటుంబాన్ని నడిపించారు అనిపిస్తుంది. తాను తీసుకున్న నిర్ణయాలకు పెద్దగా చింతించకుండా అవన్నీ జీవితంలో సహజ పరిణాములుగానే తీసుకోవటం ఆవిడలో వచ్చిన పరిణతిని సూచిస్తుంది. భర్త ఆర్థికంగా మోసం చేశాక విడాకులు తీసుకున్నా చివరకు ఆయనకు క్యాన్సర్ వస్తే చికిత్సకు ఖర్చులు భరించి, చివరకు అంత్యక్రియలు కూడా చేయించారు. ఇక్కడే నేటి తరాల వారికి పెద్ద సందేశం ఉంది. ఒక మనిషి వల్ల మనకు జీవితకాలపు అన్యాయం జరిగినా, మనకు చేతనైతే ఖచ్చితంగా క్షమతో, మానవతా దృక్పథంతో ఉండాలి.
2. మనిషికి నిజమైన ఆలంబన దైవం. ఆవిడ ఆ మర్గాన్ని ఎన్నడూ వీడలేదు. అందుకే ఆవిడలో అంత ఆత్మవిశ్వాసం. ఆ లక్షణమే ఆవిడను కష్టాలలో నిలబెట్టింది, వృద్ధాప్యంలో చలాకీగా ఉంటూ చివరి రోజుల వరకు స్వతంత్రురాలిగా జీవించేలా చేసింది. ఒకసారి ఊహించండి! తాను సంపాదించిందంతా భర్త తెలియకుండా తగలబెట్టగా, మళ్లీ సంపాదించుకున్న దానితో పిల్లలను పెంచి పెద్ద చేసి స్థిరపరచారు. కన్న కొడుకుకు తన ఆస్తులను రాసివ్వగా తిరిగి చూడలేదు ఆ స్వార్థపరుడు. ఆవిడ ఒక ఇంటర్వ్యూలో 'వాడు చెడ్డవాడా అంటే కాదు! కానీ వాడి జీవితం పెళ్లాం పిల్లల వరకే, తల్లికి స్థానం లేదూ అన్నారు!
3. ఎప్పటికప్పుడు ఆ కాలానికి అనుగుణంగా తనన్ను తాను సంస్కరించుకున్నారు, అలాగే తరతరాల మంచిని కూడా గౌరవించి దాన్ని తన బలంగా మలచుకున్నారు. పాత-కొత్తల మేళవింపు, సమన్వయానికి ఆవిడ ఒక అత్యుత్తమమైన ఉదాహరణ అనిపిస్తుంది.
4. చాలా సార్లు మన ప్రతిభక్తు తగిన గుర్తింపు దక్కలేదు అన్న బాధ మన మాటలలో చేతలలో కనబడి అది మనల్ని కొంతమందికి దూరం చేస్తుంది. ఆవిడ దీనికి అతీతం కాలేదు, కానీ, తన వయసుకు తగిన పరిణతిని కనబరచటం ద్వారా నిజమైన మార్గదర్శకులుగా, పెద్దమనిషిగా ఒక స్థానం మిగుల్చుకోగలిగారు. ఆవిడకున్న ప్రజ్ఞకు, నటనాకౌశలానికి ఎప్పుడో పద్మవిభూషణ్ రావలసిన మాట. కానీ, 90 ఏళ్ళ వయసులో పద్మశ్రీ ఇస్తే కాదనలేదు.
5. స్త్రీలు అబలలు కాదు, సినీరంగంలో ఉన్న అనేక రకాల జాడ్యాలను, వివక్షలను ఎదుర్కొంటు, పక్కకు తప్పుకుంటూ ముందుకు వెళ్లగలిగారు, నిలదొక్కుకోవటమే కాదు, ఈనాటి హీరోయిన్లు ఊహించలేని విజయసోపానాలను అధిరోహించారు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ బలం? ఆత్మవిశ్వాసంతో పాటు స్వీయసంస్కరణలే.
6. మనిషికి కొన్ని అభిరుచులు ఉండాలి. ఆవిడకు వంటలు, సమకాలీన విషయాలపై అవగాహన, చక్కగా హుందాగా ముస్తాబవ్వటం, మనసును తేలికగా ఉంచుకోవటం, కూడ బెట్టుకున్న డబ్బును తన ఆనందం కోసం వినియోగించుకోవటం. దాదాపు 93 ఏళ్ల వయసు వరకు కూడా ఆవిడ తిరుగుతూనే ఉన్నారు, 60 ఏళ్ల మహిళల కన్నా ఉత్సాహంగా జీవించారు.
షావుకారు జానకి గారి జీవితంలో చివరి ఎన్నో ఏళ్లు చెల్లెలు కృష్ణకుమారి గారితో గడిచాయి. ఏడున్నర ఏళ్ల క్రితం కృష్ణకుమారి గారు మరణించినా ఆ ఒంటరితనం నుండి బయటపడ్డారు. ఎన్నో దశాబ్దాలుగా పిల్లలతో కాకుండా వేరుగా ఉండగలిగారు అంటే ఆవిడకు భగవాన్ సత్యసాయిబాబా వంటి అవతారపురుషుల అనుగ్రహం, సహజంగా ఉన్న ఆస్తికత్వం చాలా తోడ్పడ్డాయి.
ఆవిడ జీవితం నుండి మనందరికీ ఎన్ని పాఠాలున్నాయో కదా!
(చిత్రం ఐదు తరాల షావుకారు జానకి కుటుంబం)

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి