7, అక్టోబర్ 2016, శుక్రవారం

శరన్నవరాత్రులు - షష్ఠి నాడు శ్రీమహాలక్ష్మి అలంకారం



ఆశ్వయుజ శుద్ధ షష్టి శుక్రవారం బెజవాడ కనకదుర్గమ్మ శ్రీమహాలక్ష్మిగా దర్శనమిస్తుంది. ఆ తల్లిని అన్నమాచార్యుల వారు ఎంతో వైభవంగా వర్ణించారు. క్షీరాబ్ది కన్యకకు అనే నీరాజనం అందరికీ తెలిసిందే. చూడరమ్మ సతులాలా అనే సంకీర్తనలో ఆయన ఆ తల్లి రూపమైన గోదాదేవిని చూడికుడుత్త నాంచారి గా అభివర్ణించారు. వివరాలు:

చూడరమ్మ సతులారా సోబాన పాడరమ్మ

చూడరమ్మ సతులారా సోబాన పాడరమ్మ
కూడున్నది పతి చూడి కుడుత్త నాంచారి
సోబానే సోబానే సోబానే సోబానే

శ్రీమహాలక్ష్మియట సింగారాలకేమరుదు
కాముని తల్లియట చక్కదనాలకేమరుదు
సోముని తోబుట్టువట సొంపుకళలకేమరుదు
కోమలాంగి ఈ చూడి కుడుత్త నాంచారి

కలశాబ్ధి కూతురట గంభీరాలకేమరుదు
తలపలోక మాతయట దయ మరి ఏమరుదు
జలజనివాసినియట చల్లదనమేమరుదు
కొలదిమీర ఈ చూడి కుడుత్త నాంచారి

అమరవందితయట అట్టీ మహిమ ఏమరుదు
అమృతము చుట్టమట ఆనందాలకేమరుదు
తమితో శ్రీవేంకటేశు తానె వచ్చి పెండ్లాడె
కొమెర వయస్సు ఈ చూడి కుడుత్త నాంచారి

చూడికుడుత్త నాంచారి: గోదాదేవి (చూడి కుడుత్త అనేది తమిళ పదం. తాను ధరించిన మాలను స్వామికి ఇచ్చిన అని దాని అర్థం, అలా చేసింది  గోదాదేవి కాబట్టి ఆమెను చూడికుడుత్త నాచ్చియార్ అంటారుట).

సతులారా! మన గోదాదేవి పతితో కూడియున్నది. పెండ్లిపాటలు పాడండి. (సోబాన అనే పదం కలిగిన పాటలు పెళ్లి పాటలుగా ప్రాచుర్యం పొందాయి)

ఈమె శ్రీమహాలక్ష్మి యట, అలంకారాలకు (శృంగారమునకు) ఏమి తక్కువ?  మన్మథుని తల్లియట, చక్కదనాలు ఏమి తక్కువ? చంద్రుని తోబుట్టువట (క్షీర సాగర మథనంలో లక్ష్మితో పాటు చంద్రుడు కూడా ఆవిర్భవించాడు కాబట్టి వారిద్దరు తోబుట్టువులయ్యారు), ప్రసన్నత మరియు కళకు ఏమి తక్కువ? ఈ గోదాదేవి చాల కోమలమైన శరీరము కలది.

ఈమె సముద్రుని కూతురట, గంభీరానికేమి తక్కువ? తలచితే లోకానికి తల్లియట దయకేమి తక్కువ? నీటినుండి పుట్టిన కమలంలో నివసిస్తుందట చల్లదనానికేమి తక్కువ?  ఈ గోదాదేవి అన్నీ అపరిమితంగా కలిగినది.

ఈమె దేవతల వందనాలు పొందినదట, అటువంటి మహిమలకేమి తక్కువ?  అమృతానికి చుట్టమట (క్షీర సాగర మథనంలో అమృతము కూడా ఉద్భవించింది కాబట్టి) మరి ఆనందాలకేమి తక్కువ? కౌమార్యంలో ఉన్న ఈమెను ఆత్రుతతో శ్రీవేంకటేశుడు తానే వచ్చి పెండ్లాడాడు.

అన్నమాచార్యుల వారు గోదా వైభవాన్ని ఈ సంకీర్తన ద్వారా అద్భుతంగా వివరించారు. శ్రీరంగనాథుని పుట్టుకతోనే కొలిచిన గోదా శ్రీమహాలక్ష్మి అవతారంగా దర్శించి ఈ సంకీర్తనను మనకు అందించారు. గోదాదేవి శృంగారాన్ని, సౌందర్యాన్ని, తల్లి ప్రేమను, కరుణను, కళలను, మహిమలను, గాంభీర్యాన్ని, కోమలత్వాన్ని అద్భుతమైన ఉపమానములతో లక్ష్మీదేవితో పోల్చి ఈ కీర్తనకు దివ్యత్వాన్ని చేకూర్చారు. ఆమె ఈ గుణాలను గమనించి శ్రీరంగనాథుడు వచ్చి పెండ్లాడిన సందర్భంగా సతులను సోబాన పాడరమ్మా అని కోరుతున్నాడు సంకీర్తనాచార్యుడు. పదకవితా పితామహుని భావ సంపద, భక్తి జ్ఞాన సౌరభాలు ఈ సంకీర్తన ద్వారా ప్రకాశిస్తున్నాయి. తల్లిలో ఉండే సర్వ సులక్షణాలను అన్నమయ్య ఇందులో పొందుపరచారు.

విష్ణుచిత్తుని ఇంట జన్మించిన ఆ లోకమాత శ్రీరంగనాథునితో ఏకమయ్యే అద్భుతమైన అవతరణిక తిరుప్పావై.  ఆ తిరుప్పావైలోని ఘట్టాలను ఎందరో సంకీర్తనాచార్యులు తమ భావాలలో వ్యక్తపరచారు. గోదావైభవాన్ని స్వయంగా శ్రీవిల్లిపుత్తూరులో దర్శించి తరించిన అన్నమాచార్యుల వారు దానిని తిరుమల-తిరుపతిలో వెలసిన వేంకటేశుడు-అలమేల్మంగల వైభవానుభూతికి సారూప్యంగా వర్ణించారు. తన జీవితాన్ని శ్రీరంగంలోని రంగనాథునికి సమర్పించిన గోదా 'నేను' అన్న భావాన్ని త్యజించి స్వామిలో ఐక్యమయ్యింది. అందుకే లోకవంద్య అయ్యింది.

అన్నమాచార్యుల వారు అమ్మవారిని ఎన్నో కీర్తనలలో నుతించారు. మెరుగు బోడి అన్నా, చూడికుడుత నాంచారి అన్నా, క్షీరాబ్దికన్యక అన్నా, జయలక్ష్మి అన్నా, ఆ అమ్మను ప్రతి ఒక్క సంకీర్తనలోనూ ప్రత్యేకంగా, ఒక వినూత్నమైన భావాన్ని మన ముందు ఆవిష్కరించారు.  పరమాత్మ యొక్క మాయా స్వరూపిణిగా కూడా మనకు వివరించారు. స్వామితో సరస శృంగార సల్లాపాలు సలిపే అమ్మ, లోకమాతగా, మనలను అపారమైన కరుణతో అనుగ్రహించే తల్లిగా, చల్లని చూపులతో కాపాడే కల్పవల్లిగా, సకల సద్గుణాల రాశిగా అన్నమాచార్యుల వారు ఎన్నో కీర్తనలలో ప్రస్తుతించారు. వాటిలో ఈ చూడరమ్మ సతులాలా ప్రత్యేకమైనది.

వివాహమనేది మానవ జన్మలో ఎంతో పవిత్రమైనది. దానికి సంబంధించిన వేడుకలను, ముచ్చటలను అన్నమాచార్యుల వారు తమ పదశోభలలో ఎంతో మధురంగా జనులకు అర్థమయ్యే భాషలో, అనాటి సమాజానికి అద్ధం పట్టేలా రచించారు. పిడికిట తలంబ్రాల పెళ్లికూతురని పాడినా, సోబాన పాడరమ్మా అని నుతించినా ఆయా వేడుకలను మనకు ఇప్పటికీ తెలిసేలా సాహిత్యాన్ని గుప్పించారు. ఇదే మన సంస్కృతిలోని గొప్పతనం. అది ఒక గంగా ప్రవాహంలాంటిది. మహానుభావుల భావ స్పందనలు రచనలుగా మారి, తర తరాల వారసత్వంగా మనకు అందుతోంది.

అన్నమాచార్యుల పదకవితా వైభవం, ఆధ్యాత్మిక ఉన్నతికి ఈ కీర్తన ఒక కలికితురాయి.  గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్ గారి గళంలో ఈ సంకీర్తనను వినండి.

http://play.raaga.com/telugu/song/album/Anamaya-Sankerthana-Vedanadam-AD000028/Chodaramma-Sathulala-36875

6, అక్టోబర్ 2016, గురువారం

బుచ్చి గ్రామ తిరగమోత



వంటింట్లోంచి వస్తున్న పోపు ఘాటు నషాలానికి అంటి ఉక్కిరి బిక్కిరై పొరలు పొరలుగా దగ్గుతున్నాడు అప్పదాసు. "ఏమేవ్ ఏమని నిన్ను కట్టుకున్నానో ఆ క్షణం నుండీ నీ గ్రామ తిరగమోతతో చస్తున్నాను..."

బుచ్చి: "ఆ అవును ఇంతోటి మన్మథుడని మీరు...ఆ ద్రాక్షారామం సంబంధం వదులుకొని మిమ్మల్ని చేసుకున్నాను చూడండీ! కాపురానికొచ్చిన మర్నాడే మీరు మీ అమ్మ కూర్చొని పోపు ఇలా పెట్టాలి, ఇవి వేయాలి, అవి వేయాలి అని నా బుర్ర తినేసి నేర్పించారు. ఆ తిరగమోతే ఇది...మీరు ఏది అన్నా అది మీకూ, పైనున్న ఆ మహాతల్లికి చెందుతాయి..."

అప్పదాసు: "ఒసేవ్! నీ మొహానికి పప్పులో తిరగమోతలో శనగపప్పు వేయకూడదని కూడా తెలియదు. అది చెప్పి సరిదిద్దితే నీ ముదనష్టపు తిరగమోత ఘాటును మాకు అంటగడతావా. ఇది అన్యాయమే బుచ్చీ!"

బుచ్చి:  "ఏవిటీ అన్యాయం! ఇది దప్పళం, అది పులుసు, ఇది పప్పు, అది పప్పు చారు, ఇది సాంబారు, అది కదంబం పులుసు అని వంద రకాల పేర్లు పెట్టి ఒకే వంటను తిప్పి తిప్పు చెప్పి వాటికి తలా ఓ రకం తిరగమోత చెబితే 16 ఏళ్ల వయసులో నాకేం తెలిసి చస్తాయి! అమ్మో అమ్మో మీరు మీ అమ్మ వంటల గోలతో నేను కాబట్టి వేగాను. ఇంకోతి అయితేనే ఎప్పుడే చెప్పున చాటన కొట్టేది.."

అప్పదాసు: "బుచ్చీ! చెప్పున చాటన కొడతావా!! ఉండు నీ పని చెబుతా" అని చేతిలో ఉన్న పేడ ముద్ద గట్టిగా బుచ్చి కాళ్లకేసి కొట్టాడు.

బుచ్చి: "ఆ! ఆ! ఎంత అఘాయిత్యం! పేడతో కొట్టడానికి నేనేవన్నా మట్టి గోడనా! ఉండండీ మీ పని చెబుతా" అని బలంగా చేతిలో ఉన్న కంచు గరిటె విసిరింది. ఆ కంచు దెబ్బకు అప్పదాసు మోకాలి చిప్ప ఖంగున మోగింది మరుక్షణం అప్పదాసు "అమ్మా" అని కింద బొక్క బోర్లా పడ్డాడు.

ఆ తరువాత బుచ్చి-అప్పదాసుల యుద్ధం ఓ గంటసేపు సాగింది. ఇల్లు కిష్కింధకాండ. ఆ ఇంట ఓ వానర జంట వీరంగం...

శరన్నవరాత్రులలో ఐదవనాడు కాత్యాయని అలంకారం



తిథి ద్వయం కావటంతో బెజవాడ దుర్గమ్మ మామూలుగా శరన్నవరాత్రులలో ఐదవనాడు లలితా త్రిపురసుందరి అలంకారానికి బదులుగా కాత్యాయనిగా దర్శనమిచ్చింది.

కాత్యాయని అనగానే నాకు నా చిన్ననాటి లలిత భక్తి గీతం కాత్యాయనీ కన్నతల్లీ గుర్తుకొచ్చింది. దీనిని శ్రీరంగం గోపాలరత్నం గారు అద్భుతంగా పాడారు. వింజమూరి శివరామారావు గారు ఆనాటి లలిత గీతాల రచయితలలో ప్రముఖులు. దేవులపల్లి వారికి, వింజమూరి సోదరీమణులకు బంధువు. లలిత సంగీతంలో భక్తిని గుప్పించిన కవుల ప్రతిభలు ఆనాడు ఆకాశవాణి కార్యక్రమాల ద్వారా వెలుగులోకి వచ్చాయి. దేవులపల్లి వారు రచించిన లలిత భక్తి గీతాలు అనేకం. అలాగే, మరెందరో  మహానుభావులు. వింజమూరి శివరామారావు గారు కథలు, పద్యాలు, కథానికలతో పాటు రామాయణాన్ని గేయంగా రచించారు కూడా. అది ఎంతో ప్రసిద్ధి పొందింది. దానిని తొలుత బాలమురళీకృష్ణగారు ఆలపించారు. ఆయన ప్రతిభకు గుర్తింపుగా ఆంధ్రా యూనివర్సిటీ వారు కళాప్రపూర్ణ బిరుదునిచ్చారు. ఆకసమున చిరుమబ్బుల చాటున, నల్లనివాడ నే గొల్లపిల్లనోయి, మధురానగరి సమీపంలో, వచ్చెనోయి వసంతము, వినవే చెలి పిలుపు అల్లదిగో వంటి ఎన్నో అద్భుతమైన లలితగీతాలను రచించారు. వీటిని బాలమురళిగారితో పాటు అలనాటి మేటి గాయనీమణులు రావు బాలసరస్వతి గారు, శ్రీరంగం గోపాలరత్నం గారు, వేదవతీ ప్రభాకర్ గారు ఆలపించి శాశ్వతం చేశారు. ఆయన కథలు, ఆయన రచించిన గీతాలన్నీ ఎంతో పేరు పొందాయి.

వింజమూరి వారి రచనలలో ఒకటి శ్రీరంగం గోపాలరత్నం గారు ఆలపించిన కాత్యాయనీ కన్నతల్లి అనే గీతం. శ్రీరంగం గోపాలరత్నం గారు తెలుగుజాతిలో జన్మించిన ఓ సంగీతపు ఆణిముత్యం. బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆవిడ గానం తేనె జాలువారినట్లు ఉండేది. పద్మశ్రీ బిరుదు పొందిన ప్రఖ్యాత ఆకాశవాణి ఆర్టిస్టు ఆవిడ. తెలుగునాట సంగీత పితామహులు శ్రీపాద పినాకపాణి గారి శిష్యురాలు. ఆవిడ భక్తిరనజనిలో పాడిన పాటలు ఎందరో జీవితాలలో భక్తిని మొలకెత్తించాయి. 1939లో విజయనగరం జిల్లా పుష్పగిరిలో సుభద్రమ్మ వరదాచారి దంపతులకు జన్మించిన వీరు హరికథలు, జావళులు, కూచిపూడి మరియు యక్షగానం వంటి కళలలో గాయనిగా ప్రసిద్ధి చెందారు. హైదరబాదు మరియు విజయనగరంలలో సంగీత కళాశాలకు ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆస్థాన విదుషీమణిగా పనిచేస్తున్నప్పుడు అన్నమాచార్యుల వారి కీర్తనలకు సంగీతాన్నిచ్చారు. సకలం హే సఖి అని ఆవిడ పాడిన అన్నమాచార్య కీర్తన ఎంతో పేరు పొంది నేటికి కూడా ప్రమాణమైంది. కాత్యానీ కన్నతల్లీ వివరాలు.

కాత్యాయనీ! కన్నతల్లీ! మమ్మేలు భక్తావనీ! కల్పవల్లీ!

నీ సేవలే నిత్య సంకీర్తనమ్ములే మా జీవితాల భాగ్యాలు సౌభాగ్యాలు

శివదేవ సీమంతినీ జేజేలు భువనైక సామంతినీ
నీ చూపు వెల్గులు నీ నవ్వు వెన్నెల
ఏ కాలమూ మూడు లోకాల పైనాడు

ఇంద్రకీలాద్వాసినీ దుర్గమ్మ సాంద్ర తేజోద్భాసినీ
నిన్ను పూజింతుమీ హృదయాల కుసుమాల
మన్నింపుమమ్మ నీ చరణాలే శరణాలు

ఆడియో కోసం ఈ లింకును ఓపెన్ చేయండి. క్రింది భాగంలో 2వ పాట ఇది.

http://eemaata.com/em/issues/201501/6384.html?fmt=rts

5, అక్టోబర్ 2016, బుధవారం

ఆశ్వయుజ శుద్ధ చతుర్ధి అనంతరం పంచమి - శ్రీ లలితా శివజ్యోతి


శ్రీచక్ర రాజ సింహాసనేశ్వరి శ్రీలలితాంబికయే భువనేశ్వరి
ఆగమ వేద కళామయ రూపిణి అఖిల చరాచరాచరి జనని నారాయణి
నాగ కంకణ నటరాజ మనోహరి జ్ఞాన విద్యేశ్వరి రాజరాజేశ్వరి

అని అగస్త్యార్ అమ్మవారిని కొలిచాడు. సమస్త జీవరాశులలో ఉన్న ఆ తల్లి నారాయణిగా రాజరాజేశ్వరిగా నుతించబడింది. శ్రీచక్రనివాసిని అయిన లలితాంబిక సనాతన వేద వాఙ్మాయానికి, సమస్త కళలకు రూపముగా ప్రస్తుతించబడింది. బ్రహ్మాండ పురాణంలో హయగ్రీవ-అగస్త్య సంవాదంలో చెప్పబడిన లలితా సహస్రనామావళిలో కూడా "చతుష్షష్ట్యుపచారాఢ్యా చతుష్షష్టి కళామయి మహా చతుష్షష్టి కోటి యోగినీ గణసేవితా" అని కొలువబడింది. 64 ఉపచారాలతో కొలువబడిన తల్లిగా, 64 కళలకు ఆలవాలంగా తల్లిని ఈ స్తోత్రంలో నుతించారు. మరి ఏమిటీ చతుష్షష్టి ఉపచారాలు అని ఒక ప్రశ్న వచ్చింది. ధ్యానం, దివ్య మందిరం, రత్న మంటపం, ఆందోళికం, ఆవాహనం, సింహాసనం, వితానం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనం, మధుపర్కం, అభ్యంగం, ఉద్వర్తనం, పంచామృత స్నానం, శుద్ధోదక స్నానం, వస్త్రం, ఉత్తరీయం, దివ్య పాదుక, కేశపాశ బంధనం, సౌవీరాంజనం, ఆభరణం, శ్రీగంధం, అక్షత, హరిద్రాచూర్ణం, కుంకుమ విలేపనం, సుగంధ ద్రవ్యాణి, సిందూరం, అథాంగ పూజ, ధూపం, దీపం, కుంభార్తిక్యము, నైవేద్యము, హస్తప్రక్షాళనం, పానీయం, ఫలం, తాంబూలం, సువర్ణపుష్ప దక్షిణ, ఛత్రం, చామరం, దర్పణం, నీరాజనం, దివ్యమంత్ర పుష్పం, ప్రదక్షిణం, నమస్కారం, తురంగ వాహనం, గజ వాహనం, రథం, చతురంగ సైన్యం, దుర్గం, వ్యజనం, దృక్పానపాత్ర నటనం, నాట్యం, మృదంగ వాద్యం, గంధర్వకన్యా గానం, అనేక విధ వాద్యాని, క్షమాపణం, భక్త్రగృహ నివాసం, సువర్ణపర్యంకోపవేశనం, పాదయోః లాక్షారంజనం, గండూష జలపాత్రం, సుఖ శయనం, మమహృదయే నిత్యనివాసనం, పూజా ఫలం, ప్రసనార్ఘ్యం..అదండీ సంగతి. అమ్మను ఇంత వివరంగా కొలువవచ్చు. సమయాన్ని బట్టి, భావాన్ని బట్టి సేవలు.

లలితాపరమేశ్వరి అనగానే 1967లో విడుదలైన రహస్యం చిత్రంలో లీలగారు పాడిన శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా అన్న పాట గుర్తుకు వస్తుంది. తెలుగునాట స్త్రీల నోట మంగళహారతి పాటగా శాశ్వతమైపోవటానికి కారణం అందులోని సాహిత్యం, తేలికైన భాష. సమస్త కామ్యములను తీర్చే తల్లిగే సకల శుభకరిగా ఆ జగన్మాతను ఈ గీతంలో కొనియాడారు.  సాహిత్యం పరిశీలిస్తే సముద్రాల వారు రచించినట్లు అనిపిస్తోంది. చిత్రం టైటిల్స్‌లో ఆయన పేరు ఉంది. కానీ ఖచ్చితంగా ఆయనే రచించారని చెప్పటానికి నా దగ్గర ఆధారాలు లేవు. ఎవరు రాసినా, తెలుగునాట ఈ పాట పొందిన ప్రాచుర్యం అంతా ఇంతా కాదు. లలితా త్రిపురసుందరికి మంగళ హారతి పలికే ఈ గీతం సాహిత్యం ఈనాడు ఆశ్వయుజ శుద్ధ చతుర్ధి అనంతరం పంచమి శుభదినాన అందరి కోసం.

శ్రీ లలితా శివజ్యోతి సర్వకామదా
శ్రీగిరి నిలయా గిరామయ సర్వమంగళా

జగముల చిరు నగవుల పరిపాలించే జననీ
అనయము మము కనికరమున కాపాడే జననీ
మనసే నీ వశమై, స్మరణే జీవనమై
మాయని వరమీయవే పరమేశ్వరి మంగళ నాయకి
శ్రీ లలితా శివజ్యోతి సర్వకామదా

అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి
అందలేలే చల్లని తల్లికి చంద్రహారతి
రవ్వల తళుకుల కళల జ్యోతుల కర్పూరహారతి
సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళ హారతి


4, అక్టోబర్ 2016, మంగళవారం

శరన్నవరాత్రులు - అన్నపూర్ణాదేవి అలంకారం


అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆ అన్నం జీవాధారమే కాదు, జీవికి మూలం కూడా.

అన్నాద్భవంతి భూతాని పర్జన్యాత్ అన్నసంభవః
యజ్ఞాద్భవంతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవః

కర్మలనుండి యజ్ఞము, యజ్ఞము వలన వర్షములు కలిగి, వర్షము వలన పంటలు పండుతాయి అని శ్రీకృష్ణ భగవానుడు శ్రీమద్భగవద్గీతలోని కర్మయోగములో చెప్పాడు.

అన్నము స్త్రీపురుషులలోని ఓజస్సుకు కారణమై మానవజాతి సృష్టికి మూలమైంది. ఆ ఆహారానికి అధిదేవతగా ఈనాడు ఆదిపరాశక్తి అన్నపూర్ణేశ్వరి అలంకారంలో దర్శనమిస్తుంది. ఆదిశంకరులు అన్నపూర్ణాష్టకంలో ఈ తల్లి వైభవాన్ని అద్భుతంగా వివరించారు. అంతే అద్భుతంగా ముత్తుస్వామి దీక్షితుల వారి తన కృతి అన్నపూర్ణే విశాలాక్షిలో వర్ణించారు. పాయసాన్నం కలిగిన బంగారు గిన్నె చేత ధరించిన తల్లి సాక్షాత్తు పరమశివునికే భిక్ష ఇచ్చింది. సమస్తలోకానికి అమ్మగా నిలిచింది. ఆ కీర్తన వివరాలు.

అన్నపూర్ణే విశాలాక్షి అఖిల భువన సాక్షి కటాక్షి

ఉన్నత గర్త తీర విహారిణి ఓంకారిణి దురితాది నివారిణి
పన్నగాభరణ రాజ్ఞి పురాణి పరమేశ్వరి విశ్వేశ్వర భాస్వరి

పాయసాన్న పూరిత మాణిక్య పాత్ర హేమదర్వీ విధృత కరే
కాయజాది రక్షణ నిపుణతరే కాంచనమయ భూషణాంబరధరే
తోయజాసనాది సేవిత పరే తుంబురు నారదాది నుత వరే
త్రయాతీత మోక్షప్రద చతురే త్రిపద శోభిత గురుగుహ సాదరే

ఓ అన్నపూర్ణ తల్లీ! విశాలమైన కన్నుల గల అమ్మా! సమస్త లోకాలకు సాక్షివి! కటాక్షాన్ని ప్రసాదించే తల్లీ!

ఉన్నతమైన గర్త తీరంలో విహారం చేసే, (తిరువారూర్ వద్ద కుళిక్కుళై అనే క్షేత్రంలో అన్నపూర్ణా విశ్వనాథుల క్షేత్ర కీర్తన ఇది) ఓంకార రూపిణీ! సమస్త పాపములను తొలగించే, నాగాభరణములను ధరించే శివుని రాణీ! పురాణములలో పొగడబడిన పరమేశ్వరీ! శివుని ప్రక్కన ప్రకాశించే అమ్మా!

పాయసాన్నము కలిగిన పాత్ర ఒక చేత, బంగారు గరిటే ఒక చేత కలిగి శోభిల్లే, మన్మథుడు మొదలైన వాని రక్షించుటలో నైపుణ్యము కలిగిన, బంగారు వస్త్రములను, ఆభరణములను ధరించిన తల్లీ! కమలాసనుడైన బ్రహ్మ మొదలగు దేవతలచే పూజించబడిన, నారదుడు, తుంబురుడు మొదలైన వారిచే నుతించబడే తల్లీ! ధర్మార్థ కామ్యములను దాటించి మోక్షమును ప్రసాదించటంలో చాతుర్యము కలిగిన, సత్-చిత్-ఆనందములచే శోభిల్లే, గురుగుహుని ఆదరించే తల్లీ! రక్షించుము!

ముత్తుస్వామి దీక్షితుల వారి క్షేత్ర కీర్తనలలో ఈ అన్నపూర్ణే విశాలాక్షీ ఎంతో ప్రాచుర్యం పొందింది. శ్రీవిద్యోపాసనలో సిద్ధులైన దీక్షితులవారు అమ్మను నిరంతరం దర్శించి ఎన్నో అద్భుతమైన కీర్తనలను రచించారు. సామరాగంలో ఈ అన్నపూర్నే విశాలాక్షీ అన్న కీర్తన కుళిక్కుళైలో గల కాశీవిశ్వనాథుని దేవేరి అన్నపూర్ణమ్మను నుతిస్తూ రచించారు.

అన్నపూర్ణ పార్వతీదేవి యొక్క స్వరూపము. సకల కామ్యములతో పాటు మానువుని జీవితానికి అత్యంత ముఖ్యమైన భోజ్యములను అనగా పాడి పంటల ద్వారా వచ్చే ఆహార పదార్థములను పుష్కలముగా అందించె కామితార్థ దాయిని. అన్నం పరబ్రహ్మ స్వరూపం. స్వయంగా సదాశివుడే కాశీ క్షేత్రంలో అమ్మ వద్ద భిక్షను ప్రతిరోజూ తీసుకుంటాడని పురాణలు చెబుతున్నాయి. ఆది శంకరుల వారు తన గురువైన మండన మిశ్రుని వద్దే కాక గురుపత్ని అయిన ఉభయ భారతీదేవి వద్ద కూడా విద్యను నేర్చుకున్నాడు. ఆ తల్లి తన పట్ల చూపిన ఆదరణకు కృతజ్ఞతతో అన్నపూర్ణాష్టకం రచించారు.

దీక్షితులవారి సాహిత్యంలో అమ్మ వైభవాన్ని ఎన్నో కోణాలలో అద్భుతమైన సాహితీ సంపదతో ఆధ్యాత్మిక సుగంధంతో తెలియజేశారు. ఆయనలోని దైవశక్తి ఆయన కీర్తనలలో స్పష్టంగా కనిపిస్తుంది. ఓంకార రూపిణి, పురాణి, త్రిపద శోభిత అని అన్నప్పుడు ఆయన ఆదిపరాశక్తిని ఏయే అనుభూతులలో ఏయే రూపాలలో దర్శించాడో అర్థమవుతుంది. నిగూఢార్థము కలిగిన పదాలు మనం అనుకుంటే రావు. పూర్తిగా ఆ దేవతా స్వరూపం ఆ కృతికర్తను అనుగ్రహించి పదాలను శక్తిపూరితం చేసి రచనలో వచ్చేలా చేస్తుంది. దీక్షితుల వారి ప్రతి కృతిలోనూ ఈ దైవానుగ్రహము, దైవబలము తేటతెల్లమవుతుంది. అందుకే ఆయన సంగీత త్రయంలో ఒక్కరైనారు. సంగీతం ద్వారా సనాతన ధర్మం పరిఢవిల్లటానికి, భారత దేశపు ఆధ్యాత్మిక శక్తి ప్రకాశించటానికి ఎంతో తోడ్పడ్డారు.

సామ రాగం అద్భుతమైన లాలిత్యము,కరుణ రసము కలిగినది. ఈ రాగంలో శాంతము లేక సౌఖ్యము లేదు, మానస సంచరరే మొదలైన మృదుభావాన్ని, పరిపూర్ణమైన ప్రశాంతతను ఒలికించే కీర్తనలు రచించ బడ్డాయి. దీక్షితులవారు అమ్మకు తనపై గల అపారమైన కరుణకు సూచికగా ఈ అన్నపూర్ణే  విశాలాక్షి కృతికి సామ రాగాన్ని ఎన్నుకొన్నారు. పాలు తేనె కలిసినట్లు భక్తిపూరితమైన సాహిత్యము, కరుణాపూరితమైన రాగలక్షణము కలిసి అమృతాన్ని కురిపించాయి.

ప్రఖ్యాత కర్ణాటక సంగీత విదుషీమణి ఎమ్మెస్ షీలా గారి గాత్రంలో ఈ కీర్తన వినండి.


3, అక్టోబర్ 2016, సోమవారం

శరన్నవరాత్రులు - గాయత్రీదేవి అలంకారం


ఈరోజు బెజవాడ కనకదుర్గమ్మ గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిస్తుంది. ఆ సందర్భంగా ఓ అరుదైన వాగ్గేయకారుడు మరియు ఆయన రచించిన గాయత్రీమాత కృతి వివరాలు మీకోసం.

గాయత్రీ దేవి మీద రచించబడిన కృతులలో ఎక్కువమటుకు మన తెలుగుజాతి మహనీయుడు ఓగిరాల వీరరాఘవ శర్మ గారు రచించినవే. భక్త జ్ఞానానందతీర్థగా సన్యాసాశ్రమంలో పిలువబడిన ఈ కృతికర్త మహా గాయత్రీ ఉపాసకులు. 1908 మార్చి 23న ఒంగోలు జిల్లా ధేనువకొండ గ్రామంలో జన్మించిన ఈయన తండ్రి వద్దే వేదవేదాంగాలు నేర్చుకున్నారు. ఈయన సంగీత గురువు హరి నాగభూషణం గారు. ఆలిండియా రేడియో ద్వారా కొన్ని వందల కచేరీలు చేశారు. రచనలు చేయటంతో పాటు ఆయన రాగాలను కూడా సృష్టించారు. భక్తి జ్ఞాన వైరాగ్యాలను ప్రస్ఫుటించే ఆయన కీర్తనలు దేవీ గానసుధ అనే పుస్తక రూపంలో ప్రచురించబడ్డాయి. గాయత్రీ మాతపై రచనలు చేసిన మొట్టమొదటి వాగ్గేయకారులు ఈయనే. తరువాత మైసూరు మహారాజావారు ఒక రచన చేశారు. సన్యాసాశ్రమానికి పూర్వం 'రాఘవ ' అనే ముద్రను, అటుతరువాత 'జ్ఞానానంద తీర్థ ' అనే ముద్రను ఆయన ఉపయోగించారు. ఆయన కుమారుడు ఓగిరాల రామకృష్ణగారు, కుమార్తెలు విమల-లలిత కూడా సంగీత ప్రవీణులు. ఈయన కొవ్వూరులో గాయత్రీ పంచాయతన పీఠం ఏర్పాటు చేశారు.1989లో ఆయన సిద్ధి పొందారు. ఆయన రచించిన శ్రీ గాయత్రీ దేవి సనాతని అనే కృతి వలజి రాగంలో మీకోసం. దీనిని బాలమురళీకృష్ణ గారు ఆలపించారు.

శ్రీ గాయత్రీ దేవీ సనాతని సేవక జన సుశ్రేయోదాయిని

వాగధిపతి సురేంద్ర పూజితే వరదాయకి పంచరదనే సువాసిని

రాగద్వేష రహితాంతరంగ హితే రత్నఖచిత మణిహార మండితే
రసయుత సంగీత మోదితే రాఘవాది భక్త రక్షణ చరితే


2, అక్టోబర్ 2016, ఆదివారం

శరన్నవరాత్రులు - బాలాత్రిపురసుందరి అలంకారం


ఈరోజు బెజవాడ కనకదుర్గమ్మ బాలాత్రిపుర సుందరి అలంకారం కదా. ముత్తుస్వామి దీక్షితుల వారి బాలాంబిక కృతి ఒకటి విన్నాను. అద్భుతమైన సాహిత్యం. ఆదిపరాశక్తి తత్త్వమంతా ఈ కృతిలో నిబిడీకృతమై ఉంది. కేజే యేసుదాస్ గారి గాత్రంలో దీనిని వినవచ్చు.

భజరే రే చిత్త బాలాంబికాం భక్త కల్ప లతికాం

నిజరూప దాన దక్ష చరణాం
అరుణాం నిత్యాం కళ్యాణీం శర్వాణీం

శ్రీ వాగ్భవ కూట జాత చతుర్వేద స్వరూపిణీం
శృంగార కామ రజోద్భవ సకల విశ్వ వ్యాపినీం
దేవీం శక్తి బీజోద్భవ మాతృకార్ణ శరీరిణీం
దేవనుత భవ రోగ హర వైద్య పతి హృదయ విహారిణీం
భావ రాగ తాళ మోదినీం భక్తాభీష్ట ప్రదాయినీం
సేవక జన పాలినీం గురుగుహ రూప ముత్తు కుమార జననీం


వెడలెను కోదండపాణి - త్యాగరాజస్వామి కృతి

వెడలెను కోదండపాణి అనుజ సౌమిత్రితో గూడి పుడమిలో జనులెల్ల పొగడ పూజితుడౌ మునితో గూడి శిరమన కొండెయు జార  వురమున హారములు మెరయ కరమున శరచాపములును ఘ...