29, జులై 2017, శనివారం

సరసీరుహాసన ప్రియే - దురైస్వామి అయ్యరు కృతి



సరసీరుహాసన ప్రియే! అంబ! సదా వీణా గానప్రియే! సదానంద హృదయే! మహిసదయే!

శరణాగతం మామవ! మంజుల చరణ కిసలయే!
సమ్మోదిత కవిజన హృదయే! సరోజ నిలయే! మణివలయే!

సరసీరుహాక్షి యుగళే అంబ!
శరణాగత దీన వత్సలే!
శరదిందు సుందర వదనే! విమలే!
సరస్వతీ! అంబ! సతి! దేశిక నుత గుణశాలే!
సతతం విద్యా లోలే! సదా సుశీలే!
సామజ! కుంభ స్తన యుగళే! ధవళే! 
సకల సామ్రాజ్య ప్రద! కర ధృత పుస్తక జాలే!

- పులియూరు దురైస్వామి అయ్యరు

కమలాసనుడైన చతుర్ముఖ బ్రహ్మకు ప్రియమైన అమ్మా సరస్వతీ! ఎల్లప్పుడూ వీణా గానమంటే ఇష్టపడే, సచ్చిదానందముతో నిండిన హృదయము కలిగి, ఈ భూమిపై అనుగ్రహము కలిగిన తల్లీ! చిగురులవలె మృదువైన చరణములు గలదానవు!  కవిజనుల హృదయాలకు ఆనందం కలిగించే తల్లివి! కమలములో స్థిరమై యున్న దానవు!మాకు నీవే శరణం. కలువలవంటి కన్నులు కలిగిన తల్లీ! నీవు శరణన్న దీనులపై వాత్సల్యము కలిగిన అమ్మవు. శరదృతువులో చంద్రుని వంటి సుందరమైన ముఖము కలిగిన దానవు, నిర్మలమైన తల్లివి. ఓ సరస్వతీ! ఉత్తమమైన స్త్రీవి నీవు! పుణ్యాత్ములచే పొగడబడిన గుణములకు నెలవు నీవు! ఎల్లప్పుడూ విద్యలలో నిమగ్నమైయుందువు, నిరంతరం సద్గుణ సంపన్నవు. సకల విద్యలను పూర్ణమైన స్తనములలో కలిగిన అమ్మవు, తెల్లని వస్త్రములు ధరించి, చేతిలో పుస్తకములు కలిగి సమస్త భోగములు ప్రసాదించే అమ్మవు నీవు! నీవే మాకు శరణము.

యువ గాయనీమణులు  రంజని-గాయత్రిల గాత్రంలో ఈ నాట రాగంలో ఈ కృతి వినండి

కదిరి నృసింహుడు కంబమున వెడలె - అన్నమాచార్యుల సంకీర్తన


కదిరి నృసింహుడు కంబమున వెడలె
విదితముగా సేవించరో మునులు 

ఫాల లోచనము భయదోగ్రముఖము
జ్వాలామయ కేసరములును
కాలరౌద్ర సంఘటిత దంతములు
హేలగతి ధరియించుక నిలిచె 

ముడివడు బొమ్మలు ముంచిన ఊర్పులు
గడగడనదరెడి కటములును
నిడుద నాలుకయు నిక్కు కర్ణములు
నడియాలపు రూపై వెలసె 

సకలాయుధములు సహస్ర భుజములు
వికట నఖంబులు వెసబూని
వెకలియగుచు శ్రీవేంకటేశ్వరుడు
ప్రకటపు దుష్టుల భంజించేనిదివొ

- సద్గురువు తాళ్లపాక అన్నమాచార్యుల వారు

నరసింహావతారంపై అన్నమాచార్యుల వారు ఎన్నో కీర్తనలు రచించారు. వాటిలో ప్రత్యేకమైనది ఈ కదిరి నృసింహుడు కంబమున వెడలె. అనంతపురం జిల్లాలోని ఖాద్రి నరసింహస్వామి క్షేత్రం సనాతనమైనది. ఖాద్రి అనగా బ్రహ్మదారువు చెట్టుతో చేయబడిన స్థంభము. హిరణ్యాక్షుని వధించటానికి నరహరి రూపంలో శ్రీమహావిష్ణువు ఆ ఖాద్రియందు అవతరించాడు. అందుకే ఆ క్షేత్రానికి ఖాద్రి నరసింహుడు అని పేరు వచ్చింది. కాలగమనంలో కదిరిగా మారింది. ఆ కదిరి నరసింహుని అవతరణికను అన్నమయ్య ఈ కీర్తన ద్వారా మనకు తెలియజేశారు.

కంబమునుండి వెడలిన ఆ నరసింహుని సేవించండి మునులారా అని అన్నమయ్య ఈ సంకీర్తనను ఆరంభించారు. అగ్ని నేత్రముతో, భయము కలిగించే ఉగ్రమైన ముఖముతో, జ్వలించే కేసరములతో, ప్రళయకాల రుద్రుని వలె భీకరమైన దంతములతో హేలగా నిలిచినాడు. ముడి పడిన కనుబొమ్మలు, బుసలు కొట్టే ఉచ్ఛ్వాస-నిశ్శ్వాసలతో, గడ గడ అదరుచున్న చెక్కిళ్లతో, బయటకు వెడలియున్న నాలుకతో, నిక్కబొడుచుకున్న చెవులతో, ప్రత్యేకమైన రూపంగా వెలసినాడు. సమస్త ఆయుధములు, ఎంచలేని భుజములు కలిగి భీకరమైన గోళ్లతో వేగముగా కదలుచు దుష్టులైన దానవులను సంహరించటానికి ఆ శ్రీవేంకటేశ్వరుడు (నరసింహుడు) అవతరించినాడు.ఆతని సేవించండి!

ఈ సంకీర్తన అఠాణ రాగంలో గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు అద్భుతంగా ఆలపించారు.


తొల్లియును మఱ్ఱాకు తొట్టెలనె యూగెగన - అన్నమాచార్యుల సంకీర్తన


తొల్లియును మఱ్ఱాకు తొట్టెలనె యూగెగన చెల్లుబడి నూగీని శ్రీరంగశిశువు

కలికి కావేరి తరగల బాహులతలనే 
తలగకిటు రంగ మధ్యపు తొట్టెలను
పలుమారు దనునూచి పాడగా నూగీని
చిలుపాల సెలవితో శ్రీరంగశిశువు

వేదములే చేరులై వెలయంగ శేషుడే
పాదుకొను తొట్టెలై పరగగాను
శ్రీదేవితో గూడి శ్రీవేంకటేశుడై
సేదదీరెడి వాడె శ్రీరంగశిశువు

తొలుత మఱ్ఱాకుపై వైభవంగా తేలియాడిన వాడు,వటపత్రశాయిగా పేరొందిన వాడు ఈ శ్రీరంగ శిశువు. లతలవంటి కావేరీ తరంగాలు బాహువులుగా,  పాటలు పాడబడుచు పెదవుల మూలలలో పాలు కలిగిన అందమైన బాలుడు శ్రీరంగములో తొట్టెలలో ఊగుచున్నాడు. వేదాలే హారములుగా ఆది శేషుడే ఊయలగా ఒప్పుగా లక్ష్మీదేవితో కూడిన వేంకటేశుడు సేదదీరుచున్నాడు. అతడే శ్రీరంగ శిశువు.

- సద్గురువులు తాళ్లపాక అన్నమాచార్యుల వారు.

నీలాంబరి రాగంలో ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు ఆలపించిన ఈ అన్నమాచార్యుల వారి సంకీర్తన ఆ శ్రీరంగంలోని చిన్ని కృష్ణుడు ఊయలలో ఊగే సేవను అద్భుతంగా తలపిస్తుంది. పాలు తాగి ఊయలలో ఆ చిన్ని కృష్ణునికి తిరువారాధనలో పాటలు పాడుచుండగా ఊగే మనోజ్ఞమైన దృశ్యాన్ని అన్నమయ్య మనకు ఈ సంకీర్తన ద్వారా ఆవిష్కరించారు. పాలకడలిలో ఆదిశేషునిపై సేదదీరే లక్ష్మీపతి, మార్కండేయుని తపస్సుకు మెచ్చి అతనిని మఱ్ఱాకుపై వెలసిన బాలుని ఉదరములోనికి ప్రవేశింపజేసి విశ్వ రహస్యాన్ని తెలుపుతాడు. ఆ వటపత్రశాయే ఈ బాలకృష్ణుడు అని అన్నమయ్య తెలిపారు.


(చిత్రం వటపత్రశాయి అలంకారంలో ఉడిపి శ్రీకృష్ణుడు)

మామవ సదా జననీ - స్వాతి తిరునాళ్ కీర్తన


మామవ సదా జననీ మహిషాసుర సూదని

సోమ బింబ మనోహర సుముఖి సేవకాఖిల
కామదాన నిరత కటాక్ష విలాసిని

కురు మే కుశలం సదా కమలనాభానుజే
నిరవధి భవ ఖేద నివారణ నిరతే
చారు నూతన ఘన సదృశ రాజిత వేణి
దారుణ దనుజాళి దారణ పటు చరితే

అమ్మా పార్వతీ దేవి! మహిషాసురుని సంహరించిన నీవు నన్ను ఎల్లప్పుడూ కాపాడుము! చంద్రుని వంటి ముఖముతో మా మనసులను దోచుకొనెదవు. నిన్ను సేవించే వారికి సమస్త కామ్యములను ఎల్లప్పుడూ అనుగ్రహించే కటాక్షముతో ప్రకాశించే అమ్మవు. కమలమును నాభిలో గల శ్రీహరి సోదరివి, అనంతమైన భవసాగరపు దుఃఖములను నివారించటములో నిపుణురాలవు. అందమైన నీ కురులు క్రొత్త మేఘములవలె ప్రకాశిస్తున్నాయి. దారుణమైన గుణములు కల్గిన రాక్షస సమూహాన్ని సంహరించిన ఘనమైన చరిత గల తల్లివి. నాకు ఎల్లప్పుడూ క్షేమాన్ని కలుగజేయుము.

- మహారాజా స్వాతి తిరునాళ్ కీర్తన సుధా రఘునాథన్  గారి గాత్రంలో వినండి.


రామా నిను నమ్మినవారము గామా - త్యాగరాజస్వామి కీర్తన


రామా నిను నమ్మినవారము గామా సకల లోకాభి 

పామర జన దూర వర గుణ ఘృణాపాంగ శుభాంగ ముని హృదయాబ్జ భృంగ 

వాలాయముగాను రాను జాగేల సుగుణ దశరథ నృపాల హృదయానందకార శ్రి లోల పాల వెలయుమిక
ఫాల లోచన హృదయాలయాప్త జన పాల కనకమయ చేల ఇక పరాకేల ఇపుడు మమ్మేల నీదు మనసేల రాదు

నీవే గతి యంటిని గాని నే వేరేమి ఎరుగను ముందర రావే నీ పద పంకజ భక్తి నీవే భావజారి నుత
దేవ నీదు పద సేవా ఫలము మము గావునే పతిత పావన త్రిదశ నాధనీయ ముని జీవనానిశము బ్రోవనేల శ్రీరామ 

ధారాధర నిభ దేహ జనాధార దురితాఘ జలద సమీర త్యాగరాజ హృదయాగార సార హీన సం
సారమందు వేసారి నిన్ను మనసార నమ్ము కొన నేరలేని నే నూరక ఇక విచారమందుటకు మేర గాదు శ్రీరామ

సమస్త లోకములకు ఆనందంకు కలిగించే శ్రీరామా! మేము నిన్ను నమ్మినవారము గామా? పామరులకు దూరుడవు, శ్రేష్ఠమైన గుణములు కలవాడవు, దయాకటాక్షములు గలవాడవు, శుభమైన అంగములు కలవాడవు, మునుల హృదయకమలములకు తుమ్మెద వంటి వాడవు నీవు. దశరథ మహారాజు హృదయమునకు ఆననందము కలిగించిన వాడవు మమ్ములను కాపాడుటకు వేగముగా రావేల? వచ్చి రక్షించుము. శివుని హృదయములో నివసించే వాడవు, ఆప్తజనులను పాలించే వాడవు, బంగారు వస్త్రములు ధరించే వాడవు, ఇంక పరాకెందుకు? ఇప్పుడు మమ్ములను కాపాడుటకు నీకు మనసేల కలుగుటలేదు? నీవే శరణన్నాను, నీ పాదపద్మముల భక్తి తప్ప వేరేమీ ఎరుగను, వేగముగా వచ్చి కాపాడుము. మన్మథుని శత్రువైన శివునిచే నుతించబడిన వాడవు, నీ పాదములను సేవించే ఫలము మమ్ములను కాపాడును కదా! పతితులను పావనము చేసే వాడవు, మూడులోకములకు అధిపతివి, మునుల జీవనమైన వాడవు, ఎల్లప్పుడూ మమ్ములను బ్రోచుటకేల ఆలస్యము? మేఘముల వంటి కాంతితో శరీరము గల శ్రీరామా! జనులకు ఆధారము నీవే. పాపములనెడి మేఘములను వాయువు వలె తరిమి కొట్టేవాడవు, శివుని హృదయములో నివసించే వాడవు, ఈ సారములేని సంసార సాగరమందు వేసారి నిన్ను మనసారా నమ్ముకొన్నాను, నిస్సహాయుడైయున్న నన్ను బాధ పెట్టుట ఇంక మర్యాద కాదు శ్రీరామా! మేము నిన్ను నమ్మినవారము, వేగమే వచ్చి మమ్ము రక్షించుము.

- సద్గురువు త్యాగరాజస్వామి

మోహన రాగంలో కూర్చబడిన ఈ కృతి ద్వారా త్యాగరాజస్వామి వారు తాను రామునితో చేసుకున్న విన్నపాలు, ఫిర్యాదులు, వేడుకోలు అన్నీ కలిపి ద్వైత భావనను కురిపించారు. రాముని వైభవాన్ని కొనియాడుతూనే తనను కాపాడటం లేదని కాస్త కినుక కూడా చూపించారు. ఎందరినో  బ్రోచిన నీవు నన్నెలా  బ్రోవవు అన్న భావనను ఈ కీర్తన ద్వారా వ్యక్తపరచారు. అన్నీ వదలి  నిన్ను నమ్ముకున్నాను అని ఆర్తితో నుతించారు. మోహన రాగం ఇటువంటి భావానికి పెట్టిన పేరు. మహారాజపురం సంతానం గారి గాత్రంలో మోహన రాగం మరింత సమ్మోహనంగా ఉంటుంది. ఆయన గాత్రంలో ఈ కృతి వినండి

దేవాది దేవ! సదాశివ! - త్యాగరాజస్వామి కృతి


దేవాది దేవ! సదాశివ! దిననాధ సుధాకర దహన నయన!

దేవేశ! పితామహ మృగ్య! శమాది గుణాభరణ! గౌరీ రమణ!

భవ! చంద్ర కళాధర! నీలగళ!
భాను కోటి సంకాశ! శ్రీశ నుత!
తవ పాద భక్తిం దేహి దీన బంధో!
దర హాస వదన! త్యాగరాజ నుత!

దేవాది దేవా! సూర్య చంద్రాదులు, అగ్ని మూడు కన్నులుగా గల సదాశివా! ఓ పరమేశ్వరా! పార్వతీ పతీ! శమదమాది గుణములచే అలంకరించబడిన నీవు బ్రహ్మ కూడా అందని వాడవు! శివా! చంద్రుని శిరసుపై ధరించి, గరళమును కంఠములో నిలుపుకొని, కోటి సూర్యుల ప్రకాశిస్తూ విష్ణువుచే నుతించబడిన వాడవు. త్యాగరాజునిచే నుతించబడి, చిరునవ్వు ముఖము కలిగిన ఓ దీనబంధో! నీ పదముల యందు భక్తిని నాకు ప్రసాదించుము!

- సద్గురువులు త్యాగరాజస్వామి

తిరువాయూరులో 1986వ సంవత్సరంలో ప్రధాని రాజీవ్ గాంధీ, ముఖ్యమంత్రి ఎంజీఆర్, విదేశాంగమత్రి పీవీ నరసింహారావు గారు ఉన్న సభలో ఎమ్మెస్ సుబ్బులక్ష్మి, రాధ విశ్వనాథన్ కలిసి చేసిన కచేరీలో ద్వారం మంగతాయారు గారు వయోలిన్, కేవీ ప్రసాద్ గారు మృదంగం. వీరు ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారికి 15 ఏళ్లు మృదంగ సహకారం అందించారు.  ఆ సభలో ఎమ్మెస్ సుబ్బులక్ష్మి-రాధా విశ్వనాథన్ కలిసి ఆలపించిన ఈ కృతి చూడండి. .

భజరే చిత్త బాలాంబికాం - ముత్తుస్వామి దీక్షితుల ఆధ్యాత్మిక సంపద


భజరే చిత్త బాలాంబికాం భక్త కల్ప లతికాం

నిజరూప దాన దక్ష చరణం
అరుణాం నిత్యాం కళ్యాణీం శర్వాణీం

శ్రీ వాగ్భవ కూట జాత చతుర్వేద స్వరూపిణీం
శృంగార కామ రజోద్భవ సకల విశ్వ వ్యాపినీం
దేవీం శక్తి బీజోద్భవ మాత్రృకార్ణ శరీరిణీం
దేవనుత భవ రోగ హర వైద్యపతి హృదయ విహారిణీం
భావ రాగ తాళ మోదినీం భక్తాభీష్ట ప్రదాయినీం
సేవక జన పాలన గురుగుహ రూప ముద్దు కుమార జననీం

ఓ మనసా! భక్తుల పాలిట కల్పతరువైన బాలాంబికను భజింపుము. నిజరూప దర్శన భాగ్యము కలిగించే చరణములు కలిగి, సూర్యకాంతి కలిగి, శాశ్వతమై, శుభకరమైన శర్వుని పత్ని అయిన ఆమ్మను భజింపుము. వాగ్భవ కూట బీజాక్షరములనుండి (లలితాదేవి పంచదశాక్షరీ మంత్రములోని మొదటి ఐదు బీజాక్షరాలైన క ఏ ఈ ల హ్రీం అనే అక్షర సంపుటిని వాగ్భవ కూట అంటారు) జన్మించిన, నాలుగు వేదాల స్వరూపిణి అయిన, శృంగార రూపిణిగా కామ రజో కూట బీజాక్షరములనుండి (పంచదశాక్షరిలోని తదుపరి ఆరు అక్షరాలు హ స క హ ల హ్రీం కామ రజో కూట అంటారు) ఉద్భవించిన, సమస్త లోకములు వ్యాపించియున్న బాలాంబికను భజించుము. శక్తి కూట బీజాక్షర సంపుటి నుండి (పంచదశాక్షరిలోని తదుపరి నాలుగు బీజాక్షరాలు స కల హ్రీం శక్తి కూటగా అంటారు) జన్మించిన, ఈ విధంగా అక్షరమాలా శరీరిణి అయిన దేవిని భజింపుము. దేవతలచే నుతించబడిన, ఈ దేహరోగములను హరించే వైద్యనాథుని హృదయ విహారిణి అయిన, భావము, రాగము, తాళములచే మోదము పొందే, భక్తుల కామ్యములను ప్రసాదించే అమ్మను భజించుము. సేవించే జనులను పాలిచించే, గురుగుహ రూపమైన కుమారస్వామి జనని అయిన బాలాంబికను భజింపుము.

- ముత్తుస్వామి దీక్షితుల వారు

దీక్షితుల వారు గొప్ప శ్రీవిద్యా ఉపాసకులు. మంత్ర సిద్ధి ద్వారా అమ్మ అనుగ్రహం పొందిన ఆధ్యాత్మిక సంపన్నులు. ఈ సాధనలోనే ఆయన అద్భుతమైన కీర్తనలు రచించారు. ఆయన కృతులలో మంత్ర శాస్త్రం ప్రకాశిస్తూ ఉంటుంది. బీజాక్షర యుతమై, లలితాసహస్ర నామావళి తత్వార్థ ప్రస్ఫుటమై ఉంటాయి. గురుగుహ అనే ముద్రతో ఆయన కీర్తనలు గుర్తించబడతాయి. కుమారస్వామిని గురుగుహునిగా కొలుస్తారు. దీక్షితుల వారు తనను ఆ అమ్మ తనయునిగా భావించి కొలిచి అనుగ్రహం పొందిన వాగ్గేయకారులు.  ఆయన రచించిన కమలాంబ నవావరణ కీర్తనలు, క్షేత్ర ప్రాధాన్యమైన కృతులు, నవగ్రహ కృతులు ఈ ఆధ్యాత్మిక సంపదతో నిండినవే. అటువంటిదే ఈ బాలాత్రిపురసుందరి కృతి. లలితాదేవి తత్వాన్ని ఆవిష్కరించే ఈ కృతిలో పంచదశాక్షరీ మంత్ర సంపుటిలోని బీజాక్షరాలను ప్రస్తావించే వాగ్భవ, కామ రజో, శక్తి కూటములను ప్రస్తావించి ఆయన తన మంత్రశాస్త్ర జ్ఞానాన్ని మనకు తెలియజేశారు. అంతే కాదు అమ్మ మహిమా వైభవాలను కూడా చక్కగా నుతించారు. కళ్యాణి రాగం అత్యంత శుభకరమైనది, ఆహ్లాదకరమైనది. గుణ వైభవ వర్ణనలకు ఈ రాగం ఎంతో ఉపయుక్తమైనది. భావయుక్తమైన పదాలతో, ఆధ్యాత్మిక ప్రాధాన్యమున్న చరణంతో దీక్షితుల వారు తన శ్రీవిద్యా ఉపాసనా బలానికి అక్షర రూపం ఇచ్చారు. తమిళనాడులోని అరియలూరు జిల్లాలోని కామరసవల్లిలో పార్వతీపరమేశ్వరులు సనాతనులై వెలసిన క్షేత్రం కర్కోటేశ్వర-బాలాంబిక దేవస్థానం. తిరువాయూరుకు ఉత్తరంగా కావేరీ నదికి ఆవల ఉన్న క్షేత్రం ఇది. వేళ ఏళ్ల చరిత్ర కలిగిన ఈ క్షేత్రంలో బాలాత్రిపురసుందరిగా అమ్మ కొలువబడుతుంది. ఆ అమ్మను నుతిస్తూ దీక్షితుల వారు ఈ కృతిని రచించారు.

యేసుదాసు గారి గళంలో ఈ భజరే చిత్త బాలాంబికాం వినండి.

వెడలెను కోదండపాణి - త్యాగరాజస్వామి కృతి

వెడలెను కోదండపాణి అనుజ సౌమిత్రితో గూడి పుడమిలో జనులెల్ల పొగడ పూజితుడౌ మునితో గూడి శిరమన కొండెయు జార  వురమున హారములు మెరయ కరమున శరచాపములును ఘ...