29, జులై 2017, శనివారం

రామా నిను నమ్మినవారము గామా - త్యాగరాజస్వామి కీర్తన


రామా నిను నమ్మినవారము గామా సకల లోకాభి 

పామర జన దూర వర గుణ ఘృణాపాంగ శుభాంగ ముని హృదయాబ్జ భృంగ 

వాలాయముగాను రాను జాగేల సుగుణ దశరథ నృపాల హృదయానందకార శ్రి లోల పాల వెలయుమిక
ఫాల లోచన హృదయాలయాప్త జన పాల కనకమయ చేల ఇక పరాకేల ఇపుడు మమ్మేల నీదు మనసేల రాదు

నీవే గతి యంటిని గాని నే వేరేమి ఎరుగను ముందర రావే నీ పద పంకజ భక్తి నీవే భావజారి నుత
దేవ నీదు పద సేవా ఫలము మము గావునే పతిత పావన త్రిదశ నాధనీయ ముని జీవనానిశము బ్రోవనేల శ్రీరామ 

ధారాధర నిభ దేహ జనాధార దురితాఘ జలద సమీర త్యాగరాజ హృదయాగార సార హీన సం
సారమందు వేసారి నిన్ను మనసార నమ్ము కొన నేరలేని నే నూరక ఇక విచారమందుటకు మేర గాదు శ్రీరామ

సమస్త లోకములకు ఆనందంకు కలిగించే శ్రీరామా! మేము నిన్ను నమ్మినవారము గామా? పామరులకు దూరుడవు, శ్రేష్ఠమైన గుణములు కలవాడవు, దయాకటాక్షములు గలవాడవు, శుభమైన అంగములు కలవాడవు, మునుల హృదయకమలములకు తుమ్మెద వంటి వాడవు నీవు. దశరథ మహారాజు హృదయమునకు ఆననందము కలిగించిన వాడవు మమ్ములను కాపాడుటకు వేగముగా రావేల? వచ్చి రక్షించుము. శివుని హృదయములో నివసించే వాడవు, ఆప్తజనులను పాలించే వాడవు, బంగారు వస్త్రములు ధరించే వాడవు, ఇంక పరాకెందుకు? ఇప్పుడు మమ్ములను కాపాడుటకు నీకు మనసేల కలుగుటలేదు? నీవే శరణన్నాను, నీ పాదపద్మముల భక్తి తప్ప వేరేమీ ఎరుగను, వేగముగా వచ్చి కాపాడుము. మన్మథుని శత్రువైన శివునిచే నుతించబడిన వాడవు, నీ పాదములను సేవించే ఫలము మమ్ములను కాపాడును కదా! పతితులను పావనము చేసే వాడవు, మూడులోకములకు అధిపతివి, మునుల జీవనమైన వాడవు, ఎల్లప్పుడూ మమ్ములను బ్రోచుటకేల ఆలస్యము? మేఘముల వంటి కాంతితో శరీరము గల శ్రీరామా! జనులకు ఆధారము నీవే. పాపములనెడి మేఘములను వాయువు వలె తరిమి కొట్టేవాడవు, శివుని హృదయములో నివసించే వాడవు, ఈ సారములేని సంసార సాగరమందు వేసారి నిన్ను మనసారా నమ్ముకొన్నాను, నిస్సహాయుడైయున్న నన్ను బాధ పెట్టుట ఇంక మర్యాద కాదు శ్రీరామా! మేము నిన్ను నమ్మినవారము, వేగమే వచ్చి మమ్ము రక్షించుము.

- సద్గురువు త్యాగరాజస్వామి

మోహన రాగంలో కూర్చబడిన ఈ కృతి ద్వారా త్యాగరాజస్వామి వారు తాను రామునితో చేసుకున్న విన్నపాలు, ఫిర్యాదులు, వేడుకోలు అన్నీ కలిపి ద్వైత భావనను కురిపించారు. రాముని వైభవాన్ని కొనియాడుతూనే తనను కాపాడటం లేదని కాస్త కినుక కూడా చూపించారు. ఎందరినో  బ్రోచిన నీవు నన్నెలా  బ్రోవవు అన్న భావనను ఈ కీర్తన ద్వారా వ్యక్తపరచారు. అన్నీ వదలి  నిన్ను నమ్ముకున్నాను అని ఆర్తితో నుతించారు. మోహన రాగం ఇటువంటి భావానికి పెట్టిన పేరు. మహారాజపురం సంతానం గారి గాత్రంలో మోహన రాగం మరింత సమ్మోహనంగా ఉంటుంది. ఆయన గాత్రంలో ఈ కృతి వినండి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి