19, సెప్టెంబర్ 2026, శనివారం

ఏకదంతం భజేహం - ముత్తుస్వామి దీక్షితుల కృతి


ఏకదంతం భజేహం ఏకానేక ఫల ప్రదం

పాకశాసనారాధితం పామర పండితాది నుత పదం 

కైలాసనాథ కుమారం కార్తికేయ మనోహరం
హాలాస్య క్షేత్ర వేగవతీ తట విహారం హరం
కోలాహల గురుగుహ సహితం కోటి మార లావణ్య హితం
మాలా కంకణాది ధరణం మాషా వల్లభాంబా రమణం 

ఏకదంతుడైన శ్రీగణపతిని నేను భజిస్తున్నాను. ఆయన పరమఫలమైన మోక్షాన్ని, అనేకమైన ఐహిక కోర్కెల ఫలాలను అనుగ్రహించేవాడు.

పాకాసురుణ్ణి సంహరించిన ఇంద్రునిచే ఆరాధింపబడేవాడు, పామరుల నుండి పండితుల వరకు అందరిచే నుతించబడే పాదములు కలవాడు, కైలాసనాథుడైన శివుని కుమారుడు, కార్తికేయునికి ఆనందము కలిగించే వాడూ అయిన ఏకదంతుడిని నేను భజిస్తున్నాను. హాలాస్యక్షేత్రమైన మదురైలో వేగవతి నది తీరాన విహరించేవాడు, భక్తుల దుఃఖాలు, విఘ్నాలు తొలగించేవాడు. ఉత్సవకోలాహలంలో గురుగుహుడైన సుబ్రహ్మణ్యునితో కలిసి ఉండేవాడు. కోటి మన్మథుల అందాన్ని మించే లావణ్యం కలిగి, లోకహితాన్ని చేసేవాడు. పూలమాలలు, కంకణాలు మొదలైన ఆభరణాలు ధరించినవాడు. నల్లని రూపము కలిగి, మాయాశక్తి స్వరూపిణియైన వల్లభాంబాదేవికి పతియైన గణపతిని నేను భక్తితో భజిస్తున్నాను.

మధురకు హాలాస్యక్షేత్రం అనే పేరు రావడం స్థలపురాణ సంబంధమైనది.

పారంపర్య కథనం ప్రకారం, మదురై నగర నిర్మాణానికి శివుడు ఒక సర్పాన్ని పంపాడు. ఆ సర్పం నగరానికి సరిహద్దులుగా చుట్టుకొని తన తల–తోకలను మధ్యభాగంలోని శివాలయ దిశగా ఉంచింది. ఆ సర్పానికే హాలాస్యమని పేరు. అందువల్ల ఆ పవిత్ర నగరం హాలాస్యం, తమిళంలో తిరువాలవాయ్, అని ప్రసిద్ధి చెందింది. అక్కడ వెలసిన శివుడు సోమసుందరేశ్వరుడు/హాలాస్యనాథుడు. అందుకే కృతిలో హాలాస్య క్షేత్రం అని ముత్తుస్వామి దీక్షితుల వారు ప్రస్తావించారు. 

బిలహరి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని సిక్కిల్ గురుచరణ్ గారు ఆలపించారు.

శక్తి సహిత గణపతిం - ముత్తుస్వామి దీక్షితుల కృతి

శక్తి సహిత గణపతిం శంకరాది సేవితం
విరక్త సకల మునివర సురరాజ వినుత గురుగుహం

భక్తాళి పోషకం భవసుతం వినాయకం
భుక్తిముక్తిప్రదం భూషితాంగం రక్తపదాంబుజం భావయామి

శంకరుడు మొదలైన దేవతలచే సేవింపబడేవాడు, వైరాగ్యాన్ని ఆచరించిన మునిశ్రేష్ఠులచే, దేవరాజైన ఇంద్రునిచే, గురుగుహుడైన సుబ్రహ్మణ్యునిచే స్తుతింపబడేవాడు, పార్వతీదేవితో కూడి ఉన్న గణపతిని నేను ధ్యానిస్తున్నాను. భక్తసమూహాన్ని పోషించి రక్షించేవాడు, భవుడైన శివుని కుమారుడు, విఘ్నాలను తొలగించే వినాయకుడు, భుక్తి అనగా లోకంలో లభించే సుఖసంపదలను, ముక్తి అనగా జననమరణ బంధవిముక్తిని ప్రసాదించేవాడుం దివ్యాభరణాలతో అలంకరింపబడిన దేహం, ఎర్రని కమలాలవంటి పాదాలు కలిగిన పార్వతీ సహిత గణపతిని నేను నా మనస్సులో ధ్యానిస్తున్నాను.

శంకరాభరణం రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని నొట్టుస్వరాలను నేర్పించటానికి వినియోగిస్తారు. దీనిని జొన్నలగడ్డ శ్రీరాం మరియు కల్యాణ్ వసంత్ ఆలపించారు

18, సెప్టెంబర్ 2026, శుక్రవారం

గజాననయుతం గణేశ్వరం - ముత్తుస్వామి దీక్షితుల కృతి


గజాననయుతం గణేశ్వరం భజామి సతతం సురేశ్వరం

అజేంద్ర పూజిత విఘ్నేశ్వరం గణాది సన్నుత పదపద్మకరం
కుంజర భంజన చతురతర కరం గురుగుహాగ్రజం ప్రణవాకారం

గజముఖము కలిగిన గణేశ్వరుడిని, దేవతలకు అధిపతియైన ఆ గణపతిని నేను ఎల్లప్పుడూ భజిస్తున్నాను. బ్రహ్మ, ఇంద్రుడు మొదలైనవారిచే పూజింపబడే వాడు, గణములు మొదలైనవారు స్తుతించే  కమలముల వంటి పాదాలు, హస్తాలు కలిగినవాడు,  కుంజరుడనే రాక్షసుడిని సంహరించడంలో అత్యంత సమర్థతను చూపినవాడు, సుబ్రహ్మణ్యస్వామికి అగ్రజుడు, ఓంకారస్వరూపుడు అయిన ఆయనను నేను నిరంతరం ఆరాధిస్తున్నాను.

ముత్తుస్వామి దీక్షితుల వారు చక్రవాకం రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని మహారాజపురం సంతానం గారు ఆలపించారు

హేరంబాయ నమస్తే - ముత్తుస్వామి దీక్షితుల వారి కృతి


హేరంబాయ నమస్తే హేరంబాయ నమస్తే
హరి బ్రహ్మేంద్రాది సేవిత శివకుమారాయ 

వీర గణాది ముదితాయ వీరాది వర ప్రదాయ

సూరిజనోపాసితాయ సుర గురుగుహ సేవితాయ
పరమేశ్వర కుమారాయ పంచ హస్తాయ పాశాంకుశ-
ధరాయ ప్రసిద్ధ గణ నాధాయ వినాయకాయ 

శొర్యముచే అతిశయించు గణపతికి నా నమస్సులు. హరి, బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన దేవతలచే సేవింపబడే, శివుని కుమారుడైన గణపతికి నమస్సులు. వీరగణములు మొదలైనవారితో ఆనందించేవాడు, భక్తులకు వీరత్వము మొదలైన వరాలను ప్రసాదించేవాడు, జ్ఞానులచే ఉపాసింపబడేవాడు, దేవతలచేను తన సోదరుడైన సుబ్రహ్మణ్యుడి చేతను సేవింపబడేవాడు, పరమేశ్వరుని కుమారుడు, ఐదు హస్తములు కలవాడు, పాశమును, అంకుశమును ధరించినవాడు, సర్వగణాలకు ప్రసిద్ధుడైన అధిపతి, ఎవరికీ అధీనుడు కాని వినాయకుడు అయిన ఆ హేరంబ గణపతికి నేను నమస్కరిస్తున్నాను.  

అఠానా రాగంలో స్వరపరచబడిన ఈ ముత్తుస్వామి దీక్షితుల వారి కృతిని సౌమ్యా పరశురామన్ ఆలపించారు

వల్లభ నాయకస్య - ముత్తుస్వామి దీక్షితుల కృతి


వల్లభ నాయకస్య భక్తో భవామి

వాంచితార్థదాయకస్య వరమూషిక వాహనస్య

పల్లవపద మృదుతరస్య పాశాంకుశాది ధరస్య
మల్లికాజాతి చంపక హారస్య మణిమాలస్య
వల్లీ వివాహ కారణస్య గురుగుహ పూజితస్య
కాళీ కళామాలినీ కమలాక్షి సన్నుతస్య   

భావం:

గణముల అధిపతి అయిన గణపతికి నేను భక్తుడనై ఉన్నాను. ఆయన కోరిన కోర్కెలను నెరవేర్చువాడు,  శ్రేష్ఠమైన మూషికాన్ని వాహనంగా కలిగినవాడు. ఆయన పాదాలు లేత చిగురులకన్నా మృదువైనవి. పాశము, అంకుశము మొదలైన ఆయుధాలను ధరించినవాడు; మల్లిక, జాజి, సంపెంగ పుష్పహారాలతోను మణిమాలలతోను అలంకరింపబడినవాడు. తన సోదరుడైన సుబ్రహ్మణ్యుడు వల్లితో వివాహం చేసుకొనుటకు కారణమైనవాడు, సుబ్రహ్మణ్యునిచే పూజింపబడినవాడు. కాళీదేవి, కళామాలినియైన సరస్వతీదేవి, కమలాక్షియైన లక్ష్మీదేవి చేత స్తుతింపబడినవాడు అయిన గణపతికి నేను భక్తుడనై ఉన్నాను.  

గణపతి వల్లీ-సుబ్రహ్మణ్యుల వివాహానికి కారణమైనాడు అని దీక్షితుల వారు ఈ కృతిలో ప్రస్తావించారు. దీని వెనుక ఉన్న గాథ ఏమిటి? 

సుబ్రహ్మణ్యుడు వల్లి ప్రేమను పరీక్షించటానికి వృద్ధుని వేషంలో ఆమె వద్దకు వెళతాడు. వల్లి ఆయనను గుర్తించదు. కొంత సంకోచంతో ఉంటుంది. అప్పుడు సుబ్రహ్మణ్యుని అభ్యర్థనపై గణపతి ఏనుగు రూపం ధరించి వల్లిని భయపెడతాడు. భయపడిన వల్లి, తనను రక్షించమని ఆ వృద్ధుని రూపంలో ఉన్న సుబ్రహ్మణ్యుడిని ఆశ్రయిస్తుంది.

సుబ్రహ్మణ్యుడు, “నన్ను వివాహం చేసుకుంటానని ఒప్పుకుంటే ఈ ఏనుగును వెళ్లగొడతాను” అని అంటాడు. వల్లి అంగీకరించగానే గణపతి ఏనుగు రూపాన్ని విడిచి వెళ్తాడు. తరువాత సుబ్రహ్మణ్యుడు తన దివ్యస్వరూపాన్ని చూపుతాడు. వల్లి ఆయనను వివాహం చేసుకుంటుంది.

అందుకే దీక్షితుల వారు కృతిలో “వల్లీ వివాహ కారణస్య” అన్నారు.    

బేగడ రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని మహారాజపురం సంతానం గారు అద్భుతంగా ఆలపించారు

గణరాజేన రక్షితోహం - ముత్తుస్వామి దీక్షితుల వారి కృతి

గణరాజేన రక్షితోహం
గుణిజన నుత పల్లవ పదేన 

అణిమాద్యష్ట సిద్ధి ప్రదేన
మాణిక్య మకుటాది ధరేణ
మంత్రిణీ పూజిత సుముఖేన
మానిత గురుగుహ వందితేన
దినకర కోటి ప్రకాశేన
వినతాశ్రిత మందారేణ
మను పూజిత పాశాంకుశేన
కానన స్థిత బ్రహ్మచర్యేణ 

భావం:

సజ్జనులు స్తుతించే మృదువైన పాదములు గల గణాధిపతి నన్ను రక్షించుచున్నాడు. అణిమ, గరిమ మొదలైన అష్టసిద్ధులను అనుగ్రహించేవాడు, మణులు పొదిగిన కిరీటమును ధరించినవాడు, మంత్రిణీ దేవి ఆయిన రాజశ్యామలచే పూజించిన సుముఖుడు, సుబ్రహ్మణ్యునిచే పూజించబడే గణపతి నన్ను రక్షించుచున్నాడు. కోటి సూర్యుల వలె తేజోవంతుడు,  నమస్కరించి శరణు వచ్చినవారికి కల్పవృక్షము వంటి వాడు. మనువుచే పూజించబడిన పాశము మరియు అనుకుశము ధరించినబాడు, అరణ్యమునందు నివసించేవాడు, బ్రహ్మచారిరూపుడైన గణపతి నన్ను రక్షించుచున్నాడు. 

ఆరభి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని ఆర్ వేదవల్లి గారు ఆలపించారు.

శ్రీ గణపతిని సేవింపరారే - త్యాగరాజస్వామి కృతి

శ్రీ గణపతిని సేవింపరారే శ్రిత మానవులారా

వాగధిపతి సుపూజల జేకొని బాగా నటింపుచును వెడలిన 

పనస నారికేళాది జంబూ ఫలముల నారగించి
ఘన తరంబుగను మహిపై పదములు ఘల్లు ఘల్లు మననించి
అనయము హరి చరణ యుగములను హృదయాంబుజమున నుంచి
వినయమునను త్యాగరాజ వినుతుడు వివిధ గతుల ధిత్తళాంగుమని వెడలిన  

శరణు కోరిన మానవులారా, శ్రీ గణపతిని సేవించటనికి విచ్చేయండి. వాక్కుకు అధిపతియైన బ్రహ్మదేవునిచే ఉత్తమమైన పూజలందుకొని లీలగా నటింపుచు వెళుతున్న గణపతిని సేవించటానికి విచ్చేయండి. పనస, కొబ్బరి, నేరేడు మొదలైన ఫలములను ఆరగించి, భూమిపై తన గంభీరమైన పాదములను “ఘల్లు ఘల్లు” మను శబ్దముతో మోపుచు, ఎల్లప్పుడూ తన హృదయకమలమున శ్రీహరి చరణయుగములను నిలుపుకొనినవాడు,  వినయముగా త్యాగరాజునిచే నుతించబడిన వాడు, వివిధ నడకలతో ధిత్తళాంగుమనే లయనాదమును పలికించుచు వెడలిన గణపతిని సేవించటానికి విచ్చేయండి.   

త్యాగరాజస్వామి ప్రహ్లాద భక్తి విజయము అనే యక్షగానాన్ని రచించారు. అందులో ప్రహ్లాదుని జననము నుండి నరసింహావతారం వరకు కృతి-గద్య రూపంలో అద్భుతమైన సాహిత్యాన్ని ఐదు భాగాలుగా విభజించారు. మొత్తం 48 దాకా కృతులు ఈ యక్షగానంలో ఉన్నాయి. అందులో మొదటిది ఈ గణపతిని కొలిచే సందర్భంగా కృతి.సౌరాష్ట్ర రాగంలో స్వరపరచబడిన ఈ కృతి సాధారణంగా త్యాగరాజ ఆరాధనోత్సవాలలో పంచరత్న కృతుల బృందగానం ముందు ఆలపిస్తారు. 

ఈ కృతిని మహారాజపురం సంతానం గారు ఆలపించారు

వామాంక స్థితయా - ముత్తుస్వామి దీక్షితుల కృతి

వామాంక స్థితయా వల్లభయాऽऽశ్లిష్టం వారణ వదనం దేవం వందేऽహం వామన స్వరూపం వరదం సచాపం చామర కర్ణం శశి శేఖర తనయం నామరూప ధరం అభినవ గురుగుహ హృదయం అష్ట...