25, జులై 2020, శనివారం

శ్రుతులెందుకు? - చంద్రశేఖర భారతీస్వామి వారు


ధర్మానుష్ఠానమే ఉత్తమ ప్రమాణాలు గల జీవితానికి మార్గం. ఆ అనుష్ఠానానికి, మంచి చెడుల విచక్షణకు సూచికలు ఈ వాఙ్మయం. స్మృతులు, శ్రుతులలో ఉన్నవి దైవసంకల్పితమైనవి, ఈ విశ్వానికి మార్గదర్శకమైనవి. అనంతకోటి విలక్షణమైన జీవరాశులతో ఉన్న ఈ అద్భుత విశ్వాన్ని చూస్తే మనకొక విషయం అర్థం కావాలి - పరమాత్మ అత్యంత శక్తిమంతుడు, అన్నిటా ఉన్నవాడు. ఆయన విచక్షణ అత్యుత్తమమైనది, సత్యమైనది అన్న దానికి ఒక చిన్న కథ.

ఒక యాత్రికుడు ఒకసారి దారిపక్కనే ఉన్న మఱ్ఱిచెట్టు నీడన నిద్రపోవాలనుకుని విశ్రమించాడు. ఆ పెద్ద చెట్టు, దానికున్న చిన్న చిన్న పండ్లు చూసి ఇలా అనుకున్నాడు - "ఒక చిన్న తీగ ఎంత పెద్ద గుమ్మడి కాయలనిస్తుంది, ఇంత పెద్ద చెట్టు చిన్న చిన్న పండ్లనివ్వటమేమిటి? వృక్షము, ఫలాలు సరైన నిష్పత్తిలో ఉండాలి కదా. దేవుడు ఈ సృష్టిని మరింత బాగా చేసి ఉండవచ్చు" అనుకున్నాడు. ఆ ఆలోచనతోనే నిద్రపోయాడు. నిద్రలేచి చూసే సరికి ఆ చిన్న చిన్న పండ్లు రాలి తన శరీరం అంతా కప్పబడి ఉండటం చూసి పరమాత్మ సృష్టిలోని అద్భుతాన్ని గ్రహించాడు. నీడనిచ్చి సేదతీర్చే మఱ్ఱిచెట్టు గనుక తన పరిమాణానికి తగ్గ పండ్లిస్తే తన లాగా నిద్రబోయే యాత్రికుల గతి ఏమిటి? తన అజ్ఞానానికి సిగ్గుపడి పరమాత్మకు ప్రణమిల్లాడు.

ఇలాగ, ఈ సృష్టిలో ఎన్నో విషయాలు మానవుని మేధస్సుకు అందనివి, మంచి చెడు అనేవి మనం నిర్ణయించినంత తేలిగ్గా చెప్పబడేవి కావు. అటువంటి విచక్షణ చేసుకోవటానికి మార్గదర్శకానికే మనకు ఈ వాఙ్మయం అవసరం.

-శృంగేరి పీఠాధిపతులు చంద్రశేఖర భారతీస్వామి వారు (1892-1954)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి