24, జులై 2020, శుక్రవారం

సనాతన ధర్మం


ఒకరి చేత చెప్పబడనిది, అనుభవైకవేద్యమైనది, కాలాతీతమైనది సనాతనధర్మం.  క్రైస్తవం, బౌద్ధం, ఇస్లాం - ఇవన్నీ కొన్ని వందల ఏళ్ల నాడు ఆయా మత ప్రవక్తలైన వారిచే నిర్వచించబడినవి. ఎవరో కొద్దిమంది గురువులు ప్రచారం చేసినది కాదు సనాతన ధర్మం. గంగాప్రవాహంలా కాలాతీతమై ముందుకు సాగుతూనే ఉంది. స్వయంగా భగవద్రక్షితమై, భగవద్ప్రేరితమై అపౌరుషేయమై ఉద్భవించినవి వేదాలు. మహా ఋషుల అపరోక్షానుభూతులు ఉపనిషత్తులుగా వచ్చాయి. అమిత తపోసంపన్నుడు, శ్రీమహావిష్ణువు అవతారము అయిన వేదవ్యాసునిచే లోకకల్యాణార్థమై రచించబడినవి 18 పురాణాలు. ఇవీ మన ధర్మానికి మూలాలు. ప్రతి యుగంలోనూ వీటి సారములు మనకు గాథలుగా, అనేకానేక దివ్యరచనలుగా అందించబడుతున్నాయి.

నాస్తికవాదులు, పరధర్మ ప్రచారకులు, కుహనావాదులు చేసే ఒక దుష్ప్రచారం మన ధర్మంలో స్వేచ్ఛ లేదు, శాస్త్రీయత లేదు అని. అంతకన్నా పచ్చి అబద్ధం ఇంకొకటి లేదు. మన ధర్మం ఇచ్చినంత స్వేచ్ఛ ఇంకే ధర్మమూ ఇవ్వలేదు. మన ధర్మానికున్నంత శాస్త్రీయత మరే ధర్మానికీ లేదు. విశ్వాసము మరియు ఆరాధనలలో సంపూర్ణ స్వేచ్ఛనిచ్చినది సనాతన ధర్మం. అందుకే మనకు ఎన్నలేనన్ని మార్గాలు, భగవద్రూపాలు. ప్రకృతి, ఆత్మ, దేవ, పరమాత్మ, అర్చనా తత్త్వాలను ప్రశ్నించి సమాధానం తెలుసుకునే స్వేచ్ఛ ఈ ధర్మం ఇచ్చింది. ఫలానా ఒక్క పద్ధతే సరైనది, ఫలానవి చేస్తేనే ఆరాధన సఫలమవుతుంది అన్నది సనాతన ధర్మం చెప్పలేదు. కోట్లాది మార్గాలు, కోట్లాది పద్ధతులు ఈ ధర్మంలో అంతర్భాగం. ఇతర ధర్మాల వారు చేసినట్లు సనాతన ధర్మం నాస్తికవాదాన్ని తప్పుగా పేర్కొనదు. సనాతన ధర్మంలో మానవీయ విలువలకున్న స్థానం మరే ధర్మంలోనూ లేవు. మరొక ధర్మం వారిని నిందించటం, వారిని బలవంతంగా ఈ ధర్మంలోకి మార్పిడి చేయడం అన్నవి లేవు. అసలు ఆ సిద్ధాంతమే సనాతన ధర్మంలో లేదు. అత్యంత ఉదారమైనది, విశాలమైనది సనాతన ధర్మం.

మన ధర్మంలో ఉన్న మొట్ట మొదటి గొప్పతనం - మానవుని నిత్య జీవితంలో ఎదురుకునే ప్రతి సమస్యకు, ప్రతి అలజడికి శాశ్వత, సర్వామోదయోగ్యమైన పరిష్కారం కలిగి ఉండటం. వేదాలు, ఉపనిషత్తుల సారమే మానవుని ఆత్మోద్ధరణ ద్వారా ఆనందాన్ని పొందటం. కాబట్టి, వ్యక్తిత్వ వికాసమనేది ఈ ధర్మంలో సహజ పరిణామం. నీతి, ధర్మం, న్యాయం మొదలైన వాని ద్వారా ఈ వ్యక్తిత్వ వికాసాన్ని మన ధర్మం మనకు ఉచితంగా అందిస్తుంది.

ఇక రెండవ గొప్పతనం - శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునే జీవనశైలి, సూత్రాలు అద్భుతమైన యోగము ద్వారా, వైద్యశాస్త్రము ద్వారా మనకు అందించింది సనాతన ధర్మం. ప్రపంచంలో ఏ ధర్మంలోనూ లేనంత శాస్త్ర సాంకేతికత మన ధర్మంలో ఉన్నాయి కాబట్టే అనాదిగా వీనిని ఆచరించిన వారు దేహానికున్న పరిమితులను అధిగమించి దివ్యత్వాన్ని పొందగలిగారు.

మూడవ గొప్పతనం - స్త్రీలు, పురుషులు, పిన్నలు, పెద్దలు, ధనికులు, పేదలు అని లేకుండా ప్రతి ఒక్కరికీ ఆధ్యాత్మికత అనేది వారి వారి ఉపాధులలో, నిత్యజీవితంలో తెలియకుండానే అబ్బేలా చేసింది మన ధర్మం. బంధాలు, బాంధవ్యాలు, బాధ్యతలు, కట్టుబాట్లు మొదలైనవి మనిషిని ఆధ్యాత్మిక సంపన్నునిగా చేసింది ఈ ధర్మం. అందుకే నాస్తికులమని చెప్పుకునే వారు కూడా ఏదో ఒకరకంగా ఆధ్యాత్మికవాదులే.

సనాతన ధర్మమంటే కేవలం సన్న్యాసమూ కాదు, మాయావాదమూ కాదు, అనేక తత్త్వాల సమ్మేళనమూ కాదు. ఇది అగణితమైన ఆధ్యాత్మికానుభూతుల కలయిక. జీవితం గురించిన పరిపూర్ణము మరియు అఖండమైన దృష్టికోణము కలది. అత్యంత సహిష్ణుత, మానవీయత, ఆధ్యాత్మికత కలది సనాతన ధర్మం. అతివాదానికి దూరమైనది, అందుకే ఎన్నో దాడులు జరిగినా ఇప్పటికీ అలానే నిలిచి ఉంది. సనాతన ధర్మంలో ఉన్న కిటుకు మూలసూత్రాలలోనే. ఇవి పూర్తిగా అనుభవాల మీద, సత్యాల మీద ఆధారపడినవి. అందుకే కాలప్రవాహంలో చెక్కు చెదరకుండా నిలిచింది ఈ ధర్మం.

ధర్మో రక్షతి రక్షితః.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి