25, జులై 2020, శనివారం

అద్భుతాలు - పరమాచార్యుల అభిప్రాయం



సనాతన ధర్మంలో అనేకులైన మహనీయులు, గురువులు, సన్యాసులు ఎన్నో అద్భుతాలను లీలలుగా చేసి చూపించారు. నేటి కాలంలో చాలామందిని వేధించే ప్రశ్న ఆ అద్భుతాలు అవసరమా? అవి నిజమా? ప్రజలను మోసం చేసేవా? దీని గురించి పరమాచార్యుల వారి అభిప్రాయమేమిటి? ఎస్. బాలకృష్ణన్ గారు 1930 దశకం నుండి పరమాచార్యుల వారి భక్తులు. ఆయన ఒకసారి ఒక చిన్న సమూహంలో దీని గురించి చెప్పిన సమాధానాన్ని మనకు వివరించారు.

"ప్రజలకు అనేకానేక కామ్యములు. అవి తీర్చుకోవటానికి ఇలాంటి అద్భుతాలు చేసే వారి వద్దకు వెళుతూ ఉంటారు. అసలు అద్భుతాలు ఎవరు చేయగలరు? సిద్ధి పొందిన వారు మాత్రమే. ఇక్కడ రెండు ప్రయోజనాలున్నాయి - ఒకటి ఆ వ్యక్తి తాను ఉపాసన చేసిన దేవతపై మరింత మందికి నమ్మకం కలిగించటం, రెండవది ఆర్తులైన వారి కామ్యము/సమస్యను తీర్చటం. రెండూ కూడా మానవ జన్మ ఎత్తినందుకు సహజమైనవే, అద్భుతాల ద్వారా అటువంటివి తీరటం కూడా సబబే. సమస్యల్లా 1. అది ఆ వ్యక్తులు చేశారనుకోవటం 2. ఆ వ్యక్తులు అలా సిద్ధుల ప్రదర్శన వద్దే ఆగిపోవటం.

మరి దీనిని ఎలా అర్థం చేసుకోవాలి?

1. ఎవరు ఏ సిద్ధిని ఉపయోగించి ఎటువంటి అద్భుతాలు చేసినా, అది పూర్తిగా పరమాత్మ లీలగానే భావించాలి. ఒక వ్యక్తి యొక్క గొప్పతనంగా భావించరాదు. ఆ వ్యక్తి రూపంలో పరమాత్మ ఉన్నాడని, ఒక పెద్ద కారణం చేతనే అలా అద్భుతాలు చేయబడుతున్నాయని భావించి తీరాలి. అప్పుడే మానవీయ పరిధిని దాటి ఆ అద్భుతాలను పరిశీలించగలము.

2. సిద్ధులు అనేవి ఆధ్యాత్మిక మార్గంలో సహజంగా కలిగే ఫలితాలు. వాటిలోనే మునిగిపోతే ఆధ్యాత్మిక ప్రయాణం ఆగిపోయినట్లే. సమాజ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని, దాని శ్రేయస్సు కోసం, వ్యక్తిగత అభ్యున్నతి కోసం సిద్ధులను దాటి ప్రయాణించగలగాలి, అటువంటి వ్యక్తుల వద్దకు వెళ్లే వారికి కూడా అదే ప్రధాన ఆకర్షణ కారాదు. ఒక వ్యక్తి సిద్ధులను సాధించగలిగాడంటే అతను మరింత ఎంత సాధించగలడో అన్నది ఆలోచించి శాశ్వతమైన ఆనందం కోసం పాటుపడే పరిస్థితులను ఆ వ్యక్తి, అతని వద్దకు సమస్యలతో వెళ్లే వారు కలిగించాలి. తప్పకుండా సిద్ధులు కలిగిన మానవులు ఇతరుల కన్నా ఆధ్యాత్మికంగా ముందున్నట్లే. కానీ, అక్కడే ఆగిపోకూడదు, అవే పరమావధి కారాదు. "

మరి పరమాచార్యులు ఏమి చేశారు? అద్భుతాలను అర్హులైన వారికి అనుభూతులుగా అందజేశారు, వాటిని స్వయంగా బహిర్గతం చేయలేదు, ప్రచారం కూడా చేయలేదు. దీనికి ఒక చిన్న ఉదాహరణ. ఒక స్త్రీ ఎన్నో సమస్యలలో ఉండి స్వామి వారి వద్దకు వచ్చి వేడుకుంది. స్వామి ఆమెకు ఒక గంధపు ముద్దనిచ్చి దానిని కామాక్షీ అమ్మ రూపంగా నమ్మకంతో, విశ్వాసంతో ఆరాధించమన్నారు. ఆమె అలాగే చేసింది. ఆమె చూపిన నమ్మకానికి, భక్తికి ఆ గంధపు ముద్ద కొన్నాళ్లకు అమ్మ రూపంగా పరిణామం చెందసాగింది, ముఖము, చెవులు, ముక్కు, కాళ్లు, చేతులు ఆకృతులు ఆ గంధంలో ఉద్భవించాయి. ఆమె సమస్యలు తీరాయి. ఇక్కడ అద్భుతం ఎవరిది? ఆలోచిస్తే మనం నేడు ఎదుర్కుంటున్న విపరీతాలకు సమాధానం దొరుకుతుంది.

శ్రీ చంద్రశేఖర గురోర్భగవాన్ శరణ్యే!

(కామకోటి పీఠం వెబ్‌సైట్ మరియు ఇతర మూలల నుండి అనువాదం)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి