25, జులై 2020, శనివారం

ధర్మం - ఎందుకు?


ఆహార నిద్రా భయం మైథునం చ సమానమేతత్ పశుభిర్నరాణాం
ధర్మో హి తేషామధికో విశేషో ధర్మేణ హీనాః పశుభిస్సమానాః

ఆహారము, నిద్ర, భయము, దేహవాంఛలు పశువులకు, మానవులకు సమానమే. ధర్మాచరణ మాత్రమే ఈ రెండు రకాల జీవుల మధ్య తేడా. ధర్మ హీనుడైన మానవుడు పశువుతో సమానం.

- మహాభారతం

పశువులకు లేని ధర్మం మానవులకెందుకు? వివేకము, విచక్షణ కలిగి ఉన్నాడు కాబట్టి, దానిని దుర్వినియోగం చేసి ఆత్మ మరింత హీనమైన దేహధారణ చేయకుండా, ఉన్నతివైపు అడుగులు వేయటానికే ధర్మం. ఆ ధర్మమే లేకపోతే సమాజంలో ఎంతటి అరాచకముండేదో ఊహించండి. బలవంతుడు, ధనవంతుడు అయిన వానిదే పైచేయిగా మిగిలి మానవత్వమనేది లేకుండా పోయేది. వివేక విచక్షణలను ఆత్మ అనునది పరబ్రహ్మమునకు భేదమైనది కాదని తెలుసుకొనుటకు వినియోగించాలి తప్ప, ఇతరులను అవమానించి హింసించి వాంఛలను తీర్చుకుని రాక్షసత్వం పెంచుకోవటానికి కాదు.

ఇప్పుడు సమాజంలో జరుగుతున్న దారుణాలకు కారణం ఈ ధర్మ భ్రష్టుత్వమే. పురుషులు విద్యావినయ సంపన్నులై ధర్మపరాయణులై కఠినమైన శ్రమతో స్వీయోద్ధరణ, సమాజోద్ధరణ చేయకుండా పూర్తిగా దేహవాంఛలకు, తాత్కాలికమైన ఆనందాలపై దుర్వినియోగం చేసి పతనమవుతున్నారు. స్త్రీలపై అత్యాచారాలతో పాటు సమాజంలో ఉన్న ఎన్నో సమస్యలకు పురుషులు ధర్మాన్ని నిర్వర్తించకపోవటమే కారణం.

ధర్మము సత్యము అనేవి విడదీయలేనివి. ఏది సమస్తభూతములకు హితమైనదో అదే సత్యమని, శిష్టులైన వారు, పెద్దల అభిమతమే ధర్మమని ఆదిశంకరుల అభిప్రాయం. మనకు ఋషిప్రోక్తమైనది అత్యంత శ్రేష్ఠమైనది. అవే వేదాలు. అందుకే వేదాచరణ చేస్తే ధర్మాచరణ జరిగినట్లే. సత్యాన్వేషణ అక్కడే ఆరంభం. ఇతర వాఙ్మయాలు ధర్మాచరణకు సాధనాలు.

ధర్మాన్ని విస్మరించి, పశువులలా హీనులమవుదామా? లేక వీలైనంత ఆచరించి మరింత ఉన్నతమైన జన్మను పొందుదామా? అన్నది మన చేతిలోనే ఉంది. ధర్మాచరణ ధర్మ రక్షణలో ముఖ్యమైన భాగం. ముందు ఆచరణ జరిగితే తరువాత ప్రచారం. ధర్మాచరణ చేస్తేనే పరధర్మాల నుండి కలిగే దాడులను సమర్థవంతంగా ఎదుర్కొని ధర్మ పరిరక్షణకు తోడ్పడగలం. నేడు క్రైస్తవం పేరుతో, నాస్తికత్వం పేరుతో జరుగుతున్న దుష్ప్రచారం కొనసాగటానికి కారణం మనలో ధర్మాచరణ లేకపొవటం, ధర్మంపై విశ్వాసం లేకపోవటం.

యతో ధర్మస్తతో జయః - ధర్మమెక్కడో అక్కడే జయము. ఇక్కడ జయమంటే ప్రధానంగా కర్మాచరణలో అని కాదు, ఆత్మోద్ధరణలో అని.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి