25, జులై 2020, శనివారం

గోపికలకు శ్రీకృష్ణుని సందేశం


కృష్ణుడు గోకులం వీడిన తరువాత మరల గోపికల చెంతకు భౌతికంగా వెళ్లలేదు. ఆ స్వామి సందర్శనముకై వేచి యున్న గోపికలు ఉద్ధవుని వద్ద స్వామి గురించి నిష్ఠూరాలు పలుకుతారు. అప్పుడు ఉద్ధవుడు కృష్ణుని సందేశం వినిపిస్తాడు.

ఎల్ల కార్యములకు నేను ప్రధాన కారణముగావున మీకు రమణులార
కలుగదు మద్వియోగ చరాచర రూపములలో మహాభూతములు వసించు
కరణి నుండుదు సర్వగతుడనై నే మనః ప్రాణబుద్ధి గణేందిర్యాశ్రయుండ
నాత్మయందాత్మచేనాత్మ బుట్టింతు రక్షితును ద్రుంతు హృషీక భూత

గణ గణాకారమాత్మకు గొమరు మిగులు
నిబిడ మాయానుభవమున నిత్య శుద్ధ
మాత్మ విజ్ఞానమయమునై యమరు గుణము
బ్రకృతి కార్యమనోవృత్తి బట్టిపొందు

జగత్తులో జరిగే సమస్త కార్యాలకు తానే కారణమంటూ ప్రతి కార్యములోనూ తనను దర్శించమని తెలిపాడు. చరాచర రూపాలన్నిటిలోనూ అంతర్గతంగా జీవం ఎలా ఉంటుందో అదే విధంగా తాను అన్నిటా చర్మచక్షువులకు కనిపించకుండా మనస్సు, ప్రాణము, బుద్ధి, గుణములు, ఇంద్రియములను ఆశ్రయించి ఉన్నానని చెబుతాడు. ఆత్మలో ఆత్మ ద్వారా ఆత్మను పుట్టించి రక్షించి త్రుంచెదనని తెలిపాడు. బాహ్యదృష్టి వీడి ఇంద్రియ నిగ్రహులై అంతర్ముఖులైనట్లయితే ఆత్మనే అంటి ఉన్న తనను దర్శించగలుగుతారని స్పష్టం చేశాడు.

ఒక విధంగా గోపికలకు కంటికి దూరమైన తనను ఆత్మలో దర్శించమనడంలో సగుణారాధనం నుండి నిర్గుణారాధనకు చేరుకునే స్థాయిని, స్థితిని తెలియజేశాడు. సాధకులు ఆరంభంలో తమ దృష్టికి ఆకర్షణీయమైన దేవతా స్వరూపాలను ఎంచుకుని దానిపై దృష్టిని కేంద్రీకరించి ఏకాగ్రతతో ధ్యానం చేస్తూ ఆలయాలకు పుణ్యక్షేత్రాలకు వెళ్లి ఆయా రూపాలను దర్శిస్తూ ఉండి రాను రాను కేవలం బాహ్య దృష్టికి మాత్రమే పరిమితం కాక ఆంతర్యంలో పరమాత్మ రూపాన్ని దర్శించగలిగే స్థాయికి చేరుకునే విధానం గోపికలు శ్రీకృష్ణుడు ఇచ్చాడు. కంటికి కనబడుతున్న వెలుగును అంతరాంతరాలలో నింపుకోగలగాలి. కంటికి కనబడేది సత్యమే అయినా అది శాశ్వతం కాదు. ఆ శాశ్వతం కాని దానిని అంతరంగంలో నిలుపుకుని శాశ్వతం చేసుకోవచ్చు. కనుకనే గోపికలతో ఎన్నో లీలలు చూపి మధురకు వెళ్లిన కృష్ణుడు తిరిగి ఎన్నడూ శారీరికంగా గోపికల దగ్గరకు బృందావనానికి రాలేదు.

ఎప్పుడూ నన్ను మీరలు చింతించుచునుండ గోరి యిటు దూరస్థత్వముంబొందితిం దలకం బోలదు నన్ను గూడెదరు నిత్యధ్యాన పారీణలై అని కృష్ణుడు గోపికలకు బోధిస్తాడు. కృష్ణుని సందేశాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నారు కనుకనే గోపికలు కృష్ణలీలలను మననం చేసుకుంటూ గడిపారు. అంతరంగంలో భగవంతుని ఏనాటికీ బంధించకపోతే సాధకుల సాధనకు అర్థం లేదు. అది సాధించిన వారు గోపికలు.

శ్రీకృష్ణపరమాత్మను ఊరకే జగద్గురుం అని బోధించలేదు. తల్లిదండ్రులకు, మిత్రులకు, సఖులకు, సతులకు, బంధుగణానికి, శత్రువులకు, సమస్త మానవాళికి ఎలా జీవించాలో ఎలా తరించాలో అద్భుతంగా బోధించి జగద్గురువైనాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి