25, జులై 2020, శనివారం

శృంగేరి శారదా పీఠం 12వ జగద్గురువులు విద్యారణ్య మహాస్వామి


అవిద్యారణ్యకాంతారే భ్రమతాం ప్రాణినాం సదా
విద్యామార్గోపదేష్టారం విద్యారణ్యగురుం శ్రయే

అవిద్య (అజ్ఞానం) అనే అరణ్యంలో తిరుగాడే జీవికి ఎల్లప్పుడూ విద్యను ప్రసాదించి మార్గదర్శకులైన విద్యారణ్య గురువులకు నమస్కరించుచున్నాను.

విద్యారణ్య మహాస్వామి - శృంగేరి శారదా పీఠం 12వ జగద్గురువులు. వీరు శంకర భగవద్పాదుల తరువాత దాదాపు 500 ఏళ్ల తరువాత జన్మించిన వారు. శంకరుల తరువాత భారతదేశంలో ఆధ్యాత్మికంగా మహోన్నత శిఖరాలకు తీసుకు వెళ్లి ప్రజలకు పాలకులకు మార్గదర్శకమై నిలిచారు. వీరే విజయనగర సామ్రాజ్య స్థాపకులైన హరిహర బుక్కరాయలకు గురువులు. సామ్రాజ్యంలో ధర్మం నిలబడటానికి, పాలకులు ధర్మబద్ధులై ఉండటానికి విద్యారణ్యుల వారే కారకులు. వీరు శృంగేరి మరియు హంపీలలో క్షేత్రాలను నిర్మించి అభివృద్ధి చేశారు. శృంగేరిలోని విద్యాశంకర మరియు శారదాంబ దేవస్థానాలు వీరి పీఠాధిపత్యంలో నిర్మించినవే. వీరు రచించిన వేదాంత పంచదశీ మరియు జీవన్ముక్త వివేక భాష్యాలు అద్వైత పరంపరలో గురువులకు మార్గదర్శకమై నిలిచాయి. శృంగేరిలో ఉన్న శాసనాల ప్రకారం వీరు ఏకశిలా నగరంలో (ఓరుగల్లు/వరంగల్ ప్రాంతం) జన్మించిన వారు. దక్కన్ సుల్తానులను తరిమి హైందవం నిలపటానికి హరిహర బుక్కరాయలచే విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపింపజేశారు విద్యారణ్యులు.

విద్యారణ్యుల అసలు పేరు మాధవ. వీరి తమ్ముడు జ్ఞానం కోసం దేశ సంచారం చేస్తూ శృంగేరి చేరుకుని అక్కడి పీఠాధిపతి అయిన విద్యాశంకర భారతీస్వామి వారి కలుస్తాడు. స్వామి అతనిలోని జిజ్ఞాసకు సంతోషించి సన్యాసమిచ్చి భారతీకృష్ణ తీర్థగా నామకరణం చేశారు. తమ్మునికై వెదకుతూ మాధవుడు శృంగేరి చేరుకుని విద్యాశంకర భారతీస్వామి వారిని కలిసి అక్కడే ఉంటాడు. కొన్నాళ్లకు పీఠాధిపతులు అతనికి మాధవ సన్యాస దీక్షనిచ్చారు. శ్రీవిద్యారణ్యులుగా నామకరణం చేశారు. గురువుల ఆదేశంతో విద్యారణ్యులు కాశీ వెళ్లి విద్యాధ్యయనం చేశారు. తరువాత బదరిలో శ్రీవిద్యా ఉపాసన చేశారు. అక్కడి నుండి హంపీ సమీపంలో ఉన్న మతంగ పర్వతంపై తపస్సు చేస్తున్నప్పుడు మాధవ మరియు శాయన అనే ఇద్దరు సోదరులు వారి వద్దకు వస్తారు. వారిని ఆశీర్వదించి తాను వ్రాస్తున్న వేద భాష్యాలను పూర్తి చేయవలసిందిగా చెబుతారు. అవే తదుపరి కాలంలో మాధవీయం, శాయనీయంగా పేరొందాయి. వీరిద్దరు హరిహర బుక్కరాయల వద్ద మంత్రులుగా పనిచేశారు.

విద్యారణ్యులు పరాశర మాధవీయ, సర్వదర్శనసంగ్రహ, జైమినీయ న్యాయమాల, పరాశరస్మృతి వ్యాఖ్యాన, స్మృతి సంగ్రహ, వ్యవహార మాధవ, శ్రీ విద్యాతీర్థ దీపిక, వివరణప్రమేయ సంగ్రహ, దృక్ దృశ్య వివేక, అపరోక్షానుభూతి టీకా, ఆరు ఉపనిషద్దీపికలు అనే అద్భుతమైన రచనలు కూడా చేశారు. వీరి పంచదశీ నేటికి ప్రామాణికమే. వివేక, దీప, ఆనంద అనే మూడు భాగాలు కలిగిన ఈ భాష్యం ఆదిశంకరుల తత్త్వాన్ని విశదీకరించి ఆధ్యాత్మిక జ్యోతులు శాశ్వతమై వెలిగేలా చేసింది. అలాగే, వీరు మాధవీయ శంకరవిజయమనే గ్రంథాన్ని రచించారు. అది సంక్షిప్తంగా ఆదిశంకరుల జీవితచరిత్ర. మిమాంస సూత్రములపై కూడా భాష్యం రచించారు. వీరే మాధవాచార్యులుగా కూడా పేరొందారు.

విద్యారణ్యుల సోదరులు భారతీకృష్ణ తీర్థులు తొలుత శృంగేరి శారదాపీఠాధిపతిగా ఉండి సిద్ధి పొందిన తరువాత విద్యారణ్యులు పీఠాధిపత్యాన్ని స్వీకరించారు. అనేక దేవాలయాలు వీరి హయాంలోనే నిర్మించబడ్డాయి. ఆధ్యాత్మికంగా ఆదిశంకరుల తరువాత హైందవం మహోన్నతమైన ప్రాభవం పొందింది విద్యారణ్యుల పీఠాధిపత్యంలోనే అని చెప్పవచ్చు. నేడు ఉన్న శ్రీచక్రార్చన విధి విధానం విద్యారణ్యుల వారి చలవే. అందుకు ఈ జాతి వారికి ఎంతో ఋణపడి ఉంది.

(శృంగేరి శారదా పీఠం వారి వెబ్ సైట్ నుండి)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి