3, మార్చి 2017, శుక్రవారం

భారతీయ నాట్యకళలు - వ్యాపార ధోరణి


యథో హస్త తథో దృష్టి
యథో దృష్టి తథో మనః
యథో మనః తథో భావ
యథో భావ తథో రసః

చేతులు ఎటువైపు ఉంటాయో దృష్టి అటువైపు; దృష్టి ఎటువైపు ఉంటుందో మనసు అటువైపు. మనసు ఎటువైపు ఉంటుందో భావం అటువైపు. భావం ఎటువైపు చూస్తుందో రసం ఆ భావనతోనే పెల్లుబుకుతుంది.

- నాట్యశాస్త్రం.

నాట్యకళలో ఆంగికం, ఆహార్యం, మనస్సు, భావము, రసము అన్నీ ఏకమై అంశంలో లీనమైతేనే అది రసికుల హృదయాలను తాకి రంగమంటపంపై దివ్యత్వాన్ని రాజిల్లజేస్తుంది. చప్పట్లపైన, పారితోషకం పైన, అవార్డులపైన, ఫోటోలు, వీడియోలపైన దృష్టి కలిగి ఉండే కళాకారులు చేసే నాట్యంలో ఈ దివ్యత్వం ఉండదు. కళ జీవరసంతో ఉట్టిపడదు. అందుకే కళారాధనలో తనను తాను మర్చిపోయి రమించాలి అని సద్గురువులు చెప్పారు. అది భరతనాట్యం, కూచిపూడి, కథక్, కథాకళి, ఒడిస్సీ, మణిపురీ, మోహినిఆట్టం వంటి ఏ కళైనా కావచ్చు. కానీ, కళాకారుడు కళలో, భావంలో, స్వరంలో, లయలో తాదాత్మ్యత చెందకపోతే యాంత్రికమైన నృత్యమే అవుతుంది. ఆ నృత్యం కుప్పిగంతులతో సమానమవుతుంది. భారతీయ నృత్యకళలకు ఉన్న ప్రత్యేకత సనాతన ధర్మంలో అంతర్భాగమై ఇహ పరాలను సమానంగా ప్రస్తావించే అంశాలను ప్రదర్శించే అవకాశాన్ని కళాకారులకిస్తాయి. తద్వారా వారి వ్యక్తిత్వాలను పై మెట్టుకు తీసుకువెళతాయి. నేను అన్న భావన కోల్పోయిన అ కళాకారులు పాత్రలో జీవించి భవంతో నర్తించి రసాన్ని అభినయం ద్వారా ప్రవహింపజేస్తారు. అందుకే, ప్రతి ఒక్క అంశమూ కూడా దివ్యత్వాన్ని పొంది రంగస్థలాన్ని ఓ దేవాలయంగా మారుస్తాయి. దీనికి ప్రధన సాధనం గురువు, గురు పరంపర. ఏదో నాలుగు ముద్రలు నేర్పి ఓ రెండు మూడు అంశాలు భావం తెలియజేయకుండా నేర్పే గురువులు ఈరోజు చాలా మంది కనిపిస్తున్నారు. కాస్త గుర్తింపు రాగానే వాళ్లే న్యాయనిర్ణేతలు. వారి శిష్యులకు అసలు కళ, భావం, ఆ కళలోని పవిత్రత, ఆ కళకు మూలాలు తెలియజేసే గురువులు కరువయ్యారు. ఓ నాట్యగురు కావాలంటే నాట్యయోగంలో సిద్ధించాలి. వ్యక్తిత్వం స్థితప్రజ్ఞత పొందాలి. నవరసాలను అలవోకగా ఒలికించగలగాలి. పాషణమైన మనుషుల హృదయాలను కరిగించి మానవత్వాన్ని నింపాలి. మనుషులను ఏకం చేయగలిగే శక్తికి ఇటువంటి గురువులకు, వారికి నైపుణ్యం గల కళలలో ఉంది. నాట్యవిద్యను వ్యాపారధోరణితో కాకుండా ఓ సనాతన పవిత్ర కళగా భావించి తరువాతి తరాలకు ఈ గురువులు అందిస్తే ఈ రసప్రవాహం శాశ్వతమవుతుంది. లేకపోతే భారతీయ నాట్య కళలు రూపాంతరం చెంది సహజమైన శక్తిని కోల్పోయే ప్రమాదం ఉంది.

ఈ సమస్యను కళాతపస్వి కే విశ్వనాథ్ గారు సాగరసంగమం, స్వర్ణకమలం చిత్రాల ద్వారా మనకు చాలా చక్కగా తెలియజేశారు. మన నాట్యకళలకు ఉన్న చరిత్ర, దివ్యత్వం మరే ప్రపంచ కళలకు లేదంటే అతిశయోక్తి కాదు. నర్తనమే శివకవచం నటరాజ పాద సుమరజం అన్నారు వేటూరి వారు. నిత్యనర్తనుడైన శివుని పూజకు చివురించిన కళలు వ్యాపారధోరణి పట్టి ప్రమాణాలను కోల్పోకూడదు. దీని గురుతర బాధ్యత నాట్య శాస్త్ర గురువులపైనే ఉంది. పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుచుకోవటం ప్రధాన లక్ష్యం కాకుండా కళను ఆరాధించి భావాన్ని ఆకళింపు చేసుకొని ఆహార్యంలో గుప్పించగలిగే శిక్షణా పద్ధతిని పునరుద్ధరించి కొనసాగించాలి. 

తాగరా శ్రీరామ నామామృతం - వేదవ్యాస గీతం


అల్లా...ఇది ఇస్లాంలో దేవుడు అనటానికి ఉపయోగించే పదం. ఈ పదానికి శ్రీపాద శ్రీవల్లభ చరిత్రలో శంకరభట్టుగారు అద్భుతమైన వివరణ ఇచ్చారు - అల్ అనగా శక్తి, ఆహ్ అనగా శక్తిని ధరించివాడు. అనగా శివపార్వతుల అర్థనారీశ్వర రూపం ఎలానో అల్లా పదం అంతే. దైవం అంటే ఏ విశ్వాసంలోనైనా ఒకటే అన్నదానికి ఈ అర్థం ఓ మంచి ప్రాతిపాదిక అవుతుంది. కబీర్ దాస్ ఇస్లాం మతాన్ని విశ్వసించే కుటుంబంలో జన్మించినా హిందూ సిఖ్ ఇస్లాంలలోని మంచి
సిద్ధాంతాలను మాత్రమే తీసుకొని దురాచారాలను ఖండించాడు. హిందూ మత సిద్ధాంతాలకు ఆయనకు గురువు స్వామి రామానంద. ఆయన వద్ద తారక మంత్ర ఉపదేశాన్ని పొందిన కబీర్ భారతదేశంలో అనేక చోట్ల పర్యటించారు. అలాగే అల్లా అనే పదం యొక్క అర్థాన్ని సంపూర్ణంగా మతాలకు అతీతంగా ఆకళింపు చేసుకున్న మహానుభావుడు కబీర్. మానవుని జీవితానికి ముఖ్యమైన విలువలను స్పష్టంగా తన దోహాల రూపంలో మనకు అందించారు. వృత్తి రీత్యా చేనేత కార్మికుడైనా, భక్తిలో రాముని దర్శించి తరించిన వాడు కబీర్. తారక మంత్ర సిద్ధిని పొంది ఎందరికో దాని అమృతాన్ని అందించాడు. ఒక రకంగా చెప్పాలంటే కబీర్ 15వ శతాబ్దపు సంఘసంస్కర్త.

కబీర్‌దాసు మన తెలుగునాట జన్మించిన రామదాసుకు తారమంత్రాన్ని ఉపదేశించిన గురువని చెప్పబడింది. ఆ కబీర్-రామదాసుల కలయిక,మంత్రోపదేశ సన్నివేశాలు ఎంతో అద్భుతంగా శ్రీరామదాసు సినిమాలో చిత్రీకరించారు. ఈ చిత్రంలో వారిద్దరు తొలిసారు కలిసే ఘట్టంలో ఓ సుమధుర భక్తి గీతం వెలువడింది. కీరవాణి సంగీతంలో శ్రీవేదవ్యాస గారు రచించగా శంకర్ మహదేవన్ మరియు విజయ్ యేసుదాస్ ఈ పాటను రామదాసు, మరియు కబీర్ పాత్రలకు పాడారు. వివరాలు పరిశీలిద్దాం:

అల్లా ... శ్రీ రామా...
శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడు
కళ్యాణ గుణఘనుడు కరుణా ఘనాఘనుడు ఎవడు
అల్లా తత్వమున  అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడు
ఆనంద నందనుడు అమృతరస చందనుడు రామచంద్రుడు కాక ఇంకెవ్వడు
తాగరా శ్రీరామనామామృతం ఆనామమే  దాటించు భవ సాగరం
తాగరా శ్రీ రామనామామృతం ఆనామమే  దాటించు భవ సాగరం

ఏ మూర్తి మూడు మూర్తులుగ వెలిసిన మూర్తి
ఏ మూర్తి  ముజ్జగంబుల మూలమౌ మూర్తి
ఏ మూర్తి  శక్తి చైతన్య మూర్తి
ఏ మూర్తి  నిఖిలాండ  నిత్య సత్య స్ఫూర్తి
ఏ మూర్తి  నిర్వాణ నిజ ధర్మ సమవర్తి
ఏ మూర్తి  జగదేక చక్రవర్తి
ఏ మూర్తి  ఘనమూర్తి  ఏ మూర్తి  గుణకీర్తి
ఏ మూర్తి  అడగించు జన్మజన్మల ఆర్తి
ఏ మూర్తి  ఏ మూర్తియునుగాని  రసమూర్తి
ఆ మూర్తి శ్రీరామచంద్ర మూర్తి

తాగరా ఆ ఆ ఆ  తాగరా శ్రీరామనామామృతం ఆ నామమే దాటించు భవసాగరం...

పాపాప మపనీప మపనీప మపసనిప మాపామ శ్రీ రామా
పాపాప మపనీని  పనిసాస రిరిసనిప   మాపాని  మపమా కోదండ రామా
మపనిసరి  సానీ పానీపామా  సీతారామా
మపనిసరి  సా రీ  సరిమరిస నిపమా  ఆనందరామా
మా మా రిమరిమరి  సరిమా  రామా జయరామా
సరిమా రామా సపమా  రామా
పా ఆ ఆ ఆ   వన  రామా


ఏ వేల్పు ఎల్ల వేల్పులును గొల్చెడి వేల్పు
ఏ వేల్పు ఏడేడు లోకాలాకే వేల్పు
ఏ వేల్పు నిటూర్పు ఇలనునిల్పు
ఏ వేల్పు నిఖిల కల్యాణముల కలగల్గు
ఏ వేల్పు నిగమనిగమాలన్నిటిని తెల్పు
ఏ వేల్పు నింగినేలలను కల్పు
ఏ వేల్పు ద్యుతి గొల్పు ఏ వేల్పు మరుగొల్పు
ఏ వేల్పుదేమల్పు లేని గెలుపు
ఏ వేల్పు  సీతమ్మ వలపు తలపుల నేర్పు
ఆ  వేల్పు దాసానుదాసులకు కైమోడ్పు

తాగరా ఆ ఆ ఆ  తాగరా శ్రీరామనామామృతం ఆ నామమే దాటించు భవసాగరం...

రాముడెవరు? శుభాన్ని కలిగించే వాడు, అందమైన రూపము కలవాడు, పాపములను హరించే వాడు. సమస్త సద్గుణములను కలిగిన గొప్పవాడు, కరుణ మూర్తీభవించిన వాడు - ఇంతవరకు బానే ఉంది, అందరికీ అర్థమవుతుంది. మరి అల్లా తత్త్వమున అల్లారుముద్దుగా అలరారు అందాల చంద్రుడెవరు? అన్నాడు కవి. అల్లా తత్వమేమిటి? శక్తియుతమైన శివమని పైన చెప్పుకున్నాం కదా? రాముడి నామంలోనే ఉంది మూలమంతా. మళ్లీ శ్రీపాద శ్రీవల్లభుల చరిత్రకే వెళితే రాం అనే పదానికి అగ్ని బీజం. ఇదే విషయం రామరహస్యోపనిషత్తులో కూడా చెప్పబడింది. అత్యంత శక్తివంతమైన రామ నామం శివకేశవుల శక్తి సమన్వితమై ఈ విశ్వంలో పరమాత్మ తత్త్వాన్ని ప్రసరింపజేస్తోంది. పరమాత్మ తత్వంలో ప్రకాశించే వాడు రామచంద్రుడు. ఆ రాముడి ఘనత ఎటువంటిది? ఆనందరాముడు, అమృతర్సంతో నిండి యున్న వాడు. ఆ రామ నామమనే అమృతాన్ని త్రాగమని కవి ఘోషిస్తున్నారు. ఆ నామాన్ని నమ్ముకుంటే చాలు, ఈ భవ సాగరాన్ని దాటగలము అని చెప్పారు.

త్రిమూర్తులుగా వెలసిన పరమాత్మ ఆ రాముడు. ఈ మూడులోకాలకు ఆయనే మూలము. ఆయన విశ్వజనీనమైన శక్తి యొక్క చైతన్యరూపము. ఆయనే సమస్త లోకములలోని జీవరాశులకు సత్యము, శాశ్వతము, కారకము. ఆయనే మోక్ష ప్రదాయకుడు. సత్య ధర్మ పాలనలో సమ న్యాయం చూపించే వాడు. ఆ రామచంద్రమూర్తి మూడు లోకాలకు ఏకైక చక్రవర్తి. ఆయన ఘనమైన రూపము కలవాడు, తన గుణములచే కీర్తిని పొందిన వాడు. ఆ రామచంద్రుడు జన్మ జన్మల ఆర్తిని హరించే వాడు. ఒక రూపమంటూ లేని వాడు, సమస్త రసములను మూర్తీభవించిన వాడు. ఆయనే శ్రీరామచంద్రమూర్తి. ఆ రాముని నామమనే అమృతాని త్రాగమని కవి చెబుతున్నారు. ఆ నామం మనలను సంసార సాగరాన్ని దాటించే నావ.

శ్రీరాముడు కోదండరాముడు, సీతారాముడు, ఆనందరాముడు, జయరాముడు. ఆయన ఘంత ఎలాంటిది? సమస్త దేవతలు కొలిచెడి దేవుడు ఆ రాముడు. ఆయన పదునాలుగు లోకాలకు దేవుడు. ఆయన నిట్టూర్పులతో ఈ భువిని నిలిపే దైవము. ఆయనే సమస్త కళ్యానములను ప్రసాదించే దైవము. ఆయన తత్త్వము సమస్త శాస్త్రాలను తెలిపేది. ఆయన నింగి నేల అంతటా వ్యాపించి ఉన్న దైవము. ఆయన మహా ప్రకాశవంతమైన దైవము, ఆయన రూపము మనోహరమైనది. ఆయన విజయాలు అప్రతిహతమైనవి. సీతమ్మ ప్రేమకు, ఆలోచనలను తెలిపేది ఆ రమచంద్రుడు. అటువంటి రాముని నామమనే అమృతాన్ని త్రాగమని కవి ఉద్ఘాటిస్తున్నారు. ఆ నామం మనలను ఈ సంసార బాధలనుండి రక్షిస్తుంది.

ఈ పాటను లోతుగా పరిశీలిస్తే రామతత్త్వం ఎంతటి మహత్కరమైనదో తెలుస్తుంది. ధర్మం మూర్తీభవించిన వాడు రాముడైతే అనుగమించిన సీత లోకపావని. అందుకే ఈ అవతారం శక్తి సమన్వితమై లోకోత్తరమైంది. ప్రతి అడుగులోనూ మానవునికి ఉత్తమ విలువలను నేర్పిన వారు సీతారాములు. తల్లిదండ్రులు, గురువులు, సోదరులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, సేవకులు, శత్రువుల పట్ల ఎలా ప్రవర్తించాలో రామాయణం మనకు చక్కగా వివరిస్తుంది. విలువలనే ఓ చిత్రపటం గీస్తే అది రాముని రూపమై ఆవిష్కరిస్తుంది అని అనటంలో ఎటువంటి సందేహమూ లేదు. అలా నడచుకున్నాడు కాబట్టే ఆయన నామం అంత గొప్పది. రామనామంతో తరించిన మహనీయులను మనం ఎంచలేము. మన పాపాలను హరించేది, మనలను తరించేది, మనకు ముక్తిని ప్రసాదించేది అని త్యాగరాజ స్వామి వంటి మహనీయులు ఎందరో తెలిపారు. రామావతారంతో మనకు అవగతమయ్యే సత్యాలు కొన్ని ఉన్నాయి:

1. ధర్మాన్ని తు.చ. తప్పకుండా ఆచరించే మానవుడు దివ్యాత్వన్ని పొంది ముల్లోక వంద్యుడవుతాడు.
2. అటువంటి దివ్యమూర్తుల నామ స్మరణతో మన పాపాలు హరింపబడతాయి.
3. వారి నడవడిక మనకు జీవితంలో సాధనాలుగా తోడ్పడి మనలను స్థితప్రజ్ఞులను చేస్తాయి.

రామ పూర్వతాపిన్యుపనిషత్ రాముడే పరబ్రహ్మమని స్పష్టంగా చెబుతుంది:

రామ ఏవ పరం బ్రహ్మ రామ ఏవ పరం తపః
రామ ఏవ పరం తత్త్వం శ్రీరామో బ్రహ్మ తారకం

రాముడే పరబ్రహ్మము. రాముడే పరమ తపము. రాముడే పరతత్త్వము. శ్రీరాముడే తారక బ్రహ్మము.

అటువంటి రామమంత్రాన్ని మించినది మరొకటి లేదని ఎందరో చెప్పారు. అగస్త్య సంహిత ప్రకారం రామమంత్రమే మంత్రరాజం. అది సర్వోత్తమమైన మంత్రం. దూదికొండలను ఒక చిన్న నిప్పురవ్వ ఎలా దహిస్తుందో అలా కాటుకొండలవంటి పాపములను రామ నామము దహించివేస్తుందని ఈ సంహిత చెప్పింది. స్త్రీపురుష భేదం లేకుండా అందరూ ఈ మంత్రాన్ని జపించవచ్చని ఈ సంహిత తెలుపుతుంది. ఈ సందేశాన్ని వేదవ్యాస గారి ఈ గీతం సామాన్యునికి అర్థమయ్యేలా చాటింది. రామ నామే జీవనంగా, భుక్తిగా, ముక్తిగా భావించి తరించ వారిలో కబీర్ దాసు అగ్రగణ్యులు. అలాగే వాగ్గేయకారులైన త్యాగరాజస్వామి, రామదాసు, అన్నమాచార్యుల వారు తమ సంకీర్తనలలో రామ మంత్ర మహాత్మ్యాన్ని చాటారు. అటువంటి కబీర్-రామదాసుల కలయికలో ఇటువంటి గీతాన్ని ఆవిష్కరించటం వేదవ్యాస గారి ప్రతిభను మనకు తెలియజేస్తుంది.

ఇటీవలి కాలంలో రామునిపై వచ్చిన సినీ గీతాలలో ఈ తాగరా శ్రీరామ నామామృతం అనే పాట అత్యంత మహిమాన్వితమైన సందేశం కలది. రచయిత వేదవ్యాస రంగభట్టర్ గారి కౌశలం ఈ పాటలో ప్రతి ఒక్క అక్షరంలోనూ కనబడుతుంది. శ్రీమంజునాథ చిత్రంలో మహా ప్రాణ దీపం అనే గీతం గుర్తుందా? ఈ వేదవ్యాస గారు రచించిందే. ఇటువంటి గీతం రచించాలంటే తప్పకుండా దైవానుగ్రహం కలిగి ఉండాలి. వేదవ్యాస గారు భగవద్రామానుజుల వారి శిష్యుని వంశంలో జన్మించిన వారు. వీరి పూర్వీకులది శ్రీరంగం. దశాబ్దాల క్రితం వరంగల్‌కు తరలి వచ్చారు. ఈయన హైదరాబాదులోని వేదాంత వర్ధని సంస్కృత కళాశాలలో విద్యాభ్యాసం చేసిన తరువాత టీటీడి సంస్కృత ప్రాచ్య కళాశలలో అధ్యాపకునిగా చేరి 36 సంవత్సరాల సర్వీసు తరువాత పదవీ విరమణ చేసి తిరుపతిలోనే స్థిరపడ్డారు. చదువుకునే రోజుల్లోనే కర్ణాటక శాస్త్రీయ సంగీత శిక్షణ పొందారు. తరువాత తిరుపతిలో సంగీతాన్ని అభ్యసించారు. ఆయన స్వరజ్ఞాన వర్ధిని అనే అద్భుతమైన గ్రంథాన్ని కూడా రచించారు. సంగీతంలో ఎందరికో శిక్షణనిచ్చారు. రామదాసు, వేంగమాంబ, ఆదిశంకరాచార్య చిత్రాలకు ఉత్తమ గేయ రచయిత అవార్డులను పొందారు. గతంలో వీరు కేవీ మహదేవన్, సాలూరి రాజేశ్వరరావు గారి వద్ద పని చేశారు. సంగీతంపై ఎన్నో పరిశోధనలు చేసిన వీరు ఇప్పటికీ ఔత్సహిక కళాకారులకు, బాలబాలికాలు శిక్షణనిస్తున్నారు. ఎందరో నటీనటులకు నటనలో శిక్షణ కూడా ఇస్తున్నారు. వేదవ్యాస రంగభట్టర్ గారి కలంలో వెలువడిన ఈ గీతం తెలుగు చలన చిత్ర భక్తి గీతాల్లో ఓ ప్రత్యేక స్థానంలో ఉంటుంది.

రామమంత్ర మహత్తును వేదవ్యాస గారు అద్భుతమైన అక్షర సంపదతో అందించగా కీరవాణి గారు అంతే గొప్ప స్వరాలను అందించారు. తండ్రికి తగ్గ తనయుడిగా విజయ్ యేసుదాస్, మరో ఆరితేరిన సంగీత కళాకారుడు, నేపథ్య గాయకుడు శంకర్ మహాదేవన్ సమఉజ్జీలుగా ఈ పాటను పాడారు. ఇద్దరు గొప్ప గాయకులు, గొప్ప సంగీత దర్శకుడు, గొప్ప రచయిత కలయికలో వెలువడిన ఈ గీతం రామనామామృతాన్ని అందరికీ పంచింది.

శ్రీరామ జయరామ జయ జయ రామ!



27, ఫిబ్రవరి 2017, సోమవారం

శ్రీరామ పరంధామ జయ రామ పరంధామ


రాముడు పరంధాముడు. అనగా సర్వాంతర్యామి లేదా పరమాత్మ. పొత్తూరి వేంకటేశ్వరరావు గారి పారమార్థిక పదకోశం ప్రకారం పరమాత్మ అనే పదానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి. అందులో కొన్ని

1. స్వయం ప్రకాశం కలిగి, జ్ఞానరూపమైన ఆత్మ.
2. కార్యకారణాలకంటే భిన్నమై, క్షరాక్షరాల కంటే కూడావేరుదై, స్వాభావికంగా నిత్యమై, శుద్ధమై, బుద్ధమై, ముక్తమైన పదార్థం.
3. అవిద్య వల్ల ఆత్మగా తలచిన దేహం మొదలు బుద్ధివరకు ఉన్న తత్త్వాలకు అతీతమైనది. సర్వోత్కృష్టమైనదీ, ఉపద్రష్టృత్వాది విశేషణ విశిష్టమై ప్రకాశించే ఆత్మ.
4. ఆత్మగా కల్పితాలైన పంచ కోశాలకు, విరాట్‌, హిరణ్య గర్భ, అవ్యాకృత తత్త్వాలకు అతీతమై, బ్రహ్మకు పూర్వం నుంచి ఉన్న పదార్థం.
5. సమస్త భూతాలలోని ప్రత్యక్చేతనం.
6. మాయాశక్తికి ఆశ్రయం.
7. సర్వానికి అధిష్ఠానమైనది.
8. పర దేవత.
9. దైవం / పరబ్రహ్మం.

వీటన్నిటి ద్వారా మనకు తెలిసేది ఏమిటి? శాశ్వతమైన గుణాతీతమై, అక్షరమై సమస్త జీవరాశులయందు ఉన్న చైతన్యమే పరమాత్మ.

రామావతారంలో ఉన్న గొప్పతనం ఆయన సామాన్య మానవునిగా, ప్రభువుగా ధర్మబద్ధతతో నడచుకొని పరంధాముడైనాడు. ఆయన అవతారం ప్రతి మానవునికీ ఒక పాఠం, ఆదర్శం మరియు ఆధ్యాత్మిక సోపానానికి స్ఫూర్తిదాయకం. ఏ విధంగా మసలుకుంటే మానవుడు దివ్యత్వాన్ని పొందుతాడో రాముడు తన నడవడికతో  తెలిపాడు. పరంధాముడైన ఆ రాముని నుతించే ఏ గీతమైనా మధురమే. రామ నామంలోని శక్తి అది. రాముని జీవనశైలిలోని మహత్తు అది. ఓం నమో నారాయణాయ అనే మంత్రంలోని రా అనే బీజాక్షరం, ఓం నమశ్శివాయ అనే శివ పంచాక్షరీ మంత్రంలోని మ అనే బీజాక్షరం  కలిసి రామ నామ ఆవిర్భవించిందని ఒక అభిప్రాయం. పద్మపురాణం ప్రకారం యోగులను సచ్చిదానందంలో రమింపజేసేది రామ అని అర్థం. తారకమనే ఘనత రామనామానికి మాత్రమే. రామ అనే బీజాక్షరాలను ఉచ్చరించటం వలన పాపాలు పటాపంచలై పోతాయని సనాతన ధర్మం ఘోషిస్తుంది. సంసార సాగరాన్ని దాటించేది కాబట్టి భవతారకమై ఈ తారక నామము భక్తులను ఉద్ధరిస్తోంది. వహ్నిగర్భమైన ఈ నామం పాపనాశనం చేసి ముక్తిని ప్రసాదించేది.

రాముని వైభవాన్ని తెలిపే గీతాలు చలన చిత్రాలలో ఎన్నో వచ్చాయి. 1963లో విడుదలైన లవకుశ చలనచిత్రం ఒక్క తెలుగు భాషలోనే కాదు, భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఆణిముత్యం. ఆధ్యాత్మికతను, పవిత్రతను ప్రతి అడుగులోనూ చాటే ఈ చిత్రంలో సముద్రాల రాఘవాచార్యుల వారు ఎన్నో గీతాలను రచించారు. వాటిలో ఒకటి శ్రీరాముడు-లవకుశుల సంగ్రామ ఘట్టంలో హనుమతో పాటు వాల్మీకి మహర్షి శిష్య బృందం పాడే గీతం శ్రీరామ పరంధామ జయ రామ పరంధామ. సాహిత్యం:

శ్రీరామ పరంధామ జయ రామ పరంధామ
రఘురామ రామ రణరంగ భీమ జగదేక సార్వభౌమ

సూర్యాన్వయాబ్ధి సోమ సుగుణాభిరామ శుభనామ
కారుణ్యధామ దశకంఠ విరామ రాఘవ రాజలలామ

సాకేతపురాధిప రామ సీతామనోహర శ్రీరామ
అరవిందలోచన సుందర సురుచిర ఇందీవర శ్యామ

శ్రీరాముని పరమాత్మగా నుతిస్తూ ఆయనకు జయము పలికారు రాఘవాచార్యుల వారు. రఘువంశంలో జన్మించిన వానిగా, యుద్ధరంగంలో అరివీర భయంకరునిగా, ఈ విశ్వంలో ఏకైక సార్వభౌమునిగా కొలిచారు. సూర్యవంశమనే సముద్రానికి చంద్రుని వంటి వానిగా, సుగుణాలతో శోభిల్లే వానిగా, శుభమైన నామము కాలిగి, కరుణకు నెలవై, రావణుని సంహరించిన రాజశ్రేష్ఠునిగా రాముని స్తుతించారు. సాకేతపురానికి రాజుగా, సీత మనసు దోచుకున్న వానిగా, కలువలవంటి కన్నులు కలవానిగా, సుందరమైన, మనోజ్ఞమైన రూపముగల లక్ష్మీపతి అయిన నీలమేఘ శ్యామునిగా అభివర్ణించారు.

రామభక్తి సామ్రాజ్యంలో ఆ పరంధాముని కీర్తించే భావ సుమాలు ఎన్నో! వాగ్గేయకారుల సంకీర్తనలు, భావ కవుల భక్తి రసఝరులు, పల్లె పదాలు...ఇలా ప్రతి కళారూపంలోనూ స్వామిని అద్భుతంగా వర్ణించబడిన వాడు ఆ రాముడు. లవకుశ చిత్ర దర్శకులు ఈ గీతాన్ని దాదాపుగా భజన రూపంలో తన్మయత్వంతో భక్త సమూహంపై చిత్రీకరించారు. ఘంటసాల మాష్టారు సంగీతంలో అత్యంత భక్తిపూరితంగా ఉండే ఈ సముద్రాల వారి గీతాన్ని సుశీలమ్మ, లీల గారు, జమునారాణి గారు కలిసి అద్భుతంగా, శ్రవణ మనోహరంగా గానం చేశారు. ఈ పాట వింటే హనుమద్భక్తి కళ్ల ముందు నిలుస్తుంది. రోమాంచమవుతుంది. శరీరం పులకితమై మనసు రామనామ రసామృతంలో ఓలలాడుతుంది. రామభక్తి యొక్క గొప్పతనం అదే. రూపంలోను, గుణాలలోనూ, ప్రవర్తనలోనూ, యుద్ధపటిమలోనూ మహా సంపన్నుడు రాముడు. అందుకే లోకాభిరాముడైనాడు.


25, ఫిబ్రవరి 2017, శనివారం

త్యాగరాజస్వామి ఉత్సవ సాంప్రదాయ కీర్తన - మేలుకో దయానిధి మేలుకో దాశరథి


ఉత్సవ సాంప్రదాయ కీర్తనలలో త్యాగరాజస్వామి తన ఇష్టదైవానికి రోజూ జరిగే వేడుకల వైభవాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. అందులో మేలుకొలుపు, ఆవాహనములు, సమస్త ఉపచారములు, సీతారామ కళ్యాణోత్సవము, నివేదనలు, ఉయ్యాల సేవలు,మంగళ హారతులు, రక్షా ధారణ,  పవ్వళింపు సేవలు, లాలి పాడే  కృతులు ఉన్నాయి. ఇవి మొత్తం 26 కృతులు మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ కీర్తనల ద్వారా ఆనాటి అర్చనా విధులను తెలుసుకునే అవకాశం త్యాగరాజస్చామి మనకు కలిగించారు. ఈ ఉత్సవ సాంప్రదాయ కీర్తనలలో కొన్నింటిని మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు పాడి చాలా ప్రచారంలోకి తీసుకు వచ్చారు. మేలుకో దయానిధీ అన్న కీర్తన వాటిలో మేలుకొలుపు కీర్తనగా పేరొందింది.

మేలుకో దయానిధి మేలుకో దాశరథి
మేలుకో దయానిధి మిత్రోదయమౌ వేళ

నారదాది మునులు సురలు వారిజభవుడిందు కళా
ధారుడు నీ సన్నిధినే కోరి కొలువ గాచినారు

వెన్న పాలు బంగారు గిన్నెలోనేనుంచినాను
తిన్నగారగించి తేట కన్నులతో నన్ను జూడ

రాజరాజాది దిగ్రజులెల్ల వచ్చినారు
రాజనీతి తెలియ త్యాగరాజ వినుత నన్ను బ్రోవ

ఈ కీర్తనలో ఆ రాముని సూర్యోదయ సమయాన మేలుకొమ్మని త్యాగరాజ స్వామి అనేక విధాల వేడుకున్నారు. "ఓ దయాసముద్రుడవైన దశరథ రామా! మేలుకో! సూర్యోదయమగుచున్నది. నారదుడు మొదలైన మునులు, దేవతలు, చతుర్ముఖ బ్రహ్మ, శివుడు మొదలైన వారు నీ సన్నిధిని కోరి నిన్ను కొలుచుటకు వేచియున్నారు.  వెన్న, పాలు బంగారు గిన్నెలలో నీ కోసం నేనుంచాను. చక్కగా వాటిని ఆరగించి తేటైన కన్నులతో నన్ను చూడుము. కుబేరుడు మొదలైన దిక్పాలకులు వచ్చారు. నీ దగ్గర రాజధర్మాన్ని నేర్చుకోవాలని వేచియున్నారు. ఓ రామా! నన్ను బ్రోచుటకు మేలుకో!" అని రాముని కోరారు.

ఏ వాగ్గేయకారుని కృతులను పరిశీలించినా వారి జీవిత గమనంతో పాటు ఆధ్యాత్మిక సోపానం వారి కృతుల ద్వారా మనకు కనబడుతుంది. త్యాగరాజస్వామి కీర్తనల్లో కూడా ఈ పురోగతి మనకు సుస్పష్టంగా తెలుస్తుంది. సగుణోపాసనలో ఉండే మాధుర్యం, ఆ పరమాత్మను జీవాత్మకు వేరుగా చూసి ఆరాధించే భక్తి, ఆ ఉపాసనలోని సేవలలో రమించే తీరు ఆయా కృతులలో మనకు కనబడుతుంది. సగుణోపాసనలో దేవతా స్వరూపాలను మూర్తులలోకి ఆవాహనం చేసి, ఉపచారములు చేసి, నివేదనలు చేసి, స్తుతించి ఆ పరమాతను కళ్లెదుట దర్శించే భావన ఎంతో మధురమైనది. ఇది సామాన్య మానవుని హృదయంలో త్వరగా నమ్మకాన్ని విశ్వాసాన్ని కలుగజేస్తుంది. ఎందుకంటే, ఈ సేవలు మన ఇంటికి ఎవరైనా మహానుభావులు వస్తే చేసే సేవలవంటివే. కాబట్టి వెంటనే మనసుతో అనుసంధానం కలుగుతుంది. పూర్వజన్మ సంస్కారాలు మరియు ఈ జన్మ కర్మ ఫలాలను బట్టి ఏదో ఒకనాడు సగుణోపాసన నుండి, ఇది కాదు, దీనిని మించినది పరమాత్మ తత్త్వం అని అవగతమై నిర్గుణోపాసన వైపు మానవుడు మరలుతాడు. అది ఆ జన్మలో కావచ్చు, మరు జన్మలో కావచ్చు. త్యాగరాజస్వామి వారు జీవితంలోని మలిభాగంలో రచించిన కీర్తనలలో కొంత నిర్గుణోపాసన కనబడుతుంది.

ఈ ఉత్సవ సాంప్రదాయ కీర్తనలన్నీ సగుణోపాసనను మూలంగా చేసుకున్నవే. ఆవాహనం, అలంకరణం, ఉపచారములు, నివేదనములు..అన్నీ ఆ విగ్రహంలో దేవతామూర్తి స్థిరుడై ఉన్నాడన్న ప్రగాఢ విశ్వాసంతో కూడినవి. స్థావర జంగమాలన్నిటా పరమాత్మ ఉన్నాడన్న మన వేదవాఙ్మయ ఘోషను సగుణోపాసన తు.చ తప్పకుండా పాటిస్తుంది. దీనిలోని  మాధుర్యం అనుభవైకవేద్యం. త్యాగరాజస్వామి ఈ అనుభవాలను తన కృతులలో వివరంగా, మనోజ్ఞంగా, భక్తిభరితంగా, భావగర్భితంగా రచించారు. మేలుకొలుపు సేవ చేసి తనను బ్రోవమని ఈ కృతిద్వారా ఆయన వేడుకున్నారు. బాలమురళిగారి గానంలో ఈ కృతి వినండి.


19, ఫిబ్రవరి 2017, ఆదివారం

నాదోపాసన - త్యాగరాజస్వామి వారి శోభిల్లు సప్తస్వర



శోభిల్లు సప్త స్వర సుందరుల భజింపవే మనసా

నాభి హృత్కంఠ రసన నాసాదులయందు 

ధర ఋక్సామాదులలో వర గాయత్రి హృదయమున 
సురభూసుర మానసమున శుభ త్యాగరాజాదులలో

శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గాన రసం ఫణిః - నాదోపాసనా రసామృతాన్ని సమస్త జీవరాశులు ఆనందిస్తాయన్నది ఆర్యోక్తి.

శృతిలయలతో కూడిన సంగీతం దివ్యత్వానికి ఆలవాలం. ఓంకారం నుండి ఆవిర్భవించిన సప్తస్వరాలతో కూడిన సంగీతంలో రమించేవారు దేవతలు. నాదంతో సృష్టిస్థితిలయములు అనుసంధానమై ఉన్నాయి. నిరంతరం అనంతమైన వాహినిలా ప్రవహించే విశ్వజనీనశక్తి నాదరూపమై ఉంది. పొత్తూరి వేంకటేశ్వరరావు గారి పారమార్థిక పదకోశంలో నాదం అనే పదం అద్భుతంగా నిర్వచించబడింది. దాని ప్రకారం -  శరీరంలోని ఆత్మ మనస్సును, మనస్సు వహ్నిని, వహ్ని వాయువును ప్రేరేపించినప్పుడు వాయువు బ్రహ్మ గ్రంధియగు మూలాధారం నుంచి ఊర్ధ్వ ముఖంగా నాభి, హృదయం, కంఠం, శిరస్సు, ముఖం చేరి కలిగించే ధ్వని ‘నాదం’. బ్రహ్మ స్వరూపమైనది నాదం. నాభికి పైన హృదయ స్థానం నుంచి బ్రహ్మ రంధ్రం వరకు ధ్వనించే ప్రాణ వాయువు. ఆకాశం, వాయువు, అగ్ని అనే మూడు భూతాల నుంచి పుట్టి నాభికి పైన ధ్వనిస్తూ, ముఖంలో అతి స్పష్టంగా వ్యక్తమయ్యే వాయువు ఈ నాదం. ఇది అక్షర సత్యం.

త్యాగరాజ స్వామి ఈ నాదోపాసనలోని మహత్తును ఎన్నో కృతుల ద్వారా తెలిపారు. వాటిలో నాదతనుమనిశం శంకరం, నాదసుధారసంబిలను మరియు శోభిల్లు సప్తస్వర ఈ సందేశాన్ని సుస్పష్టం చేశాయి. ప్రణవము నుండి జన్మించిన నాదమనే అమృత రసము ఈ భువిపై నరాకృతిగా రాముడై వెలసినట్లు త్యాగయ్య తెలిపారు. వేదశాస్త్రపురాణాలకు నాదం ఆధారమని నొక్కి వక్కాణించారు. ఎందు వలన? వేదాలు ఒకరిచే రాయబడినవి కాదు. విశ్వజనీనమైన శక్తి ఆయా ఋషుల నోట శబ్దరూపమున వెలువడినవి. శబ్దమునకు మూలం ఓంకారం. అందుకే ప్రణవానికి మన సనాతన ధర్మంలో అంత ప్రాధాన్యత ఉంది. త్యాగరాజ స్వామి రాముని అవతారాన్ని నాదంతో అనుసంధానం చేశారు. ఆయన కోదండమే సప్తస్వరాలను పలికించే సాధనంగా, రాగములు బాణములుగా, నెరవులు మరియు సంగతులు స్వామి పలుకులుగా నుతించారు. అలాగే, నిరంతరం తనువంతా నాదముతో నిండిన వానిగా శివుని స్తుతించారు. శివుని సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన అనబడే పంచముఖములనుండి సప్తస్వరములు జనించినట్లు తెలిపారు. ఇలా ఈ విశ్వమంతా నాదపూరితమై ఉన్నట్లు స్పష్టంగా మనకు అనే కృతుల ద్వారా నిరూపించారు. అటువంటి కృతే శోభిల్లు సప్తస్వర.

ఈ కృతిలో త్యాగరాజ స్వామి సప్తస్వరాలతో శోభిల్లే సుందరమైన దేవతలను నుతించాలని మనసుకు చెబుతున్నారు. ఈ సప్తస్వరాలు నాభి మొదలు, హృదయము, కంఠము, నాలుక మరియు నాసిక యందు శోభిల్లుతాయి. పైన పొత్తూరి వేంకటేశ్వర రావు గారు చెప్పిన నాదం యొక్క నిర్వచనం త్యాగరాజస్వామి వారి భావనతో ఏకీభవించినట్లే కదా? అలాగే, ఈ భూమిలో ఋగ్, సామ మొదలైన వేదములలో, గాయత్రీ మంత్ర మధ్యమున, దేవతల, ఉత్తములైన మానవుల మనస్సులలో ఈ సప్తస్వరాలు శోభిల్లుతాయని త్యాగరాజస్వామి పలికారు.

గాయకుడు భావాన్ని ఆకళింపు చేసుకొని, ఆయా దేవతా స్వరూపాన్ని సగుణ ధ్యానం చేసి, భావానికి సొంపైన రాగయుక్తంగా సప్తస్వరమేళనంగా శాస్త్రీయ సంగీత ఆలాపన చేస్తే ఆయా దేవతా రూపాలు తప్పకుండా ఆ కళాకారుని దేహంలో వసిస్తారు. అలా నిత్యం సాధన చేసిన కళాకారులు దివ్యత్వన్ని పొందుతారు. అందుకే శాస్త్రీయ సంగీతమే జీవితంగా భావించిన ఎందరో మహా కళాకారులు జీవబ్రహ్మైక్యాన్ని పొందారు. దేహాత్మ స్ఫురణల విచక్షణా జ్ఞానాన్ని నిరంతరం కలిగి స్థితప్రజ్ఞులైనారు. నాదోపాసన అంత మహత్తరమైనది. ఓంకార జనితమైన షడ్జమాది నాదములు అమృతమాలికలుగా అల్లబడి పదములకు మంత్ర సిద్ధి వంటి శక్తిని కలిగించి ఒక్కొక్క కృతి ఆధ్యాత్మిక సోపానంలో ఒక్కో మెట్టుగా ఉపకరిస్తున్నాయి. అందుకే శాస్త్రీయ సంగీత కీర్తనలు స్వర రాగ లయ భావములకు సమానమైన స్థానం ఉండి భక్తి సుగంధాన్ని అలదుకొని శాశ్వత సాఫల్యాన్ని పొందాయి. ఈ నాదోపసన యొక్క ఔన్నత్యాన్ని ఎందరో వాగ్గేయకారులు మనకు తరతరాలుగా అందిస్తున్నారు. అందరిలోకీ, త్యాగరాజస్వామి దాని మహాత్మ్యాన్ని అద్భుతంగా ఇటువంటి కీర్తనల ద్వారా మనకు వెలలేని వారసత్వ సంపదగా అందించారు.

శోభిల్లు సప్తస్వర అనే కృతి జగన్మోహిని రాగంలో కూర్చబడింది. రాగం ఈ కృతిలోని భావాన్ని చక్కగా ప్రకటితం చేస్తుంది. అలాగే, సందేశానికి ఔన్నత్యాన్ని కలుగజేస్తుంది. నాదం యొక్క గొప్పతనాన్ని తెలిపే భావానికి జగన్మోహిని వంటి గంభీరమైన రాగం చాలా సముచితం. మాయామాళవగౌళ రాగం ఈ జగన్మోహినికి జన్య రాగం. ఈ త్యాగరాజస్వామి కీర్తనను భారతరత్న బిరుదాంకిత శ్రీమతి మదురై షణ్ముఖవడివు సుబ్బులక్ష్మి గారి గాత్రంలో వినండి.

18, ఫిబ్రవరి 2017, శనివారం

సీతా దర్శనం - చూడామణి ప్రదానం



యథా హి వానరశ్రేష్ఠ దుఃఖక్షయకరో భవేత్
త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణ హరిసత్తమ

ఓ వానర శ్రేష్ఠుడవైన హనుమంతుడా! రామలక్ష్మణులు ఈ నా దుఃఖాన్ని తొలగించే మహత్తర కార్యానికి ఉత్తమ సాధకుడవు నీవే.

రాఘవస్త్వత్సమారంభాన్ మయి యత్న పరో భవేత్
ఇదం బ్రూయాచ్చ మే నాథం శూరం రామం పునః పునః

నీవు చేసే యత్నముల ఫలము వలన రాముడు నన్ను విడిపించే కార్యానికి సమాయత్తమవుతాడు. నేను చెప్పిన మాటగా మళ్లీ మళ్లీ రాముని ఇలా తెలుపుము.

జీవితం ధారయిష్యామి మాసం దశరథాత్మజ
ఊర్ధ్వం మాసాన్ న జీవేయం సత్యేన అహం బ్రవీమి తే

ఓ రామా! నేను నా ప్రాణములను ఇంకొక నెల మాత్రమే నిలబెట్టుకోగలను. ఆ తరువాత ఒక్కరోజు కూడా నేను జీవించలేను. ఇది సత్యం.

రావణేన ఉపరుద్ధాం మాం నికృత్యా పాప కర్మణా
త్రాతుమర్హసి వీర త్వం పాతాలాత్ ఇవ కౌశికీం

ఓ రామ! గతంలో శ్రీమహావిష్ణువు పాతాళం నుండి ఇంద్రాదులను రక్షించినట్లు పాపాత్ముడైన రావణునిచే చెరబట్టి హింసించబడుతున్న నన్ను నీవు రక్షించాలి.

తతో వస్త్ర గతం ముక్త్వా దివ్యం చూడామణిం శుభం
ప్రదేయో రాఘవాయ ఇతి సీతా హనుమతే దదౌ

అంతట, తన చీర కొంగుముడిలో దాచుకున్న శిరోరత్నమైన చూడామణిని హనుమంతునికి అందజేసి దానిని రామునికీయవలసిందిగా కోరెను.

వాల్మీకి విరచిత శ్రీమద్రామాయణలోని సుందరకాండ 38వ సర్గలో సీతమ్మను కాంచి ఆమెకు రాముని వృత్తాంతము తెలిపి, అంగుళీయకమిచ్చి సీతకు సాంత్వనను కలిగిస్తాడు హనుమంతుడు. ఆమె హనుమంతుని స్వామి భక్తికి, కార్యకుశలతకు ఎంతో సంతోషించి అతనిని హరిసత్తముడని (కపిశ్రేష్ఠుడు), తన దుఃఖాన్ని తొలగించే కార్య సాధకుడని ప్రశంసిస్తుంది. తరువాత తను వనవాసం మునుపు శిరస్సున ధరించే రత్నాన్ని రామునికి తన ఆనవాలుగా ఇస్తుంది. శతయోజనముల జలధిని దాటి, దుర్గమమైన లంకలో ప్రవేశించి, రావణుని కలిసి, అశోక వనంలో శింశుపా వృక్షం క్రింద రాక్షసీ సమూహం మధ్య దుఃఖితయై ఉన్న సీతకు ఆనందకారకుడైనాడు. స్వామికార్యమెంతటి దుర్గమమైనా సాధించిన వీరుడు హనుమంతుడు. రావణసంహరణానంతరం సీతారామపట్టాభిషేకం సమయమున రామయ్య సీతమ్మకు ముత్యాల హారాన్నిస్తాడు. ఆ హారాన్ని అక్కడ సభాసదులలో అత్యంత తేజోవంతుడు, ధీరుడు, దక్షుడు, బుద్ధిశాలి, వినయవంతుడు, పరాక్రమవంతుడైన వానికి బహుకరించవలసిందిగా పలుకుతాడు. అప్పుడు సీతమ్మ ఎటువంటి సంకోచం లేకుండా దానిని హనుమకు బహుకరిస్తుంది.  సీతారాములకు హనుమంతునిపై గల నమ్మకం గురి తెలుపటానికి ఒక్క సన్నివేశం చాలు. అందుకే అతను శ్రేష్ఠుడు, సత్తముడు అయినాడు. భక్త శిరోమణిగా కొలువబడుతున్నాడు.

యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం!
బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకం!!

త్యాగరాజ స్వామి కీర్తనలలో లక్ష్మణుని ప్రస్తావన



అన్న రామన్నకు నీడగా నిలచి ఆయన సేవే తన జీవితంగా భావించి, అన్నను నిరంతరము సేవించిన ఆ లక్ష్మణుడిది ఏమి భాగ్యమో కదా? రాజభోగాలను వదలి, ధర్మపత్నికి దూరంగా పదునాలుగేండ్లు వనవాసానికి వెళ్లిన ఆ సౌమిత్రికి అన్న అంటే ఎంత గౌరవమో ప్రేమో రామాయణంలో ఎన్నో సందర్భాలలో మనకు సుస్పష్టంగా అవగతమవుతుంది. వనవాస నిర్ణయం, భరతుడు-రాముడు కలిసే సన్నివేశం, మాయలేడి ఘట్టం, రామ-రావణ యుద్ధం...వీటన్నిటా లక్ష్మణుడు అన్నకు వెన్నుదన్నుగా నిలిచాడు. అందుకే రామునికి సోదరుడంటే ఎంతో ప్రేమ. ఆ అన్నకు సేవలో తరించిన లక్ష్మణుని గురించి త్యాగరాజ స్వామి ఎన్నో సంకీర్తనలలో పలికారు.

శ్రీరామ జయరామ శృంగార రామయని చింతించ రాదె ఓ మనసా అన్న కృతిలో "తమి మీర పరిచర్య సేయ సౌమిత్రి మును తప మేమి చేసెనో తెలియ" అని నుతించి ఆ లక్ష్మణుని పరిచర్యల గొప్పతనాన్ని చాటారు. కంటజూడుమీ అనే కృతిలో "అలనాడు సౌమిత్రి పాద సేవ చెలరేగి సేయు వేళ సీతతో పలికి చూచినంత పులకాంకితుడై " అని రాముడు లక్ష్మణుని సేవతో ఎంత సంతోషించాడో తెలిపాడు. అలాగే కనుగొంటిని శ్రీరాముని అనే కీర్తనలో "భరత లక్ష్మణ శతృఘ్నులు కొలువ" అని కొనియాడారు. దాచుకోవలెనా దాశరథి నీ దయ అనే కృతిలో "నేమమున బరిచర్య నేర్పున బొగడు వేళ సౌమిత్రి త్యాగరాజుని మాట బల్కితే" అని ప్రస్తావించారు. వెడలెను కోదండపాణి అనే కృతిలో "సౌమిత్రితో గూడి" అని రామలక్ష్మణుల జంటను నుతించారు. ఎన్నడు జూతునో ఇనకుల తిలకుని అనే కృతిలో "ధరణిజ సౌమిత్రి భరత రిపుఘ్న వానర యూధపతి వరుడాంజనేయుడు కరుణను ఒకరు ఒకరు వర్ణింపనాదరణను బిలిచే నిను త్యాగరాజార్చిత" అని తనను కొలిచే భరత లక్ష్మణాదులను ఆ రాముడు ఎలా ఆదరించాడో తెలిపారు. పక్కల నిలబడి అనే కీర్తనలో "సుదతి సీతమ్మ సౌమిత్రి శ్రీరామునికిరుప్రక్కల నిలబడి" అని రామ వైభవాన్ని వర్ణించారు. ఇలా ఎన్నో కీర్తనలలో లక్ష్మణుని ప్రస్తావన ఉంది. మరి ఆ లక్ష్మణుడి ఘనత ఎంత గొప్పదో ఊహించండి?

నిద్రాహారాలు మాని 14 ఏళ్ల పాటు సీతారాములను వనవాసంలో సేవించి కంటికి రెప్పలా కాపాడిన వాడు లక్ష్మణుడు. స్వయంగా ఆదిశేషువు అవతారమైన లక్ష్మణుడు రాముని సగభాగం వంటి వాడు. లక్ష్మణ రేఖను ఆ రావణాసురుడు కూడా దాటలేకపోయాడు. ఒకేమారు 500 బాణాలు వేయగల విలువిద్యా నేర్పరి. సీతా వియోగంతో దుఃఖంలో ఉన్న రాముని ఓదార్చిన వాడు లక్ష్మణుడు. రామ-రావణ సంగ్రామంలో ఇంద్రజిత్తు వంటి మహావీరుని సంహరించిన ధీరుడు లక్ష్మణుడు. పుట్టుక నుండి అవతార సమాప్తి వరకు అన్న వెనుక ఉన్న వాడు ఆ లక్ష్మణుడు.

ఈ లక్ష్మణ  ప్రస్తావన కలిగిన త్యాగరాజస్వామి కృతులలో  మరో కీర్తనను పరిశీలిద్దాం.

సౌమిత్రి భాగ్యమే భాగ్యము

చిత్ర రత్నమయ శేషతల్పమందు సీతాపతిని యూచు

బాగుగ వింత రాగముల ఆలాపన సేయగ మేను పులకరించగ
త్యాగరాజ నుతుడౌ శ్రీరాముని తత్వార్ధమును పొగడి జూచే

ఆ లక్ష్మణుడు అన్నకు చేస్తున్న సేవను త్యాగరాజ స్వామి సౌమిత్రి భాగ్యమే భాగ్యము అన్న ఈ కీర్తనలో అద్భుతంగా వర్ణించారు. రత్నమణిమయమైన శేషతల్పమైన ఊయలలో ఊగే రాముని కొలిచే లక్ష్మణుని భాగ్యమే భాగ్యము అని ప్రస్తుతించారు. చెవులకింపైన రాగములను వాద్యకళాకారులు పలికించగా ఆ లక్ష్మణుని మేను పులరించిందట. ఆ శ్రీరాముని తత్త్వములను పొగడే వర్ణనలను విని, చూచి తరించే లక్ష్మణుడి ఎంత భాగ్యమో అని త్యాగరాజస్వామి పలికారు.  ఈ  కీర్తనను హైదరాబాద్ సోదరులు ఆలపించగా వినండి.

రాముని సేవాభాగ్యం పొందిన వారిలో సీతా లక్ష్మణులు, భరతుడు, శతృఘ్నుడు, హనుమంతుడు, గుహుడు, విభీషణుడు, సుగ్రీవుడు...ఇలా ఎందరో. నిరంతర సేవా భాగ్యంలో తరించిన లక్ష్మణుడు రామావతార పరిపూర్ణతకు ఎంతగానో తోడ్పడ్డాడు.

పాతాళ భైరవి – 1951: తెలుగు జానపద చిత్రరాజం

1951 మార్చి 15న విడుదలైన పాతాళ భైరవి తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక కీలక మలుపు. విజయా ప్రొడక్షన్స్ పతాకంపై బి. నాగిరెడ్డి, ఆలూరి చక్రపాణి నిర్మ...