18, ఫిబ్రవరి 2017, శనివారం

సీతా దర్శనం - చూడామణి ప్రదానం



యథా హి వానరశ్రేష్ఠ దుఃఖక్షయకరో భవేత్
త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణ హరిసత్తమ

ఓ వానర శ్రేష్ఠుడవైన హనుమంతుడా! రామలక్ష్మణులు ఈ నా దుఃఖాన్ని తొలగించే మహత్తర కార్యానికి ఉత్తమ సాధకుడవు నీవే.

రాఘవస్త్వత్సమారంభాన్ మయి యత్న పరో భవేత్
ఇదం బ్రూయాచ్చ మే నాథం శూరం రామం పునః పునః

నీవు చేసే యత్నముల ఫలము వలన రాముడు నన్ను విడిపించే కార్యానికి సమాయత్తమవుతాడు. నేను చెప్పిన మాటగా మళ్లీ మళ్లీ రాముని ఇలా తెలుపుము.

జీవితం ధారయిష్యామి మాసం దశరథాత్మజ
ఊర్ధ్వం మాసాన్ న జీవేయం సత్యేన అహం బ్రవీమి తే

ఓ రామా! నేను నా ప్రాణములను ఇంకొక నెల మాత్రమే నిలబెట్టుకోగలను. ఆ తరువాత ఒక్కరోజు కూడా నేను జీవించలేను. ఇది సత్యం.

రావణేన ఉపరుద్ధాం మాం నికృత్యా పాప కర్మణా
త్రాతుమర్హసి వీర త్వం పాతాలాత్ ఇవ కౌశికీం

ఓ రామ! గతంలో శ్రీమహావిష్ణువు పాతాళం నుండి ఇంద్రాదులను రక్షించినట్లు పాపాత్ముడైన రావణునిచే చెరబట్టి హింసించబడుతున్న నన్ను నీవు రక్షించాలి.

తతో వస్త్ర గతం ముక్త్వా దివ్యం చూడామణిం శుభం
ప్రదేయో రాఘవాయ ఇతి సీతా హనుమతే దదౌ

అంతట, తన చీర కొంగుముడిలో దాచుకున్న శిరోరత్నమైన చూడామణిని హనుమంతునికి అందజేసి దానిని రామునికీయవలసిందిగా కోరెను.

వాల్మీకి విరచిత శ్రీమద్రామాయణలోని సుందరకాండ 38వ సర్గలో సీతమ్మను కాంచి ఆమెకు రాముని వృత్తాంతము తెలిపి, అంగుళీయకమిచ్చి సీతకు సాంత్వనను కలిగిస్తాడు హనుమంతుడు. ఆమె హనుమంతుని స్వామి భక్తికి, కార్యకుశలతకు ఎంతో సంతోషించి అతనిని హరిసత్తముడని (కపిశ్రేష్ఠుడు), తన దుఃఖాన్ని తొలగించే కార్య సాధకుడని ప్రశంసిస్తుంది. తరువాత తను వనవాసం మునుపు శిరస్సున ధరించే రత్నాన్ని రామునికి తన ఆనవాలుగా ఇస్తుంది. శతయోజనముల జలధిని దాటి, దుర్గమమైన లంకలో ప్రవేశించి, రావణుని కలిసి, అశోక వనంలో శింశుపా వృక్షం క్రింద రాక్షసీ సమూహం మధ్య దుఃఖితయై ఉన్న సీతకు ఆనందకారకుడైనాడు. స్వామికార్యమెంతటి దుర్గమమైనా సాధించిన వీరుడు హనుమంతుడు. రావణసంహరణానంతరం సీతారామపట్టాభిషేకం సమయమున రామయ్య సీతమ్మకు ముత్యాల హారాన్నిస్తాడు. ఆ హారాన్ని అక్కడ సభాసదులలో అత్యంత తేజోవంతుడు, ధీరుడు, దక్షుడు, బుద్ధిశాలి, వినయవంతుడు, పరాక్రమవంతుడైన వానికి బహుకరించవలసిందిగా పలుకుతాడు. అప్పుడు సీతమ్మ ఎటువంటి సంకోచం లేకుండా దానిని హనుమకు బహుకరిస్తుంది.  సీతారాములకు హనుమంతునిపై గల నమ్మకం గురి తెలుపటానికి ఒక్క సన్నివేశం చాలు. అందుకే అతను శ్రేష్ఠుడు, సత్తముడు అయినాడు. భక్త శిరోమణిగా కొలువబడుతున్నాడు.

యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం!
బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకం!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి