6, ఆగస్టు 2017, ఆదివారం

నిండు పున్నమి పండు వెన్నెలలో - దాశరథి లలిత గీతం


నిండు పున్నమి పండు వెన్నెలలో
నిను చేరగ నేనెటుల రాగలనో

నీలి నీలి ఆకసము నీడ నే కాలి సవ్వడి లేక రాబోతే
దొంగ తారలు తొంగిచూచెను చందమామ దారికాచెను

తెల్లతెల్లని బొండు మల్లెలతో తనువెల్లా చల్లగా దాచుకుంటేను
నల్ల నల్లని గండు తుమ్మెదలు నా వెంట పడి గల్లంతు చేసెనో
మనసు నీకై పరుగు తీసెనో నా తనువు నీకై వేచెను

- దాశరథి కృష్ణమాచార్యులు

రాధ మనసును ఎంత అందంగా ఆవిష్కరించారో కవి! పున్నమి రేతిరి స్వామికై వేచి యున్న రాధ తన మనోగతాన్ని స్వామికి ఈ గీతం ద్వారా విన్నవించుకుంది. నీలి ఆకాశపు నీడలో చప్పుడు లేకుండా స్వామి వద్దకు రాధ రాబోగా తారలు దొంగతనంగా తొంగి చూచాయట, చందమామ దారి కాచాడట. తెల్లని మల్లెలు ధరించి తన తనువును దాచుకోగా నల్లని గండు తుమ్మెదలు ఆ మల్లెలకోసం వచ్చి ఆమె వెంటపడ్డాయట. తన మానసము ఆ స్వామికై పరుగు తీసిందట, తనువు స్వామికి వేచి ఉన్నదట. మధురభక్తికి రాధ దర్పణమైతే తెలుగుదనంతో దాశరథి గారు ఆ రాధ ఆరాధనను హృద్యంగా ఈ లలిత గీతం ద్వారా ఆవిష్కరించారు. ఇక రావు బాలసరస్వతి గారంటేనే లలిత సంగీతం గుర్తుకు వస్తుంది. వారు తమ అమృత గానంతో ఈ రాధ గీతికకు శాశ్వతత్వాన్ని ఆపాదించారు.

తెలుగుదనానికి లలితగీతాలు అసలైన నీరాజనాలు. అటువంటి గీతమే ఈ నిండు పున్నమి పండు వెన్నెలలో అనే గీతం. లలిత గీతాలకు ప్రాణప్రతిష్ఠ చేసి తారాస్థాయికి తీసుకువెళ్లింది ఆకాశవాణి మరియు ఆ సంస్థలో పని చేసిన కళాకారులు. ఆకాశవాణిలో ప్రసారమైన వందలాది గీతాలు ప్రజల మనసులు దోచుకొని లలిత భావనలను సామాజంలో పెంపొందించేలా చేశాయి. పౌర్ణమి వచ్చేసింది, నిండు పున్నమిలో రాధ మానస మాలికను రావు బాలసరస్వతీదేవి గారి గళంలో జాలువారగా విని ఆస్వాదించండి. ఇది  ఆకాశవాణి ప్రసారం.


2, ఆగస్టు 2017, బుధవారం

పిలువరే కృష్ణుని పేరుకొని యింతటాను - అన్నమయ్య సంకీర్తన


పిలువరే కృష్ణుని పేరుకొని యింతటాను
పొలసి యారగించే పొద్దాయెనిపుడు

వెన్నలారగించబోయి వీధులలో దిరిగేనో
యెన్నరాని యమునలో యీదులాడీనో
సన్నల సాందీపనితో చదువగబోయినాడో
చిన్నవాడాకలి గొని చెలులాల యిపుడు

మగువల కాగిళ్ళ మరచి నిద్దిరించీనో
సొగిసి ఆవుల గాచే చోట నున్నాడో
ఎగువనునుట్లకెక్కి యింతులకు జిక్కినాడో
సగము వేడికూరలు చల్లనాయెనిపుడు

చెంది నెమలి చుంగుల సింగారించుకొనీనో
ఇందునే దేవరవలె యింటనున్నాడో
అందపు శ్రీవేంకటేశుడాడివచ్చెనిదె వీడే
విందుల మా పొత్తుకు రా వేళాయెనిపుడు

ఓ గోపికలారా! కృష్ణుని పేరు పెట్టి పిలవండి! భోజనము చేసే సమయమైంది. గోపకులంలోని యిళ్లలో వెన్న ఆరగించటానికి వెళ్లాడో లేక ఘనమైన యమునలో ఈత కొడుతున్నాడో, సంజ్ఞలు చేసే సాందీపనితో చదువుకోవటానికి వెళ్లాడో, ఇపుడా చిన్నవాడు ఆకలి గొని ఉంటాడు, వాడిని పిలవండి. గోపికల కౌగిళ్లలో ఆదమరచి నిద్రించియున్నాడో, చక్కగా ఆవులను కాచే చోట ఉన్నాడో, పైనున్న ఉట్లెక్కబోయి స్త్రీలకు చిక్కాడో, సగము వేడిగా ఉన్న కూరలు చల్లబడిపోతున్నాయి, వాడిని పిలవండి చెలులారా! నెమలి పింఛాలను సిగలో సింగారించుకుంటున్నాడో, ఇంతలోనే దేవుడిలా ఇంట్లోనే ఉన్నాడో, అందమైన శ్రీవేంకటేశ్వరుడు ఇదిగో ఆడుకొని వచ్చినాడు, విందు చేయటానికి మా దగ్గరకు వచ్చే వేళైంది. వాడిని పిలవండి చెలులారా!

తాళ్లపాక అన్నమాచార్యుల వారు

అన్నమయ్య మధురభక్తిలో కాసేపు తల్లిగా, కాసేపు గోపికగా, కాసేపు భక్తునిగా వేర్వేరు పాత్రలలో లీనమై స్వామిని ఆరాధించాడు. ఇక్కడ తల్లి యశోదగా స్వామిపై ఆ అమ్మ ప్రేమను, ఆతని ఆకలి దప్పులు తీర్చే ఆతృతను మనకు అన్నమయ్య తెలియజేశారు. యశోద ఆ బాలుడు శ్రీహరి అని తెలిసినా మాయలో పడి ఆతనిని తన శిశువుగా లాలించింది, అతనికి మాతృప్రేమను పరిపూర్ణంగా అందించింది. తన బిడ్డ ఎక్కడున్నాడో, భోజనం చేసే సమయమైందని ప్రతి తల్లీ ఆతృతతో వేచియుంటుంది. ఇక్కడ ఆ బాలుడు లీలామానుష రూపుడై ఉన్నప్పటికీ ఆతనిపై అవ్యాజమైన ప్రేమతో అందరి తల్లులలాగానే ఆమె వానిని పిలువమని చెలులకు చెబుతుంది. వెన్నను దొంగిలించటం, సాందీపని మొదలైన వారితొ చదువుకోవటంలో, యమునలో జలక్రీడలలో, గోపికల కౌగిళ్లలో, గోవులను కాయటంలో, స్త్రీల బందీలో ఎక్కడ ఉన్నాడో వాడు, ఆహార పదార్థాలు చల్లబడిపోతున్నాయి అని తల్లి మనసును అద్భుతంగా ఆవిష్కరించారు అన్నమయ్య. అనేక రకములైన భావనలను స్వామికి సమర్పించి మధురభక్తిలో అన్నమయ్య తరించారు. ఈ సంకీర్తనను గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు అద్భుతంగా గానం చేశారు. 

31, జులై 2017, సోమవారం

మాదీ స్వతంత్ర దేశం - రజనీ దేశభక్తి గీతం



రజనీ - ఆ పేరే తెలుగునాట లలితసంగీతానికి మారుపేరు. దేశభక్తి, లలిత గీతాలకు రజనీ హృదయం పుట్టినిల్లు. స్వాతంత్య్ర పూర్వము నుండి తొంభయ్యవ దశకం వరకు తెలుగునాట ఆకాశవాణి ద్వారా మారుమ్రోగిన పేరు బాలాంత్రపు రజనీకాంతరావు గారిది. ఆయన భారతావని స్వతంత్ర జాతిగా ఆవిర్భవించినప్పుడు రచించిన దేశభక్తి గీతం మాదీ స్వతంత్ర దేశం మాదీ స్వతంత్ర జాతి. సంగీతం కూడా ఆయనే కూర్చారు. ఈ గీతాన్ని టంగుటూరి సూర్యకుమారి గారు ఆలపించారు. రజనీ గారి బహుముఖ ప్రజ్ఞ ఆయన గీతాల సాహిత్యంలో, సంగీతంలో మనకు సుస్పష్టంగా తెలుస్తుంది. భరతమాతకు ఈ గీతంలోని అద్భుతమైన పదాల ద్వారా రచయిత తన నివాళులను సమర్పించారు. ఈనాటి తరాల వారికి ఇటువంటి గీతాలు, వాటి అర్థాలు తెలియజేస్తే మన ముందు తరాల వారు ఈ భారతావనికి ఎటువంటి సేవ చేశారో తెలుస్తుంది. కొంతైనా దేశభక్తి అలవడుతుంది. టంగుటూరి సూర్యకుమారి గారు ఆనాడు నటనలో, గానంలో, నృత్యంలో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. వారు పాడిన దేశభక్తి గీతాలు ఈనాటికీ ప్రజల హృదయాలలో నిలిచిపోయాయి. రజనీ, శంకరంబాడి సుందరాచారి, బసవరాజు అప్పారావు, గురజాడ అప్పారావు, నిడదవోలు వెంకటరావు, అడవి బాపిరాజు, రాయప్రోలు సుబ్బారావు వంటి మహనీయుల సాహిత్యం సూర్యకుమారి గారి గళంలో అద్భుతంగా జాలువారింది. రజనీ గారు చాంద్రమానం ప్రకారం శతసంవత్సరాలు పూర్తి చేసుకుని హైదరాబాదులో నివసిస్తున్నారు. ఆయన ప్రముఖ తెలుగు కవి ద్వయమైన వేంకట పార్వతీశ కవులలో ఒకరైన బాలాంత్రపు వేంకటరావు గారి కుమారుడు. రజనీ కళాప్రపూర్ణ బిరుదాంకితులు. వారికి ఒక్క పద్మ అవార్డు రాకపోవటం ఎంతో శొచనీయం. సూర్యకుమారి గారంటే శంకరంబాడి సుందరాచారి గారు రచించిన మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీతం యొక్క అద్భుతమైన గానం గుర్తుకొస్తుంది. వీరు ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారి సోదరుని కుమార్తె. సూర్యకుమారి గారు 1960వ దశకం నుండి లండన్‌లో స్థిరపడి 2005లో మరణించారు. రజనీ-సూర్యకుమారి గార్ల సమన్వయంలో వెలువడిన మాదీ స్వతంత్ర దేశం గీత సాహిత్యం, ఆడియో.

మాదీ స్వతంత్ర దేశం మాదీ స్వతంత్ర జాతి 
భారతదేశమే మా దేశం భారతీయులం మా ప్రజలం 

వింధ్య హిమవత్ శ్రీనీలాద్రుల
సంధ్యారుణిత నవాశలు మావి 
గంగా గోదావరీ సహ్యజా
తుంగ తరంగిత హృదయాల్ మావి

ఆలయమ్ముల  శిల్పవిలాసం
ఆరామమ్ముల కళాప్రకాశం
మొగల్ సమాధుల రస దరహాసం  
మాకు నిత్య నూతనేతిహాసం

అహింసా పరమో ధర్మః 
సత్యంవద ధర్మంచర 
ఆదిఋషుల వేదవాక్కులు 
మా గాంధి గౌతముల సువాక్కులు

స్వతంత్రతా భ్రాత్రుత్వాలు 
సమత మా సదాశయాలు 
జననీ ఓ స్వతంత్ర దేవి   
గొనుమా నివ్వాళులు మావి 

మాది స్వతంత్ర దేశం, స్వేచ్ఛ కలిగిన జాతి. భారతదేశమే మా దేశం, భారతీయులమే మా ప్రజలం. వింధ్య, హిమాలయ, నీలగిరి పర్వతాలు మా ఆశలకు ఉదయించే కొత్త వెలుగులు. గంగా, గోదావరి, సహ్యాద్రి, తుంగ నదుల ఉప్పొంగే ప్రవాహాలతో మా హృదయాలు పరవశిస్తాయి. మా ఆలయాల అద్భుతమైన శిల్పకళ, మా ఉద్యానవనాల కళాత్మక సౌందర్యం, మొగల్ సమాధులలోని కళా వైభవం మా దేశ చరిత్రను ఎప్పటికీ కొత్తగా అనుభవింపజేస్తాయి. అహింసే అత్యున్నత ధర్మం. సత్యం మాట్లాడు, ధర్మాన్ని ఆచరించు అని ప్రాచీన ఋషులు అందించిన వేదబోధనలు, గౌతమ బుద్ధుడు, మహాత్మా గాంధీ వంటి మహనీయుల ఉత్తమ సందేశాలు మా మార్గదర్శకాలు. స్వాతంత్య్రం, సోదరభావం, సమానత్వం మా ఉన్నతమైన ఆదర్శాలు. ఓ స్వతంత్ర భారతమాతా, తల్లీ, నీకు మా హృదయపూర్వక నివాళులు స్వీకరించు.

నల్లని వాడా! నే గొల్ల కన్నెనోయ్! - వింజమూరి శివరామారావు గారి గీతం



నల్లని వాడా! నే గొల్ల కన్నెనోయ్! పిల్లన గ్రోవూదుమోయ్! నా యుల్లము రంజిల్లగా!

నీ తీయని పాటలకై రేతిరి ఒంటిగ వచ్చితినే!
నా మనసు తనువు నా మనికే నీది కదా పిల్లన గ్రోవూదుమోయ్!! నల్లనివాడా!!

ఆకసాల మబ్బులనీ చీకటులే మూగెననీ!
నేనెరుంగనైతిని నీ తలపే వెలుంగాయె పిల్లన గ్రోవూదుమోయ్! నల్లనివాడా!!

మెరుపే నీ గోపికయై వలపే నా నెచ్చెలియై!
తోడి తెచ్చె నీ దరికీనాడు పండె నా నోములు పిల్లన గ్రోవూదుమోయ్!! నల్లనివాడా!!

- వింజమూరి శివరామారావు గారు

ఎంత అద్భుతమైన లలిత గీతమో! వింజమూరి శివరామారావు గారు సీత-అనసూయ సోదరీమణులతో పాటు వింజమూరి వంశంలో జన్మించిన మరో ప్రతిభామూర్తి. ఈయన ఆకాశవాణిలో ఎన్నో సంవత్సరాలు పని చేశారు. అద్భుతమైన లలితగీతాలు రచించారు. వీరు రచించిన రామాయణం గేయం అప్పట్లో ఆకాశవాణిలో మారుమ్రోగింది. సీత-అనసూయ గార్ల లాగానే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు వీరికి మేనమామలు. కళాప్రపూర్ణ బిరుదాంకితులు శివరామారావు గారు. గౌతమి అనే కలం పేరుతో ఆయన రచనలు చేశారు. 600కు పైగా రేడియో నాటకాలను అందించారు.

గోపిక మనో భావనలను తెలిపే ఎన్నో లలిత గీతాలు వచ్చాయి. వాటిలో శివరామారావు గారి ఈ గీతం ప్రత్యేకమైనది. కృష్ణ భక్తిలో స్వామిపై ఉండే అధికారము, స్వామికి ఆత్మ నివేదన, ప్రేమానురాగాలు అనన్యమైనవి. అవే భావనలను కవి ఈ గీతంలో అద్భుతంగా ఆవిష్కరించారు. స్వామి తీయని పాటల కోసం అర్థరాత్రి ఒంటరిగా వచ్చిన గోపిక స్వామిని తన మనసు రంజిల్ల జేసేలా పిల్లనగ్రోవి ఊది పాడమని వేడుకుంటుంది. తన మనసు, తనువు, జీవితము అన్నీ స్వామివే అని తెలుపుతుంది. చీకటి వేళలో, ఆకాశంలో మబ్బులు మూగినా వాటిని లెక్క చేయక స్వామి తలపులే వెలుగుగా చూస్తూ ఆయన కోసమై వచ్చాను అని తెలియజేస్తుంది. మేఘముల మెరుపే గోపికగా, స్వామిపై ప్రేమయే సఖిగా తోడ్కొని తనను స్వామి దరికి తెచ్చెనని, తన నోములు పండాయని, పిల్లనిగ్రోవి ఊది పాడమని ఆ నల్లనయ్యను ప్రార్థిస్తుంది.   ఆత్మ నివేదన మధురభక్తికి సూచిక. నేను అన్న భావన మరచి, ధైర్యంగా స్వామి దరికి చేరుకునే గోపికల మనోభావనలను సూచించే గీతం ఇది. ఇక రావు బాలసరస్వతి గారి గానం ఈ భావానికి సాధనమైతే? అదో రసరమ్య గీతమే. కృష్ణభక్తిని అక్షర లక్షలుగా ప్రకటితం చేసిన బాలసరస్వతి గారి గానం లలిత సంగీత ప్రపంచంలో మకుటాయమానం. పట్టులాంటి మృదువైన గాత్రం వారిది. ముఖ్యంగా సాలూరి వారి గీతాలకు వారి గళం ఎంత నప్పుతుందో. ఈ గీతం ఎవరు స్వరపరచారో తెలియదు కానీ కళ్యాణి రాగంలో ఉంది కాబట్టి సాలూరి వారే అనుకుంటున్నాను. వారికి కళ్యాణి రాగమంటే ప్రాణం. గీతం వింటుంటే సాలూరి వారి ఛాయలు స్పష్టంగా తెలుసుతున్నాయి. లలిత సంగీతపు స్వర్ణయుగంలో బాలసరస్వతి గారి ఆణిముత్యపు గీతాలలో ఒకటైన నల్లని వాడా విని ఆస్వాదించండి. కృష్ణభక్తిలో తరించండి. 

29, జులై 2017, శనివారం

ఓం నమశ్శివాయ! చంద్రకళాధర! సహృదయ! - వేటూరి గీతం


ఓం నమశ్శివాయ! చంద్రకళాధర! సహృదయ! సాంద్రకళాపూర్ణోదయ! లయ నిలయ!

పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై
ప్రకృతి పార్వతి నీతో నడచిన ఏడు అడుగులే స్వరసప్తకమై
నీ దృక్కులే అటు అష్ట దిక్కులై నీ వాక్కులే నవరసమ్ములై
తాపస మందారా! నీ మౌనమే దశోపనిషత్తులై ఇల వెలయ!

త్రికాలములు నీ నేత్ర త్రయమై చతుర్వేదములు ప్రాకారములై
గజముఖ షణ్ముఖ ప్రమథాదులు నీ సంకల్పానికి ఋత్విజవరులై 
అద్వైతమే నీ ఆదియోగమై నీ లయలే ఈ కాలగమనమై
కైలాస గిరివాస! నీ గానమే జంత్రగాత్రముల శృతి కలయ!

- వేటూరి సుందరరామ్మూర్తి గారు

కవుల ఆధ్యాత్మిక దార్శనికత వారి రచనలలో తేటతెల్లమవుతుంది అన్నదానికి వేటూరి వారి ఓం నమశ్శివాయ అనే గీతం ప్రత్యక్ష నిదర్శనం. కళాతపస్వి ఆలోచనలను, శైలిని ప్రేక్షకుల హృదయాలలో నిలిపేలా చేసేవి వారి చిత్రాలలోని గీతాలు. అటువంటిదే ఓం నమశ్శివాయ అనే గీతం. వేటూరి వారికి సాగరసంగమంలో ఆ సందర్భానికి ఇటువంటి గీతాన్ని రాయమని చెప్పటం విశ్వనాథ్ గారి కళాత్మక దృష్టిని,ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని సూచిస్తుంది.

నెలవంక చంద్రుని శిరసుపై గల సహృదయుడవు, పరిపూర్ణమైన కళలకు నిలయమైన వాడవు, లయ యందు నివసించే వాడవు అయిన శివా! నమస్కారములు. పృథివ్యాపస్తేజోవాయురాకాశములు ఐదు ముఖములుగా (సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన ముఖములు), ఆరు ఋతువులు ఆభరణములైన ఆహార్యముగా, ప్రకృతి రూపిణియైన పార్వతి నీతో నడిచే అడుగులే సప్తస్వరాలు. నీ చూపులే అష్ట దిక్కులు, నీ పలుకులు నవరసాలు. నీవు తాపసులలో శ్రేష్ఠుడవు. నీ మౌనం నుండే ఉపనిషత్తులు ఈ భువిలో వెలసాయి. ఓ పరమశివా! నీకు నమస్కారములు. మూడు కాలములు నీ మూడు కళ్లుగా, నాలుగు వేదాలు నీ నివాసమైన కైలాసానికి ప్రాకారాలుగా, గణపతి, కుమారస్వామి మొదలైన ప్రమథ గణాలు నీ సంకల్పాన్ని అమలు చేసే ఋత్విజ శ్రేష్ఠులై, అద్వైత భావనతో నీ యోగము సనాతనమై, నీ  లయలు కాలానికి ముందడుగులై నీ గానం వాయిద్యములతో జంత్రగాత్రమై శృతిలో పలికినావు. ఓ కైలాసవాసా! నీకు నమస్కారములు.

సృష్టి స్థితి లయములలో లయకారకుడు శివుడు. ఆ లయానికి నాదం మూలం. నిరంతర నాద పరివేష్టితుడైన పరమ శివుడు ఆనంద తాండవంతో పాటు విలయతాండవం కూడా చేస్తూ నిరంతరం ధ్యానంలో ఉంటాడని మన వేద వాఙ్మయం ఘోషిస్తోంది. ఆ పరమశివుని కైలాస ప్రస్తారాన్ని ఒక్కసారి కళ్ల ముందుంచే ప్రయత్నం వేటూరి వారు ఈ గీతం ద్వారా చేశారు. సాహిత్యంలోని భావాన్ని పరిశీలిస్తే శివతత్త్వం ప్రస్ఫుటమవుతుంది. నీ మౌనమే దశొపనిషత్తులై ఇల వెలయ అని గీతాన్ని ముగించారు వేటూరి వారు. మౌనమేమిటి ఉపనిషత్తులేమిటి అని ప్రశ్న రావచ్చు. దక్షిణామూర్తి ఎవరు? శివుడే కదా? మౌనంతో ఋషులకు జ్ఞానబోధ చేసిన ఆ పరమశివుని సంకల్పం అద్భుతం. ఇటువంటి తత్త్వం వింటేనే మనసు పులకరిస్తుంది.

ఇళయరాజా గారి సంగీతం, వేటూరి వారి సాహిత్యం, జానకి గారి గాత్రంలో ఈ గీతం అజరామరమైంది. సాగర సంగమం చిత్రానికి ఇళయరాజా గారికి జాతీయ స్థాయిలో ఉత్తమ సంగీత దర్శకుని పురస్కారం లభించింది. వేటూరి గారికి, విశ్వనాథ్ గారికి, ఇళయరాజా గారికి ఇటువంటి గీతాన్ని అందించినందుకు మనం ఎంతో ఋణపడి ఉన్నాము. 

పరమపురుషమనుయామవయం సఖి - నారాయణ తీర్థుల తరంగం


పరమపురుషమనుయామవయం సఖి పరమ పురుషమనుయామ

సురుచిర హాసం సుందర నాసం తరుణరుణ కిరణాధర సరసం 

నంద కుమారం నగవర ధీరం బృందావన భువి వివిధ విహారం 
బృందారక గణ వందిత చరణారవింద మిళిత మణి మధుకర నికరం 

యువతీ గీత యోగి సులలితం కవి జన మానస కమల విలసితం 
శివ నారాయణ తీర్థ విరచితం శ్రీ గోపాల దయా రస మిళితం

- నారాయణ తీర్థుల వారు (శ్రీకృష్ణ లీలా తరంగిణి)

ఓ సఖులరా! పరమ పురుషుడైన ఆ శ్రీకృష్ణుని అనుసరిద్దాం రండి!  మోహనమైన చిరునవ్వుతో, అందమైన ముక్కుతో, సూర్యకాంతివలె ఎర్రగా ప్రకాశించే పెదవులు కలిగి రసపురుషుడైన ఆ కృష్ణుని అనుసరిద్దాం! నందుని కుమారుడు, అసమాన ధీరుడు, బృందావనంలో సంచరించే వాడు, దేవతలచే పూజించబడిన వాడు, వారి శిరసున ఉన్న కిరీటములలోని మణులచే ప్రకాశించిన చరణములు కలవాడు అయిన శ్రీకృష్ణుని అనుసరిద్దాం. శ్రీకృష్ణుని దయారసం మిళితమై నారాయణ తీర్థులు వారు రచించిన ఈ గీతం గోకులంలోని స్త్రీల గానం చేయగా యోగుల మనసులు ఆనందించాయి, కవుల హృదయ కమలములు వికసించాయి.

నారాయణ తీర్థుల వారు శ్రీకృష్ణుని లీలలను, ఆయన రూపాన్ని వర్ణించినంత మనోహరంగా ఇంక ఏ వాగ్గేయకారుడూ వర్ణించలేదంటే అతిశయోక్తి కాదు. శ్రీకృష్ణ లీలా తరంగిణిలో ఎన్నో కీర్తనల ద్వారా ఆయన బృందావన కృష్ణుని నుతించారు. అందులో ఒకటి ఈ పరమ పురుషమనుయామ అనే కీర్తన. శరదృతువులో బృందావనంలో వేణుగానం చేస్తున్నాడు శ్రీకృష్ణుడు. అతని కోసం వేచి యున్న గోపికలు ఆ గానానికి ముగ్ధులై ఈ గీతాన్ని ఆలపించినట్లు, అక్కడి యోగులు, కవులు దానిని ఆస్వాదించినట్లు ఈ గీతం వివరిస్తుంది. బేహగ్ రాగంలో మల్లాది సోదరులు ఈ గీతాన్ని హృద్యంగా పాడి కృష్ణ తత్వాన్ని ఆవిష్కరించారు. విని తరించండి.


స్వామినాథ పరిపాలయాశు మాం - దీక్షితుల కృతి


స్వామినాథ పరిపాలయాశు మాం  స్వప్రకాశ వల్లీశ గురు గుహ దేవసేనేశ

కామజనక భారతీశ సేవిత
కార్తికేయ నారదాది భావిత
వామదేవ పార్వతీ సుకుమార
వారిజాస్త్ర సమ్మోహితాకార
కామితార్ధ వితరణ నిపుణ చరణ
కావ్య నాటకాలంకారాభరణ
భూమి జలాగ్ని వాయు గగన కిరణ
బోధ రూప నిత్యానంద కరణ

స్వప్రకాశుడవు, వల్లీ దేవసేనల పతివి, గురుగుహుడవు అయిన ఓ స్వామినాథా! నన్ను రక్షింపుము. ఓ కార్తికేయా! బ్రహ్మ విష్ణువు మరియు దేవతలచే పూజించబడిన వాడవు, నారదాది మునులచే భావించబడిన వాడవు. శివ పార్వతుల సుపుత్రుడవు. మన్మథునికి కూడా సమ్మోహనమైన ఆకారము కలవాడవు. నీ పదములను ఆశ్రయించిన వారి కామ్యములను తీర్చే నిపుణుడవు. కావ్యములు, నాటకము, అలంకారములు మొదలైన కళలను పెంపొందించే వాడవు, భూమి, నీరు, అగ్ని, వాయు మరియు ఆకాశములకు ప్రకాశమైనవాడవు, జ్ఞానస్వరూపుడవు, సచ్చిదానందమునకు కారకుడవు. నన్ను రక్షింపుము.

- ముత్తుస్వామి దీక్షితుల వారి  కృతి రంజని-గాయత్రిల యుగళ గాత్రంలో వినండి.


పాతాళ భైరవి – 1951: తెలుగు జానపద చిత్రరాజం

1951 మార్చి 15న విడుదలైన పాతాళ భైరవి తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక కీలక మలుపు. విజయా ప్రొడక్షన్స్ పతాకంపై బి. నాగిరెడ్డి, ఆలూరి చక్రపాణి నిర్మ...