27, జనవరి 2017, శుక్రవారం

విశాల హృదయం - భారతదేశానికి ఎంతో అవసరం


విశాల భారతదేశం మనది హిమాలయాలకు నిలయమిది
ఇలాంటి దేశంలో ప్రజలంతా విశాల హృదయంతో మెలగాలి 

అని ఓ కవి రాసిన పాటను చిన్నప్పుడు విని నేర్చుకున్నాను. కానీ, ఆ విశాల హృదయం తప్ప మిగతావన్నీ మనకు అబ్బేశాయి. ఇంకా ఇంకా భారతీయుని మనసు సంకుచితమై పోతోంది. భిన్నత్వం విశాల హృదయం ఇవ్వకపోగా మనుషులను ముక్కలు ముక్కలు చేస్తుంటే బాధగా ఉంది. మా పంటలకు నీళ్లు ఉండవు, మేము తాగటానికి పక్కవాళ్లకు నీళ్లివ్వమని ఓ ఇద్దరు, మీ మతమేమో దరిద్రం, మాదేమో ఘనం అని మరో ఇద్దరు..ఓ నాలుగు మాటలు మాట్లాడగానే మీదే కులం అని అడిగే మరో ఇద్దరు...చదవేస్తే ఉన్న మతిపోయినట్లుంది భారతీయుని చందం. ప్రతి దానికీ వితండవాదం. స్వేచ్ఛ పేరుతో విశ్శృంఖలపు ఆలోచనలు, వేర్పాటు వాదానికి బీజాలు. కారణాలు?

1. ప్రగతి ఫలాలు అందరికీ అందకపోవటం, ఉన్నతమైన జీవనశైలి అందరికీ అందుబాటులో లేకపోవటం. అవకాశాలు అవినీతి, బంధుప్రీతి, ప్రతిభను కాలరాస్తున్నాయి.
2. పెరిగిన జనాభాతో ఉద్యోగాల కోసం చదువులు అన్నట్లుంది. ఇటువంటి చదువులు మనుషులకు సంస్కారం ఇవ్వకపోగా నిర్వీర్యమైన ఆలోచనాధోరణిని పెంపొందిస్తున్నాయి.
3. ఉన్నత విద్యలో వ్యక్తిత్వానికి స్థానం పోయింది. దీనితో మనుషుల్లో ఓర్పు, సహనం, శ్రమపడే తత్త్వం దారుణంగా తగ్గిపోయాయి.
4. పోటీ పరుగులలో, స్వార్థం పెరిగిపోయి త్యాగం, సేవా భావాలు బాగా తగ్గిపోయాయి.
5. స్వతహాగా నీతి, మానవ సేవ, భక్తి మొదలైన మంచి లక్షణాలను బోధించే భారతీయ సనాతన ధర్మ శాస్త్రాలకు నేటి ఆంగ్ల విద్యలో స్థానం చాలా చాలా తగ్గిపోయింది.

వీటితో ప్రజలలో అశాంతి, యువతలో బలహీనమైన వ్యక్తిత్వాలు, ఇతరులపై దౌర్జన్యాలు...వెరసి సంకుచిత హృదయాలు. బాధాకరమైన విషయమేమిటంటే ఇది వరకు భారత దేశంలో విద్యావంతులు, ధనవంతులలో చాలామందికి విశాలహృదయముండేది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. విద్యావంతులు, మేధావులలో ఈ సంకుచితత్వం మరింత పెరిగింది.

సనాతన ధర్మం భారతీయతకు మూలం. మరి మన మూలాలను వదిలేస్తే మన ముంగిట నిలిచేవి ఇటువంటి దుష్పరిణామాలే. ఆంగ్ల విద్య అవసరం, నిజమే. కానీ, వ్యక్తిత్వం వికాసం విద్య కన్నా ముఖ్యమైనది. చదువుతో అది అబ్బకపోతే తరువాతి తరాలు అతి త్వరగా మానసిక జబ్బులు, ఆత్మహత్యలు,గృహహింస, విడాకులవంటి విపరీతాలకు పోయే అవకాశం ఉంది. పోలీసులు, లాయర్లు, డాక్టర్లు కొంత మేరకే సమస్యలను పరిష్కరించగలరు. సింహభాగం పరిష్కారాలు మన వ్యక్తిత్వాలనుండే రావాలి. సనాతన ధర్మ బోధన అంటే రామాయణ భారత భాగవతాలు గుడ్డిగా బోధించటం కాదు. వాటిని పరిశోధించి, వివరించి, సారాన్ని అందించి సమస్యలకు పరిష్కారాలకు ఉదాహరణలు తెలపాలి. పురాణాలలో గాథలు చాలా మటుకు నేటి తరానికి అంతగా రుచించవు. కాబట్టి వీలైనంత మన మూలాలైన వేదవాఙ్మయాల అధ్యయనంతో పాఠ్యాంశాలు ముడి పడి ఉండాలి. వివేకానంద, రామకృష్ణ పరమహంస, చిన్మయానంద వంటి మహానుభావులు మనకు ఇటువంటి అధ్యయనాలు చేసి వాటి సారాన్ని చాలా వివరంగా అందించారు. విద్యావ్యవస్థలో వీటికి చోటు లభిస్తే బాగుంటుంది.

ప్రపంచ సంస్కృతులకు పుట్టినిల్లు మన సనాతన ధర్మం అని ఎందరో విదేశీయులు చెప్పారు. కానీ, మనమేమో, దానికి విరుద్ధంగా మరింత అజ్ఞానం వైపు పరుగెడుతున్నాం. ఏది కనబడితే దాని వెంటబడి, వెలకట్టలేని మన ధర్మపు విలువలను, శక్తిని నిర్లక్ష్యం చేస్తున్నాం. భారత భాగ్యవిధాతలైన బాలబాలికలకు, యువతీయువకులకు మన ధర్మ సారాన్ని, మహత్తును, శక్తిని ఆస్వాదించి అనుగమించే వసతలు ఇస్తేనే ఈ జాతికి మనుగడ, ఈ గడ్డపై పుట్టిన మానవునికి నేతృత్వ లక్షణాలు కలుగుతాయి.  తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు, ప్రభుత్వాలు ఈ దిశగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతో ఉంది.

నిజంగానే విశాల భారతదేశంలో విశాల హృదయం కలిగి ఉండటానికి ఎన్నో అవకాశాలు. భాష, రంగు, రూపు, ఆహారపు అలవాట్లు, ఆచారా వ్యవహారాలు, నమ్మకాలు, విశ్వాసాలు...ఇవన్నీ ఎంతో వైవిధ్యభరితమైనవి. అలాగే ధర్మపథాలు ఎన్నో. పక్కవారి అభిప్రాయాలను గౌరవించి, ఆదరించి, సహనంతో, సౌభ్రాతృత్వంతో ఉండే చదువులను, సంస్కారాలను మన పిల్లలకు అందేలా కృషి చేద్దాం.

జై హింద్

అక్కిరాజు ప్రసాద్ 27/01/2017

26, జనవరి 2017, గురువారం

జాతీయతా భావం


మనం ఎంత భావ దారిద్య్రంలో ఉన్నామంటే దేశం కోసం అన్న మాటలు మాట్లాడితే వాళ్లు అతివాదులుగా చిత్రీకరించబడుతున్నారు. జాతీయతా భావం లేకపోతే ఇక ప్రజల ఐక్యతకు ప్రాతిపదిక ఏమిటి? మువ్వన్నెల చీర చుట్టిన ఆ భిన్నత్వపు భరతమాత ఏదో మాటలకు కాదు. దానిలో  అంతర్లీనమైన శక్తి ఉంది, మనది, మనము అన్న అద్భుతమైన భావనను ఒక్క జాతీయతే ఇస్తుంది. కులం, మతం, భాష, రంగు, రూపం, ఆర్థిక స్థోమత ఇవేవీ ఐక్యతను ఇవ్వలేవు.

ఇటీవల నన్ను ఓ ప్రబుద్ధుడు ప్రశ్నించాడు - "అమెజాన్‌లో కాళ్లు దులుపుకునే పట్టా మీద భారత పతాకం ఉంటే దానికి వివాదమెందుకు? దేశంలో అంతకన్నా భయంకరమైన సమస్యలు ఉన్నాయి పరిష్కరించటానికి, ఈ కుహనా జాతీయవాదం ఎందుకు అని". సమస్యలు ఉన్నది నిజమే. కానీ ఒరేయ్ శుంఠా! పతాకం నువ్వననుకున్నట్లు నిర్జీవమైనది కాదు. ఓ అద్భుతమైన సంస్కృతికి, ఘన చరిత్ర గల కర్మభూమికి ప్రతీక. ఓ చిన్న సమస్య వస్తే దద్దరిల్లిపోయే పాశ్చాత్య సంస్కృతికి - ఏ సమస్య వచ్చినా అధిగమించే భారతీయ సంస్కృతికి గల తేడాను ప్రతిబింబించే ఓ జాగృత శక్తి. సమస్యల పరిష్కారం కోసమే జాతీయతావాదం. ఎక్కడో ఈశాన్య రాష్ట్రంలోనో కాశ్మీరు మంచు ప్రాంతాలలోనో ఉన్న కష్ట జీవుల సమస్యలు తెలియాలంటే ఇది మన దేశం అన్న భావన ఒక్కటే మార్గం. భారత దేశం నా మాతృ భూమి, భారతీయులంద్రూ నా సహోదరులు. నేను నా దేశమును ప్రేమించుచున్నాను..అని ప్రతి దినం పాఠశాల ప్రతిజ్ఞలో పఠించటం భారతీయతను చాటటానికే. జాతీయత ఉన్నపళాన రాదు. నేర్పించాలి, చిగురింపజేయాలి, నీళ్లుపోసి మొక్కను పెంచినట్లు జాగ్రత్తగా పోషించాలి. దానికి పతాక గౌరవం, గీతాలాపన, ప్రతిజ్ఞ ద్వారా దృఢ సంకల్పం, త్యాగ నిరతి అనేవి నాలుగు మూలస్థంభాలు. అందుకేరా ప్రబుద్ధుడా ఆ జాతీయ పతాకం అంటే మాకు అంత గౌరవం. దానికోసం ఎటువంటి త్యాగానికైనా మేము సిద్ధమే.

దేశాలు, పతాకాలు, గీతాలు ఏర్పడింది ఉన్మాదానికి కాదు, అతివాదానికి అంతకన్నా కాదు. మన మన స్వార్థాలను దాటి ఒకే తాటిపైకి తీసుకు రావటానికి ఏర్పరచబడిన అద్భుత సాధనాలు. ఈ దేశ పౌరునిగా, ఈ దేశ అతిథిగా వాటిని గౌరవించటం కనీస ధర్మం, బాధ్యత. పిచ్చి పిచి ప్రేలాపనలతో జాతీయతను ప్రశ్నిస్తేనే మీరనుకునే అతివాదం సరైన సమాధానం చెబుతుంది. అసలు భరతజాతిని మించిన భిన్నత్వంలో ఏకత్వం ఎక్కడ ఉంది? ఎన్ని భాషలు, ఎన్ని సంస్కృతులు, ఎన్ని సాంప్రదాయాలు, ఎన్ని మాండలికాలు, ఎన్ని వేషభూషలు, ఎన్ని ఆహారవ్యవహారాలు? ఇన్నిటిని ఐక్యం చేయగలిగిందంటే ఆ శక్తి మానవాతీతమైనదేగా? మరి అంతటి శక్తిని కలిగిన త్రివర్ణ పతాకాన్ని, జాతీయగీతాన్ని అగౌరవపరస్తే మౌనంగా ఉండే వాళ్లు, ఆ అదో పెద్ద సమస్య కాదు అనుకునే వాళ్లలో జాతీయతా భావం లేనట్లే.

సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం అన్న బంకిం చంద్ర గారి గీతం విని దాని అర్థం తెలుసుకుంటే భారతీయత అంటే, భరతమాత అంటే ఏమిటో తెలుస్తుంది. జనగణ మంగళ దాయక జయహే భారత భాగ్య విధాత అన్న రవీంద్రుని మాటల ఆంతర్యాన్ని తరచి చూస్తే జాతీయత మహత్తు తెలిసి రోమాంచమవుతుంది. ప్రజల హితానికే జాతీయత, ప్రజల ఐక్యతకే జాతీయత, ప్రజల ఆనందానికే జాతీయత. పైడిమర్రి వేంకట సుబ్బారావు గారు రచించిన మన ప్రతిజ్ఞను చదివి అర్థం చేసుకుంటే జాతీయత ఎందుకో తెలుస్తుంది.

"భారత దేశము నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశమును ప్రేమించుచున్నాను. సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వ కారణం. దీనికి అర్హత పొందుటకు సర్వదా నేను కృషి చేస్తాను. నా తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను, పెద్దలందరినీ గౌరవిస్తాను. ప్రతివారితోనూ మర్యాదగా నడుచుకుంటాను. నా దేశం పట్ల, నా ప్రజల పట్ల సేవా నిరతి కలిగి ఉంటాను. వారి శ్రేయిభివృద్ధులే నా ఆనందానికి మూలం అని ప్రతిజ్ఞ చేస్తున్నాను."

భారతీయులందరూ నా సహోదరులు అన్న భావన ఉంటే చాలదూ? ఐక్యత దానంతట అదే వస్తుంది. జాతీయతా భావం గర్వ కారణమైతే అది ఎంత స్ఫూర్తిదాయకమో తెలుసా? ఆ జాతీయతా భావమే పటేల్‌ను మహనీయుని చేసింది. వందలకొలది రాజ్యాలను ఏకం చేసి భరతజాతికి ఓ రూపునిచ్చింది. మన వారసత్వం ఎలాంటిది? సుసంపన్నమైనది, బహువిధమైనది. అంటే ఎంతో విలువైనది, బహుళత్వం కలిగింది. ఈ భావాన్ని మదిలో నింపుకుంటే మన హృదయం ఎంత విశాలమవుతుందో గమనించారా? ఆ భావనను పొందటానికి మనం కృషి చేయాలి అన్న సంకల్పం వస్తే చాలు. అందుకే ప్రతిజ్ఞ. పెద్దలను గౌరవించటం, అందరితో మర్యాదపూర్వకంగా మసలుకోవటం మనకు వచ్చిన ఆ మహోన్నతమైన వారసత్వపు ప్రధాన లక్షణం. దేశమంటే ప్రజలే. ఆ ప్రజల పట్ల సేవా భావం కలిగి ఉండాలి అన్నది మనకు అనాదిగా చెప్పబడింది. అది భారతీయతకు మూలం. ఆ ప్రజల శ్రేయస్సు, అభివృద్ధి నాకు ఆనందకారకం అన్న భావన  మన హృదయాలలో నిలుపుకుంటే ఇంక స్వార్థానికి తావేది? చూశారా? ఎంత గొప్ప ప్రతిజ్ఞో? ఈ సంకల్పం సాకారం చేస్తే ఇంక ఈ దేశంలో భావ దారిద్య్రానికి, స్వార్థానికి, కల్లోలానికి, విభజనవాదానికి తావేది?

ప్రజలను ఐక్యం చేయటానికే ఈ జాతీయ పండుగలు, పతాకావిష్కరణలు, గీతాలాపనలు. వాటికి కన్న తల్లిదండ్రులకన్నా గౌరవం ఉండి తీరాలి. అప్పుడే ఈ జాతి మనుగడ, శ్రేయోభివృద్ధి.

- అక్కిరాజు ప్రసాద్ 26/01/2017

22, జనవరి 2017, ఆదివారం

కలనైనా నీ వలపే - సముద్రాల జూనియర్‌ సాహితీ కవనం


తుషార శీతల సరోవరాన 
అనంత నీరవ నిశీధిలోన 
ఈ కలువ నిరీక్షణ...
నీ కొరకే రాజా..వెన్నెల రాజా!

కలనైనా నీ వలపే 
కలవరమందైన నీ తలపే
కలనైనా నీ వలపే

కలువ మిటారపు కమ్మని కలలు కళలు కాంతులు నీ కొరకేలే
చెలి ఆరాధన శోధన నీవే జిలిబిలి రాజా జాలి తలచరా

కనుల మనోరథ మాధురి దాచి  కానుక చేసే వేళకు కాచి
వాడే రేకుల వీడని మమతల వేడుచు నీకై వేచి  నిలచెరా

తెలుగు సినీ స్వర్ణయుగపు పాటల్లో శాంతినివాసం చిత్రంలోని కలనైనా నీ వలపే అన్న పాటకు ఓ ప్రత్యేక స్థానముంది. పాటకు భావం ప్రాణమైతే పదాలు ఆ భావానికి పట్టుగొమ్మలు. తెలుగు భాషలో ఉన్న మాధుర్యం ఎంత ఆస్వాదించినా తనివితీరదు. తుషారము, నీరవము, వెన్నెల రాజు, జిలిబిలి, మిటారపు, మనోరథము...ఎంత మంచి పదాలో! సముద్రాల రామానుజాచార్యుల వారి భావ వీచికలలో ఎంతటి సొగసో!



ప్రముఖ రచయిత సముద్రాల రాఘవాచార్యుల వారి తనయుడు ఈ రామానుజాచార్యులు. తండ్రి నుండి తెలుగుదనం పుణికి పుచ్చుకున్న ఈయన ఎన్నో మంచి రచనలు చేశారు. గుంటూరు జిల్లా పెదపులివర్రులో 1923లో జన్మించిన ఈయన చిన్ననాటినుంచే పద్యాలు, కవితలు రచించారు. భాషతో పాటు చదువులో కూడా బాగా రాణించారు. రేడియో సర్వీసు మరియు మెయింటెనెన్స్‌లో డిప్లొమా చేశారు. ఆయనకు బాగా పేరు తెచ్చిన చిత్రం 1960లో వచ్చిన శాంతినివాసం. ఈ చిత్రంలో శ్రీరఘురాం జయరఘురాం పాట అందరికీ గుర్తుండే ఉంటుంది. అటువంటి భక్తి గీతం రాసిన ఆయన దానికి భిన్నంగా కలనైనా నీ వలపే అన్న మనోజ్ఞమైన భావగీతి అందించారు. వినోదా వారి శాంతితో మొదలైన సముద్రాల రామానుజుల సినీ ప్రస్థానంలో బ్రతుకుతెరువు, తోడుదొంగలు, జయసింహ, పాండురంగమహత్మ్యం, ఆత్మబంధువు, ఉమ్మడికుటుంబం, తల్లా పెళ్లామా, రామాంజనేయయుద్ధం మొదలైన 70 సినిమాలు ఉన్నాయి. ఈ తండ్రీ కొడుకులను సముద్రాల సీనియర్-జూనియర్‌గా పిలిచేవారు.

రామానుజాచార్యుల వారి ఈ రచనలో ప్రేయసి భావనను ఎంతో లాలిత్యంతో తెలిపారు. కలువ చంద్రుని కొరకై ఎలా వేచి ఉంటుందో అలా ఈ ప్రేయసి తన ప్రియుని కోసం వేచియుంది అన్న భావనను తొలి పంక్తి తుషార శీతల సరోవరాన అనంత నీరవ నిశీథిలోన ఈ కలువ నిరీక్షణ...నీ కొరకే రాజా వెన్నెల రాజా అని అద్భుతమైన ఉపమానంగా ఆవిష్కరించారు.

వికసించే కలువ యొక్క కలలు, కళలు, కాంతులు అన్నీ ఆ చంద్రుని కొరకే అయినట్లు ఆ ప్రేయసి ఆరాధన, వెదకటం అన్నీ ఆ ప్రియునికేనని తెలిపారు. కళ్లలో తన కోరికల మాధుర్యాన్ని దాచి, ప్రియుడు వేంచేసే వేళకై ఎదురు చూస్తూ, వాడే రేకులలో వీడని మమతలతో వేడుకుంటూ చెలి నిలుచుని ఉన్నదని విశేషమైన పదజాలంతో పలికారు.

ఘంటసాల మాష్టారి సంగీతంలో ఎన్నో చిత్రాలు వచ్చాయి. అందులో ఈ శాంతినివాసం ఒకటి. ఆ మహానుభావునికి గాయకునిగా ఎంతపేరు వచ్చిందో అంతే పేరు సంగీత దర్శకునిగా కూడా వచ్చింది. ఆయన సంగీత సారథ్యం వహించిన ఈ కలనైనా నీ వలపే అన్న గీతాన్ని తెలుగు అక్షరం ముక్క రాని లీలమ్మ గారు అద్భుతంగా పాడారు. ఆమె పాట వింటుంటే ఎక్కడా కూడా తెలుగు రాదని మనకు అవగతం కాదు. హిందోళ రాగంలో తెలుగు చలనచిత్ర గీతాలు ఎన్నో వచ్చాయి. వాటిలో ఒకటి కలనైనా నీ వలపే. ఈ గీతాన్ని లీలగారు తప్ప ఎవరూ అంత మధురంగా పాడలేరు. చిత్రంలో నాయిక ఎవరు అంటే చెప్పటం కష్టం. ఏఎన్నార్ అన్న పాత్ర వేసిన కాంతారావు భార్యగా దేవిక, ఏఎన్నార్ సఖిగా రాజసులోచన, దారితప్పిన కాంతారావును దారిలోకి తెచ్చే శ్రేయోభిలాషి మరియు స్నేహితురాలిగా కృష్ణకుమారి...ముగ్గురికీ సమానమైన పాత్రలే ఉన్నాయి. ఈ గీతం కృష్ణకుమారిపై చిత్రీకరించబడింది. కృష్ణకుమారి-కాంతారావుల మధ్య ఉండే స్నేహం (అతను ప్రేమగా అపార్థం చేసుకుంటాడు) ఈ గీతానికి సరైన నేపథ్యం కాకపోయినా, సమస్యలతో సతమవుతున్న అతనికి సాంత్వననిచ్చే పాత్రకు ఈ పాట సముచితమేనేమో? ఆ కాలంలో ప్రజలు ఈ పాత్రకు ఎలా స్పందించారో తెలియదు.

సముద్రాల జూనియర్ సాహిత్యానికి ఘంటసలా మాష్టారు సంగీతంలో పి.లీల గారు పాడిన కలనైనా నీ వలపే పాట చూసి ఆస్వాదించండి.

శబరిమలను స్వర్ణ చంద్రోదయం - యేసుదాసు అయ్యప్ప గానామృతం


హరిహర సుతుడైన అయ్యప్పను తలచగానే డాక్టర్ యేసుదాసు గారు గానం చేసిన హరివరాసనం పాట గుర్తుకొస్తుంది. స్వామి అయ్యప్ప అనే చలన చిత్రం 1975లో తమిళ మలయాళ భాషలలో విడుదలై ఘనం విజయం సాధించింది. ఆ చిత్రంలో కూడా యేసుదాసు గారు ఈ పాటను గానం చేశారు. అదే చిత్రంలో శబరిమలను స్వర్ణ చంద్రోదయం అనే మరో పాట ఆయన పాడారు. గీతాన్ని తెలుగులోకి ఎవరు అనువదించారో తెలియదు. సంగీతం దేవరాజన్ గారు.

అయ్యప్ప హరిహర సుతుడు. కోట్లాది భక్తులకు ఆరాధ్య దైవం. ప్రరి ఏడాది మకర సంక్రమణానికి ముందు గురుస్వామి నేతృత్వంలో 40రోజుల దీక్షగా స్వాములు మాల ధరించి శ్రద్ధా భక్తులతో పూజించి ఇరుముడితో కేరళలోని పత్తనమిట్ట ప్రాంతంలో ఉన్న శబరిమల చేరుకొని అక్కడి స్వామిని దర్శించుకుంటారు. ఆ హరిహరసుతుని పేరు ధర్మశాస్త. శివునికి మోహినీ అవతారుడైన శ్రీమహావిష్ణువుకు జన్మించిన వాడు ధర్మశాస్త. ఈ హరిహరసుతునిపై ఉన్న గాథలలో పండలం రాజావారి సుతునిగా ప్రాచుర్యం పొందినది ఒకటి. ఆ రాజావారి తొలుత ఈ బాలుని చూసినప్పుడు అతని మెడలో మణిహారం ఉందట. అందుకని అతనికి మణికంఠుడని నామకరణం చేశారు. ఈ విధంగా ధర్మశాస్త, మణికంఠ, అయ్యప్పగా ఆ హరిహరసుతుడు ఆ ప్రాంతప్రజలకు, దక్షిణ భారతదేశంలో ఎందరికో ఆరాధ్య దైవం.

శబరిమలలో ఉన్న ఈ ప్రధాన దేవాలయం పెరియార్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలోని కొండలలో పూంగవనం అడవుల మధ్య 3వేల అడుగుల ఎత్తులో ఉంది. ఈ దేవాలయం సంవత్సరంలో కొన్ని మార్లు మాత్రమే తెరిచి ఉంటుంది - మండలమహోత్సవం (దాదాపు నవంబర్ మధ్యనుండి డిసెంబర్ 26 వరకు), మకరవిళక్కు (మకర సంక్రాంతి సందర్భంగా), విషు పర్వదిన సందర్భంగా, సూర్యుని ప్రతినెలా సంక్రమణం రోజు.

అయ్యప్పస్వామిపై ఎన్నో చిత్రాలు, టీవీ ధారావాహికలు వచ్చాయి. వాటిలో 1975లో విడుదలైన స్వామి అయ్యప్పన్ చిత్రం ప్రధానమైనది. జెమినీ గణేశన్, సుకుమారన్ నాయర్, శ్రీవిద్య నటించారు. మాష్టర్ రఘు మణికంఠునిగా నటించారు. ఆ మాష్టర్ బాలనటుడిగా మలయాళం చిత్ర పరిశ్రమలో ఎంతో పేరుపొందాడు. పెద్దై రఘు నేడు కరణ్ అనే పేరుతో తమిళ చిత్రాల హీరోగా నటిస్తున్నాడు. ఈ స్వామి అయ్యప్పన్ చిత్రాన్ని తెలుగులోకి డబ్ చేసి విడుదల చేశారు. అన్ని భాషలలోనూ పాటలు, చిత్రం ఘన విజయం సాధించాయి. తెలుగు అనువాదంలోని పాటలలో సింహభాగం యేసుదాసు గారు పాడారు.

ఈ శబరిమలను స్వర్ణ చంద్రోదయం అనే గీతంలో స్వామికి జరిగే అభిషేకాన్ని అందులోని వివరాలను మనకు తెలియజేశారు. ధర్మశాస్త అనగా ధర్మరక్షకుడు. ఆ స్వామికి నిత్యం జరిగే అభిషేకంలో పంచామృతాలు (ఆవుపాలు, పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదారలు), పన్నీరు, విభూతి,పంపానది పుణ్యజలాలు, పుష్పాభిషేకం, చందనాభిషేకం..ఇలా వైభవంగా అర్చన జరుగుతుంది. స్వామియే శరణమయ్యప్పా అని నామస్మరణ మారుమ్రోగుతూ ఉంటుంది ఈ దివ్యక్షేత్రం. ఈ పాట వింటే స్వామిని దర్శించి ఈ సేవలను కళ్లారా చూడాలన్న సంకల్పం కలుగుతుంది.  యేసుదాసు గారు పాడిన పాటను విని తరించండి.

శబరిమలను స్వర్ణ చంద్రోదయం ధర్మరక్షకుని సన్నిధిని అభిషేకం
లోకాల గారవించు అయ్యప్ప స్తోత్రం భక్తితో పాడుకుంటాం హృదయముల

ప్రీతియే ఉల్లమున పాలగును
అదే చల్లని నీ యెదన పెరుగవును
వెన్నయే నీవిచ్చు అనురాగం
నీకు నెయ్యభిషేకమునే జరిపిస్తాం
నీ జాడలలో నడిచే జీవులమయ్యప్పా
ఈ సర్వస్వం నీ ఆశీర్వాదం అయ్యప్పా
అయ్యప్పా శరణమయ్యప్పా అయ్యప్పా శరణమయ్యప్పా

పుణ్యమిచ్చే పన్నీరభిషేకం
జనులు భక్తితో చేసెడి పాలభిషేకం
దివ్య పంచామృతాన అభిషేకం
నీదు తనువంత జ్యోతివలె వెలిగేను
నీ జాడలలో నడిచే జీవులమయ్యప్పా
ఈ సర్వస్వం నీ ఆశీర్వాదం అయ్యప్పా
అయ్యప్పా శరణమయ్యప్పా అయ్యప్పా శరణమయ్యప్పా

దోసిట పుణ్యజలం అందుకొని
అదే నీ పేరు స్తుతియించి శిరసునుంచి
కరుగు విభూతితో అభిషేకం
హరి ఓం అని చందనంతో అభిషేకం
నీ జాడలలో నడిచే జీవులమయ్యప్పా
ఈ సర్వస్వం నీ ఆశీర్వాదమయ్యప్పా
అయ్యప్పా శరణమయ్యప్పా అయ్యప్పా శరణమయ్యప్పా


26, డిసెంబర్ 2016, సోమవారం

మిసైల్ వుమన్, అగ్నిపుత్రి టెస్సీ థామస్ - అగ్ని క్షిపణి ప్రాజెక్టు అధినేత్రి


అగ్ని-5: భారతదేశపు ప్రతిష్ఠాత్మక అణ్వాయుధాలు ప్రయోగించగల ఖండాంతర క్షిపణి ఈరోజు ఒడిషాలోని కలాం ద్వీపం నుండి విజయవంతంగా ప్రయోగించబడింది. ఈ క్షిపణి దాదాపు 5వేల కిలోమీటర్లు, అనగా, మొత్తం ఆసియా ప్రాంతం, ఐరోపా వరకు ప్రయాణించగల అత్యంత శక్తివంతమైనది. 1000 కేజీల క్షిపణి బరువును మోగయగలదు. 17 మీటర్ల పొడవు, 50 టన్నుల బరువు గల ఈ క్షిపణి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అతి వేగంగా వెళ్లగలదు. గతిశీల క్షిపణి కాబట్టి ఇది శత్రువుల రాడార్లలో అంత తొందరగా కనబడదు. భారతదేశపు రక్షణకు ఈ అగ్ని-5 అప్రతిహతమని చెప్పుకోవచ్చు. దీని తరువాతిది అగ్ని-6. ఇప్పటికే ఇది అభివృద్ధిలో ఉంది. అగ్ని-6 భూమిపైనుండే కాకుండా జలాంతర్గామి ద్వారా కూడా ప్రయోగించే వెసులుబాటు ఉంటుంది. అగ్ని-6 8,000-10,000 కిలోమీటర్ల వరకు వెళ్లగలదని శాస్త్రవేత్తల అంచన. అగ్ని-5ను విజయవంతంగా ప్రయోగించటం ఇది నాలుగవ సారి.

ఇంతటి శక్తివంతమైన అగ్ని-5 ప్రాజెక్టుకు సారథి ఎవరో తెలుసా? కేరళకు చెందిన 53ఏళ్ల మహిళా శాస్త్రవేత్త టెస్సీ థామస్. పురుషాధిక్యపు రక్షణ రంగంలో టెస్సీ థామస్ ఓ ధృవతార. అగ్ని-4 ప్రాజెక్టుకు కూడా ఆమే సారథి. పెరిగే వయసులో క్షిపణులు ప్రయోగించే ప్రదేశానికి దగ్గరలో నివసించటంతో ఆమెకు దాని వెనుక ఉన్న సాంకేతిక పరిజ్ఞానంపై మక్కువ ఏర్పడిందిట. త్రిస్సూరులోని ప్రభుత్వ కళాసాలలో ఇంజనీరింగ్ చదివి పునేలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్మమెంట్ టెక్నాలజీలో ఎంటెక్ పట్టాను పొంది రక్షణ శాఖ శాస్త్ర సాంకేతిక పరిశోధన సంస్థైన డీఆర్డీవోలో చేరారు. అగ్ని4,5 ప్రాజెక్టులకే కాదు, అగ్ని-3 ప్రాజెక్టుకు కూడా ఆమె అసోసియేట్ డైరెక్టరుగా పని చేశారు.


మిసైల్ వుమన్, అగ్నిపుత్రిగా పిలువబడే టెస్సీ థామస్ మన బాలబాలికలకు ఆదర్శప్రాయం. మహిళలు కొన్ని పదవులకు పనికిరారు అనే బూర్జువా సిద్ధాంతాలను తప్పని నిరూపించిన మహిళ టెస్సీ. దేశరక్షణకు అత్యంత శక్తివంతమైన ఆయుధాలను ఉత్పత్తి చేసే అతి ముఖ్యమైన రంగంలో రాణించిన టెస్సీ దేశభక్తి అనుపమానం. అగ్ని-5 మరో మారు విజయవంతంగా ప్రయోగించబడినందుకు టెస్సీ బృందానికి శుభాకాంక్షలు. ఇటువంటి వారికి దేశం అత్యున్నత పురస్కారాలైన పద్మ అవార్డులు ఇవ్వకపోవటం దేశానికే సిగ్గుచేటు. జైహింద్. 

బహుముఖ ప్రజ్ఞాశాలి శాంతకుమారి జీవిత విశేషాలు, ముజ్జగాలు మోహించగ గీతం


రాయలసీమ ఎందరో మహనీయులకు, బహుముఖ ప్రజ్ఞాశాలురైన కళాకారులకు జన్మభూమి. అందులో నాటక మరియు సినీ రంగ ప్రముఖులు చాలా ఎక్కువ. చిత్తూరు నాగయ్య గారు, కేవీరెడ్డి గారు, బళ్లారి రాఘవ గారు, పసుపులేటి కన్నాంబ గారు, పద్మనాభం గారు...వీరంతా ఈ రతనాలసీమలో జన్మించినవారే. అటువంటి ప్రజ్ఞాశాలుల కోవకు చెందినవారే శాంతకుమారి గారు. వారి సంగ్రహ చరిత్ర మరియు వారు పాడిన ఓ ఆణిమ్ముత్యం ముజ్జగాలు మోహించగ అనే గీతం వివరాలు.

1920 సంవత్సరం మే 17న కడపజిల్లా పొద్దుటూరు సమీపంలో వెల్లాల శ్రీనివాసరావు, పెదనరసమ్మ దంపతులకు శాంతకుమారి గారు జన్మించారు. ఆవిడకు తల్లిదండ్రులు పెట్టిన పేరు సుబ్బమ్మ. తల్లి శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు, తండ్రి నటులు. ఇద్దరి కళలను పుణికి పుచ్చుకున్న సుబ్బమ్మ చిన్ననాడే సంగీతం అభ్యసించటం మొదలు పెట్టారు. ఆవిడ పీ. సాంబమూర్తిగారి వద్ద సంగీతం నేర్చుకున్నారు. ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసురాలు శ్రీమతి డీకే పట్టమ్మాళ్ గారు సుబ్బమ్మ గారి సహాధ్యాయిని. చిన్నతనంలోనే నాటక సంఘాలలో చేరి 16 ఏళ్లకు ఆకాశవాణి కళాకారిణిగా పేరొందారు. శాస్త్రీయ సంగీత వృత్తిని కొనసాగించటానికి ఆమె చెన్నై వెళ్లారు. అక్కడ విద్యోదయ పాఠశాలలో సంగీత ఉపాధ్యాయినిగా చేరారు. ఆవిడ సంగీత ప్రస్థానంలో సాలూరి రాజేశ్వరరావు గారితో కలసి ఆకాశవాణిలో పాడారు.

1936లో పీవీ దాస్ అనే సినీ ప్రముఖులు అప్పటివరకు శశిరేఖా పరిణయంగా నాటక రంగంలో ప్రసిద్ధి పొందిన కథను మాయాబజార్ అనే చిత్రంగా నిర్మించి దర్శకత్వం వహించాలని పూనుకున్నారు. శశిరేఖ పాత్రకోసం సరైన కళాకారిణి కోసం వెదుకుతుండగా చెన్నై విద్యోదయ పాఠశాలలో సుబ్బమ్మ గాత్రం ఆయన విని ఆయన ఎంతో ముచ్చట పడ్డారు. ఆ అమ్మాయిని సినిమాలో పాత్రకు పంపించవలసిందిగా ఆమె తల్లిదండ్రులను కోరారు. శ్రీనివాసరావు-పెదనరసమ్మ దంపతులకు, సుబ్బమ్మ నాయనమ్మకు ఆమె  సినిమాల్లో చేరటం ఇష్టం లేదు. వారు అమ్మాయి సంగీత కళాకారిణిగానే అభివృద్ధి చెందాలని పట్టుపట్టారు. కానీ, సుబ్బమ్మ తనకు వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని 4 రోజులు నిరాహారదీక్ష చేసింది. తల్లిదండ్రులు ఒప్పుకోక తప్పలేదు. పీవీ దాస్ గారు ఆమె పేరును శాంతకుమారిగా మార్చారు. మాయాబజార్ చిత్రంలో శాంతకుమారి గారు శశిరేఖ పాత్ర వేసి ఎంతో సహజంగా నటించటమే కాదు, పాడారు కూడా. ఈ చిత్రంలో ప్రముఖ నటులు లక్ష్మణ స్వామి గారు అభిమన్యునిగా నటించారు. చిత్రం పెద్ద విజయం సాధించింది.



1937లో పీ.పుల్లయ్య గారు సారంగధర చిత్రాన్ని తీశారు. ఇది ఆయనకు తొలి దర్శకత్వం. అందులో శాంతకుమారిని చిత్రాంగి పాత్రకు ఎంపిక చేశారు. తొలిపాత్ర శశిరేఖ లాలిత్యం కూడినదైతే చిత్రాంగి కపటమైన పాత్ర. ఈ వైవిధ్యాన్ని ఆమె ఎంతో సహజంగా తన నటనలో కనబరచారు. ఆ చిత్రంలో ఆమె త్యాగరాజస్వామి వారి రాగసుధారస అనే కీర్తనను  పాడారు. చిత్రం మంచి విషయం సాధించింది. 28ఏళ్ల పుల్లయ్య గారి మంచితనాన్ని గమనించిన శాంతకుమారి ఆయాన తన నట జీవితాన్ని ప్రోత్సహిస్తారని భావించి ఆయనను వివాహం చేసుకోవాలని కోరారు. అదే సంవత్సరంలో వారిద్దరి వివాహం జరిగింది. ఆ తరువాత శాంతకుమారి నట జీవితం నిరాటంకంగా విజయవంతంగా సాగింది.

శాంతకుమారి గారి చిత్ర ప్రస్థానంలో మరో ముఖ్యమైన మైలురాయి 1943లో విడుదలైన కృష్ణప్రేమ చిత్రం. ఇందులో ఆమె రాధ పాత్ర పోషించారు. మహామహులైన నటీమణులు, గాయనీమణులు పాలువాయి భానుమతి గారు (రాధ సోదరి చంద్రావళిగా), టంగుటూరి సూర్యకుమారి గారు (నారదునిగా, అవును స్త్రీ పురుష పాత్రను ధరించటం ఆరోజుల్లో చాలా అరుదు) ఈ చిత్రంలో నటించారు. ఈ చిత్రం కూడా బాగా విజయం సాధించింది. 1945లో విడుదలైన మాయాలోకం చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు గారికి కథానాయికగా నటించారు. తరువాత 1949లో కేవీరెడ్డి గారి దర్శకత్వంలో విడుదలైన గుణసుందరి కథలో గుణసుందరి (శ్రీరంజని) సోదరి రూపసుందరిగా నటించారు. ఈ చిత్రాన్ని  కూడా ప్రేక్షకులు బాగా ఆదరించారు. 1950లో విడుదలైన షావుకారు చిత్రంలో శాంతకుమారి గారు శాంతమ్మగా నటించారు. ఈ చిత్రంలో నాయిక పాత్ర షావుకారు జానకి గారిది. ఈ చిత్రం అఖండ విజయాన్ని పొందింది. ఈ చిత్రం నుండి దాదాపు శాంతకుమారి పెద్ద వయసు పాత్రలను పోషించటం మొదలు పెట్టారు.



1950 దశకంలో ధర్మదేవత, అర్థాంగి, సారంగధర (ఈ మారు రాణీ రత్నాంగి పాత్ర), బొమ్మల పెళ్లి, జయభేరి మొదలైన తెలుగు చిత్రాలతో పాటు తమిళ సినిమాలో కూడా నటించారు. శాంతకుమారి నటనా జీవితంలో 1960లో విడుదలైన శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం ఓ ముఖ్యమైన మైలురాయి. ఈ చిత్రంలో ఆమె శ్రీనివాసుని తల్లి వకుళమాతగా అద్భుతంగా నటించారు. నటనతో పాటు "ఎన్నాళ్లని నా కన్నులు కాయగ ఎదురు చూతురా గోపాలా" అన్న ఆర్ద్రతతో కూడిన పాటను అద్భుతంగా పాడారు. "వీనుల విందుగ వేణుగానము విని తరించగా వేచితిరా వేచి వేచి నీ వెన్న ముద్దవలె కరగి పోయెరా నా బ్రతుకు" అని ఆమె గళంలో జాలువారిన ఈ పాట నేటికీ వీక్షకుల కళ్లు  చెమరింపజేస్తుంది. ఈ పాట, ఈ చిత్రం ఆమె బహుముఖప్రజ్ఞకు ప్రతిబింబం.

1960 దశకం మొత్తం శాంతకుమారి వయసుకు మించిన పాత్రలు వేశారు. ఆమెకు బాగా పేరు తెచ్చిన పాత్ర రామానాయుడు గారి రాముడు-భీముడు చిత్రంలో అక్క పాత్ర. ప్రేమ, వాత్సల్యంతో నిండిన ఈ పాత్రలో ఆమె ఎన్‌టీఆర్ సోదరిగా అద్భుతంగా నటించారు. శాంతినివాసం, సిరిసంపదలు, రేచుక్క, మురళీకృష్ణ, ప్రేమించి చూడు, ప్రాణమిత్రులు వంటి మంచి చిత్రాలలో నటించారు. తల్లిగా, సవతి తల్లిగా ఆమె వేసిన పాత్రలు చిరస్మరణీయం. శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం చిత్రాన్ని హిందీలోకి భగవాన్ బాలాజీగా అనువదించారు.



శాంతకుమారి గారు మొత్తం మీద 250పైగా చిత్రలలో నటించారు. అందులో 60 తమిళచిత్రాలు. మిగిలినవి తెలుగు. వీటిలో 25పైగా చిత్రాలు రాగిణి మరియు పద్మశ్రీ అనే సొంత  బ్యానర్లపై తీయబడినవే. పద్మశ్రీ సంస్థ పుల్లయ్య వీరి కుమార్తె  పేరున స్థాపించబడింది. శాంతకుమారి  నాగేశ్వరరావు, జగ్గయ్య, జెమినీ గణేశన్, శివాజీ గణేశన్ మొదలైన వారికి తల్లి పాత్రలను పోషించి తెలుగు తమిళ భాషలలో ఎంతో పేరు పొందారు. తెలుగులో విజయవంతమైన చిత్రాలన్నీ దాదాపుగా పుల్లయ్యగారు తమిళంలో మళ్లీ తెరకెక్కించారు. 1970 దశకంలో శాంతకుమారి అక్కా చెల్లెళ్లు, తల్లా పెళ్లామా, ప్రేం నగర్, కొడుకు కోడలు, సెక్రెటరీ, ముత్తైదువ చిత్రాలలో నటించారు.

ఆ తరువాత ఆమె సినీ రంగం నుండి విరమణ తీసుకొని రచనల వైపు మళ్లారు. భక్తి పాటలను రచించారు. 75 ఏళ్ల వయసులో కూడా ఆమె తను శిష్యురాలైన లలితాకుమారికి పాటలు నేర్పించారు. శాంతకుమారి గారు రచించిన భక్తి గీతాలను బాలమురళీకృష్ణా గారు ఆలపించారు. సుదీర్ఘమైన ఆమె సినీజీవితంలో ఆమె ఎన్నో పాటలను పాడారు. వాటిలో  "మోహనాంగ రారా", "ఎవరోయి ఎవరోయి (మాయాలోకం), "ఊగూమా కృష్ణ", "ఇదే ఆనందము" (కృష్ణ ప్రేమ), "కలకల ఆ కోకిలేమో", "చక్కని దొరలేలే చందమామ" (గుణసుందరి కథ), "ఎన్నాళ్లని కన్నులు కాయగ" (శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం), "మనసు తెలిసిన ఓ నాన్న" (తల్లా పెళ్లామా) మొదలైనవి. సినీ గీతాలే కాదు, శాంతకుమారి గారు ఎన్నో ప్రైవేట్ గీతాలను ఆకాశవాణిలో పాడారు.

నటన, నిర్మాణం, గాత్రం, రచన, సంగీతం మొదలైన కళలలో పట్టు సాధించి తన ప్రతిభను తెలుగు, తమిళ ప్రజలకు అందజేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి శాంతకుమారి గారికి 1998లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రతిష్ఠాత్మకమైన రఘుపతి వెంకయ్య అవార్డును ప్రదానం చేసి గౌరవించారు. 16 జనవరి 2006న శాంతకుమారి చెన్నైలో పరమపదించారు.

శాంతకుమారి గాత్ర మాధుర్యం తెలియాలంటే ఆమె పాడిన ఈ మధుర భక్తి గీతం వినాల్సిందే. రాధ మనసులో కృష్ణునిపై గల వివిధ భావనలను ముజ్జగాలు మోహించగ అనే గీతంలో శాంతకుమారి గారు అద్భుత్గమా పండించారు. ఆమె పాటలో భావుకత, రాధ ప్రేమ, స్వామిపై రాధకు గల అధికారం, ఆ స్వామి మోహన మురళీగానంపై గల మక్కువ ప్రస్ఫుటం. గోకులాన్ని వీడి మధుర, ద్వారకలలో ఉన్న శ్రీకృష్ణుని బృందావనం తిరిగి రమ్మని ఎంతో హృద్యంగా వేదుకునే రాధ మనసును శాంతకుమారి ఆవిష్కరించారు. శంఖ చక్రాలు, సారథ్యాలు, అస్త్ర శస్త్రాలన్నీ యమునలో పారవేసి తన వద్దకు రమ్మని కోరే రాధ మనసు శాంతకుమారి గళంలో పరిపూర్ణంగా ప్రతిబింబిస్తుంది. గోకులాన్ని వదలి వెళ్లిన కృష్ణుని పక్షపాతాన్ని ప్రశ్నిస్తూ ఆయన ఏ పక్షం (యుద్ధాలు, సారథ్యాలు ఒకవైపు ప్రేమ సామ్రాజ్యమైన బృందావని ఒకవైపు) అని అడుగుతుంది. ఆ కురుక్షేత్రం మురళి మరియు రాధ కన్నా ఎక్కువా అని ప్రశ్నిస్తుంది. మధురభక్తిలో ఎన్ని భావనలుంటాయో అన్నీ ఈ గీతంలో కవి ఆవిష్కరించగా అంతే అందంగా శాంతకుమారి గారు పాడి దీనిని అజరామరం చేశారు. ఈ పాట ఎవరు రాశారో, ఎవరు స్వరపరచారో తెలియదు. బహుశ సాలూరి వారి స్వరఝరిలో వచ్చిన లలితగీతమేమో అనిపిస్తుంది. ఈ పాట విని తరించండి.

ముజ్జగాలు మోహించగ మురళిని మ్రోయించరా కృష్ణా కృష్ణా

శంఖమేల? చక్రమేల? సారథ్యములేలరా?
అస్త్ర శస్త్రజాలమెల్ల యమున పారవైచి రారా

ఎందుకురా మధురా నగరి? ఎందుకురా ద్వారకాపురి?
బృందావని వీడి నీవు పొందిన సుఖమేమున్నది?

పక్షపాతమేల? నీ పక్షమేది గోపాలా?
మురళి కన్న రాధ కన్న కురుక్షేత్రమేల?


25, డిసెంబర్ 2016, ఆదివారం

కూచిపూడి నృత్యాంశం - కృష్ణ శబ్దం


నృత్య సాంప్రదాయాలలో శబ్దాలకు ప్రత్యేక స్థానం ఉంది. శబ్దాలలో సరళమైన సాహిత్యంతో అభినయంతో వివరణ ఉంటుంది. శబ్దాలలో రెండు నుండి ఐదు చరణాల వరకు ఉండవచ్చు. ఒక్కొక్క చరణం వేర్వేరు అంశాలను ప్రస్తావించవచ్చు. శబ్దాలలో వేగమైన పద విన్యాసములు ఉండవు. భరత నాట్య శైలిలో శబ్దాలలో తొలుత కూర్చబడినవి ఒకే రాగంలా రాగా తరువాత వీటిని రాగమాలికలుగా, మిశ్రచాపు తాళంలో రూపొందించే సాంప్రదాయం వచ్చింది. శబ్దాలు రాజు గారి కొలువులో ఆ రాజు గుణవైభవాలను నుతించే శైలి కూడా ఉంది. ఇస్లాం రాజులను నుతించే కవులు సలాం అనే పదాన్ని కూడా శబ్దాలలో ఉపయోగించారు. కొన్ని ప్రాచుర్యమైన శబ్దాలు - కృష్ణ శబ్దం, రామాయణ శబ్దం, దశావతార శబ్దం, రాజశ్రీ శబ్దం, మండూక శబ్దం, వినాయక శబ్దం మొదలైనవి.

కృష్ణ శబ్దంలో వాసవసజ్జిక అయిన నాయిక నాథుని రాకకై అలంకరించుకొని వేచియుంటుంది. ఆయన గుణాలను వర్ణిస్తూ  లయబద్ధంగా సాగుతుంది. ఇందులో పల్లవి "రారా స్వామి రారా" అనే పద సంపుటిని ఎక్కడైనా పునరుపయోగించుకొని అభినయాన్ని విశదీకరించే అవకాశం ఉంటుంది. కృష్ణ శబ్దం సాహిత్యం పరిశీలిద్దాం.

మోహన రాగం, ఆది తాళంలో కృష్ణ శబ్దం కూర్చబడింది. నాయిక స్వామిని రారా అని పిలుస్తోంది. యాదవకులానికి చంద్రుడైన, సముద్రుని వంటి గంభీరత కలిగిన, వంద కోట్ల మన్మథుల సుందర రూపము కలిగిన, అమితమైన భుజ బలము కలిగిన శూరుని, స్త్రీల మనసులు దోచుకున్న, మేరు పర్వతమంత ధీరత కలిగిన, కవులను పోషించిన, శత్రువులను సంహరించిన, భరత నాట్య శాస్త్రానికి నిధియైన, సరసత కలిగిన రాజును కరుణతో చూచి ఏలుకోమని పరి పరి విధాల  నుతిస్తుంది.

ఈ కృష్ణ శబ్దం అభినయంలో మొదటి రెండు పంక్తులలో విపులంగా అభినయ కౌశల్యాన్ని కళాకారులు ప్రదర్శిస్తారు. స్వామి రారా యదువంశ సుధాంబుధి చంద్ర అనే పంక్తులను పదే పదే పలుకుతూ నాయకుని రాకకై ఆ నాయిక గంధం సిద్ధం చేయటం, పూలు కోయటం, మాలలల్లటం, తనను తాను అలనకరించుకోవటం, నాయకునికై  మాలలల్లటం మొదలైన వాటిని విశదంగా అభినయంతో ప్రదర్శిస్తారు. అలాగే, మొత్తం సాహిత్యాన్ని వివిధ గతులలో కూడా ప్రదర్శిస్తారు. మొత్తం మీద శబ్దాలు కళాకారులు రాజ సభలలో ప్రదర్శించే ఓ ముఖ్యమైన అంశంగా పరిగణించ వచ్చు. ఈ శబ్దాలను అభినయ ప్రాధాన్యమైన కూచిపూడి సాంప్రదాయాలలో ప్రదర్శిస్తారు. ప్రఖ్యాత కూచిపూడి నృత్య కళాకారిణి మంజుభార్గవి గారి కృష్ణ శబ్ద కూచిపూడి నృత్యాన్ని వీక్షించండి.

రారా! స్వామి రారా!
యదువంశ సుధాంబుధి చంద్రా!
రత్నాకర సమ గంభీరా!
శత కోటి మన్మథాకారా!
భాసుర భుజ బల రణ శూరా!
నారీ జన మానస చోరా!
మహా మేరు సమాన ధీరా!
కవి జన పోషక మందారా!
పర రాజ శత్రు సంహారా!
భరత శాస్త్ర నిధి నీవేరా!
నీవేరా, నీవేరా, నీవేరా!
సరసత గల దొర నీవేరా!
మము కరుణ జూచుటకు వేళరా! ఇది వేళరా!
చలమేలరా, మది పూనరా!
నీదానరా, మమ్మేలుకోరా! 

పాతాళ భైరవి – 1951: తెలుగు జానపద చిత్రరాజం

1951 మార్చి 15న విడుదలైన పాతాళ భైరవి తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక కీలక మలుపు. విజయా ప్రొడక్షన్స్ పతాకంపై బి. నాగిరెడ్డి, ఆలూరి చక్రపాణి నిర్మ...