26, డిసెంబర్ 2016, సోమవారం

మిసైల్ వుమన్, అగ్నిపుత్రి టెస్సీ థామస్ - అగ్ని క్షిపణి ప్రాజెక్టు అధినేత్రి


అగ్ని-5: భారతదేశపు ప్రతిష్ఠాత్మక అణ్వాయుధాలు ప్రయోగించగల ఖండాంతర క్షిపణి ఈరోజు ఒడిషాలోని కలాం ద్వీపం నుండి విజయవంతంగా ప్రయోగించబడింది. ఈ క్షిపణి దాదాపు 5వేల కిలోమీటర్లు, అనగా, మొత్తం ఆసియా ప్రాంతం, ఐరోపా వరకు ప్రయాణించగల అత్యంత శక్తివంతమైనది. 1000 కేజీల క్షిపణి బరువును మోగయగలదు. 17 మీటర్ల పొడవు, 50 టన్నుల బరువు గల ఈ క్షిపణి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అతి వేగంగా వెళ్లగలదు. గతిశీల క్షిపణి కాబట్టి ఇది శత్రువుల రాడార్లలో అంత తొందరగా కనబడదు. భారతదేశపు రక్షణకు ఈ అగ్ని-5 అప్రతిహతమని చెప్పుకోవచ్చు. దీని తరువాతిది అగ్ని-6. ఇప్పటికే ఇది అభివృద్ధిలో ఉంది. అగ్ని-6 భూమిపైనుండే కాకుండా జలాంతర్గామి ద్వారా కూడా ప్రయోగించే వెసులుబాటు ఉంటుంది. అగ్ని-6 8,000-10,000 కిలోమీటర్ల వరకు వెళ్లగలదని శాస్త్రవేత్తల అంచన. అగ్ని-5ను విజయవంతంగా ప్రయోగించటం ఇది నాలుగవ సారి.

ఇంతటి శక్తివంతమైన అగ్ని-5 ప్రాజెక్టుకు సారథి ఎవరో తెలుసా? కేరళకు చెందిన 53ఏళ్ల మహిళా శాస్త్రవేత్త టెస్సీ థామస్. పురుషాధిక్యపు రక్షణ రంగంలో టెస్సీ థామస్ ఓ ధృవతార. అగ్ని-4 ప్రాజెక్టుకు కూడా ఆమే సారథి. పెరిగే వయసులో క్షిపణులు ప్రయోగించే ప్రదేశానికి దగ్గరలో నివసించటంతో ఆమెకు దాని వెనుక ఉన్న సాంకేతిక పరిజ్ఞానంపై మక్కువ ఏర్పడిందిట. త్రిస్సూరులోని ప్రభుత్వ కళాసాలలో ఇంజనీరింగ్ చదివి పునేలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్మమెంట్ టెక్నాలజీలో ఎంటెక్ పట్టాను పొంది రక్షణ శాఖ శాస్త్ర సాంకేతిక పరిశోధన సంస్థైన డీఆర్డీవోలో చేరారు. అగ్ని4,5 ప్రాజెక్టులకే కాదు, అగ్ని-3 ప్రాజెక్టుకు కూడా ఆమె అసోసియేట్ డైరెక్టరుగా పని చేశారు.


మిసైల్ వుమన్, అగ్నిపుత్రిగా పిలువబడే టెస్సీ థామస్ మన బాలబాలికలకు ఆదర్శప్రాయం. మహిళలు కొన్ని పదవులకు పనికిరారు అనే బూర్జువా సిద్ధాంతాలను తప్పని నిరూపించిన మహిళ టెస్సీ. దేశరక్షణకు అత్యంత శక్తివంతమైన ఆయుధాలను ఉత్పత్తి చేసే అతి ముఖ్యమైన రంగంలో రాణించిన టెస్సీ దేశభక్తి అనుపమానం. అగ్ని-5 మరో మారు విజయవంతంగా ప్రయోగించబడినందుకు టెస్సీ బృందానికి శుభాకాంక్షలు. ఇటువంటి వారికి దేశం అత్యున్నత పురస్కారాలైన పద్మ అవార్డులు ఇవ్వకపోవటం దేశానికే సిగ్గుచేటు. జైహింద్. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి