16, ఫిబ్రవరి 2016, మంగళవారం

జంధ్యాల హాస్య గుళికలు - రెండవ సంచిక

జంధ్యాల హాస్య గుళికలు - రెండవ సంచిక


జంధ్యాల గారి చిత్రాలలో అగ్రస్థానం నిస్సందేహంగా శ్రీవారికి ప్రేమలేఖ చిత్రానిదే. పొత్తూరి విజయలక్ష్మి గారి కథ ఆధారంగా జంధ్యాల గారు 1984లో రామోజీరావు గారు నిర్మాతగా ఈ చిత్రాన్ని తీశారు. అనుక్షణం నవ్వులు పండించే ఈ చిత్రంలో సంభాషణలు జంధ్యాల గారికి ఎంతో పేరు తెచ్చాయి. తెలుగు చిత్రాలలో క్యాబరే పాటల సినిమా ఒరవడి నుండి బయటకు లాగి మధ్య తరగతి జీవితాలతో తీసే హాస్య చిత్రాలకు నాంది పలికారు జంధ్యాల గారు.

శ్రీవారికి ప్రేమలేఖ చిత్రంతో జంధ్యాల గారి హాస్య సంభాషణా నైపుణ్యం పతాక స్థాయికి చేరుకున్నట్లే. పింజారీ వెధవ, కుంక, శుంఠ వంటి పద ప్రయోగాలు, బూజు పట్టిన ఆవకాయ వంటి పదసమూహాలు, అర్థవంతమైన ప్రాసలు, సినిమాల పిచ్చి-వంటల ప్రయోగాలు మొదలైనవి ఎంత హాయిగా పండించారో. ఈ మాటలతో పాత్రలు మమేకమై సినిమాని ఆద్యంతం రక్తి కట్టించాయి.

ఇందులో ప్రతి మాట, ప్రతి ముఖ కవళిక, నవ్వులు కురిపించేదే. చిత్రంలో ఆనందరావుగా నరేష్, పరంధామయ్యగా సుత్తి వీరభద్రరావు, ఆయన భార్యగా డబ్బింగ్ జానకి, భీముడిగా మిశ్రో, సూర్యంగా విద్యాసాగర్, భాస్కరంగా నూతన్ ప్రసాద్, కామాక్షిగా సంగీత, పూర్ణగా శ్రీలక్ష్మి అద్బుతంగా జీవించారు..ప్రతి కళాకారుడు కూడా మనలను కడుపుబ్బ నవ్విస్తారు. ఆ చిత్రంలో నుండి సన్నివేశాలు, సంభాషణలు ఈ జంధ్యాల హాస్య గుళికలు రెండవ సంచికలో.

**************************************************************

పరంధామయ్య భార్యతో:"అప్రాచ్యపు కుమారుడు భాస్కరానికి అర్భకపు తండ్రి పరంధామయ్య రాయునది..."

భార్య: "అయ్యో అయ్యో అదేమి రాతండీ?"

పరంధామయ్య: "నేను కొన్న కవరు, నేను కన్న కొడుకు. నా ఇష్టమొచ్చినట్టు రాసుకుంటాను నువ్వెవరు అడగటానికి. రాయి!"

"ఒరేయ్ కుంకా"..

భీముడు: "చిత్తం"

పరంధామయ్య: "నిన్ను కాదు"

భీముడు: "అలవాటైపోయింది మహాప్రభో"

పరంధామయ్య: "ఆ ఆ" "నువ్వు టింగురంగడిలా పెళ్లాం చేత సినిమా కథలు చెప్పించుకుంటూ నీ దినవారాలు గడుపుకుంటున్నావ్. నీ అంట్ల వెధవ తమ్ముడు పెళ్లి చేసుకోను గాక చేసుకోనని మొండికెత్తాడు. నువ్వు వెంటనే వాడికో ఉత్తరం రాసి వాణ్ని పెళ్ళికొప్పించు.

ఇట్లు

బుద్ధిలేక మిమ్మల్ని కన్న శుంఠ పరంధామయ్య"

భీముడు: "ఆహా! ఈ చివరి వాక్యం మాత్రం అద్భుతంగా ఉంది మహా ప్రభో!"

పరంధామయ్య: "ఏవిటి ఉత్తరం రాయమన్నదా?"

భీముడు: "ఆహా. కాదు కాదు. శుంఠ పరంధామయ్య అన్నది. ఉన్నదున్నట్టుగా తనని తాను దూషించుకోవటం మహర్షుల్ల వల్ల మాత్రమే అయ్యే పని మహాప్రభో!"

పరంధామయ్య బావమరిది సూర్యం: "హలో బావా...చేతికి కట్టేమిటి బావా"

పరంధామయ్య: "సిగ్గు లేకపోతే సరి. కన్న తండ్రి మాట కాదంటావ్. ఏళ్లొచ్చాయి ఎందుకు? పెళ్లి చూపులేర్పాటు చేశాను రమ్మని రాస్తే రానని ఠలాయిస్తావా? పింజారీ వెధవ. నేనసలు పెళ్లి చూపులైనా చూశానురా? మా నాన్న చూసి ఫలాన పిల్లను కట్టుకోమంటే ఎగిరి గంతేసి చేసుకున్నాను. పిచ్చి పిచి వేషాలు వేసావంటే నీ నవరంధ్రాల్లో మైనం కూరతాను కుంకా.."

పరంధామయ్య భార్య: "ఊరుకోండీ. మీ కొడుకు చేసిన నిర్వాకానికి మా తమ్ముడిని తిడతారేం?"

భీముడు: "అయ్యా! మహా ప్రభువుల వారి వ్యాకరణం తమకు తెలియనిదేముంది చెప్పండీ. వారికి తృతీయ తత్పురుష లేదు. నేను నువ్వు అన్నవి తప్ప అతను ఆమె అనేవే లేవు వారికి. ఇప్పుడు వారిని కరిచిన కుక్కకు పిచ్చెక్కి చచ్చిందనుకోంది. నన్ను కరిచి నువ్వు చచ్చావంటారాయన."

పరంధామయ్య: "చాల్లే ఊరుకో..నన్ను కుక్క కరిచిన విషయం దేశమంతా చెప్పాలా? వెధవ అర్థాయుష్షు కుక్క"

భీముడు: "ఇక వారికొచ్చిన కోపం.."

సూర్యం: "అర్థమైంది లేవయ్యా!"..."బావా!మన చంటి నువ్వేర్పాటు చేసిన పెళ్లి చూపులకు రానని రాశాడు. ఇప్పుడు నేను విశాఖపట్నం వెళ్లి వాడిని కోప్పడైనా తీసుకు రావాలి. అంతే కదా"

పరంధామయ్య: "ఇట్నుంచి ఇటే వెళ్లి చెవులు పట్టుకొని లాక్కురా వెధవని"

భీముడు: "అమ్మ గారు రమ్మన్నారని ఒక్క మాట చెప్పండి సూర్యం బాబు. వెంటనే బయలుదేరుతారు చిన్నబాబు గారు"

పరంధామయ్య: "ఈ ఉచిత సలహాలు వినడం వల్లే మా కొంప బూజు పట్టిన ఆవకాయ జాడీలా ఇంతందంగా తయారయ్యింది. నువ్వు నోర్ముయ్...." బామ్మర్దితో: "నువ్వు మాట్లాడవేం?"

సూర్యం: "నువ్వా ఛాన్స్ ఎక్కడిచ్చావ్ బావా? ఈ ఇంట్లో చెవులకేగా పని..."

పరంధామయ్య: "ఊ! ఊ! వెంటనే వెళ్లు. ఆ వెధవ రానంటే మా బావగారింట్లో వెండి బిందెత్తుకు పోయాడని ఆ ఊళ్లోనే కేసు పెట్టించు. పోలీసులే అరవంకాలేసుకు తీసుకొస్తారు వెధవను. ఇక వాడొచ్చి పెళ్లికొప్పుకుంటే మా భీముడిని తిరపతి పంపించి గుండు గీకిస్తానని వెంకన్నకి మొక్కుకున్నాను."

భీముడు: "మహాప్రభో! నా మీద తమరు మొక్కుకోవటమేమిటి మహాప్రభో! ఇంత దయ భరించలేను. ఈ దాసానుదాసుడికి బొచ్చు భిక్ష ప్రసాదించండి మహాప్రభో"

*************************************************************

కామాక్షి తల్లితో: "కత్తి పట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా తరిగి నూనెలో వేసి.."

పూర్ణ అత్తగారితో: "డబా డబా బాదుతూ ఉంటే.."

కామాక్షి: "అవి చిటపటలాడుతూ ఉడికి..."

పూర్ణ: "కాళ్లకి బుద్ధి చెబుతారన్నమాట.."

భాస్కరం: "మామయ్యా! మన పెళ్లలు...."

సూర్యం: "అబ్బా! నీ పెళ్లాం నా పెళ్లాం అను భాస్కరం. మన పెళ్లాలు అనకు. వినటానికేం బాలెదు.."

పూర్ణ అమ్మతో: "అప్పుడు రామారావొచ్చి.."

కామాక్షి: "నువ్వుండొదినా".."అమ్మా అలా వేగిన వాటి మీద ఉప్పుకారం చల్లి దాచుకుంటే అబ్బా ఎంత బాగుంటుందో..."

పూర్ణ అత్తగారితో: "అబ్బా! ఉండవమ్మా" "అత్తయ్యా! ఇప్పుడే కథ బాగుంటుంది. రామారావు వాణిశ్రీని చూస్తాడన్నమాట. .."

పూర్ణ భర్తతో: "ఆ వచ్చారా? మధ్యలో మాట్లాడించకండే..కథ చెప్తున్నాను."

కామాక్షి భర్తతో: "ఆ కలకత్తా భౌ భౌ వండటం గురించి చెబుతున్నాను మామయ్యా! .."

భాస్కరం భార్యతో: "నా టూరింగ్ టాకీసా! మా అమ్మే దొరికిందా నీకు వేధించుకు తినటానికి?"

సూర్యం భార్యతో: "నా కదిలే మిలటరీ భోజన హోటలా! మా అక్కయ్యే దొరికిందా వేయించుకు తినటానికి..."

పూర్ణ: "అబ్బా ఉండండీ...ఏదో చెబుదామనుకున్నా మర్చిపోయాను.."

భాస్కరం: "సింగినాదం, జీలకర్ర"

కామాక్షి తల్లితో: "ఆ భౌ భౌ మీద జీలకర్ర కూడా వేస్తే చాలా బాగుంటుందమ్మా!"

సూర్యం: "ఆ డీడీటీ వేస్తే ఇంకా బావుంతుంది!!!"

పూర్ణ: "ఉండండీ. సరే! మళ్లీ పాట దగ్గరనుంచీ మొదలుపెడతానేం...కసిగా ఉంది కసి కసిగా ఉంది కలవక కలవక కలిసినందుకు కస్సుమంటోంది...కసిగా ఉంది ఆ కసిగా ఉంది కసిగా ఉంది.."

పరంధామయ్య: "ఆపండీ. ఒక్కొక్కళ్ల గొంతు కోసి సింహద్వారానికి వేళ్లాడదీస్తాను..."

"రేయ్ భాస్కరం. నీ పెళ్లాం పాడకుండా ఉండలేకపోతే దానిని నీ గదికి తీసుకెళ్లి దాని పాటకు తాళం వేస్తూ చావు. నేను బయట తాళమేసుకు చస్తాను. అంతే కానీ ఈ చెవులకు మాత్రం కసి కసిగా ఉంది తిక్క తిక్కగా ఉంది అన్న పాటలు వినిపించాయో నేనే ఓ హత్య చేసి ఆ నేరాన్ని మీ మొగుడూ పెళ్లాల మీదికి తోస్తానూ...హు..."

"రేయ్ సూర్యం. నువ్వూ విను. నీ పెళ్లాం మధ్యాన్నం ఏదో కొత్తరకం పిండి వంట చేసి పోరి పోరి మరీ తినిపించింది. ఇప్పటికి మూడు వాంతులు ఆరు విరేచనాలు అయ్యయి. కలరా వచ్చి చచ్చిందేమో అని అనుమానంగా ఉంది.."

భాస్కరం: "ఓహో! అందుకా ఇందాకటినుంచీ దొడ్లో చెంబట్టుకు తిరుగుతున్నావు? "

పరంధామయ్య కొడుకుతో: "నువ్వు నోరు మూసుకు చావు.."

పరంధామయ్య సూర్యంతో: " పని మనిషి ఆ వంట తిని వెర్రిగా నవ్వుతూ పిచ్చి పిచ్చి వేషాలేస్తోందిట. ఇకనుంచీ నీ పెళ్లాం కొత్త రకం పిండివంటలు మొదలుపెట్టిందో...."...

పక్కనున్న స్థభానికి తలబాదుకోబోయాడు...

**************************************************************

భీముడు ఆనందరావుతో: "పోనీ ఈయన దగ్గర పని మానేసి పొదాం అంటే ఈయన దగ్గర పనిచేసిన వాళ్లకు ప్రపంచంలో ఎవరూ ఉద్యోగ్యం ఇవ్వరు. అదీ నా బాధ. సరే, నన్ను తీసేస్తే నాలాగా అణిగిమణిగి పడుండే మనిషి వారికి దొరకడు, అది ఆయన బాధ. అబ్బా...చచ్చిపోతున్ననంటే నమ్మండీ. అరే ఎవడి మీద కోపమొచ్చినా నాకు గుండు గీయిస్తానంటాడు. అడ్డమైన మొక్కులూ నా మీద మొక్కుకుంటాడు. మొన్నటికి మొన్న ఏదో పాత బాకీ జమ పడితే, అన్నవరం కొండ, తెలుసుగా బాబు ఎంతెత్తో, దాని మీదికి ఆరు సార్లు ఎక్కించి అరవైపొర్లు దండాలు పెట్టిస్తానని మొక్కుకున్నాడు..."

***************************************************************

15, ఫిబ్రవరి 2016, సోమవారం

జంధ్యాల హాస్య గుళికలు - మొదటి సంచిక


జంధ్యాల హాస్య గుళికలు - మొదటి సంచిక


జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తెలుగు సినీ చరిత్రలో హాస్యాన్ని కొత్త స్థాయికి తీసుకు వెళ్లిన మహానుభావులు. ఎటువంటి వెకిలి, ద్వంద్వార్థాలు లేకుండా తెలుగు పదాలతో అద్భుతమైన హాస్యరసాన్ని తన చిత్రాలలో పండించారు. ఆ మహానుభావుడి వల్ల ఎనభై, తొంభయ్యవ దశకాలలో తెలుగు చలన చిత్రాలలో సుత్తి వీరభద్రరావు, వేలు, బ్రహ్మానందం, శ్రీలక్ష్మి వంటి గొప్ప హాస్య కళాకారులు వెలుగొందారు. జంధ్యాల గారికి నివాళిగా ఈ హాస్య గుళికలు శీర్షికన వ్యాసాలు మీకు అందిస్తున్నాను. మొదటి సంచికలో ఆనందభైరవి చిత్రంలో ప్రాసలు మాట్లాడే వీరభద్రరావు, ఈలలు వేసే శ్రీలక్ష్మి, వీరిద్దరి బాధితునిగా సుత్తి వేలు మధ్య పొట్టలు చెక్కలయ్యే సన్నివేశం ఇది.

వీరభద్రరావు పేషెంటుతో: "మింగినట్టున్నావు కొత్త ఆవకాయతో కొండంత వాయ"

పేషెంటు: "చిత్తం. ఆహా! చేయి చూడగానే ఎలా చెప్పగలిగారో మహానుభావులు"

వీరభద్రరావు: "ఆవకాయలో వేడుంటుంది. ఆ వేడి నాలాంటి వాడి గల వైద్యుడికి నాడిలో తెలుస్తుంది రా బోడి..."

వీరభద్రరావు కొడుకుతో: "జంటగా వెళ్లి ఒంటిగా తగలడ్డావేం"..."కోడలేదిరా...కోడలేది అంటే గోడలకేసి నీడల కేసి చూస్తావేంటి రా గూడల జుట్టు వెధవ. ఏ అమ్మేశావా?"

కొడుకు వేలు: "నా ఖర్మ! సినిమాకి వెళ్లామా! అందులో ఓ మాంచి ఫైటింగ్ సీన్ వచ్చింది. హీరో రౌడీలను బాదుతున్నాడు. అది చూసి నీ కోడలు నీ కోడలు కయ్య్ అని అమెరికాకి వినిపించేంత గట్టిగా ఓ ఈల కొట్టింది. దాంతో దీని ముందు సీట్లో కూర్చున్న ఒకావిడ గుండె జబ్బు వచ్చి పడిపోయింది..."

వీరభద్రరావు దిమ్మతిరిగి పడిపోతాడు...

వేలు: "నాన్నా! నాన్నా! నీకు కూడా...నాకంత అదృష్టం కూడానా"..."ఆ ఈల విని ఆపరేటర్ అదిరిపడి సినిమా ఆపేసి లైట్లేశాడు. జనమంతా మాకేసి చూస్తుంటే సిగ్గేసి నేను పారిపోయొచ్చాను. అది మాత్రం కుర్చీ ఎక్కి నిలబడి మిగితా సినిమా కూడా చూపించమంటూ ఈలేసి గోల చేస్తోందక్కడ...."

వీరభద్రరావు: "అబ్బా! మనకా ఈలల గోల ఏల? ఈ ఈలన్నది ఇలలో కలలో మన ఇంటావంటా లేని విద్యే? "

వేలు: "అబ్బా! దాని ఈలతోనే చస్తుంటే మధ్యలో నీ కవిత్వం గోలేమిటి నాన్నా తలవాచిపోతోంది..."

వేలు శ్రీలక్ష్మితో: "ఆగు! ఏమిటే? ఊ! ఏమిటి ఇందాక నువ్వక్కడ చేసిన పని?"

శ్రీలక్ష్మి: "కోప్పడకండీ! అంత శబ్దం వస్తుందని అనుకోలేదు..."

వేలు: "నిన్ను...నిన్ను ఇక జన్మలో బయటికి తీసుకెళితే నా చెవిలో ఈలేసి చంపెయ్యవే"
శ్రీలక్ష్మి: "అంత మాటనకండీ. ఈల వెయ్యటం నాకు మాత్రం ఇష్టమేనా? ఏం చేయను ఎక్కువ సంతోషం కానీ బాధ కానీ కలిగినప్పుడు వేళ్లు వాటంతట అవే దగ్గరవుతాయి, నోటి దగ్గరికి వెళ్లిపోతాయి, లోపలనుంచి గాలి వస్తుంది, బయటకి శబ్దమొస్తుంది. ఇవన్నీ నాకు తెలియకుండానే జరిగిపోతాయండీ..."

వేలు: "నా వల్ల కాదే! ఈలేసే పెళ్లాన్ని ఏలుకోలేను. ఇవాళ్లో రేపో వకీలు గారిని కలిసి నీకు విడాకులిచ్చేస్తాను"

శ్రీలక్ష్మి: "అంటే ఏంటండీ"

వేలు: "కోర్టు వారు ఇక నీకు నాకు ఏ సంబంధం లేదని కాయితం ఇస్తారు..అది.."

దుఃఖంతో శ్రీలక్ష్మి కయ్య్ అని ఈల వస్తుంది

శ్రీలక్ష్మి: "క్షమించండి ఇది బాధ ఈల"

వీరభద్రరావు: "ఓసి నీ బాధ తగలెయ్య.  అమ్మ అమ్మ...గుండిగి కింద పడ్డ అప్పడంలా గుండె చితికిపోయింది కదమ్మా. ఒరేయ్ కుంకాక్షీ. ఇకనుంచి క్షమించమని అదీ మీ ఆవిడనడక్కు. ఆ సంబరంలో మళ్లీ ఈల కొట్టిందంటే ఈ గుండెకి ఆ ఈల జోలవుతుంది. స్వస్తి..పో అవతలకి పో"

వేలు:"నాన్న..నాన్న గుండాడుతోందా?"

వీరభద్రరావు - "ఆ ఆ"

వేలు: "అమ్మబాబోయ్...పదవే లోపలకి పద"

13, ఫిబ్రవరి 2016, శనివారం

కృష్ణభక్తి - నాలుగవ సంచిక

కృష్ణభక్తి - నాలుగవ సంచిక


కృష్ణభక్తిలో మరో ప్రత్యేకత నృత్య హేల. బృందావనంలో గోపికలతో రాసహేలలో, వసంతోత్సవంలో ఆడి పాడే కృష్ణుని వర్ణిస్తూ ఎందరో భక్తులు స్వామి వైభవాన్ని మనకు ఆవిష్కరించారు. వారిలో ప్రముఖులు నారాయణ తీర్థుల వారు. ఆంధ్రనాట తల్లావఝ్ఝుల గోవింద  శాస్త్రిగా జన్మించి తమిళనాట స్థిరపడి నారాయణ తీర్థులుగా పేరుపొందిన ఈ యోగి కృష్ణునిపై భక్తితో అనుపమానమైన, అపురూపమైన కృష్ణలీలా తరంగిణిని రచించారు. నవ రసాలను ఒలికిస్తూ సంస్కృతంలో శ్రీకృష్ణుని లీలావినోదాలను నాట్యశాస్త్రానికి అనువుగా రచించారు. కృష్ణలీలా తరంగిణిలో బాలకృష్ణుని లీలలు మొదలు రుక్మిణీకళ్యాణం చివర.

నారాయణతీర్థులవారి కృష్ణలీలా తరంగిణిలో ఒక ప్రత్యేకమైన లక్షణం బాలకృష్ణుని లీలలను వర్ణనలలో కృష్ణుని ఆకృతిని, వేషభూషలను విశేషంగా ఉట్టంకించటం. బాల గోపాల కృష్ణ పాహి పాహి అనే తరంగంలో ఆ కృష్ణుని మనోజ్ఞంగా వర్ణించారు. ఆ తరంగం విశేషాలు:


బాల గోపాల కృష్ణ పాహి పాహి 

నీల మేఘ శరీరా నిత్యానందం దేహి

కలభ సుందర గమన కస్తూరి శోభితానన 
నళిన దళాయత నయన నంద నందన 
మిళిత గోప వధూజన మీనాంక కోటి మోహన 
దళిత సంసార బంధన దారుణ వైరి నాశన 

యజ్ఞ యజ్ఞ సంరక్షణ యాదవ వంశాభరణ 
యజ్ఞ ఫల వితరణ యతి జన తరణ 
అజ్ఞాన ఘన సమీరణ అఖిల లోక కారణ 
విజ్ఞాన దళితావరణ వేదంత వాక్య ప్రమాణ

వ్యత్యస్త పాదారవింద విశ్వ వందిత ముకుంద 
సత్యాఖండ బోధానంద సద్గుణ బృంద 
ప్రత్యస్తామిత భేద కంద పాలిత నంద సునంద 
నిత్యద నారాయణ తీర్థ నిర్మలానంద గోవింద



బాలుడైన కృష్ణుని పాహి పాహి అని నుతిస్తూ మొదలయ్యే ఈ గీతంలో నీలిమేఘాల రంగుతో శరీరం కలిగిన ఆ బలుని శాశ్వతానందం ప్రసాదించమని వేడుకుంటున్నారు.

ఏనుగులా అందంగా నడిచే, కస్తూరితో శోభించే ముఖము కల, కలువ రేకుల వంటి కన్నులు గలవాడు ఆ నందకుమారుడు. గోపవధువులతో కలిసి ఆడి పాడేవాడు, కోటి మన్మథులకు సమానమైన మోహనాకారుడు అయిన ఆ కృష్ణుడు అతిభయంకరమైన శత్రువులను జయించిన వాడు, భక్తులను సంసార బంధములనుండి విడిపించే వాడు.

లోకకళ్యాణార్థమై ఋషులు చేసే యజ్ఞాలను కాపాడే వాడు, యాదవ వంశమునకు ఆభరణమైన వాడు ఆ కన్నయ్య. యజ్ఞఫలమును స్వీకరించే వాడు, యతులను తరింపజేసేవాడు వీడే. అజ్ఞాన మేఘములను తొలగించేవాడు, సమస్త లోకములకు కారణమైన వాడు ఈ బాలుడు. విజ్ఞానమును చాటే వాడు, వేదవేదాంతములకు ప్రమాణమైన వాడు ఈ బాలకృష్ణుడు.
 
వ్యత్యస్తమైన అడుగులతో (ఒక కాలు మరో కాలును దాటుతూ వేసే అడుగులు) అందమైన పాదములు కలవాడు, అఖండమైన సత్యమును బోధిస్తూ ఆనందించేవాడు, సద్గుణముల రాశి అయినవాడు ఆ బాలకృష్ణుడు. ఎవరిలో అయితే జీవరాశులలో ఉన్న భేదములన్నీ లీనమై మటుమాయమైపోతాయో,ఆతడే ఈ నంద సునందాదులను పాలించే బాలకృష్ణుడు. ఆ గోవిందుడు నారాయణ తీర్థులకు నిత్యము నిర్మలమైన ఆనందాన్ని ప్రసాదించే వాడు.

నారాయణ తీర్థుల వారి భక్తి మార్గము ఈ తరంగంలో ప్రస్ఫుటంగా కనబడుతుంది. లీలావేష్టితమైన శ్రీకృష్ణుని బాల్యము చిలిపి చేష్టలా అనిపించినా, అందులో ఆ బాలుడు వేసిన ప్రతి అడుగూ మానవజాతి ఉద్ధరణకే. మమకారం విహీనమై, పరిపూర్ణమైన ప్రేమ తత్త్వముతో మానవాళికి భేదభావములను మరపింపజేసి, మోహపాశములనుండి విడిపించి శాశ్వతానందాన్ని ప్రసాదించినవాదు కృష్ణుడు. ఈ మార్గంలో మానవునకు శత్రువులైన అరిషడ్వర్గముల నాశనం చేసి వారిని ఉద్ధరించినవాడు. కంసాది దానవుల సంహారం దీనికి సూచిక. ధర్మ సంస్థాపనకు ఈ లీలలు ముందడుగులు. యజ్ఞములు అనగా మనము కామ్యముతో చేసే నిత్యకర్మల యొక్క ఫలాన్ని స్వీకరించి మనలను సోపానములో ముందుకు నడిపించే వాడు ఈ సారథి. సమస్త వేదముల సారము, మూలము ఈ పరమాత్మ పరిపూర్ణ స్వారూపము. అజ్ఞానమును తొలగిస్తూ జ్ఞానాన్ని పంచే జగద్గురువు ఈ కృష్ణుడు. ఈ సందేశాన్ని పరిపూర్ణంగా ఈ తరంగంలో నారాయణ తీర్థుల వారు మనకు అందించారు.

కూచిపూడి నాట్యపద్ధతిలో నారాయణ తీర్థుల ఈ తరంగానికి చాలా ముఖ్యమైన స్థానముంది. ఈ తరంగ నాట్యము లేకుండా ఏ రంగప్రవేశమూ ఉండదు, ఎంత గొప్ప కళాకారులైనా ఈ తరంగాన్ని తమ నాట్యప్రదర్శనలలో ప్రదర్శించకుండా ఉండరు. మోహనరాగంలో కూర్చబడిన ఈ తరంగంలో కళాకారులు భక్తి జ్ఞాన కర్మ యోగములకు ప్రతీకగా పళ్లెము, చెంబుతో నర్తించటం ఆనవాయితీ. సంతులన, లయజ్ఞానం, పారవశ్యం అన్నీ మేళవించి కృష్ణ భక్తిని ఆవిష్కరించే అద్భుతమైన పుష్పం ఈ నారాయణ తీర్థుల వారి తరంగం.

10, ఫిబ్రవరి 2016, బుధవారం

కృష్ణ భక్తి - మూడవ సంచిక

కృష్ణ భక్తి - మూడవ సంచిక



కృష్ణ భక్తిలో ఉన్న ప్రత్యేకత బాలునిగా లాలించి, చేష్టలను దర్శించి, అంతలోనే పరమాత్మగా అనుభూతి చెందటం. దీనినే మధుర భక్తిగా ప్రస్తుతించారు భాగవతులు. రాధ, గోపికలు మొదలు ఎందరో కృష్ణ భక్తులు తమ మధురభక్తితో తరించారు. వారికి స్వామి తప్ప ఇంక వేరే ఏమీ ఉండదు. మనలో కలిగే అన్ని భావనలూ స్వామితోనే పంచుకోవటం మధుర భక్తిలో ఒక లక్షణం. దీనివలన ఎన్ని కష్టాలైనా అవలీలగా దాటారు ఆ భక్తులు. అలాంటి వారిలో అన్నమాచార్యుల వారు అగ్రగణ్యులు. ఆ శ్రీకృష్ణుని బాలుడైన పరమాత్మునిగా భావించారు, అంతలోనే యశోదమ్మగా లాలించారు, గోపెమ్మగా ప్రేమించారు, భక్తునిగా సేవించారు, మణిమాణిక్యములతో పోల్చారు. ఆ మధురభక్తిలో ఎన్నలేని భావనలు, చివరకు శరణాగతితో స్వామికి సమర్పణము.

"భావయామి గోపాల బాలం" అనే సంకీర్తనలో ఎంత మనోజ్ఞంగా వర్ణించారో? ఆ బాల కృష్ణుడు నడుముకు కట్టుకున్న మేఖలము, అలంకరించ బడిన మణి ఘంటిక, మృదువైన శబ్దాలు చేస్తూ విలసిస్తున్నాయిట. కొంటె పదములు వేస్తూ, పెన వేసుకుంటూ, దూరమవుతూ, అద్భుతమైన నటన చేస్తూ ఉన్నాడుట. చిన్ని కృష్ణుని లీలలను ఎదురుగా దర్శించకుండా ఇలా రాయటం అసంభవం.

ఇంతలో ఆ బాలుని నవరత్నాలలో అద్భుతంగా పోల్చారు అన్నమాచార్యుల వారు. యశోద ముంగిట ముద్దులొలికే ముత్యంగా పోల్చారు..అంతటితో ఆగారా? తిద్దరాని మహిమల దేవకీ సుతుడు అన్నారు. ఆయన మహిమలను వర్ణించలేము అని బాలుడైన పరమాత్మ వైభవాన్ని చాటారు. గోపకుల స్త్రీ చేతుల మాణిక్యము, కంసుని పాలి వజ్రము, మూడులోకాలలో కాంతులను విరజిమ్మే పచ్చ, రతికేళిలో రుక్మిణికి పగడము, గోవర్ధన పర్వతానికి గోమేధికము, శంఖ చక్రాల సందులలో వైఢూర్యము, కాళీయుని పడగలపై పుష్యరాగము, శ్రీవేంకటాద్రిలో ఇంద్రనీలము, పాలసముద్రంలో దివ్యరత్నము...ఇవన్నీ ఆ శ్రీకృష్ణుడే. మరి ఆయన మన చెంతనే ఉన్న చిన్ని కృష్ణుడట, మనకు గతిగా నిలిచి కాపాడే కమలాక్షుడట, బాలుని రూపములో తిరిగే పద్మనాభుడట...ఇదీ ముద్దుగారే యశోద అనే సంకీర్తనలో అన్నమాచార్యుల వారు అనుభూతి చెంది కురిపించిన భావామృతవర్షిణి.

మరి ఆ చిన్ని కృష్ణునికి లాలి పాడాలి కదా? ఆయనే యశోదగా, గోపెమ్మలుగా భావించి అద్భుతంగా "లాలనుచునూచేరు లలనలిరుగడలా బాలగండవర గోపాల నిను చాలా" అని లాలించారు. "లలనాజనాపాంగ లలిత సుమచాప జలజలోచన దేవ సద్గుణ కలాప తలపులోపల మెలగు తత్త్వ ప్రదీపా..." అని బాలునికి లాలిపాడారు. అందులో ఒక బాలునిగా భావించారా? ఆ కలువకన్నులు కల వాడు సద్గుణాల రాశిగా, మన తలపులలో మెలిగే తత్త్వ ప్రదీపకునిగా దర్శించి నుతించారు. భక్తిలో జీవాత్మ-పర్మాత్మ తత్త్వములను ఎరిగి దాని నుండి అద్వైత భావనకు చేరుకునేలా మనకు ఇటువంటి సంకీర్తనలను అందించారు.

అందుకే కృష్ణ భక్తి సామ్రాజ్యంలో బాలుడి నుండి జగద్గురువు దాకా శతకోటి రూపానుభూతులకు ప్రత్యేక స్థానాలున్నాయి, అవి అన్నీ కలిపితే మధురమైన భక్తి రస సామ్రాజ్యంగా ప్రకాశిస్తుంది.

గోవింద కృష్ణజై గోపాల కృష్ణ జై!

8, ఫిబ్రవరి 2016, సోమవారం

కృష్ణ భక్తి - రెండవ సంచిక



లీలల ద్వారా మాయాప్రేరితమైన లక్షణాలను తొలగించినవాడు కృష్ణుడు. మన్ను తింటున్నాడని చూచి బాలుడైన తమ్మునిపై ప్రేమతో అన్న బలరాముడు తల్లికి ఫిర్యాదు చేస్తే, ఆ తల్లి కలవరపడి ఏదీ నోరు తెరువు అని అడగగా మొత్తం విశ్వాన్ని నోట చూపించాడు. అంతటితో యశోదకు తాను ఆ బాలుని తల్లి అన్న మాయ నశించి అతనిలో పరమాత్మను దర్శిస్తుంది. ఆ ఘట్టాన్ని సముద్రాల రాఘావాచార్యుల వారు పాండురంగ మహాత్యం చిత్రంలో జయ కృష్ణా ముకుందా మురారీ అనే గీతంలో ఇలా అందంగా వర్ణించారు.

అమ్మా! తమ్ముడు మన్ను తినేనూ.. చూడమ్మా! అని రామన్న తెలుపగా
అన్నా! అని చెవి నులిమి యశోద ఏదన్నా! నీ నోరు చూపుమనగా
చూపితివట నీ నోటను, బాపురే! పదునాల్గు భువన భాండమ్ముల
ఆ రూపము గనిన యశోదకు తాపము నశియించి జన్మ ధన్యత గాన్చెన్

అలాగే,  కాళింది మడుగును అహంకారంతో విషపూరితం చేస్తున్న కాళీయునికి గుణపాఠం చెప్పటానికి ఆ మడుగులో దూకుతాడు. అమ్మో పిల్లవాడు నీట దూకాడు, ఆ సర్పము ఏమి చేస్తుందో అని నందయశోదలు, గోకులమంతా భయపడుతుంది. వారి భయమే కానీ, పరమాత్మ లీలకు ఆటంకమా? ఆ మహాసర్పము మదాన్ని అణచటానికి ఆతని తోక ఒక చేత పట్టుకొని, పడగలపై నాట్యం చేశాడు. విజయుడై అలాగే నీటినుండి బయటకు వచ్చాడు. ఆతని చూసి ఆ నందయశోదలకు కనువిప్పు కలిగింది. తమ బిడ్డ సామాన్యుడు కాదని అర్థమైంది. ఆ ఘట్టాన్ని సముద్రాల వారు ఇలా వర్ణించారు:

కాళీయ ఫణి ఫణ జాలాన ఝణ ఝణ కేళీ ఘటించిన గోపకిశోరా
కంసాది దానవ గర్వాపహార హింసా విదూర పాప విదార

దీనిని మరింత సులువుగా వేటూరి సుందరరామమూర్తిగారు సప్తపది చిత్రంలో ఇలా వివరించారు:

కాళింది మడుగున కాళీయుని పడగల
ఆబాలగోపాలమా బాల గోపాలుని
అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నుల జూడ
తాండవమాడిన సరళి గుండెల నూదిన మురళి ఇదేనా ఆ మురళి

ఇలా ఒకటా రెండా? అవతారం మొత్తం అనుక్షణం ఆ కృష్ణుని లీలలే. ప్రతి ఒక్క లీలకూ ఒక పరమార్థముంది. దానిని అనుభూతి చెందిన నందవ్రజమంతా ఆయన భక్తులైనారు. ఒక్కసారి ఆ స్వామి భక్తి సామ్రాజ్యంలో ఆయనకు దాసులైతే ఇక వేరే ప్రపంచం అక్కరలేదు. అన్నీ ఆయనే, అన్నిటా ఆయనే. రాసలీలలో తన్మయులైన రాధాది గోపికలు ఆయన భక్తులలో అగ్రగణ్యులు. పెంచిపెద్ద చేసిన తల్లిదండ్రులూ ఆయన భక్తులే. ఆడుకున్న సఖులూ ఆయన భక్తులే. అందుకే లీలావినోదభరితమైన కృష్ణభక్తి సామ్రాజ్యం విలక్షణమైనది, అనుపమానమైనది. 

7, ఫిబ్రవరి 2016, ఆదివారం

కృష్ణ భక్తి - మొదటి సంచిక

కృష్ణ భక్తి - మొదటి సంచిక


కృష్ణుని గురించి ఎంతమంది చెప్పినా తనివి తీరదు. అది సంపూర్ణం కాదు. పోతన మొదలు నేటి కవుల వరకు చాల మంది తెలుగుభాషలో స్వామి రూపగుణవైభవాన్ని వివరించే ప్రయత్నం చేశారు. అందులో వేటూరి సుందరరామమూర్తిగారు కూడా ఉన్నారు. "మోహనాల వేణువూదే మోహనాంగుడితడే.." అని ఒక పంక్తిలో పొగిడితే ఇంకొక పంక్తిలో "నీలమై నిఖిలమై కాలమై నిలిచాడే" అని సాగర సంగమం చిత్రంలోని వేవేల గోపెమ్మల మువ్వగోపాలుడే ముద్దు గోవిందుడే అన్న గీతంలో వేటూరి వారు అన్నారు. ఆ సమ్మోహననుని  వేణువు వింటే గోకులం అంతా "నేను" అన్న భావన మరచి ఆ పరమాత్మతో అనుసంధానమై తన్మయత్వంలో మునిగేవారుట. ఆతని రూపము వర్ణించనలవి కానిది.

"కస్తూరీతిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవ మౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయం కంఠేచ ముక్తావళీం గోప స్త్రీ పరివేష్టితోం విజయతే గోపాల చూడామణిం" అని బిల్వమంగళుడు ఆ ముకుంది మోహన రూపాన్ని శ్రీకృష్ణకర్ణామృతంలో వర్ణించే యత్నం చేశాడు. విశాలమైన నుదుటన కస్తూరి తిలకం, వక్షస్థలమున కౌస్తుభ మణి, ముక్కు చివరన కొత్త ముత్యం, చేతిలో వేణువు, చేతులకు కంకణాలు, తనువంతా శ్రీచందనం, కంఠములో ముత్యాలహారం, చుట్టూ గోపికలతో ప్రకాశిస్తున్నాడు ఆ గోపాల చూడమణి.

మరి ఆ కృష్ణుడు ఆకాశం రంగుతో నిఖిలమైనాడు. అంతటా ఆయనే ఉన్నాడు. సృష్టికి పరిణామాలకు లీలావినోదంతో చూస్తూ సాక్షీ భూతుడైనాడు. అందుకే వేటూరి వారు ఆయనను కాలమై నిలిచాడు అన్నాడు. ఇంకొక అడుగు ముందుకు వేసి "గీతార్థ సారమిచ్చి గీతలెన్నో మార్చేనే" అన్నారు. కర్మ చేయటం వరకే నీ వంతు, ఫలాన్ని నాకు వదులు అని చెప్పి మన విదిని మార్చుకునే మార్గం చెప్పాడు ఆ పరమాత్మ. కృష్ణావతారానికి ఒక విశేషమైన, విలక్షణమైన లక్షణముంది. ఆయన అంతటా ఉన్నట్లు అనిపించినా, ఎవ్వరికీ దేనికీ చెందని వాడు. కన్న తల్లికే చెందలేదు, ప్రేమించిన రాధకూ చెందలేదు, పూజించిన బావకూ చెందలేదు. ధర్మం వైపు నిలిచాడు. భక్తికి తలవంచాడు. అందుకే సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఔరా అమ్మక చెల్లా అనే గీతంలో "బాలుడా! గోపాలుడా! లోకాల పాలుడా! తెలిసేది ఎలా ఎలా ఛాంగు భళా" అన్నారు. "అయినవాడే అందరికీ అయినా అందడు ఎవ్వరికీ" అని కృష్ణుని తత్వాన్ని వీలైనంత సులభంగా తెలియజేసే ప్రయత్నం చేశారు.

కృష్ణభక్తికి మూలం ఇదే. మనలను మనం సంపూర్ణంగా స్వామికి సమర్పించుకోవటం. అన్నీ భావనలూ ఆయనవే అని "నేను", "నాది" అన్న భావనలకు దూరమై జీవాత్మను పరమాత్మను ఏకం చేయటం. ఎప్పుడైనా శరణాగతితో ఉన్న కృష్ణభక్తులను చూస్తే ఈ విషయం అవగతమవుతుంది - బాహ్యప్రపంచం పట్టదు, స్వామిని దర్శిస్తూ అనేకునితో ఏకమై రమిస్తూ ఉంటారు..

6, ఫిబ్రవరి 2016, శనివారం

పనీర్‌ గులాబ్ జామూన్



నిన్న ఇంట్లో పాలు విరిగాయి. వెంటనే శ్రీమతి విరిగిన పాలను మూటగట్టించి పనీర్ చేసింది. ఎప్పుడూ పనీర్‌తో కూరేనా? స్వీట్ చేస్తే ఎలా ఉంటుంది అనిపించింది. పనీర్‌తో గులాబ్ జామూన్ బాగుంటుంది అని తను రెసిపీ చెప్పింది. వెంటనే ఆ పనిలో పడ్డాను.

కావలసిన పదార్థాలు:

పనీర్ అరకిలో
మైదాపిండి 50గ్రాములు
కండెన్సుడ్ మిల్క్ (నెస్లె డబ్బా చిన్నది)
బేకింగ్ పౌడర్
కొద్దిగా నెయ్యి
పంచదార అరకిలో
ఏలకులపొడి

తయారు చేసే పద్ధతి:

ముందుగా పనీరును (విరిగిన పాలను మూట కడితే వచ్చే పాల ఉత్పత్తి) గ్రైండరులో వేసి మెత్తగా చేసుకోవాలి.  దానిలో 50 గ్రాముల మైదాపిండి, అరకప్పు కండెన్సుడ్ మిల్క్, బేకింగ్ పౌడర్, కాస్త నెయ్యి వేసి మళ్లీ గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఒక అరగంటసేపు పాత్రలో మూత పెట్టి ఉంచాలి. తరువాత చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. ఒక గిన్నలో అరకిలో చక్కెరలో అరలీటరు నీళ్లుపోసి వేడి చేస్తూ తీగ పాకం చేసుకోవాలి. పాకం సిద్ధమైంది అనటానికి సూచన గరిటతో పైకి తీస్తే తీగలా సాగాలి. పాకంలో ఏలకులపొడిని వేసి కలపాలి.




స్టవ్‌పై నూనె పెట్టి నూనె వెడెక్కిన తరువాత ఉండలను ఒక్కొక్కసారి 4-5 చొప్పున సన్న సెగలో వేయించాలి. ఎక్కువ సెగలో వేయిస్తే లోపల ఉడకదు, పైన మాడిపోయి పాకాన్ని పీల్చదు. ఎర్రగా వేగిన తరువాత వాటిని ఐదు నిమిషాలు చల్లారనివ్వాలి. అప్పుడు ఆ ఉండలను పాకంలో వేయాలి. ఒక అరగంటకు ఉండలు పాకాన్ని పీల్చి పెద్దగా, సాఫ్ట్‌గా అవుతాయి. అంతే! పనీర్ గులాబ్ జామూన్ రెడీ!! 

భక్త ప్రహ్లాద – 1967: పౌరాణిక కళాఖండం

భక్త ప్రహ్లాద తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒకే ఇతివృత్తాన్ని కొత్త కాలపు సాంకేతికత, నటనా శక్తి, సంగీత వైభవం, నిర్మాణ విలువలతో పునర్నిర్మించిన వి...