16, ఫిబ్రవరి 2016, మంగళవారం

జంధ్యాల హాస్య గుళికలు - రెండవ సంచిక

జంధ్యాల హాస్య గుళికలు - రెండవ సంచిక


జంధ్యాల గారి చిత్రాలలో అగ్రస్థానం నిస్సందేహంగా శ్రీవారికి ప్రేమలేఖ చిత్రానిదే. పొత్తూరి విజయలక్ష్మి గారి కథ ఆధారంగా జంధ్యాల గారు 1984లో రామోజీరావు గారు నిర్మాతగా ఈ చిత్రాన్ని తీశారు. అనుక్షణం నవ్వులు పండించే ఈ చిత్రంలో సంభాషణలు జంధ్యాల గారికి ఎంతో పేరు తెచ్చాయి. తెలుగు చిత్రాలలో క్యాబరే పాటల సినిమా ఒరవడి నుండి బయటకు లాగి మధ్య తరగతి జీవితాలతో తీసే హాస్య చిత్రాలకు నాంది పలికారు జంధ్యాల గారు.

శ్రీవారికి ప్రేమలేఖ చిత్రంతో జంధ్యాల గారి హాస్య సంభాషణా నైపుణ్యం పతాక స్థాయికి చేరుకున్నట్లే. పింజారీ వెధవ, కుంక, శుంఠ వంటి పద ప్రయోగాలు, బూజు పట్టిన ఆవకాయ వంటి పదసమూహాలు, అర్థవంతమైన ప్రాసలు, సినిమాల పిచ్చి-వంటల ప్రయోగాలు మొదలైనవి ఎంత హాయిగా పండించారో. ఈ మాటలతో పాత్రలు మమేకమై సినిమాని ఆద్యంతం రక్తి కట్టించాయి.

ఇందులో ప్రతి మాట, ప్రతి ముఖ కవళిక, నవ్వులు కురిపించేదే. చిత్రంలో ఆనందరావుగా నరేష్, పరంధామయ్యగా సుత్తి వీరభద్రరావు, ఆయన భార్యగా డబ్బింగ్ జానకి, భీముడిగా మిశ్రో, సూర్యంగా విద్యాసాగర్, భాస్కరంగా నూతన్ ప్రసాద్, కామాక్షిగా సంగీత, పూర్ణగా శ్రీలక్ష్మి అద్బుతంగా జీవించారు..ప్రతి కళాకారుడు కూడా మనలను కడుపుబ్బ నవ్విస్తారు. ఆ చిత్రంలో నుండి సన్నివేశాలు, సంభాషణలు ఈ జంధ్యాల హాస్య గుళికలు రెండవ సంచికలో.

**************************************************************

పరంధామయ్య భార్యతో:"అప్రాచ్యపు కుమారుడు భాస్కరానికి అర్భకపు తండ్రి పరంధామయ్య రాయునది..."

భార్య: "అయ్యో అయ్యో అదేమి రాతండీ?"

పరంధామయ్య: "నేను కొన్న కవరు, నేను కన్న కొడుకు. నా ఇష్టమొచ్చినట్టు రాసుకుంటాను నువ్వెవరు అడగటానికి. రాయి!"

"ఒరేయ్ కుంకా"..

భీముడు: "చిత్తం"

పరంధామయ్య: "నిన్ను కాదు"

భీముడు: "అలవాటైపోయింది మహాప్రభో"

పరంధామయ్య: "ఆ ఆ" "నువ్వు టింగురంగడిలా పెళ్లాం చేత సినిమా కథలు చెప్పించుకుంటూ నీ దినవారాలు గడుపుకుంటున్నావ్. నీ అంట్ల వెధవ తమ్ముడు పెళ్లి చేసుకోను గాక చేసుకోనని మొండికెత్తాడు. నువ్వు వెంటనే వాడికో ఉత్తరం రాసి వాణ్ని పెళ్ళికొప్పించు.

ఇట్లు

బుద్ధిలేక మిమ్మల్ని కన్న శుంఠ పరంధామయ్య"

భీముడు: "ఆహా! ఈ చివరి వాక్యం మాత్రం అద్భుతంగా ఉంది మహా ప్రభో!"

పరంధామయ్య: "ఏవిటి ఉత్తరం రాయమన్నదా?"

భీముడు: "ఆహా. కాదు కాదు. శుంఠ పరంధామయ్య అన్నది. ఉన్నదున్నట్టుగా తనని తాను దూషించుకోవటం మహర్షుల్ల వల్ల మాత్రమే అయ్యే పని మహాప్రభో!"

పరంధామయ్య బావమరిది సూర్యం: "హలో బావా...చేతికి కట్టేమిటి బావా"

పరంధామయ్య: "సిగ్గు లేకపోతే సరి. కన్న తండ్రి మాట కాదంటావ్. ఏళ్లొచ్చాయి ఎందుకు? పెళ్లి చూపులేర్పాటు చేశాను రమ్మని రాస్తే రానని ఠలాయిస్తావా? పింజారీ వెధవ. నేనసలు పెళ్లి చూపులైనా చూశానురా? మా నాన్న చూసి ఫలాన పిల్లను కట్టుకోమంటే ఎగిరి గంతేసి చేసుకున్నాను. పిచ్చి పిచి వేషాలు వేసావంటే నీ నవరంధ్రాల్లో మైనం కూరతాను కుంకా.."

పరంధామయ్య భార్య: "ఊరుకోండీ. మీ కొడుకు చేసిన నిర్వాకానికి మా తమ్ముడిని తిడతారేం?"

భీముడు: "అయ్యా! మహా ప్రభువుల వారి వ్యాకరణం తమకు తెలియనిదేముంది చెప్పండీ. వారికి తృతీయ తత్పురుష లేదు. నేను నువ్వు అన్నవి తప్ప అతను ఆమె అనేవే లేవు వారికి. ఇప్పుడు వారిని కరిచిన కుక్కకు పిచ్చెక్కి చచ్చిందనుకోంది. నన్ను కరిచి నువ్వు చచ్చావంటారాయన."

పరంధామయ్య: "చాల్లే ఊరుకో..నన్ను కుక్క కరిచిన విషయం దేశమంతా చెప్పాలా? వెధవ అర్థాయుష్షు కుక్క"

భీముడు: "ఇక వారికొచ్చిన కోపం.."

సూర్యం: "అర్థమైంది లేవయ్యా!"..."బావా!మన చంటి నువ్వేర్పాటు చేసిన పెళ్లి చూపులకు రానని రాశాడు. ఇప్పుడు నేను విశాఖపట్నం వెళ్లి వాడిని కోప్పడైనా తీసుకు రావాలి. అంతే కదా"

పరంధామయ్య: "ఇట్నుంచి ఇటే వెళ్లి చెవులు పట్టుకొని లాక్కురా వెధవని"

భీముడు: "అమ్మ గారు రమ్మన్నారని ఒక్క మాట చెప్పండి సూర్యం బాబు. వెంటనే బయలుదేరుతారు చిన్నబాబు గారు"

పరంధామయ్య: "ఈ ఉచిత సలహాలు వినడం వల్లే మా కొంప బూజు పట్టిన ఆవకాయ జాడీలా ఇంతందంగా తయారయ్యింది. నువ్వు నోర్ముయ్...." బామ్మర్దితో: "నువ్వు మాట్లాడవేం?"

సూర్యం: "నువ్వా ఛాన్స్ ఎక్కడిచ్చావ్ బావా? ఈ ఇంట్లో చెవులకేగా పని..."

పరంధామయ్య: "ఊ! ఊ! వెంటనే వెళ్లు. ఆ వెధవ రానంటే మా బావగారింట్లో వెండి బిందెత్తుకు పోయాడని ఆ ఊళ్లోనే కేసు పెట్టించు. పోలీసులే అరవంకాలేసుకు తీసుకొస్తారు వెధవను. ఇక వాడొచ్చి పెళ్లికొప్పుకుంటే మా భీముడిని తిరపతి పంపించి గుండు గీకిస్తానని వెంకన్నకి మొక్కుకున్నాను."

భీముడు: "మహాప్రభో! నా మీద తమరు మొక్కుకోవటమేమిటి మహాప్రభో! ఇంత దయ భరించలేను. ఈ దాసానుదాసుడికి బొచ్చు భిక్ష ప్రసాదించండి మహాప్రభో"

*************************************************************

కామాక్షి తల్లితో: "కత్తి పట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా తరిగి నూనెలో వేసి.."

పూర్ణ అత్తగారితో: "డబా డబా బాదుతూ ఉంటే.."

కామాక్షి: "అవి చిటపటలాడుతూ ఉడికి..."

పూర్ణ: "కాళ్లకి బుద్ధి చెబుతారన్నమాట.."

భాస్కరం: "మామయ్యా! మన పెళ్లలు...."

సూర్యం: "అబ్బా! నీ పెళ్లాం నా పెళ్లాం అను భాస్కరం. మన పెళ్లాలు అనకు. వినటానికేం బాలెదు.."

పూర్ణ అమ్మతో: "అప్పుడు రామారావొచ్చి.."

కామాక్షి: "నువ్వుండొదినా".."అమ్మా అలా వేగిన వాటి మీద ఉప్పుకారం చల్లి దాచుకుంటే అబ్బా ఎంత బాగుంటుందో..."

పూర్ణ అత్తగారితో: "అబ్బా! ఉండవమ్మా" "అత్తయ్యా! ఇప్పుడే కథ బాగుంటుంది. రామారావు వాణిశ్రీని చూస్తాడన్నమాట. .."

పూర్ణ భర్తతో: "ఆ వచ్చారా? మధ్యలో మాట్లాడించకండే..కథ చెప్తున్నాను."

కామాక్షి భర్తతో: "ఆ కలకత్తా భౌ భౌ వండటం గురించి చెబుతున్నాను మామయ్యా! .."

భాస్కరం భార్యతో: "నా టూరింగ్ టాకీసా! మా అమ్మే దొరికిందా నీకు వేధించుకు తినటానికి?"

సూర్యం భార్యతో: "నా కదిలే మిలటరీ భోజన హోటలా! మా అక్కయ్యే దొరికిందా వేయించుకు తినటానికి..."

పూర్ణ: "అబ్బా ఉండండీ...ఏదో చెబుదామనుకున్నా మర్చిపోయాను.."

భాస్కరం: "సింగినాదం, జీలకర్ర"

కామాక్షి తల్లితో: "ఆ భౌ భౌ మీద జీలకర్ర కూడా వేస్తే చాలా బాగుంటుందమ్మా!"

సూర్యం: "ఆ డీడీటీ వేస్తే ఇంకా బావుంతుంది!!!"

పూర్ణ: "ఉండండీ. సరే! మళ్లీ పాట దగ్గరనుంచీ మొదలుపెడతానేం...కసిగా ఉంది కసి కసిగా ఉంది కలవక కలవక కలిసినందుకు కస్సుమంటోంది...కసిగా ఉంది ఆ కసిగా ఉంది కసిగా ఉంది.."

పరంధామయ్య: "ఆపండీ. ఒక్కొక్కళ్ల గొంతు కోసి సింహద్వారానికి వేళ్లాడదీస్తాను..."

"రేయ్ భాస్కరం. నీ పెళ్లాం పాడకుండా ఉండలేకపోతే దానిని నీ గదికి తీసుకెళ్లి దాని పాటకు తాళం వేస్తూ చావు. నేను బయట తాళమేసుకు చస్తాను. అంతే కానీ ఈ చెవులకు మాత్రం కసి కసిగా ఉంది తిక్క తిక్కగా ఉంది అన్న పాటలు వినిపించాయో నేనే ఓ హత్య చేసి ఆ నేరాన్ని మీ మొగుడూ పెళ్లాల మీదికి తోస్తానూ...హు..."

"రేయ్ సూర్యం. నువ్వూ విను. నీ పెళ్లాం మధ్యాన్నం ఏదో కొత్తరకం పిండి వంట చేసి పోరి పోరి మరీ తినిపించింది. ఇప్పటికి మూడు వాంతులు ఆరు విరేచనాలు అయ్యయి. కలరా వచ్చి చచ్చిందేమో అని అనుమానంగా ఉంది.."

భాస్కరం: "ఓహో! అందుకా ఇందాకటినుంచీ దొడ్లో చెంబట్టుకు తిరుగుతున్నావు? "

పరంధామయ్య కొడుకుతో: "నువ్వు నోరు మూసుకు చావు.."

పరంధామయ్య సూర్యంతో: " పని మనిషి ఆ వంట తిని వెర్రిగా నవ్వుతూ పిచ్చి పిచ్చి వేషాలేస్తోందిట. ఇకనుంచీ నీ పెళ్లాం కొత్త రకం పిండివంటలు మొదలుపెట్టిందో...."...

పక్కనున్న స్థభానికి తలబాదుకోబోయాడు...

**************************************************************

భీముడు ఆనందరావుతో: "పోనీ ఈయన దగ్గర పని మానేసి పొదాం అంటే ఈయన దగ్గర పనిచేసిన వాళ్లకు ప్రపంచంలో ఎవరూ ఉద్యోగ్యం ఇవ్వరు. అదీ నా బాధ. సరే, నన్ను తీసేస్తే నాలాగా అణిగిమణిగి పడుండే మనిషి వారికి దొరకడు, అది ఆయన బాధ. అబ్బా...చచ్చిపోతున్ననంటే నమ్మండీ. అరే ఎవడి మీద కోపమొచ్చినా నాకు గుండు గీయిస్తానంటాడు. అడ్డమైన మొక్కులూ నా మీద మొక్కుకుంటాడు. మొన్నటికి మొన్న ఏదో పాత బాకీ జమ పడితే, అన్నవరం కొండ, తెలుసుగా బాబు ఎంతెత్తో, దాని మీదికి ఆరు సార్లు ఎక్కించి అరవైపొర్లు దండాలు పెట్టిస్తానని మొక్కుకున్నాడు..."

***************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి