నిన్న ఇంట్లో పాలు విరిగాయి. వెంటనే శ్రీమతి విరిగిన పాలను మూటగట్టించి పనీర్ చేసింది. ఎప్పుడూ పనీర్తో కూరేనా? స్వీట్ చేస్తే ఎలా ఉంటుంది అనిపించింది. పనీర్తో గులాబ్ జామూన్ బాగుంటుంది అని తను రెసిపీ చెప్పింది. వెంటనే ఆ పనిలో పడ్డాను.
కావలసిన పదార్థాలు:
పనీర్ అరకిలో
మైదాపిండి 50గ్రాములు
కండెన్సుడ్ మిల్క్ (నెస్లె డబ్బా చిన్నది)
బేకింగ్ పౌడర్
కొద్దిగా నెయ్యి
పంచదార అరకిలో
ఏలకులపొడి
తయారు చేసే పద్ధతి:
ముందుగా పనీరును (విరిగిన పాలను మూట కడితే వచ్చే పాల ఉత్పత్తి) గ్రైండరులో వేసి మెత్తగా చేసుకోవాలి. దానిలో 50 గ్రాముల మైదాపిండి, అరకప్పు కండెన్సుడ్ మిల్క్, బేకింగ్ పౌడర్, కాస్త నెయ్యి వేసి మళ్లీ గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఒక అరగంటసేపు పాత్రలో మూత పెట్టి ఉంచాలి. తరువాత చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. ఒక గిన్నలో అరకిలో చక్కెరలో అరలీటరు నీళ్లుపోసి వేడి చేస్తూ తీగ పాకం చేసుకోవాలి. పాకం సిద్ధమైంది అనటానికి సూచన గరిటతో పైకి తీస్తే తీగలా సాగాలి. పాకంలో ఏలకులపొడిని వేసి కలపాలి.
స్టవ్పై నూనె పెట్టి నూనె వెడెక్కిన తరువాత ఉండలను ఒక్కొక్కసారి 4-5 చొప్పున సన్న సెగలో వేయించాలి. ఎక్కువ సెగలో వేయిస్తే లోపల ఉడకదు, పైన మాడిపోయి పాకాన్ని పీల్చదు. ఎర్రగా వేగిన తరువాత వాటిని ఐదు నిమిషాలు చల్లారనివ్వాలి. అప్పుడు ఆ ఉండలను పాకంలో వేయాలి. ఒక అరగంటకు ఉండలు పాకాన్ని పీల్చి పెద్దగా, సాఫ్ట్గా అవుతాయి. అంతే! పనీర్ గులాబ్ జామూన్ రెడీ!!
ప్రసాద్ గారు అమోఘమయిన చిట్కా మరియు వంటకం. నూరూరెంచేట్టు చేసి చూపించారు. ధన్యవాదాలు. వెంటనే నిమ్మకాయ, వినిగార్ వేసి పాలు విరక్కొట్టాలి.
రిప్లయితొలగించండి