11, ఫిబ్రవరి 2017, శనివారం

తాళ్లపాక అన్నమాచార్యుల సంకీర్తన పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా


పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా! మమ్మునెడయక వయ్యా! కోనేటి రాయడా!

కోరి మమ్మునేలినట్టి కుల దైవమా! చాల నేరిచి పెద్దలిచ్చిన నిధానమా!
గారవించి దప్పి దీర్చు కాల మేఘమా! మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా! 

భావింప గైవసమైన పారిజాతమా! మమ్ము చేవ దీర గాచి నట్టి చింతామణీ! 
కామించి కోరికలిచ్చే కామధేనువా! మమ్ము తావై రక్షించేటి ధరణీధరా! 

చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా! రోగాలడచి రక్షించే దివ్యౌషధమా! 
బడిబాయక తిరిగే ప్రాణ బంధుడా! మమ్ము  గడియించినట్టి శ్రీ వేంకటనాథుడా!

తాత్పర్యం:

ఓ పురుషోత్తముడా! నీ రూపాన్ని కాంచితిమి! మమ్ములను విడిచి వెళ్లకు ఓ వేంకటేశ్వరా!

మమ్ములను కాపాడే కులదైవమా! బాగా సాధన చేసిన పెద్దలు మాకందించిన నిధివి నీవు! ఆదరించి దప్పిక తీర్చే నల్లని మేఘాలవంటి వాడవు! మాకు దగ్గరగా చిత్తములో ఉన్న శ్రీనివాసుడవు నీవు!

తలచినంతనే మాకు దక్కే పారిజాతము నీవు! మమ్ములను కాపాడి శక్తినిచ్చే చింతామణివి నీవు! కోరినంత కోరికలను తీర్చే కామధేనువు నీవు! మాకు నీడయై రక్షించేటి ధరణీపతివి నీవు!

మేము చెడిపోకుండా బ్రతికించే సిద్ధమైన మంత్రానివి నీవు! మా రోగాలను మటుమాయం చేసి కాపాడే దివ్యమైన ఔషధము నీవు! మా వెంటే ఉండే ప్రాణ బంధువు నీవు! మమ్ములను సృష్టించిన శ్రీవేంకటనాథుడవు నీవు!

భావార్థం:

తాళ్లపాక అన్నమాచార్యుల వారి సంకీర్తనలలో ఈ పొడగంటిమయ్యా ఓ ప్రత్యేకమైనది. శ్రీనివాసుని మహత్తును మూడు చరణాలలో అద్భుతంగా ఆయన వర్ణించారు. ఎందరికో కులదైవమైన ఈ శ్రీవేంకటేశ్వరుడు తన భక్తులను కాపాడుతూ కలియుగంలో మనకు రక్షగా ఉన్నాడు. ఆ భావనను ఈ సంకీర్తనలో మనకు అన్నమయ్య ఎంతో చక్కగా వివరించారు. యోగులు, సిద్ధులు, తపస్సంపన్నులు సాధనతో దర్శించిన స్వామి మన పాలిటి ఎనలేని సంపద. దాహంతో ఉన్నప్పుడు కాలమేఘంలా సమృద్ధిగా వర్షించే వానిగా శ్రీనివాసుని అన్నమయ్య మొదటి చరణంలో నుతించారు. పారిజాత వృక్షము మన పురాణాలలో చెప్పబడిన కల్పవృక్షము. అనగా మన కోరికలను తీర్చేది. భక్తితో తలచినంతనే కల్పవృక్షంలా వరములిచ్చే స్వామి ఆ శ్రీనివాసుడు. అలాగే చింతామణి కూడా. మనలను కష్టాలలో కాపాడి శక్తినిచ్చే చింతామణి ఆ వేంకటపతి. ఈ కోవకు చెందినదే కామధేనువు. స్వార్థం లేకుండా భక్తితో శరణాగతితో తలచినంతనే వాటిని సాకారం చేసే గోమాత ముక్కోటి దేవతలకు నెలవు. ఆ కామధేనువు వంటి వాడు కలియూగంలో తిరుమలలో వెలసిన స్వామి. మనలను ఎల్లవేళలా కాపాడే ఆ ధరణీపతి ఆయన. ఈ భావాన్ని ఎంతో రమ్యంగా రెండవ చరణంలో అన్నమయ్య తెలిపారు. తప్పుదారి పట్టిపోయే మానవులను సరైన మార్గంలో నడిపించి బ్రతుకు దారి చూపించే సిద్ధ మంత్రము ఆ స్వామి. మనలోని రోగాలను మాయం చేసి కాపాడే ఔషధము వంటి వాడు ఆ శ్రీనివాసుడు. ఇక్కడ రోగాలంటే దేహానికి సంబంధించినవే కాదు, మనసులోని మాలిన్యాలు కూడా. భక్తుల కోసం అలసిపోకుండా వారి వెంటే ఉండి రక్షించే ప్రాణబంధువు ఆ స్వామి. ఈ సృష్టి స్థితికి కారణమైన వాడు ఆ శ్రీవేంకటపతి. ఈ విధంగా మూడవ చరణంలో స్వామిని భవరోగ వైద్యునిగా, ప్రాణబంధువుగా, పరమాత్మగా ప్రస్తుతించారు అన్నమయ్య.

కలియుగంలో శ్రీవేంకటేశ్వరుని వైభవాన్ని, మహాత్మ్యాన్ని  అన్నమాచార్యుల వారు ఆయన వేల సంకీర్తనల ద్వారా మనకు అనుభవపూర్వకంగా దార్శనికుడై అందించాడు. అందుకే ఆయన సంకీర్తనలు ఏవో మామూలు పాటలు కావు. అవి మంత్రసమానమైనవి. వాటిలోని భావాన్ని అర్థం చేసుకుంటే మనలోని మాలిన్యాలను తొలగించుకొని మనలోనే ఉన్న స్వామిని కనుగొనేందుకు అవి అద్భుతమైన సాధనాలు. శ్రీగురుభ్యో నమః.

ఈ సంకీర్తనను అన్నమాచార్యుల వారి సంకీర్తనా సారాన్ని మనకు అందించే సేవను హైదరాబాదులోని అన్నమాచార్య భావనా వాహిని ద్వారా ముడున్నర దశాబ్దాల నుండి నిస్స్వార్థంగా అందిస్తున్న డాక్టర్ శోభారాజు గారి గాత్రంలో మోహనరాగంలో వినండి. ఈ సంకీర్తనను అన్నమయ్య చిత్రంలో బాలసుబ్రహ్మణ్యం గారు చాలా భావపూరితంగా పాడారు. 

శంకరభగవత్పాద విరచిత హనుమద్ పంచరత్న స్తోత్రం


వీతాఖిలవిషయేచ్ఛం జాతానందాశ్రుపులకమత్యచ్ఛమ్
సీతాపతి దూతాద్యం వాతాత్మజమద్య భావయే హృద్యమ్

తరుణారుణముఖకమలం కరుణారసపూరపూరితాపాంగమ్
సంజీవనమాశాసే మంజులమహిమానమంజనాభాగ్యమ్

శంబరవైరిశరాతిగమంబుజదళ విపులలోచనోదారమ్
కంబుగళమనిలదిష్టం బింబజ్వలితోష్ఠమేకమవలంబే

దూరీకృతసీతార్తిః ప్రకటీకృతరామవైభవస్ఫూర్తిః
దారితదశముఖకీర్తిః పురతో మమ భాతు హనుమతో మూర్తిః

వానరనికరాధ్యక్షం దానవకులకుముదరవికరసదృశమ్
దీనజనావనదీక్షం పవనతపః పాకపుంజమద్రాక్షమ్

ఏతత్పవనసుతస్య స్తోత్రం యః పఠతి పంచరత్నాఖ్యమ్
చిరమిహ నిఖిలాన్భోగాన్భుంక్త్వా శ్రీరామభక్తిభాగ్భవతి

అన్ని కోరికలను జయించిన వాడు, ఆనందబాష్పాలతో రామభక్తి సామ్రాజ్యంలో పులకించే వాడు, అత్యంత నిర్మలమైన వాడు, రామదూత అయిన వాయుపుత్రుని నా హృదయములో ధ్యానిస్తున్నాను.

ఎర్రని సూర్యుని వంటి ముఖ కమలము కల వాడు, కరుణారసమును కన్నుల నిండా కలిగిన వాడు, సంజీవనితో ప్రాణాలను నిలిపే వాడు, మంజుల మహిమాన్వితుడైన అంజనీ వరపుత్రుని నేను తలచుచున్నాను.

మన్మథుని బాణముల కన్నా వేగవంతుడు, వికసించిన కలువల వంటి కన్నులలో కరుణ కలిగిన వాడు, శంఖము వంటి మంచి ఆకృతితో కంఠం కలవాడు, వాయుదేవునకు ప్రియుడు, ఎర్రని దొండపండు వలె ప్రకాశించే పెదవులు కలిగిన హనుమంతుని నేను శరణు కోరుచున్నాను.

సీత ఆర్తిని దూరం చేసిన వాడు, రామ వైభవానికి స్ఫూర్తికారకుడు, దశముఖ రావణుని కీర్తిని పటాపంచలు చేసిన వాడు అయిన హనుమంతుని రూపము నా ఎదుట నిలచు గాక.

వానర సమూహానికి నాయకుడు, రాక్షససమూహమనే తెల్లకలువల పాలిట సూర్యకిరణముల వంటి వాడు (తెల్ల కలువలు రాత్రి విరిసి సూర్యకిరణాలకు వాడిపోతాయి), దీనజనులను కాపాడే దీక్షలో ఉన్నవాడు, వాయుదేవుని తపః ఫల సంపన్నుడు అయిన హనుమంతుని దర్శిస్తున్నాను.

పంచరత్నమనే ఈ స్తోత్రాన్ని పఠించిన వారు ఇహములో సమస్త భోగభాగ్యములను పొంది శ్రీరామభక్తి అనే పరభాగ్యమును పొందెదరు.

శంకరభగవత్పాద విరచిత హనుమద్ పంచరత్న స్తోత్రాన్ని బొంబాయి సోదరీమణులు సరోజ-లలిత ఆలపించగా వినండి

6, ఫిబ్రవరి 2017, సోమవారం

మేఘ సందేశం - దేవులపల్లి కృష్ణశాస్త్రి సుందర కవితావేశం

మేఘ సందేశం (దేవులపల్లి కృష్ణశాస్త్రి)
=============================



ఉదయగిరిపైన అదిగొ గగనాన
కదలె దినరాజు తేరు
ఒదిగి చిరుగాలి నిదుర తెర జారి
కదలె గోదారి నీరు

ఏ సీమల ఏమైతివో ఏకాకిని నా ప్రియా
ఏలాగీ వియోగాన వేగేనో నా ప్రియా
ఏలాగీ మేఘమాసమేగేనో ప్రియా ప్రియా ప్రియా
గడియ గడియ ఒకశిలయై కదలదు సుమ్మీ
ఎదలోపల నీ రూపము చెదరదు సుమ్మీ
పడిరావాలంటే వీలుపడదు సుమ్మీ వీలుపడదు సుమ్మీ!

ఊపి ఊపి మనసునొక్కొక్క వేదన 
కావ్యమౌను మరియు గానమౌను
నేటి బాధ నన్ను మాటాడగానీని
ప్రళయమట్లు వచ్చి పడియె పైని

దారులన్నియు మూసె దశదిశలు ముంచెత్తె
నీరంధ్ర భయదాంధకార జీమూతాళి
ప్రేయసీ ప్రేయసీ వెడలిపోయితివేల
ఆ అగమ్య తమస్వినీ గర్భ కుహరాల

లోకమంతా పాకినవి పగటి వెలుగులు
నాకు మాత్రం రాకాసి చీకట్ల మూలుగులు రాకాసి చీకట్ల మూలుగులు

ఎపుడు నీ పిలుపు వినబడదో
అపుడు నా అడుగు పడదు
ఎచ్చటికో పయనమెరుగక
ఎందుకో వైనమందక నా అడుగు పడదు

అది ఒకానొక మలిసందె ఎదుట గౌతమీ నది
ఇరు దరులొరసి మింటి చాయలను నెమరు వేసుకొనుచు సాగినది
అపుడు అపుడే కలిగె నాకొక్క దివ్యానుభూతి కలిగె నాకొక్క దివ్యానుభూతి

శూన్యాకాశము వలె చైతన్య లవము లేని బ్రతుకు దారుల
శోభానన్యంబు ఒక శంపాలత కన్యక తొలివలపు వోలె కాంతులు నించెన్ 

అంతరాంతరమున వింత కాంతి నిండి
ఊహలకు రెక్కలొచ్చి ప్రత్యూష పవన లాలనమునకు విచ్చు సుమాల వోలె
అలది కవితలు వెలువడె 

అంతలోన 

కనుమొరగి చనె మెరపు చీకటులు మిగిలె
అపుడు ఎలుగెత్తి పిలిచినాను
అపుడు దారి తెలియక వెలుగు కొరకు రోదించినాను రోదించినాను
వెదకి వెదకి వేసారితి వెర్రినైతి

ఆశలు రాలి ధూళి పడినప్పుడు
గుండెలు చీల్చు వేదనావేశము వ్రేల్చినప్పుడు
వివేకము గోల్పడి సల్పినట్టి 
ఆక్రోశము రక్తబిందువులలో రచియించితి నేను 
మేఘసందేశము రూపుదాల్చెనది నేడు
ఇది ఏమి మహా కవిత్వమో 

శోకమొకటియె కాదు సుశ్లోకమైన కావ్యమునకు జీవము పోయె
కరుణ ఒకటె కాదు రసము జీవితము నా కవికి వలయు ఎన్నో వివిధానుభూతులు ఎడద నిండ 

నా అన్వేషణ ఎన్నడేన్ సఫలమై నా మన్కియే పూవులున్ 
కాయల్ పండ్లును నిండు నందనముగా నైనన్ వ్యథావేదనల్ 
మాయంబై సుఖ శాంత జీవనము సంప్రాప్తించి పూర్ణుండనై 
వ్రాయంజాలుదు స్వానుభవ దివ్య కావ్య సందోహమున్

అద్భుత కావ్యకన్యకను ఆవిష్కరించగలిగిన శక్తి, సరస్వతీ అనుగ్రహం కేవలం దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికి దక్కింది. మేఘ సందేశం చిత్రంలో ప్రకటితమైన ఈ భావ గంగా ప్రవాహం ఆ చిత్రానికి వన్నె తెచ్చింది. రమేష్ నాయుడు గారి సంగీతం, ఏఎన్నార్ గారి అద్భుతనటనా కౌశలం భావకవి మనోవేదనను పరిపూర్ణం చేశాయి. ఏమి పద ప్రయోగం? ఏమి భావావేశం? ఏమి మనోగతం? ఏమి లయబద్ధమైన భావ రసగంగాప్రవాహం? రాగమాలికగా రమేష్ నాయుడు గారు కృష్ణశాస్త్రి గారి కావ్యకన్యకకు ప్రాణం పోస్తే పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ బిరుదులతో అలంకరించబడిన సరస్వతీ పుత్రుడు కేజే యేసుదాసు గారు ఎంతో అద్భుతంగా గానం చేసి కావ్యకన్యకను శాశ్వతం చేశారు. నిన్న రాత్రి 10:00 నుండి 11:00 వరకు ఎఫ్.ఎం రేడియోలో దేవులపల్లి వారి జీవిత విశేషాలు ప్రసారమైనాయి, అందులో భాగంగా ఈ కావ్యకన్యకను విన్నప్పుడు తెలుగుదనం రోమాంచమై నాలో అణువణువు జాగృతమైంది. భావావేశంతో కన్నీళ్లు రాలాయి. నిజంగా దేవులపల్లి, యేసుదాసు,రమేష్ నాయుడు, అక్కినేని వంటి కళామతల్లి ముద్దుబిడ్డలకు జన్మనిచ్చి భరత భూమి ధన్యత పొందింది. మీరు కూడా  వీరి అపూర్వ కలయికలో ఆవిష్కరించబడిన మేఘసందేశ కావ్య కన్యకను విని ఆనందించండి. కృష్ణశాస్త్రి గారి భావౌన్నత్యాన్ని ఆస్వాదించండి.

5, ఫిబ్రవరి 2017, ఆదివారం

హిమాచల తనయ - శ్యామశాస్త్రుల వారి ఆనందభైరవి వైభవం


కర్ణాటక సంగీత త్రిమూర్తులుగా ప్రసిద్ధి పొందిన సమకాలీకులు కాకర్ల త్యాగరాజు, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితులు. శ్యామ శాస్త్రులు వీరి మువ్వురిలో పెద్దవారు. ఈయన సంగీతానికి పుట్టిల్లైన తంజావూరు దగ్గరి తిరువారూరులో విశ్వనాథ అయ్యరు, వేంగలక్ష్మి దంపతులకు 1762 (కొన్ని మూలాల్లో 1763గా ఉంది) జన్మించాడు. వేంకటసుబ్రహ్మణ్య అయ్యరుగా నామకరణం చేయబడినా, శ్యామకృష్ణ అన్న ముద్దు పేరుతో పిలువబడ్డాడు.వీరి కులదైవము తంజావూరులో ఉన్న బంగారు కామాక్షీ దేవి. శ్యామకృష్ణులు పసిప్రాయంలోనే తెలుగు, సంస్కృతము, తమిళ భాషలలో ప్రావీణ్యం సంపాదించారు. చిన్నతనంలోనే నారదులు ఈయనపై అనుగ్రహించి సంగీతస్వామి అనే సన్యాసి రూపంలో వీరి ఇంటికి వచ్చి, ఈ బాలునిలో ఉన్న దైవత్వాన్ని గుర్తించి, శ్యామకృష్ణునికి సంగీత జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. తంజావూరు శరభోజీ మహారాజు మన్ననలు పొందినా శ్యామశాస్త్రులు పెద్దగా శిష్యవారసత్వాన్ని సమకూర్చుకునే ఆసక్తి చూపలేదు.


శ్యామశాస్త్రులు త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితుల వలెనే అనేక క్షేత్రాలను దర్శించి అక్కడ వెలసిన దేవతా స్వరూపాలను నుతించారు. మదురై మీనాక్షి, తంజావూరు బంగారు కామాక్షిలపై శ్యామశాస్త్రులు ఎన్నో కీర్తనలు రచించారు. అలాగే, తంజావూరు బృహదీశ్వరుని నాయికయైన బృహన్నాయకీ దేవిపై ఆనందభైరవిలో 'హిమాచల తనయ బ్రోచుటకిది మంచి సమయము', మధ్యమావతిలో 'బృహన్నాయకి నన్ను బ్రోవు వేగమే' వంటి అద్భుతమైన కీర్తనలను రచించారు. ఆనందభైరవి ఆయనకు ప్రాణప్రదమైన రాగం. ఆ ఆనందభైరవిలో ఆయన విశేషమైన కృతులను రచించారు. వాటిలో బాగా ప్రచారం పొందినది 'హిమాచల తనయ బ్రోచుటకిది మంచి సమయము రావే' అన్న కృతి. దానిని పరిశీలిద్దాం.

హిమాచల తనయ! బ్రోచుటకిది మంచి సమయము రావే అంబా!

కుమార జననీ సమానమెవరిలను!! మానవతి! శ్రీ బృహన్నాయకి!

సరోజముఖి! బిరాన నీవు వరాలొసగుమని నేను వేడితి!
పురారి హరి సురేంద్రనుత! పురాణి! పరాముఖమేలనే తల్లి!

ఉమా! హంసగమా! తామసమా? బ్రోవ దిక్కెవ్వరు? నిక్కముగ
ను మాకిపుడభిమానము చూపు! భారమా? వినుమా దయతోను!

సదా నత వరదాయకి! నిజ దాసుడను! శ్యామక్రృష్ణ సోదరి
గదా! మొర వినవా!! దురిత విదారిణి! శ్రీ బృహన్నాయకి!

ఆది పరాశక్తి రూపమైన బంగారు కామాక్షి సాక్షాత్కారం పొందిన వాగ్గేయకారులు శ్యామశాస్త్రి. అందుకే అమ్మతో సంభాషణలు, ప్రశ్నించే ధోరణి, శరణాగతి మొదలైన అనేక భావనలను ఆయన తన కృతులలో వ్యక్త పరచారు. హిమవంతుని పుత్రిక అయిన పార్వతీ దేవిని ఈ కృతిలో తన మొరలు విని కాపాడుమని వేడుకుంటున్నారు. కుమారస్వామి తల్లి అయిన ఆ పార్వతీదేవికి ఈ విశ్వంలో సమానమెవరు అని నుతించారు. తంజావూరు బృహదీశ్వరాలయం వెళితే అక్కడ అమ్మ బృహన్నాయకిగా దర్శనమిస్తుంది. ఆ తల్లిని ఈ కృతిలో శ్యామశాస్త్రుల వారు పలుమార్లు ప్రస్తావించారు. "కలువవంటి ముఖము గల అమ్మవు, నిన్ను త్వరగా వరములివ్వమని వేడుకున్నాను, శివుడు, విష్ణువు, ఇంద్రులచే నుతించబడిన అమ్మవు, పురాణములలో చెప్పబడిన తల్లివి, నావైపు కరుణతో కూడిన చూపులనెందుకు ప్రసాదించవు" అని ప్రశ్నించారు. "ఓ పార్వతీ దేవి! హంసలా నడిచే తల్లీ! నాపై కోపమా? నువ్వు తప్ప నన్ను బ్రోచే దిక్కెవ్వరు? నిశ్చయముగా నాపై అభిమానము చూపుము తల్లీ! నేనొక భారమా నీకు, నా మొరలను దయతో వినుము" అని వేడుకున్నారు. "వేడుకునే వారికి ఎల్లప్పుడూ వరాలనొసగే తల్లివి! నీ నిజదాసుడను నేను. నువ్వు నల్లనయ్య శ్రీకృష్ణుని సోదరివి కదా! నా మొర వినవా! మా కష్టాలను తొలగించే బృహన్నాయకీ!" అని ప్రస్తుతించారు.

శ్యామశాస్త్రుల వారి సాహితీ వైభవంలో ఆధ్యాత్మికత, తెలుగుదనం గుబాళిస్తాయి. ఇవే ఆయన రచనలకు ఓ ప్రత్యేకతనించ్చి సంగీత త్రయంలో ఒక్కరిగా నిలిచేలా చేశాయి. ఆనందభైరవి రాగం సప్తస్వర సంపూర్ణమై వినేవారికి ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ రాగానికి ప్రాణం పోసి ప్రాచుర్యానిచ్చింది శ్యామశాస్త్రుల వారే. ఈ రాగానికి రోగాలను నియంత్రించే అపూర్వమైన శక్తి ఉందని సంగీత వైద్యశాస్త్ర నిపుణుల పరిశోధనలు తెలుపుతున్నాయి. రక్తపోటు, కృంగుబాటు మొదలైన రుగ్మతల నియంత్రణకు ఈ రాగం ఉపయోగకరమని వారి అభిప్రాయం. మాధుర్య ప్రధానమైన ఈ రాగం ఆనందదాయకమై సంతృప్తిని కలుగుజేస్తుందని వారి నమ్మకం. వివాహాలలో శుభకరంగా ఈ రాగాన్ని ఆలపించటం ఓ సాంప్రదాయం. ఎన్నో చలన చిత్ర గీతాలు కూడా ఆనందభైరవి రాగంలో వచ్చాయి. శ్యామశాస్త్రి వారిదే మరో రచన మరి వేరే గతి యెవరమ్మా అన్న కీర్తన ఈ ఆనందకరమైన భావనతోనే మనసును ఆహ్లాదపరచేలా ఉంటుంది. అందుకే ఆనందభైరవి అనగానే శ్యామశాస్త్రి వారు గుర్తుకు వస్తారు. ఈ కృతిని సౌమ్య గారి గాత్రంలో వినండి.

4, ఫిబ్రవరి 2017, శనివారం

నీ చరణ కమలాల నీడయే చాలు - సినారె మధుర గీతం


సింగిరెడ్డి నారాయణరెడ్డి గారి పాటల్లో తెలుగుదనం యొక్క ప్రస్థానం అలా అలా మృదుమధుర పద సోపానంలా ఉంటుంది. లలితమైన పదాలు, మాధుర్యభరితమైన పదజాలాలు, మనసును హత్తుకునే భావాలు ఆయన పాటల ప్రత్యేకత. 1967లో విడుదలైన శ్రీకృష్ణావతారం అనే పౌరాణిక తెలుగు చలన చిత్రంలో అన్న ఎన్‌టీఆర్ గారు మరో మారు కృష్ణునిగా నటించి ప్రజలను మురిపించారు. చాలా పెద్ద విజయం సాధించిన ఆ చిత్రంలో నారాయణ రెడ్డి గారు "నీ చరణ కమలాల" అనే గీతం కూడా బాగా ప్రాచుర్యం పొందింది.

స్వామి ఇష్ట సఖుల మనోభావనలను, ఆయనకు వారిపై గల మనోహరమైన ప్రేమను ఈ గీతం ప్రతిబింబిస్తుంది. లీలమ్మ, ఘంటసాల మాష్టారు గళాల్లో ఈ పాట వింటునే ఆహా అబ్బా అని మనసు తేలిపోతుంది. స్వామిని ఆరాధించే సఖుల హృదయావిష్కరణ, స్వామికి వారిపై గల అనన్యమైన ప్రేమను ఈ గీతం మరో మారు మనకు తెలియజేస్తుంది. పరమాత్మ పూర్ణావతార స్వరూపమైన స్వామి పాదాల నీడ ఉంటే చాలు అనే చెలి భావన, చెలి కన్నుల్లో ఆరాధనగా తానుంటే చాలు అనే స్వామి భావన నిజంగా ప్రేమకు నిర్వచనం. ఇక్కడ స్వామి చరణాలు కమలాలే, ఆమె కన్నులు కూడా కమలాలే...అదీ నారాయణ రెడ్డి గారి ప్రత్యేకత. ఒకే పదాన్ని సారూప్యతకు ఉపయోగించి భిన్నమైన భావనలను వ్యక్తపరచే సాహితీ ఔన్నత్యం కల్గిన కవి ఆయన.

గీతంలో ఎంత లలితమైన శృంగారం ఉంది కదా? లేతమోవి చిగురుతో తనను మురళిగా మలచి అనురాగపు రాగాలు పలికించి ప్రేమ మధువును ఒలికించమని చెలి వేడుకుంటే, ముఖములో కనబడని, మురళిలో వినిపించలేని రాగాలను పలికిస్తాను, మధురమైన అనురాగాని చిలికిస్తాను అని స్వామి పలకటం ప్రేమ ఎంత మధురం అన్న భావనను కలిగిస్తుంది. ఆయన ప్రేమ అనే వనంలో తనకు స్థానం ఉంటే చాలు ఇంక నందనవనాలు ఎందుకని చెలి పలికితే, ఆకాశమంత విశాలమైన ఆమె హృదయంలో తానుంటే చాలు ఇంక బృందావనాలెందుకు అని స్వామి పలుకుతాడు.

స్వామి పత్నులలో రుక్మిణి పట్టమహిషి. ఆమె ప్రేమలో భక్తి ఉంది, శరణాగతి ఉంది. పరిపూర్ణమైన ప్రేమమూర్తి రుక్మిణి. ఆమె భావనలను వ్యక్తపరచటానికి తులసీదళాలను మించినవేముంటాయి. పవిత్రమిన ఆ దళాలతో పూజించి, ప్రేమను అందించి, పులకించే ఆమె భక్తిపూరితమైన ప్రేమను నారాయణ రెడ్డి గారు రెండవ చరణంలో ఆవిష్కరించారు. మరి ఆమె భక్తికి, ప్రేమకు సంతుష్టుడైన స్వామి ఎలా స్పందించాడు? పూజలను స్వీకరించి, పులకింతలు అందించి, తాను లోలోపల గానం చేస్తానని, ఆమె హృదయంలో నివసిస్తానని చెప్పాడు. కృష్ణ ప్రేమ సామ్రాజ్యం యొక్క గొప్పతనాన్ని ఈ గీతం మనోజ్ఞంగా చాటింది. టీవీ రాజు గారి సంగీతంలో నేపథ్య గాయనీ గాయకులు ఈ యుగళ గీతాన్ని అజరామరం చేశారు.

నీ చరణ కమలాల నీడయే చాలు
ఎందుకోయీ స్వామి బృందావనాలు
నీ నయన కమలాల నేనున్న చాలు
ఎందుకే ఓ దేవి నందనవనాలు

నును మోవి చివురుపై నను మురళిగా మలచి పలికించరా! పలికించరా మధువులొలికించరా!
మోవిపై కనరాని మురళిలో వినలేని రాగాలు పలికుంతునే! మధురానురాగాలు చిలికింతునే!
నీ ప్రణయవనిలోన నేనున్న చాలు
ఎందుకోయీ స్వామీ నందనవనాలు
నీ హృదయ గగనాన నేనున్న చాలు
ఎందుకే ఓ దేవి బృందావనాలు

తులసీదళాలలో తొలివలపులందించి పూజింతునా! స్వామి పులకింతునా!
పూజలను గ్రహియించి పులకింతలందించి లోలోన రవళింతునే! ఓ దేవి నీలోన నివసింతునే!
నీ చరణ కమలాల నీడయే చాలు
ఎందుకోయీ స్వామీ బృందావనాలు
నీ నయన కమలాల నేనున్న చాలు
ఎందుకే ఓ దేవి నందనవనాలు
నీ ప్రణయవనిలోన నేనున్న చాలు
ఎందుకోయీ స్వామీ నందనవనాలు

స్త్రీవాదులూ - సతులు పాదసేవ అన్న భావన పురుషాహంకారాన్ని నిరూపించదు. ఎన్నో సార్లు ప్రేమలో భార్యభర్తలకు ఒకరిపట్ల మరొకరికి దివ్యమైన భావనలు కలిగి వారి పట్ల ఆరాధనా భావంతో నమస్కరిస్తారు, పాదసేవ చేస్తారు. కాబట్టి నేను దీన్ని పురుషాహంకారంగా అంగీకరించను. కాకపోతే, భార్య పట్ల గౌరవం, నమ్మకం, విశ్వాసం, ప్రేమ లేని చోట ఇది కోరుకోవటం తప్పకుండా పురుషాహంకారమే. 

1, ఫిబ్రవరి 2017, బుధవారం

వీణావాదిని వరదే వరదే - సూర్యకాంత త్రిపాఠీ గీతం


వీణావాదిని వరదే వరదే
ప్రియ స్వతంత్ర రవ అమృత మంత్ర నవ భారత్ మే భర్ దే

కాట్ అంధ్ ఉర్ కే బంధన్ స్తర్
బహా జనని జ్యోతిర్మయ్ నిర్ఝర్
కలుషభేద తమ హర్ ప్రకాశ్ భర్
జగ్‌మగ్ జగ్ కర్ దే!

నవ గతి నవ లయ తాళ ఛంద్ నవ
నవల్ కంఠ్ నవ జలద మంద్ర రవ
నవ నవ కే నవ విహగ్ బృంద్ కో
నవ పర నవ స్వర్ దే

కవి పరిచయం:

ఈ పాట మహాకవి సూర్యకాంత త్రిపాఠీ (నిరాలా) గారు రచించింది. 1896వ సంవత్సరం ఫిబ్రవరి 21న బెంగాలులోని మిద్నాపూర్‌లో జన్మించారు. విశ్వకవి రవీంద్రులు, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానందుల ప్రభావం వీరిపై చాలా ఉంది. ఈయన ఆంగ్లము, హిందీ, బెంగాలీ మరియు సంస్కృత భాషలలో పండితుడు. కవితలు, నవలలు, కథలు, కథానికలు, వ్యాసాలు, గీతాలు, అనువాదాల రూపంలో ఎన్నో అద్భుతమైన రచనలు చేశారు. సామాజిక అన్యాయాలపై పోరాడారు. వేదాంతాన్ని, దేశభక్తిని, పర్యావరణాన్ని, మానవతావాదాన్ని కలబోసి రచనలు చేశారు. జైశంకర్ ప్రసాద్, సుమిత్రానందన్ పంత్, మహాదేవి వర్మ, హరివంశరాయ్ బచ్చన్, రాంధారి సింగ్ దినకర్, మఖన్‌లాల్ చతుర్వేది, నరేంద్ర శర్మ మొదలైన ఛాయావాద కవుల సమూహంలో ఆయనకు ప్రత్యేక స్థానముంది. ఈయన కవితలను డేవిడ్ రూబిన్ అనే ఆంగ్ల రచయిత అనువదించారు. 1961వ సంవత్సరం అక్టోబరు 15న ఈయన అలహాబాదులో పరమపదించారు.

భావం:

ఓ సరస్వతీ దేవి! మాకు వరములిమ్ము. అమృతతుల్యమైన, ప్రియమైన స్వాతంత్య్ర రవాన్ని నవ భారతావనిలో నింపుము!

మా హృదయాలలో నెలకొన్న అంధకారమనే బంధనాలను ఖండించి జ్యోతిప్రకాశాన్ని ప్రవహింప జేయుము. భేదభావమనే కలుషాన్ని, మాలోని తమస్సును తొలగించి ప్రకాశాన్ని నింపి ఈ విశ్వాన్ని తేజోమయము కావించుము. ఈ నూతన భువిపైని పక్షులకు (ప్రజలకు) కొత్త గతులను, రాగాలను, ఛందములను, కొత్త పదములను, గళములను, క్రొత్త గీతాలనే మేఘాలను, క్రొంగొత్త స్వరాలను ప్రసాదించుము.

చదువుల తల్లి సరస్వతిని మహాకవి మనలోని తమస్సులను, కలుషాలను తొలగించి కొత్త భావనలను, జ్ఞానజ్యోతిని, నూతన స్వరరాగలయాది ప్రవాహాలను ప్రసాదించాలని వేడుకుంటున్నారు. ఆయన భావనలకు అనుగుణంగా భక్తిని, జాతీయతను, ఈ గీతంలో కనబరచారు కవి. ఈ గీతాన్ని ఎందరో ప్రముఖులు గానం చేశారు. అన్నిటిలోకి భారతరత్న భీంసేన్ జోషీ గారు గానం చేసింది ఉత్తమం. ఆ ఆడియో/వీడియో అంతర్జాలంలో ఎక్కడా దొరకలేదు. యూట్యూబులో ఉన్న ఆలాపన విని ఆనందించండి. ఇంతటి అద్భుతమైన రచన చేసిన మహాకవికి ఈ శ్రీపంచమి సందర్భంగా పాదాభివందనాలు.


28, జనవరి 2017, శనివారం

వినరో భాగ్యము విష్ణు కథ - అన్నమాచార్యుల వారి హరికథా సుధ


వేదవ్యాసుల వారు పరమాత్మ లీలలను ప్రపంచానికి తెలియజేయటానికి, ఆయన భక్తుల అనుభవాలను, వారి భక్తి యొక్క గొప్పతనాన్ని తెలియజేయటానికి భాగవతామృతాన్ని మనకు అందించారు. ఆ గాథలను వాగ్గేయకారులు కుడా మనకు తమ సంకీర్తనల ద్వారా తెలియజేశారు. మన తెలుగు గడ్డపై పుట్టిన వాగ్గేయకారులలో అగ్రగణ్యులైన తాళ్లపాక అన్నమాచార్యుల వారి సంకీర్తనలలో భగవంతుడు, భక్తులను ప్రస్తవిస్తూ అద్భుతమైన ఆధ్యాత్మిక సందేశాన్ని అందించేవి ఎన్నో ఉన్నాయి. వాటిలో ఒకటి వినరో భాగ్యము విష్ణు కథ.

వినరో భాగ్యము విష్ణు కథ
వెనుబలమిదివో విష్ణు కథ 

ఆది నుండి సంధ్యాది విధులలో
వేదంబైనది విష్ణుకథ
నాదించేనిదే నారదాదుల చే
వీధి వీధులనే విష్ణుకథ

వదలక వేద వ్యాసులు నుడివిన
విదిత పావనము విష్ణుకథ
సదనంబైనది సంకీర్తనై
వెదకిన చోటనే విష్ణుకథ 

గొల్లెతలు చల్లలు గొన కొని చిలుకగ
వెల్లివిరియాయె విష్ణుకథ
ఇల్లిదే శ్రీవేంకటేశ్వరు నామము
వెల్లి గొలిపెనీ విష్ణుకథ


విష్ణు కథలు వినటమనేది ఓ భాగ్యము. ఈ విష్ణు కథ వెనుబలము. యుగయుగాలుగా సంధ్యావందనం మొదలైన నిత్యవిధులలో వేదముగా చెప్పబడింది విష్ణు కథ. నారదుడు మొదలైన హరి భక్తాగ్రగణ్యుల నోట వీధి వీధుల ఈ విష్ణు కథ నాదమై నిలిచింది. గట్టి సంకల్పంతో వేదవ్యాసుల వారు పలికిన పావన చరితము ఈ విష్ణు కథ. సంకీర్తనలను నిలయంగా చేసుకున్నది ఈ విష్ణు కథ. గోపికలు వెన్న కోసం మజ్జిగను చిలికే సమయంలో ఈ విష్ణు కథ వారి నోట వెల్లి విరిసింది. ఇక్కడ తిరుమలలో వెలసిన శ్రీవేంకటేశ్వరుని నామాన్ని ప్రకాశింపజేసింది   విష్ణు కథ. 

ఈ కీర్తనను పరిశీలిస్తే ఓహో, ఇంతమంది చేత చెప్పబడింది, కాబట్టి తప్పకుండా విష్ణు కథ మహత్తును చాటేది అనిపించినా, ప్రతి చరణంలో అంతరార్థం నిగూఢమై ఉంది. జీవాధరమైన వాడు విష్ణుమూర్తి. అనగా సృష్టి యొక్క స్థితికి కారకుడు. మన శరీరానికి వెన్ను పూస ఎలాంటిదో ఈ విశ్వానికి శ్రీహరి అలాంటి వాడు అని పల్లవిలోనే చెప్పక చెప్పారు అన్నమాచార్యుల వారు. విశ్వంలోని కణకణములోనూ అణువణువైన వాడు విష్ణువు. అలాగే, సంధ్యాది విధులలో వేదంగా చెప్పబడింది విష్ణు కథ అన్నారు. సంధ్యావందనమనేది ఎంత ముఖ్యమైన విధో మనకు సనాతన ధర్మ ప్రవక్తలు చెబుతూనే ఉంటారు. అన్నమాచార్యులు వారు దానిని మరింత ప్రభావవంతంగా చెప్పారు. ఈ విధిలో కేశవ నామాలతో కూడిన ఆచమనము అంశం. దేహములోని వివిధ భాగములలో నివసించే శ్రీహరి అంశలను ప్రస్తావించే ఈ విషయాన్ని అన్నమాచార్యుల వారు మొదటి చరణంలో పలికారు. ఈ విశ్వానికి జాగృతమైన శక్తిని అందించే సంధ్యావందన విధిలో విష్ణు కథ నిబిడీకృతమై ఉందని మనకు తెలిపారు. అలాగే నారదుడు విష్ణు భక్తులలో శ్రేష్ఠుడు. నిరంతర హరినామ స్మరణతో ఆయన మహిమలను ముల్లోకాలకు చాటే మహర్షి ఆయన. ఆయన నోట పలుకబడిన గాథలు జీవరాశి ఉత్థానానికి సోపానాలు. కలియుగంలో నామస్మరణమే ముక్తికి మార్గం అన్నది ఆర్యోక్తి. అందుకే నారదుని పేరు ప్రస్తావించి ఆ మార్గం యొక్క ప్రాముఖ్యతను చాటారు అన్నమాచార్యుల వారు. 

భాగవతం యొక్క లక్ష్యం భగవంతుని నమ్ముకొని ఉన్నత గతులను పొందిన వారి విశేషాలను తెలుపటంతో పాటు లీలావేష్టితమైన విష్ణుమాయను, దానికి సృష్టిస్థితిలయములలో గల స్థానాన్ని మనకు తేటతెల్లం చేయటం కూడా. ఎప్పుడైతే మనకు సృష్టి రహస్యం అవగతమవుతుందో అప్పుడు మనకు భవబంధనాలు దూరమవుతాయి. మనమెవరమో ఎందుకు జన్మించామో ఎలా జీవించాలో అర్థమవుతాయి. జీవన్ముక్తి లభిస్తుంది. భక్తి, శరణాగతితో కష్టాల కడలి ఎలా దాటగలమో తెలిపేవి భాగవత గాథలు. వేదవ్యాసుల వారు ఈ లక్ష్యాన్ని శ్రీమద్భాగవతం ద్వారా ఉత్తమోత్తమంగా సాధించారు. పావనమైన భాగవత గాథల ద్వారా విష్ణు కథలను తెలిపిన ఆయన పేరును ప్రస్తావించి అన్నమాచార్యుల వారు మనకు మార్గదర్శకులైనారు. మరి ఆ విష్ణు కథ ఎక్కడ నిలిచింది? కలియుగంలో సంకీర్తనలలో. అన్నమాచార్యుల వారి కీర్తనలో హరివైభవమెంత అందంగా ఉంటుందో మనకందరికీ తెలిసిందే. అందుకే అవి మంత్రసమానమై నిలిచాయి. మనం ఎక్కడ వెదకితే అక్కడే విష్ణు కథలు మనకు కనబడతాయి. అంటే, ఆధ్యాత్మికోన్నతికి కావలసింది మనలో సంకల్పం.  

గోకులంలో గోపికలు చల్లను చిలుకుతూ ఉన్నప్పుడు విష్ణుకథలు వెల్లివిరిసాయి అని అన్నారు అన్నమయ్య. నిరంతరం ఆ కృష్ణుని తలచుతూ తన్మయత్వంలో ఉండే గోపికల నోట ఆయన గాథలు తప్ప వేరే ఎముంటాయి? కాకపోతే ఇక్కడ చల్లను చిలుకటం ఎందుకు ప్రస్తావించారు? మజ్జిగను చిలికి చిలికి వెన్నను తీసినట్లు మనం సాధన ద్వారా శాశ్వతమైన దానిని పొందవచ్చు అని మనకు సారూప్యతనిచ్చి విష్ణు భక్తి గొప్పతనాన్ని సుళువుగా తెలియజేశారు. అలాగే, కలియుగంలో మన పాలిట కల్పవృక్షమైన శ్రీవేంకటేశ్వరుని నామంలో విష్ణ కథలు ప్రకాశిస్తున్నాయని ముగించారు. గోవింద, వేంకట మొదలైన నామముల అర్థం చూస్తే అన్నమాచార్యుల వారి ఉద్దేశం మనకు అవగతమవుతుంది. కలిదోషములను హరించేది ఆ శ్రీనివాసుని స్మరణ. ఆయన నామంలోనే సమస్తము. అదే మనకు అభయము, వరదము, మోక్షప్రదాయకము. 

మనకు మార్గాలను ప్రభావవంతంగా తెలిపేవారు సద్గురువులు. తన సంకీర్తనల ద్వారా దారి చూపిన అన్నమయ్య మనకు సద్గురువులయ్యారు. ఒక్కో సంకీర్తన భవసాగరాన్ని దాటే అద్భుత సాధనం. అటువంటి రచనలు చేయటానికే ఆయన అవతరించారు.  అన్నమాచార్యుల వారిలోని శ్రీహరి అంశకు శిరసు వంచి పాదాభివందనాలు. 

ఈ సంకీర్తనను గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు ఎంతో శ్రావ్యంగా, భక్తి భావంతో ఆలపించారు. విని తరించండి. 

పాతాళ భైరవి – 1951: తెలుగు జానపద చిత్రరాజం

1951 మార్చి 15న విడుదలైన పాతాళ భైరవి తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక కీలక మలుపు. విజయా ప్రొడక్షన్స్ పతాకంపై బి. నాగిరెడ్డి, ఆలూరి చక్రపాణి నిర్మ...