27, ఫిబ్రవరి 2016, శనివారం

తొలిరేయి గీతాలు - హాయి హాయిగా జాబిల్లి తొలిరేయి (వెలుగునీడలు)


తొలివలపులో చంద్రుడు, చల్లదనం, పరువాలు, పరవశం, కోరికలు, చిలిపితనం, మైమరపు ఎన్ని భావనలో. గడచిన తరంలో భార్యా భర్తల మధ్య అనురాగాన్ని చాలా లలితంగా చలన చిత్రాలలో అందించేవారు. ఈరోజుల్లా దాష్టీకం, ఎగరడాలు, దూకడాలు, తొడలు కొట్టడాలు మొదలైన ఆవేశపూరితమైన లక్షణాలను చూపించేవారు కాదు. హాయిగా, ఉత్సాహంగా, ప్రశాంతంగా, లాలనగా ఆ బంధాలను చిత్రీకరించేవారు. ఆ భార్యా భర్తల తొలిరేయి ఎంత మధురంగా ఉంటుందో తెలియజేయటానికి వెలుగునీడలు చిత్రంలోని "హాయి హాయిగా జాబిల్లి తొలిరేయి వెండి దారాలల్లి" పాట మరో మంచి ఉదాహరణ. కథలో పరిస్థితుల కారణంగా ప్రధాన పాత్ర అయిన నాయికను కాకుండా ఇంకొకరిని వివాహం చేసుకున్న నాయకుడు ఆమె పట్ల తన ధర్మాన్ని నిర్వర్తించి తొలిరేయిని ఎంత మధురంగా భావించాడో ఈ గీతంలో తెలుస్తుంది. తొలిరేయి గీతాలు శీర్షికన ఆఖరి సంచికగా "హాయి హాయిగా జాబిల్లి తొలిరేయి వెండి దారాలల్లి" గీతం వివరాలు మీకు అందిస్తున్నాను.

హాయి హాయిగా జాబిల్లి తొలిరేయి వెండి దారాలల్లి 
మందు జల్లి నవ్వ సాగే ఎందుకో మత్తు మందు జల్లి నవ్వ సాగే ఎందుకో

తళతళ మెరిసిన తారక
చెలి వెలుగుల వెన్నెల దారుల
కోరి పిలిచెను తన దరి చేరగ
మది కలచెను తీయని కోరిక

మిల మిల వెలిగే నీటిలో
చెలి కలువల రాణి చూపులో
సుమ దళములు పూచిన తోటలో
తొలి వలపుల తేనెలు రాలెను

విరిసిన హృదయమే వీణగా
మధు రసముల కొసరిన వేళల
తొలి పరువములొలికెడు సోయగం
కని పరవశమందెను మానసం

శ్రీశ్రీ గారు తొలిరేయం గీతం రాశారా అని ఆశ్చర్యపోతున్నారా? నేను కూడా అవాక్కయ్యాను. ఆయన విప్లవ రచయితగా అందరికీ తెలుసు, అక్కడక్కడ భక్తి గీతాలు రాశారు అని తెలుసు, కానీ ఇలాంటి తొలిరేయి గీతం కూడా రాశారని తెలిసి వారి ప్రజ్ఞకు జోహార్లు తెలిపాను. ఆయనలోని ప్రతిభా జ్యోతి ఎంత దేదీప్యమానంగా వెలిగిందో ఆయన రాసిన విలక్షణమైన గీతాలు పరిశీలిస్తే తెలుస్తుంది. వాటిలో ఒకటి ఈ హాయి హాయిగా జాబిల్లి తొలి రేయి వెండి దారాలల్లి అనే గీతం. చంద్రుడిపై ఎందరో మహానుభావులు భావుకంగా రాశారు. కానీ, ఈ శ్రీశ్రీ గీతానికి ఒక ప్రత్యేకత ఉంది. చంద్రుడు ఈ జంట తొలిరేయి నాడు వెండి దారాలల్లి మత్తు మందు చల్లి నవ్వుతున్నాడు అని ఆయన గీతాన్ని ఆరంభించటం. వెండి దారాలల్లి అంటే ఆ వెన్నెలను దారులుగా వేసి తారలను ఆహ్వానిస్తున్నాడు అని కవి భావమేమో అనిపించింది. వెన్నెల వెలుగుల దారిలో మెరుస్తున్న తారక తన దరికి చేరమని కోరి పిలిచిందిట, తీయని కోరిక మదిని కలచిందట. భార్య తారకగా, ప్రియుడు చంద్రునిగా ఎంత అద్భుతంగా వర్ణించారో శ్రీశ్రీ గారు. వెన్నెలలో మెరుస్తున్న నీటిలో కలువల చూపులలో రెక్కలు విప్పి పూచిన పూదోటలో తొలి వలపులనే తేనెలు రాలాయిట. చంద్రుని చల్లదనానికి విరిసే కలువలు ప్రేయసీ ప్రియుల మధ్య విరిసే వలపులకు ప్రతీక. దీన్నే కవి మనకు చక్కని చిక్కని తెలుగులో అందించారు. వలపులతో హృదయం వీణగా మ్రోగి తీయని రసాలని ఒలికిస్తే, ఆ తొలి పరువాల సొగసు చూసి మనసు పరవశించిందట. నాయికానాయకుల మనోభావనను అద్భుతంగా పలికించారు శ్రీశ్రీ.

వెలుగునీడలు చిత్రంలో సావిత్రి కద నాయిక? మరి ఈ పాటలో గిరిజగారున్నారు కదా అన్న ప్రశ్నకు సమాధానం మీకు సినిమా చూస్తే తెలుస్తుంది. అయినా కూడా, దర్శకులు సందర్భోచితంగా భార్యాభర్తలపై ఈ గీతాన్ని పొందుపరచారు. ఒకరకంగా గిరిజ గారి సినీ ప్రస్థానంలో వెలుగునీడలలోని ఈ పాట ఒక గొప్ప మైలురాయి అని చెప్పుకోవాలి. ఆదుర్తి సుబ్బారావు గారి దర్శకత్వం ప్రతిభ ఈ చిత్రం మొత్తం కనబడుతుంది. ఈ పాట చిత్రీకరణలో జాబిల్లి, వెన్నెల, భార్యాభర్తల మనోభావాలు నటనలో చూపించటం...వీటన్నిటా వారు గుర్తుకొస్తారు. పెండ్యాల వారి సంగీతంలో ఘంటసాల మాష్టారు, సుశీలమ్మ పాడిన ఈ గీతం ఎంతో పెరు తెచ్చుకొంది. పాట వినగానే ఏఎన్నార్ గారు నాయకులు అనేలా ఘంటసాల మాష్టారు పాడారు. అందరు ప్రతిభావంతుల చేత రూపకల్పన చేయబడటం వలననే తొలిరేయి గీతాలలో ఇది మంచి స్థానాన్ని నిలుపుకుంది.

23, ఫిబ్రవరి 2016, మంగళవారం

తొలిరేయి గీతాలు - పూవై విరిసిన పున్నమి వేళ (శ్రీ తిరుపతమ్మ కథ)


తొలిరేయి వలపులో సున్నితత్వానికి కూడా చాల ముఖ్యమైన చోటుంది. భార్య సిగ్గుల దొంతరలో మురిసితే, భర్త వాటిని ఆస్వాదించి సంస్కారవంతమైన భావనతో ఆనందిస్తాడు. ఆ పూవంటి మనసు గల స్త్రీ తనదైనందుకు సంతోషపడతాడు, తొలివలపులు సఫలం చేసుకోవటానికి ఆమెను ప్రొత్సహిస్తాడు, దగ్గరుండి ముందుకు నడిపిస్తాడు. అటువంటి భర్త మనసు పాడితే వచ్చేది అద్భుతమైన ప్రేమ గీతం. 1963లో విడుదలైన శ్రీ తిరుపతమ్మ కథ చిత్రంలోని "పూవై విరిసిన పున్నమి వేళ" అనే పాట అటువంటి భావనల మనోజ్ఞ మాధుర్య గీతం. తొలిరేయి గీతాలు శీర్షికన నాలుగవ సంచికగా ఈ పాట వివరాలు మీకు అందిస్తున్నాను.

పూవై విరిసిన పున్నమి వేళ 
బిడియము నీకేల? బేల!

చల్లని గాలులు సందడి చేసే
తొలి తొలి వలపులు తొందర చేసే
జలతారంచుల మేలి ముసుగులో
తలను వాల్తువేల? ఏల!

మొదటి మూగినవి మొలక నవ్వులు
పిదప సాగినవి బెదరు చూపులు
తెలిసెనులే నీ తలపులేమిటో
తొలగిపోదువేల? బేల!

తీయని వలపుల పాయసమాని
మాయని మమతల ఊయలలూగి
ఇరువురమొకటై పరవశించగా
ఇంకా జాగేల? బేల!

పున్నమికి తొలిరేయి మధుర జ్ఞాపకాలకు గల అవినాభావ సంబంధం ఎన్నో సినీగీతాలలో చూస్తాము. గత సంచికలలో కూడా ఈ పున్నమి నేపథ్యంలోని తొలిరేయి గీతాల వివరాలు తెలుసుకున్నాము. అదే బాటలో వచ్చిన ఇంకో అద్భుతమైన గీతం శ్రీ తిరుపతమ్మ కథ చిత్రంలోని ఈ పాట. భార్య సిగ్గులలో మునిగి తేలుతుంటే భర్త నోట జాలువారిన ఈ గీతం తెలుగు సినీ పాటలలో విశేషమైన స్థానాన్ని సంపాదించింది. దానికి కారణం లలితమైన భావన, మాధుర్య ప్రధానమైన సంగీతం, నటీనటుల ప్రజ్ఞ.

అన్న ఎన్‌టీఆర్, అలనాటి అందాల నటి కృష్ణకుమారిలు అప్పట్లో విజయాలు సాధించే జంటగా పేరొందారు. ఆ సమయంలోనే వచ్చింది ఈ తిరుపతమ్మ కథ చిత్రం. పామర్తి-బీ శంకరరావుల సంగీత దర్శకత్వంలో డాక్టర్ సీ నారాయణ రెడ్డి గారి కలాన వెలువడిన ఈ గీతం తొలిరేయి భావనలకు మధురమైన ఆనవాలుగా నిలిచింది. నారాయణ రెడ్డి గారి రచనలలో ఈ గీతానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దానికి కారణం ఇందులోని భావ సౌందర్యము మరియు తెలుగుదనం.

పున్నమి పూవులా విరిసింది, ఓ చెలీ! సిగ్గెందుకు అని భర్త ఆమెను ప్రశ్నిస్తున్నాడు. చల్లని గాలులు సందడి చేస్తున్నాయి, మొదటి వలపులు తొందర పెడుతున్నాయి, పట్టు చీర కట్టుకొని ఆ చీర కొంగును చాటుగా చెసుకొని తలను వంచుతున్నావు ఎందుకు అని మొదటి చరణంలో తన మనోభీష్టాన్ని తెలుపుతాడు. వలపులు వికసించిన భర్త భార్యను ముందడుగు వేయమని ఎంతో అందంగా అడుగుతాడు. ఆమె ముఖంలో మొలకలెత్తిన నవ్వులు, అంతలో బెదిరిన చూపులు ఆమె మనసులో ఏమి ఆలోచనలు తెలుపుతున్నాయి, ఎందుకు పక్కకు వెళతావు అని ఆమెను దరిచేరటానికి రెండవ చరణంలో ప్రోత్సహిస్తాడు. మూడవ చరణంలో నారాయణ రెడ్డి గారి సాహితీ ప్రతిభ మరింత కనబడుతుంది. తీయమైన వలపులను పాయసంగా భావించి రుచిని చవిచూసి, శాశ్వతమైన ప్రేమానురాగాలనే ఊయాలలో ఊగి, ఇద్దరమూ ఒకటై పరవశించాల్సిన సమయం, ఆలస్యం ఎందుకు అని అతను ఆమెను సంగమానికై ముందడుగు వేయమని కోరతాడు. ఇక్కడ భార్య భర్తను బేల అని అనటం ఆమెను బలహీనం అని చెప్పటానికి కాదు. వివాహమైనా, మనసు అర్థం చేసుకునే భర్త ఎదురుగా ఉన్నా, సహజమైన సిగ్గుతో ఉన్న స్త్రీ మానసిక పరిస్థితిని ప్రతిబింబించటానికి.

ఏ గీతానికైనా అభినయం, గాత్ర ధర్మం, సంగీతం అతి ముఖ్యమైనవి. సాహిత్యం ఎంత లాలిత్యం కూడి ఉందో,  అంతే సంగీత మాధుర్యం కలిగి ఉంది ఈ పాట. దానికి నటీనటుల అభినయం, ఘంటసాల గారి గాత్రం సరిగ్గా తోడై పాటకు శాశ్వత కీర్తిని  తెచ్చాయి. 

22, ఫిబ్రవరి 2016, సోమవారం

తొలిరేయి గీతాలు - వెన్నెలలోనే వేడి ఏలనో (పెళ్లినాటి ప్రమాణాలు)



తొలిరేయి అనగానే మధుర భావనలు, ప్రేమానురాగాలు, విరహముతో పాటు ఉత్సాహం కూడా భార్యా భర్తలలో వస్తుంది. ఆ భావనలన్నిటికీ చిహ్నంగా 1958వ సంవత్సరంలో విడుదలైన పెళ్లినాటి ప్రమాణాలు చిత్రంలో "వెన్నెలలోనే వేడి ఏలనో" అనే గీతాన్ని తొలిరేయి గీతంగా దర్శకులు కేవీరెడ్డి గారు మనకు అందించారు. తొలిరేయి గీతాలు శీర్షికన మూడవ సంచికగా ఈ గీతం వివరాలు మీ ముందుంచుతున్నాను.

వెన్నెలలోనే వేడి ఏలనో వేడిమిలోనే చల్లనేలనో
ఈ మాయ ఏమో జాబిలి ఈ మాయ ఏమో జాబిలి
వెన్నెలలోనే విరహమేలనో విరహములోనే హాయి ఏలనో
ఈ మాయ ఏమో జాబిలి ఈ మాయ ఏమో జాబిలి

మొన్నటి కన్నా నిన్న వింతగా నిన్నటి కనా నేడు వింతగా
నీ సొగసూ నీ వగలూ హాయి హాయిగా వెలసేనే

రూపము కన్నా చూపు చల్లగా చూపుల కన్నా చెలిమి కొల్లగా
నీ కళలూ నీ హొయలూ చల్ల చల్లగా విరిసేనే

1959వ సంవత్సరానికి తెలుగులో ఉత్తమ చలన చిత్రంగా జాతీయ అవార్డు అందుకున్న ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలు రాసినవారు పింగళి నాగేంద్రరావు గారు. ఘంటసాల మాష్టారు సంగీతంలో మాష్టారు, లీలగారు పాడిన గీతం మంచి పేరు తెచ్చుకుంది. వెన్నెలలో వేడి ఎందుకు, ఆ వేడిలోనే చల్లదనం ఎందుకు అని నాయికానాయకులు పాటను ఉత్సాహంగా ఆరంభిస్తారు. అంతలోనే వెన్నెలలో విరహమెందుకు, ఆ విరహంలోనే హాయి ఎందుకు అని మధుర భావనలను పలుకుతారు. అన్నీ వెన్నెలకు ఆపాదించటం ఆ చందమామకు ఆ వెన్నెలకే తెలియాలి. వెన్నెలలోని చల్లదనం తొలికలయికకు బీజం వేస్తుంది. ఈ చల్లదనం, ఈ విరహపు వేడి, ఈ హాయి అన్నీ చందమామ మాయే అంటున్నారు పింగళి వారు. నిజమే. లేకుంటే ఇన్ని భావనలు ఒకే చోట ఒకే సమయంలో ఎలా కలుగుతాయి?

మూడు ముళ్ల బంధంలో ఒకటవ్వబోయే జంట భావాలలో మొన్నటికి-నిన్నటికి నిన్నటికి-నేటికి ఎంత మార్పు? వలపులు ఎంత త్వరగా విరిసి గుబాళిస్తాయో కదా? ఆ భావననే పింగళి వారు మొదటి చరణంలో తెలిపారు. భర్త తన భార్యలోని ఈ సొగసు, వగలు ఎంత హాయిగా ఉన్నాయో అని తొలిరేయికి నాంది పలుకుతాడు. రూపము కన్నా అతని చూపులు చల్లగా ఉంటే, ఆ చూపుల కన్నా అతని చెలిమి పుష్కలంగా ఉందిట. ఇదీ ఆమె భావన. అతని కళలు, హొయలు చల్ల చల్లగా విరిసాయిట. అదీ ఆమె తొలిరేయి వేసిన అడుగు. ఈ విధంగా భార్యాభర్తల భావవ్యక్తీకరణతో ఒకరినొకరు ఉత్సాహపరచుకుంటూ, ఆ ఆహ్లాదకరమైన వాతావరణంలో, మధురమైన రేయిని మధురాతిమధురంగా చేసుకున్నారు. ఘంటసాల మాష్టారు-లీలమ్మ శ్రావ్యంగా పాడిన ఈ పాటలో ఏఎన్నార్, జమున జంట జీవించి ఈ గీతానికి ఔన్నత్యాన్నిచ్చారు.

21, ఫిబ్రవరి 2016, ఆదివారం

తొలిరేయి గీతాలు - నన్ను దోచుకుందువటే (గులేబకావళి కథ)


తొలిరేయిన భార్యలో ఆరాధనా భావం కలిగితే మగవానిలో అనుబంధం శాశ్వతమైనది అనే పవిత్రమైన భావం కలుగుతుంది. భర్తలో భార్య పట్ల ప్రేమానురాగాలతో పాటు బాధ్యత అనే మొక్క చిగురిస్తుంది. భార్యకు అన్నీ భర్తే అన్న ఉదాత్తమైన భావన మొలకెత్తుతుంది. ఒకరి మనసు ఒకరి దోచుకోవటంతో నేను అన్న భావన తొలగి మేము అన్న భావన వికసిస్తుంది. ఇద్దరు మనుషులైనా ఒకే నావలో ప్రయాణించే సమయం ఆసన్నమవుతుంది. 1962లో విడుదలైన గులేబకావళి కథ చిత్రంలో "నన్ను దోచుకుందువటే" అనే గీతం తొలిరేయికి సంబంధించినదే. జానపద ఇతివృత్తంతో ఎన్‌టీరామారావు గారు, కమలాకర కామేశ్వరరావు గారి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో డాక్టర్ సీనారాయణ రెడ్డి గారు ఈ గీతాన్ని రచించారు, జోసెఫ్-కృష్ణమూర్తిగార్లు సంగీతాన్ని అందించారు. తొలిరేయి గీతాల శీర్షికన రెండో సంచికల "నన్ను దోచుకుందువటే" పాట వివరాలు అందిస్తున్నాను.

నన్ను దోచుకుందువటే నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని
కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామీ నిన్నే నా స్వామీ

తరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలోన
పూలదండవోలే కర్పూరకళికవోలే కర్పూరకళికవోలే
ఎంతటి నెరజాణవో నా అంతరంగమందు నీవు
కలకాలం వీడని సంకెలలు వేసినావు సంకెలలు వేసినావు

నా మదియే మందిరమై నీవే ఒక దేవతవై
వెలసినావు నాలో నే కలసిపోదు నీలో కలసిపోదు నీలో
ఏనాటిదో మనబంధం ఎరుగరాని అనుబంధం
ఎన్ని యుగాలైనా ఇది ఇగిరిపోని గంధం ఇగిరిపోని గంధం

తెలుగు చలన చిత్ర సీమలో డాక్టర్ సి.నారాయణరెడ్డిగారి సాహిత్యం సహజత్వానికి ప్రయోగాలకు పుట్టినిల్లు. అంతకు మునుపు ఎక్కువగా వాడని పదాలను సాహితీ స్రవంతిలోకి తీసుకు వచ్చి, వాటితో సాహిత్యానికి ఎంతో వన్నె తెచ్చినవారు సినారె గారు. దొరసాని, నెరజాణ వంటి పదాలు అప్పట్లో తెలుగు సినీ సాహిత్యంలో చాలా అరుదుగా ఉపయోగించే వారు. నారాయణ రెడ్డి గారు అటువంటి పదాలను తన సాహిత్యంలో పొందు పరచి తెలుగు భాష అందాన్ని పెంచారు.

గీతాన్ని పరిశీలిస్తే, మనసు దోచుకున్న వనిత తనను ఒక పోటీ తరువాత భర్తగా స్వీకరించిన సన్నివేశం తరువాత ఈ పాట చిత్రంలో వస్తుంది. వన్నెలున్న రాణి తన మనసు దోచుకుందని ఆమెకు తెలుపుతాడు భర్త. దాని సమాధానంగా ఆయనను కన్నులలో దాచుకుని ఆరాధిస్తానని పలుకుతుంది ఆ భార్య. భర్త చరణాల నీడలో తరిస్తానని ఆ భార్య సంకల్పం. ఎలా? పూల దండలా, కర్పూరంలా అట. అతని వ్యక్తిత్వానికి సుగంధము, వెలుగు ఆమే కదా? అంతటి పవిత్రమైన భావన ఆ భార్యది. ఆ భార్య తెలివిని మెచ్చుకుంటూ తన అంతరంగంతో వీడిన సంకెళ్లు వేశావు అని ఆ భర్త భావించాడు. తన మసును ఒక మందిరంగా చేసుకుంది ఆ భార్య. అంటే, ఎంతో పవిత్రంగా చేసుకొని, దానిలో తన భర్తను దేవతగా భావించింది. హృదయంలో నిలిచిన భర్తతో తాను ఏకమై పోతాను అంది. జీవాత్మ-పర్మాత్మల అనుసంధానానికి భార్యా-భర్తల సంబంధానికి ఎలా సారూప్యత ఉందో చూడండి. మరి దానికి భర్త చేయాల్సింది ఏమిటి? ఆమెను అతిచరించకుండా, ఆ అనుబంధాన్ని మరపురానిగా చేయటం. నాయకుడు అలానే భావించి ఏనాటిదో ఈ బంధం, దాన్ని తెలుసుకోలేము, అది ఎన్ని యుగాలైనా ఇగిరిపోని గంధం లాంటిది అన్నాడు. చూశారా? నారాయణ రెడ్డి గారు నాయకుడి మనోగతం ద్వారా భార్యా భర్తల మధ్య సంబంధానికి శాశ్వతత్వం ఎలా ఆపాదించారో? అందుకీ ఈ గీతం యాభై ఏళ్ల తరువాత కూడా సుగంధాలు విరజిమ్ముతూనే ఉంది.

అన్న ఎన్‌టీఆర్, జమున గారు ఈ పాటలోని భావ వ్యక్తీకరణలో జీవించారు. అందానికి మారుపేరైన ఇద్దరూ ఒక పవిత్రబంధాన్ని మరింత అందంగా ఆవిష్కరించారు. చందమామ అంత అందంగా, చల్లగా, ప్రశాంతంగా ఎన్‌టీఆర్ నటించగా, ఆనంద బాష్పాలు రాలుస్తూ ఆరాధనా భావం మనోజ్ఞంగా ఒలికించారు జమున గారు. ఘంటసాల మాష్టారు-సుశీలమ్మ ఈ గీతానికి అమృతత్వం ఆపాదించారు. ఈ చిత్రం ఎన్‌టీఆర్ గారు స్వీయ బ్యానర్ అయిన ఎన్ఏటీ ద్వారా నిర్మించారు. 

20, ఫిబ్రవరి 2016, శనివారం

తొలిరేయి గీతాలు - ఎంత హాయి ఈ రేయి (గుండమ్మ కథ)

తొలిరేయి గీతాలు - ఎంత హాయి ఈ రేయి (గుండమ్మ కథ)


పెళ్లైన జంటకు తొలిరేయి మరపురానిది. ఇద్దరు ఒకటయ్యే వేళ మధురభావనలన్నీ పండే వేళ. ఆ భావనలను అలనాటి చిత్రాలలో అశ్లీలం లేకుండా ఎంతో అందంగా చిత్రకీరించే వారు. అప్పటి దర్శకులు, గేయ రచయితలు తొలి కలయికకు సూచికగా ఎంతో భావయుక్తమైన గీతాలను అందించారు. తొలిరేయి చిత్రీకరణలో నటీనటుల ప్రతిభను నిరూపించుకునే అవకాశం ఉంది. సున్నితమైన శృంగారాన్ని, ప్రేమానురాగాలను, కొంటెతనాన్ని, పవిత్రమైన బంధాన్ని నటనలో ప్రదర్శించవచ్చు. అలా చేసిన నటులు ఆ గీతాలను అజరామరం చేశారు. ఒక స్త్రీకి తన భర్తపై గల అనురాగం, ఒక పురుషుడికి తన పత్నిపై గల అధికారం కలబోసిన ఎన్నో గీతాలు తెలుగు సినీ స్వర్ణయుగంలోని చిత్రాలలో వచ్చాయి. అవి బహుళాదరణ పొందాయి. అటువంటి గీతాలలో మొట్టమొదటగా నాకు గుర్తుకు వచ్చేది గుండమ్మ కథ చిత్రంలో "ఎంత హాయి ఈ రేయి ఎంత మధురమీ హాయి" అనే యుగళ గీతం. తొలిరేయి గీతాలు శీర్షికన మొట్ట మొదట ఈ గీతం వివరాలు మీకు అందిస్తున్నాను.

ఎంత హాయి ఈ రేయి ఎంత మధురమీ హాయి 
చందమామ చల్లగా మత్తు మందు చల్లగా
చందమామ చల్లగా పన్నీటి జల్లు చల్లగా

ఒకరి చూపులొకరిపైన విరితూపులు విసరగా
ఒకరి చూపులొకరిపైన విరితావులు వీచగా
విరితావుల పరవడిలో విరహమతిశయించగా
విరితావుల ఘుమఘుమలో మేను పరవశించగా

కానరాని కోయిలలు మనల మేలుకొలుపగా
కానరాని కోయిలలు మనకు జోలపాడగా
మధుర భావలాహిరిలో మనము తూలిపోవగా
మధుర భావలహరిలో మనము తేలిపోవగా

విజయా ప్రొడక్షన్స్ పతాకంలో కమలాకర కామేశ్వరరావు గారి దర్శకత్వంలో 1962లో విడుదలైన గుండమ్మ కథ చిత్రంలోనిది ఈ గీతం. పింగళి నాగేంద్రరావు గారి సాహిత్యాన్ని అందించగా ఘంటసాల మాష్టారు సంగీతం కూర్చారు. మాష్టారు, సుశీలమ్మ యుగళగీతాన్ని అక్కినేని, జమునల జంటపై చిత్రీకరించారు.

కలలతోటలే విహరించే ఓ స్త్రీ మనోభావాలను, ఆమె భర్త మనోభావాలను దాదాపుగా ఒకే రకమైన పదాలైనా, వైవిధ్యాన్ని విలక్షణంగా అందించారు పింగళి వారు. ఘంటసాల మాష్టారి సంగీతానికి ఒక ప్రత్యేకమైన ముద్ర ఉంది. మాధుర్యానికి, రాగ లక్షణాలకు ఆయన పెద్ద పీట వేసేవారు. అదే శైలి ఈ పాటలో కనబడుతుంది. ఒకింత శృంగారము, ఒకింత మైమరపు, ఒకింత పులకింత, ఒకింత ఎదురుచూపు...అన్ని మధుర భావనలూ పింగళి ఈ గీతంలో ఒలికించారు. భార్యాభర్తల మధ్య శృంగారానికి పవిత్రమైన మధుర భావనలే నాంది. దాన్ని కవి ఈ గీతంలో చాలా స్పష్టంగా ఆవిష్కరించారు.

స్త్రీకి పురుషుడికి ఉన్న భావనలలో తేడాను కవి ఎంత సునిశితంగా ప్రతిపాదించారో చూడండి. నాయకుడు చందమామ చల్లగా మత్తు మందు జల్లగా అన్నాడు. కొంత శృంగార భావనలో మత్తు, మైకము మగవారికి చల్లని వాతావరణంలో కలిగే మాట నిజమే. దానినే ఆ స్త్రీ పన్నీటి జల్లు చల్లగా అని మార్చి పాడింది. స్త్రీ భావనలో చందమామ చల్లదనం పన్నీటి జల్లుగా అనిపించటం స్త్రీత్వానికి ప్రతీక. ఇంద అందంగా మొదలైన గీతం చరణాల్లో మరింత భావగర్భితమైంది.

శృంగారానికి అధిదేవత మన్మథుడి సృష్టి అయిన పూలబాణాలు చూపులతో విసురుకున్నట్లు నాయకుడు భావించటం ఆయనలో మన్మథుడు రేపిన వలపుల తలపులు అంత వాడిగా ఉన్నాయి అనే దానికి ప్రతీక. అదే ఆ స్త్రీ ఆ చూపులను పూల సుగంధాలుగా భావించింది. స్త్రీ సున్నితత్వానికి రతీదేవి ప్రతీక. పింగళి వారు ఎంత అందంగా, విరితూపులు-విరితావులు అన్న పదాలలో భేదాన్ని మనకు అందించారో? మరి మన్మథుడి బాణాలు తగిలితే జరిగేది మైమరపులో తూలిపోవటమే కదా? దానినే నాయకుని తదుపరి భావనగా తెలిపారు. పూల సుగంధాలు తాకితే? మగవారికి విరహాతిశయమే కదా? అదే స్త్రీకి? ఆ ఘుమఘుమలతో శరీరం పరవశించిందిట. ఇదీ మొదటి చరణంలో పింగళి వారి శృంగార రసధార.

ఇక రెండవ చరణంలో - కనిపించని కోయిలలు పాడి ఆ నాయకునిలో కోరికలను మేలుకొలిపితే నాయిక ఆ కోయిల పాటను జోలపాటగా భావించింది. మళ్లీ స్త్రీ పురుషుల భావనలో ప్రకృతీ పురుషుల విలక్షణతను ఆవిష్కరించారు కవి. మరి కోయిల పాటతో మేల్కొన్న పురుషుడికి స్త్రీపై కలిగిన మధుర భావనల వలన జరిగేది మైమరపులో తూలిపోవటమే కదా? దానినే నాయకుని తదుపరి భావనగా తెలిపారు. కోయిల గానం జోలపాటగా భావించిన స్త్రీకి మధురమైన ఆ భావనలో మనసు తేలిపోతాయి కదా? దానిని నాయకి భావంగా ప్రతిపాదించారు. ఇదీ రెండవ చరణంలో పింగళివారి శృంగార రసావిష్కరణ.

పింగళి వారి సాహిత్యానికి ఘంటసాల  మాష్టారి సంగీతం తలమానికమైంది. అప్పటికే అగ్రశ్రేణి నేపథ్యగాయకులుగా ఉన్న మాష్టారు, సుశీలమ్మ ఈ పాటలోని భావానికి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. మధురమైన లలిత శృంగార గీతానికి మోహన రాగాన్ని మించినదేముంది? సమ్మోహనం చేసే సంగీతాన్ని మాష్టారు ఈ రాగంలో ఈ గీతానికి అందించారు. సౌందర్యానికి, ఒకింత పొగరుకు, హావభావాలకు, పెంకితనానికి జమునగారు పెట్టిన పేరు అయితే, ధీరుడైన, పరిణతి చెందిన యువకునిగా నటించటం నాగేశ్వరరావు గారికి కొట్టిన పిండి. ఆనాటి సాంఘిక చిత్రాలలో వీరి నటనకు ప్రజలు జేజేలు పలికారు. వారిలో గొప్పతనం ఏమిటంటే శృంగార సన్నివేశాలలో కూడా అంతే అద్భుతంగా నటించారు. దానికి ఈ గీతం చక్కని ఉదాహరణ. సంగీతం, సాహిత్యం, గాత్రం, నటన కలయికే ఈ అజరామరమైన తొలిరేయి గీతం. ఇప్పటికీ దీని సుగంధం మనకు అందుతూనే ఉంది.

18, ఫిబ్రవరి 2016, గురువారం

కృష్ణ భక్తి - ఐదవ సంచిక

కృష్ణ భక్తి - ఐదవ సంచిక


కృష్ణభక్తిలో రుక్మిణికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ భక్తిలో భర్త పట్ల ప్రేమానురాగాలతో పాటు ఆయన లోకేశ్వరుడు అన్న పరిపూర్ణమైన నమ్మకం ఉంది. స్వామిని అచంచలమైన భక్తి ప్రేమలతో కొలిచే రాణి రుక్మిణి. ఆ శ్రీమహాలక్ష్మి స్వరూపిణి యొక్క భక్తి వివరాలు ఈ రోజు "కృష్ణ భక్తి - ఐదవ సంచిక" లో తెలుసుకుందాం.

విదర్భదేశానికి రాజైన భీష్మకుని ఇంట రుక్మి, రుక్మరథుడు, రుక్మబాహువు, రుక్మకేశుడు, రుక్మనేత్రుడు అన్న సోదరులకు చెల్లెలిగా రుక్మిణి జన్మించింది. ఆ రుక్మిణి యుక్తవయసుకు రాగానే శ్రీకృష్ణునికి ఆమెపై వలపుల తలపులు కలిగాయి. తన తండ్రి భవనానికి వచ్చే అతిథుల ద్వారా శ్రీకృష్ణుని రూప గుణ వైభవాలు, శక్తి పరాక్రమాలు తెలుసుకున్న రుక్మిణి ఆ మహాత్ముడే నా భర్త అని నిశ్చయించుకుంది. అలాగే శ్రీకృష్ణుడు కూడ ఆమె సౌందర్యము మరియు సౌశీల్యము గురించి తెలుసుకొని ఆమెను తన పత్నిగా భావించాడు. ఆత్మబంధువులంతా వారిరువురికి వివాహము చేయుట మేలు అన తలచారు. కానీ, కృష్ణ విరోధి అయిన అన్న రుక్మి ఆమెను శిశుపాలునికిచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించాడు. అప్పుడా రుక్మిణి అగ్నిద్యోతనుడనే బ్రాహ్మణుని ద్వారా స్వామికి విదర్భ వచ్చి తనను తీసుకు వెళ్లమని సందేశం పంపింది. శ్రీమదాంధ్ర మహాభాగవతంలో పోతన దశమ స్కంధంలో ఈ విధంగా దీన్ని వివరించారు.

ఏ నీ గుణములు కర్ణేంద్రియంబులు సోఁక దేహతాపంబులు దీరిపోవు
నే నీ శుభాకారమీక్షింపఁ గన్నులకఖిలార్థంబు కలుగుచుండు
నే నీ చరణసేవలే ప్రొద్దుఁ జేసిన భువనోన్నతత్వంబుఁ బొందఁ గలుగు
నే నీలసన్నామమేప్రొద్దు భక్తితోఁ దడవిన బంధ సంతతులు వాయు

నట్టి నీయందు నా చిత్తమనవరతము నచ్చి యున్నది నీ యాన నాన లేదు
కరుణఁ జాడుము కంసారి ఖలవిదారి శ్రీయుతాకార మానినీ చిత్తచోర

"ఓ కంసాంతకా! నీ సుగుణాల వివరాలు చెవులకు సోకగానే దేహతాపములు తీరును. చూడముచ్చటైన నీ రూపము చూసినంతనే కన్నులకు అన్ని శుభఫలములు కలుగును. ఎల్లప్పుడూ నీ పాదసేవ చేసే వారికి సమస్త ఔన్నత్యములు కలుగును. స్త్రీల మనసును దోచుకునే స్వామీ! నిరంతరమూ నీ పవిత్రమైన నామమును భక్తితో స్మరించువారికి అన్ని బంధములు తొలగును. అటువంటి నీ పై నా మనసు ఎల్లపుడూ లగ్నమై ఉంది. నాపై కరుణ చూపుము!" అని వేడుకుంటుంది.

ఘనులాత్మీయతమోనివృత్తి కొరకై గౌరీశుమర్యాద నె
వ్వనిపాదాంబుజతోయమందు మునుఁగన్ వాంఛింతురేనట్టి నీ
యనుకంపన్ విలసింపనేని వ్రతచర్యన్ నూరుజన్మంబులన్
నినుఁ జింతించుచుఁ బ్రాణముల్ విడిచెదన్ నిక్కంబు ప్రాణేశ్వరా!

"ప్రాణనాథా! మహాత్ములు తమ అజ్ఞానము తొలగుటకై శివునిలా నీ పాదపద్మములనుండి జారిన గంగాజలములో మునుగుటను కోరుకుంటారు. అటువంటి మహనీయుడవైన నీ యొక్క కృపకు నేను పాత్రురాలిని కాకపోతే కన్యగానే మిగిలిపోతాను. ఎన్ని జన్మలైనా నిన్నే ధ్యానిస్తాను. అంతే కాదు, నా ప్రాణాలు విడవటానికైనా సిద్ధమే. ఇది ముమ్మాటికీ నిజం"...

ఇలాగ, పరి పరి విధముల వేడుకున్న రుక్మిణి సందేశాన్ని అగ్నిద్యోతనుడు శ్రీకృష్ణునికి విన్నవించగా ఆయన ఆమె మనోభీష్టాన్ని తెలుసుకొని సంతోషించి, విదర్భపై దండెత్తి రుక్మిణిని అపహరించి పరిణయమాడాడు.

రుక్మిణి భక్తి ఒకరకంగా మధురభక్తే. స్వామియే సర్వస్వము అనుకొని ఆతనికి తన మనము, తనువు, అంతఃకరణమును సమర్పించి ఆతని కోసమై వేచిన సాధ్వి ఆమె. స్వామి మహిమను తెలిసిన పతివ్రతా శిరోమణి. నిరంతర పతి ధ్యాన నిరత.  నిర్మలమైన తన ఆత్మను స్వామికి సమర్పించిన మహాభక్తురాలు.

ఒకసారి శ్రీకృష్ణుడు రుక్మిణి ఆట పట్టించటానికి "ఓ రుక్మిణీ! ఎందరో మహా పరాక్రమవంతులైన మహారాజులుండగా ఏమీ లేని, ఎవరికీ చెందని, ఈ యాదవుడనైన నన్ను ఎందుకు పరిణయమాడావు" అని అడుగుతాడు. అపుడామె:

రూఢిమైఁ బ్రకృతి పూరుష కాలములకు నీశ్వరుఁడవై భవదీయ చారు దివ్య
లలితకళా కౌశలమున నభిరతుఁడై కడగు నీ రూపమెక్కడ మహాత్మ!
సత్త్వాది గుణ సముచ్చయ యుక్త మూఢాత్మనయిన నేనెక్కడ ఘన చరిత!
కోరి నీ మంగళ గుణభూతి దానంబు సేయంగఁబడునని చెందు భీతి
నంబునిధి మధ్యభాగమందమృత ఫేన పటల పాండుర నిభమూర్తి పన్నగేంద్ర
భోగశయ్యను బవ్వళింపుచును దనరునట్టి యున్నతలీల దివ్యంబు దలఁప

"పరమాత్మా! నీ చరితము దివ్యమైనది. ప్రకృతీపురుషులకు, కాలానికి నువ్వు ప్రభువువు. నీది దివ్యమనోహర రూపము. ఎంతో అందముగా ఉండే కళలలో నీవు నైపుణ్యం కలవాడవు. అద్భుతరూపసంపన్నుడవైన నీవెక్కడ? సత్త్వరజస్తమోగుణములతో ఉన్న మూఢురాలను నేనెక్కడ? శుభకరమైన నీ సద్గుణములను ఇతరులకు దానము చేయవలసి వస్తుందేమో అనే శంకతో నీవు ఇష్టపూర్వకముగా పాలసముద్రము మధ్యలో అమృతపు నురగల వలె తెల్లగా ఉన్న ఆదిశేషునిపై పవళించి యున్నావు. ఇవన్నీ నీ దివ్యలీలలే అని స్వామి వైభవాన్ని విశదీకరిస్తుంది. ఇంకొక ముందడుగు వేసి ఆధ్యాత్మికంగా స్వామి గొప్పతనాన్ని వివరిస్తుంది..."

శబ్దస్పర్శరూపరసగంధంబులనియెడు గుణంబులచేతఁ బరిగ్రహింపఁబడిన మంగళ సుందర విగ్రహుండవై, అజ్ఞానాంధకార నివారకంబైన రూపంబు గైకొని , భవదీయులైన సేవకులకు ననుభావ్యుండవైతివి. భవత్పాదారవింద మకరంద రసాస్వాద లోలాత్ములైన యోగీంద్రులకైనను భవన్మార్గంబు స్ఫుటంబు గాదట్లగుటంజేసి యీ మనుజపశువులకు దుర్విభావ్యంబగుట యేమి సెప్ప. ఇట్టి ఈశ్వరుండవైన నీకు నిచ్ఛ స్వతంత్రంబు గావున. అదియును నాకధికంబు గావున నిన్ను నేననుసరింతు. దేవా! నీవకించనుడవైతేని బలి భోక్తలైన బ్రహ్మేంద్రాదులెవ్వరి కొరకు బలి సమర్పణంబు చేసిరి. నీవు సమస్త పురుషార్థమయుండ వనియును, ఫలస్వరూపివనియును, నీ యందలి ప్రేమాతిశయంబులంజేసి, విజ్ఞాన దీపాంకురంబున నిరస్త సమస్త దోషాంధకారులై, యిహ సౌఖ్యంబులు విడిచి, సుమతులు భవదీయ దాససంగంబు కోరుచుందురట్లు సేయనేరక, నిజాదికారాంధకార మగ్నులైనవారి భవతత్త్వంబు దెలిసి, బలిప్రక్షేపణంబులు సేయంజాలక, మూఢులై, సంసారచక్రంబునంబరిభ్రమింతురదియును గాక

వరమునీంద్ర యోగివర సురకోటిచే వర్ణిత ప్రభావ వైభవంబు 
గలిగి యఖిలచేతనులకు విజ్ఞానప్రదుండవగుదవభవ! దురితదూర!

"స్వామీ! నీవు సహజముగా దివ్యమంగళ స్వరూపుడవే అయినప్పటికీ, శబ్ద స్పర్శ రూప రస గంధాది పంచతన్మాత్రలతో ప్రకాశించే మంగళకర రూపమును దాల్చినావు. నీ దివ్యరూపము అజ్ఞానాంధకారాన్ని తొలగించేది. ఆ విధముగా సగుణ రూపుడవైన నీవు ఆరాధింపదగిన వాడవు. గొప్ప యోగులు కూడా నీ పాదపద్మములలోని తేనెను రుచిచూచుటకై తహతహలాడుతారు. అట్టి వారికి కూడా నీ తత్త్వము బోధపడదు. కాబట్టి పశువులతో సమానమైన ఈ మానవులకు నీ తత్త్వము ఎలా తెలుస్తుంది? నువ్వు సర్వేశ్వరుడవు. నీ సంకల్పానికి తిరుగులేదు. అది కూడా నాకు తెలియదు. అందుకే నేను నిన్ను అనుసరిస్తున్నాను. దేవా! నీవు ఏమీ లేని వాడవు. కానీ, బ్రహ్మాది దేవతలు కూడా నీకు బలి సమర్పిస్తున్నారు. అనగా నీవు వారికన్నా గొప్పవాడివనే కదా అర్థం! కాబట్టి నీవు అన్నిటినీ మించినవాడివి. చతుర్విధ పురుషార్థములు నీ స్వరూపాలే. యజ్ఞము, యాగము, తపస్సు మొదలైన కర్మల ఫలస్వరూపము నీవే. సజ్జనులు నీపై గల ప్రేమచే విజ్ఞానము యొక్క ప్రభావముతో సమస్త దోషములను పారద్రోలుతారు. వారు ఐహిక సుఖములను వదలి నీ దాసుల సాంగత్యమును కోరుకుంటారు. మూఢులు భౌతిక సుఖములను వదులుకోలేక అధికారములనే అంధకారములో కొట్టుమిట్టడుతూ నీ తత్త్వమును తెలుసుకోలేక, నిన్ను ఆరాధించక జనన మరణములనే చక్రములో పరిభ్రమిస్తారు. స్వామీ! నీవు పాపాలను బాపే వాడవు. మునులు, యోగులు, సమస్త దేవతలు నీ ప్రభావ వైభవమును వర్ణిస్తారు. నీవు అన్ని ప్రాణులకు విజ్ఞానాన్ని ఇచ్చేవాడవు..."

జలజనాభ! సకల జగదంతరాత్మవైనట్టి దేవ! నీ పదారవింద
యుగళి సానురాగయుక్తమై నా మదిఁ గలుగునట్లు గాఁగఁ దలఁపుమనఘ!

పృథురజోగుణ ప్రవృద్ధమైనట్టి నీ దృష్టిచేత నన్నుఁ దేరుకొనఁగఁ 
జూచుటెల్లఁ బద్మలోచన నీమీఁది ఘన దయార్ద్ర దృష్టిగాఁ దలంతు

"పద్మనాభా! మహాత్మా! నీవు ఈ ప్రపంచములో సమస్త ప్రాణులకు అంతరాత్మైనట్టి స్వామివి. నా మనస్సులో నిరంతరం నీ పాదకమలముల యందు భక్తి అనురాగములు వర్ధిల్లేలా అనుగ్రహింపుము. నీ చూపుల ద్వారా అనంతమైన ప్రేమానురాగాలు నాపై ప్రసరించి నన్ను తేరుకునేలా చేసితివి. నా మీద నీకు గల గొప్ప దయాదృష్టికి ఇదే నిదర్శనం..."

అని ఎంతో ఉదాత్తమైన భక్తితో, జ్ఞానంతో రుక్మిణి స్వామి వైభవాన్ని వేనోళ్ల నుతించింది. రుక్మిణి స్వామిని తన భరతగా మాత్రమే అనుకోక పరమాత్మగా గ్రహించింది. స్వామికి ఉన్న అనేక కోట్ల భక్తులలో తాను ఒకరు అనుకుంది. అందుకే ఆమెలో ఇతర కృష్ణ పత్నుల పట్ల అసూయ లేదు. భాగవతంలో శ్రీకృష్ణ తులాభారం గురించి రాయలేదు. కానీ, ఆ తులాభార ఘట్టం అనేక చోట్ల ప్రస్తావించబడింది. సత్యభామను పరీక్షించటానికి నారదుడు ఆమేచే వ్రతము చేయించి స్వామిని తనకు వ్రతఫలముగా దానమిప్పించుకుంటాడు. స్వామి దాస్యాన్ని విడిపించి, స్వామిపై పూర్తి హక్కులు కాలంటే ఆయనకు తూగగల సంపదను ఇస్తే చాలు అంటాడు.  అజ్ఞానంలో సత్యభామ ఆ తప్పటడుగు వేస్తుంది. తన దగ్గర ఎన్ని సంపదలు తులాభారంలో వేచినా అది స్వామికి సరితూగదు. అప్పుడు ఆమె రుక్మిణి వద్దకు వెళ్లి సాయం కోరుతుంది. స్వామిపై అచంచలమైన భక్తితో స్వామికి సమర్పించే తులసీదళాన్ని తీసుకు వెళుతుంది. స్వామికి తులసీదళం అత్యంత ప్రీతికరమైనదని తెలుసు. అందుకే భక్తితో స్వామిని ప్రార్థించి ఆ దళాన్ని తులాభారంలో ఉంచుంతుంది. స్వామి దానికి బద్ధుడవుతాడు.
సముద్రాల రాఘవాచార్యుల వారు ఈ రుక్మిణి భక్తిని, విశ్వాసాన్ని ఈ పద్యంలో అద్భుతంగా పండించారు.

"ఫలమో ఘన రసంబో పత్రమో పుష్పమో కొనుచు భక్తి నిన్ను కొలుచు వారికి ఈవు వశుడవగుటయే సత్యమేని ఈ తులసి దళము నిన్ను తూచు గాక!"

భగవద్గీతలో స్వామి చెప్పాడు కదా? పత్రం పుష్పం ఫలం తోయం, ఏదైనా భక్తితో నాకు సమర్పిస్తే దానిని స్వీకరిస్తాను అని? అదే విధంగా రుక్మిణి భక్తితో సమర్పించిన ఆ తులసీదళం స్వామిని తులాభారంలో బద్ధుడిని చేస్తుంది. ఇక్కడ తులసీదళం కాదు ముఖ్యం, రుక్మిణి భక్తి. ప్రభువుపై ఆమెకు గల విశ్వాసం. దీనినే వేటూరి సుందరరామమూర్తి గారు "తులసీదళానికి తేలిపోయి తూగునటే ఆనందలీల ఔరా అమ్మక చెల్లా ఆలకించి నమ్మడమెలా అంత వింత గాథల్లో ఆ నందలాలా" అని అద్భుతంగా ఆవిష్కరించారు.

కృష్ణ భక్తి సామ్రజ్యంలో రుక్మిణి స్థానం స్వామి హృదయంలోనే. 

17, ఫిబ్రవరి 2016, బుధవారం

జంధ్యాల హాస్య గుళికలు - మూడవ సంచిక

జంధ్యాల హాస్య గుళికలు - మూడవ సంచిక


జంధ్యాల గారి శ్రీవారికి ప్రేమలేఖ చిత్రానికి ఉన్న ప్రత్యేకత తెలుగు భాషను పునరుద్ధరించే ప్రయత్నం చేయటం, తెలుగుదనాన్ని ఉట్టిపడే వాతావరణాన్ని సినిమాలో అడుగడుగునా చూపించటం. ఈ ఘనత మొత్తం జంధ్యాల గారిదే. అగ్రశ్రేణి నటీనటులు లేకుండా, పదునైన సంభాషణలు, సహజత్వము  రంగరించి ఆయన హాస్యం పండించారు. అందుకే చిత్రం ఘన విజయం సాధించింది. మధ్యతరగతి కుటుంబాలలో ఉండే ఆవేశకావేశాలు, సంతోషాలిచ్చే చిన్న చిన్న పనులు, మనుషుల మధ్య ఉండే ప్రత్యేకమైన బంధాలకు జంధ్యాల గారు ప్రాణం పోసి చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమా కథల పిచ్చి కల శ్రీలక్ష్మి, ఆమె బాధితుల ఘోష, పరంధామయ్య ప్రాస వాగుడు, భాస్కరం పేకాట్ స్నేహితుల సంభాషణలతో ఎన్నో రసవత్తరమైన సన్నివేశాలున్నాయి. ఆ కుటుంబంలో జరిగే మరో కొన్ని అద్భుతమైన సన్నివేశాలను "జంధ్యాల హాస్య గుళికలు - మూడవ సంచిక"గా మీకు అందిస్తున్నాను

ఊరు వచ్చి తిరిగి పట్నానికి వెళుతున్న ఆనందరావును బస్సు ఎక్కించటానికి మొత్తం కుటుంబం వెళ్లిన నేపథ్యం, తదుపరి సీన్లలో ఈ సంభాషణలు.

*************************************************

భీముడు: "మహాప్రభో"

పరంధామయ్య: వెధవను రెడీగా ఉండమను. ఇంకో సంబంధముందని రాయగానే రెక్కలు కట్టుకొని రాలమను వెధవను.."

భీముడు: "చిత్తం..." "మహాప్రభో...ఈ మాట ఇప్పుడే చెప్పొస్తున్నాను కదా"

పరంధామయ్య: "నీ పని నేను చెప్పింది చేయటమే. ఈలోపు ధర్మసందేహాలొస్తే బెజవాడ రైల్వే స్టేషనుకు పంపించు. ఆయనెవడో చెబుతుంటాడే..మా కుక్కకు గజ్జి పట్టింది ఏమి చెయ్యమంటారు అంటే బొచ్చుపీకండి గజ్జి తగ్గిపోతుంది అని..ఆయనకు రాయి సమాధానం చెబుతాడు అనుమాన పక్షి. ఆ అడ్డగాడిదతో మాట్లాదకూడదని నిర్ణయించుకున్నాను కాబట్టి కానీ లేకపోతే నేనే చెవి మెలేసి చెప్పేవాడిని వెధవకి..."

భీముడు: "చిత్తం..."

పరంధామయ్య:"చిత్తమంటూ ఇంకా ఇక్కడే తగలడ్డవేం? వెళ్లు"

భీముడు: "వెళుతున్నాను కదా మహాప్రభో..."

భీముడు ఆనందరావుతో: "బాబూ తమరు మళ్లీ త్వరలో పెళ్లి చూపులకు రావటానికి రెక్కలు అవీ కట్టుకొని సిద్ధంగా ఉండమన్నారు మహాప్రభువుల వారు"

పూర్ణ: "బస్సింకా వచ్చేలా లేదు. ఈలోపు శ్రీమంతుడు సినిమా కథ చెప్పనా"

కామాక్షి: "సరే. వేటగాడు కథ చెప్తానేం..."

భాస్కరం: "అబ్బబ్బబ్బా మళ్లీ మొదలెట్టావా. అసలు నీకిన్ని కథలు పేర్లు గుర్తున్నందుకు నీ బుర్రను మ్యూజియంలోనూ నిన్ను జూలోనూ ఉంచాలే.....అదిగో వచ్చేసింది బస్సు"

పరంధామయ్య: "రండి రండి ఏమిటా పెళ్లి నడక.." ..."ఆ ఎక్కరా"

కండక్టరు: "ఎన్ని టికెట్లండీ"

భాస్కరం: "ఒకటే"

కండక్టరు: "ఒక్కటా! ఒక్క టిక్కట్టుకు ఇంతమందొచ్చారేంటండీ? బస్సు ఖాళీగా ఉంది. అందరు ఎక్కండి సార్"

పరంధామయ్య:" నీ బస్సు ఖాళీగా ఉంటే మేమంతా ఎక్కాలా అంట్ల వెధవ"

భీముడు:"కండక్టర్ తమ కొడుకు కాదు మహాప్రాభో తమరు ఎన్ని తిట్టినా పడుండటానికి ఊరుకోండీ"

భాస్కరం: "నువ్వు పద బాబూ పద"

కామాక్షి: "ఎక్కరా చంటీ, జాగర్త"

అమ్మ:"ఆవకాయ మాగాయ జాడీల్లో పెట్టాను. ఉసిరికాయ పచ్చడికి గాలి తగలకుండా చూడు. బూజుపడుతుంది. జాడీలు జాగ్రత్త. బస్సు కుదుపుల్లో కదిలిపోకుండా చూడు.."

పరంధామయ్య: "రోజూ క్రమం తప్పుకుండా మాదీఫలరసాయనం వాడమను శుంఠని"

అమ్మ: "సామాన్లు జాగ్రత్తమ్మా.."
కామాక్షి: "ఒరేయ్ లెక్కపెట్టుకోరా చంటీ"

ఆనందరావు: "ఇక మీరు బయలుదేరండి నాన్నా!"

భాస్కరం:"నీ ఆరోగ్యం జాగ్రత్తరా చంటీ"

అమ్మ: "ఎండలో ఎక్కువగా తిరక్కు నాన్నా"

పరంధామయ్య: "ప్రతిరోజూ మొదటి ముద్ద ఉసిరికాయ పచ్చడేసుకు తినమను కుంకని. పైత్య ప్రకోపం తగ్గుతుంది..."

ఆనందరావు:"ఇక మీరు బయలుదేరండి నాన్నా...బస్సెక్కాను కదా"

కామాక్షి: "ఓసారి ఎప్పుడైనా మావూరు రారా చంటి. కొత్త కొత్త పిండి వంటలు చెసిపెడతాను తిందువు కాని"

పరంధామయ్య భీముడుతో: "ఈసారి పెళ్లిచూపులకు రానని ఇష్టం లేదని రాశాడో నీకు గుండు గీకిస్తాను ఆ విషయం చెప్పు సన్నాసికి"

భీముడు: "బాబూ! నా జుట్టుమీద దయుంచి పెళ్లి చూపులకు తప్పకుండా రండి బాబూ!"...."చెప్పాను మహాప్రభో చెప్పాను"

పరంధామయ్య: "ఆ ఆ! ఇక బస్సు బయలుదే...."

అక్కడ జరుగుతున్న దృశ్యాన్ని చూసి పరంధామయ్య బస్సుకేసి తలబాదుకుంటాడు

భాస్కరం: "ఏమిటి ఏమయ్యింది"

పరంధామయ్య భాస్కరంతో: "అటు చూడు మీ ఆవిడని"...

పూర్ణ డ్రైవరుతో: "రామకృష్ణా సినీ స్టూడియోస్ వారి డ్రైవర్ రాముడు సినిమా చూశావా?"

డ్రైవరు: "చూడలేదండీ"

పూర్ణ: "అందులో ఎన్‌టీ రామారావు లారీ డ్రైవరుగా ఎంత బాగ చేశాడనుకున్నావ్?"

భాస్కరం: "ఒసేయ్ ఒసేయ్ ఆపవే...అవతల మా నాన్న బస్సు బద్దలు కొడుతున్నాడు...రా"

*****************************************************

పూర్ణ: "అప్పుడేమో జయశంకర్ పిచ్చ స్పీడుతో మోటర్ సైకిల్ మీద వచ్చి ఆ రౌడీల్ని దోసకాయ పచ్చడి చేసేస్తాడు.."

భాస్కరం: "జయశంకర్‌కి దోసకాయ పచ్చడంటే బాగా ఇష్టమేమో? "
పూర్ణ: "తన కోసం ప్రాణాలు కూడ లెక్క చేయకుండా ఆ రౌడీలతో ఫైట్ చేసిన ఆ జయశంకర్‌కి సీత తన మనసిచ్చేస్తుంది"

భాస్కరం: "ఎలా ఇస్తుంది. కోసిస్తుందా లేదా దోసకాయ పచ్చడి షేపులో దంచిస్తుందా మనసు?"

పూర్ణ: "అబ్బా! అది కాదండీ! ఆ తరువాత వాళ్లిద్దరూ పార్కులో పాట పాడుకుంటారన్నమాట మనసూ ఇచ్చినా పూసా పూసా వెన్నపూస.."

భాస్కరం: "జయశంకర ఇదివరకు వెన్నపూస వ్యాపారం చేసేవాడు కాబోలు"

పూర్ణ: "కంటిలో వెలుగా పూసా పూసా"

భాస్కరం: "ఆపవే! రిక్షావాడు కథ వినలేక వాలిపోయి తొక్కుతున్నాడు చూడు"

పూర్ణ: "టాట్టడాయ్ టట్టటట్టడాయ్"

భాస్కరం: "బాబు ఆపాపు రిక్షా ఆపు"

పూర్ణ: "ఏంటండీ. ఇప్పుడే కథ బావుంటుంది"

భాస్కరం: "కథతో పాటు నా ఆరోగ్యం కూడా బావుండాలి కదా పూర్ణా!..ఆ..చూడూ...మొన్ననే కొత్త మంగళసూత్రాలు చేయించుకున్నావు. వాటి మీద ప్రేమతో అన్నా నాకప్పుడప్పుడూ కాస్త రెష్టిస్తూ ఉండు..ఇదే ఇంటర్వెల్ అనుకో"

**********************************************

భాస్కరం హార్మణీతో: "ఇక్కడున్నావేమిటిరా హార్మణీ! "

హార్మణీ: "చంపేస్తాను వెధవల్ని. వాళ్ల చర్మం ఊడబీకి అడుగున్నర మందం చెప్పు కుట్టించుకుని ఎత్తు పెరుగుతా. వాళ్ల నాలికల్ని కట్ చేసి మా అమ్మాయి జడలకి రిబ్బన్లుగా చుట్టేస్తాను..హాయ్"

భాస్కరం: "ఎవరి మీదరా ఈ కోపం"

హార్మణీ: "ఇంకెవరు? ఆ కళ్లజోడు, మరచెంబు గాళ్లు. నెల తక్కువ వెధవలనీ"

భాస్కరం: "ఏమయిందీ? నువ్వెళ్లిన దగ్గరనుంచీ మా దగ్గర డబ్బుల్లేక నిన్నల్లా పేకాళ్లేదురా. చేతులు దురదలెక్కి వాచిపోవటం మొదలెట్టాయి. ఆ వెధవలిద్దరూ నన్నిక్కడ కూర్చోబెట్టి, ఆయన దగ్గర ఓ పది రూపాయలు తీసుకొని ఓ గంటలో ఆడుకొని వస్తామని వెళ్లారు. ఇప్పటికి నాలుగ్గంటలైంది వెళ్లి. ఇంతవరకూ రాలేదు. ఆయనేమో నా పదిరూపాయలు నాకిస్తావా కిళ్లీలు కడతావా అంటాడు. నాకేమో కట్టడం రాదు రాకపోతే నేర్చుకోమంటాడాయన. నేనెప్పటికి కిళ్లీలు కట్టడం నేర్చుకొని ఆయన పదిరూపాయలిచ్చి నేనెప్పటికి రుణం తీర్చుకొని బయట పడేది? .."

భాస్కరం: "ఊ సరే సరే ఏడవకు ఉండు"..."ఇదిగో! ఈ పదిరూపాయలు తీసుకొని మా వాడిని విడిచిపెట్టవయ్యా!"

*******************************************

ఇక్కడ రిక్షావాడు మూర్ఛపోతాడు.
భాస్కరం:"ఏమిటే! ఏవయ్యింది? "
పూర్ణ: "మీరెళ్లగానే, కథ తరువాత ఏమయిందమ్మా అని అడిగాడు..."
భాస్కరం: "అడిగాడూ...అర్థాయుష్షు వెధవ...వాడి గొయ్యి వాడే తవ్వుకున్నాడన్నమాట

*******************************************



పాతాళ భైరవి – 1951: తెలుగు జానపద చిత్రరాజం

1951 మార్చి 15న విడుదలైన పాతాళ భైరవి తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక కీలక మలుపు. విజయా ప్రొడక్షన్స్ పతాకంపై బి. నాగిరెడ్డి, ఆలూరి చక్రపాణి నిర్మ...