29, జులై 2017, శనివారం

నీ నామ రూపములకు నిత్య జయ మంగళం - త్యాగరాజస్వామి మంగళ హారతి



నీ నామ రూపములకు నిత్య జయ మంగళం 
పవమాన సుతుడు పట్టు పాదారవిందములకు ||నీ నామ||
పంకజాక్షి నెలకొన్న అంక యుగమునకు ||నీ నామ||
నళినారి గేరు చిరునవ్వు గల మోమునకు ||నీ నామ||
నవ ముక్త హారములు నటియించు యురమునకు ||నీ నామ||
ప్రహ్లాద నారదాది భక్తులు పొగడుచుండు ||నీ నామ||
రాజీవ నయన త్యాగరాజ వినుతమైన ||నీ నామ||

మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే
చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం

"నీ నామునకు, రూపమునకు నిత్యము జయము, మంగళము కలుగు గాక! వాయుపుత్రుడైన హనుమంతుడు సేవించే నీ పాదములకు, కలువలవంటి కన్నులు గల సీత కూర్చునే నీ అంకములకు (తొడలకు), చిరునవ్వుతో చంద్రునివలె ఉండే నీ మోమునకు, మంచి ముత్యముల హారములు నర్తించే నీ వక్షస్థలమునకు, ప్రహ్లాదుడు, నారదాదులు పొగడే అందమైన కన్నులు కలిగి పరమశివునిచే నుతించబడిన నీకు మంగళము"

- సద్గురువు త్యాగరాజస్వామి శ్రీరామునికి పాడిన మంగళ హారతి


రారా కృష్ణయ్య - దాశరథి గీతం



దీనుల కాపాడుటకు దేవుడే ఉన్నాడు 
దేవుని నమ్మిన వాడు ఎన్నడూ చెడిపోడు
ఆకలికి అన్నము వేదనకు ఔషధం
పరమాత్ముని సన్నిధికి రావే ఓ మనసా

రారా కృష్ణయ్య రారా కృష్ణయ్యా
దీనులను కాపాడ రారా కృష్ణయ్యా
రారా కృష్ణయ్యా రారా

మా పాలిటి ఇలవేలుపు నీవేనయ్యా
ఎదురు చూచు కన్నులలో కదిలేవయ్యా
పేదల మొరలాలించే విభుడవు నీవే
కోరిన వరములనొసగే వరదుడవీవే
అజ్ఞానపు చీకటికి దీపము నీవే
అన్యాయమునెదిరించే ధర్మము నీవే
నీవే కృష్ణా నీవే కృష్ణా నీవే కృష్ణా

కుంటివాని నడిపించే బృందావనం
గ్రుడ్డివాడు చూడగలుగు బృందావనం
మూఢునికి జ్ఞానమొసుగు బృందావనం
మూగవాని పలికించే బృందావనం
అందరినీ ఆదరించు సన్నిధానం
అభయమిచ్చి దీవించే సన్నిధానం
సన్నిధానం దేవుని సన్నిధానం సన్నిధానం

కరుణించే చూపులతో కాంచవయ్యా
శరణొసగే కరములతో కావవయ్యా
మూగవాని పలికించి బ్రోవవయ్యా
కన్నతల్లి స్వర్గములో మురిసేనయ్యా
నిన్ను చూచి బాధలన్నీ మరిచేనయ్యా
ఆధారము నీవేరా రారా కృష్ణా
కృష్ణా కృష్ణా రారా కృష్ణా 

శరణాగతితో ఆర్తితో వేడుకుంటే బ్రోచే కరుణామయుడు పరమాత్మ. ఈ సత్యాన్ని ఎన్నో ఉదాహరణలుగా మనకు సనాతన ధర్మ ప్రవాహంలోని వేద వాఙ్మయం, పురాణాలు, ఇతిహాసాలు, గాథలు ఘోషించాయి. కలియుగంలో కూడా సద్గురువుల కృపతో పరమాత్ముని అనుగ్రహం మనకు అంది అద్భుతాలు జరుగుతున్నాయి. బిడ్డలు లేని వాళ్లకు బిడ్డలు, బ్రతకడు అనుకున్న బిడ్డ పూర్ణాయుష్మంతుడు కావడం, మూగవానికి మాటలు రావటం వంటివెన్నో జరుగుతూనే ఉన్నాయి. ఇటీవలే తిరుమల స్వామి దర్శనం తరువాత మాట వచ్చిన మూగవాడే ఈ పరమాత్మ అనుగ్రహానికి సాక్షి. ఇసద్గురువుల అనుగ్రహంతో వైద్యులు పిల్లలు పుట్టరు అన్నవారికి పిల్లలు పుట్టిన సంఘటనలు ఎన్నో నాకు తెలుసు. అటువంటి వాటిని చలన చిత్రాలు కూడా ప్రస్తావించాయి. వాటిలో 1968లో విడుదలైన రాము చిత్రంలోని బాలుడి పాత్ర, రారా కృష్ణయ్యా అనే గీతం.

దేవాలయాలు సందర్శన కోసమే కాదు సత్పురుషుల, యోగుల సాంగత్యానికి కూడా అని మనకు కొన్ని చలనచిత్రాలు అద్భుతంగా తెలిపాయి. అప్పటి చిత్రాలలో దేవాలయ సన్నివేశాలు తప్పకుండా ఉండేవి. దీక్షతో, మంత్ర జప సాధనతో, అధివాసములతో, యంత్ర మహిమతో ప్రతిష్ఠించబడిన దేవాలయ మూర్తులు పరమాత్మ ప్రతిబింబాలు. అటువంటి దేవాలయాలు యోగులకు, సాధువులకు, భక్తులకు ఆలవాలమై పవిత్రమైన క్షేత్రాలుగా ప్రసిద్ధి పొందాయి. అక్కడ దివ్యత్వం నిండి ఉంటుంది.  మన పాపాలను, మనసులలోని మలినాలను ప్రక్షాళన చేసుకునే అవకాశాన్ని దేవాలయాలు కలిగిస్తాయి. అటువంటి సన్నివేశమే రాము చిత్రంలోని ఈ గీత నేపథ్యం. తల్లి మంటలలో చిక్కుకొని మరణించటం చూస్తూ ఆ బాలుడు మాట కోల్పోతాడు. ఆ తండ్రి ఆవేదనతో డాక్టర్లకు చూపించగా అతనికి మాట వచ్చే అవకాశం లేదని చెబుతారు. అప్పుడు ఆ బాలుడు ఆత్మహత్య చేసుకోబోతాడు. తండ్రి కూడా నిరాశతో కొడుకుతో కలిసి సముద్రంలో మునిగిపోయే ప్రయత్నం చేయబోగా ఓ మందిరంలో కృష్ణుని రారా అని పిలుస్తున్న ఓ సాధువు పాట విని తండ్రీ కొడుకులు అక్కడికి వెళ్లి ఆ కృష్ణుని ప్రార్థిస్తారు. ఆ పరమాత్మ అనుగ్రహంతో మళ్లీ మరో అగ్నిప్రమాద సన్నివేశంలో బాలుడికి మాటలు వస్తాయి. అమ్మలా ప్రేమించే టీచరమ్మ మంటల్లో చిక్కుకోగా బాలుడు మాట్లాడే ప్రయత్నం చేసి అమ్మా అని పిలిచి సఫలమవుతాడు.

దాశరథి గారి గీతానికి ఆర్.గోవర్ధనం గారు సంగీతం అందించగా ఘంటసాల మాష్టారు ఈ భక్తి గీతాన్ని అద్భుతంగా పాడారు. పరమాత్మ సన్నిధే మనకు శరణు అన్న భావన ఈ గీతం కలిగిస్తుంది. ఇహపరాలు రెండిటిలోనూ మనలను తరించేది పరమాత్మే అన్నది ఈ గీతం ద్వారా దాశరథిగా చక్కగా తెలియజేశారు. ఘంటసాల మాష్టారు గళంలో భక్తివిశ్వాసాలు, శరణాగాతి సుస్ఫష్టంగా, భావరాగ యుక్తంగా మన హృదయాలను హత్తుకుంటాయి.


శ్రీ రామ జయ రామ శృంగార రామ యని - త్యాగరాజస్వామి కృతి


శ్రీ రామ జయ రామ శృంగార రామ యని చింతింప రాదె ఓ మనసా

తళుకు చెక్కుల ముద్దుబెట్ట కౌసల్య మును తపమేమి చేసెనో తెలియ

దశరథుడు శ్రీ రామ రారాయనుచు బిల్వ తపమేమి చేసెనో తెలియ

తమి మీర పరిచర్య సేయ సౌమిత్రి మును తపమేమి చేసెనో తెలియ 

తన వెంట చన జూచి యుప్పొంగ కౌశికుడు తపమేమి చేసెనో తెలియ 

శాపంబణగి రూపవతియౌటకహల్య మును తపమేమి చేసెనో తెలియ

ధర్మాత్ము చరణంబు సోక శివ చాపంబు తపమేమి చేసెనో తెలియ

తన తనయ నొసగి కనులార గన జనకుండు తపమేమి చేసెనో తెలియ

దహరంబు కరగ కరమును బట్ట జానకి తపమేమి చేసెనో తెలియ

త్యాగరాజాప్తయని పొగడ నారద మౌని తపమేమి చేసెనో తెలియ

రాముని వైభవాన్ని రామావతారంలోని వేర్వేరు పాత్రలు సన్నివేశాలతో కూర్చి అద్భుతంగా వర్ణించారు త్యాగరాజస్వామి. మెరిసే బుగ్గలపైన ఆ బాలరాముని ముద్దాడటానికి కౌసల్య ఎటువంటి తపస్సు చేసిందో? నిజమే, రాముని వంటి ధర్మమూర్తికి, అవతారపురుషునకు తల్లిగా లాలించే అదృష్టం కౌసల్యకు కలగటం తపఃఫలమే. ఆడుతూ పాడుతూ బుడి బుడి అడుగులు వేస్తున్న రాముని చూచి దశరథుడు రామా రారా అని పిలవటానికి ఏమి తపస్సు చేశాడో? లేక లేక బిడ్డలు కలుగగా ఆ నలుగురూ కారణ జన్ములు కావటం, వారికి తండ్రి దశరథుడు కావటం ఆయన చేసుకున్న తపఃఫలమే. అన్న అలసట తీర సేవ చేసే భాగ్యాన్ని లక్ష్మణుడికి దక్కటం అతని తపఃఫలమే. ఆదిశేషుని అవతారంగా చెప్పబడే లక్ష్మణుడు స్వామిని వీడి ఉండలేడని తెలిసి సోదరునిగా పుట్టించి అతనికి నిరంతర సేవాభాగ్యాన్ని ప్రసాదించాడు స్వామి. ఆ సౌమిత్రి ఏమి తపస్సు చేశాడో? యాగరక్షణకై తన వెంట వచ్చిన రాముని చూసి ఉప్పొంగిన విశ్వామిత్రుడు ఏమి తపస్సు చేశాడో? రామావతారంలో వశిష్ఠ విశ్వామిత్రాది ఋషులెందరో శ్రీరామునికి బోధ చేశారు, మార్గదర్శకులైనారు. వారిలో విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు బల అతిబల విద్యలతో పాటు అస్త్ర శస్త్రాలను ప్రసాదిస్తాడు. యాగరక్షణతో పాటు వారి వివాహానికి తోడ్పడతాడు. శాపవశాత్తు వేలయేండ్లు స్థాణువై నిలిచిన అహల్య రాముని పాదము సోకి తిరిగి చేతన కావటానికి ఏమి తపస్సు చేసిందో? ఆ ధర్మమూర్తియైన రాముని స్పర్శను పొందటానికి ఆ శివధనుస్సేమి తపము చేసిందో? పరమశివుని చాపము జనకునికి పూర్వీకులనుండి పరంపరగా వచ్చింది. రాముని కోసమే వేచియున్నట్లు జానకి స్వయంవరానికి కారకమై సాద్గుణ్యతను పొందింది. సకల సద్గుణ సంపన్నుడైన రామునకు తన బిడ్డను కన్యాదానం చేసే భాగ్యం పొందటానికి జనకుడు ఏమి తపస్సు చేశాడో? లోకపావని సీత జనకుని ఇంట పెరగటం, ఇక్ష్వాకు వంశ తిలకుడైన రాముని వివాహమాడటం జనకుని తపఃఫలమే.  శివధనుసు విరచిన రాముని చూచి హృదయము కరగి వరించిన జానకి ఏమి తపస్సు చేసిందో? నారదాదులు ఆ పరమశివునికి రాముడు ఆప్తుడని నుతించటానికి ఏమి తపస్సు చేశారో? ఇవన్నీ తెలియటానికి శ్రీరామ జయరామ అని నిరంతరం స్మరించమని చెబుతున్నారు త్యాగరాజస్వామి. రాముని వైభవం, ఆయన అనుగ్రహం పొందటానికి ఆయన నామమే ఉత్తమమైన సాధనం అని సద్గురువులు తెలియజేస్తున్నారు.

నేదునూరి కృష్ణమూర్తి గారు ఈ కృతిని అద్భుతంగా గానం చేశారు.  

సరసీరుహాసన ప్రియే - దురైస్వామి అయ్యరు కృతి



సరసీరుహాసన ప్రియే! అంబ! సదా వీణా గానప్రియే! సదానంద హృదయే! మహిసదయే!

శరణాగతం మామవ! మంజుల చరణ కిసలయే!
సమ్మోదిత కవిజన హృదయే! సరోజ నిలయే! మణివలయే!

సరసీరుహాక్షి యుగళే అంబ!
శరణాగత దీన వత్సలే!
శరదిందు సుందర వదనే! విమలే!
సరస్వతీ! అంబ! సతి! దేశిక నుత గుణశాలే!
సతతం విద్యా లోలే! సదా సుశీలే!
సామజ! కుంభ స్తన యుగళే! ధవళే! 
సకల సామ్రాజ్య ప్రద! కర ధృత పుస్తక జాలే!

- పులియూరు దురైస్వామి అయ్యరు

కమలాసనుడైన చతుర్ముఖ బ్రహ్మకు ప్రియమైన అమ్మా సరస్వతీ! ఎల్లప్పుడూ వీణా గానమంటే ఇష్టపడే, సచ్చిదానందముతో నిండిన హృదయము కలిగి, ఈ భూమిపై అనుగ్రహము కలిగిన తల్లీ! చిగురులవలె మృదువైన చరణములు గలదానవు!  కవిజనుల హృదయాలకు ఆనందం కలిగించే తల్లివి! కమలములో స్థిరమై యున్న దానవు!మాకు నీవే శరణం. కలువలవంటి కన్నులు కలిగిన తల్లీ! నీవు శరణన్న దీనులపై వాత్సల్యము కలిగిన అమ్మవు. శరదృతువులో చంద్రుని వంటి సుందరమైన ముఖము కలిగిన దానవు, నిర్మలమైన తల్లివి. ఓ సరస్వతీ! ఉత్తమమైన స్త్రీవి నీవు! పుణ్యాత్ములచే పొగడబడిన గుణములకు నెలవు నీవు! ఎల్లప్పుడూ విద్యలలో నిమగ్నమైయుందువు, నిరంతరం సద్గుణ సంపన్నవు. సకల విద్యలను పూర్ణమైన స్తనములలో కలిగిన అమ్మవు, తెల్లని వస్త్రములు ధరించి, చేతిలో పుస్తకములు కలిగి సమస్త భోగములు ప్రసాదించే అమ్మవు నీవు! నీవే మాకు శరణము.

యువ గాయనీమణులు  రంజని-గాయత్రిల గాత్రంలో ఈ నాట రాగంలో ఈ కృతి వినండి

కదిరి నృసింహుడు కంబమున వెడలె - అన్నమాచార్యుల సంకీర్తన


కదిరి నృసింహుడు కంబమున వెడలె
విదితముగా సేవించరో మునులు 

ఫాల లోచనము భయదోగ్రముఖము
జ్వాలామయ కేసరములును
కాలరౌద్ర సంఘటిత దంతములు
హేలగతి ధరియించుక నిలిచె 

ముడివడు బొమ్మలు ముంచిన ఊర్పులు
గడగడనదరెడి కటములును
నిడుద నాలుకయు నిక్కు కర్ణములు
నడియాలపు రూపై వెలసె 

సకలాయుధములు సహస్ర భుజములు
వికట నఖంబులు వెసబూని
వెకలియగుచు శ్రీవేంకటేశ్వరుడు
ప్రకటపు దుష్టుల భంజించేనిదివొ

- సద్గురువు తాళ్లపాక అన్నమాచార్యుల వారు

నరసింహావతారంపై అన్నమాచార్యుల వారు ఎన్నో కీర్తనలు రచించారు. వాటిలో ప్రత్యేకమైనది ఈ కదిరి నృసింహుడు కంబమున వెడలె. అనంతపురం జిల్లాలోని ఖాద్రి నరసింహస్వామి క్షేత్రం సనాతనమైనది. ఖాద్రి అనగా బ్రహ్మదారువు చెట్టుతో చేయబడిన స్థంభము. హిరణ్యాక్షుని వధించటానికి నరహరి రూపంలో శ్రీమహావిష్ణువు ఆ ఖాద్రియందు అవతరించాడు. అందుకే ఆ క్షేత్రానికి ఖాద్రి నరసింహుడు అని పేరు వచ్చింది. కాలగమనంలో కదిరిగా మారింది. ఆ కదిరి నరసింహుని అవతరణికను అన్నమయ్య ఈ కీర్తన ద్వారా మనకు తెలియజేశారు.

కంబమునుండి వెడలిన ఆ నరసింహుని సేవించండి మునులారా అని అన్నమయ్య ఈ సంకీర్తనను ఆరంభించారు. అగ్ని నేత్రముతో, భయము కలిగించే ఉగ్రమైన ముఖముతో, జ్వలించే కేసరములతో, ప్రళయకాల రుద్రుని వలె భీకరమైన దంతములతో హేలగా నిలిచినాడు. ముడి పడిన కనుబొమ్మలు, బుసలు కొట్టే ఉచ్ఛ్వాస-నిశ్శ్వాసలతో, గడ గడ అదరుచున్న చెక్కిళ్లతో, బయటకు వెడలియున్న నాలుకతో, నిక్కబొడుచుకున్న చెవులతో, ప్రత్యేకమైన రూపంగా వెలసినాడు. సమస్త ఆయుధములు, ఎంచలేని భుజములు కలిగి భీకరమైన గోళ్లతో వేగముగా కదలుచు దుష్టులైన దానవులను సంహరించటానికి ఆ శ్రీవేంకటేశ్వరుడు (నరసింహుడు) అవతరించినాడు.ఆతని సేవించండి!

ఈ సంకీర్తన అఠాణ రాగంలో గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు అద్భుతంగా ఆలపించారు.


తొల్లియును మఱ్ఱాకు తొట్టెలనె యూగెగన - అన్నమాచార్యుల సంకీర్తన


తొల్లియును మఱ్ఱాకు తొట్టెలనె యూగెగన చెల్లుబడి నూగీని శ్రీరంగశిశువు

కలికి కావేరి తరగల బాహులతలనే 
తలగకిటు రంగ మధ్యపు తొట్టెలను
పలుమారు దనునూచి పాడగా నూగీని
చిలుపాల సెలవితో శ్రీరంగశిశువు

వేదములే చేరులై వెలయంగ శేషుడే
పాదుకొను తొట్టెలై పరగగాను
శ్రీదేవితో గూడి శ్రీవేంకటేశుడై
సేదదీరెడి వాడె శ్రీరంగశిశువు

తొలుత మఱ్ఱాకుపై వైభవంగా తేలియాడిన వాడు,వటపత్రశాయిగా పేరొందిన వాడు ఈ శ్రీరంగ శిశువు. లతలవంటి కావేరీ తరంగాలు బాహువులుగా,  పాటలు పాడబడుచు పెదవుల మూలలలో పాలు కలిగిన అందమైన బాలుడు శ్రీరంగములో తొట్టెలలో ఊగుచున్నాడు. వేదాలే హారములుగా ఆది శేషుడే ఊయలగా ఒప్పుగా లక్ష్మీదేవితో కూడిన వేంకటేశుడు సేదదీరుచున్నాడు. అతడే శ్రీరంగ శిశువు.

- సద్గురువులు తాళ్లపాక అన్నమాచార్యుల వారు.

నీలాంబరి రాగంలో ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు ఆలపించిన ఈ అన్నమాచార్యుల వారి సంకీర్తన ఆ శ్రీరంగంలోని చిన్ని కృష్ణుడు ఊయలలో ఊగే సేవను అద్భుతంగా తలపిస్తుంది. పాలు తాగి ఊయలలో ఆ చిన్ని కృష్ణునికి తిరువారాధనలో పాటలు పాడుచుండగా ఊగే మనోజ్ఞమైన దృశ్యాన్ని అన్నమయ్య మనకు ఈ సంకీర్తన ద్వారా ఆవిష్కరించారు. పాలకడలిలో ఆదిశేషునిపై సేదదీరే లక్ష్మీపతి, మార్కండేయుని తపస్సుకు మెచ్చి అతనిని మఱ్ఱాకుపై వెలసిన బాలుని ఉదరములోనికి ప్రవేశింపజేసి విశ్వ రహస్యాన్ని తెలుపుతాడు. ఆ వటపత్రశాయే ఈ బాలకృష్ణుడు అని అన్నమయ్య తెలిపారు.


(చిత్రం వటపత్రశాయి అలంకారంలో ఉడిపి శ్రీకృష్ణుడు)

మామవ సదా జననీ - స్వాతి తిరునాళ్ కీర్తన


మామవ సదా జననీ మహిషాసుర సూదని

సోమ బింబ మనోహర సుముఖి సేవకాఖిల
కామదాన నిరత కటాక్ష విలాసిని

కురు మే కుశలం సదా కమలనాభానుజే
నిరవధి భవ ఖేద నివారణ నిరతే
చారు నూతన ఘన సదృశ రాజిత వేణి
దారుణ దనుజాళి దారణ పటు చరితే

అమ్మా పార్వతీ దేవి! మహిషాసురుని సంహరించిన నీవు నన్ను ఎల్లప్పుడూ కాపాడుము! చంద్రుని వంటి ముఖముతో మా మనసులను దోచుకొనెదవు. నిన్ను సేవించే వారికి సమస్త కామ్యములను ఎల్లప్పుడూ అనుగ్రహించే కటాక్షముతో ప్రకాశించే అమ్మవు. కమలమును నాభిలో గల శ్రీహరి సోదరివి, అనంతమైన భవసాగరపు దుఃఖములను నివారించటములో నిపుణురాలవు. అందమైన నీ కురులు క్రొత్త మేఘములవలె ప్రకాశిస్తున్నాయి. దారుణమైన గుణములు కల్గిన రాక్షస సమూహాన్ని సంహరించిన ఘనమైన చరిత గల తల్లివి. నాకు ఎల్లప్పుడూ క్షేమాన్ని కలుగజేయుము.

- మహారాజా స్వాతి తిరునాళ్ కీర్తన సుధా రఘునాథన్  గారి గాత్రంలో వినండి.


పాతాళ భైరవి – 1951: తెలుగు జానపద చిత్రరాజం

1951 మార్చి 15న విడుదలైన పాతాళ భైరవి తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక కీలక మలుపు. విజయా ప్రొడక్షన్స్ పతాకంపై బి. నాగిరెడ్డి, ఆలూరి చక్రపాణి నిర్మ...