14, డిసెంబర్ 2020, సోమవారం

పార్వతీపతిం ప్రణౌమి సతతం - ముత్తుస్వామి దీక్షితుల వారి కృతి

హంసధ్వని రాగాన్ని సృష్టించింది ముత్తుస్వామి దీక్షితుల వారి తండ్రి అయిన రామస్వామి దీక్షితుల వారు. వీరు 18వ శతాబ్దంలో తంజావూరు మహారాజులు అమరసింహ భోసలే, తులజాజీ భోసలలే కొలువులలో ఆస్థాన విద్వాంసునిగా పనిచేశారు. వీరు 108 రాగాలతో చేసిన రాగమాలిక అత్యంత ఎక్కువ నిడివి కలిగిన రాగమాలికగా ఇప్పటికీ ప్రసిద్ధం. తండ్రిపై గౌరవంతో దీక్షితులవారు వాతాపి గణపతిం భజేऽహం అనే కృతిని ఈ రాగంలో స్వరపరచారు. ఆయన ఈ రాగంలో స్వరపరచిన మరొక కృతి పార్వతీపతిం ప్రణౌమి సతతం. వివరాలు:

సాహిత్యం
=======

పార్వతీపతిం ప్రణౌమి సతతం ఆశ్రితజన మందారం శశిధరం

పర్వత రాజ నుత పదాంబుజం భద్ర ప్రద కైలాస విరాజం
గర్విత త్రిపురాది హర చతురం గురుగుహ వందిత శివ శంకరం

భావం
=====

ఆశ్రితజనులకు కల్పవృక్షము వంటి వాడు, చంద్రుని ధరించినవాడు, పార్వతీదేవికి పతియైన పరమశివునికి నేను ఎల్లప్పుడు నమస్కరించుచున్నాను. పర్వతరాజైన హిమవంతునిచే నుతించబడిన పదకమలములు కలవాడు, శుభఫలములను ప్రసాదిస్తూ కైలాస పర్వతముపై విరాజిల్లేవాడు, గర్వితులైన త్రిపురాసురులు మొదలైన రాక్షసులను సంహరించిన నిపుణుడు, సుబ్రహ్మణ్యునిచే పూజించబడిన శివునికి, శంకరునికి నేను ఎల్లప్పుడూ నమస్కరించుచున్నాను. 

శ్రవణం
======

ప్రఖ్యాత కర్నాటక శాస్త్రీయ సంగీత విద్వాంసులు సంగీత కళానిధి, పద్మభూషణ్ గుర్తింపులను పొందిన శ్రీ త్రిచూర్ రామచంద్రన్ గారు ఈ క్ర్తిని ఆలపించారు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి