12, నవంబర్ 2020, గురువారం

రఘునాయకా నీ పాదయుగ రాజీవముల - సద్గురువులు త్యాగరాజస్వామి

త్యాగరాజస్వామి కృతులలో శరణాగతి చాలా కృతులలో గోచరిస్తుంది. సంసార సాగరాన్ని దాటలేని నిస్సహాయ స్థితిలో ఆశ్రితులజనరక్షకుడని పేరొందిన రాముని పాదములను పట్టుకుని విడువకుండా కొలిచే స్థితిని రఘునాయకా నీ పాదయుగ రాజీవముల అన్న కృతిలో ఆవిష్కరించారు. ఎంతో శ్రమపడి రాముని సన్నిధి చేరి శరణు కోరుతున్నాను అని స్వామిని వేడుకున్నారు స్వామి. శ్రీమద్రామాయణంలో ఆశ్రయించిన వారిని రాముడు అమితమైన వాత్సల్యంతో అనుగ్రహించి రక్షించిన సందర్భాలు ఎన్నో. ఆ విధంగానే తాను కూడా, తనను ఆదరించి ఆనందము కలుగజేయవలసిందిగా రాముని ప్రార్థించారు. 

సాహిత్యం
========

రఘునాయకా నీ పాదయుగ రాజీవముల నే విడజాల శ్రీ 

అఘజాలముల పారద్రోలి నన్నాదరించ నీవే గతి గాదా శ్రీ

భవసాగరము దాటలేక నే బలు గాసి పడి నీ మఱుగు జేరితిని
అవనిజాధిపాశ్రితరక్షకా ఆనందకర శ్రీ త్యాగరాజనుత

భావం
=====

రఘుకుల శ్రేష్ఠుడవైన శ్రీరామా! నీ పదకమలములను నే విడువను. నా పాపసమూహములను పారద్రోలి ఆదరించుటకు నీవే గతి కదా! ఈ సంసార సాగరము దాటలేక నేను ఎంతో శ్రమపడి నీ సన్నిధికి చేరుకున్నాను. భూమిజయైన సీతకు పతివైన శ్రీరామా! నీవు ఆశ్రితరక్షకుడవు, ఆనందమును కలిగించేవాడవు! శివునిచే నుతించబడిన వాడవు, నీ పదకమలములను నేను విడువలేను. 

శ్రవణం
=======

హంసధ్వని రాగంలో కూర్చబడిన ఈ కృతిని ప్రియా సోదరీమణులు షణ్ముఖ ప్రియ, హరిప్రియ ఆలపించారు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి