5, నవంబర్ 2020, గురువారం

ఎవ్వరే రామయ్య నీ సరి - త్యాగరాజస్వామి కృతి


రాముని అనేక సుగుణాలలో వైరివర్గములో ఉన్నా సజ్జనులను గుర్తించి వారికి అభయమిచ్చి అనుగ్రహించటం. సీతమ్మను అపహరించిన రావణుని సోదరుడైన విభీషణుని అనుగ్రహించి లంకకు రాజును చేయటంలో రాముని విచక్షణ ఎంత ఉన్నతమైనదో, సునిశితమైనదో మనం గుర్తించాలి అన్న ముఖ్యమైన అంశాన్ని త్యాగరాజస్వామి ఈ కృతి ద్వారా మనకు తెలియజేస్తున్నారు. ఇక్కడ రాముని ప్రాతిపదిక విభీషణుని వ్యక్తిత్వం, ధర్మానురక్తి మరియు రావణుని తరువాత లంక సుఖశాంతులతో ఉండాలి అన్న సంకల్పం. రావణుడు చేసిన దారుణానికి విభీషణుని నమ్మకపోవటం అనేది మానవ సహజం, కానీ రాముడు అందుకు భిన్నంగా అతని నైజాన్ని, భక్తిని, సమర్థతను గుర్తించి సముచితమైన నిర్ణయం తీసుకున్నాడు. అందుకే రాముని మించిన ప్రభువు లేడు అన్నది త్యాగరాజస్వామి సుస్పష్టం చాటారు. 

రామాయణం పఠించి ఆ లోకాభిరాముని వ్యక్తిత్వాన్ని ఆకళింపు చేసుకుంటే రాముడి నడవడిక నుండి మనకు నిత్యజీవితంలో అత్యంత శ్రేయస్కరమైన లక్షణాలు ఎన్నో అవగతమవుతాయి. ఎక్కడ ఉన్నా ధర్మబద్ధమైన నడవడిక కలిగిన వారికి పరమాత్మ అనుగ్రహం ఉంటుంది అన్నది రాముని విచక్షణ ద్వారా మనకు ఎంతో కీలకమైన సందేశం. ఈ సులక్షణాలే మనకు ఎల్లప్పటికీ మార్గదర్శకాలు. 

ఎవ్వరే రామయ్య నీ సరి

రవ్వకు తావులేక సుజనులను రాజిగ రక్షించే వా(రె)

పగవానికి సోదరుడని యెంచక భక్తినెరిగి లంకా పట్టణమొసగగ
నగధర సురభూసుర పూజిత వర నాగశయన త్యాగరాజ వినుత సరి

ఓ రామయ్యా! నీకు సాటి ఎవ్వరు? కీర్తికి భంగము కలుగకుండా సుజనులను సక్రమముగా నీవలె రక్షించే వారెవ్వరు? శత్రు సోదరుడని యెంచక విభీషణుని భక్తిని గుర్తించి లంకా పట్టణమునకు రాజును చేసినావు. మందర పర్వతమును ధరించిన శ్రీహరీ! దేవతలచే, బ్రాహ్మణులచే పూజించబడిన శ్రేష్ఠుడా! ఆదిశేషునిపై శయనించేవాడా! పరమశివునిచే నుతించబడే శ్రీరామా! నీకు సాటి ఎవ్వరు? 

గాంగేయభూషణి రాగంలో కూర్చబడిన ఈ కృతిని బాలమురళీకృష్ణ గారు మధురంగా ఆలపించారు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి