30, నవంబర్ 2020, సోమవారం

పరమేశ్వర జగదీశ్వర - ముత్తుస్వామి దీక్షితుల కృతి


ముత్తుస్వామి దీక్షితుల వారు అపార ఆధ్యాత్మిక సంపన్నులు. నాదోపాసనతో పాటు మంత్రానుష్ఠానం చేసి ఎన్నో క్షేత్రాలలోని దేవతల అనుగ్రహం పొందారు. కాశీలో ఎన్నో ఏళ్లు గురువులైన చిదంబరనాథ యోగి గారి దగ్గర ఉండి వారికి సేవ చేసి వారి అనుగ్రహంతో సమస్త విద్యలలోనూ సాఫల్యం పొందారు. ఆయన క్షేత్ర కృతులకు ప్రసిద్ధులని గతంలో ప్రస్తావించాను. ఆయన ఈ దేశంలో దర్శించని క్షేత్రం లేదు అంటే అతిశయోక్తి కాదు. తిరువయ్యారు లోని పంచనదీశ్వర క్షేత్రం సనాతనమైన దేవాలయం. ఇక్కడ ఐదు నదులు, ఐదు పుష్కరిణులు ఉండటం చేత క్షేత్రం ఎంతో పవిత్రతను పొందింది. ఈ క్షేత్ర మహిమను ఉట్టంకిస్తూ దీక్షితుల వారు పరమేశ్వర జగదీశ్వర అనే కృతిని రచించారు. వివరాలు:

సాహిత్యం
=======

పరమేశ్వర జగదీశ్వర శంకర పాహిమాం ప్రణతార్తిహర శ్రీ

పురహర మృగధర సుందరేశ్వర ధర్మసంవర్ధనీ మనోహర

పంచనదీశ్వర గంగాధరేశ్వర పన్నగాభరణ భక్త జనావన
పంచ బ్రహ్మ హత్యాది పాప హర పర శివ తత్వార్ధ బోధిత చతుర
పంచనద క్షేత్ర ప్రభాకర పాలిత గురుగుహ భవభయ హర
వీర క్షేత్ర పాల వినుత చరణ విచిత్ర యమ భయాది నివారణ 

భావం
=====

శరణు కోరినవారి ఆర్తిని తీర్చే ఓ పరమేశ్వరా! జగదీశ్వరా! శంకరా! నన్ను రక్షించుము. త్రిపురాసురులను సంహరించినవాడవు, జింకను ధరించేవాడవు, సుందరేశ్వరుడవు, ధర్మసంవర్ధనీ అమ్మవారి మనోహరుడవు, న్న రక్షించుము. పంచనదీశ్వర క్షేత్రంలో వెలసిన పరమశివుడవు, గంగాధరుడవు, సర్పములు ఆభరణముగా కలిగి భక్త జనులను పోషించేవాడవు, పంచ బ్రహ్మ హత్యా పాతకములను తొలగించేవాడవు, పరశివ తత్త్వార్థమును బోధించే నిపుణుడవు, పంచనదములు కలిగిన ఈ క్షేత్రాన్ని ప్రకాశింపజేసేవాడవు, సుబ్రహ్మణ్యుని రక్షకుడవు, సంసార భయములను తొలగించేవాడవు, వీరులైన క్షేత్రపాలకులచే నుతించబడిన చరణములు కలవాడవు, విచిత్రమైన మృత్యు భయాలను నివారించేవాడవు, నన్ను రక్షించుము. 

శ్రవణం
======

నాట రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని మల్లాది సోదర్లు ఆలపించారు.

చిత్రం
=====

తిరువయ్యారు లోని పంచనదీశ్వర స్వామి-ధర్మసంవర్ధనీ అమ్మ వారి ఉత్సవ మూర్తులు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి