17, అక్టోబర్ 2020, శనివారం

కర్మ ఫలం: మహాభారతం: సైంధవుడు


సోదరి సమానయైన ద్రౌపదిని చెరబట్టబోయిన వాడు సైంధవుడు (కౌరవుల సోదరి దుశ్శల భర్త). పాండవులు వానిని నిలువరించి శిక్షిస్తారు. ప్రతీకారంతో తపస్సు చేసి శివుని అనుగ్రహంతో కురుక్షేత్ర సంగ్రామంలో ఒక్కరోజులో అర్జునుని తక్క మిగిలిన పాండవులను జయించే వరమును పొందిన వాడు. పద్మవ్యూహంలోనికి అభిమన్యుడు వెళ్లిన తరువాత అర్జునుడు తక్క మిగిలిన పాండవులు లోనికి రాకుండా వారిని శివుని వరముతో నిలువరించి అభిమన్యుని మరణానికి కారకుడైనాడు. కుమారుని మరణవార్త విని అర్జునుడు సైంధవుని మర్నాడు సూర్యాస్తమయంలోపు చంపుతానని ప్రతిజ్ఞ చేస్తాడు. మరునాడు ద్రోణుడు అర్జునుని బారి నుండి సైంధవుని కాపాడేందుకు అద్భుతమైన ప్రణాలికను రూపొందించాడు. కురుసైన్యాన్ని ఎదుర్కోవటంలోనే అర్జునినికి రోజంతా గడచిపోతుంది. సూర్యాస్తమయం కాబోతోందని గ్రహించి శ్రీకృష్ణుడు మాయతో నల్లని మబ్బులు సృష్టించగా, సూర్యాస్తమయం అయినదని ఏమరపాటు చెందిన సైంధవుని చూచి కృష్ణుడు ఆ మబ్బుని వెంటనే తొలగించగా, సూర్యుడు ఇంకా ఉన్నాడని గ్రహించి అర్జునుడు ఆ సైంధవుని తలను వెంటనే బాణములతో ఛేదిస్తాడు. సైంధవునికి తండ్రి వృద్ధక్షతుడు నుంచి వచ్చిన వరం - సైంధవుని శిరస్సు నేలకూల్చిన వాని శిరస్సు ముక్కలవుతుంది. ఈ విషయం తెలిసిన శ్రీకృష్ణుడు ఆ శిరస్సు ఎక్కడో శమంతపంచకంలో తపస్సు చేసుకుంటున్న వృద్ధక్షత్రుని ఒడిలో పడేలా బాణం వెంట బాణం వేసే పాశుపతాస్త్రాన్ని వేయమని చెబుతాడు. అర్జునుడు అది చేస్తాడు. తన ఒడిలో పడిన శిరస్సును చూసి వృద్ధక్షతుడు దానిని కింద వేయగా ఆయన శిరస్సు కూడ ముక్కలవుతుంది.

ఇక్కడ ఏమిటి దుష్టకర్మలు?

సైంధవుడు:
==========

1. సోదరి సమాన ద్రౌపదిని బలాత్కరించబోవటం

2. తనకు పరమశివుడు అనుగ్రహించినప్పుడు సజ్జనులైన పాండవులపై ప్రతీకార వరం కోరుకోవటం

3. ఆ వరమును బాలుడు, వీరుడు అయిన అభిమన్యుని మరణానికి దుర్వినియోగం చేయటం

వృద్ధక్షతుడు:
===========

1. కుమారుని దుష్టబుద్ధిని సరిచేయకపోవటం

2. కుమారుని మరణానికి కారణమైన వాని శిరస్సు ఛేదం కావాలని దుష్టాలోచనతో వరం పొందటం

దుష్టకర్మల ఫలమేమిటి?
===================

1. ఏమరపాటులో ఉండగా సైంధవుడు వధించబడటం

2. కుమారుని శిరస్సు క్రింద పడవేసి వృద్ధక్షతుడు మరణించటం

తండ్రీకొడుకులు ఒకరి మరణానికి మరొకరు కారకులైనారు. ఇదీ కర్మఫలం యొక్క బలం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి